Indian star
-
‘యుద్ధం మధ్యలో ఆడగలమా’
న్యూఢిల్లీ: ‘ఫిడే’ మహిళల క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయాన్ని హడావిడిగా తీసుకోలేదని భారత స్టార్ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పేర్కొంది. ఎన్నో రకాలుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె వ్యాఖ్యానించింది. ఈనెల 29 నుంచి సైప్రస్లో జరిగే ఈ పోటీల్లో తమకు అందించే భద్రతపై సందేహం ఉండటం వల్లే దూరమైనట్లు హంపి స్పష్టం చేసింది. మధ్యధరా సముద్రంలోని సైప్రస్... ప్రస్తుతం అమెరికా–ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధ క్షేత్రాలకు అతి సమీపంలో ఉంది. ఒకవైపు తమకు సమీపంలో యుద్ధం జరుగుతుంటే మరోవైపు ఆటలు ఎలా ఆడగలమని హంపి సూటిగా ప్రశి్నంచింది. ‘మన చుట్టూ యుద్ధం సాగుతుంటే, యుద్ధ నౌకలు మీకు సమీపంలోనే కనిపిస్తుంటే ఒక విదేశీయురాలైన నేను, పైగా మహిళను అంత దూరం ప్రయాణించి ప్రశాంతంగా ఎలా ఆడగలను. సైప్రస్కు చాలా దగ్గరలో ఉన్న లెబనాన్లో బాంబులు పడుతున్నాయి. స్వయంగా సైప్రస్ అధ్యక్షుడే ఇటీవల తమ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటిది ఒక ప్లేయర్గా నేను జాగ్రత్తపడితే తప్పేంటి. అయినా వారు సైప్రస్లో కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా టోర్నీని నిర్వహించగలిగేవారు. లేదా అక్కడే జరపాలంటే ఒక నెల రోజుల పాటు పరిస్థితులు చక్కబడే వరకు ఆగాల్సింది. నేను హడావిడిగా ఈ నిర్ణయం తీసుకోలేదు. నా ప్రొఫెషన్, వ్యక్తిగత భద్రత, ఇలాంటి స్థితిలో నా ఆట ఎలా ఉంటుందో ఎన్నో రాత్రులు ఆలోచించిన తర్వాత ఇక్కడి దాకా వచ్చాను’ అని హంపి వ్యాఖ్యానించింది. జమ్ము కశ్మీర్లో నిర్వహిస్తారా! టోర్నీలో పాల్గొనాల్సిన 16 మందిలో 15 మందికి సమస్య లేదని, తాను మాత్రమే తప్పుకున్నానని కొందరు విమర్శలు చేస్తుండటంపై కూడా హంపి స్పందించింది. ‘మిగతా వారంతా ఆడుతున్నారంటే నిర్వాహకులు సరైన నిర్ణయం తీసుకున్నారని అర్థం కాదు. ఎలాంటి అడ్డంకులు లేకుండా టోర్నీ జరగవచ్చు కూడా. కానీ ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నిర్వహించడం అవసరమా అనేదే నా ప్రశ్న. భద్రతకు సంబంధించి అమెరికా, ఇంగ్లండ్లు ఇప్పటికే లెవల్ 3 స్థాయి హెచ్చరికలు జారీ చేశాయి. ఇదే స్థాయిలో భద్రతా వ్యవస్థ ఉన్న జమ్ము కశ్మీర్లో వారు టోర్నీ నిర్వహిస్తారా? చాలా అందమైన రిసార్ట్లో టోర్నీ నిర్వహిస్తున్నామని వారు చెబుతున్నారు. అలాంటివి భారత దేశంలోనూ చాలా ఉన్నాయి. ఒక టోర్నీ ఆడేందుకు ఇలాంటి ఏర్పాట్లు మాత్రమే సరిపోవు. అనుకూలమైన పరిస్థితులు కూడా ఉండాలి. నేను ఇప్పుడు వెళ్లి ఆడటం అంటే నిర్వాహకుల నిర్ణయానికి మద్దతిచ్చినట్లే. నిజానికి యుద్ధం మొదలు కాగానే ఆటగాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలను నిర్వాహకులు అడగాల్సింది’ అని హంపి పేర్కొంది. డబ్బు కోసం ఆడటం లేదు... క్యాండిడేట్స్ టోర్నీ నుంచి చివరి నిమిషంలో తప్పుకోవడంతో హంపిపై ‘ఫిడే’ భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే తాను దీనిని పట్టించుకోనని ఆమె స్పష్టం చేసింది. ‘ఆటగాళ్లు నిజాలు మాట్లాడకూడదనే ‘ఫిడే’ జరిమానాలతో భయపెడుతుంది. నాకు ఎలాంటి భయం లేదు. డబ్బు కోసం, ఇతర వాణిజ్య లాభాల కోసం నేను ఆడటం లేదు. చెస్ అంటే ఇష్టంతో ఆడుతున్నాను. ఫిడే ఉపాధ్యక్షుడు విశ్వనాథన్ ఆనంద్తో కూడా ఈ టోర్నీ విషయంలో మాట్లాడాను. అయితే ఆ విషయాలు నేను బయటకు చెప్పను. టోరీ్నలో ఆడుతున్న భారత సహచరులు దివ్య, వైశాలి, ప్రజ్ఞానందలతో నేను మాట్లాడలేదు. ఆ అవసరం లేదు. ఎవరి ఇష్టం వారిది. నేను కూడా నా కోసం మాట్లాడతాను తప్ప వేరేవాళ్ల గురించి కాదు’ అని హంపి పదునైన వ్యాఖ్యలు చేసింది. సైప్రస్లో తాజా పరిస్థితులపై అమెరికా గ్రాండ్మాస్టర్ నకమురా కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. మరోవైపు హంపి స్థానంలో ఉక్రెయిన్కు చెందిన అనా ముజీచుక్ను టోరీ్నలో ఆడేందుకు ఎంపిక చేసినట్లు ‘ఫిడే’ ప్రకటించింది. -
సవాళ్లకు సిద్ధం
భారత చాంపియన్ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ గురువారం మొదలయ్యే ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) సవాళ్లకు సిద్ధమని ప్రకటించింది. కొరకరాని విదేశీ రెజ్లర్లపై ఎప్పటి నుంచో దృష్టి సారించినట్లు చెప్పింది. మన రెజ్లర్లకు జాతీయ శిబిరాలు మెలకువలు నేర్పిస్తే... విదేశాల్లో శిక్షణ విదేశీ రెజ్లర్లను దీటుగా ఎదుర్కొనే స్థయిర్యాన్నిస్తుందని చెప్పుకొచ్చింది. న్యూఢిల్లీ: రోజుల వ్యవధిలోనే మొదలయ్యే పీడబ్ల్యూఎల్ కోసం పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యానని భారత స్టార్ మహిళా రెజ్లర్ అంతిమ్ పంఘాల్ తెలిపింది. 53 కేజీల కేటగిరీలో జూనియర్, సీనియర్ అంతర్జాతీయ స్థాయిల్లో ఇదివరకే నిరూపించుకున్న అంతిమ్ ఇప్పుడు కొత్త తరహా లీగ్ ‘పట్టు’కు సై అంటోంది. 17 ఏళ్ల వయసులోనే 2022లో అండర్–20 ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఆమె ఆ మరుసటి ఏడాది టైటిల్ నిలబెట్టుకుంది. ప్రపంచ ఛాంపియన్షిప్ లో రెండు కాంస్యాలు నెగ్గిన ఆమె.. 2022 ఆసియా క్రీడల్లోనూ కాంస్య పతకంతో మెరిసింది. 