పింఛన్ ఇయ్యవా తమ్ముడూ..!
విజయనగరం అర్బన్:మాకు అధికారం అప్పగిస్తే ఐదు రెట్లు భరోసా అని ఎన్నికల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకే భరోసా కల్పించేలా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల ముందు రూ.200 ఉన్న పింఛన్ను రూ.1000 చేస్తామని ప్రకటనలు గుప్పించి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే లబ్ధిదారుల సంఖ్యను చూసి నాలుక కరుచుకుని వడపోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఆధార్ అనుసంధానం, ఐదెకరాలలోపు ఉన్నవారికి మాత్రమే మినహాయింపు అంటూ ఒకేసారి జిల్లాలోనే 60 వేల మంది పైచిలుకు లబ్ధిదారులను తొలగించారు. పింఛన్లు రద్దు అయిన వారి నుంచి తిరిగి దరఖాస్తులు స్వీకరించగా జిల్లాలో 40 వేల మంది మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. అయితే వీరిలో దాదాపుగా 30 వేల మంది అర్హులని తేలినప్పటికీ కేవలం 11 వేల మందికి మాత్రమే తాజాగా పింఛన్లు మంజూరు చేశారు. ఇప్పటివరకూ లబ్ధిదారుల ఎంపికపై పూర్తి అధికారాలను జన్మభూమి కమిటీలకు అప్పగించిన ప్రభుత్వం ప్రస్తుతం పింఛన్ పంపిణీ బాధ్యతలను కూడా వారికే కట్టబెట్టింది.
విభిన్న వర్గాలకు ఆసరాగా నిలుస్తున్న సామాజిక భద్రతా పింఛన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్ లబ్ధిదారుల ఎంపిక దగ్గర నుంచి పంపిణీ బాధ్యతలను కూడా జన్మభూమి కమిటీలకే అప్పగించడం చూస్తుంటే అక్రమాలకు గేట్లు తెరిచినట్లేననే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధానమైనది సామాజిక భద్రతా పింఛన్ పథకం. జిల్లాలో 2,18,675 మంది లబ్ధిదారులకు ప్రతినెలా సుమారు రూ.220 కోట్లను పింఛన్ రూపంలో ఖర్చుపెడుతున్నారు. జిల్లాలో గీత,చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్ రూపంలో ప్రభుత్వం అందిస్తోంది.
అయితే ఇంత పెద్ద పథకాన్ని తెలుగుతమ్ముళ్ల చేతికి అప్పగించడం అధికారులను సైతం విస్మయానికి ురిచేస్తోంది. ఇదివరకు లబ్ధిదారుల వేలిముద్రల ఆధారంగా పోస్టాఫీసు ద్వారా పింఛన్ పంపిణీ చేపట్టారు. ప్రస్తుతం జన్మభూమి కమిటీల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించడం పారదర్శకతకు తూట్లు పాడవడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మేరకు సెర్ప్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై పోస్టాఫీసుల ద్వారా పింఛన్ల పంపిణీకి స్వస్తి చెబుతూ జన్మభూమి కమిటీల సమక్షంలోనే పింఛన్లు పంపిణీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల పెన్షన్లను మే 10వ తేదీలోగా నూరుశాతం పంపిణీని పూర్తిచేయాలని, ఒక వేళ ఎక్కడైనా డ్రాచేసిన మొత్తం పంపిణీ చేయలేకపోతే తిరిగి ఆ మొత్తాన్ని సెర్ప్ ఖాతాకు జమచేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పెన్షన్లను పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, బిల్ కలెక్టర్ల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. అయితే ఈ పెన్షన్లన్నీ మాన్యువల్ పద్ధతిన పంపిణీ చేయాలని, ఆ వివరాలను ఏ రోజుకారోజు ఎన్టీఆర్ భరోసా, ఏపీజీఓవీ.ఇన్ అనే వెబ్సైట్కు అనుసంధానం చేయాలని పేర్కొన్నారు.
ఇంతలోనే పంపిణీలో మార్పులెందుకో...?
పెన్షన్ పంపిణీని పోస్టాఫీసుల ద్వారా చేపడుతున్నాం. మీరందరూ తప్పనిసరిగా ఆధార్నంబర్తోపాటు పెన్షన్బుక్ను పోస్టాఫీసు అధికారులకు అందజేయలి. అంతేకాకుండా ప్రతినెలా సంబంధిత వ్యక్తి వచ్చి వేలిముద్ర వేస్తేనే పెన్షన్ ఇస్తామంటూ బయోమెట్రిక్ అనుసంధానం పేరుతో జనాన్ని ముప్పుతిప్పలు పెట్టిన ప్రభుత్వం ఇంతలోనే ఆ నిర్ణయాన్ని ఎందుకు వెనక్కు తీసుకుందో అర్థం కాని ప్రశ్నగా మారింది. ఇప్పటికే జన్మభూమి కమిటీల ఏర్పాటుతో గ్రామాల్లో విభేదాలు భగ్గుమంటున్నాయని, ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత చేయిజారే ఆస్కారం లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.