Mobile phones manufacturer
-
యాపిల్ మొబైల్స్ అన్నీ భారత్లోనే తయారీ
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్లో ఉత్పత్తి చేయడం ప్రతి కంపెనీకి ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. తాము అమెరికాలో విక్రయించబోయే అధిక శాతం ఐఫోన్లు భారత్లో తయారైనవే ఉంటాయంటూ టెక్ దిగ్గజం యాపిల్ ప్రకటించడం ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు.‘రాబోయే రోజుల్లో తమ మొబైల్ ఫోన్లు అన్నింటినీ భారత్లోనే తయారు చేయాలని, సోర్సింగ్ చేయాలని యాపిల్ నిర్ణయించుకుంది. కాబట్టి భారత్లో ఇన్వెస్ట్ చేశారంటే విశ్వసనీయతను, సహజత్వాన్ని, అఫోర్డబిలిటీని (తక్కువ వ్యయాల ప్రయోజనాలు) ఎంచుకున్నట్లే’ అని భారత్ టెలికం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం దన్నుతో దేశీయంగా టెలికం పరికరాల మార్కెట్ అనెక రెట్లు వృద్ధి చెందిందని ఆయన తెలిపారు. రూ.4,000 కోట్ల పెట్టుబడులనేవి రూ.80,000 కోట్ల విక్రయాలకు, రూ.16,000 కోట్లు విలువ చేసే ఎగుమతులతో పాటు 25,000 ఉద్యోగాల కల్పనకు దోహదపడినట్లు సింధియా చెప్పారు.ఇదీ చదవండి: ఆపరేషన్ సిందూర్.. స్టాక్ మార్కెట్పై ప్రభావం ఎంత?జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే మెజారిటీ ఐఫోన్లు భారత్లో తయారైనవే ఉంటాయని టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇదివరకే ప్రకటించారు. ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్, ఎయిర్పాడ్స్ మొదలైనవి వియత్నాంలో తయారైనవి ఉంటాయని పేర్కొన్నారు. ఇతరత్రా దేశాల్లో విక్రయించే ఉత్పత్తులు మాత్రమే అత్యధికంగా చైనాలో తయారవుతాయని పేర్కొన్నారు. చైనా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అమెరికా భారీగా టారిఫ్లు ప్రకటించిన నేపథ్యంలో కుక్ వ్యాఖ్యలు ఇటీవల ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొంత మినహాయింపులున్నా, వివిధ టారిఫ్లను కలిపితే చైనా నుంచి ఎగుమతి చేసే తమ ఉత్పత్తులపై ఏకంగా 145 శాతం సుంకాలు వర్తిస్తాయని కుక్ తెలిపారు. -
ఇక ప్రత్యేక ‘సెల్ పాలసీ’!
* మొబైల్ ఫోన్ల తయారీకి ప్రత్యేక పార్కు * పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా విధానాలు * విధి విధానాలపై పరిశ్రమల విభాగం కసరత్తు సాక్షి, హైదరాబాద్: సెల్ఫోన్ తయారీ పరిశ్రమ రాష్ట్రంలో వేళ్లూనుకునేలా ప్రత్యేక ‘సెల్ పాలసీ’ని రూపొందించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ అధికారులు నూతన విధానంపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ తరహాలో ‘సెల్ పాలసీ’ కూడా పెట్టుబడిదారులను ఆకర్షించేలా రూపొందిస్తున్నారు. త్వరలో సీఎంకు నూతన పాలసీ విధి విధానాలు సమర్పించేందుకు సన్నద్ధమవుతున్నారు. చైనా ఆధారితంగా ఉన్న మొబైల్ ఫోన్ల పరిశ్రమ దేశంలో ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలి మొబైల్ ఫోన్ల తయారీ హబ్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం భూమితో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించడం ద్వారా ఈ రంగంలో సుమారు 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొబైల్ హబ్ ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పరిధిలోని మంచిరేవుల, రావిర్యాల అనుకూలంగా ఉంటాయని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ అభిప్రాయపడింది. దీంతో మొబైల్ హబ్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించడంపై టీఎస్ఐఐసీ దృష్టి సారించింది. పొరుగు రాష్ట్రాల నుంచి పోటీ మైక్రోమాక్స్, సెల్కాన్, కార్బన్ తదితర సెల్ కంపెనీలు రాష్ట్రంలో ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. అంతర్జాతీయ స్థాయి కలిగిన మైక్రోమాక్స్ తొలి దశలో రూ.80 కోట్ల పెట్టుబడులతో ముందుకు రాగా ప్రభుత్వం అనుమతులు కూడా మంజూరు చేసింది. ప్రతిష్టాత్మక శామ్సంగ్ కంపెనీ పెట్టుబడుల కోసం సర్కారు ప్రయత్నిస్తోంది. ఇండియా సెల్యులార్ సంఘం సభ్యులు కొందరు పెట్టుబడులతో ముందుకొస్తున్నారు. అయితే పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు మొబైల్ పరిశ్రమల పెట్టుబడులను ఆకర్షించేందుకు పోటీపడుతున్నాయి. ప్రత్యేక విధానం రూపొందించి రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా పోటీ తట్టుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేవలం ‘సెల్ పాలసీ’కే పరిమితం కాకుండా ప్రైవేటు రంగంలో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్న ఫార్మా, ఫుడ్ప్రాసెసింగ్ తదితర రంగాలకూ ప్రత్యేక విధానాలు రూపొందించాలని నిర్ణయించింది.