Malayalam films
-
జూన్ 1 నుంచి మలయాళ చిత్రాల షూటింగ్ బంద్
‘‘మలయాళ చిత్రపరిశ్రమ(Malayalam film industry) తీవ్ర సంక్షోభంలో ఉంది... ఇలానే కొనసాగితే పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది’’ అంటూ మాలీవుడ్ చిత్రసీమకు చెందిన పలు శాఖలు ఆందోళన చెందుతున్నాయి. ఈ మేరకు కొన్ని మార్పులు చేయకపోతే... జూన్ 1 నుంచి సంపూర్ణంగా షూటింగ్స్, అలానే సినిమాలకు సంబంధించిన ఇతర కార్యకలాపాలను నిలిపివేయాలని, చివరికి సినిమాల ప్రదర్శనలను కూడా ఆపాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకొచ్చాయి.కేరళ చిత్ర నిర్మాతల మండలి, కేరళ చిత్ర పంపిణీదారుల సంఘం, కేరళ చలన చిత్ర కార్మికుల సమాఖ్య, కేరళ సినిమా ఎగ్జిబిటర్ల సంఘం... ఇవన్నీ కలిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందరూ కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మలయాళ అగ్రనిర్మాత, కథానాయిక కీర్తీ సురేష్ తండ్రి సురేష్కుమార్(Suresh Kumar) ప్రకటించారు.60 శాతం పారితోషికాలకే... ‘‘సినిమా పరిశ్రమ 30 శాతం పన్ను కడుతోంది. ఇలా 30 శాతం పన్ను విధింపబడుతున్న ఇండస్ట్రీ ఏదీ లేదు. ఈ 30 శాతంలో జీఎస్టీ కాకుండా అదనంగా వినోదపు పన్ను కూడా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని పన్ను రద్దు చేయాలి. అలాగే ఇండస్ట్రీపరంగా నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికాలు బాగా పెరిగిపోయాయి.వాటిని తగ్గించాలి. సినిమాకి అవుతున్న బడ్జెట్లో 60 శాతం యాక్టర్ల పారితోషికాలకే కేటాయిస్తున్న పరిస్థితుల్లో నిర్మాతలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇది మాత్రమే కాకుండా కొత్తగా వస్తున్న యాక్టర్లు, డైరెక్టర్లు కూడా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కారణాల వల్ల సినిమా నిర్మాణం అనేది లాభదాయకంగా లేదు’’ అని సురేష్కుమార్ పేర్కొన్నారు.50 రోజుల్లో పూర్తి చేయకుండా... ఇంకా సినిమా నిర్మాణానికి అవుతున్న సమయం గురించి పేర్కొంటూ... ‘‘50 రోజుల్లోనే పూర్తి చేయడానికి వీలున్న సినిమాలకు కూడా 150 రోజులు చేస్తున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపో తోంది. ఇలా తక్కువ రోజుల్లో పూర్తి చేయలేకపోవడంతో నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను తీవ్రతరం చేస్తోంది’’ అన్నారు. 176 చిత్రాలు... అపజయంపాలు... బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ సినిమా పరిశ్రమని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాయని చెబుతూ – ‘‘2024లో విడుదలైన చిత్రాల్లో 176 చిత్రాలు వసూళ్లపరంగా నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది ఒక్క జనవరిలోనే రూ. 101 కోట్లు నష్టం వాటిల్లింది. ఈ నష్టం సినిమా కోసం తెరవెనుక పని చేస్తున్న నిపుణుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది’’ అని పేర్కొన్నారు సురేష్కుమార్. ఇక తాజాగా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో పన్ను తగ్గింపు లేదా ఎత్తివేతను కోరుతూ మలయాళ చిత్రసీమకు చెందిన కీలక శాఖల అధ్యక్షులు త్వరలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ని, ఇతర సంబంధిత మంత్రులను కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. నటీనటుల పారితోషికం తగ్గింపు, తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయడం... వంటి విషయాల్లో సరైన పరిష్కారం లభించకపోతే జూన్ 1 నుంచి షూటింగ్స్, సినిమాకి సంబంధించిన ఇతర కార్యకలాపాలు నిలిపివేయడం ఖాయం అని బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మరి... మలయాళ చిత్రాల షూటింగ్స్ ఆగుతాయా? చర్చలు సజావుగా జరిగి, పరిష్కార మార్గం వెతుక్కుని షూటింగ్స్ చేస్తారా? అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. -
ప్రముఖ నటుడు కన్నుమూత
