Ready Made showroom
-
సిరిసిల్ల.. రెడీమేడ్ వస్త్రాల కేంద్రం
సాక్షి, సిరిసిల్ల: విస్తరిస్తున్న వస్త్రోత్పత్తి రంగంతో సిరిసిల్ల మేడిన్ రెడీమేడ్ వస్త్రాల కేంద్రంగా మారుతోంది. యువతకు నమ్మకమైన ఉపాధి చూపుతోంది. సిరిసిల్లలో వస్త్రపరిశ్రమ కొత్తపుంతలు తొక్కుతోంది. రెడీమేడ్ డ్రెస్సుల తయారీతో యువతీయువకులకు మెరుగైన ఉపాధి లభిస్తోంది. గతంలో బీడీలు చేసిన మహిళలు, సాంచాలు నడిపిన యువకులు రెడీమేడ్ డ్రెస్సుల తయారీలో బతుకుదెరువు చూసుకుంటున్నారు. సిరిసిల్లలో జూకీ కుట్టు మిషన్లపై షర్ట్స్, ప్యాంట్లు, పెటీకోట్స్ కుడుతున్నారు. వస్రా్తలను హైదరాబాద్, ముంబాయి, బీవండి, సూరత్, కోల్కత్తా వంటి పట్టణాలతో పాటు కరీంనగర్, కామారెడ్డి, సిద్దిపేట, కొత్తపల్లి, జగిత్యాల ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. సిరిసిల్లలో డ్రెస్సుల తయారీకి బ్రాండెండ్ కంపెనీలు కూడా ఆర్డర్లు ఇస్తుండడం విశేషం. సిరిసిల్లలోని వివిధ ప్రాంతాల్లో రెడీమేడ్ వస్త్రాల తయారీ కేంద్రాలు 35 వరకు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో 30 నుంచి 75 మంది పని చేస్తున్నారు. ఇలా సిరిసిల్లలో రెండు వేల మంది ఉపాధి పొందుతున్నారు. వస్త్రోత్పత్తి కేంద్రంలో రెడీమేడ్ దుస్తులు సిరిసిల్ల వస్త్రోత్పత్తికి కేంద్రం. కానీ ఇప్పుడు రెడీమేడ్ వస్త్రాల తయారీకి నిలయంగా మారుతోంది. 40 ఏళ్లు దాటిన వారు సాంచాలు నడుపుతూ ఉపాధి పొందుతుండగా.. 20 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వారు రెడీమేడ్ బట్టల తయారీలో శిక్షణ పొందుతూ జూకీ మిషన్లపై బట్టలు కుడుతున్నారు. నిత్యం 8 నుంచి 10 గంటలు పని చేసూ్త..నెలకు రూ.10 నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నారు. కష్టమైన సాంచాల పని కంటే జూకీ కుట్టు మిషన్లపై డెస్సులు కుట్టడం ఒకింత యువకులకు వెసులుబాటు కలుగుతోంది. రెడీమేడ్ వస్త్రాలకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉండడంతో సిరిసిల్ల యువకులు ఆసక్తిగా పని చేస్తున్నారు. డ్రెస్సుల తయారీకి అవసరమైన వస్త్రాన్ని, మెటీరియల్ను హైదరాబాద్, ముంబాయి నుంచి దిగుమతి చేసుకుంటూ తయారైన రెడీమేడ్ వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. రెడీమేడ్ రంగం సిరిసిల్లలో విస్తరిస్తోంది. ఇప్పటికే సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్డర్లు రావడంతో మరమగ్గాల కార్మికులకు మెరుగైన వేతనాలు వస్తుండగా మరోవైపు గార్మెంట్ రంగంతో యువత ఉపాధి సాధిస్తుంది. కుటుంబానికి అండగా.. నేను ఏడోతరగతి చదువుకున్న. బీడీలు చేసేదాన్ని. ఆ పనితో నెలకు రూ.1500 వచ్చేవి. బీడీల పనితో లాభం లేదని, మిషన్పై షర్ట్్సకు అవసరమైన చార్టెక్ కుట్టడం నేర్చుకున్న. రోజుకు 300 అంగీలకు చార్టెక్ కుడుతా. ఇప్పుడు నెలకు రూ.4వేలు వస్తాయి. నా భర్త ప్రభాకర్ వైపని కార్మికుడు. మాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరం పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది. – ఒగ్గు లత, సిరిసిల్ల నెలకు రూ.15 వేలు వస్తున్నయ్ మాది శివనగర్. నేను పదోతరగతి చదువుకున్న. టేలర్ పని నేర్చుకుని బట్టలు కుట్టేవాడిని. జూకీ మిషన్ నేర్చుకున్న. కాలర్ కుడుతా. ఒక్కో