mysorepak
-
కొబ్బరి జీడిపప్పుతో మైసూర్ పాక్.. సింపుల్గా ఇలా చేసుకోండి
కొబ్బరి జీడిపప్పు మైసూర్ పాక్ తయారీకి కావల్సినవి: శనగపిండి – కప్పు; పచ్చికొబ్బరి తురుము – కప్పు; సన్నగా తరిగిన జీడిపప్పు పలుకులు – ముప్పావు కప్పు ; చక్కెర – రెండు కప్పులు ; నెయ్యి – ముప్పావు కప్పు ; యాలకులు – నాలుగు; నీళ్లు – ఒకటి ముప్పావు కప్పులు. తయారీ విధానమిలా.. శనగపిండిని జల్లెడపట్టుకుని, అరకప్పు నెయ్యి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి మందపాటి గిన్నెలో చక్కెర, నీళ్లు పోసి తీగపాకం వచ్చేంత వరకు మరిగించాలి. తీగపాకం వచ్చిన తరువాత కొబ్బరి తురుము, జీడిపప్పు పలుకులు వేసి కలపాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న శనగపిండి వేసి కలపాలి. చివరిగా యాలకులను దంచి వేయాలి ∙ఈ మిశ్రమంలో మిగిలిన నెయ్యిని టేబుల్ స్పూను చొప్పున వేస్తూ కలుపుతూ ఉండాలి. నెయ్యి మొత్తం వేసిన తరువాత చక్కగా కలిపి, మిశ్రమం గట్టిపడకముందే దించేయాలి. ఇప్పుడు నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేటులో ఈ మిశ్రమాన్ని వేసి ఆరనివ్వాలి ∙పదినిమిషాల తరువాత ముక్కలుగా కట్ చేస్తే కొబ్బరి జీడిపప్పు మైసూర్ పాక్ రెడీ. -
మైసూర్పాక్ ఎవరిది..?
సాక్షి,న్యూఢిల్లీ: రసగులా బెంగాలీలదేనని తేలడంతో తాజాగా మరో స్వీట్పై వివాదం ముందుకొచ్చింది. నోరూరించే మైసూర్పాక్ కర్నాటకకు చెందుతుందా లేక అది తమిళనాడు వంటకమా అనేది తేలాల్సి ఉంది. అయితే ఈ స్వీట్ తమదంటే తమదేనని సోషల్ మీడియా వేదికగా తమిళులు, కన్నడిగులు సవాల్ చేసుకుంటున్నారు. ప్రాంతాలవారీగా విడిపోయి మైసూర్పాక్ మూలాలు తమ రాష్ర్టంలోనే ఉన్నాయని వాదవివాదాలకు దిగుతున్నారు. కన్నడిగులు ఒక అడుగు ముందుకేసి మైసూర్పాక్ పేరులోనే అది తమదేననే అర్థం స్ఫురిస్తుందని మైసూర్ పేరును ఉటంకిస్తూ ఇది రాజ కృష్ణ రాజ వడయార్ కిచెన్లో మెనూ అని చెబుతున్నారు. నెయ్యి, చక్కెర, శనగపిండితో ప్యాలెస్ చెఫ్ కకసుర మాదప్ప దీన్ని వండివార్చేవాడని చెబుతున్నారు.కాలక్రమంలో దీనిపేరు మైసూర్పాక్గా స్ధిరపడిందని అంటున్నారు. అయితే తమిళులు తమదైన శైలిలో మరో కథ వినిపిస్తున్నారు. మద్రాస్కు చెందినవారు మైసూర్ పాక్ను కనుగొన్నారని అయితే 74 ఏళ్ల కిందట ఓ న్యాయవాది ఈ వంటకాన్ని దొంగిలించి మైసూర్ రాజాకు దీని సీక్రెట్ ఫార్ములాను అప్పగించారని చెబుతున్నారు. అప్పుడు మైసూర్ రాజా ఈ వంటకానికి మైసూర్పాక్ అని పేరుపెట్టారని ఈ విషయాలను స్వయంగా మెకాలే 1835లో బ్రిటన్ పార్లమెంట్కు వివరించారని పేర్కొంటున్నారు.దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రాష్ర్టాల వారీగా చీలి కామెంట్లు, లైక్లతో రెచ్చిపోతున్నారు. -
'మైసూర్పాక్'ను బహిష్కరించండి!
'మైసూర్ పాక్ను' మైసూర్ ఇండియా అని పేరు మార్చేవరకు తినకండి, దాన్ని బహిష్కరించండి! అదొక్కటేనా... హైదరాబాద్లోని కరాచీ బేకరీని, ఇతర బేకరీల్లో దొరికే కరాచీ బిస్కట్లను, కరాచీ హల్వా, పెషావరీ బిర్యానీ, లాహోరీ నమక్, ముల్తానీ మిట్టీ, సింధీ కఢీ (గ్రేవీ డిష్) లను బహిష్కరించండి... పక్వాన్ (వంటకాలు) అనే పేరును కూడా ఇంద్వాన్ అని మార్చండి...'' భారత్, పాక్ మధ్య సాంస్కృతిక, వాణిజ్య యుద్ధం మొదలైన నేపథ్యంలో సామాజిక వెబ్సైట్లలో వెల్లువెత్తుతున్న సరదా కామెంట్లు ఇవీ. పాక్లో భారతీయ సినిమాల ప్రదర్శనను నిలిపివేయగా, పాక్ కళాకారులను, చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని భారత్లో డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పాక్ కళాకారులు ఫవాద్ ఖాన్, మొహిర్ ఖాన్లు నటించిన బాలీవుడ్ సినిమాలను బహిష్కరించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన పిలుపునిచ్చింది. తాను ఎంతో దేశభక్తి కలవాడినని, తాను ఇటీవల నిర్మించిన 'ఏ దిల్ హై ముష్కిల్' చిత్రాన్ని విడుదలకు అనుమతించాలని, భవిష్యత్తులో పాక్ ఆర్టిస్టులను తన సినిమాల్లో తీసుకోను గాక తీసుకోనంటూ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలసుకొని మొరపెట్టుకున్న విషయమూ తెల్సిందే. మైసూర్పాక్.. నాలుగో కృష్ణరాజ్ వడయార్ తన మైసూర్ ప్యాలెస్లో మొట్టమొదటి సారిగా ఈ స్వీట్ను తయారు చేయడం వల్లన దీనికి మైసూర్ నగరం పేరుతో మైసూర్పాక్ అని పేరు వచ్చింది. పాక్ అంటే కన్నడ భాషలో తీపి మిశ్రమం లేదా పాకం అని అర్థం. కరాచీ బేకరీ.. సింధు నుంచి హైదరాబాద్కు వలసవచ్చిన ఖాన్చంద్ రమ్నాని హైదరాబాద్లో ఈ బేకరీని ఏర్పాటు చేశారు. సింధు రాజధాని నగరమైన కరాచీ పేరును బేకరీకి పెట్టుకున్నారు. ఇదంతా బాగానే ఉందిగానీ పాకిస్థాన్లోని హైదరాబాద్ నగరంలో వందేళ్ల క్రితం ఏర్పాటు చేసిన 'బాంబే బేకరీ'ని మనమే మూసేద్దామా? పాక్ ప్రజలనే మూసేయమని కోరదామా? ఎటూ అక్కడివాళ్లు బాలీవుడ్ సినిమాలను నిషేధించారు కాబట్టి, రేపో మాపో వాళ్లకు ఇలాంటి ఆలోచనలు వచ్చినా తప్పు లేదేమో!