ప్రముఖ మలయాళం నటుడు కొల్లం అజిత్ కన్నుమూశారు. ఆయన 500లకుపైగా సినిమాల్లో నటించారు. కడుపు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న కొల్లం అజిత్ గత కొన్నిరోజులుగా కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1983లో పరన్ను పరన్ను పరన్ను సినిమాతో ఆరంగేట్రం చేసిన కొల్లం అజిత్.. చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించారు. కొన్ని సినిమాల్లో సహాయక పాత్రల్లో కనిపించారు. 1989లో విడుదలైన అగ్నిప్రవేశం సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. యువజనోత్సవం, నడోడికట్టు, నంబర్ 20 మద్రాస్ మెయిల్, నిర్ణయం, ఆరం థంపురన్, ఒలింపియన్ ఆంతోనీ యాడం, వల్లీత్తన్ తదితర సినిమాల్లో మంచి నటన కనబరిచి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. మలయాళంతోపాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ ఆయన నటించారు. కాలింగ్ బెల్, పకల్ పోలె వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా ఆయన 2012లో ఇవాన్ అర్ధనారి సినిమాలో కనిపించారు. ఆయనకు భార్య ప్రమీల, కూతురు గాయత్రి, కొడుకు శ్రీహరి ఉన్నారు. -
మరో స్టార్ వారసుడొస్తున్నాడు!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన కొడుకు ప్రణవ్ను హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్నాడు. మలయాళ చిత్ర పరిశ్రమకే చెందిన మరో స్టార్ హీరో మమ్ముట్టి తన కుమారుడు సల్మాన్ను వెండితెరపై పరిచయం చేసిన తరహాలో మోహన్ లాల్ కూడా తన కొడుకును గ్రాండ్గా తీసుకురావాలనుకుంటున్నట్టు సన్నిహితులు చెప్పారు. ప్రణవ్ కోసం మోహన్ లాల్ స్క్రిప్టులు వింటున్నట్టు సమాచారం. కాగా ప్రణవ్ ఇదివరకే బాలనటుడిగా నటించాడు. 2002 కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ బాలనటుడిగా అవార్డు అందుకున్నాడు. ఇక ప్రణవ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. లైఫ్ ఆఫ్ జోసుట్టి సినిమాకు దర్శకుడు జీతు జోసెఫ్ దగ్గర అసిస్టెంట్గా చేశాడు. సల్మాన్ 26 ఏళ్ల వయసులో హీరోగా పరిచయమయ్యాడు. ఇప్పుడు ప్రణవ్ వయసు కూడా 26 ఏళ్లే. ప్రణవ్పై అంచనాలు భారీగా ఉంటాయని, దీనికి తగినట్టుగా ప్రాజెక్టు ప్లాన్ చేయాలని మోహన్ లాల్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. -
'మలయాళీ' డామినేషన్ తగ్గిపోయిందా?
తిరువనంతపురం: ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ.. కథాబలమున్న చిత్రాలు తీసే మలయాళీ చిత్ర పరిశ్రమ ప్రభ ఈ మధ్య కాలంలో తగ్గిపోతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు జాతీయ అవార్డులంటే మలయాళ సినిమానే గుర్తుకొచ్చేది. ప్రధాన పురస్కారాల్లో ఎక్కువభాగం మలయాళ చిత్రాలకే దక్కేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైనట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది కేవలం నాలుగు పురస్కారాలు మాత్రమే దక్కాయి. 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో మలయాళ చిత్రాలు అంతంతమాత్రం గుర్తింపును మాత్రమే తెచ్చుకున్నాయి. ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ బాల నటుడు, ఫీచర్ సినిమాల కేటగిరీల్లో ప్రత్యేక ప్రస్తావనలు తప్ప ఈ ఏడాది చెప్పుకోదగ్గ అవార్డులు లభించలేదు. 'ఎన్ను నింతే మొదీన్' చిత్రంలో 'కథుయిరున్నే కథుయిరున్నే' పాటకు సంగీతమందించినందుకు ఎం జయచంద్రన్ కు ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు లభించింది. 'బెన్' చిత్రంలో అద్భుతమైన భావోద్వేగాలు పండించిన పదేళ్ల బాలుడి పాత్ర పోషించినందుకు గౌరవ్ మీనన్ కు ఉత్తమ బాలనటుడి అవార్డు దక్కింది. 'లక్క చుప్పి', 'సు.. సు.. సుధి వథ్మీకం' సినిమాల్లో నటనకుగాను నటుడు జయసూర్య స్పెషల్ మెన్షన్కు నామినేట్ అయ్యారు. పర్యావరణం మీద తీసిన ఉత్తమ చిత్రంగా 'వలియా చిరాకుల్ల పక్షికల్' (పెద్ద రెక్కల పక్షి) నిలిచింది. నాన్ ఫీచర్ సెక్షన్ 'అమ్మ' సినిమా దర్శకుడు నీలన్ కూడా స్పెషల్ మెన్షన్కు నామినేట్ అయ్యారు. ఇక ఉత్తమ షార్ట్ ఫిలింగా మలయాళ చిత్రం 'కముకి' నిలిచింది. గత ఏడాది కూడా జాతీయ పురస్కారాల్లో మలయాళ చిత్రసీమకు పెద్దగా పురస్కారాలు లభించలేదు. కేవలం నాలుగు పురస్కారాలతోనే సరిపెట్టుకుంది. ఇప్పుడు కూడా పెద్దగా ప్రధాన పురస్కారాలు రాకపోవడంపై పరిశ్రమ వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. ప్రయోగాలు, కథాబలమున్న చిత్రాల సంఖ్య తగ్గిపోవడమే జాతీయ చలనచిత్రాల్లో మలయాళ ప్రభ తగ్గిపోవడానికి కారణమని పలువురు భావిస్తున్నారు.