Max Cure Hospitals
-
విస్తరణ బాటలో.. మ్యాక్స్క్యూర్ హాస్పిటల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న మ్యాక్స్క్యూర్ హాస్పిటల్స్ విస్తరణ చర్యలు చేపట్టింది. మహారాష్ట్రలోని నాసిక్లో 11వ ఆసుపత్రిని 350 పడకల సామర్థ్యంతో నెలకొల్పింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని ఈ నెల 24న ఆరంభిస్తారు. అశోక గ్రూప్తో కలిసి ఈ సెంటర్ను అందుబాటులోకి తెస్తున్నట్లు మ్యాక్స్క్యూర్ ఎండీ జి.అనిల్ కృష్ణ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. మెడికవర్ బ్రాండ్తో రానున్న ఈ ఆసుపత్రికి స్థలం, మౌలిక వసతులను అశోక గ్రూప్ సమకూరుస్తోంది. వైద్య పరికరాల ఏర్పాటు, ఆసుపత్రి నిర్వహణను మ్యాక్స్క్యూర్ చేపడుతుంది. మరో 1,000 పడకలు.. మ్యాక్స్క్యూర్ గ్రూప్లో మ్యాక్స్క్యూర్, మై క్యూర్, సింహపురి, మెడికవర్ బ్రాండ్లలో హైదరాబాద్, వైజాగ్, కర్నూలు, కరీంనగర్, నిజామాబాద్, నెల్లూరు, సంగారెడ్డిలో ఆసుపత్రులున్నాయి. నాసిక్తో కలిపి మొత్తం పడకల సామర్థ్యం 2,000కు చేరుకుంది. ఏడాదిలో మరో 600 పడకలు జతకూడతాయని అనిల్ కృష్ణ చెప్పారు. ‘‘ముంబై, పుణే నగరంతోపాటు కర్ణాటకలోనూ విస్తరిస్తాం. పాత ఆసుపత్రుల కొనుగోలు లేదా కొత్తవి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. 2020 నాటికి 3,000 పడకల సామర్థ్యానికి చేరుకుని టాప్–5 వైద్య సంస్థల్లో ఒకటిగా నిలుస్తాం’’ అంటూ భవిష్యత్తును ఆవిష్కరించారు. మ్యాక్స్క్యూర్ గ్రూప్ లో యూరప్కు చెందిన దిగ్గజ హెల్త్కేర్ సంస్థ మెడికవర్కు 42 శాతం వాటా ఉంది. కొత్త ఆసుపత్రులన్నీ మెడికవర్ బ్రాండ్తో రానున్నాయి. మూడు ప్రత్యేక సెంటర్లు.. క్యాన్సర్ కేర్కు మూడు ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పుతున్నట్టు మ్యాక్స్క్యూర్ గ్రూప్ సీఈవో పి.హరికృష్ణ చెప్పారు. ‘హైదరాబాద్, నెల్లూరు, కర్నూలులో ఇవి వస్తాయి. వీటికి రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.450 కోట్ల టర్నోవర్ నమోదు చేశాం. 2018–19లో రూ.600 కోట్లు ఆశిస్తున్నాం. వైద్యులు, సిబ్బందితో కలిపి మొత్తం 5,800 మంది ఉద్యోగులున్నారు. 2020–21 నాటికి రూ.1,000 కోట్ల టర్నోవర్కు చేరుకోవాలన్నది టార్గెట్. ఆ సమయానికి ఉద్యోగుల సంఖ్య 9,000 దాటుతుంది’ అని వివరించారు. -
మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్స్ విస్తరణ..
♦ డిసెంబర్కల్లా మరో మూడు కేంద్రాలు ♦ 1,750 పడకలకు చేరనున్న సామర్థ్యం ♦ సాక్షితో సంస్థ సీఈవో హరికృష్ణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వైద్య సేవల రంగంలో ఉన్న మ్యాక్స్క్యూర్ హాస్పిటల్స్ విస్తరణ బాటపట్టింది. కర్నూలులో 200 పడకల కేంద్రాన్ని రూ.35 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. అలాగే వైజాగ్లో ఒక్కొక్కటి 100 పడకల సామర్థ్యం గల రెండు ఆసుపత్రులను రూ.22 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.10 కోట్లు వెచ్చించి ఈ రెండు ఆసుపత్రులను ఆధునీకరిస్తోంది. డిసెంబర్కల్లా మూడు ఆసుపత్రుల్లోనూ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని మ్యాక్స్క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈవో పి.హరికృష్ణ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. మాదాపూర్లో ఉన్న ఒక ఆసుపత్రిని విస్తరిస్తున్నామని, తద్వారా మరో 50 పడకలు జతకూడతాయని చెప్పారు. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్లో మూడు, కరీంనగర్, నిజామాబాద్, నెల్లూరులో ఒక్కో హాస్పిటల్ ఉంది. వీటి పడకల సామర్థ్యం 1,300. విస్తరణతో మొత్తం సామర్థ్యం 1,750 పడకలకు చేరనుంది. వరంగల్లో ఆసుపత్రిని ఏర్పాటు చేసే అవకాశాన్ని సంస్థ పరిశీలిస్తోంది. హాస్పిటల్ చైన్స్తో చర్చలు.. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు పరిమితమైన మ్యాక్స్క్యూర్ ఇతర రాష్ట్రాల్లో అడుగు పెట్టాలని నిర్ణయించింది. మహారాష్ట్ర, గుజరాత్లో పలు ఆసుపత్రులను నిర్వహిస్తున్న రెండు సంస్థలతో చర్చిస్తోంది. చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నాయి. ఇవి సఫలమైతే మ్యాక్స్క్యూర్ ఖాతాలోకి మరో 15 ఆసుపత్రులు వచ్చి చేరతాయని హరికృష్ణ వెల్లడించారు. డీల్ పూర్తి కావడానికి రెండేళ్లు పట్టొచ్చని సూత్రప్రాయంగా చెప్పారు. ఇందుకు రూ.600 కోట్లు అవసరమవుతాయని అన్నారు. ఐపీవోకు వెళ్లడం ద్వారా నిధులు సమీకరిస్తామని పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాలతోపాటు తూర్పు ఆసియాలో విస్తరించాలన్నది సంస్థ లక్ష్యమని వివరించారు. ఇక మ్యాక్స్క్యూర్ ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 3,600 ఉంది. విస్తరణ పూర్తి అయితే ఈ సంఖ్య 5,000 దాటుతుందని సీఈవో చెప్పారు. 350 మందికిపైగా సూపర్ స్పెషలిస్టులు పనిచేస్తున్నారని చెప్పారు. ఏటా 5 లక్షల మందికి వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు.