major earthquake
-
మృత్యువుతో 108 గంటల పోరాటం
బ్యాంకాక్: భారీ భూకంపం మయన్మార్ను అతలాకుతలం చేసింది. వేలాది మంది మరణించారు. మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. వందలాదిగా భారీ భవనాలు, వంతెనలు, రహదారులు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా విధ్వంసమే కనిపిస్తోంది. శిథిలాల నుంచి తవ్వినకొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. అదృష్టవశాత్తూ కొందరు ప్రాణాలతో మిగిలి ఉంటున్నారు. హోటల్లో కార్మికుడిగా పని చేస్తున్న 26 ఏళ్ల నాయింగ్ లిన్ టున్ అదృష్టం కూడా బాగున్నట్లుంది. 108 గంటలపాటు మృత్యువుతో పోరాడి ఎట్టకేలకు ప్రాణాలతో బయటకు వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున రెస్క్యూ సిబ్బంది అతడిని కాపాడారు. ఇందుకోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. నాయింగ్ లిన్ టున్ మయన్మార్ రాజధాని నేపడాలోని క్యాపిటల్ సిటీ హోటల్లో పని చేస్తున్నాడు. గత శుక్రవారం సంభవించిన భూకంపం ధాటికి ఈ హోటల్ కుప్పకూలింది. శిథిలాలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఇక్కడ గత ఐదు రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల్లో కేవలం మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. శిథిలాల కింద ఎవరైనా బతికి ఉండొచ్చన్న అంచనాతో ఎండోస్కోపిక్ కెమెరాతో గాలించారు. శిథిలాల కింద చిక్కుకున్న నాయింగ్ లిన్ టున్ ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు. యంత్రాల సాయంతో కాంక్రీట్ దిమ్మెలకు భారీ రంధ్రం చేసి అతడిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్ పూర్తికావడానికి 9 గంటలకు పైగా సమయం పట్టింది. ఆహారం, నీరు లేక పూర్తిగా నీరసించిపోయినప్పటికీ స్పృహలోనే ఉన్న నాయింగ్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు ప్రకటించారు. 3,000 దాటిన మృతుల సంఖ్య ఇదిలా ఉండగా, మయన్మార్ భూకంపంలో మృతుల సంఖ్య 3,000కు చేరుకున్నట్లు స్థానిక మీడియా ప్రకటించింది. మరో 4,639 మంది గాయపడ్డారని తెలియజేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు బ్యాంకాక్లో భూకంపం మృతుల సంఖ్య 22కు చేరుకుంది. 34 మంది క్షతగాత్రులయ్యారు. బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న భారీ భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇక్కడ బుధవారం మరో మృతదేహాన్ని వెలికితీశారు. భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన మయన్మార్కు మానవతా సాయం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఆ్రస్టేలియా ప్రభుత్వం ఇప్పటికే 1.25 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించగా, అదనంగా మరో 4.5 మిలియన్ డాలర్లు అందజేస్తామని బుధవారం ప్రకటించారు. సహాయక చర్యల కోసం భారత ప్రభుత్వం 200 మందిని పంపించింది. చైనా 270 మందిని, రష్యా 212 మందిని, యూఏఈ 122 మందిని పంపించాయి. మయన్మార్లో ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా నిర్ధారించలేదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, సెల్ఫోన్ సేవలను ఇంకా పునరుద్ధరించలేదు. రోడ్లు చాలావరకు దెబ్బతినడంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకోలేకపోతున్నాయి. మాండలే నగరానికి 65 కిలోమీటర్ల దూరంలోని సింగు టౌన్షిప్లో ఓ బంగారు గని భూకంపం వల్ల కుప్పకూలడంతో అందులో ఉన్న 27 మంది కార్మికులు మృత్యువాత పడినట్లు తాజాగా వెల్లడయ్యింది. -
