Indian families
-
అమెరికా కలవరం.. డిపోర్టేషన్ పరేషాన్
రూపాయి విలువ ఎక్కువున్న దేశానికి ఎందుకు వెళ్తాం? సంపాదించుకోవడానికి! చదువు పేరుతో వెళ్లినా అంతిమ లక్ష్యం అక్కడ కొలువు సాధించడమే! ఈ ప్రస్తావన అమెరికా డిపోర్టేషన్ గురించే! స్టూడెంట్ వీసా మీదున్న వాళ్లు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకోకపోతే కష్టం! అక్కడున్న చట్టాల ప్రకారం చదువుకునే క్యాంపస్ లోనే కొలువులు చేయాలి. అవి దొరకడం క్లిష్టం! క్యాంపస్కు ఆవల ఉద్యోగాలకు వెళితే డిపోర్టేషన్ ఖాయం! ఈ క్రమంలో అక్కడున్న భారతీయ కుటుంబాలు కొన్ని.. అవసరంలో ఉన్న స్టూడెంట్స్కి తమ ఇళ్లల్లో డొమెస్టిక్ హెల్ప్ ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. అవి చేయడం తప్పనిసరైతే భద్రత, రక్షణను దృష్టిలో పెట్టుకుని, లీగల్ హెల్ప్ తీసుకుని అడుగేయడం మంచిది!తెలంగాణకు చెందిన నేహా (పేరు మార్చాం) అమెరికాలో ఎమ్మెస్ చదువుతోంది. వాళ్లది వ్యవసాయ కుటుంబం. అందరి పిల్లల్లాగే తమ పిల్లలూ విదేశాల్లో మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నేహా తల్లిదండ్రుల ఆశ. అందుకే నేహా వాళ్ల అక్కను (యూకే), ఆమెను అప్పులు చేసి మరీ విదేశాలకు పంపారు చదివించడానికి. ఖర్చుల కోసం అమ్మా, నాన్న మీద ఆధారపడకూడదని చదువుతూనే పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటున్నారిద్దరూ. నేహా తన యూనివర్సిటీ దగ్గర్లోని సూపర్మార్కెట్లో సేల్స్ గర్ల్గా పనిచేసేది. ఆ ఏరియా పోలీసులు, ఇమిగ్రేషన్ సిబ్బంది ఆ సూపర్ మార్కెట్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న ఫారిన్ స్టూడెంట్స్ని తీసేయమని, లేదంటే ఆ షాప్ లైసెన్స్ రద్దవుతుందని యజమానికి వార్నింగ్ ఇచ్చారు. మరుక్షణమే నేహా జాబ్ పోయింది. ఖర్చులెలా? అప్పుడే నేహా స్నేహితురాలు ఆమెకు సబర్బ్లోని ఇండియన్ కమ్యూనిటీలో ఉన్న డొమెస్టిక్ హెల్పర్ కొలువు గురించి చెప్పింది. ‘వీకెండ్స్కి వెళ్లి ఇల్లు క్లీన్ చేయాలి. వాళ్లకు పిల్లలుంటే ఆడించాలి. గెట్ టు గెదర్స్కి అరెంజ్మెంట్స్ చేయాలి అంతే!’ అంటూ ఆ ఉద్యోగంలో చేయాల్సిన పనులను వివరించింది. ‘పేమెంట్ ప్రామ్ట్గానే ఉంటుంది. మన ఐడెంటిటీ ఎక్కడా రివీల్ చేయర’నే అభయమూ ఇచ్చింది. మరో ఆప్షన్ లేదని మారు మాట్లాడకుండా ఓ గుజరాతీ కుటుంబంలో డొమెస్టిక్ హెల్పర్గా చేరింది నేహా.ఇంకో స్టేట్లో...ఆంధ్రప్రదేశ్కి చెందిన మాలతి (పేరు మార్చాం) డిపెండెంట్ వీసా మీద అమెరికా వెళ్లింది. భర్తకు హెచ్1బీ ఉంది. ఆమె అక్కడ తమకు తెలిసిన వాళ్ల రెస్టరెంట్లో మేనేజర్గా పనిచేసేది. కానీ ఈ మధ్యే ఉద్యోగం మానేసింది. రెస్టరెంట్ ఓనర్ మీద ఇమిగ్రేషన్ అధికారుల ఒత్తిడి, డిపెండెంట్ వీసా మీద తాను ఉద్యోగం చేస్తున్నట్టు ఇమిగ్రేషన్ సిబ్బందికి తెలిస్తే తన భర్త హెచ్1బీ వీసా రద్దవుతుందేమోనన్న భయంతో! ఈ ఇద్దరే కాదు.. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి.. అమెరికాలో విజిటింగ్ వీసా, స్టూడెంట్ వీసాల మీద ఆఫ్ క్యాంపస్ (వాళ్లు చదువుతున్న యూనివర్సిటీకి ఆవల) ఉద్యోగాలు చేస్తున్నవారు, డిపెండెంట్ వీసా మీద గుంభనంగా జాబ్స్ చేసుకుంటున్న వాళ్లందరి పరిస్థితి అలాగే ఉంది. కారణం.. వర్క్ పర్మిట్ లేకుండా ఫుల్ టైమ్ జాబ్స్ చేస్తున్నవారిని, అనుమతి లేని ప్రదేశాల్లో పార్ట్ టైమ్కి కుదిరిన వారిని, చట్టవిరుద్ధంగా ఆ దేశంలోకి చొరబడిన వారిని వెనక్కి పంపే కార్యక్రమాన్ని ట్రంప్ కఠినంగా అమలు చేస్తున్నాడు. పాస్పోర్ట్లో ఒక్కసారి డిపోర్టెడ్ అని ముద్ర పడితే మళ్లీ ఆ దేశానికి విమానమెక్కే చాన్స్ ఉండదు. ఆ స్థితికి రావద్దని ప్రయత్నించని వారులేరు. అందుకే అది పాచి పనా.. ఇంకోటా అని చూడకుండా, పని చోట భద్రత ఉందా? రక్షణ ఎంత? అని ఆలోచించకుండా తాము పనిచేస్తున్నట్టు అమెరికన్ గవర్నమెంట్కు తెలియకపోతే చాలు అనుకుంటూ దొరికిన పనిలో చేరిపోతున్నారు! అమెరికా అంతటా ఇలాంటి పరిస్థితే లేదని, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు గెలిచిన రాష్ట్రాల్లోనే డిపోర్టేషన్ కఠినంగా ఉందని చెబుతున్నారు అక్కడుంటున్న తెలుగువాళ్లు కొందరు. ఇలా చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వాళ్లను సొంత దేశాలకు పంపించేయడం ఇదే మోదటిసారి కాదని, ఆందోళనలు.. భయాలు కొత్తేం కాదని తేలిగ్గా తీసుకుంటున్న అమెరికా పౌరసత్వం పొందిన భారతీయులూ ఉన్నారు. అయితే ఈ డిపోర్టేషన్ను ఆసరాగా తీసుకుని తక్కువ జీతానికే భారతీయ విద్యార్థుల చేత ఇంటి పనులు, దుస్తుల ఇస్త్రీ, తోట పని, కార్లు తుడిపించడం, పిల్లలను ఆడించడం వంటి బండెడు చాకిరీ చేయించుకుంటున్నారని వాపోతున్నవారూ ఉన్నారు. ఏమైనా సరే.. పరాయి దేశంలో ఉంటున్నప్పుడు వాళ్ల చట్టాలను గౌరవించడం, ఆ ప్రకారం నడుచుకోవడం తప్పనిసరని చెబుతున్నారు న్యాయసలహాదారులు.ఇది తెలుసుకోండివిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గత 15 ఏళ్లుగా 15,000కి పైగా భారతీయులను అమెరికా ప్రభుత్వం డిపోర్ట్ చేసింది. చట్టవిరుద్ధంగా ఆ దేశంలోకి ప్రవేశించినవారెవరైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని గౌరవంగా వెనక్కి రావచ్చు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న మన పౌరుల్లో అక్కడ చదువుకున్నవారు, పెళ్లి చేసుకుని డిపెండెంట్ వీసా మీద వెళ్లి తర్వాత కుటుంబ కారణాల రీత్యా విడాకులు తీసుకున్నవారు, గృహహింసకు గురైనవారే ఎక్కువ. వీరు స్వచ్ఛందంగా తమ వీసా స్టేటస్ను మార్చుకుంటే అమెరికాలోనే ఉండవచ్చు. భర్త వేధింపులకు గురైన అమ్మాయిలు చాలామంది స్టూడెంట్ వీసాకి మారి చదువుకుంటూ అక్కడే ఉండిపోతున్నారు. కొన్ని నేరాలలో విక్టిమ్స్ అయితే వీసాకు అర్హులవుతారు. ఇలా వారికి అర్హత ఉన్న వీసా తీసుకొని అక్కడే ఉండిపోవచ్చు.