21 ఏళ్ల ఈ స్టార్ రెజ్లర్ తనకు ఎదురయ్యే మింగుడు పడని విదేశీ రెజ్లర్లపై ఓ కన్నేసినట్లు చెప్పింది. జపాన్ దిగ్గజ రెజ్లర్ యుయ్ సుసాకి పోటీల వీడియోలను ఫోన్లో తరచూ చూస్తానని చెప్పుకొచ్చింది. తన కెరీర్లోనే ఓటమి ఎరుగని సుసాకిపై పారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇలా మేటి రెజ్లర్లను ఓడించే సత్తా మనకుందని 2023లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున అవార్డు’ అందుకున్న అంతిమ్ చెప్పుకొచ్చింది. బౌట్కు ముందు ఎన్నో ఆలోచనలు చుట్టూ తిరుగుతూనే ఉంటాయని, అయితే బౌట్ కోసం మ్యాట్ మీదిగి దిగగానే మైండ్ ఒక్కసారిగా ‘పోరాటం’పైనే పడుతుందని, దీంతో... గెలుపోటముల ఆలోచనేది గుర్తుకురాదని, వంద శాతం కుస్తీపట్టడం గురించే ఆలోచిస్తానని అంతిమ్ వివరించింది. ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) ఈ నెల 15 నుంచి నోయిడా ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన మనోభావాలను ఇలా పంచుకుంది. అర కోటి... అస్సలు ఊహించలేదు! ‘పీడబ్ల్యూఎల్ వేలంలో ఈ స్థాయి మొత్తం లభిస్తుందని అస్సలు ఊహించనేలేదు. నేనే కాదు... మా కుటుంబసభ్యులెవరూ ఇంత మొత్తం వస్తుందని అనుకోలేదు. నిజానికి నాకు సుమారు రూ. 30 లక్షలకు అటు ఇటుగా వస్తుందనే ఆశించాను. పెరిగినా దీనికి కాస్తే ఎక్కువ రావొచ్చని అనుకున్నా! కానీ ఏకంగా రూ. 50 లక్షలు దక్కుతాయని ఏమాత్రం ఊహించలేదు. వేలం జరుగుతుండగా నేను ఆలయానికి వెళ్లాను. యూపీ డామినేటర్స్ నన్ను అంత మొత్తానికి కొనుగోలు చేసిందని తెలియగానే దేవుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాను. హరియాణాకు చెందిన నేను కెరీర్ అసాంతం ఈ రాష్ట్రానికే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఎందుకనో ఈ లీగ్లో మాత్రం యూపీ తరఫునే ఆడాలని గట్టిగా అనుకున్నా’. మరింత పట్టుదలతో... ‘సీనియర్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మరింత పట్టుదలతో, రెట్టించిన ఉత్సాహంతో పునరాగమనం చేస్తుంది. ఆమె రిటైర్మెంట్ను పక్కనబెట్టడం శుభపరిణామం. నాకంటే ఆమె ఎంతో అనుభవజ్ఞురాలైన రెజ్లర్. ఆమె వస్తుందంటేనే చెమటోడ్చేందుకు సిద్ధమైందని అర్థం. ఏ ప్లేయర్ అయినా సరే పోరాడేతత్వం, మనోధైర్యం బలంగా ఉంటేనే పునరాగమనం చేస్తారు. మన వినేశ్ కూడా అంతే! ఇక నేను పోటీపడే 53 కేజీల కేటగిరీ నాకు మాత్రమే సొంతం కాదు. ఎవరైనా పోటీపడొచ్చు. ఏ కేటగిరీ సరైందో పోటీ పడే అథ్లెట్కే బాగా తెలుస్తుంది. అందులో ఎంతగా కష్టపడగలదో, ఏ రకంగా గెలుస్తుందో, దేనివల్ల ఓడిపోతోందో ఆ విభాగానికి చెందిన అథ్లెట్కే బాగా తెలుస్తుంది’. సీనియర్ స్థాయికి ఎదగగానే... ‘జూనియర్ నుంచి సీనియర్ స్థాయి పోటీల్లో బరిలోకి దిగుతుంటే మన పరిణతి కూడా పెరుగుతుంది. జూనియర్స్లో ఒకట్రెండు పాయింట్లు ఓడితే నిరాశ ఆవహించేది. కానీ ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నా. ఒకట్రెండు పాయింట్లు కాదు... ఆడాల్సింది ఆరు నిమిషాలు. ఒకటి అర కోల్పోయినా ప్రత్యర్థి పట్టుపట్టేందుకు, పైచేయి సాధించేందుకు మన చేతిలో సమయమైతే ఉంటుంది. ఇప్పుడు నా