revu mutyala raju
-
ఆ కలెక్టర్ ఇళ్లకూ వచ్చేస్తున్నారు..!
పట్టణంలో శ్రీరామపురంలోని ఓ ఇంటి వద్ద శుక్రవారం కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులు, సిబ్బందితో సడెన్గా ప్రత్యక్షమయ్యారు. అక్కడి ప్రజలు తేరుకునేలోగానే నవశకం సర్వే జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. వలంటీర్లు సర్వే చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆయన భీమవరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో నవశకం, పట్టణంలో డంపింగ్యార్డుకు అవసరమైన భూమి సేకరణపై సమీక్ష నిర్వహించారు. సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్): పట్టణంలో అధికారులతో సమీక్ష అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 20 వరకూ నవశకంపై వలంటీర్లు సర్వే చేస్తారన్నారు. ప్రభుత్వం ఇచ్చే బియ్యం, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, పెన్షన్ కానుక కార్డులకు లబ్ధిదారుల సమాచారం పక్కాగా సేకరించడానికి వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారన్నారు. పట్టణంలో 40 వార్డు సచివాలయాలు ఉండగా నాలుగు వార్డులకు ఒకరు చొప్పున 10 మంది సూపర్వైజర్లను నియమించి సర్వే చేయిస్తున్నామన్నారు. సర్వే అనంతరం వార్డు సభలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అనంతరం లబ్ధిదారుల జాబితా సిద్ధం చేస్తామన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్టణంలో సదరమ్ క్యాంపు ఏర్పాటు చేయాలని కోరారని చెప్పారు. అయితే ప్రతి నియోజకవర్గంలో సదరమ్ క్యాంపు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. నర్సాపురం సబ్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ ఎం.అమరయ్య, అసిస్టెంట్ కమిషనర్ బి,జ్యోతిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దిరుసుమర్రులో తనిఖీలు భీమవరం అర్బన్: మండలంలోని దిరుసుమర్రు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ రేవు ముత్యాలరాజు పరిశీలించారు. పాఠశాలలో వైఎస్సార్ కంటి వెలుగు పథకం అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను మౌలిక వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం గ్రామ సచివాలయంకు వెళ్లి పలు పథకాల అమలు, నవశకం సర్వే వివరాల రికార్డులు పరిశీలించారు. అనంతరం భీమవరం వెళ్లిపోయారు. -
‘అవినీతికి తావు లేదు’
సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): జిల్లాలో అవినీతికి తావులేదని, లోప రహిత పాలన అందించడమే తన ధ్యేయమని కలెక్టర్ రేవు ముత్యాలరాజు చెప్పారు. ఆయన ‘సాక్షి’తో గురువారం కాసేపు ముచ్చటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవినీతి రహిత పాలన అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు అవినీతికి పాల్పడే అధికారులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి బుధవారం నిర్వహించే వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారంపై తహసీల్దార్లకు, ఎంపీడీఓలకు, మండల ప్రత్యేకాధికారులకు ప్రత్యేక సూచనలు ఇస్తున్నామని వివరించారు. ప్రతి శనివారం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. స్పందన ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయో లేదో తెలుసుకునేందుకు నేరుగా తానే ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్నానని చెప్పారు. ఇసుక కొరతను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇసుక సరఫరాలో ఎటువంటి అవినీతికీ తావులేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలను తనిఖీ చేసి ప్రతి ఏటా ఎలా ఉన్నాయో పరిశీలించనున్నట్టు వెల్లడించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ ఒకట్రెండు రోజుల్లో రానుందని, జిల్లాలో ఈ ఉద్యోగాలకు లక్షా 50వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. వీరికి పరీక్ష నిర్వహణ నిమిత్తం అనువుగా ఉన్న కేంద్రాలను ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించారు. -
