ఆయకట్టు 7.50 లక్షలు
- రాజీవ్-ఇందిరాసాగర్ పరిధిలో పెరగనున్న సాగు భూమి
- సీఎం ఆదేశాలతో నీటిపారుదల శాఖ కసరత్తు
- ఈనెలలో తుదిరూపం తీసుకురావాలని నిర్ణయం
- కేసీఆర్ విదేశాల నుంచి రాగానే మళ్లీ సమీక్ష
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజీవ్సాగర్ (దుమ్ముగూడెం), ఇందిరాసాగర్ ప్రాజెక్టులను ఒక్కటిగా చేసి ఆయకట్టును మరింతగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల ఈ రెండు ప్రాజెక్టులను కలిపి 4 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలని ప్రాథమికంగా నిర్ణరుుంచింది. దీన్ని కాస్త పెంచి 7.50 లక్షల ఎకరాలు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి చేసిన సమీక్షలో చర్చకు వచ్చింది. జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆ శాఖ అధికారులు సర్వే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో జలయజ్ఞంలో రాజీవ్సాగర్తో 2 లక్షల ఎకరాలు, ఇందిరాసాగర్తో 1.32 లక్షల ఎకరాలకు డిజైన్ చేశారు.
ప్రస్తుతం ఇందిరాసాగర్ హెడ్వర్క్ పనులు ఆంధ్రప్రదేశ్లో కలిసిన వేలేరుపాడు మండలం రుద్రంకోటలో చేయూల్సి ఉంది. ప్రాజెక్టు పనుల కొనసాగింపుపై అక్కడి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ముగిసిన ఇందిరసాగర్ పనులకు రాజీవ్సాగర్ పనులను అనుసంధానం చేసి ఒకే ప్రాజెక్టుతో సాగు నీళ్లు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు కసరత్తు చేసింది. రెండు ప్రాజెక్టులకు రూ.1700 కోట్లు ఖర్చు చేశారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రధాన కేంద్రం అశ్వాపురం మండలం పాములపల్లిలో ఉంది. ఇక్కడ నుంచి తొలుత కుమ్మరిగూడెం, గొల్లగూడెం, కరకవాగు, రోళ్లపాడు, లలితాపురం, సింగభూపాలెం, మద్దుకూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా డిజైన్చేశారు.
రెండు ప్రాజెక్టులను కలిపితే పాలేరు, ఇల్లెందు నియోజకవర్గాలకు కూడా పూర్తి స్థాయిలో నీరు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. నాగార్జునసాగర్ నీరు జిల్లాలోని ఆయకట్టు అందకపోతే ప్రత్యామ్నాయంగా గోదావరి నీటిని రాజీవ్-ఇందిరాసాగర్తో అందించాలని ప్రభుత్వం నూతన డిజైన్ పనిలో నిమగ్నమైంది. ప్రాథమికంగా ఈ రెండు ప్రాజెక్టుల అనుసంధానంతో సుమారు 4 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలని నిర్ణయించారు. అయితే భారీ వ్యయంతో ఒకే ప్రాజెక్టుతో జిల్లాలోని అన్ని మండలాలకు సాగు నీరు అందేలా ఇంకా ఎన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అవసరమవుతాయో నివేదిక తయారి చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది.
సీఎం సమీక్షలో 7.50 లక్షల ఎకరాలు..
ఈనెల 2,3 తేదీలో ముఖ్యమంత్రితో కేసీఆర్.. రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టు వ్యయం పెరిగే అవకాశం ఉన్నా సీఎం సమీక్షలో సుమారు 7.50 ఎకరాల వరకు సాగు నీటిని ఇచ్చేలా డిజైన్ చేయాలని చర్చకు వచ్చినట్లు సమాచారం. ఎంత మేరకు సాగు ఆయకట్టు పెరుగుతుందో దాని డిజైన్ పూర్తిగా తయారు చేయాలని సీఎం ఇచ్చిన ఆదేశాలతో ఆశాఖల అధికారులు పరుగులు పెడుతున్నారు. గత నెలవరకు 4 లక్షల ఎకరాలకు చేసిన డిజైన్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు తదితర విషయాలన్నీ సంబంధిత అధికారులు సీఎంకు వివరించారు. ఆయకట్టు పెంచే విషయమై నూతన డిజైన్ చేయాలన్న ఆదేశాలతో అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే ప్రారంభించారు. సీఎం విదేశాల నుంచి రాగానే పూర్తి స్థాయి నివేదిక అందించేందుకు ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ అధికారులు సమాయత్తమవుతున్నారు.
ఆయకట్టుకు జీవం పోసేనా..?
కృష్ణా, గోదావరి రెండు నదులకు మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలు జన్మస్థానం. జీవనదులుగా ఇవి పేరొందాయి. ఇక్కడి నుంచి రెండు నదులు ప్రవహిస్తున్నా తెలంగాణలోకి వచ్చేసరికి రెండు నదుల పరీవాహక ప్రాంతంలో విభిన్నత కనిపిస్తుంది. కృష్ణా నదిలో నీరు లేకపోతే నాగార్జునసాగర్ నిండక నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సాగు నీరు అందదు. కరువు పరిస్థితులుంటే కృష్ణా పరీవాహక ప్రాంతాలు సాగు, తాగు నీటి కోసం తహతహ లాడుతాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఖరీఫ్ సీజన్లో ఈ ఇబ్బంది ఉండడం లేదు.
జిల్లా విషయానికి వస్తే..ఛత్తీస్గఢ్ రాష్ట్రం గోదావరికి సమీపాన ఉంది. దండకారణ్యంలో భారీ వర్షాలతో ఈ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. రాజీవ్సాగర్ ద్వారా ఈ నీటిని మళ్లించే సాగు నీటి అందించాలని జలయజ్ఞంలో డిజైన్ చేశారు. ప్రస్తుతం సాగర్లో నీరులేక ఎన్నెస్సీ ఆయకట్టు బీడుభూమిగా మారింది. భవిష్యత్లో ఇదే పరిస్థితులు ఉంటే సాగర్ ఆయకట్టుకు గోదావరి నది జీవం పోయనుంది. నూతన డిజైన్తో సాగర్ ఆయకట్టుకు నీరందించాలంటే భారీ వ్యయం కానుంది. ప్రభుత్వం ప్రచారం ఆర్భాటం చేస్తుందా..? లేక గతంలో కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం మాదిరిగా ప్రాజెక్టులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందా? అనేది చూడాలి.