needle remove
-
ఇంజెంక్షన్ ఫోబియా: నాకిప్పుడు ఐదో నెల మరి ఎలా..?
నాకు ఇప్పుడు ఐదవ నెల. ఇంజెక్షన్స్ అంటే చాలా భయం. ఇప్పటి వరకు ఏ ఇంజెక్షన్ తీసుకోలేదు. ప్రెగ్నెన్సీ, కాన్పు సమయంలో తీసుకోవాలి కాబట్టి చాలా భయంగా ఉంది ఏదైనా సలహా చెప్పండి? – ప్రణతి, గుంటూరు. నీడిల్ ఫోబియా లేదా ఇంజెక్షన్ ఫోబియా అనేది మామూలే! ఇది ప్రతి పదిమందిలో ఒకరికి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఐదవ నెల, ఏడవ నెలలలో టీటీ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. కాన్పు సమయంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా, బ్లీడింగ్ కంట్రోల్కి ఇవి ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి మీరు కొన్ని చిట్కాలు పాటిస్తే, భయం లేకుండా ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. ఇంతకు ముందు, సూది గుచ్చినప్పుడు, రక్తాన్ని చూసిన అనుభవం ఉంటే, ఆ భయం అలాగే ఉండిపోతుంది. ఆ భయంతో కళ్లు తిరగటం, బీపీ, పల్స్ పెరగటం లేదా కళ్లుతిరిగి పడిపోవటం వంటివి జరగవచ్చు. ఇలా ఉన్నవారు ముందుగా నర్సింగ్ ష్టాఫ్, డాక్టర్కు తెలియజేయాలి. అప్పుడు కౌన్సెలింగ్ చేయటం, మీకు ఉన్న ఆప్షన్స్ చెప్పటం ద్వారా మీ భయాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. అనస్థీషియా డాక్టర్ని పిలిపించి, శరీరంలో ఏ ప్రాంతంలో నుంచి రక్తం తియ్యాలో ఆ ప్రాంతానికి స్పర్శ తెలియకుండా చేయడానికి అరగంట ముందుగా క్రీమ్స్ పూస్తారు. అప్పుడు నొప్పి తెలియకుండా సూది గుచ్చుతారు. అలానే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మాటల్లో పెట్టి రక్త నమూనాలు తీయటం లాంటివి నర్స్ కూడా చేస్తారు. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్తో స్లో బ్రీతింగ్ అలవాటు అవుతుంది. ఇది రోజుకు మూడుసార్లు ఒక వారం చేయాలి. ఇదే విధంగా రక్త నమూనాలు తీసే సమయంలో కూడా పాటిస్తే భయం ఉండదు. ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొద్దీ కొన్ని పరీక్షలు చాలా అవసరం. మీకు పుట్టబోయే బిడ్డకు ఏ ఇన్ఫెక్షన్స్, సమస్యలు రాకుండా ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. అందుకే, ముందు నుంచి కౌన్సెలింగ్ సెషన్స్ తీసుకోవటం, డాక్టరును సంప్రదించటం, మీ భయాలను డాక్టర్కు ముందుగానే చెప్పటం చేయాలి. సీనియర్ నర్స్ లేదా అనస్థిటిస్ట్తో రక్త నమూనాలను తీయించుకోవటం లేదా ఐవీ లైన్ పెట్టించుకోవటం మంచిది. వీటితోపాటు బ్రీతింగ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ను పాటిస్తే, మీ భయం కొద్దికొద్దిగా తగ్గుతుంది.-డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: హెచ్ఐవీ-ఎయిడ్స్: టీకాకు దీటుగా సూదిమందు...) -
అరుదైన ఘనత సాధించిన ‘గాంధీ’ వైద్యులు
హైదరాబాద్: అంతర్జాతీయ వైద్య రంగంలో అత్యంత అరుదైన ఘటనకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వేదికైంది. శరీరంలోకి చేరిన విరిగిన సిరంజీ నీడిల్ రక్తంతోపాటు ప్రయాణించి గుండెను చుట్టివచ్చి ఊపిరితిత్తుల్లోని రక్తనాళంలో ఆగిపోయింది. పలు కార్పొరేట్ ఆస్పత్రులు తమ వల్ల కాదని చేతులు ఎత్తేయడంతో బాధితుడు గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఇటువంటి ఘటనను మొదటిసారి చూసిన గాంధీ వైద్యులు దీన్ని చాలెంజ్గా తీసుకున్నారు. ఈ విషయమై దేశ విదేశాలకు చెందిన వైద్య నిపుణులను సంప్రదించారు. ఎట్టకేలకు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి సిరంజీ నీడిల్ను బయటకు తీసి రోగికి పునర్జన్మ ప్రసాదించారు. గాంధీ ఆస్పత్రి సెమినార్ హాలులో శుక్రవారం మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్, కార్డియో«థొరాసిక్ హెచ్వోడీ రవీంద్ర, అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ కాన ఇతర వైద్య సిబ్బందితో కలసి వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలానికి చెందిన కొవ్వాడయ్య (32) నగరంలో నివసిస్తున్నాడు. 