Kunimallahalli
-
రెండు దుర్ఘటనలూ ఒకే తీరుగా...!
పాలెం, కర్ణాటక దుర్ఘటనలు రెండూ ఒకే రకంగా జరిగాయి. అతి వేగంతో దూసుకుపోతూ కల్వర్టు/డివైడర్కు ఢీకొనడం.. డీజిల్ ట్యాంకులు పగిలి మంటలు ఎగిసిపడడం.. క్షణాల్లో బస్సు అంతా వ్యాపించడం జరిగింది. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న వోల్వో బస్సులు కూడా ఇలా నిమిషాల్లో బుగ్గిగా మారటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ‘డివైడర్ను ఢీకొనగానే డీజిల్ ట్యాంకులు పగిలే పరిస్థితి మా బస్సుల్లో ఉండదు’ అని వోల్వో కంపెనీ ప్రతినిధులు చెబుతున్నప్పటికీ.. అగ్నికీలలకు అవి అతీతం కావని నిపుణులు పేర్కొంటున్నారు. వోల్వో బస్సు బాడీని స్టీల్తో రూపొందిస్తున్నారు. ముందు, వెనుక ఆకర్షణీయంగా ఉండేందుకు ఫైబర్ను వినియోగిస్తున్నారు. డీజిల్ ట్యాంకులను అత్యంత నాణ్యమైన ప్లాస్టిక్ను వాడుతున్నారు. ఈ ప్లాస్టిక్ అంత సులభంగా పగలదనేది వోల్వో వాదన. కానీ అతి వేగంగా డివైడర్ను ఢీకొంటే కచ్చితంగా ట్యాంకు పగులుతుందని నిపుణులు అంటున్నారు. ఈ రెండు ప్రమాదాల్లో డీజిల్ ట్యాంకులు పగిలి అందులోని వందల లీటర్ల డీజిల్ రోడ్డుపై చిమ్మింది. ఈ రెండు బస్సులు ప్రమాద సమయంలో 100 కి.మీ.మించిన వేగంతో ప్రయాణించాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఉవ్వెత్తున మంటలెగియటానికి ఇదే కారణమైంది. కానీ.. మంటలంటుకున్నప్పుడు ప్రయాణికులు సులభంగా బయటపడే అవకాశం ఉన్నా... డ్రైవర్లు, ట్రావెల్ యజమానుల నిర్లక్ష్యం ప్రాణనష్టాన్ని భారీగా పెంచాయి. సాధారణంగా వోల్వో కంపెనీ.. తమ బస్సు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు బయటపడేలా వారు చూపాల్సిన చొరవపై కూడా అందులో పేర్కొంటుంది. కానీ ఈ రెండు ప్రమాదాల్లో డ్రైవర్లు ప్రయాణికులను కాపాడేందుకు ఏమాత్రం ప్రయత్నించలేదు. అత్యవసర మార్గాలెక్కడున్నాయో, కిటికీ అద్దాలు పగలగొట్టేందుకు సుత్తెలెక్కడున్నాయో ప్రయాణికులు గమనించే ఏర్పాట్లు చేయలేదు. కిటికీల వద్ద సుత్తెలు ఉండే చోట అవి కనపడకుండా కర్టెన్లు వేయటంతో వాటిపై ప్రయాణికులకు అవగాహనే లేకుండా పోయింది. కర్ణాటక బస్సు టాప్కు ప్రత్యేక ఎయిర్డోర్ ఉండటంతో ప్రయాణికులు దాని ద్వారా బయపడగలిగారు. కానీ పాలెం వద్ద ప్రమాదానికి గురైన బస్సుకు అది లేకపోవటం, అద్దాలు పగలకపోవటంతో 45 మంది చనిపోయారు. స్పీడ్ లాక్ తెరుస్తోందెవరు..? వోల్వో కంపెనీ తమ బస్సులను రోడ్డుపైకి తెచ్చేప్పుడు గరిష్ట వేగం 100 కి.మీ. మించకుండా లాక్ చేస్తోంది. సాధారణ బస్సుల్లో ఇంజిన్లా కాకుండా ఇది సాఫ్ట్వేర్ ఆధారితంగా ఉంటుంది. అంటే వోల్వో బస్సులు గరిష్ట వేగం 100 కి.మీ. మించలేవన్నమాట. కానీ ఈ రెండు ప్రమాదాల్లో వాటి వేగం 120-130 కి.