156 మంది భారతీయులు తిరిగొచ్చారు
తిరువనంతపురం: దక్షిణ సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న 156 మంది భారతీయులు స్వదేశానికి క్షేమంగా తిరిగొచ్చారు. భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానంలో వీరు శుక్రవారం ఉదయం కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకున్నారు. వీరిలో 46 మంది కేరళ, ఇద్దరు నేపాలీలు, ఏడుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు, దక్షిణ రాష్ట్రాలకు చెందిన వారున్నారు.
దక్షిణ సూడాన్ లో మొత్తం 500మంది భారతీయులున్నారు. వీరిలో 300 మంది తమ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం అక్కడే ఉంటామని తెలిపారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పేర్కొన్నారు. వారి క్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆ దేశ ఉపాధ్యక్షుడు తనకు వివరించారని ఆయన తెలిపారు.
దక్షిణ సుడాన్ లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు 'ఆపరేషన్ సంకట్ మోచన్' ను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం గురువారం రెండు సీ-17 విమానాలు ఆ దేశానికి బయలుదేరి వెళ్లాయి. ఈ ఆపరేషన్ కు వీకేసింగ్ నాయకత్వం వహించారు.