James Bond 007
-
24 క్యారెట్స్ బంగారంతో ‘గోల్డ్ ఫింగర్’ బుల్లి కారు : ధర తక్కువే!
అగోరా మోడల్స్ అరుదైన బాండ్ సేకరణలలో ఒకటైన సూపర్ కారును విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కారు 1:8 ఆస్టన్ మార్టిన్ డీబీ5 మోడల్ మినీ కారు ఇది. మోడల్ ఇది. 1964 నాటి మూడో జేమ్స్బాండ్ చిత్రం గోల్డ్ ఫింగర్లో ఈ కారు కనిపించింది. ఈ మూవీలో సీన్ కానరీ సీక్రెట్ ఏజెంట్ 007గా నటించాడు. 24 క్యారెట్ బంగారం పూత కలిగిన మ్యూజియం క్వాలిటీతో బ్రిటన్కు చెందిన అగోరా మోడల్స్ కంపెనీ ఇలాంటి కేవలం ఏడు కార్లు మాత్రమే తయారు చేసింది. ఇయాన్ ప్రొడక్షన్స్ , ఆస్టన్ మార్టిన్ల సహకారంతో నిర్మించిన గోల్డ్ ఫింగర్ సినిమాకు 60 ఏళ్లు నిండిన సందర్భంగా దీనిని గురువారం లండన్లోని బర్లింగ్టన్ ఆర్కేడ్లో ప్రదర్శనకు ఉంచారు. ఇందులో ఎజెక్టర్ సీట్లు ,రివాల్వింగ్ నంబర్ ప్లేట్ ఉంటాయి. అల్ట్రా-ఎక్స్క్లూజివ్ కారు ధర సుమారు రూ.27 లక్షలు. -
జేమ్స్బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..!
Triumph Tiger 900 Bond Edition: ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకు క్రేజ్ మామూలుగా ఉండదు. నిర్మాణ సంస్థలు అదే స్థాయిలో విలువలను పాటిస్తూ బాండ్ సినిమాలను రూపొందిస్తాయి. సినిమా అయ్యే ఖర్చు గురించి అసలు పట్టించుకోరు. త్వరలోనే జేమ్స్ బాండ్ సిరీస్లోని 25వ చిత్రం‘నో టైం టూ డై’ ప్రేక్షకులకు ముందు రానుంది. చదవండి: Puncture - Proof Tires: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..! జేమ్స్ బాండ్ 007 ప్రాంఛైజీ భాగస్వామ్యంతో ట్రయంఫ్ మోటార్స్ లిమిటెడ్ ఎడిషన్ బైక్ను ప్రకటించింది. ట్రయంఫ్ టైగర్ 900 బాండ్ ఎడిషన్ అనే కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్ని మార్కెట్లలోకి కంపెనీ టీజ్ చేసింది. ట్రయంఫ్ మోటార్స్ కేవలం 250 బైకులను మాత్రమే ఉత్పత్తి చేయనుంది. గతంలో ట్రయంఫ్ మోటార్స్ జేమ్స్ బాండ్ ప్రాంఛైజీ భాగస్వామ్యంతో ట్రయంప్ స్క్రాంబ్లర్ 1200 బాండ్ ఎడిషన్ బైక్ను లాంచ్ చేసింది. టైగర్ 900 బాండ్ ఎడిషన్ బైక్ విషయానికి వస్తే..ప్రత్యేకమైన మాట్ సఫైర్ బ్లాక్ పెయింట్తో 007 గ్రాఫిక్స్తో ఈ బైక్ రానుంది. బిల్లెట్ మెషిన్డ్ హ్యాండిల్ బార్ క్లాంప్తో పాటు బైక్ ప్రత్యేకమైన లిమిటెడ్-ఎడిషన్ నంబర్తో వస్తుంది. బైక్లో ఫ్రేమ్, హెడ్లైట్ ఫినిషర్లు, సైడ్ ప్యానెల్లు, సంప్ గార్డ్, పిలియన్ ఫుట్రెస్ట్ హ్యాంగర్లు, ఇంజిన్ గార్డ్లు అన్నీ ప్రీమియం బ్లాక్ ఫినిషింగ్తో రానున్నాయి. బైక్ స్పీడో మీటర్ 007బాండ్ సిగ్నేచర్ను ఏర్పాటుచేశారు. అదనపు పెర్ఫార్మెన్స్ కోసం మిచెలిన్ అనకీ వైల్డ్ ఆఫ్-రోడ్ టైర్స్ను అమర్చారు. కాగా ఈ బైక్ ప్రస్తుతం భారత్లో అందుబాటులో లేదు, టైగర్ 900 బాండ్ ఎడిషన్ బైక్ యూరోప్, యుఎస్ఏ, కెనడాలోని కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: No Time Time To Die: గన్నులున్న జేమ్స్బాండ్ కారు.. అమ్మకానికి రెడీ ! -
జేమ్స్ బాండ్ 007 నటి మృతి
