Marine Le Pen
-
నిధుల మళ్లింపు కేసులో దోషిగా తేలిన పెన్
పారిస్: ఫ్రాన్స్ నేషనల్ ర్యాలీ పార్టీ అగ్రనేత మెరీన్ లీ పెన్(56)కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక అవకతవకల కేసులో పారిస్ న్యాయస్థానం ఆమెను దోషిగా నిర్ధారించింది. ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తూ సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కోర్టు తీర్పు పూర్తిగా వెలువడకముందే లీ పెన్ కోర్టు గది నుంచి బయటకు వెళ్లిపోయారు. కరుడుగట్టిన అతివాద నాయకురాలిగా గుర్తింపు పొందిన మెరీన్ లీ పెన్ 2027లో జరిగే ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ప్రతికూలంగా తీర్పు రావడం శరాఘాతంగా మారింది. అయితే ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ ఆమెకు ఉపశమనం దక్కే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరుగనున్నాయి. ఆలోగా పై కోర్టులో విచారణ జరగడం, తీర్పు రావడం కష్టమేనని అంటున్నారు. యూరోపియన్ యూనియన్ నిధులను దుర్వినియోగం చేసినట్లు లీ పెన్పై ఆరోపణలు వచ్చాయి. 2004 నుంచి 2016 మధ్య సుమారు 33 లక్షల డాలర్లను సొంత పార్టీకి మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో లీ పెన్తోపాటు మరో 12 మందిని సైతం న్యాయస్థానం దోషులుగా గుర్తించింది. లీ పెన్ గతంలో మూడుసార్లు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడ్డారు. 2022లో ఎమ్మానుయేల్ మేక్రాన్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
ఉత్కంఠగా ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు
ప్యారిస్: కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఫ్రాన్స్ ప్రజలు ఆదివారం మొదటి రౌండ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... వీరిలో నేషనల్ ఫ్రంట్కు చెందిన మరీన్ లె పెన్, ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఎమ్మాన్యుయేల్ మాక్రన్ల మధ్య ప్రధాన పోటీ ఉండవచ్చని సర్వేలు తేల్చిచెప్పాయి. అలాగే కన్జర్వేటివ్ ఫిలన్, మెలన్కొన్లు గట్టి పోటీ ఇస్తున్నారు. మొదటి రౌండ్ ఎన్నికల్లో ఎవరికీ 50 శాతం ఓట్లు రాకపోతే.. మే 7న రెండో రౌండ్ ఎన్నిక నిర్వహిస్తారు. మొదటి రౌండ్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారు రెండో రౌండ్లో పోటీపడతారు. ఉగ్రవాద దాడులు జరగవచ్చన్న ముందస్తు సమాచారంతో దేశవ్యాప్తంగా భారీ భ్రదతా ఏర్పాటు చేశారు. 66 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 50 వేల మంది పోలీసుల్ని, ఇతర భద్రతా సిబ్బందిని మోహరించారు. మూడ్రోజుల క్రితం ప్యారిస్లో ఉగ్రదాడి నేపథ్యంలో 7 వేల మంది సైనికులతో పహారా నిర్వహించారు.