military plane
-
భగ్నస్వప్న గాథ!
సైనిక విమానంలో చేతికి సంకెళ్లతో అమెరికా నుండి భారతీయులను బహిష్కరిస్తున్న చిత్రం మనలో చాలా మందిని తీవ్ర బాధలో ముంచెత్తింది. మెరుగైన జీవితాన్ని ఆశించిన మన తోటి పౌరులు, సోదర సోదరీమణులు ఇటువంటి అవమానకరమైన పరిస్థితులలో స్వదేశానికి తిరిగి రావడం వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు; తక్షణ, సమష్టి ప్రతిస్పందన అవసరమైన జాతీయ అవమానం.హై ప్రొఫైల్ సందర్శనలు, ఫోటో ఆప్లపై దృష్టి సారించే పర్సనాలిటీ ఆధారితమైన విదేశాంగ విధానం... విదేశాలలో చట్టపరమైన వివాదాలలో చిక్కుకున్న పౌరులను రక్షించడానికి అవసరమైన స్థిరమైన దౌత్యాన్ని పక్కనపెడుతుందనే విషయాన్ని మనం విస్మరించగలమా? నాటకీయ హావభావాలు దృశ్యపరంగా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, కష్టాల్లో ఉన్నవారికి కాన్సులర్ తక్షణ మద్దతు లభించేలా చూసుకోవడంలో రోజువారీ పనిని అవి నిర్లక్ష్యం చేయడానికి దారితీస్తున్నాయి. ప్రపంచంలో వివిధ దేశాలకు వలసవెళ్లిన భారతీయుల కార్యక్రమాలు వ్యక్తిగత బ్రాండింగ్ కోసం విలాసవంతంగా, లీడర్ కేంద్రంగా జరిగే ధోరణిని మనం చూశాం. అయినప్పటికీ, ఈ వలసపోయిన వారిలో అత్యంత దుర్బలమైన సభ్యులు నిర్బంధం, బహిష్కరణను ఎదుర్కొన్నప్పుడు లేదా జీవనోపాధిని కోల్పోయినప్పుడు... వారికి తగినంత ప్రభుత్వ సహాయం లేకుండా పోతోంది.ఈ నేపథ్యంలో మనం ఒక కలతపెట్టే ప్రశ్నను ఎదుర్కోవలసి వస్తుంది: మన ప్రజలు భారతదేశం నుండి వెళ్లిపోవడానికి ఎందుకు ఇంత తీవ్రమైన ప్రమాదాలను సైతం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? బలవంతంగా తిరిగి వచ్చిన ప్రతి వ్యక్తికీ లోతైన గాయం ఉంది – అది వ్యక్తులు నిరాశతో దేశం నుంచి వెళ్ళిపోయేలా చేసే వ్యవస్థాగత వైఫల్యాల కథ. అందరికీ సహాయం చేయడంలో లేదా దేశంలోని ప్రతి మూలలో ఆశను నింపడంలో మన సమాజ అసమర్థత... తమ ఇష్టానికి వ్యతిరేకంగా భారతదేశానికి తిరిగి వచ్చే వారి దృశ్యాలున్న వీడియోలలో బహిర్గతమవుతోంది. ఒకప్పుడు వారిని ప్రేరేపించిన స్వప్నాలు ఇప్పుడు బహిష్కరణతో భంగమయ్యాయి.దేశంలో నెలకొని ఉన్న నిర్మాణాత్మకమైన అసమానతలను, స్పష్టమైన ఆర్థిక పరిస్థితులను మనం విస్మరించలేము. ఇవి చాలా మంది భారతీయులను ప్రమాదకరమైన ప్రయాణాలను ఎంచుకోవడానికి ప్రేరేపించాయి. దీర్ఘకాలిక నిరుద్యోగం నుండి తక్కువ వేతనాల వరకు; గ్రామీణ దుఃస్థితి నుండి పట్టణ పేదరికం వరకు... ఎన్నో కారకాలు! ఇవి కేవలం దేశం నుంచి ‘బయటపడవేసే కారకాలు’ మాత్రమే కావు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థాగత నిర్లక్ష్యానికి సంకే తాలు! అయితే ప్రపంచ అసమానతలు మరిన్ని సమస్యలను పెంచుతాయనుకోండి. కానీ ప్రాథమిక సమస్య ఏమిటంటే మన సొంత ఇల్లు (భారత్) అస్తవ్యస్తంగానే ఉంది. భారతదేశంలో యువతీ యువకులకు ఎటువంటి ఆచరణీయమైన మార్గాలూ కనిపించనప్పుడు స్థిరమైన జీవనో పాధి, గౌరవప్రదమైన ఉపాధి లేకపోవడంతో... విదేశాల్లో ఉన్నప్పుడు వీసాలు గడువు ముగిసినా అక్కడే ఉండడానికి ప్రయత్నించడం లేదా సరైన డాక్యుమెంటేషన్ లేకుండా బయటి దేశాలలోకి ప్రవేశించడం... మెరుగైన భవిష్యత్తును పొందేందుకు ఏదైనా మార్గం కోసం ప్రయత్నించడం జరూర్ అవసరంగా మారుతుంది.ఇలాంటి సంక్షుభిత క్షణాల్లో, భారత ప్రభుత్వానికి తన పౌరులను ఎక్కడ ఉన్నా రక్షించాల్సిన రాజ్యాంగబద్ధమైన, నైతిక బాధ్యత ఉందని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభుత్వ బాధ్యత మన సరిహద్దుల వద్దే ముగియదు. బహిష్కరణ ప్రక్రియ గౌరవంగా జరుగుతోందని నిర్ధారించడానికి కాన్సులర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుత అవమా నకరమైన దృశ్యాలు ప్రభుత్వ ప్రమత్తతనే సూచిస్తోంది. ఇప్పుడు చాలా మంది భారతీయులు బహిష్కరణ చర్యలను ఎదుర్కొంటున్నందున, ఈ బాధాకరమైన ప్రక్రియలో తీవ్రమైన బలప్రయోగాన్ని, అవమానకరమైన పరిస్థితులను నివారించ డానికి మన అధికారులు చర్యలు తీసుకోవడం అత్యవసరం.భారత ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా, కేవల స్పందనాత్మకంగా ఉండకూడదు. అన్నింటి కంటే ముందు, బహిష్కృతుల సంఖ్య గురించి పారదర్శకత ఉండాలి. బహిష్కరణను ఎదుర్కొంటున్న వారికి చట్టపరమైన, ప్రయాణ పరమైన సహాయంతో సహా భారత కాన్సులేట్ సమగ్ర మద్దతును అందించాలి. చాలామంది బ్యాంకు ఖాతాలు, వాహనాలు, ఇతర ఆస్తులను వదిలివేసి వస్తున్నారు. వాటిని వారు అమెరికాలో ఇప్పటికీ చట్టబద్ధంగా కలిగి ఉన్నారు. భారతదేశం నుండి వీటిని అందుకోవడానికి, నిర్వహించడానికి వారికి సహాయం చేయాలి. వలసలో ఉన్నవారితో, పౌర సమాజంతో కలిసి పనిచేస్తూ, బహిష్క రణకు ముందే... లేదా బహిష్కరణ జరిగిన వెంటనే వారి ఆస్తిని రక్షించడంలో, వెనక్కు తీసుకురావడంలో భారతీయులకు మనం ముందస్తుగా మద్దతు ఇవ్వాలి. అలాంటి చర్యలు లేకుంటే, వ్యక్తులు మరింత ఆర్థిక నష్టానికి గురవుతారు. వారి కష్టాలు మరింత పెరుగుతాయి కూడా!సమీప భవిష్యత్తులో బహిష్కరించబడే వారిలో తోడు లేని మైనర్లు, గర్భిణులు, అత్యవసర వైద్యం లేదా మానసిక అవసరాలు ఉన్న ఇతరులు ఎవరైనా ఉండవచ్చు. ఈ బలవంతపు తొలగింపుల సమయంలో కుటుంబాలు, పిల్లలు, మహిళలు ఎదుర్కొనే చికిత్స గురించి ఆందోళన ఉంది. భారతదేశానికి తిరిగి వచ్చిన బహిష్కృతుల గతి ఏమిటి? వారిలో చాలామందికి ఎటువంటి భరోసా ఉండదు. కొందరికి తమ వలస కారణంగా పేరుకుపోయిన అప్పులు ఇక్కడ ఎదురవుతాయి. మరికొందరు విదేశా లలో స్థిరపడటంలో ‘విఫలమయ్యారు’ అనే ఎగతాళి మాటను ఎదుర్కోవలసి వస్తుంది. విదేశీ తీరాలపై ఆశలను పెట్టుకున్న వ్యక్తుల ‘విధి’ ఇప్పుడు మరింత ప్రమాదంలో ఉంది. మనలో అత్యంత దుర్బలమైన వారితో... అంటే తీవ్రమైన అవసరం కారణంగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లి, బాధతో తిరిగి వచ్చిన వారితో మనం ఎలా వ్యవహరిస్తాం అనే అంశంలో మన దేశ గౌరవం, నైతిక నిర్మాణం పరీక్షించబడతాయి. భారతదేశం నిజంగా ప్రపంచ శక్తిగా ఎదగాలని కోరుకుంటే, దాని పౌరులు అభివృద్ధి చెందడానికి దేశం నుండి పారిపోవాల్సిన అవసరం లేదని నిర్ధారించుకోవడం ద్వారా ప్రారంభించాలి. అంతర్గతమైన ఆర్థిక అసమానతలను ఎదుర్కోవాలంటే... మరింత సమ్మిళితమైన, గౌరవప్రదమైన మాతృభూమిని సృష్టించాలనే సమష్టి సంకల్పాన్ని చేసుకోవాలి. ఈ బహిష్కరణలు ఈ అవసరాన్నే డిమాండ్ చేస్తున్నాయి.మనోజ్ కుమార్ ఝా వ్యాసకర్త రాజ్యసభ సభ్యుడు (రాష్ట్రీయ జనతా దళ్) -
అమెరికా అమానుషత్వం
సహజ వనరులు పుష్కలంగా ఉన్న దేశాలపై కన్నేసి వాటిని నయానో భయానో ఒప్పించి అక్కడి ప్రాంతాలను దురాక్రమించాలని చూస్తున్న అమెరికా... పొట్టకూటి కోసం తనను ఆశ్రయించినవారి పట్ల మాత్రం అమానుషంగా, హేయంగా ప్రవర్తిస్తున్నదని రుజువైంది. సైనిక విమానంలో అమృత్ సర్ చేరుకున్నవారి కథనాలు వింటుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి, కూర్చోవటానికి కూడా అసౌకర్యంగా ఉండే సైనిక విమానంలో పశువుల్ని తరలించిన చందాన మనవారిని తీసుకొచ్చారు. ఇందులో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు కూడా ఉన్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. గత నెలలో కొలంబియా, మెక్సికో దేశాలవారిని ఈ పద్ధతిలోనే పంపటానికి ప్రయత్నించినప్పుడు వాటినుంచి నిరసన వ్యక్తమైంది. అమెరికా సైనిక విమానాలకు అనుమతినీయబోమన్నాయి. చివరకు కొలంబియా తలొగ్గినా మెక్సికో మాత్రం తమ విమానాన్ని పంపి వలసదారులను వెనక్కు తెచ్చుకుంది. బ్రెజిల్ సైతం తమవారిపట్ల అమానుషంగా వ్యవహరించటాన్ని ఖండించింది. భారతీయులకు జరిగిన అవమానంపై సహజంగానే పార్లమెంటులో గురువారం ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారిని గుర్తించి వెనక్కు పంపటం ఏ దేశంలోనైనా జరిగేదే. పార్లమెంటులో విదేశాంగమంత్రి జైశంకర్ చెప్పినట్టు అక్రమ వలసదారులను వెళ్లగొట్టడం కొత్తేమీ కాదు. ఏ దేశమూ అలాంటివారిని సమర్థించదు. అక్రమ వలసల్ని ప్రోత్సహించదు. కానీ వెనక్కు పంపే క్రమం మానవీయంగా, నాగరికంగా ఉండాలి. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి. చట్టబద్ధంగానో, చట్టవిరుద్ధంగానో తమ భాష, తమ ప్రాంతం కానివారు ప్రవేశిస్తే సహజంగానే స్థానికుల్లో అనేక సంశయాలు కలుగుతాయి. తెలియని భయాందోళనలుంటాయి. ప్రభుత్వాలకుండే ఇతరేతర అనుమానాలు సరేసరి. అమెరికాలో రిపబ్లికన్ల ఏలుబడివున్నా, డెమాక్రాట్ల ప్రభుత్వం నడిచినా అక్రమ వలసదారులను కనికరించింది లేదు. కాకపోతే ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో దాన్నొక బూచిగా చూపారు. శ్వేతజాతీయులు ఎదుర్కొంటున్న సకల సమస్యలకూ మూలం వలసదారులేనన్న భ్రమ కలగజేయటంలో, వారికి డెమాక్రటిక్ పార్టీ మద్దతునిస్తున్నదని నమ్మించడంలో విజయం సాధించారు. తాను అధికారంలోకొచ్చాక అలాంటి వారందరినీ గుర్తించి పంపేస్తానని పదే పదే చెప్పారు. ఆ ప్రచారం ఆయనకు గణనీయంగా వోట్లు రాల్చింది. కానీ తమది ప్రపంచంలోనే పురాతన ప్రజా స్వామ్య వ్యవస్థ అని స్వోత్కర్షకు పోయే దేశం వలసదారులను పశువులకన్నా హీనంగా పరిగణించటం, వారి కనీస మానవహక్కులను బేఖాతరు చేయటం సబబేనా? వలసదారులు తిరుగుబాటు చేయడానికి రాలేదు. వారి దగ్గర మారణాయుధాలుండవు. ఏజెంట్లను నమ్మి, వారికి లక్షలకు లక్షలు అర్పించుకుని నిజంగా అమెరికా చాన్సు వచ్చిందేమోనన్న భ్రమలో కొందరు నిర్భాగ్యులు విమానం ఎక్కుతారు. వారిని ఇటలీ, బ్రెజిల్, మెక్సికో, పెరూవంటి దేశాల్లో దించి ‘మీ చావు మీరు చావండ’ని గాలికొదిలేస్తారు. తమ దగ్గరున్న కాగితాలు నిజమైన వేనన్న భ్రమలో ఉన్న వలసదారులకు అప్పుడిక ఏం చేయాలో పాలుపోదు. చివరకు దేవుడిపై భారంవేసి ముందుకు పోవటానికే నిర్ణయించుకుని కొండలూ, గుట్టలూ, నదులూ దాటుకుంటూ తిండీతిప్పలూ లేక నీరసించి అమెరికా సరిహద్దులకు చేరుకుంటారు. అదృష్టం ఉంటే అక్కడి భద్రతా బలగాల కళ్లుగప్పి ఆ దేశంలోకి ప్రవేశిస్తారు. లేదా దొరికిపోయి జైళ్లపాలవుతారు. భ్రమ లన్నీ అడుగంటి, అక్కడ ఉండలేక, వెనక్కొచ్చే దారి దొరక్క జైళ్లలో మగ్గుతారు. సవ్యంగా పంపితే ‘బతుకు జీవుడా’ అనుకుంటూ అక్కడినుంచి నిష్క్రమించటానికే అత్యధికులు సిద్ధంగా ఉంటారు. అలాంటివారిపైనా ట్రంప్ ప్రతాపం! అప్పుడెప్పుడో వియత్నాం మొదలుకొని వర్తమానంలో గాజా వరకూ అమెరికా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేర్వేరు దేశాల్లో సాగించిన అకృత్యాల మాటేమిటి? వాటికి పడాల్సిన శిక్షేమిటి? ఏనాడైనా ఆత్మసమీక్ష చేసుకుందా? ఎడ్వర్డ్ స్నోడెన్, చెల్సియా మానింగ్ వంటివారు బట్టబయలు చేసిన రహస్య పత్రాలను ఒకసారి అమెరికా చదువుకుంటే మంచిది. అక్రమ వలసదారులను సమర్థించాలని ఎవరూ చెప్పరు. కానీ అమెరికా వ్యవహరించిన తీరును మన ప్రభుత్వం ఖండించాల్సిన అవసరం లేదా? గతంలో యూపీఏ హయాంలో అమెరి కాలో మన దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేపై వచ్చిన ఆరోపణలు ఆసరా చేసుకుని ఆమెకు సంకెళ్లు వేసి, వివస్త్రను చేసి తనిఖీ చేసినప్పుడు మన ప్రభుత్వం అప్పటి అమెరికా రాయబారి నాన్సీ పావెల్ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. భారత్లో పర్యటిస్తున్న అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల్ని