ఇన్ఫీ నారాయణమూర్తికి బహిరంగ లేఖ
ముంబై: అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్లో బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు రగిలినవివాదం చిలికి చిలికి సునామీలా రూపాంతంరం చెందింది. సంస్థ సీఈవో విశాల్ సిక్కా రాజీనామాకు దారితీసింది. విమర్శలు, ప్రతివిమర్శలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తిపై ఇన్ఫోసిస్మాజీ బోర్డు సభ్యుడు ఒకరు విమర్శలు గుప్పిస్తూ బహిరంగ లేఖ రాయడం సంచలనం రేపింది. మరోవైపు కొత్త సీఈవో ఎంపిక కోసం తీవ్ర కసరత్తు ఇంకా కొనసాగుతోంది.
ఇన్ఫోసిస్ రెండు దశాబ్దాలుగా సంస్థకు మీరందించిన సేవలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయంటూనే ఇన్ఫోసిస్ బోర్డ్లో 15 సంవత్సరాలు స్వతంత్ర డైరెక్టర్గా ఉన్నఓంకార్ గోస్వామి ఈ లేఖ రాశారు. సంస్థలో పరిస్థితి మరింత చెడకముందే , మీ గౌరవం మరింత నాశనం కాకముందే సంస్థనుంచి వైదలగాలని నారాయణమూర్తిని కోరారు. ముఖ్యంగా సీఈవో విశాల్ సిక్కా రాజీనామాపై నారాయణ మూర్తి అధికారికంగా స్పందించకపోవడం, తదితర పలు అంశాలపై ఆయన విమర్శలు గుప్పించారు. సంస్థలో జరుగుతున్న పరిణామాలపై తనతో పాటు ప్రతి మాజీ స్వతంత్ర డైరెక్లర్లు అందరమూ తీవ్రంగా కలత చెందుతున్నామని ఓంకార్ పేర్కొన్నారు.
పనయా వ్యవహారం ,కార్పొరేట్ గవర్నెన్స్ , వేతన ప్యాకేజీ వ్యవహారాలను ప్రస్తావించిన ఆయన బోర్డు అసమర్థతపై విమర్శలు గుప్పించారు. మీ డిమాండ్లను బోర్డు ఎందుకు సమర్ధిస్తోందని నారాయణమూర్తిని ఉద్దేశించి ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే, బోర్డు దుర్బలంగా ఉందని వ్యాఖ్యానించారు.
ఒకవైపు యూబీ ప్రవీణ్రావు ప్రశంసిస్తూనే ఆయన వేతనంపై విమర్శలు గుప్పిస్తారన్నారు. వాస్తవానికి విశాల్ బాధ్యతలు స్వీకరించినప్పుడు పరిశ్రమ వెనుకబడి ఉందని కానీ ఆ తరువాత ఇది ఇప్పుడు టాప్ క్వార్టైల్ లో ఉంది. ఆరు విజయవంతమైన క్వార్టర్ల తరువాత తలసరి ఆదాయం పెరిగిందంటూ విశాల్ను వెనకేసుకొచ్చారు.
జరిగింది చాలు. ఇంకా మీ చర్యలను కొనసాగించడం ద్వారా సంస్థను గాయపరచవద్దని కోరారు. ఇన్ఫోసిస్ దాని వ్యాపారం ద్వారా గాయాలనుంచి కోలుకోనివ్వండి తిరిగి వాటాదారుల విలువను పెంచుకోనివ్వండి. విశాల్కు పగ్గాలు అప్పగిస్తున్నప్పుడు మీరు వాగ్దానం చేసినట్టుగా బయటి నడవడం తెలుసుకోండి. మీరన్నట్టుగా కార్పొరేట్ గవర్నెన్స్ క్షీణిస్తోంది. ఇక ముందు దీన్ని అదృశ్యం కానివ్వకండి. ఈ కార్పొరేట్ ప్రపంచంలో మరెవ్వరిమీదా లేనంత అపారమైన విశ్వాసముంది మీమీద. ఇలా రాస్తున్నందుకు మన్నించండంటూ ఆయన తన లేఖను ముగించారు.
మరోవైపు ఈ వ్యవహారంపై రేపు( ఆగస్టు 23) ఇన్వెస్టర్లతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. అలాగే మరో కో ఫౌండర్ నందన్ నీలేకనీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ ఫౌండర్ గ్రూపునకు, బోర్డు మధ్య వివాదం పరిష్కారంలో ఆయన మధ్య వర్తిత్వం వహించనున్నారని తాజా నివేదికల సమాచారం. ఇవన్నీ ఇలా ఉండగా మార్కెట్ రెగ్యులేటరీ సెబీ కూడా స్పందించింది. వాటాదారుల ప్రయోజనాలను రక్షించేందుకు రంగంలోకి దిగింది. విశాల్ రాజీనామా, బైబ్యాక్ తదితర అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొంది.
కాగా 2000, నవంబరులో ఇన్ఫోసిస్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్గా చేరిన డా. ఓంకార్ గోస్వామి డిశెంబర్ 31, 2014లో రిటైర్ అయ్యారు.