National political parties
-
‘కనీస’ చట్టబద్ధతే సంజీవని!
కాలచక్రంలో నెలలు, సంవత్సరాలు పరిగెడుతున్నాయి. కొన్ని రంగాలు రూపు రేఖలు గుర్తుపట్టలేనంతగా మారుతున్నాయి. కానీ, మార్పు లేనిదల్లా వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల జీవితాలే. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు దాటిపోయినా, ఇంకా రైతులు తమ గోడు చెప్పు కోవడానికి రోడ్లపైకి వస్తున్నారు. ప్రాణాలకు తెగించి ఉద్యమిస్తున్నారు. ఇంతా చేసి రైతులు కోరుతున్నదేమీ అన్యాయమైన డిమాండ్లు కావు. ప్రభుత్వాలు నెరవేర్చగల సహేతుక డిమాండ్లే! ఆత్మగౌరవంతో జీవించడం ప్రజల ప్రాథమిక హక్కు. అప్పుల ఊబిలో నుంచి బయటపడేంత వరకూ రైతులకు ఆత్మగౌరవం లభించదు. రైతాంగం ఆత్మగౌరవంతో బతకాలంటే వారికి కనీస మద్దతు ధరలు లభించాల్సిందే. వాటికి చట్టబద్ధత కల్పించాల్సిందే.2024 ఏడాది ప్రారంభంలో పంజాబ్ రైతులు మరో పోరాటానికి ఉద్యుక్తుల య్యారు. ఏడాది గడిచినా ఆ ఉద్యమాన్ని కొనసాగించడానికి గల కారణాలను విశ్లేషించి చూస్తే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అమా నుష వైఖరి బహిర్గతమవుతుంది. దాదాపు మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి మూడు నల్ల చట్టాలను తేవాలని ప్రతిపాదించడం, దానిపై అన్ని రాష్ట్రాల రైతాంగం ఢిల్లీలో చలికి, ఎండలకు, వానలకు తట్టుకొని చేసిన సుదీర్ఘ ఉద్యమం దరిమిలా కేంద్రం దిగొచ్చింది, ప్రతిపాదిత బిల్లుల్ని ఉప సంహరించుకుంది. అయితే, ఆ సందర్భంగా రైతులకు చేసిన వాగ్దానాలను మాత్రం కేంద్రం నెరవేర్చలేదు. ప్రధానంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనీ, రైతుల్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న పంట రుణాలను మాఫీ చేయాలనీ రైతాంగం చేసిన డిమాండ్లను పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయ లేదు. దాంతో 2024 ఫిబ్రవరి 14 నుంచి పంజాబ్ రైతులు హరి యాణా సరిహద్దుల్లోని శంభూ అంబాలా, అఖేరిజింద్ కూడళ్ల వద్ద బైఠాయించి ఉద్యమం నడుపుతున్నారు. రైతుల డిమాండ్ల పరిష్కా రానికి సహేతుక ముగింపు లభించాలన్న ఉద్దేశంతో రైతు నాయకుడు జగ్జీత్సింగ్ డల్లేవాల్ (నవంబర్ 26న) ఆమరణ దీక్ష మొదలు పెట్టాక, ఈ పోరాటానికి దేశ వ్యాప్త గుర్తింపు లభించింది. నిజానికి ఓ పోరాటాన్ని విరమింపజేసే సమయంలో ఇచ్చిన వాగ్దానాల్ని కేంద్రం నెరవేర్చకపోవడం, వాటిని నెరవేర్చాలన్న డిమాండ్తో రైతాంగం మరో పోరాటానికి దిగడం బహుశా చరిత్రలో ఇదే ప్రథమం కావొచ్చు.కనీస మద్దతు ధర ప్రాథమిక హక్కు లాంటిదే!మూడేళ్ల క్రితం ఉపసంహరించుకున్న మూడు నల్ల చట్టాల్ని కేంద్రం మరో రూపంలో తీసుకురాబోతోందన్న సంకేతాలతోనే పంజాబ్ రైతులు ఆందోళనకు దిగారు. ‘‘దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ 75 సంవత్సరాలలో పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు లభించక, సాగు గిట్టుబాటు కాక, అప్పుల ఊబిలో చిక్కుకొని గత్యంతరం లేక, తమ జీవితం పట్ల తమకే విరక్తి కలిగి ఇప్పటికి 7 లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. నా ప్రాణం పోతే పోతుంది. కానీ ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల జాబితాలోకి మరికొన్ని పేర్లు చేరకూడదు’’ అన్న 70 ఏళ్ల డల్లేవాల్ మాటలు వ్యవసాయరంగ వాస్తవ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తాయి. దేశానికి