మీ. మధ్య ఉందని తెలుస్తోంది. అంటే ఆ బస్సుల వేగ నియంత్రణ లాక్ తెరిచారని స్పష్టమవుతోంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో లాక్ చేస్తున్నందున అది బస్సు డ్రైవర్లు, సాధారణ మెకానిక్ల వల్ల సాధ్యం కాదని రవాణా శాఖ పేర్కొంటోంది. వోల్వో వర్క్షాప్లలో పనిచేసే వారు ఈ పని (ట్యాంపరింగ్) చేస్తున్నారనేది వారి అనుమానం. చాలా తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చటం ద్వారా ప్రయాణికుల దృష్టిని ఆకట్టుకునేందుకు ట్రావెల్ కంపెనీలు ట్యాంపరింగ్ను ప్రోత్సహిస్తున్నాయని, దానికి వోల్వో మెకానిక్లే సాయం చేస్తున్నారన్న అనుమానం దిశగా రవాణ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. బ్రేక్ వ్యవస్థ, ఎలక్ట్రికల్ సిస్టం, ఇంజిన్... ఇలా వోల్వోలో ఎనిమిది భాగాలు ప్రత్యేక సాఫ్ట్వేర్తో అనుసంధానమై ఉంటున్నాయి. అయినా ప్రమాదాలు జరుగుతుండడం గమనార్హం. వేగాన్ని చెక్ చేసే పరిజ్ఞానం ఎక్కడ..? బస్సు వేగం ఎంతుందో తెలుసుకోవటం అంత కష్టం కాదు. కానీ ప్రత్యేక సాఫ్ట్వేర్తో అనుసంధానమై ఉన్న వోల్వో బస్సులు ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాయో తెలుసుకునే సాంకేతిక సామర్థ్యం మన రవాణా శాఖకు లేదు. ప్రమాదానికి గురైనా, మరే సందర్భంలోనైనా దాని వేగాన్ని తెలుసుకోవాలంటే వోల్వో కంపెనీ గ్యారేజీకి వెళ్లి అక్కడి పరిజ్ఞానం ఆధారంగా చూస్తేగానీ తెలియదని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వోల్వో ప్రమాదాలివీ.. * 2005లో గుజరాత్లో లారీని ఢీకొన్న వోల్వో బస్సుకు నిప్పంటుకుని 27 మంది మృతి చెందారు. * 2012లో తమిళనాడులో వోల్వో బస్సు లారీని ఢీకొనటంతో మంటలంటుకున్నాయి. 22 మంది ప్రయాణికులు మృతి చెందారు. * నల్గొండ జిల్లా చింతలపూడి వద్ద వేగంగా వెళ్తున్న ప్రైవేటు ఏసీ హైటెక్ బస్సు (వోల్వో కాదు) టిప్పర్ను ఢీకొన్ని మంటల్లో చిక్కుకుంది. డ్రైవర్ సహా ఓ మహిళ మృతి చెందారు. * మహబూబ్న్నగర్ జిల్లా పాలెం శివారులో గత నెల వోల్వో బస్సు కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో 45 మంది అగ్నికి ఆహుతయ్యారు. * బుధవారం తెల్లవారుజామున కర్ణాటకలో వోల్వో బస్సు డివైడర్ను ఢీకొని అగ్నికీలల్లో చిక్కుకుని ఏడుగురు సజీవదహనం. మల్టీ యాక్సిల్ బస్సులపై శిక్షణ ఉందా..? వోల్వోలో గతంలో 11.7 మీటర్ల పొడవు ఉండే సింగిల్ యాక్సల్ బి7ఆర్ మోడల్ బస్సులు వాడేవారు. వాటి స్థానంలో ప్రస్తుతం 13.7, 15 మీటర్ల పొడవు ఉండే బీ9ఆర్, బీ11ఆర్ మోడళ్ల మల్టీ యాక్సల్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా ముందు చక్రాలకే స్టీరింగ్తో అనుసంధానం ఉంటుంది. కానీ మల్టీ యాక్సల్లో వెనక చక్రాల వ్యవస్థకు కూడా స్టీరింగ్తో అనుసంధానం ఉండటం వల్ల తక్కువ స్థలంలో కూడా బస్సులు మలుపు తిరిగేందుకు వీలుంటుంది. పైగా ఈ బస్సుల్లో ప్రయాణికుల