అక్కడే ఉండాలనుకునేవారు చేయవలసిన పనులు1. ఆ దేశ కోర్టును ఆశ్రయించి, పరిస్థితులను వివరిస్తూ, ఆ దేశంలో ΄పౌరసత్వం కోసమో లేక వీసా కోసమో చేసిన దరఖాస్తులు పెండింగ్లో ఉంటే మానవీయ కోణంలో కొంత గడువు కోరడం. 2. కొన్ని ప్రత్యేక కేసులలో.. ఏదైనా అమెరికా సంస్థ నుంచి ఉద్యోగావకాశం ఉందని చూపించగలిగితే వీసా గడువు తర్వాత కూడా మరలా వీసా వచ్చేంతవరకు ఉండొచ్చు. 3. అమెరికా ΄పౌరసత్వం లేదా శాశ్వత నివాసం (పర్మనెంట్ రెసిడెన్సీ) గల వ్యక్తి కుటుంబ సభ్యులు అంటే భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు అయ్యుండి, సదరు ΄పౌరుడిచే లేదా అతని కుటుంబ సభ్యులచే గృహహింసకు లోనయ్యుంటే వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ యాక్ట్ (Vఅగిఅ) కింద.. గృహహింసకు గురిచేసిన వ్యక్తికి తెలియకుండానే గ్రీన్ కార్డు ΄పొందవచ్చు. 4. ప్రత్యేక పరిస్థితుల్లో ఆశ్రయం కోరవచ్చు. వీటన్నిటి కోసం ముందుగా మంచి ఇమిగ్రేషన్ అటార్నీ (లాయర్)ని కలవాలి. ఏజెంట్ల ద్వారా వెళ్తే మోసపోయే ప్రమాదం ఉంటుంది. ఇమిగ్రేషన్ చట్టం సులభంగా అర్థమయ్యేది కాదు కాబట్టి నిపుణుల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది – సరస్వతి రమ -
ఇంటి కంటే రెస్టారెంట్ పదిలం
వీకెండ్ వచ్చిందంటే చాలు భార్యా పిల్లలతో కలిసి బయటకు వెళ్లి సరదా సరదాగా షాపింగ్ చేసి మల్టీప్లెక్స్లో మూవీ చూసి, తర్వాత రెస్టారెంట్లో ఇష్టమైన ఫుడ్ లాగిస్తేనే భారతీయులకు అదో తుత్తి. ఒకప్పడు బయట హోటల్స్కు వెళ్లాలంటే బర్త్డే, మ్యారేజ్డే ఇలా ఏదో ఒక ఫంక్షన్ ఉంటేనే వెళ్లేవారు. ఇప్పుడు భారతీయుల మైండ్ సెట్ మారింది. శని ఆదివారాలు ఎన్ని రకాల వినోదాలున్నా హోటల్కి వెళ్లి చేతులు కడగవలసిందే. ప్రతీ నెలలో కనీసం ఏడుసార్లు భారతీయ కుటుంబాలు రెస్టారెంట్లలో తినడానికే ఇష్టపడుతున్నారని నేషనల్ రెస్టారెంట్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) సర్వేలో తేలింది. దీని కోసం భారతీయులు నెలకి సగటున రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక స్విగ్గీలు, జోమాటో, యూబర్ ఈట్స్ వంటి యాప్లు వచ్చాక హోటల్ నుంచి ఇంటికి తెప్పించుకోవడాలు పెరిగిపోయాయి. అలా దేశ ప్రజలు నెలకి సగటున 6.6 సార్లు బయట తిండే తింటున్నారు. ఫుడ్ ట్రక్లు, ఫుడ్ పార్క్స్ , టేక్ ఎవేలు, హోమ్ డెలివరీలు అందుబాటులోకి