లాస్ ఎంజెలస్: జేమ్స్ బాండ్ 007 సిరీస్ నటి తన్య రాబర్ట్(65) మృతి చెందారు. ఇటీవల ఆస్పత్రిలో చేరిన ఆమె ఆదివారం కన్నుమూశారు. క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 24న తన పెంపుడు కుక్కతో వాకింగ్కు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో లాస్ ఏంజిల్స్లోని సెడార్-సినార్ హాస్పిటల్లో చేర్పించినట్లు ఆమె స్నేహితుడు, ప్రతినిధి మైక్ పింగెల్ స్థానిక మీడియాకు తెలిపాడు. దీంతో వైద్యులు ఆమెను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారన్నారు. ఈ క్రమంలో తన్య నిన్న మృత్యువాత పడినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆమె మృతికి కారణం ఇంకా తెలియలేదని, చనిపోవడానికి ముందు తన్య రాబర్ట్ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా విక్టోరియా లీ బ్లమ్లో జన్మించిన తాన్య రాబర్ట్స్ మొదట మోడల్గా తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత 1975లో వచ్చిన హర్రర్ చిత్రం ఫోర్స్డ్తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 1985లో జేమ్స్ బాండ్ 007 చిత్రంలో తన్య అమెరికన్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త స్టాసే సుట్టన్ పాత్ర పోషించారు. ఈ సినిమాతో తన్య నటిగా మంచి గుర్తింపు పొందారు. అయితే సినిమాలలో నటించడానికి ముందు ఆమె కొన్ని టెలివిజన్ ప్రకటనలు కూడా చేశారు. -
నగరంలోఅమెరికా రహస్య ఏజెంట్లు
-
నగరంలో అమెరికన్ ‘జేమ్స్బాండ్’లు
సాక్షి, హైదరాబాద్: జేమ్స్బాండ్.. ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బ్రిటిష్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్గా హాలీవుడ్ సినిమాలతో జేమ్స్బాండ్ బాగా పాపులర్. అయితే బ్రిటిష్ ఏజెంట్లు కాదుగానీ.. అమెరికా ‘జేమ్స్బాండ్’లు మాత్రం ఇప్పుడు హైదరాబాద్లో సంచరిస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడి పరిస్థితులపై ‘నిఘా’పెట్టారు. ఎప్పటికప్పుడు సేకరించిన సమాచారాన్ని అమెరికా భద్రతా విభాగాలకు చేరవేస్తున్నారు. ఇదంతా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా హైదరాబాద్ పర్యటన కోసమే. ఈ నెల 28 నుంచి హైదరాబాద్లో జరుగనున్న సదస్సులో ఆమె పాల్గొంటున్న విషయం తెలిసిందే. దీంతో ముందస్తుగా అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఇక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఎవరెవరు.. ఏమేంటి? ఇవాంకా పర్యటనలో ఎక్కడెక్కడకు వెళతారు? ఎవరెవరు ఆమెను కలుస్తారు? వారి నేపథ్యం ఏంటి? వారికున్న భద్రత, సామాజిక స్థాయి ఏమిటి? వంటి వివరాలన్నింటినీ అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు రహస్యంగా సేకరిస్తున్నారు. సాధారణ విదేశీ పర్యటకులుగా వచ్చిన ఆ ఏజెంట్లు.. ఇవాంకా పర్యటించే ప్రాంతాలు, అక్కడి పరిస్థితులు, రోడ్మ్యాప్, ఇక్కడి పోలీసులు చేపడుతున్న భద్రతా వ్యవహారాలు.. తదితర అంశాలనూ క్షుణ్నంగా పరిశీలించి అమెరికా భద్రతా విభాగాలకు పంపిస్తున్నట్లు సమాచారం. నెల కిత్రమే నగరానికి.. 