కలుసుకునేందుకు మన నాయకులు నిరాకరించారు. అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బందికిచ్చే అనేక రాయితీలనూ, సౌకర్యాలనూ ఉపసంహరించారు. దౌత్యరంగంలో రెండు దేశాల మధ్యా విడ దీయరాని అనుబంధం ఉండి వుండొచ్చు. అది మనకు మిత్ర దేశమే కావొచ్చు. వలస దారులను సవ్యంగా పంపి వుంటే సమస్యే ఉత్పన్నమయ్యేది కాదు. కానీ జరిగింది అందుకు భిన్నం. ఈ విషయమై పార్లమెంటులో వ్యక్తమైన అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. తప్పును తప్పని చెప్పితీరాలి. వలసదారుల విషయంలో ఎలా వ్యవహరించాలో చెప్పే అంతర్జాతీయ ఒడంబడిక లున్నాయి. అగ్రరాజ్యమైనంత మాత్రాన వాటిని బేఖాతరు చేస్తానంటే కుదరదు. మున్ముందు ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకోకూడదనుకుంటే మన నిరసనను తెలియజేయటమే ఉత్తమం. -
చిలీలో విమానం గల్లంతు
శాంటియాగో : చిలీకి సంబంధించిన మిలటరీ విమానం ఒకటి సుమారు 38 మంది ప్రయాణీకులతో గల్లంతయ్యింది. దేశానికి దక్షిణాన ఉన్న ఓ స్థావరం నుంచి అంటార్కిటికా వెళ్లేందుకు టేకాఫ్ తీసుకున్న విమానం కూలిపోయి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. సోమవారం ఉదయం సుమారు 4.55 గంటలకు సీ–130 విమానం పుంటా ఎరీనా నుంచి టేకాఫ్ తీసుకుందని, 6.13 గంటలకు సంబంధాలు తెగిపోయాయని చిలీ వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో ఎమర్జెన్సీ పొజిషనింగ్ సిస్టమ్ అందుబాటులో ఉన్నప్పటికీ అది పనిచేస్తున్నట్లుగా లేదని వాయుసేన అధికారి ఎడ్యురాడో మోస్కూయిరా తెలిపారు. -
అమెరికాలో కూలిన సైనిక విమానం
16 మంది దుర్మరణం వాషింగ్టన్: అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రంలో సైనిక విమానం కూలిపోవడంతో 16 మంది సైనికులు మృతిచెందారు. సోమవారం సాయంత్రం మిసిసిపీలోని లీఫ్లోర్ కౌంటీలో 16 మందితో వెళ్తున్న కేసీ–130 అనే విమానం కుప్పకూలినట్లు అధికారులు ధ్రువీకరించారు. అందులో నుంచి ఎవరూ సజీవంగా బయటపడలేదని నిర్ధారించారు. విమానం ఉత్తర కరోలినాలోని చెర్రీ పాయింట్ మెరైన్ కార్ప్స్ నుంచి బయల్దేరిన తరువాత మిసిసిపీలో రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. ఎయిర్ రీఫుయెలింగ్ విమానం అయిన కేసీ–30 సైనికులతో పాటు సరుకులను కూడా రవాణాచేయగలదు. ఈ ఘటనపై విచారణ ప్రారంభమైంది. సైనిక విమానం కుప్పకూలిందన్న వార్త తనను కలచివేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. -
కుప్పకూలిన సైనిక విమానం, 22 మంది మృతి