వచ్చాక, ఆతిథ్య రంగం కొత్త దారి పట్టిందని, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తే ఇంటి భోజనమనే భావన వస్తే ఇంటి కన్నా రెస్టారెంట్లకి రావడానికే జనం ఇష్టపడుతున్నారని ఢిల్లీకి చెందిన రెస్టారెంట్ యజమాని అనురాగ్ కటియార్ వెల్లడించారు. నాలుగ్గోడల మధ్య మగ్గిపోతూ బయట నుంచి తెప్పించుకునే తిండి తినేకంటే, కాస్త ఆరుబయట గాలి పీల్చుకుంటూ రెస్టారెంట్లో యాంబియెన్స్ను ఎంజాయ్ చేస్తూ వేడివేడిగా తినడానికే 80 శాతం మంది భారతీయులు ఇష్టపడుతున్నారని ఎన్ఆర్ఏఐ సర్వేలో తేటతెల్లమైంది. ఎవరి టేస్ట్ వాళ్లదే రకరకాల ఘుమాయించే వంటకాలు,విభిన్న రుచులు, వైవిధ్యమైన డిషెస్ ఇప్పుడు ప్రతీచోటా దొరుకుతున్నాయి. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్టుగా ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్.. ఢిల్లీ వాసులకి స్థానికంగా దొరికే ఆహారం పట్ల మోజు లేదు. నార్త్ ఇండియన్ ఫుడ్ చూస్తేనే వారికి నోరూరుతుంది. బెంగుళూరులో దక్షిణాది వంటకాలపై అంతగా మోజు లేదు. నార్త్ ఇండియన్ మీల్స్, హైదరాబాదీ బిర్యానీలనే ఇష్టపడతారు. ఇక వెరైటీ రుచుల్ని ఆస్వాదించడంలో ముంబైకర్ల తీరే వేరు. దక్షిణాది రుచులకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు, దోసె, ఇడ్లీలను అత్యంత ఇష్టంగా లాగిస్తారు. ఇతర దేశాల వంటకాల్లో 33% మంది ఇటాలియన్ ఫుడ్ అంటే పడిచచ్చిపోతే, 29% మందికి చైనీస్ ఫుడ్ తింటేనే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి తప్ప ఎంతకని ఆ బయట తిండి తింటాం, ఇంట్లో చారు అన్నం తిన్నా అదే అమృతంలా అనిపిస్తుంది కదా అని 20శాతం మంది అభిప్రాయపడినట్టుగా సర్వేలో తేలింది. -
ఇర్మా బాధిత భారత కుటుంబాలకు అటా చేయూత
అమెరికాలో ఇటివల హరికేన్ ఇర్మా ఫ్లోరిడా రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం సృష్టించిన విషయం విదితమే. ఆ రాష్ట్రంలోని ప్రవాస భారతీయులు చాలామంది ఆ తుఫాను తాకిడికి లోనయ్యారు. కేటగిరీ -5 గా వర్గీకరించిన ఇర్మా అమెరికాకి కలిగించిన నష్టం బిలియన్లలో ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.అయితే వందలాది ప్రవాస భారతీయులు తుఫాన్కు గురవుతున్న విషయాన్ని అమెరికా తెలుగు సంఘం(అటా) ముందుగానే గ్రహించి వెంటనే రంగంలోకి దిగింది. అధికారిక తుఫాను హెచ్చరిక, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఉత్తర్వులు వెలువడిన వెంటనే అటా సేవా జట్టు అవసరమైన పనులను చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుత జాతీయ అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి పర్యవేక్షణలో, టెన్నిస్సీ,అలబామ రాష్ట్రాల ప్రాదేశిక శాఖల