ట్రెయినింగ్ కూడా మారింది. అంతేకాదు... మళ్లీ నేను కోచ్ సియరామ్ దహియాతో శిక్షణ తీసుకోవడం నన్ను మరింత మెరుగుపరిచింది. దహియా మార్గదర్శకంలో అనవసర ఒత్తిడి తగ్గించుకొని త్వరితగతిన పుంజుకోవడంపై ఎక్కువగా దృష్టి సారించాను. అదేపనిగా లేదంటే మితిమీరిన శిక్షణ కూడా తగదని కోచ్లు వారిస్తారు. మ్యాట్పై ఎప్పుడు కుస్తీ పట్టాలో... వద్దో మేము, కోచ్, ఫిజియో కలిసి నిర్ణయించుకుంటాం. అనుకూల వాతావరణాన్ని సృష్టించుకుంటాం’. విదేశీ శిక్షణ కీలకం ‘జాతీయ శిబిరాలు రెజ్లర్లను దీటుగా సన్నద్ధపరుస్తున్నాయి. అలాగని విదేశాల్లో శిక్షణ అనవసరం అనుకుంటే పొరపాటు. అది కూడా రెజ్లర్లకు కీలకమైన వేదిక. మేమంతా కూడా సహచరులతో కుస్తీ పట్టడం ద్వారానే నేర్చుకున్నాం. అంటే మా మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో, ఎవరి సత్తా ఎంటో మాకు బాగా తెలుసు. జాతీయ శిబిరాల్లో ఇదే జరుగుతుంది. కానీ విదేశీ రెజ్లర్లు మాలానే ఉంటారని అనుకోలేం. వారిలో వేగం ఎక్కువ. అలాంటి వారితో అడపాదడపా విదేశాల్లో శిక్షణ ఏర్పాటు చేస్తే ఈ అనుభవం అంతర్జాతీయ పోటీలకు బాగా ఉపయోగపడుతుంది’. -
‘లెఫ్టినెంట్ కల్నల్’ నీరజ్ చోప్రా
సాక్షి, న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. టెరిటోరియల్ ఆర్మీలో అతనికి ‘లెఫ్టినెంట్ కల్నల్’ గౌరవ హోదాను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారికంగా ప్రదానం చేశారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో బుధవారం దీనికి సంబంధించిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, టెరిటోరియల్ ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ వేడుకలో రక్షణ మంత్రి రాజ్నాథ్ స్వయంగా నీరజ్ చోప్రా భుజాలపై లెఫ్టినెంట్ కల్నల్ హోదా బ్యాడ్జ్లను అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరజ్ పట్టుదల, దేశభక్తి, నిరంతర శ్రమకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. హరియాణాకు చెందిన నీరజ్ 2016లో భారత సైన్యంలోని ‘ది రాజ్పుతానా రైఫిల్స్’లో సుబేదార్గా∙కెరీర్ను మొదలుపెట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో అతని ఘనతలకు గుర్తింపుగా 2021లో సుబేదార్ నుంచి మేజర్గా పదోన్నతి కలి్పంచారు. ఆ మరుసటి ఏడాది ‘పరమ విశిష్ట సేవా పతకం’తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతనికి టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ కమిషన్ను మంజూరు చేశారు. తాజాగా కల్నల్ గౌరవ హోదా కట్టబెట్టారు. -
హాలీవుడ్ థ్రిల్లర్