3 నెలల క్రితం ఓ మధ్యవర్తి ద్వారా కొంపల్లి సమీపంలోని దూలపల్లిలోగల ఐజెంట్ క్లినికల్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన డ్రగ్ టెస్టింగ్కు వెళ్లాడు. డ్రగ్ ఎక్కించే క్రమంలో చేతి రక్తనాళంలోకి ఐవీ క్యాన్ను అమర్చారు. ఒత్తిడితో డ్రగ్ను పంపింగ్ చేయడంతో అనుసంధానంగా ఉన్న సింథటిక్ సిరంజీ 4 సెంటీమీటర్ల వరకు విరిగి లోపలే ఉండిపోయింది. రక్తనాళంలోని సిరంజీ నీడిల్ ముక్క రక్తప్రవాహం ద్వారా గుండెకు చేరింది. అక్కడి నుంచి ప్రయాణించి కుడివైపు ఊపిరితిత్తిలోని రక్తనాళంలో ఆగిపోయింది. రక్తనాళంలో నీడిల్ ప్రయాణిస్తున్న కొద్దీ కొవ్వాడయ్యకు చాతిలో నొప్పి, ఆయాసం, దగ్గు విపరీతంగా రావడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకున్నాడు. రక్తనాళంలో ఏదో అడ్డుగా ఉన్నట్లు గుర్తించిన వైద్యులు పలు ప్రయోగాలు చేసినా ఫలించకపోవడంతో తమ వల్ల కాదన్నారు. పలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించగా రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతుందని, ప్రాణాలకు భరోసా ఇవ్వలేమన్నారు. స్థానికుల సూచన మేరకు ఈ నెల 18న బా«ధితుడు కొవ్వాడయ్య గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఈ నెల 24న సుమారు రెండున్నర గంటలు శ్రమించి శస్త్రచికిత్స నిర్వహించి ఊపిరితిత్తుల్లో చిక్కుకున్న నీడిల్ను బయటకు తీశారు. తనకు పునర్జన్మ ప్రసాదించిన గాంధీ వైద్యులకు కొవ్వాడయ్య కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ వైద్య నిపుణుల ఆసక్తి.. ప్రపంచంలోనే తొలిసారి నమోదైన ఇలాంటి కేసుతోపాటు, శస్త్రచికిత్సపై అంతర్జాతీయ వైద్యనిపుణులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. రక్తనాళంలోకి చేరిన సిరంజీ నీడిల్ రక్తంతోపాటే ప్రయాణించి ఊపిరితిత్తిలో చిక్కుకోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, శస్త్రచికిత్స వీడియో దృశ్యాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దుబాయ్కు చెందిన కొంతమంది వైద్య నిపుణులు ఫోన్ ద్వారా సంప్రదించి రోగితోపాటు శస్త్రచికిత్స చేసిన వైద్యులకు విమాన టికెట్లు పంపిస్తామని, దుబాయ్ వచ్చి నేరుగా వివరాలు వెల్లడించాలని కోరుతున్నట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు రవీంద్ర, అరుణ తెలిపారు. -
వైద్య చరిత్రలో అరుదైన కేసు
న్యూఢిల్లీ: కేరళ రాజధాని తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మనిషి శరీరంలో గుచ్చుకుపోయిన సూదిని 22 ఏళ్ల తర్వాత వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించారు. కిరణ్ కుమార్ (34) అనే వ్యక్తి 12 ఏళ్ల వయసులో ఉన్నపుడు ప్రమాదవశాత్తూ సూది అతని శరీరంలోకి దూరింది. అప్పట్లో కుటుంబ సభ్యులు కిరణ్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కిరణ్ బాడీలో ఉన్న సూదిని వైద్యులు గుర్తించలేకపోయారు. సాధారణ చికిత్స చేసి పంపించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని మరచిపోయారు. రెండు వారాల క్రితం వీపు భాగంలో నొప్పిగా ఉండటంతో కిరణ్ వైద్యులను సంప్రదించాడు. స్కాన్ చేయించగా కిరణ్ ఎడమ పిరుదులో సూది ఉన్నట్టు గుర్తించారు. తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్కు వెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. శనివారం వైద్యులు రెండున్నర గంటల సమయం శ్రమించి సర్జరీ చేసి సూదిని తొలగించారు. ఆర్థోపెడిక్, అనస్థేసియా నిపుణుల బృందం సర్జరీ చేసింది. కిరణ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.