noida rape
-
అతడిని అడ్డుకుని.. గ్యాంగ్రేప్ చేశారు
న్యూఢిల్లీ: ఉద్యోగం చేసి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలనుకున్న ఓ యువతిపై కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. ఉద్యోగం ఇప్పిస్తానన్న స్నేహితుడిని కలవడానికి పార్కుకు వెళ్లిన ఆమెపై ఐదుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వివరాలు.. నిరక్షరాస్యురాలైన 21 ఏళ్ల యువతి ఉద్యోగం చేసి తన కుటుంబానికి సాయంగా ఉండాలనుకుంది. ఇందుకోసం అమె ఉద్యోగ వేటలో ఉండగా పరిచయం ఉన్న వ్యక్తి ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకోసం బాధిత యువతిని నోయిడాలోని పార్కుకు రమ్మని చెప్పాడు. ఆ వ్యక్తికి తన సోదరుడితో కూడా పరిచయం ఉండటంతో తెలిసిన వ్యక్తే కదా అని యువతి నమ్మి వెళ్లింది. దీనిని అవకాశంగా తీసుకున్న కామాంధుడు ఆమెపై లైంగిక దాడికి యత్నించడంతో కాపాడమంటూ బాధితురాలు కేకలు పెట్టింది. అదే సమయంలో అటుగా వెళుతున్న గుడ్డు, షాము అనే ఇద్దరు వ్యక్తులు వారి వద్దకు వచ్చి అతడిని తన్నితరిమేశారు. గండం తప్పిందని బాధితురాలు అనుకుంటుండగానే ఈ ఇద్దరు ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అంతేకాకుండా తమ స్నేహితులైన బ్రిజ్ కిశోర్, పీతంబర్, ఉమేశ్లకు ఫోన్ చేసి పిలిపించి బాధితురాలిపై లైంగిక దాడి చేయించారు. తర్వాత ఈ ఐదుగురు అక్కడి నుంచి పారిపోయారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బాధితురాలు బుద్దానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపినట్లు ఎస్ఎస్పీ వైభవ్ కృష్ణ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. సెక్టర్ 63 వద్ద బుధవారం రాత్రి కొంతమంది యువతిపై లైంగిక దాడి చేశారని.. ఈ కేసులో ఆరుగురు నిందితులుగా ఉన్నారని (బాధిత యువతి స్నేహితుడితో కలిపి) వారిలో నలుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కాగా మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. బాధితురాలికి ఆస్పత్రిలో చిక్సిత అందిస్తున్నామని, ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వెల్లడించారు. బాధితురాలు, రవి ఇచ్చిన సమాచారం ఆధారంగా 12 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వీరి ఆచూకీ చెప్పిన వారికి రూ.25 వేలు నజరానా ఇస్తామని ప్రకటించారు. -
ఐదేళ్ల పాటు అత్యాచారం.. భర్తతో కలిసి ఫిర్యాదు..
నోయిడా : ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ తనను ఐదేళ్లుగా అత్యాచారం చేశారంటూ నోయిడా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమెకు 12 ఏళ్లు ఉన్నప్పుడు పక్కింట్లో ఉండే ముగ్గురు అన్నదమ్ములు, వారి ఇంటికి వచ్చే వారి స్నేహితులు దాదాపు ఐదేళ్లపాటు తనపై అత్యాచారం జరిపారని ఆమె పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఖండించారని పోలీసులు తెలిపారు. అయినా ఆమె తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల అరెస్టు
ఉత్తరప్రదేశ్లో ఆటవిక రాజ్యం ఉందంటే ఏంటో అనుకుంటాం. కానీ, శనివారం జరిగిన ఓ సంఘటన చూస్తే అది నూటికి నూరుపాళ్లు నిజమని తేలుతోంది. మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు పోలీసులను అరెస్టు చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు నిందితులూ అరెస్టయ్యారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో నోయిడాలోని సెక్టార్ 105లో పీఏసీ హెడ్ కానిస్టేబుల్ బన్షీరాం శర్మ, కానిస్టేబుల్ సుభాష్ చౌదరి తమ ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి, అక్కడున్న ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఆ వ్యాపారితో పాటు బాధితురాలినీ బెదిరించి, అక్కడినుంచి వెళ్లిపోయారు. అంతేకాదు, పోయేముందు మహిళ వద్ద ఉన్న సెల్ఫోన్ కూడా లాగేసుకున్నారు. కానీ.. పోలీసుల బెదిరింపులకు ఆ మహిళ బెదిరిపోలేదు. రాత్రికి రాత్రే సమీపంలోని ఓ పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసి, ఐదుగురు నిందితుల్లో నలుగురిని పట్టుకున్నట్లు ధర్మేంద్ర చౌహాన్ అనే పోలీసు అధికారి తెలిపారు. పోలీసులిద్దరితో పాటు అరుణ్, బంటీ అనే వారిని అరెస్టు చేయగా, జీతు అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నలుగురూ తమ నేరాన్ని అంగీకరించారు. సంఘటన సమయంలో ఉపయోగించిన పోలీసు జీపును, బాధితురాలి సెల్ఫోనును స్వాధీనం చేసుకున్నారు.