M. Harijavaharlal
-
జిల్లాలో ఇక ప్రగతిపూలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘వచ్చిన పని అయిపోయింది. ఇక ఒక్క రోజు ఉన్నా... అది బోనస్గానే భావించాలి’ అని కుండబద్దలు గొట్టి తన మనోభావాన్ని కచ్చితంగా చెప్పగల వ్యక్తిత్వం ఆయన సొంతం. జిల్లా అభివృద్ధే ధ్యేయంగా... ప్రగతిపూలు పూయించాలన్నదే లక్ష్యంగా... పనిచేసేందుకు జిల్లాలోనే కొనసాగే అవకాశం దక్కించుకున్నారు. ఆయనే జిల్లా కలెక్టర్ ఎం.హరిజవర్లాల్. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన బదిలీల్లో స్థాన చలనం కాని నలుగురు కలెక్టర్లలో ఈయన ఒకరు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని అమరావతిలో కలసి కృతజ్ఞతలు తెలిపిన అనంతరం జిల్లాకు మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాల గురించి ‘సాక్షిప్రతినిధి’కి వివరించారు. సమన్వయంతో... సమగ్రాభివృద్ధి. నాపై నమ్మకం ఉంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అవకాశం ఇచ్చారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలసినపుడు చాలా బాగా రిసీవ్ చేసున్నారు. ఆప్యాయంగా మాట్లాడారు. జిల్లాలోనే కొనసాగాలని ఆదేశించారు. ప్రజల కు మంచి చేయాలనే తపనతో ఉన్న సీఎం చెప్పినట్లు ఇకపై జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకువెళతాం. జిల్లాలో ఇప్పటికే ఏడాది పాటు పనిచేసిన అనుభవంతో భవిష్యత్తో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దానిలో భాగంగా మున్సిపాలిటీలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. విజయనగరం, పార్వతీపురంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాటీల్లోనూ, అనేక ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య అధికంగా ఉంది. దీనిని అధిగమించడానికి కార్యచరణ రూపొందిస్తున్నాం. మైసూర్కు దీటుగా విజయనగరం జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణాన్ని మైసూర్ నగరానికి దీటుగా తయారు చేస్తాం. అది కూడా అతి తక్కువ కాలంలోనే చేసి చూపిస్తాం. పెద్ద చెరువు శుద్ధి కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రజల్లో ఊహించిన దానికంటే ఎక్కువగానే చెరువు విషయంలో సెంటిమెంట్ ఉంది. గూడ్స్షెడ్ రోడ్డును ఎక్కడా లేని విధంగా పచ్చదనంతో సుందరీకరించేందుకు రైల్వే శాఖ అధికారులతో సంప్రదిస్తున్నాం. పట్టణంలో కొన్ని ప్రధాన కూడళ్లలో ‘మన విజయనగరం’ పేరుతో ఐలాండ్స్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ప్రజా ప్రతినిధులతో కూడా సంప్రదించి వాటిని త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు పార్కింగ్ ప్రదేశాలను గుర్తించాలని అధికారులను ఆదేశించాం. గిరిజనాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. ముఖ్యంగా గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వారికి జీవనోపాధి కల్పించేలా చర్యలు చేపడుతున్నాం. ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్తో ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నాం. విశాఖ జిల్లా అరకు, పాడేరు ప్రాంతాల్లో ఉన్నట్లుగానే మన జిల్లాలోనూ కాఫీ తోటల పెంపకానికి అనుకూల ప్రాంతం, వాతావరణం ఉందని గుర్తించాం. గిరిజనులతో కాఫీ తోటల పెంపకాన్ని మొదలుపెట్టించేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నాం. ఏడాది తిరిగేసరికి జిల్లాను అన్ని రంగాల్లోనూ, అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కొత్త ప్రభుత్వం ద్వారా అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. -
ఆన్లైన్ లావాదేవీలపై దృష్టి పెట్టండి
కలెక్టర్ సుజాతశర్మ ఆదేశం ఒంగోలు టౌన్: జిల్లాలో ఆన్లైన్ లావాదేవీలను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో మొబైల్ బ్యాంకింగ్ సేవలు, మొబైల్ యాప్ అంశాలపై ఎల్డీఎం, డీఆర్డీఏ, డ్వామా, మెప్మా అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. డీఆర్డీఏ ద్వారా పొందుతున్న సామాజిక పింఛన్లు, డ్వామా ద్వారా ఉపాధి హామీ పథకం నుంచి కూలీలు పొందుతున్న నగదు.. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అనుసంధానం చేయాలని ఆదేశించారు. అలాగే డ్వామాలో 2లక్షల 60వేల ఖాతాలను కూడా అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. ఉపాధి హామీ పథకం కింద వేతనం పొందుతున్న వారి బ్యాంకు ఖాతాలన్నింటినీ ఆధార్తో లింక్ చేయాలని, పోస్టాఫీసుల్లోని ఖాతాలను బ్యాంకు ఖాతాలుగా మార్చాలని సూచించారు. జిల్లాలో జన్ధన్ యోజన పథకం కింద తెరచిన ఖాతాలు ఎన్ని ఉపయోగంలో ఉన్నాయి, ఎన్ని ఉపయోగంలో లేవో గుర్తించి వివరాలను ఎల్డీఎంకు అందించాలని తెలిపారు. ఎల్డీఎం ద్వారా బ్యాంకు కంట్రోలింగ్ అధికారులకు పంపి యాక్టివేట్ చేయించాలన్నారు. బ్యాంకుల వద్ద ఇంకా రూపే కార్డులు అందించకపోతే వివరాలు తెలుసుకొని లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతాల నంబర్లు, ఆధార్ నంబర్లతో పాటు బ్యాంకు బాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్ కూడా తీసుకోవాలని సూచించారు. యూప్లపై అవగాహన పెంచాలి జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం. హరిజవహర్లాల్ మాట్లాడుతూ మొబైల్ బ్యాంకిం సేవల వినియోగం, మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానాలపై ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సూచించారు. సమావేశంలో ఎల్డీఎం నరసింహారావు, డీఆర్డీఏ పీడీ మురళి, డ్వామా పీడీ పోలప్ప, మెప్మా పీడీ అన్నపూర్ణ, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, ఎన్ఐసీ డీఐఓ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మొబైల్ బ్యాంకింగ్ సేవలు, మొబైల్ యాప్ డౌన్లోడ్ వినియోగం గురించి ఆంధ్రాబ్యాంకు ఐటీ ఆఫీసర్ శేఖర్, ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ నళినికాంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా 50వేల రూపాయల వరకు లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉందని వివరించారు. సాధారణ మొబైల్ సెల్ ద్వారా రూ. 5వేల వరకు లావాదేవీలు జరుపుకోవచ్చని తెలిపారు. స్టేట్ బ్యాంకు బడ్డీ అనే యాప్పై డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని వివరించారు.