ఆహార భద్రత అందించే రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకొనే దుఃస్థితి ఎందుకు ఉన్నదో పాలకులు ఆలోచించడం లేదు. గతంలో ఎదుర్కొన్న సమస్యలతో పాటు తాజాగా తెస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సంస్కరణలు రైతుల పాలిట ఉరి తాళ్లుగా మారనున్నాయి. పంట ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (అగ్రి కల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ)లను రద్దు చేసి కాంట్రాక్టు సాగుకు పట్టం కట్టాలన్న కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు ప్రతిపాదనకు రైతాంగం ససేమిరా ఇష్టపడటం లేదు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకురాదలిచిన సంస్కరణలకు సంబంధించి 2024లో విడుదల చేసిన ముసాయిదా పత్రంలో పేర్కొన్న అంశాలు దాదాపుగా అంతకుముందు విరమించుకొన్న వ్యవసాయ బిల్లుల్లోని అంశాలకు నకలుగా ఉన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తు న్నారు. అవి: 1. జాతీయ వ్యవసాయ మార్కెట్లను అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం; 2. ఒకే లైసెన్సు, ఒకే రిజిస్ట్రేషన్ వ్యవస్థ తీసుకు రావటం; 3. ఫీజు ఏకమొత్తంలో ఒకేసారి చెల్లింపు చేయటం;4. గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలను ప్రత్యేక మార్కెట్లుగా గుర్తించడం; 5. ప్రైవేట్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వేదికల ఏర్పాటు... ఇలా పలు ప్రతిపా దనలను ముసాయిదా బిల్లులో చేర్చి, వాటిని రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని రైతులు అనుమానిస్తున్నారు. సాధారణంగా వ్యవసాయ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు రైతాంగ ప్రతినిధులతో చర్చించడం, వారిని భాగస్వాముల్ని చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కేంద్రం ఆ సంప్రదాయాన్ని పాటించకపోవడాన్ని రైతు సంఘాలు తప్పు పడుతున్నాయి. తమకు అంగీకార యోగ్యం కాని నిర్ణయాలు చేయడం కోసమే కేంద్రం ఏక పక్షంగా వ్యవహరించిందని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరలు ఆశించడం రాజ్యాంగంలో ప్రజలకు దఖలు పడిన ప్రాథమిక హక్కు లాంటిదేనని డల్లేవాల్ పేర్కొనడం దేశవ్యాప్త చర్చకు ఆస్కారం కల్పించింది. దేశవ్యాప్త డిమాండ్ కూడా అదే!తాము పండించే పంటకు ఎంత ధర ఉండాలో నిర్ణయించుకొనే హక్కు ఎలాగూ రైతాంగానికి లేదు. కనీసం పండించే పంటకు ఎంత మొత్తం కనీస మద్దతు ధర (ఎంఎస్íపీ)గా ఇస్తారో ముందుగా తెలుసుకోవాలను కోవడం అత్యాశేమీ కాదు కదా? కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం అంటే పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చుతోపాటు లెక్క గట్టి ధరల్ని ప్రకటించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి గతంలో కొందరు సామాజిక కార్యకర్తలు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించి కేంద్రానికి తగిన సూచనలు చేయాలని అభ్యర్థించారు. అయితే, ప్రజల జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని... కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించలేమనీ, అలా చేస్తే నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పుతాయనీ సాకులు చెప్పి కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానాలను తప్పుదారి పట్టించిందన్నది నిర్వివాదాంశం.నిజానికి ఈ సమస్యను న్యాయస్థానాలు పరిష్కరించాలని ఆశించడం కూడా సముచితం కాదు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల్ని నిర్ణయించే సీఏసీపీ (కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్)లో చైర్మన్ నుంచి సభ్యుల వరకూ అందరూ బ్యూరోక్రాట్లే. రైతాంగ ప్రతినిధులు ఉండరు. పేరుకు ‘సీఏసీపీ’ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా కనిపిస్తుంది గానీ, దానిపై రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయన్నది బహిరంగ రహస్యమే. సీఏసీపీ నిర్ణయించే కనీస మద్దతు ధరల విధానం ఆమోదయోగ్యం కాదని దశాబ్దాలుగా రైతాంగ సంస్థలు మొత్తుకొంటున్నా, కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులే శిరోధార్యం అని ఎందరు చెప్పినా దానికి మొగ్గుచూపడం లేదు. పైగా, తాము అనుసరించే విధానాన్నే స్వామినాథన్ కమిషన్ సూచించిందనీ, ఆ ప్రకారం సాగు వ్యయంపై 50 శాతం జోడించి ఇస్తున్నా మనీ దాదాపు ఐదారేళ్ల నుంచి కేంద్రం బుకాయిస్తూనే ఉంది.దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కేంద్రంలో అనేక పార్టీల ప్రభుత్వాలు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉండగా ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడ్డం జాతీయ రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిన నేపథ్యంలోనే రైతాంగ సమస్యలు నేటికీ రావణ కాష్టంగా రగులుతూనే ఉన్నాయి. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే అన్న దాతలతో తక్షణం చర్చలు జరపాలి (ఎట్టకేలకు ఫిబ్రవరి 14న చర్చలకు ఆహ్వానించింది). ‘మార్కెటింగ్ ఫ్రేవ్ువర్క్’ పేరుతో తెచ్చిన ముసాయిదాను ఉపసంహరించుకోవాలి. రైతాంగం కోరు తున్నట్లు పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించటం ఒక్కటే దేశ రైతాంగానికి సంజీవనిగా పని చేయగలుగుతుంది.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసన మండలి సభ్యులు -
అనిశ్చిత ప్రాభవం!
రాజకీయ రంగంలో తెలంగాణ అస్తిత్వాన్ని భారత్ మింగేసింది. ఇప్పుడు దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణపై పట్టు కోసం సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్ధమైంది. దాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా పరావర్తనం చెందింది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ ఇప్పుడు ‘అబ్ దిల్లీ దూర్ నహీ’ అనే కొత్త నినాదాన్ని వినిపిస్తున్నది. ఇక తెలంగాణలో అన్నీ జాతీయ పార్టీలే! బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు తోడు సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎఐఎమ్ఐఎమ్ వంటి చిన్నకారు సన్నకారు పార్టీలది కూడా జాతీయ హోదానే! ఎమ్ఐఎమ్కు మూడు నాలుగు రాష్ట్ర శాసనసభల్లో ప్రాతినిధ్యం ఉన్నందువల్ల అది కూడా జాతీయ పార్టీగానే చలామణీ అవుతున్నది. వైఎస్ షర్మిల పార్టీ ఒక్కటే ప్రాంతీయ పార్టీ. కొన్ని మరీ చిన్న పార్టీలు ఉన్నా లేనట్టే లెక్క. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల విలాసం, నివాసం హైదరాబాదే కానీ, తెలంగాణలో ఆ పార్టీకి సైన్ బోర్డ్ కూడా మిగల్లేదు. టీఆర్ఎస్ దక్షిణాదిలోని ఒక ప్రాంతీయ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉప ప్రాంతీయ పార్టీగా కూడా పిలిచేవారు. అటువంటి పార్టీ ఉత్తరాదికి విస్తరించి అతి బలాఢ్యుడైన శత్రువును ఢీకొట్టగలదా? ఇప్పుడిదొక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే, శ్రీశ్రీ చెప్పినట్టు ‘అభాగ్యులం మేము, సరిహద్దులు దొరకని సంధ్యలలో మా సంచారం. అన్నీ సమస్యలే. సందేహాలే మాకు’. అప్పుడెప్పుడో 13 శతాబ్దాలకు పూర్వం ఉత్తరాది చక్రవర్తి హర్షవర్ధనుడు దక్షిణాదిపైకి దండెత్తి వచ్చాడట! దక్కన్ ప్రాంత చాళుక్య రాజు రెండో పులకేశి ఆ చక్రవర్తిని నర్మదా నది ఆవలి దాకా తరిమి తరిమి కొట్టాడట! ‘కనోజ్ (హర్షుని రాజధాని) బహుత్ దూర్ హై’ అని భావించి ఉంటాడు. అందుకని అక్కడి దాకా వెళ్లే ఆలోచన రెండో పులకేశి చేయలేదు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో కూడా దక్షిణాది నాయకుడెవరూ జాతీయ పార్టీని స్థాపించే ప్రయత్నం చేయలేదు. ఒక్క శ్రీమాన్ చక్రవర్తుల రాజగోపాలాచారి మాత్రమే నెహ్రూ విధానాలతో విభేదించి స్వతంత్ర పార్టీని స్థాపించారు. ప్రకాశం పంతులు, ఎన్జీ రంగా, గౌతు లచ్చన్న, బెజవాడ రామచంద్రారెడ్డి వగైరా ఆంధ్రా నాయకులు ఆయనకు అండగా నిలబడ్డారు. పార్టీ ప్రభావం మాత్రం ఉత్తరాదిలోనే ఎక్కువగా కనిపించింది. 1967–71 మధ్యకాలంలో 44 సీట్లతో లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా కూడా పనిచేసింది. స్పష్టమైన సిద్ధాంతాలు, విధానాల ప్రాతిపదిక మీద ‘స్వతంత్ర పార్టీ’ ఆవిర్భవించింది. సోషలిస్టు తరహా ఆర్థిక విధానాలకు ఆ పార్టీ బద్ధవ్యతిరేకి. పీవీ నరసింహారావు అమలుచేసిన ఆర్థిక సరళీకరణను ముప్ఫయ్యేళ్లు ముందుగానే ‘స్వతంత్ర పార్టీ’ ప్రవచించింది. కాలంతోపాటు కాకుండా ముప్పయ్యేళ్లు ముందు నడిచి అనతికాలంలోనే కాలధర్మం చెందింది. ఆ తర్వాత మరో దక్షిణాది నాయకుడు ఎవరూ జాతీయ పార్టీ పెట్టే ప్రయత్నం చేయలేదు. ఎమ్జీ రామచంద్రన్ నాయకత్వంలో ఏర్పడిన అన్నా డీఎమ్కే పార్టీకి ముందు ఆల్ ఇండియా అని తగిలించినప్పటికీ ఆ పార్టీ నాయకులెప్పుడూ రాజధాని ఎక్స్ప్రెస్ను ఎక్కే ఆలోచన చేయలేదు. ఎన్టీ రామారావు మాత్రం నేషనల్ పార్టీ కోసం కొన్ని కలలు కన్న తర్వాత నేషనల్ ఫ్రంట్తో సరిపెట్టుకున్నారు. ఇన్నాళ్ల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దక్షిణాది జాతీయ పార్టీ అనే గాండీవాన్ని దసరా నాడు జమ్మిచెట్టు దించారు. ఈ సాహసం వెనుక కేసీఆర్ లక్ష్యం ఏమిటి? సవాలక్ష సందేహాల్లో మొదటి సందేహం, ప్రశ్నల పరంపరలో మొదటి ప్రశ్న ఇదే! గుజరాత్ మోడల్ను ప్రచారం చేసుకొని మోదీ అధికారంలోకి వచ్చాడు. తెలంగాణా మోడల్ను మేము జాతీయ రాజకీయాల్లో ప్రచారం చేసుకుంటామని వివిధ సందర్భాల్లో టీఆర్ఎస్ నాయకులు చెప్పుకొచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ మోడల్ను ఓడించడమా? కేసీఆర్ మోడల్ను గెలిపించడమా? ఏది టీఆర్ఎస్ ప్రధాన లక్ష్యం కానున్నది? వైరుద్ధ్యం లేనట్టు కనిపిస్తున్న ఈ రెండంశాలూ ఒకటి కాదు. సినిమాల్లో బాలకృష్ణ డైలాగ్ మాదిరిగా ‘బోత్ ఆర్ నాట్ సేమ్!’ ఈ రెండు లక్ష్యాల్లో ఒక్కో దానికి ఒక్కో రకమైన కార్యాచరణ అవసరమవుతుంది. మోదీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ఉంటే, మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ను బలహీనపరచాలనుకోవడం సరైన వ్యూహం కాకపోవచ్చు. కాంగ్రెస్ ఎంత దిగజారినా, ఇప్పటికీ సుమారు 170 లోక్సభ స్థానాల్లో బీజేపీని ముఖాముఖి ఎదుర్కోగల స్థితిలో ఉన్నది. కేరళలోని 20 స్థానాల్లో పోటీ కాంగ్రెస్ – లెఫ్ట్ కూటమిల మధ్యనే ఉంటుంది. ఇంకో ఇరవై సీట్లలో ప్రాంతీయ పార్టీలతో ప్రధాన పోటీలో ఉండగల స్థితిలో ఉన్నది. కాలం కలిసొస్తే ట్రిపుల్ డిజిట్ను అందుకోగల సామర్థ్యం ప్రతిపక్షాల్లో ఒక్క కాంగ్రెస్కు మాత్రమే ఉన్నది. సమాజ్వాది పార్టీ సుమారు 50 సీట్లలో బీజేపీకి పోటీ ఇవ్వగలదు. తృణమూల్ కాంగ్రెస్ 40 సీట్లలో, ఆర్జేడీ 25 సీట్లలో, బీజేడీ 20 స్థానాల్లో బీజేపీని ఎదుర్కొంటాయి. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో రెండు జాతీయ పార్టీలకూ ఠికానా లేదు. పైన చెప్పిన పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ముఖాముఖి బీజేపీతో తలపడేది తక్కువ సీట్లలోనే! తెలంగాణలో హైదరాబాద్ పోను మిగిలిన 16 స్థానాల్లో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఎక్కువ చోట్ల త్రిముఖ పోటీ ఉంటుంది. తెలంగాణకు బయట బీఆర్ఎస్ బలంగా నిలబడగలిగిన లోక్సభ సీటు ఇప్పటికైతే ఒక్కటి కూడా లేదు. బీఆర్ఎస్కు ఆంధ్రప్రదేశ్లో మద్దతు లభిస్తుందనుకోవడం భ్రమే అవుతుంది. తెలంగాణ ‘ఇచ్చిన’ కాంగ్రెస్నే నామరూపాలు లేకుండా చేశారు అక్కడి జనం. ఇక ‘తెచ్చిన’ కేసీఆర్ను ఆదరిస్తారంటే నమ్మడం కష్టం. అందుకు వాళ్ల కారణాలు వాళ్లకు ఉన్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఒక మహానగరం లేని పరిస్థితిలో ఎలా ఉన్నదో అరవయ్యేళ్ల అనంతరం ఏపీ విభజన తర్వాత కూడా అదే పరిస్థితిలో ఉన్నది. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ఆశ్రయం కల్పించగల మహానగరం ఆవశ్యకతను ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు మహానగరాలే గ్రోత్ ఇంజన్లుగా మారుతున్నాయి. విలీనం – విభజన వంటి ప్రయోగాలు లేకుండా ఈ అరవయ్యేళ్లలో విశాఖపట్టణంపై ఫోకస్ పెట్టి వుంటే అదొక మహానగరంగా అభివృద్ధి చెంది ఉండేదనీ, తాము మోసపోయామని వాళ్లు భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కు ఆంధ్రప్రదేశ్ టఫ్ టాస్క్గానే ఉండబోతున్నది. కర్ణాటకలో జేడీఎస్ మీద కేసీఆర్ ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. అక్కడ కాంగ్రెస్ – బీజేపీల మధ్య ఏర్పడిన పోటాపోటీ వాతావరణంలో జేడీఎస్ పలుకుబడి నానాటికీ క్షీణిస్తున్నది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోని తెలుగు ప్రాంతాలపై నమ్మకం పెట్టుకోవడం కూడా కష్టం. ఆయా రాష్ట్రాల్లోని ప్రధానస్రవంతి రాజకీయాలకు భిన్నంగా భాషాపరమైన మైనారిటీలు వ్యవహరించడం సాధారణంగా జరగదు. మోదీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యమైతే కేసీఆర్ గతంలో చెప్పినట్టు ఫెడరల్ ఫ్రంట్ ప్లస్ కాంగ్రెస్ కూటమే మెరుగైన ప్రత్యామ్నాయమవుతుంది. అప్పుడు కేసీఆర్ జాతీయపార్టీ అవసరం ఉండదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అంపశయ్య మీద ఉన్నదనే అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే అభిప్రాయాన్ని బహిరంగంగానే చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి లేదనే అంచనాతో ఆ స్థానాన్ని తమ జాతీయ పార్టీ భర్తీ చేయాలని వారు భావిస్తున్నారు. తెలుగు సినిమాలు కంటెంట్తో పాన్ ఇండియా సినిమాలుగా వెలుగుతున్న విషయాన్ని కేటీఆర్ పదేపదే గుర్తు చేస్తున్నారు. కంటెంట్తోనే పాన్ ఇండియా పార్టీ కూడా సక్సెస్ కొట్టగలదనే ధీమా ఆయనలో ఉన్నది. తెలంగాణా అభివృద్ధి మోడలే ఆ కంటెంట్! అధికారంలోకి వచ్చిన తర్వాత తాము అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసి దేశం దృష్టిని ఆకర్షించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటున్నది. ముఖ్యంగా రైతులను, దళిత వర్గాలను ఫోకస్ సెక్షన్లుగా ఎంపిక చేసుకున్నట్లు కనిపిస్తున్నది. రైతు బంధు, దళిత బంధు, సాగునీరు, తాగునీరు, నిరంతర విద్యుత్ వంటి అంశాలనూ, తెలంగాణలోని సంక్షేమ పధకాలనూ విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఇక్కడే ఒక సమస్య ఉన్నది. తాము అమలు చేసిన పథకాలు దేశమంతటా జైత్రయాత్రకు ఉపకరిస్తాయని ఒకపక్క ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. మరోపక్క మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల కోసం రెండు గ్రామాలకో ఎమ్మెల్యేను, పది గ్రామాలకో మంత్రిని నియమించి పద్మవ్యూహాన్ని ప్రయోగిస్తున్నారు. ఎందుకింత కురుక్షేత్ర యుద్ధ సన్నద్ధత? అధికారంలో ఉన్న పార్టీ ఒక అసెంబ్లీ ఉపఎన్నికలో గెలవడం కోసం ఆపసోపాలు పడవలసిన పరిస్థితి ఎందుకొచ్చింది? పైగా అక్కడ అధికార పార్టీకే ఎక్కువ అనుకూలతలున్నాయి. కాంగ్రెస్ తరఫున గెలిచిన అభ్యర్థి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఆ పార్టీకి అక్కడ పెద్దగా బలం లేదు. హుజూరాబాద్లో మాదిరిగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేతులేత్తేసే పరిస్థితి లేదు. ఆ పార్టీ పునాదులు బలంగానే ఉన్నాయి. గట్టిగానే పోటీలో నిలబడగలుగుతుంది. రెండు ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలిక అధికార పార్టీకి రాచబాటే కదా! అయినా ఎందుకో ఆ ధీమా కనిపించడం లేదు. ఈ పరిస్థితి మునుగోడుకే పరిమితమా? రాష్ట్రమంతటా ఉన్నదా అనేది ఇంకా అంతుబట్టడం లేదు. ఇప్పుడు మన సమాజంలో మిలీనియల్స్ తరం, ఆ తర్వాతి (ో) తరం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. వారి ఆలోచనలే సమాజ అభిప్రాయంగా రూపుదిద్దుకుంటున్నాయి. సోషల్ మీడియాను పరిపాలిస్తున్నది వారే! వారి దృష్టిలో ప్రభుత్వ పాలన, సంక్షేమాలకు అర్థాలు మారిపోయాయి. సామాజిక పెన్షన్లు హక్కులుగా మారిపోయాయి. నేటి యువతరం తారకమంత్రం సాధికారత. వెనుకబడిపోయిన సమస్త వర్ణాలు, వర్గాలు, మహిళలు సాధికారతను కోరుకుంటున్నారు. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, ఎదిగేందుకు సమానమైన అవకాశాలు అందుబాటులో ఉండటమే సాధికారత మార్గాలుగా యువతరం భావిస్తున్నది. మారుతున్న ఆలోచనల్ని గ్రహించి పబ్లిక్ పల్స్ పట్టుకోగలిగితే బీఆర్ఎస్కు ప్రయోజనం కలగవచ్చు. డిసెంబర్లో పార్టీ మొదటి బహిరంగ సభ జరిగి పార్టీ ప్రణాళిక విడుదలయ్యే వరకు ఊహాగానాలు, సందేహాలు సందడి చేస్తూనే ఉంటాయి. ఆ పార్టీ ప్రణాళిక కార్యక్రమం పబ్లిక్లో విడుదలై కంటెంట్ నచ్చితే, కేసీఆర్ పంచ్ డైలాగులు పేలితే బొమ్మ పాన్ ఇండియా హిట్ కావచ్చు. అవుతుందనే ఆశిద్దాం. బీఆర్ఎస్ హడావిడి∙ఇండియాలో ఏమోగానీ తెలంగాణలో గులాబీ పార్టీకి కొంత మేరకు ఉపయోగపడవచ్చని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. మైనారిటీల ఓట్లు, లెఫ్ట్ భావజాలం ఓట్లు (కమ్యూనిస్టు పార్టీల ఓట్ల కంటే ఇవే ఎక్కువ) కాంగ్రెస్ను కాదని గులాబీ పార్టీ వెనుక సమీకృతమయ్యే అవకాశాలుంటాయి. అందుకోసమే కాంగ్రెస్ పార్టీని జీవచ్ఛవంగా అభివర్ణిస్తున్నారు. మోదీ ప్రభుత్వం కూడా ఈ మూడేళ్లలో వ్యతిరేక ఓటును బాగానే సంపాదించుకున్నది. అవీ గులాబీ ఖాతాలో పడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకత న్యూట్రలైజ్ చేయవచ్చు. వెరసి రాష్ట్రంలో కొంత ఉపయోగం జరగవచ్చు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెత తెలిసిందే. రాష్ట్రస్థాయి లక్ష్యసాధన కోసం జాతీయ స్థాయి ఆయుధం ధరిస్తే తప్పేమున్నది? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అనుమానం వద్దు.. భేటీ 5నే!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ఈ నెల 5న పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో యథావిధిగా జరుగుతుందని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతిభవన్లో ఆదివారం జరిగిన మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దసరా రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణభవన్కు చేరుకోవాలని ఆహ్వాని తుల జాబితాలోని వారికి సూచించారు. మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో దసరా రోజు జరిగే టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంపై దాని ప్రభావం ఉండదని పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశానికి ఆహ్వానాలు అందినవారు ఎలాంటి అనుమానాలకు తావులేకుండా నిర్దేశిత సమయానికి రావాలని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణభవన్లో ఈ నెల 5న జరిగే ఈ భేటీకి రాష్ట్రమంత్రులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా పరిషత్, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, టీఆర్ఎస్ 33 జిల్లాల అధ్యక్షులు హాజరుకావాలని ఇప్పటికే కేసీఆర్ ఆదేశించారు. 5న మధ్యాహ్నం 2.30లోగా పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ముగించేలా షెడ్యూల్ సిద్ధం చేసినట్లు తెలంగాణభవన్ వర్గాలు వెల్లడించాయి. కొత్త జాతీయ పార్టీపై టీఆర్ఎస్లో ఉత్కంఠ కొత్త జాతీయపార్టీ ఏర్పాటుపై ఈ నెల 5న కీలక ప్రకటన చేసేందుకు కేసీఆర్ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్లో ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందనుండటంతో కొత్తపార్టీ రూపురేఖలు, తీరుతెన్నులపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కొత్తపార్టీ పేరు, జెండా, ఎన్నికల చిహ్నం మొదలుకుని ఎజెండా తదితరాలపై ఆసక్తి కనిపిస్తోంది. అదే సమయంలో కొత్త జాతీయపార్టీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో కేసీఆర్ వేసే అడుగులు, ఎత్తుగడలు, పార్టీ భవిష్యత్తు తదితరాలపై పార్టీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. కొత్త జాతీయ పార్టీపై కేసీఆర్ లాంఛనంగా ప్రకటన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి వస్తున్న వివిధ పార్టీల నాయకులకు ఘనస్వాగతం పలికేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రానికి వచ్చే అతిథుల జాబితాపై మంగళవారం ఉదయానికి స్పష్టత వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
పార్టీలకు ఆర్టీఐ చట్టం వర్తిస్తుంది