తెలుగు నటుడు వెంకట్ సాయి గుండ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘ది డిజర్వింగ్’. ఎస్ఎస్ అరోరా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ స్టార్స్తో పాటు ఇండియన్ స్టార్స్ నటిస్తున్నారని యూనిట్ పేర్కొంది. విస్మయ్ కుమార్, తిరుమలేష్ గుండ్రాత్ ఇతర నిర్మాతలు. ‘‘హాలీవుడ్లో ప్రధాన పాత్రధారుడిగా ఒక తెలుగు కుర్రాడు నటించడం ఇదే మొదటిసారి కావొచ్చు. ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. విదేశీ యాక్టర్లు సిమోన్ స్టాడ్లర్, కెల్సీ స్టార్ట్లర్ కీలక పాత్రలు ΄ోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎన్జీఏ వెంగ్ చియా, సినిమాటోగ్రఫీ: కోషి కియోకావా. -
డైమండ్ లీగ్ ఫైనల్స్ బరిలో నీరజ్
ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్లో పసిడి పతకమే లక్ష్యంగా భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బరిలోకి దిగనున్నాడు. జ్యూరిక్లో ఈరోజు డైమండ్ లీగ్ ఫైనల్స్ జరగనుంది. జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్తో కలిపి మొత్తం ఆరుగురు పోటీపడనున్నారు. 2017, 2018 డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్కు నీరజ్ అర్హత సాధించినా పతకం సాధించలేకపోయాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణంతో సంచలనం సృష్టించిన నీరజ్ ఈ ఏడాది ప్రపంచ చాంపియన్షిప్లో రజతంతో మెరిశాడు. -
సెమీస్లో సింధు
ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–13, 21–10తో నెస్లిహాన్ యిగిట్ (టర్కీ)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్లో భారత్కే చెందిన శ్రీకాంత్ కూడా సెమీఫైనల్ చేరాడు. శ్రీకాంత్ 21–7, 21–18తో సహచరుడు ప్రణయ్ను ఓడించాడు. -
సెమీస్లో పంకజ్
బెంగళూరు: ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్షిప్ 150 అప్ ఫార్మాట్లో భారత స్టార్ పంకజ్ అద్వానీ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పంకజ్ 5-2 (150-0, 150-0, 150-5, 89-150, 107-150, 150-69, 150-128) ఫ్రేమ్ల తేడాతో భారత్కే చెందిన ధ్రువ్ సిత్వాలాను ఓడించాడు. భారత్కే చెందిన సౌరవ్ కొఠారి, అలోక్ కుమార్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోగా... మరో ప్లేయర్ ధ్వజ్ హరియా 5-3తో చిట్ కూ కూ (మయన్మార్)పై గెలిచి సెమీస్కు చేరుకున్నాడు. సోమవారం జరిగే సెమీఫైనల్స్లో పీటర్ గిల్క్రిస్ట్ (సింగపూర్)తో ధ్వజ్ హరియా; ఆంగ్ హెచ్టే (మయన్మార్)తో పంకజ్ అద్వానీ తలపడతారు. -
ఐఎస్ఎల్ వేలానికి చెత్రి
