తెలంగాణ బిల్లును తిరస్కరించాలి
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్లైన్: సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీల అజెండాలను పక్కన పెట్టి అసెంబ్లీలో తెలంగాణా ముసాయిదా బిల్లును తిరస్కరించాలని సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ స్థానిక హిందూ కళాశాల సెంటర్లోని రాజకీయ వేదికపై బుధవారం మహిళా జేఏసీ నాయకురాలు జెట్టి ఝాన్సీరాణి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఆచార్య శామ్యూల్ మాట్లాడుతూ రాజకీయ పార్టీ లు ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్థి పలికి సీమాంధ్ర ప్రజల మనోభావాలను ప్రజా ప్రతినిధుల ద్వారా వ్యక్తపరచాలని డిమాండ్ చేశారు.
తెలంగాణా ప్రజా ప్రతినిధులు, నాయకులు ఐక్యంగా పోరాడుతుండగా సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల మధ్య ఐక్యత లోపించడంతో తెలంగాణా బిల్లు రూపుదిద్దుకునే వరకూ వచ్చిందన్నారు. ఈ సందర్భంగా దీక్షలో బి.అనసూయ, వి.రమణమ్మ, పి.లక్ష్మి, ఎల్.నిర్మల, వి.చిట్టెమ్మ, ఇంద్రాణి, వి.సుజాత, ఎన్.కార్తీక్, ఎ.దేవరాజు పాల్గొన్నారు. జేఏసీ నాయకులు వైవీ సురేష్, స్వర్ణ పాండురంగారావు, కోసూరి వెంకట్, పాశం రవీంద్రయాదవ్, నల్లపనేని విజయలక్ష్మి, లింగాల సాయియాదవ్, రామిరెడ్డి సంఘీభావం తెలిపారు.