Obscene Remarks
-
మీ బుర్రలో ఇంత చెత్త ఉందా?.. యూట్యూబర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: పబ్లిక్గా అశ్లీల వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. పాపులారిటీ కోసం అంత అసభ్య భాష మాట్లాడతారా? అంటూ మండిపడింది. ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు అతని వికృతమైన, చెత్త మనస్తత్వానికి నిదర్శనమని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు అలాంటి భాష ఎవరైనా మాట్లాడతారా అని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో తాను చేసిన వ్యాఖ్యలపై వేరు వేరు ప్రాంతాల్లో నమోదైన కేసులను కలిపి విచారించేలా ఆదేశాలివ్వాలని అల్హాబాదియా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ను మంగళవారం(ఫిబ్రవరి 18) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటిశ్వర్సింగ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బుర్రలో ఇంత చెత్త ఉందా అని తీవ్రంగా మందలించారు. కొంత కాలం పాటు ఎలాంటి షోలలో పాల్గొనరాదని అల్హాబాదియాను ఆదేశించారు. అయితే వ్యాఖ్యలకుగాను నమోదైన కేసుల్లో అల్హాబాదియాకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఊరటనిచ్చింది. ఈ కేసుల్లో అతడిని అరెస్టు చేయకుండా స్టే విధించింది. బీర్బైసెప్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పాలపులర్ అయిన అల్హాబాదియా అతని స్నేహితుడు సమయ్ రైనాషోలో పాల్గొన్నప్పుడు నోరు జారారు. అతని అశ్లీల వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.ఏకంగా మహారాషష్ట్ర,అస్సాం సీఎంలు ఈ విషయమై స్పందించారంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. యూట్యూబ్లో అశ్లీల కంటెంట్పై కేంద్రానికి నోటీసులు..యూట్యూబ్లో అశ్లీల కంటెంట్ను నియంత్రించేందుకు నిబంధనలు రూపొందించాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రణ్వీర్ అల్హాబాదియా కేసు విచారణ సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అలాంటి నిబంధనలేవైనా రూపొందిస్తే తాము సంతోషిస్తామని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. -
Virat kohli: కోహ్లీ కుమార్తెపై అసభ్యకర వ్యాఖ్యల కేసు.. నిందితుడికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: టీ–20 ప్రపంచ కప్ మ్యాచ్లో పాకిస్తాన్పై కోహ్లీ సేన ఓటమి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసి, అరెస్టు అయిన సంగారెడ్డి వాసి రాంనగేశ్కు బెయిల్ లభించింది. ముంబైలోని మేజిస్ట్రేట్ న్యాయస్థానం షరతులతో శనివారం అతనికి బెయిల్ మంజూరు చేసింది. సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రకరణ్ ప్రాంతానికి చెందిన రాంనగేశ్ తండ్రి శ్రీనివాస్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఫిట్టర్గా పనిచేస్తున్నారు. రాంనగేశ్ కందిలో ఉన్న హైదరాబాద్ ఐఐటీ నుంచి ఉన్నత విద్యనభ్యసించాడు. బెంగళూరు కేంద్రంగా పని చేసే ఓ ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఉద్యోగం చేసిన నగేశ్... ఎంఎస్ కోసం అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ క్వార్టర్స్లో తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. ట్విట్టర్ ద్వారా అతను గతనెలలో ఈ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ నెల 9న ముంబై పశ్చిమ రీజియన్ సైబర్ క్రైమ్ పోలీసులు రాంనగేశ్ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. రాంనగేశ్ బెయిల్ పిటిషన్ను విచారించిన కోర్టు రూ.50 వేలకు పర్సనల్ బాండ్, అంతే మొత్తానికి సెక్యూరిటీ బాండ్ సమర్పించాలని ఆదేశించింది. నెల రోజుల వరకు ప్రతి సోమ, గురువారాల్లో ముంబై వెస్ట్ రీజియన్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో హాజరుకావాలని షరతులు విధించింది. -
రేపే ఎన్నికలు.. అభ్యర్థిపై కేసు నమోదు
ముంబై : రాష్ట్ర అసెంబ్లీకి సోమవారం (అక్టోబర్) నాడు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్లీ నియోజకవర్గ ఎన్సీపీ అభ్యర్థి ధనంజయ్ ముండేపై శనివారం రాత్రి కేసు నమోదైంది. తన కజిన్, బీజేపీ అభ్యర్థి పంకజ ముండేపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై బీజేపీ నేత జుగల్ కిశోర్ లోహియా ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 17న కేజ్ తాలుకాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పంకజ ముండేపై ధనంజయ్ అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోలీసులకు సమర్పించారు. వీడియోను పరిశీలించిన పోలీసులు ధనంజయపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్, మహిళా కమిషన్కుకూడా ఫిర్యాదు చేశామని లోహియా వెల్లడించారు. ఇక ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారడం గమనార్హం. పంజక ముండే దివంగత గోపినాథ్ ముండే కూతురు అనే విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నారు. కాగా, తనపై అక్రమంగా కేసు పెట్టారని, వీడియోను ఎడిట్ చేసి తన వ్యాఖ్యలను తప్పుగా చూపెట్టారని ధనంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా చెల్లెళ్ల మధ్య ఇంతటి జుగుప్సాకర రీతిలో చిచ్చు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో అంతా ఫేక్ అని, కావాలంటే దానిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపాలని డిమాండ్ చేశాడు. ఓటమి భయంతోనే ప్రత్యర్థి పక్షం తనపై క్షక్ష సాధింపు చర్యలకు దిగుతోందని విమర్శించారు. -
అంజలిపై అసభ్య వ్యాఖ్యలు.. బీజేపీ నేతపై కేసు
సాక్షి, ముంబై: ఓ ఉద్యమకారిణిపై అసభ్య వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీజేపీ నేత ఏక్నాథ్ ఖడ్సే పై కేసు నమోదు అయ్యింది. ఓ పబ్లిక పంక్షన్ లో ఆయన ప్రసంగిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ అంజలి అనే ఉద్యమకారిణి వకోలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అంజలి దమానియా ఆప్ లో క్రియాశీలక నేతగా కూడా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఏక్నాథ్ తన పుట్టినరోజు సందర్భంగా జలగావ్లో ఓ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ప్రసంగిస్తున్న వేళ అంజలిని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆమె సన్నిహితుడొకరు ఆమెకు సమాచారం అందించగా, వకోలా పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై ఐపీసీ 509(మహిళలను కించపరిచేలా వ్యవహరించటం) ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే ఘటన జలగావ్లో చోటుచేసుకోవటంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వకోలా అధికారులు తెలిపారు. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఏక్నాథ్ చెబుతుండగా, తన దగ్గర వీడియో సాక్ష్యం ఉందని అంజలి వెల్లడించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏక్నాథ్పై గతేడాది అవినీతి ఆరోపణలు వినిపించగా, అంజలి మరికొందరితో కలిసి ఆ అంశంపై ప్రజా ప్రయోజన దాఖలు చేశారు. చివరకు ఆరోపణలు రుజువు కావటంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్నాథ్ను మంత్రి పదవి నుంచి తప్పించారు.