సామర్థ్యం 49 వరకు ఉండటం, కుదుపులు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉండటంతో ట్రావెల్స్ యజమానులు ఈ బస్సులవైపే దృష్టిపెడుతున్నారు. వీటిని నడపటంలో డ్రైవర్లకు మరింత శిక్షణ కావాలి. కానీ తొలుత వోల్వో కంపెనీ ఇచ్చే శిక్షణ మినహా వారికి ఎలాంటి పునఃశ్చరణ ఉండటం లేదు. పైగా వోల్వో కంపెనీ ఇచ్చే శిక్షణ మాడ్యూల్ ఏంటో కూడా ఇప్పటి వరకు రవాణాశాఖ పరిశీలించలేకపోయింది. ఏమాత్రం డీజిల్ లీకైనా అంతే.. మూడు రోజుల క్రితం నల్గొండ జిల్లాల్లో ఆర్టీసీ గరుడ (వోల్వో) బస్సులో నిప్పంటుకోవటానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తేలింది. వోల్వో కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్రికల్ సిస్టంను చిన్నాభిన్నం చేసి ఆర్టీసీ సిబ్బంది బస్సులో ఏర్పాటు చేసిన స్విచ్బోర్డు సిస్టమే దీనికి కారణమని రవాణాశాఖ అధికారులు గుర్తించారు. లగేజీ బాక్సులో ప్రత్యేకంగా స్విచ్బోర్డు ఏర్పాటు చేసి అక్కడ ఓ బల్బ్ను అమర్చారు. ఇది వోల్వో నిబంధనలకు విరుద్ధం. ఈ స్విచ్బోర్డు ద్వారా నిప్పు రవ్వలు వెలువడి అక్కడి సామగ్రికి మంట అంటుకుంది. ఇక వోల్వో బస్సుల ఎగ్జాస్ట్ సిస్టం వద్ద 400- 600 డిగ్రీల వరకు వేడి ఉత్పత్తవుతుంది. దీనికి చేరువలోనే డీజిల్ ట్యాంకు ఉంటుంది. అక్కడ ఆయిల్ ఏమాత్రం లీక్ అయినా నిప్పు పుట్టే అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ బస్సును పరిశీలించకుంటే పెను ప్రమాదానికి అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. డ్రైవర్లకు వీటిపై అవగాహన ఉందా? వోల్వో బస్సు యురోపియన్ డిజైన్తో రూపొందినా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం అమ్మకాల్లో ముందున్న బస్సుల తయారీ కంపెనీ ఇదే. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధర తగ్గించే క్రమంలో ఈ కంపెనీ కొన్ని అత్యాధునిక వసతులు తగ్గించి తయారు చేసి అందిస్తోంది. అయినప్పటికీ సాంకేతికంగా లోపాలు తలెత్తి ప్రమాదాలు చోటుచేసుకోకుండా డ్రైవర్కు ఎప్పటికప్పుడు తనంతట తనుగా సూచనలిచ్చే వ్యవస్థ వీటిల్లో ఉంటుంది. ఇందుకు డ్రైవర్ ముందు ప్రత్యేక ప్యానెల్పై మూడు రకాల ప్రధాన సూచనలిందించే ఏర్పాటు ఉంటుంది. అవి 1.ఇన్ఫర్మేషనరీ: బస్సులో ఇంధనం ఎంత ఉందో చూపుతూ... ఒకవేళ అయిపోయే పరిస్థితి వస్తే వెంటనే ఇంధనం నింపుకోవాలని తెలుపుతుంది. 2. కాషనరీ: సిస్టంలో ప్రధానమైన సాంకేతిక లోపం తలెత్తే పరిస్థితి ఉంటే ముందుగానే ఆ విషయాన్ని డిస్ప్లే బోర్డుపై సూచిస్తుంది. పూర్తిగా పాడవటానికి ముందు సరిదిద్దేందుకు ఇది దోహదం చేస్తుంది. 3.