pinnepalli
-
తేలుకాటుకు గురైన మహిళ మృతి
యాడికి (తాడిపత్రి) : తేటుకాటుకు గురై కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాడికి మండలం పిన్నేపల్లికి చెందిన లక్ష్మి (28) మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు... లక్ష్మి ఆదివారం సాయంత్రం పశువులకు మేత వేయడం కోసం కందిపొట్టు విదిలిస్తుండగా అందులో ఉన్న తేలు కుట్టింది. దీంతో ఆమెను 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. ఈమెకు రేచీకటితో బాధపడుతున్న భర్త చితంబరరెడ్డి, ఆరో తరగతి చదువుతున్న కూతురు, నాలుగో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. నేత్రదానం భర్త చితంబరరెడ్డి, ఆమె తరపు బంధువులు లక్ష్మి కళ్లను కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు దానం చేయడానికి సమ్మతించారు. దీంతో వారు నేత్రాలను సేకరించారు. వీటిని హైదరాబాద్కు పంపించి కళ్లు అవసరం అయిన వారికి అమర్చేలా చర్యలు తీసుకుంటామని వైద్యులు తెలిపారు. -
ఊపిరి తీసిన ఊయల
యాడికి : బడికి పోయి ఉన్నా మాకు నువ్వు దక్కేదానివి కదమ్మా అంటూ ఆ తల్లిదండ్రులు తమ కుమార్తె మృతదేహంపై పడి రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ఊయల బిగుసుకుని ప్రగతి (11) అనే బాలిక ఊపిరి ఆగిపోయింది. స్థానికులు తెలిపిన మేరకు... పిన్నేపల్లి గ్రామానికి చెందిన రవీంద్రనాథ్రెడ్డి,వరలక్ష్మి దంపతులకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె ప్రగతి చిన్నది కావడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. ప్రగతి మండల కేంద్రం యాడికిలోని ప్రైౖవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. మంగళవారం ‘అమ్మా చెవిలో నొప్పిగా వుంది. ఈరోజు స్కూలుకు వెళ్లను’ అని చెప్పడంతో సరే ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండమ్మా అని తల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. ఇంటిలో ఉన్న ఊయల ఊగుతూ ఆడుకుంటోంది. అయితే ఉన్నపళంగా ఊయల మెడకు బిగుసుకోవడంతో ఊపిరాడక పాప మృతి చెందింది. మధ్యాహ్నం పొలం నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు విగతజీవిగా కుమార్తె కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు.