'వికార్ ఎన్కౌంటర్పై సీబీఐ విచారణ జరిపించాలి'
సుల్తాన్బజార్ (హైదరాబాద్సిటీ) : జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న వికారుద్దీన్ అతని అనుచరుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యుమన్ రైట్స్ అర్గనైజేషన్ (ఎన్సీహెచ్ఆర్వో) ప్రతినిధులు ప్రొఫెసర్ ఎ.మార్క్స్, రేణి, సుగుమారన్, మహ్మద్ యూసూప్లు పేర్కొన్నారు. తమ ఎన్సీహెచ్ఆర్వో ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీలలో వికార్గ్యాంగ్పై ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సందర్శించామని, దానిని నిజనిర్ధారణ కమిటీగా తాము వివరాలు సేకరించామని తెలిపారు.
ఆలేరు పీఎస్ పరిధిలో ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పారు. తెలంగాణ పోలీసులు పక్కా ప్రణాళికతో 5 మంది అండర్ ట్రైయిల్ ఖైదీలను హత్యచేసిందని వారు ఆరోపించారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 30 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. వికార్గ్యాంగ్ను ఎన్కౌంటర్ చేసేముందే పోలీసులు ట్రాఫిక్ను మరలించాలని తమ విచారణలో వెల్లడైందన్నారు. ఈ బూటకపు ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై హత్యానేరం కింద కేసులు పెట్టి వారిని శిక్షించాలని వారు కోరారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు ప్రత్మేశ్, మహ్మద్ అబ్దుల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.