సహాయంతో శివకుమార్ రామడుగు అటా సేవా జట్టుకు నేతృత్వం వహించారు. అట్లేంటాకే చెందిన కిరణ్ పాశం, అనిల్ బోద్ధిరెడ్డి, వేణు పిసికే, తిరుమల పిట్టా, ప్రశాంత్ పొద్దుటూరి, శ్రీధర్ తిరుపతి, రామకృష్ణా రెడ్డి ఈ పనులలో కీలక పాత్ర పోషించారు. బాధితులకు సహాయం చేసేందుకు అటా జట్టు ఒక పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అందులోనే భాగంగా ఏర్పడ్డ ఏక్షన్ టీం ముందుగా ఒక హెల్ప్లైన్ నెలకొల్పి, సోషల్ మీడియా, బంధు మిత్ర వర్గాల ద్వారా ఫ్లోరిడాకు చేరవేసింది. ఇది కాక అట్లాంటా, నాష్విల్, అలబామలో నివాసముంటున్న అటా సభ్యులకు విషయాన్ని తెలియజేసి వారి ఇండ్లలో బాధితులకు నివాసం కల్పించే ఏర్పాట్లు కూడా ఆటా చేసింది. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, ఇతరుల వర్గీకరణ పనులను త్వరగా పూర్తిచేసి సమయానికి నిర్వాసితులకు సహాయ సహకారాల్ని అందించగలిగింది. అమెరికాలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా అట్లంటాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు స్వచ్చందంగా మంచి మనసుతో ఆపదలో ఉన్న సాటి భారతీయులకు స్వాగతం పలకడంలో సఫలీకృతులయ్యారు. కేవలం తెలుగువారికే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి, అస్సాం నుంచి అహ్మదాబాద్ వరకు సమస్త ప్రవాస భారత ప్రజానీకానికి సహాయ సహకారాలు అందించిన అటా సేవ టీం పలువురి ప్రశంసలందుకుంది. ఈ కార్యక్రమంలో దాదాపుగా వేయి మంది నిర్వాసితులకు ఆశ్రయం కల్పించారు. ఒక వ్యక్తి ఏకంగా 12 కుటుంబాలకు చెందిన 33 మందికి తన ఇంట్లో ఆశ్రయమిచ్చారు. ఇటువంటి సేవ అటాకే గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. నిర్వాసితులు అటాకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలతో అమెరికాలోని భారతీయ రాయభార కార్యాలయం తమ అధికారులను ఆప్రమత్తం చేసింది. అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. న్యూయార్క్ నగరం నుంచి కన్సులేట్ జనరల్ శ్రీ హుటాహుటీన అట్లాంటా నగరం చేరుకుని సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. అమెరికా తెలుగు సంఘం కొన్ని వందల మంది భారతీయులకు సంఘం సభ్యుల, వారి మిత్రుల ఇండ్లలో నివాసం కల్పించడాన్ని కొనియాడారు. ఈ సహాయ కార్యక్రమాలని గుర్తించిన స్థానిక పోలీసు వ్యవస్థ, జార్గియా రాష్ట్ర పబ్లిక్ సేఫ్టీ విభాగ అధికారులు ఫ్లొరిడా నుంచి వారిని స్వయంగా కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరం వచ్చిన సహాయం చేయటానికి ముందుంటామని, వారిని సంప్రదించాల్సిందిగా అమెరికా తెలుగు సంఘం సభ్యులను కోరారు. ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు అభినందించి వెళ్ళారు. ఫ్లొరిడా నుండి వచ్చిన మన భారతీయులకు అవసరమైన భోజన సౌకర్యాలు టేస్ట్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ యాజమాన్యం కల్పించింది. వారి బాంక్వెట్ హాల్ని 5 రోజులపాటు 24 గంటలు అటాకి సహాయం అందించడంలొ ప్రధాన పాత్ర వహించారు. శ్రీ కృష్ణ విలాస్ రెస్టారెంట్, బావర్చి రెస్టారెంట్, కాకతీయ రెస్టారెంట్ వారు భోజనం సమకూర్చడంలో ప్రధాన భూమిక వహించారు. వీరితో పాటు ఉత్తర భారతనికి చెందిన మిత్రులు సీమ గార్గ్, వినీత్ గార్గ్ ల ఆధ్వర్యంలో వారి ఇండ్లలో వంటలు వండి అందించారు. అలానే ఫ్లోరిడా మిత్రులు తిరిగి వెళ్ళే సమయంలో దారిలో తినేందుకు ఆహార పదార్థాలు, పండ్లు, పాలు, బ్రెడ్, కేకులను, మంచి నీటిని అందించి వారి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. బోజనాన్ని వడ్డించేందుకు "విటి సేవ" కి చెందిన కార్యకర్తలు అన్నివేళలా ముందుండి వారి సహకారాన్ని అమెరికా తెలుగు సంఘానికి అందించారు. -
అమెరికా వీడి.. మీ దేశానికి వెళ్లిపోండి
వాషింగ్టన్: అమెరికాలో వరుసగా జాతి వివక్ష దాడులు జరుగుతుండటం.. శ్రీనివాస్ కూచిభొట్ల, హర్నీష్ పటేల్ దారుణ హత్యకు గురికావడం.. దీప్ రాయ్ సహా పలువురిపై దాడులు జరగడంతో ప్రవాస భారతీయులు అభద్రత భావానికి గురవుతున్నారు. శ్వేతజాతి వారి నుంచి.. విడిచి మీ దేశానికి వెళ్లిపోండి వంటి మాటలతో ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. అమెరికాలోని ఒహియో రాష్ట్రం దబ్లిన్లోని కారా పార్క్ కమ్యూనిటీలో ప్రవాస భారతీయులు సాయంత్రం వేళల్లో కలుసుకునేవారు. వీరిలో చాలావరకు హెచ్ 1 బీ వీసా కలిగిన వారే. పార్క్లో పిల్లలను ఆడించేవారు. కాసేపు సరదాగా క్రికెట్ ఆడేవారు. భారత వంటకాలు, అమెరికాలో జీవితం గురించి ముచ్చట్లు చెప్పుకునేవారు. ఇదంతా గతం. ఇప్పుడు వారిలో ఆ సంతోషం మాయమైంది. ఏం జరుగుతుందోనన్న ఆందోళన. అభద్రతాభావం. బయటకు రావాలంటే భయపడుతున్నారు. క్రికెట్, ముచ్చట్లు బంద్ చేశారు. స్థానిక శ్వేతిజాతి వారికి తాము టార్గెట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. శ్వేతిజాతి వాళ్లు తమను మీ దేశానికి వెళ్లిపోండంటూ బెదిరిస్తున్నారని, జాతివివక్షతో దూషిస్తున్నారని భారతీయులు వాపోయారు. రెండు దశాబ్దాలుగా ఒహియోలో ఉంటున్న మరో భారతీయుడు ఇలాంటి పరిస్థితి తమకు ఎప్పుడూ ఎదురు కాలేదని చెప్పాడు. ఓ యువకుడు తనను మీ దేశానికి వెళ్లిపో అంటూ హేళనగా మాట్లాడాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కొందరు శ్వేతిజాతి దుండగులు భారతీయులను దూషిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అక్కడక్కడా భారతీయులపై దాడులకు పాల్పడుతున్నారు.