పేక మేడల్లా కుప్పకూలాయి
భారీ భూకంపం థాయ్లాండ్, మయన్మార్లను అతలాకుతలం చేసింది. 7.7 తీవ్రతతో మయన్మార్లో సంభవించిన ప్రకంపనల ధాటికి ఇరు దేశాల్లో అపార ఆస్తి నష్టం సంభవించింది. భారీ భవనాలు కుప్పకూలాయి. నిర్మాణాలన్నీ పగుళ్లిచ్చాయి. మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విధ్వంస తీవ్రత దృష్ట్యా ప్రాణ నష్టమూ భారీగానే ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇప్పటిదాకా మయన్మార్లో 180 మందికి పైగా మరణించగా 750 మందికి పైగా గాయపడ్డారు. బ్యాంకాక్లో 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్లో సహాయక, పునరావాస చర్యలు సవాలుగా మారాయి. బ్యాంకాక్/కోల్కతా: ప్రకృతి ప్రకోపానికి థాయ్లాండ్, మయన్మార్ చిగురుటాకుల్లా వణికిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇరు దేశాల్లోనూ భారీ విధ్వంసం మిగిల్చింది. కాసేపటికే 6.4 తీవ్రతతో మరోసారి భూమి కంపించగా తర్వాత కూడా మరో నాలుగైదు ప్రకంపనాలు వణికించాయి. భారీ భవనాలు కళ్లముందే పేకమేడల్లా కుప్పకూలాయి. పురాతన బ్రిడ్జిలు నేలమట్టమయ్యాయి. మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. చాలాచోట్ల విద్యుత్ సరఫరా లైన్లు తదితరాలు దెబ్బతిన్నాయి. ఇరుదేశాల్లో ఇప్పటిదాకా 200 మందికి పైగా మరణించారు. మయన్మార్లోనే 180 మందికి పైగా మరణించారు. 750 మందికి పైగా గాయపడ్డారని సైనిక ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ సమాజం తక్షణం ఆదుకోవాలని కోరింది. భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా ఉంది. మయన్మార్ రాజధాని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి కుప్పకూలింది. అందులో అత్యధికులు మరణించి ఉంటారంటున్నారు. భూకంప కేంద్రాన్ని సెంట్రల్ మయన్మార్లో రెండో అతి పెద్ద నగరమైన మాండలేకు సమీపంలో మొన్య్వా సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. కేవలం 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించడంతో ప్రమాద తీవ్రత చాలా పెరిగింది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో భారీ భవనాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. చటూచాక్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భారీ భవంతి నేలమట్టమైంది. దానికింద కనీసం 90 మందికి పైగా చిక్కుకున్నట్టు తెలుస్తోంది. భూకంప తీవ్రతకు భవనాలు అటూ ఇటూ ఊగిపోతున్న దృశ్యాలు, అత్యంత ఎత్తైన ఓ భవనం తాలూకు పై అంతస్తులోని స్విమింగ్పూల్ నుంచి నీళ్లన్నీ కిందకు పడుతున్న వీడియోలు వైరల్గా మారాయి. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని భూకంపాలు తప్పకపోవచ్చన్న హెచ్చరికలు వణికిస్తున్నాయి. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్లో సహాయక, పునరావాస చర్యలు సవాలుగా మారాయి. ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. బ్యాంకాక్లోనూ ఎమర్జెన్సీ ప్రకటించారు. రెండేళ్ల క్రితం తుర్కియేలో 50 వేల మందికి పైగా భూకంపానికి బలవడం తెలిసిందే. ఆ తర్వాత అతి తీవ్ర భూకంపం ఇదే. మయన్మార్లో... సైనిక పాలనలో మగ్గుతున్న మయన్మార్లో 1946 తర్వాత ఇదే అతి తీవ్రమైన భూకంపం. నేపిడాలో రాజప్రసాదాలు, భవనాలు దెబ్బ తిన్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు చీలిపోయి కన్పిస్తున్నాయి. ఐకానిక్ వంతెన, ఆలయాలు తదితరాలు కుప్పకూలాయి. ఇప్పటిదాకా 90 మందికి పైగా మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రుల సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతోంది. చాలామందికి తీవ్ర గాయాలు కావడంతో రక్తానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మాండలేలో మసీదు కూలి 20 మంది మరణించారు. నగరానికి ఆగ్నేయాన సగాయింగ్ ప్రాంతంలో 90 ఏళ్ల నాటి బ్రిడ్జి కుప్పకూలింది. మా సో యానే బౌద్ధారామం కూడా నేలమట్టమైంది. మృతులు భారీగా పెరగవచ్చని సైనిక నియంత జనరల్ మిన్ ఆంగ్ లయాంగ్ చెప్పారు. థాయ్లాండ్లో... భూకంపం ధాటికి ఇళ్లు, కార్యాలయాల నుంచి జనం ఉన్నపళంగా పరిగెత్తుకొచ్చారు. భవనాలు కళ్లముందే కుప్పకూలుతుంటే నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. బ్యాంకాక్లోని 1.7 కోట్ల జనాభాలో అత్యధికులు భారీ అపార్ట్మెంట్లలోనే నివసిస్తారు. భూకంపం దెబ్బకు భయాందోళనలకు లోనై కార్లు, ఇతర వాహనాల్లో రోడ్లెక్కడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది. ర్యాపిడ్ ట్రాన్సిల్, సబ్వే వ్యవస్థలను తాత్కాలికంగా మూసేయడంతో భారీ జననష్టం తప్పింది. నగరం మొత్తాన్నీ ప్రమాద ప్రాంతంగా పేర్కొన్నారు. కుప్పకూలిన నిర్మాణంలోని భవన శిథిలాలు ఏ క్షణమైనా పూర్తిగా పడిపోయేలా కన్పిస్తున్నాయి. దాంతో శిథిలాల కింద చిక్కిన వారికోసం పోలీసు శునకాలతో వెదుకుతున్నారు. ఆ ప్రాంతాన్ని ప్రధాని షినవత్రా సందర్శించారు. భద్రత దృష్ట్యా ప్రతి భవనాన్నీ క్షుణ్నంగా తనిఖీ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అత్యవసర కేబినెట్ సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. బ్యాంకాక్లో 10 మందికి పైగా మరణించినట్టు ధ్రువీకరించారు. చాలా భవనాలకు పగుళ్లు రావడంతో లోనికి వెళ్లేందుకు జనం జంకుతున్నారు.హృదయ విదారకం మయన్మార్, థాయ్లాండ్ల్లో భూకంప దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. పలుచోట్ల కుప్పకూలిన భవనాలు, నిర్మాణాల కింద చిక్కినవారు హాహాకారాలు చేస్తున్నారు. శిథిలాల నడుమ తమవారి కోసం కన్నీటి మధ్యే జనం వెదుక్కుంటున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.అన్నివిధాలా సాయం: మోదీ న్యూఢిల్లీ: భూకంప విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘జరిగిన ఘోరం చూసి చలించిపోయా. బాధితుల క్షేమం కోసం ప్రారి్థస్తున్నా. థాయ్లాండ్, మయన్మార్లకు అన్నివిధాలా సాయం అందించేందుకు భారత్ పూర్తిగా సిద్ధంగా ఉంది’’ అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. రెండు దేశాలకూ భారత్ సహాయ తదితర సామగ్రి పంపుతోంది. థాయ్లాండ్లోని భారతీయుల కోసం బ్యాంకాక్లో భారత రాయబార కార్యాలయం హెల్ప్లైన్ (+66 618819218) ఏర్పాటు చేసింది. భూకంప మృతుల్లో భారతీయులెవరూ లేరని పేర్కొంది. బ్యాంకాక్లో ఏప్రిల్ 4న బిమ్స్టెక్ ప్రాంతీయ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భూటాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ అధినేతలు భేటీలో పాల్గొంటారు. కోల్కతా నుంచి ఈశాన్యం దాకా...