దానికి రూ.6 ఇస్తారు. ఇలా రోజుకు 70 నుంచి 80 వరకు కుడుతాను. నెలకు రూ.15 వేలు జీతం వస్తుంది. నా భార్య కూడా మిషన్ కుడుతుంది. నెలకోసారి జీతం తీసుకుంటా. నాకు పాప, బాబు. ఆరేళ్లుగా ఇదే పని చేస్తున్న. – కారంపురి సతీష్, సిరిసిల్ల సొంతంగా మార్కెటింగ్ నేను బట్టను ముంబాయి, బీవండి నుంచి తెచ్చి షర్ట్స్ కుట్టిస్తా. డ్రెస్సులను సొంతంగానే మార్కెట్ చేస్తున్న. హైదరాబాద్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలతోపాటు ముంబాయి వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నా. నా వద్ద 70 మంది పని చేస్తున్నారు. నాకు సిరిసిల్లలో రెండుచోట్ల జూకీ కేంద్రాలు ఉన్నాయి. చేతినిండా పని ఉంటుంది. మంచి ఆదాయం వస్తుంది. నాతోపాటు పది మందికి పని కల్పించే స్థితికి రావడం సంతోషంగా ఉంది. – లగిశెట్టి రాకేశ్, జూకీ, కేంద్రం నిర్వాహకుడు జూకీ కుట్టు మిషన్పై డ్రెస్సులు కుడుతున్న ఇతడి పేరు ఆడెపు రమేశ్. సిరిసిల్ల ప్రగతినగర్కు చెందిన రమేశ్ పదోతరగతి వరకు చదువుకున్నాడు. చదువు ఆపేసి టేలర్ పని నేర్చుకున్నాడు. కొద్దిరోజులు పని చేసి ఆధునిక జూకీ మిషన్పై కుట్టు నేర్చుకుని ముంబాయి వెళ్లాడు. అక్కడ పదేళ్లు పనిచేశాడు. అదే పని సిరిసిల్లలో లభించడంతో ఇక్కడికి వచ్చి ఆరేళ్లుగా జూకీ మిషన్పై షర్ట్స్ కుడుతూ నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు.. భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. నిత్యం రెడీమేడ్ వస్త్రాల తయారీతో ఉపాధిపొందుతున్నాడు.జూకీ మిషన్పై షర్ట్స్కు బటన్స్ పెడుతున్న ఈమె పేరు నల్లగొండ లావణ్య. సిరిసిల్ల పట్టణానికి చెందిన లావణ్య ఇంటర్ చదివింది. గతంలో ఈమె బీడీలు చేసేది. నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తే నెలకు బీడీల ద్వారా రూ.1500 వచ్చేవి. రెండేళ్ల కిందట షర్ట్స్కు బటన్స్ పెట్టడం నేర్చుకుని జూకీ మిషన్పై పని చేస్తోంది. ఇప్పుడు పీస్ వర్క్ ఆధారంగా నెలకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు సంపాదిస్తుంది. లావణ్య భర్త రమేశ్ వీడియో గ్రాఫర్. వీరికి ఇద్దరు పిల్లలు. ఇద్దరూ శ్రమిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఇద్దరే కాదు.. సిరిసిల్ల జిల్లాకేంద్రంలో రెండు వేల మంది యువకులు రెడీమేడ్ వస్త్రాల తయారీలో ఉపాధి పొందుతున్నారు. -
కిలాడి దంపతుల అరెస్టు
క్రైం (కడప అర్బన్) : రెడీమేడ్ షోరూం నిర్వహిస్తూ అప్పుల పాలైన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ ఎట్టకేలకు పోలీసుల వలలో చిక్కాడు. ఏకంగా కానిస్టేబుల్ ఇంటిలో గతనెల 14వ తేదీన దొంగతనానికి పాల్పడే యత్నంలో అడ్డంగా దొరికిపోయాడు. భర్త పాల్పడే దొంగతనాలకు భార్య తోడునీడగా నిలవడంతో ఆమె కూడా కటాకటాల పాలైంది. పసుపులేటి చంద్రశేఖర్ అలియాస్ శంకర్ (34), అతని భార్య పసుపులేటి మంజువాణి అలియాస్ వాణి అలియాస్ గనమంతు మంజువాణి (30) అనే కిలాడిజంటను జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్గులాఠీ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ అశోక్కుమార్ ఆధ్వర్యంలో అర్బన్ సీఐ శ్రీరాములు, తాలూకా ఎస్ఐ బాల మద్దిలేటి ప్రత్యేక బృందంగా ఏర్పడి ఐటీఐ సర్కిల్ వద్ద సోమవారం అరెస్టుచేశారు. వారి వద్దనుంచి రూ. 12 లక్షల విలువైన 405 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. సోమవారం రాత్రి డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారిని హాజరు పరిచారు. ఈ సందర్బంగా డీఎస్పీ అశోక్కుమార్ మాట్లాడుతూ పెండ్లిమర్రి మండలం నందిమండలానికి చెందిన పసుపులేటి చంద్రశేఖర్ అలియాస్ శంకర్ నేహా రేడీమేడ్ షోరూం పెట్టుకుని జీవించేవాడన్నారు. ఆ షాపు దివాళా తీయడంతో అప్పుల పాలై దుర్వసనాలకు లోనై నేరాలకు పాల్పడ్డాడన్నారు. 2013 నుంచి ఇప్పటివరకు 12 దొంగతనాల్లో ప్రమేయం ఉన్నట్లు తమ విచారణలో తెలిసిందన్నారు. గత సంవత్సరం డిసెంబరు 2న నకాష్లో, జనవరి 23న బాలాజీనగర్లో, ఏప్రిల్ 4న విజయనగర్ కాలనీలో, జూన్ 7న బాలాజీనగర్లో, జులై 28, 29 తేదీలలో ఎస్బీఐ కాలనీలోని పామ్ గ్రూవ్ రెసిడెన్సీలో, ఆగస్టు 10, 11 తేదీలలో విజయదుర్గ కాలనీలో, అక్టోబరు 15న రాజారెడ్డివీధిలో, అదేరోజు ప్రకాశ్నగర్లో, అదేనెల 26న నబీకోటలో చోరీలకు పాల్పడ్డారు. అదేనెలలో 19న జెడ్పీ ఆవరణంలో, జూన్ 10వ తేదీన హరిత రెస్టారెంట్ సమీపంలో మోటారు సైకిళ్లను దోచుకున్నారు. నేరాలకు పాల్పడే శైలి చంద్రశేఖర్ అలియాస్ శంకర్ ప్రస్తుతం నగరంలోని ఓ ప్రముఖ షాపింగ్మాల్లో పనిచేస్తూ రాజారెడ్డివీధిలో నివసిస్తున్నాడు. అతని భార్య మంజువాణి నగర శివార్లలోని ఓ ప్రముఖ కార్పొరేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. తన సహచర ఉపాధ్యాయులు నివసించే ప్రాంతాలను మొదట తన భర్తతోసహా వెళ్లి పరిశీలిస్తారు. పాఠశాల వేళల్లో ఉపాధ్యాయుల హ్యాండ్బ్యాగుల్లో ఉండే తాళాలను వారికి తెలియకుండా తీసుకుని భర్తకు అందజేస్తుంది. తర్వాత ఆమె భర్త సదరు ఇళ్లకు వెళ్లి తాళాలు తీసి లోపలున్న వస్తువులను దోచుకుంటారు. తర్వాత ఏమీ ఎరగనట్లు తాళాలను భార్య చేతికి ఇస్తే ఆమె సదరు ఉపాధ్యాయుల తాళాలను వారి బ్యాగులోనే గమనించకుండా దాచేస్తుంది. ఒకవేళ తాళాల కనబడక బాధితులు వెతుకుతుంటే తనకు ఫలానా చోట దొరికాయని ఆమె వారికి అందజేస్తుంది. గతనెల 14వ తేదీన బాలల దినోత్సవం కావడం, అదే పాఠశాలలో బాలాజీనగర్లో నివసిస్తున్న ఓ ఉపాధ్యాయురాలు పాఠశాలకు వెళ్లింది. సదరు ఉపాధ్యాయురాలు భర్త ట్రాఫిక్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతను టిఫెన్ తినేందుకు ఇంటికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ శంకర్ కానిస్టేబుల్ను చూడగానే బిత్తరపోయి పరారయ్యాడు. తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ నేరాలన్నీ బట్టబయలయ్యాయి. ఈ నేరాలను చేధించడంలో కృషి చేసిన కడప అర్బన్ సీఐ శ్రీరాములు,ఎస్ఐ బాల మద్దిలేటి, తాలూకా, సీసీఎస్ పోలీసులు, ఏఎస్ఐ మరియన్న, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున,కానిస్టేబుళ్లు రామాంజనేయులు, పరమేశ్, ప్రవీణ్, పెంచలయ్య, సాగర్, ట్రాఫిక్ కానిస్టేబుల్ శంకర్రాజు, మహేశ్వరి, హోంగార్డులు సూర్యనారాయణమ్మ, శశికళలను డీఎస్పీ అశోక్కుమార్ అభినందించారు. సమావేశంలో డీఎస్పీతోపాటు సీఐలు శ్రీరాములు, సదాశివయ్య, నాయకుల నారాయణ, ఎస్ఐలు బాలమద్దిలేటి, ఎస్వీ నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ శంకర్రాజునుడీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.