క్విటో: దక్షిణ అమెరికా ఈక్వెడార్కు చెందిన ఓ సైనిక విమానం పాస్తజా ప్రావిన్స్ లో కుప్పకూలింది. షెల్ మీరా ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 22 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మంగళవారం సైనికుల నిర్వహిస్తున్నపారాచూట్ విన్యాసాలకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల్లో 19 మంది సైనికులు, ఇద్దరు వైమానిక సిబ్బంది, ఓ మెకానిక్ ఉన్నారు. పైలట్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అనుమతి కోరిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలినట్టు ఈక్వెడార్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అటు ఈ విమాన ప్రమాదాన్ని ఈక్వడార్ అధ్యక్షుడు రాఫెల్ కొరియా తన అధికారిక ట్విట్టర్ లో ధ్రువీకరించారు. ఏ రకం విమానమో, ప్రమాదం ఎలా సంభవించిందో పేర్కొనలేదు. అయితే ఈ ప్రమాదంలో అందరూ చనిపోయినట్టు వెల్లడించారు. -
రష్యన్ విమానం కూల్చివేత
-
రష్యన్ విమానం కూల్చివేత
అంకారా: టర్కీ సేనలు మంగళవారం సిరియా సరిహద్దులో ఓ సైనిక విమానాన్ని కూల్చివేశాయి. అది తమ దేశానికి చెందిన ఎస్యు-24 రకం యుద్ధ విమానమని రష్యా ఆ తర్వాత ప్రకటించింది. తొలుత అది ఏ దేశానికి చెందిన విమానమో తెలియరాలేదు. తర్వాత కొద్ది సేపటికి రష్యా.. ఆ విమానం తమదేనని తెలిపింది. యుద్ధ విమానం పైలట్ల పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియలేదని రష్యన్ అధికారిక వార్తాసంస్థ తొలుత తెలిపింది. అయితే, ఇద్దరు పైలట్లూ విమానం కూలిపోవడానికి ముందే పారాచూట్ల సాయంతో దూకేశారని, వాళ్లలో ఒకరిని సిరియన్ తిరుగుబాటుదారులు పట్టుకున్నారని తెలుస్తోంది. విమానం కూల్చివేత విషయాన్ని టర్కీ మీడియా వర్గాలు వెల్లడించాయి. అనుమతి లేకుండా సిరియా సరిహద్దు మీదుగా తుర్కామెన్ పర్వతం సమీపానికి రాగానే ఈ విమానాన్ని కూల్చి వేసినట్లు, ఆ సమయంలో దాని నుంచి ఓ ఫైర్ బాల్ కూడా పర్వతంపై పడినట్లు టర్కీ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ సంఘటనపై రష్యా గుర్రుగా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయని రష్యా హెచ్చరించింది. -
సైనిక విమానాన్ని కూల్చేసిన వేర్పాటువాదులు
ఉక్రెయిన్లో ఓ సైనిక రవాణా విమానాన్ని రష్యా అనుకూల వేర్పాటువాదులు కూల్చేశారు. దాంతో ఆ విమానంలో ఉన్న పలువురు మరణించారు. లుగాంస్క్ నగరం మీదుగా విమానం వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. పెద్ద కాలిబర్ ఉన్న మిషన్గన్తో ఉగ్రవాదులు ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపారని, దాంతో ఉక్రెయిన్ వైమానిక దళానికి చెందిన ఇల్యుషిన్-76 విమానం కూలిపోయిందని సైన్యం తెలిపింది. నాలుగు ఇంజన్లున్న ఈ జెట్ విమానంలో సైనిక బలగాలతో పాటు యుద్ధ పరికరాలు కూడా ఉన్నాయి. మరణించిన సైనికుల కుటుంబాలకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ నివాళులు అర్పించింది. అయితే, ఎంతమంది మరణించారన్న విషయం మాత్రం చెప్పలేదు.