స్టాప్: ఉన్నట్టుండి పెద్ద సమస్య తలెత్తితే డ్రైవర్ గుర్తించటానికి ముందే తనంతట తానుగా వెంటనే బస్సును నిలిపివేయమని పేర్కొంటూ ‘స్టాప్’ అని పేర్కొంటుంది. ఈ పరిస్థితిలో బస్సు ముందుకు కదిలితే ప్రమాదం జరుగుతుంది. డ్రైవర్ దాన్ని గుర్తించేందుకు వీలుగా బస్సంతా వినిపించేలా ‘బీప్’ శబ్దం వస్తుంది. బోర్డుపై అది ఏం సూచిస్తోందో తెలియాలంటే డ్రైవర్కు కచ్చితంగా ఇంగ్లిష్ వచ్చి ఉండాలి. ఈ విషయంలో చాలామంది డ్రైవర్లకు అవగాహన ఉండటం లేదు. బీప్ శబ్దం వచ్చినా బస్సులో టీవీ, సౌండ్ సిస్టం వల్ల అది వినిపించని దుస్థితి నెలకొంది. -
మొన్న పాలమూరులో.. నేడు కర్ణాటకలో అదే ఘోరం
* మరో వోల్వో బస్సు బుగ్గి.. డ్రైవర్ సహా ఏడుగురు సజీవ దహనం * వేగంగా వంతెన రెయిలింగ్ను ఢీకొట్టడమే ప్రమాదానికి కారణం * బెంగళూరు నుంచి ముంబై వెళ్తుండగా కునిమల్లహళ్లి వద్ద ఘటన * డీజిల్ ట్యాంక్ పగలడంతో అంటుకున్న మంటలు * మహబూబ్నగర్ ఘోర ప్రమాదం మరవకముందే మరో విషాదం * రెండు ఘటనల్లో 52 మంది సజీవ దహనం.. కళ్లు తెరవని ప్రభుత్వాలు * వోల్వో బస్సు అంటేనే హడలెత్తిపోతున్న ప్రయాణికులు * ప్రమాదాలకు కారణం అతి వేగమే.. ఈ బస్సుల వేగం 100 కి.మీ * మించకుండా ‘లాక్ సిస్టమ్’.. ఆ ‘లాక్’ తెరిచేస్తుండడంతో ప్రమాదాలు దావణగెరె, న్యూస్లైన్/సాక్షి, హైదరాబాద్/బెంగళూరు: మళ్లీ అదే ఘోరం.. అవే మంటలు.. అదే వోల్వో బస్సు.. పక్షం రోజులు తిరగకుండానే దారుణం.. మహబూబ్నగర్ జిల్లాలో కిందటి నెల 30న చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనమైన ఘటన కళ్లముందు కదలాడుతుండగానే కర్ణాటకలో అచ్చం అదే తరహాలో మరో బస్సు భస్మీపటలమైంది! ఏడుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బుధవారం అర్ధరాత్రి సుమారు మూడు గంటల సమయంలో హావేరి జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కునిమల్లహళ్లి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి ముంబై వెళ్తున్న ఈ బస్సు వరదా నదిపై నిర్మించిన బ్రిడ్జి రెయిలింగ్ను బలంగా ఢీకొనడంతో డీజిల్ ట్యాంకు పగిలి క్షణాల్లో మంటలు వ్యాపించాయి. బస్సులో మొత్తం ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సహా 53 మంది ఉండగా.. అందులో ఓ డ్రైవర్తోపాటు ఆరుగురు మృతి చెందారు. మిగతావారు గాయాలతో బయటపడ్డారు. మహబూబ్నగర్ జిల్లాలో కాలిపోయింది జబ్బార్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు కాగా.. ఇప్పుడు నేషనల్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సే కావడం గమనార్హం. బస్సులో 53 మంది: ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్తోపాటు ప్రయాణికుల్లో 43 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఏడేళ్ల చిన్నారి.. మొత్తం 53 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఎనిమిది పికప్ పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకున్న ఈ బస్సు బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరింది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు బస్సు ముంబై చేరుకోవాలి. బస్సు తుమకూరు దాటిన తర్వాత రెండో డ్రైవర్ స్టీరింగ్ను అందుకున్నారు. అయితే హవేరీ జిల్లాలోని కునిమల్లహళ్లి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి డ్రైవర్ సహా ఏడుగురు మరణించారు. 44 మంది గాయాలతో, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. నయాజ్(అదనపు డ్రైవర్), రోహన్, జమీర్, సమీరాబాను - కలీం (దంపతులు), కైఫ్, అమాన్లు మృతి చెందినట్లు భావిస్తున్నారు. గందరగోళంగా ప్రయాణికుల జాబితా ఈ బస్సులో ప్రయాణించినవారు ఎవరెవరన్న విషయంపై గందరగోళం నెలకొంది. బెంగళూరులోని ఆ సంస్థ కార్యాలయంలో ఉన్న రిజర్వేషన్ చార్ట్లో ఉన్న పేర్లు.. ప్రమాదంలో గాయపడిన వారి పేర్లకు పొంతన (ఒకరి పేరుతో రిజర్వ్ చేసుకుని.. మరొకరు ఎక్కడం వల్ల) కుదరడం లేదు. ప్రమాదం నుంచి గాయాలతో బయట పడిన వారిలో షహద్ ఇబ్రహీం, జమాలుద్దీన్, సయ్యద్ షా షేర్వానీ, సోహన్ లాల్, ఉమత్ అహ్మద్, ప్రశాంత్ పాండే, జన్నత్, మసీ, వజీర్సాబ్, రాజన్ కుమార్, జేరారామ్ తేరా, ముస్రా కాటన్, మహ్మద్ వజీర్, సోనూ, అంబాత్, నరేష్ జైన్, అజయ్ కుమార్, గణేష్ గుప్తా, రంజిత్ కుమార్, సోలియా ఖాన్, విశ్రాంత్, గోకుల్ ఠాక్రే, మహ్మద్ జమీర్, అశ్విని కుమార్ జైన్, రియాజ్ కుమార్ నాయక్, మీరాచౌదరి, మనీఫ్, వజీం, గౌరవ్, మూవీ, ఇలియాజ్ఖాన్, షానా, పప్పు, దిలీప్కుమార్, శోభాలక్ష్మణ్, వరుణ్, మనోజ్కుమార్, నేహాల్, నాగేష్, సలీంఖాన్, మనోజ్పాటిల్, మహ్మద్ అస్మా, బ్రైట్, రేవణ సిద్ధయ్య ఉన్నారు. ఈ లెక్కన మతి చెందిన ఏడుగురితో పాటు డ్రైవర్లతో కలిపి బస్సులో 53 మంది ప్రయాణించినట్లు తెలుస్తోంది. ట్యాంకు పగిలి మంటలంటుకున్నాయి: ఎస్పీ బస్సు వేగంగా వచ్చి బ్రిడ్జి రెయిలింగ్ను ఢీ కొట్టడంతో డీజిల్ ట్యాంకు పగిలి మంటలు అంటుకున్నాయని అంచనాకు వచ్చినట్లు హావేరి ఎస్పీ ఎం. శశికుమార్ తెలిపారు. బస్సు రెయిలింగ్ను ఢీకొట్టాక 150 మీటర్ల దూరం దూసుకుపోయిందని, డ్రైవర్ బ్రేకులు వేయగానే మంటలు అంటుకున్నాయని అన్నారు. ముగ్గురు సంఘటనా స్థలంలోనే మరణించగా.. నలుగురు ఆస్పత్రికి తరలించే దారిలో మరణించారని తెలిపారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, క్లీనర్ గాయాలతో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రూ.లక్ష చొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించారు. కిమ్స్ మార్చురీలో మృతదేహాలు దుర్ఘటనలో మరణించిన వారి మృతదేహాలను హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ట్రావెల్ ఏజెన్సీ నుంచి ప్రయాణికుల సమాచారం సేకరించిన తర్వాత మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి సంబంధీకులకు అందజేస్తామని హవేరి కలెక్టర్ పాండురంగ నాయక్ తెలిపారు. సమగ్ర దర్యాప్తు జరుపుతామని తెలిపారు. మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సమీర్భాను, కలీం భార్యభర్తలు కాగా మహమ్మద్ కైఫ్(3)ను వారి కుమారుడిగా గుర్తించారు. అయితే మరో ఇద్దరు పిల్లలు కూడా వీరి కుమారులే కావచ్చని భావిస్తున్నారు. ఆ ఇద్దరి సమయస్ఫూర్తే అందర్ని కాపాడింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ఇద్దరు యువకుల సమయస్ఫూర్తి వల్లే ప్రాణ నష్టం తగ్గింది. వారిలో ఒకరు ఢిల్లీకి చెందిన ప్రశాంత్ కాగా.. మరొకరు అఫ్తాబ్. బస్సు ప్రమాదానికి గురైన విషయం వెనువెంటనే గమనించిన ప్రశాంత్(25) అప్రమత్తమయ్యాడు. నిద్రలో ఉన్న తోటి ప్రయాణికులను కేకలు వేస్తూ మేల్కోలిపి బస్సు అద్దాలు పగులగొట్టి వారు బయటకు వెళ్లేందుకు సహకరించాడు. అదేసమయంలో అప్పటికే బస్సులో మెలకువగా ఉన్న అఫ్తాబ్ మంటలు వ్యాపించిన విషయాన్ని గమనించి, బస్సు పైభాగంలో గాలి కోసం అమర్చి ఉన్న చిన్నపాటి డోర్ను తెరిచి.. అందర్నీ అటు రావాల్సిందిగా సూచిస్తూ తాను బయటకొచ్చాడు. వెను వెంటనే 22 మంది అతడిని అనుసరించి బయటపడ్డారు. అయితే సజీవ దహనమైన వారిలో ఓ చిన్నారి ఉండడం అందరినీ కలిచి వేసింది. ప్రమాదాన్ని గుర్తించిన చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. తగులబడుతున్న బస్సులో నుంచి ప్రయాణికులను కాపాడేందుకు ప్రాధాన్యతనిచ్చిన ప్రశాంత్, అఫ్తాబ్ను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్కే పాటిల్ ప్రశంసించారు. క్షణాల్లో జరిగిపోయింది ‘‘ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. నాకు నిద్ర పట్టకపోవడంతో మేలుకునే ఉన్నాను. ఇంతలోనే ఉన్నట్లుండి పెద్ద శబ్దం వచ్చింది. తేరుకునేలోపే బయట నుంచి మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా వేడి తగలడంతో తల్లడిల్లిపోయాం. నా వెనుక ఉన్న వ్యక్తి ఎవరో కిటికీ పగులగొట్టాడు. వెంటనే కిటికీలోంచి నా భార్యను బయటికి తోసేసి నేనూ దూకేశాను.’’ - రాజీవ్ కుమార్, ముంబై మేల్కొని ఉన్నాను కాబట్టే బతికాను.. ‘‘ఎందుకో ప్రమాదానికి కాస్త ముందే మెలకువ వచ్చింది. కర్టెన్ పక్కకు జరిపి విండోలోంచి బయటకు చూస్తున్నాను. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి బస్సు రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొని ఆగిపోయింది. ఆ వెంటనే క్షణాల్లో మంటలు వ్యాపించాయి. కిటికీ అద్దం పగులగొట్టడానికి ప్రయత్నించాను. కాలితో పలుమార్లు గట్టిగా తన్నినా పగలలేదు. పైకి చూడగానే కిటికీ కాస్త తెరుచుకుని కనిపించింది. గట్టిగా పైకి తోయడంతో మనిషి దూరేంత ఖాళీ ఏర్పడింది. ఇలా రండి అంటూ గట్టిగా అరిచి.. నేనూ బస్సు పైకి ఎక్కి ఆ వెంటనే కిందకు దూకాను. కాలు బెణికింది. నా వెనుకే చాలా మంది బస్సుపెకైక్కి.. ఆపై కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.’’ - ఆఫ్తాబ్, న్యూఢిల్లీ బచావ్.. బచావ్.. కేకలు ‘‘నిద్రలో ఉన్నాను. ఒక్కసారిగా గట్టిగా అరుపులు.. బచావ్.. బచావ్..(కాపాడండి.. కాపాడండి..) అంటూ గావు కేకలు వినిపించాయి. ఏం జరిగిందో అర్థం కాలేదు. బస్సు తగలబడిపోతోందని కేకలు వేస్తున్నారు. ఒకరిపై ఒకరు పడుతూ లేస్తున్నారు. ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు. ఓ యువకుడు బస్సు పైభాగంలో ఉన్న విండో ఓపెన్ చేసి పెకైక్కాడు. నేనూ అతన్ని అనుసరించి బయటపడ్డాను’’ - దిలీప్ షిండే, సతార, మహారాష్ట్ర -
బస్సు ప్రమాదం పై స్పందించిన యాజమాన్యం
-
అతివేగమే బస్సు ప్రమాదానికి కారణం
-
వామ్మో వోల్వో....
-
వోల్వోలో ప్రయాణం అంటేనే హడల్!
వోల్వో బస్సులో ప్రయాణమంటే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడింది. మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద ఓల్వో బస్సు దుర్ఘటన మరువక ముందే కర్నాటకలోని హవేరి జిల్లా కునిమళ్లహళ్లి వద్ద ఈ తెల్లవారుజామున మరో వోల్వో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ బస్సులో మంటలు లేచాయంటే క్షణాల్లో పూర్తిగా దగ్ధమైపోతుంది. వోల్వో బస్సు ప్రమాదానికి గురైందంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవలసిందే. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్కు చెందిన వోల్వో బస్సు ఈ తెల్లవారుజామున ప్రమాదానికి గురై కాలి బూడిదైపోయింది. ఏడుగురు సజీవ దహనం అయ్యారు. 20 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మృతులలో ఒకరిని ముంబైకి చెందిన శ్రీరామ్గా గుర్తించారు. బెంగళూరుకు చెందిన భార్య,భర్త, ఇద్దరు పిల్లలు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో తన పాస్పోర్టు, డాక్యుమెంట్లు కాలిపోయాయని దక్షిణాఫ్రికాకు చెందిన బ్రైట్ అనే ప్రయాణికుడు వాపోతున్నారు. ప్రమాదానికి గురైన ఈ బస్సును గత సంవత్సరమే కొనుగోలు చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే హవేరీ జిల్లా ఎస్పి శశికుమార్ సహాయ కార్యక్రమాలు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు ప్రమాదానికి గురయినట్లు కర్నాటక మంత్రి రామలింగా రెడ్డి తెలిపారు. వరుసగా వోల్వో బస్సులే ప్రమాదానికి గురవుతుండటంతో బస్సు నిర్మాణంలో లోపాలు ఏమైనా ఉన్నాయోమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వోల్వో బస్సు ఎక్కాలంటే ప్రయాణికులు భయపడిపోతున్నారు. అయితే వోల్వో బస్సు సురక్షితమైనదని రిటైర్డ్ జాయింగ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గాంధీ చెప్పారు. డ్రైవర్లకు తగిన శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. -
కర్ణాటకలో బస్సు ప్రమాదం, ఏడుగురు సజీవ దహనం