న్యూఢిల్లీ: జాతీయ రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వ సంస్థల కిందకే వస్తాయనీ, వాటన్నింటికీ సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం వర్తిస్తుందని ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం స్పష్టతనిచ్చింది. జాతీయ పార్టీలను ప్రభుత్వ సంస్థలుగా ప్రకటిస్తూ, వాటికీ ఆర్టీఐ చట్టం వర్తిస్తుందని 2013 జూన్లోనే కేంద్ర సమాచార కమిషన్ ఆదేశాలిచ్చింది. ఈసీ మాత్రం ఇటీవల ఇందుకు విరుద్ధంగా మాట్లాడటం వివాదాస్పదమవడం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు విరాళాల ద్వారా వచ్చిన మొత్తమెంతో చెప్పాలని సహ చట్టం కింద ఓ వ్యక్తి దరఖాస్తు చేయగా, ఆ వివరాలు తమ వద్ద లేవనీ, పార్టీలు చట్టం పరిధిలోకి రావంటూ సమాధానమిచ్చింది. ఈ విషయం సోమవారం పత్రికల్లో రావడంతో జాగ్రత్త పడిన ఈసీ తన సమాధానంపై వివరణ ఇచ్చింది. ఏకకాల ఎన్నికలపై స్పందించని పార్టీలు లోక్సభతోపాటు దేశంలోని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు జరపడంపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా న్యాయ కమిషన్ కోరగా, ఏడు జాతీయ పార్టీల్లో ఒక్కటి కూడా స్పందించలేదు. తమ అభిప్రాయాలు చెప్పిన ప్రముఖులు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మలు మాత్రమే. అభిప్రాయాలు చెప్పేందుకు మే 8 చివరి తేదీ కాగా, ఈసీ గుర్తింపు పొందిన ఏడు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీల్లో ఒక్క పార్టీ కూడా తమ వైఖరిని తెలియజేయలేదు. నారాయణ స్వామి మాత్రం.. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగాన్ని సవరించి కొన్ని శాసనసభల పదవీకాలాన్ని పెంచడం లేదా తగ్గించాల్సి ఉంటుందనీ, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పినట్లు సమాచారం. -
జాతీయ పార్టీలకు రూ.622.38 కోట్ల విరాళాలు
న్యూఢిల్లీ: జాతీయ పార్టీలకు వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తంలో విరాళాలు అందాయి. జాతీయ స్థాయి రాజకీయ పార్టీలకు రూ.20 వేలకు పైగా వచ్చిన విరాళాల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎంలకు వచ్చిన విరాళాల వివరాలు ఇందులో పేర్కొంది. అన్నిజాతీయ పార్టీలకు కలిపి మొత్తం 1,695 విరాళాలు అందగా, వాటి విలువ రూ. 622.38 కోట్లు. ఈ రేసులో సహజంగానే అధికార బీజేపీ ముందంజలో ఉంది. ఆ పార్టీకి రూ. 437.35 కోట్ల విరాళాలు వచ్చాయి. గత పదేళ్లుగా బీఎస్పీకి వస్తున్న విరాళాలను వెల్లడిస్తున్నా, ఈ ఆర్థిక సంవత్సరానికి తమకు రూ. 20 వేల పైన విరాళాలు ఏవీ అందలేదని ఆ పార్టీ తెలిపింది. జాతీయ పార్టీలకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన విరాళాలు పార్టీలు విరాళాల సంఖ్య రూ. కోట్లలో బీజేపీ 1234 437.35 కాంగ్రెస్ 280 141.46 ఎన్సీపీ 52 38.82 సీపీఎం 74 3.42 సీపీఐ 55 1.33 2013-14 ఆర్థిక సంవత్సరంతో 2014-15 ఆర్థిక సంవత్సరం పోల్చితే అన్ని జాతీయ పార్టీలకు అందిన విరాళాలు గణనీయంగా పెరిగాయి. పార్టీలు 2013-14 2014-15 బీజేపీ 170.86 437.35 ఐఎన్సీ 59.58 141.46 ఎన్సీపీ 14.02 38.82 సీపీఎం 2.09 3.42 సీపీఐ 1.22 1.33 రెండు పార్టీలకూ ఆ కంపెనీల విరాళాలు కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాలు నేరుగా ఇవ్వకుండా ఎలక్టోరల్ ట్రస్టులను ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా ఇస్తాయి. బీజేపీకి సత్యా ఎలక్టొరల్ ట్రస్టు ద్వారా భారతీ గ్రూప్ రూ 107.25 కోట్లు, జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా ఆదిత్య బిర్లా గ్రూపు రూ 63.02 కోట్లను విరాళాలుగా ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా ఆదిత్య బిర్లా గ్రూపు రూ 54.01 కోట్లను, సత్యా ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా భారతీ గ్రూప్ రూ 18.75 కోట్లను విరాళాలుగా ఇచ్చాయి.