రాష్ర్ట సర్కార్ గద్దె దిగాలి
= రైతు బలవన్మరణంపై ఉద్యమించిన బీజేపీ, రైతుసంఘం, హసిరుసేన
= మండ్య, శివమొగ్గలో ధర్నాలు
శివమొగ్గ/మండ్య, న్యూస్లైన్ : బెల్గాం సువర్ణవిధానసౌధ ఎదురుగా రైతు విఠల అరభావి ఆత్మహత్య చేసుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వమే కారణమని, వెంటనే సర్కార్ గద్దె దిగాలని బీజేపీ, దాని అనుబంద సంఘాలతోపాటు రైతు సంఘం, హసిరుసేన ఆందోళనకు దిగాయి. శివమొగ్గలో హసిరుసేన, రైతుసంఘం కార్యకర్తలు శివప్పనాయక సర్కిల్లో, బీజేపీ కార్యకర్తలు గోపీసర్కిల్లో ధర్నాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం కర్ణాటక రైతుసంఘం, హసిరుసేన రాష్ట్రాధ్యక్షుడు కేటీ.గంగాద ర్ మాట్లాడుతూ.....రాష్ట్ర ప్రభుత్వం చెరకుకు మద్దతు ధర కల్పించకపోవడంతో దిక్కుతోచక రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. వెంటనే చెరుకుకు మద్దతు ధర కల్పించడంతోపాటు మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ చెరుకుకు మద్దతు ధర కోసం రైతులు బెల్గాం సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి దర్నా చేస్తున్నా ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి రైతులతో సమావేశమై చర్చించిన పాపాన పోలేదని మండిపడ్డారు.
ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదన్నారు. సిద్ధరామయ్య వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతు మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అదేవిధంగా మండ్యలో రైతు మోర్చ నాయకులు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలను చేశారు. అనంతరం నాల్వడి కృష్ణరాజ ఒడెయార్ సర్కిల్లో ధర్నా చేశారు.
నాయకులు మాట్లాడుతూ రైతు మృతికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, చెక్కరశాఖ మంత్రి కారణమన్నారు. తక్షణమే సీఎంతోపాటు సదరు మంత్రి తమ పదవులకు రాజినామ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను హత్య చేయడానికి కూడ వెనుకాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగి వచ్చి చెరుకుకు గిట్టుబాటు ధరను కల్పించాలని, మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండు చేశారు. రైతు మోర్చ అధ్యక్షుడు రవీంద్ర, సిద్దరాజు గౌడ, సిద్దరామయ్య, జోగిగౌడ, కృష్ణెగౌడ, జవరేగౌడ పాల్గొన్నారు.