భూకంపం తాలూకు ప్రకంపనలు భారత్లోనూ కన్పించాయి. కోల్కతాతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో శుక్రవారం మధ్యాహ్నం భూమి 2.5 తీవ్రతతో స్వల్పంగా కంపించింది. ఎక్కడా ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. వాయవ్య చైనాలోని యునాన్, సీచుయాన్ ప్రావిన్సుల్లో కూడా భారీ ప్రకంపనలు నమోదయ్యాయి. మాంగ్షీ తదితర నగరాల్లో భూకంప తీవ్రత హెచ్చుగా ఉంది. ఇల్లు, నిర్మాణాలు బాగా దెబ్బతిన్నాయి.బతుకుతామనుకోలేదుభూకంపం నుంచి ప్రాణాలతో బయట పడతామనుకోలేదు. మేమంతా ఆఫీసులో ఉండగా అలజడి రేగింది. భూకంపమంటూ అరుపులు విన్పించడంతో వెంటనే బయటికి పరుగెత్తుకెళ్లాం. నిర్మాణంలోని భారీ భవనాలు కూలిపోయాయి. ఇళ్లు పగుళ్లివ్వడంతో వాటిని ఖాళీ చేయించి జనాన్ని పార్కులు, ఖాళీ స్థలాల్లోకి పంపుతున్నారు. మేం యూనివర్సిటీ క్యాంపస్లో తలదాచుకున్నాం.– ‘సాక్షి’తో ఫోన్లో బ్యాంకాక్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధి రమేశ్చాలామంది చనిపోయారు బ్యాంకాక్లో ఇంతటి భూకంపం ఎన్నడూ చూడలేదు. 40, 50 అంతస్తులున్న నాలుగైదు భవనాలు కూలిపోయాయి. వాటిలోని చాలామంది చనిపోయే ఉంటారు. భారత పర్యాటకులు బస చేసే ప్రాంతాల్లో విధ్వంస తీవ్రత ఎక్కువగా ఉంది. తెలుగు వారందరినీ గ్రూపుల్లో అప్రమత్తం చేస్తున్నాం.– వెంకటేశ్ యాదవ్,బ్యాంకాక్లోని ఆంధ్రా రెస్టారెంట్ ఎండీ -
తైవాన్లో తీవ్ర భూకంపం
తైపీ: ద్వీప దేశం తైవాన్లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 8 గంటలకు చోటుచేసుకున్న భూప్రకంపనల వల్ల పలు భవనాలు ధ్వంసమయ్యాయి. 9 మంది మరణించారు. మరో 934 మంది క్షతగాత్రులుగా మారారు. ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై 7.2గా నమోదైనట్లు తైవాన్ భూకంప పర్యవేక్షక ఏజెన్సీ ప్రకటించగా, 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దేశావ్యాప్తంగా భూకంప ప్రభావం కనిపించింది. రాజధాని తైపీకి 150 కిలోమీటర్ల దూరంలో తైవాన్ తూర్పు తీరంలో ఉన్న హాలీన్ కౌంటీకి 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా దేశవ్యాప్తంగా రైలు సర్వీసులను రద్దు చేశారు. సెల్ఫోన్ సేవలు నిలిచిపోయాయి. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత ఎత్తివేశారు. దేశంలో గత 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపమని చెబుతున్నారు. భూప్రకంపనల వల్ల పునాదులు ధ్వంసం కావడంలో పలు భవనాలు 45 డిగ్రీల మేర పక్కకు ఒరిగిపోయిన దృశ్యాలు కనిపించాయి. బలహీనంగా ఉన్న పాత భవనాలు కూలిపోయాయి. పాఠశాలల నుంచి విద్యార్థులను బయటకు పంపించారు. భూకంపం సంభవించగానే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ధ్వంసమైన ఇళ్ల నుంచి వృద్ధులు, చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. భూకంపం, ఆ తర్వాత చోటుచేసుకున్న ప్రకంపనల కారణంగా 24 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 35 రోడ్లు, వంతెనలు, సొరంగాలు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. నేషనల్ పార్కులో ఓ బస్సులో ప్రయాణిస్తున్న 50 మందితో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే రెండు బొగ్గు గనుల్లో 70 మంది కార్మికులు చిక్కుకుపోయారని తెలిపారు. వారి ఆచూకీ కోసం ప్రయతి్నస్తున్నామని వివరించారు. జపాన్, చైనాలోనూ ప్రకంపనలు జపాన్ దక్షిణ ప్రాంతంలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. జపాన్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. యొనాగుని, ఇషికాగి, మియాకో దీవుల్లో సముద్రపు అలలు పోటెత్తాయి. బుధవారం మధ్యాహ్నం తర్వాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించారు. తైవాన్, చైనా మధ్య దూరం 160 కిలోమీటర్లు ఉంటుంది. బుధవారం చైనాలోని షాంఘైతోపాటు ఆగ్నేయ తీరంలోని పలు ప్రావిన్స్ల్లో సైతం భూప్రకంపనలు సంభవించాయని స్థానిక మీడియా తెలియజేసింది. భూ విలయాల గడ్డ తైవాన్ కంప్యూటర్ చిప్ల తయారీకి, అత్యాధునిక టెక్నాలజీకి పేరుగాంచిన తైవాన్లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉండడమే ఇందుకు కారణం. ఈ ప్రాంతంలో భూ అంతర్భాగంలో సర్దుబాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. హాలీన్ కౌంటీలో 2018లో తీవ్రమైన భూకంపం సంభవించింది. అప్పట్లో 17 మంది మరణించారు. 1999 సెపె్టంబర్ 21న తైవాన్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదైంది. ఈ భూవిలయం 2,400 మందిని బలితీసుకుంది. లక్ష మందికిపైగా గాయపడ్డారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపాల విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే యంత్రాంగం తైవాన్లో ఉంది. -
అఫ్ఘానిస్థాన్లో భారీ భూకంపం
-
ఆ రాష్ట్ర ప్రజలను వణికిస్తున్న అధ్యయనం
వాషింగ్టన్: జమ్మూకశ్మీర్ ను పెను భూకంపం చుట్టేయనుందనీ, లక్షల కొద్దీ ప్రజలను పొట్టనపొట్టుకునే ప్రమాదం పొంచి ఉందని తాజా అధ్యయనంలో తేలింది. హిమాలయ పర్వత శ్రేణుల భూఅంతర్భాగంలతో నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు తేలాయని పరిశోధకులు చెబుతున్నారు. రాష్ట్రాన్ని భారీ భూకంపం కుదిపేసే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రిక్టర్ స్కేల్ పై ఎనిమిది కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫలితంగా లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదముందని చెబుతున్నారు. అమెరికాకు చెందిన ఓరిగాన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు అధ్యయనంలో ఈ సంచలన విషయాలు తేలాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన యాన్ గావిల్లోట్ తెలిపారు. కశ్మీర్లోని రియాసి ఫాల్ట్ (ఆసియా, భారత్ ఫలకాలు కలిసే చోటు)లో జరుగుతున్న పరిణామాల వల్లే భారీ ప్రకంపనలు వస్తాయని వారు అంచనావేశారు. రియాసి ఫాల్ట్ కదలికలపై సుదీర్ఘ పరిశోధన అనంతరం తాము ఈ అంచనాలకు వచ్చామని పరిశోధకులు చెబుతున్నారు .గత 4,000 ఏళ్ల నుంచీ ఇక్కడ ఎలాంటి భారీ ప్రకంపనలు రాలేదని, ఫలితంగా విపరీతమైన ఒత్తిడి ఉండే అవకాశముందని తెలిపారు. అయితే ఇతర ఫలకాలు కలిసే చోట్లతో పోలిస్తే.. రియాసి ఫాల్ట్ అంత క్రియాశీలంగాలేదని వారు వెల్లడించారు. భూకంపం సంభవించే ప్రమాదం ఉందా లేదా అనే ప్రశ్నేలేదని కానీ ఎప్పుడు వస్తుందనేదే తమ ముందున్న ప్రధాన సవాల్ అని యాన్ గావిల్లోట్ వివరించారు. రియాసీ ఫాల్ట్ కి సమీపంలో చీనాబ్ నదిపై అనేక డ్యామ్లు , మరోవైపు డజన్ల కొద్దీ సొరంగాలు , వంతెనల గుండా వెళ్లే ముఖ్యమైన రైలు రోడ్లు ఉండడం మరింద ప్రమాదకర పరిణామమన్నారు. దీని మూలంగా , పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సమీపంలోని బాలకోట్ బాగ్ లో 2005 సం.రంలో సంభవించిన భూకంపం కంటే ఎక్కువ తీవ్రతతో ప్రమాదం ముంచుకు రానుందని నష్టం కూడా అంతే భారీ స్థాయిలోఉంటుందని ఆయన హెచ్చరించారు. -