15 మంది అమెరికన్ ‘జేమ్స్బాండ్’లు నెల రోజుల కిందే హైదరాబాద్కు వచ్చి.. పని మొదలుపెట్టినట్లు కేంద్ర నిఘా వర్గాల ద్వారా తెలిసింది. ప్రధాని మోదీని కూడా ఎవరు కలుస్తారు, ఇవాంకా పాల్గొనే సదస్సులో వేదిక మీద ఉండే వాళ్లు ఎవరు, వారి పూర్తి వివరాలేమిటి అనే అంశాలతోపాటు చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్ ప్రాంతాలు, అక్కడి నిర్వాహకులెవరనే సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ నిఘాను మరో రెండు మూడు రోజుల్లో పూర్తిచేసి.. తుది ప్లాన్ను అమెరికా భద్రత విభాగాలకు అందించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్లాన్, సమాచారాన్ని బట్టి ఇవాంకా ట్రంప్ పర్యటన తుదిరూపు ఉంటుందని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. మన ప్రధాని విదేశాలకు వెళ్లినా.. మన దేశ ప్రధాన మంత్రి ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లినా.. దేశంలోని కీలకమైన విభాగాలైన ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధికారులు రహస్య ఏజెంట్లుగా పనిచేస్తారని కేంద్ర నిఘా అధికారులు తెలిపారు. ప్రధాని పర్యటించే ప్రాంతాలు, అక్కడికి వచ్చే వారి వివరాలు, ముప్పు ఉండే ప్రమాదం తదితర వివరాలను ముందే సేకరించి.. పర్యటన ప్రణాళికను తుది రూపునకు తీసుకువస్తారని పేర్కొన్నాయి. ఇవాంకా సెక్యూరిటీ అధికారిగా మహిళా ఐపీఎస్! రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలో ఇవాంకా భద్రతా, లైజన్ ఆఫీసర్గా మహిళా అధికారిని నియమించేందుకు పోలీస్ శాఖ సమాయత్తం అవుతోంది. అమెరికా భద్రతా సంస్థ (ఎఫ్బీఐ) వర్గాలు ఇచ్చే సూచనల మేరకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) నుంచి కూడా మహిళా అధికారిని కేటాయించే అవకాశముందని పోలీస్ వర్గాలు తెలిపాయి. అయితే తెలంగాణలో పర్యటన కాబట్టి ఇక్కడి ఎస్పీ ఆపై స్థాయి ఉన్న మహిళా అధికారిని నియమించుకునేలా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇవాంకాకు సెక్యూరిటీ, లైజన్ ఆఫీసర్గా చేశామన్న పేరు వస్తుందన్న ఉద్దేశంతో పలువురు మహిళా అధికారులు పోటాపోటీగా ప్రయతిస్తున్నారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ‘భద్రత’పై పోలీసుశాఖ, ఎస్పీజీ మధ్య లేని సమన్వయం! ప్రధాని మోదీ, ఇవాంకాల పర్యటన సందర్భంగా భద్రతపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) నుంచి రాష్ట్ర పోలీసు శాఖకు ఇప్పటివరకు అధికారిక సమావేశం అందలేదని తెలిసింది. పర్యటనకు వారం రోజులే గడువు ఉండటంతో అసలు భద్రతా ఏర్పాట్లపై ఎలాంటి కార్యచరణ చేపట్టాలన్న దానిపై ఎస్పీజీ రాష్ట్ర పోలీస్ శాఖతో సమన్వయ సమావేశం నిర్వహించాల్సి ఉంది. హెచ్ఐసీసీలో సదస్సు జరిగే చోట అమెరికన్ సెక్యూరిటీ, ఎస్పీజీ మాత్రమే ఉండాలా? రాష్ట్ర పోలీసు అధికారులు కూడా ఉండొచ్చా? ఉంటే ఎంతమంది ఉండాలి? తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. -
కొత్త బాండ్ ఎవరో!
హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో జేమ్స్ బాండ్కు ఉన్న క్రేజే వేరు. ముఖ్యంగా ఈ సినిమాల్లో బాండ్ పాత్రల్లో నటించే నటీనటులు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకుంటారు. ఇప్పటికే 26 సినిమాల్లో కనిపించిన బాండ్ పాత్రల్లో సీన్ కానరీ, డేవిడ్ నివెన్, జార్జ్ లెజెన్బే, రోగర్ మోర్, టిమోతీ డాల్టన్, పియర్స్ బ్రోస్నన్ నటించగా చివరి నాలుగు చిత్రాల్లో డానియల్ క్రెగ్ బాండ్ పాత్రలో అలరించాడు. తాజాగా రిలీజ్ అయిన స్పెక్టర్ సినిమా ప్రమోషన్ సందర్భంగా క్రెగ్ ఇక పై తనకు బాండ్ పాత్రలో నటించటం ఇష్టం లేదంటూ ప్రకటించాడు. దీంతో కొత్త బాండ్ ఎవరన్న చర్చ మొదలైంది. అయితే ఇప్పటివరకు మరో బాండ్ ఎవరన్నది తేలకపోయినా డానియల్ క్రెగ్ మాత్రం బాండ్ పాత్రకు గుడ్ బై చెప్పినట్టే అన్నటాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం క్రెగ్ ప్యూరిటీ అనే అమెరికన్ టీవీ సీరీస్కు అంగీకరించాడు. ఈ సీరీస్ పూర్తి కావటానికి చాలా సమయం పడుతుంది కనుక క్రెగ్ ఇక బాండ్ సినిమాకు అంగీకరించే ఛాన్స్ లేదు. దీంతో కొత్త బాండ్ కోసం అన్వేషణ ప్రారంభించారు. -
'హాలీవుడ్ నా బాయ్ ఫ్రెండ్.. బాండ్ గర్ల్గా వస్తా'
పిలిప్పీన్స్: తనకు బాండ్ చిత్రాల్లో నటించాలని ఉందని విశ్వసుందరి పియా అలంజో వూర్త్బాచ్ తన మనసులో మాట చెప్పింది. ఇటీవల మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న ఈ పిలిప్పీన్స్ సుందరికి ప్రస్తుతం ఆ విజయాన్ని అనుభవిస్తున్నానని తెలిపింది. తాను విశ్వసుందరి కిరీటం దక్కించుకున్న రోజు మరువలేనిదని చెప్పింది. ప్రస్తుతం తనకు డేటింగ్, బాయ్ ఫ్రెండ్ వంటి ఆలోచనలేవీ లేవని, హాలీవుడ్ పరిశ్రమే ప్రస్తుతం తనకు బాయ్ ఫ్రెండ్ అని, అందుకే తన కలలు నెరవేర్చుకునేందుకు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతానని చెప్పింది. 55 ఏళ్ల అక్వినోతో పియా డేటింగ్ చేసిందన్న పుకార్లు షికార్లు చేసిన నేపథ్యంలో ఆమె పై వివరణ ఇచ్చింది. మున్ముందు వచ్చే జేమ్స్ బాండ్ చిత్రాల్లో బాండ్ గర్ల్ గా నటించాలన్నదే తన కోరిక అని చెప్పింది. పదకొండేళ్ల వయసులోనే ఫ్యాషన్ రంగం వైపు అడుగుపెట్టిన పియా ఇప్పటికే పలు టీవీ కార్యక్రమాల్లో, సినిమాల్లో చిన్నపాత్రల్లో నటించింది. అవేవీ ఆమెకు పేరు ప్రఖ్యాతులు తీసుకురాలేదు. అదీ కాకుండా ఈ సారి ఆమెకు విశ్వసుందరి కిరీటం కూడా కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనల మధ్య చోటుచేసుకుంది. ఈ ఏడాది నిర్వహించిన విశ్వసుందరి పోటీల్లో వాస్తవానికి పియా నే విజేతగా నిలిచినా.. విజేతల ప్రకటనలో కొంత గందరగోళం జరిగి, వివాదాస్పదంగా మారింది. కార్యక్రమం నిర్వాహకుడు స్టీవ్ హార్వే తొలుత ఈ విజేతలను తారుమారుగా ప్రకటించారు. తొలిస్థానంలో కొలంబియా యువతి అరియాడ్నా, రెండో స్థానంలోఅలొంజో, మూడో స్థానంలో ఒలివియా నిలిచారని చెప్పారు. అరియాడ్నా వేదికపై క్యాట్వాక్ చేసి ప్రేక్షకులకు అభివాదం కూడా