రూ.వంద కోట్ల రుణాలకు చర్యలు
సాక్షి, కాకినాడ : జిల్లాలోని కౌలురైతులను గ్రూపులుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. గత ఏడాది కౌలురైతులకు రూ.90కోట్ల రుణాలిచ్చిన బ్యాంకర్లు ఈసారి కనీసం రూ.100కోట్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలురైతుల సమస్యలపై శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో వ్యవసాయాధికారులు, బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జేసీ మాట్లాడుతూ జిల్లాలోని కౌలురైతులను ఐదుగురు వంతున రుణ అర్హత గ్రూపులను ఏర్పాటుచేయాలన్నారు. కౌలు రైతుల జాబితాలను సిద్ధం చేసి బ్యాంకుల వారీగా లక్ష్యాలను నిర్దేశించి నాలుగైదు రోజుల్లోగా బ్యాంకులకు పంపాలన్నారు. తహశీల్దార్ల నుంచి వెంటనే కౌలు రైతుల వివరాలు తీసుకొని వాటిలో అనర్హులైన వారిని, రుణఎగవేతదారులను తొలగించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు రెన్యూవల్, కొత్త రుణ అర్హత కార్డుల కోసం లక్షా 13వేల మంది కౌలు రైతుల నుంచి దరఖాస్తులొచ్చాయన్నారు. వీటిలో ఇప్పటి వరకు 23వేల మందికి కార్డులు జారీ చేయగా, ఇప్పటి వరకు 700 మంది కౌలు రైతులకు కేవలం రూ.47లక్షలు మాత్రమే రుణాలు ఇవ్వడంపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. కౌలు రైతులకు రుణాల మంజూరుకు బ్యాంకర్లు, అధికారులకు మధ్య అనుసంధానం చేసేందుకు తన కార్యాలయంలో పనిచేసే జి.పద్మశ్రీ అనే అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తున్నట్టు చెప్పారు. 28న జన్ధన్ యోజన ప్రారంభం కేంద్రం తలపెట్టిన జన్ధన్యోజన కార్యక్రమం ఈ నెల28న ప్రారంభం కానుందని జిల్లాలీడ్ బ్యాంకు మేనేజర్ ఎస్.జగన్నాథస్వామి తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం రాష్ర్టంలో మన జిల్లాతో పాటు విశాఖ, కృష్ణా, అనంతపురం జిల్లాలు ఎంపికయ్యాయని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్రమోడి దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు రాష్ర్ట, జిల్లా స్థాయిల్లో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈకార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. ఇందుకోసం రాష్ర్ట స్థాయి మిషన్కు డెరైక్టర్గా రాష్ర్ట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.వి.రమేష్ ఉంటారన్నారు. జిల్లాస్థాయిలో కలెక్టర్, ఎల్డీఎం, నాబార్డు ఏజీఎం సభ్యులుగా ఉంటారని తెలిపారు. ప్రతి కుటుంబంలో భార్యభర్తలిద్దరిచేతా జీరో బ్యాలెన్స్తో ఖాతాలు ప్రారంభింపచేసి వారందరికీ ఏటీఎం కార్డు తరహాలోనే రూపీ కార్డు (స్వదేశీ ఏటీఏం కార్డు) జారీ చేయడం పథక ముఖ్య ఉద్దేశమని వివరించారు. సమావేశంలో వివిధ బ్యాంకుల కో-ఆర్డినేటర్లు, వ్యవసాయశాఖ ఏడీఏలు పాల్గొన్నారు. ఇక ఆన్లైన్లోనే సంక్షేమ ఫలాల పంపిణీ రౌతులపూడి : రాబోయే కాలంలో పేదలకు అందించే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను ఆన్లైన్లోనే అందించనున్నట్టు జేసీ ముత్యాలరాజు తెలిపారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియలో భాగంగా శుక్రవారం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో గ్రామాలవారీగా రెవున్యూ రికార్డులను పెద్దాపురం ఆర్డీఓ కూర్మానాథ్తో కలసి ఆయన పరిశీలించారు. అనంతరం జేసీ విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికీ రాష్ట్రస్థాయిలో 92శాతం, జిల్లావ్యాప్తంగా 97శాతం ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తిచేశామని పేర్కొన్నారు. మండలంలో మిగిలి ఉన్న 12శాతం ఆధార్ నమోదు ప్రక్రియపై రికార్డుల పరిశీలన కోసం వచ్చినట్లు వివిరించారు. రేషన్కార్డులకు సంబంధించి ఆధార్ అనుసంధానం సక్రమంగా లేదని గుర్తించి జేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఎస్ఓ రామారావుకు చార్జ్మెమో ఇవ్వాలని ఆదేశించారు.