కాలిఫోర్నియాకు పెను భూకంపం ముప్పు
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతానికి పెను భూకంపం వచ్చే ప్రమాదం బాగా పెరిగిందని, భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 8 అంతకంటే ఎక్కువ తీవ్రతతోనే వస్తుందని అమెరికా జియాలోజికల్ తాజా సర్వే వెల్లడించింది. తాజా గణాంకాలను తీసుకొని కొత్త పద్ధతిలో భూకంపం వచ్చే అవకాశాలను పరిశీలించగా రానున్న 30 ఏళ్ల కాలంలో 99 శాతం కాలిఫోర్నియాను పెను భూకంపం కుదిపేయనుందని తాజా నివేదికను రూపొందించిన వారిలో ఒకరైన సదరన్ కాలిఫోర్నియా ఎర్త్క్వేక్ సెంటర్ డైరెక్టర్ టామ్ జోర్డాన్ మంగళవారం తెలిపారు. భూకంపానికి కారణమయ్యే పసిఫిక్ ప్లేట్, ఉత్తర అమెరికా ప్లేట్లు కాలిఫోర్నియాలోనే కలుసుకుంటున్నాయని, అవి కలిసే చోట ఎగుడు, దిగుడుగావున్న ఖాళీ (ఫాల్ట్) ప్రాంతం సర్దుబాటయ్యే క్రమంలో భూకంపం రాకతప్పదని ఆయన వెల్లడించారు. ఈ రెండు ప్లేట్స్ కలుసుకునే చోటు శాన్ ఆండ్రియాస్ ప్రాంతంలో ఉండడం వల్ల దీన్ని ‘శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్‘గా శాస్త్రవేత్తలు వ్యవహరిస్తున్నారు. యూసీఈఆర్ఎఫ్-3’ (యూనిఫామ్ కాలిఫోర్నియా ఎర్త్క్వేక్ రప్చర్ ఫోర్కాస్ట్) పేరిట అమెరికా జియాలోజికల్ సర్వే తాజా నివేదికను విడుదల చేసింది. సీస్మాలోజి, జియాలోజీ, జియోడెసీ, పేలియోసీస్మాలజీ, ఎర్త్క్వేక్ ఫిజిక్స్, ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ఎంతో మంది నిపుణుల పరిశీలించి ఆమోదించిన తర్వాతనే యూసీఈఆర్ఎఫ్-3 నివేదికను విడుదల చేశారు. 2008లో విడుదల చేసిన యూసీఈఆర్ఎఫ్ నివేదిక ప్రకారం అప్పటి నుంచి 40 ఏళ్ల కాలంలో 6.7 తీవ్రతతో పెను భూకంపం వచ్చే ప్రమాదం 4.7 శాతంగా ఉంది. ఇప్పుడు విడుదల చేసిన మూడవ నివేదిక ప్రకారం రానున్న 30 ఏళ్ల కాలంలో (ఎప్పుడైనా) 8, అంతకన్నా ఎక్కువ తీవ్రతతో పెను భూకంపం వచ్చే ముప్పు శాస్త్రీయంగా ఏడు శాతం ఉంది. ఏడు శాతం అంటే దాదాపు 99 శాతం భూకంపం వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 1906, ఏప్రిల్ 18వ తేదీ ఆదయం 5.12 గంటలకు అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు మూడు వేల మంది మరణించారు. ఆ భూకంపానికి దాదాపు 80 శాతం శాన్ఫ్రాన్సిస్కో తుడిచిపెట్టుకు పోయింది. అమెరికా చరిత్రలోనే ఇప్పటి వరకు అంతటి పెను భూకంపం రాలేదు. కానీ కాలిఫోర్నియా ప్రాంతంలో రానున్న భూకంపం మాత్రం అంతగా ఊహించనంత తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి నుంచి అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. నేపాల్ రాజధాని కఠ్మాండును పెను భూకంపం కుదిపేయబోతోందని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. నెల రోజుల క్రితం కూడా హెచ్చరించారు. ఇన్ని రోజుల్లోగా లేదా ఇన్ని రోజుల మధ్య వస్తుందని వారు తేల్చి చెప్పలేక పోవడం వల్లనే నేడు అక్కడ అపార నష్టం చోటుచేసుకుంది.