చేసింది. గత ఏడాది మిస్ యూనివర్స్, కొలంబియాకే చెందిన పౌలినా వెగా వేదికపైకి చేరుకుని అరియాడ్నా తలపై కిరీటం పెట్టింది. కానీ విజేతలను ప్రకటించడంలో పొరపాటు జరిగిందంటూ నిర్వాహకుడు స్టీవ్ హార్వే ఒక్కసారిగా షాకిచ్చారు. మొదటి స్థానంలో పియా, రెండో స్థానంలో అరియాడ్నా నిలిచినట్లు ప్రకటించారు. ఈ తప్పిదానికి తాను బాధ్యత వహిస్తానని, ఎవరూ బాధపడవద్దని వ్యాఖ్యానించారు. దీంతో తిరిగి వేదికపైకి వచ్చిన మాజీ మిస్ యూనివర్స్ పౌలినా వెగా.. అరియాడ్నా నుంచి కిరీటాన్ని తీసుకుని పియా అలొంజోకు అలంకరించారు. దీంతో గతంలో లేనంత స్థాయిలో విశ్వసుందరి విజేతగా పియాకు భారీ ఎత్తున ప్రచారం లభించింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో లక్షల్లో వీక్షించారు. ఈ ప్రచారంతోనే ప్రస్తుతం ఆమె హెచ్ఐవీపై ఇటు అమెరికా ప్రజలను, తమ మాతృదేశం పిలిప్పీన్స్ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కదలడానికి సిద్ధంగాఉంది. తమ దేశంలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య 22శాతానికి పెరిగిందని, ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించే దిశగానే ఆమె ముందుకు సాగుతానని చెప్పారు. అమెరికాతో తమకు ముందునుంచే సత్సంబంధాలు ఉన్నందున వారి సహాయం కోరేందుకు వెనుకాడబోనని పియా పేర్కొంది. -
జేమ్స్ బాండ్గా చేసేకన్నా చచ్చిపోవడం బెటర్!
‘బాండ్.. జేమ్స్ బాండ్.. నేను జేమ్స్ బాండ్ 007’ అంటూ తమ ధైర్యసాహసాలను ప్రదర్శించడానికి ఆ పాత్రతో తమను పోల్చుకుంటారు పిల్లలు. అంతలా ఈ క్యారెక్టర్ పిల్లలకు దగ్గరైపోయింది. ఇక, పెద్దల సంగతి సరే సరి. తెరపై ఈ సీక్రెట్ ఏజెంట్ చేసే విన్యాసాలు వారినీ ఆకట్టుకుంటాయి. అలా ఇంటిల్లిపాదికీ దగ్గరైన ఈ పాత్ర చేయడం అంటే చిన్న విషయం కాదు. జంపింగులూ, రన్నింగులూ, చాకచక్యంగా తుపాకీ పేల్చడం.. వాట్ నాట్.. బోల్డన్ని చేయాలి. అందుకే, ఈ పాత్ర చేసేవాళ్లను అద్భుతమైన నటులుగా కితాబులిస్తారు. ఇప్పటివరకూ సీన్ కానరీ, రోజర్ మూర్.. ఇలా పలువురు నటులు జేమ్స్ బాండ్గా అలరించారు. ఆ తర్వాత డేనియల్ క్రెగ్ ఈ పాత్రను పోషించడం మొదలుపెట్టారు. 2006లో ‘కాసినో రాయల్’, 2008లో ‘క్వాంటమ్ ఆఫ్ సోలెస్’, 2012లో ‘స్కైఫాల్’ చిత్రాల్లో జేమ్స్ బాండ్గా నటించారాయన. త్వరలో విడుదల కానున్న ‘స్పెక్టర్’లో నాలుగో సారి ఈ పాత్ర చేశారు. ఐదో సారి మాత్రం ఈ పాత్ర చేయడానికి ఆయన సిద్ధంగా లేరు. ‘మళ్లీ జేమ్స్ బాండ్గా నటించేకన్నా చచ్చిపోవడం బెటర్. ఒకవేళ నటించాల్సిన పరిస్థితి వస్తే ఏదైనా గాజు ముక్కతో నా మణికట్టుని కోసేసుకుంటా’ అంటున్నారు డేనియల్. దీన్నిబట్టి జేమ్స్ బాండ్ పాత్ర పోషణ పరంగా ఆయన ఎంత అలసిపోయారో ఊహించవచ్చు. ఎవరైనా మరీ బలవంతం చేస్తే, కనీసం మరో రెండేళ్లు ఆగమంటానని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల తర్వాత ఒకవేళ ఒప్పుకోవాలనిపిస్తే, అది డబ్బు కోసమే తప్ప వేరే కారణాలేవీ ఉండవని కూడా స్పష్టం చేశారు.