ముంబై : భారత స్టార్ ఫుట్బాలర్ సునీల్ చెత్రితో పాటు మరో తొమ్మిది మంది ఆటగాళ్లు.. ఐఎస్ఎల్ వేలానికి అందుబాటులో ఉండనున్నారు. జూలై 10న ఈ వేలం జరగనుంది. చెత్రి కనీస విలువ రూ. 80 లక్షలు కాగా గోల్ కీపర్ కరణ్జీత్ సింగ్ కనీస ధర రూ. 60 లక్షలు. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఈ వేలంలో ఆటగాళ్ల కోసం పోటీ పడనున్నాయి. గతేడాది ఐ-లీగ్ క్లబ్స్తో ఉన్న వ్యక్తిగత ఒప్పందం మేరకు చెత్రి వేలానికి అందుబాటులో ఉండలేదు. అయితే ఈసారి వేలంపై ఈ యువ స్ట్రయికర్ ఆసక్తి కనబరుస్తున్నాడు. రాబిన్ సింగ్, ఆర్తజా ఇజుమి, అనాస్లు రూ. 40 లక్షల బేస్ ప్రైస్తో; తోయ్ సింగ్ రూ. 39 లక్షలు, ఎగున్సెన్ లింగ్డో రూ. 27.50 లక్షల కనీస ధరతో వేలానికి వస్తున్నారు. -
యోగేశ్వర్ దత్కు స్వర్ణం
భారత స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ (65 కేజీలు) ఇటలీలో జరిగిన ససారీ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో స్వర్ణ పతకం సాధించాడు. యోగేశ్వర్తోపాటు అమిత్ దహియా (57 కేజీలు), ప్రవీణ్ రాణా (70 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) కూడా భారత్కు పసిడి పతకాలు అందించారు. -
సైనా మా జట్టుకు బలం
- ఉబెర్ కప్లో రాణిస్తాం - పీవీ సింధు వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత స్టార్ సైనా నెహ్వాల్తో కలిసి ఉబెర్ కప్లో రాణిస్తానని ఏపీ రైజింగ్ స్టార్ పీవీ సింధు తెలిపింది. త్వరలో జరిగే ఈ టీమ్ ఈవెంట్లో హైదరాబాదీలిద్దరు కలిసి భారత్కు ప్రాతినిధ్యం వహించనుండటం ఇదే తొలిసారి. దీనిపై ఈ తెలుగమ్మాయి మాట్లాడుతూ జట్టుకు సైనా నెహ్వాల్ బలమని చెప్పింది. దేశ అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్ఖేల్త్న్ర’కు తనను నామినేట్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. పురుషుల విభాగంలో థామస్ కప్, మహిళల విభాగంలో ఉబెర్ కప్ టీమ్ టోర్నీలు ఈ నెల 18 నుంచి 25 వరకు ఢిల్లీలోని సిరి ఫోర్ట్ కాంప్లెక్స్లో జరుగనున్నాయి. ‘ఉబెర్ కప్లో భారత బృందం పటిష్టంగా ఉంది. సైనా తొలి సింగిల్స్లో శుభారంభమిస్తే... నేను రెండో సింగిల్స్లో సత్తాచాటుతా. అప్పుడు జట్టుకు ఫలితాలు కలిసి వస్తాయి. డబుల్స్లోనూ భారత క్రీడాకారిణులు రాణించేందుకు చక్కని అవకాశాలుంటాయి’ అని సింధు విశ్లేషించింది. టీమ్ టోర్నమెంట్ దృష్టా ప్రస్తుతం భారత పురుషుల, మహిళల జట్లకు ఆతిథ్య వేదిక వద్దే వారం పాటు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో భారత కోచ్ పుల్లెల గోపీచంద్, విమల్ కుమార్, మధుమిత బిస్త్లు తమ ఆటతీరుకు మెరుగులు దిద్దుతున్నారని సింధు చెప్పింది. తాము తరచూ చేసే తప్పులను సరిదిద్దుతున్నారని 19 ఏళ్ల టీనేజ్ సంచలనం పేర్కొంది. మిగతా టోర్నీలకు ఈ టీమ్ చాంపియన్షిప్ భిన్నమైనదని తెలిపింది. ఆయా టోర్నీల్లో తమకు తాము వ్యక్తిగతంగా గెలిస్తే చాలనుకుంటామని... ఇక్కడ (ఉబెర్) మాత్రం సమష్టిగా గెలవాలనే కసితో బరిలోకి దిగుతామంది. సొంతగడ్డపై టోర్నీ జరగనుండటం తమకు కలిసివస్తుందని, ప్రేక్షకుల మద్దతుతో ముందంజ వేస్తామని సింధు చెప్పింది.


