సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): జిల్లాలో అవినీతికి తావులేదని, లోప రహిత పాలన అందించడమే తన ధ్యేయమని కలెక్టర్ రేవు ముత్యాలరాజు చెప్పారు. ఆయన ‘సాక్షి’తో గురువారం కాసేపు ముచ్చటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవినీతి రహిత పాలన అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు అవినీతికి పాల్పడే అధికారులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి బుధవారం నిర్వహించే వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారంపై తహసీల్దార్లకు, ఎంపీడీఓలకు, మండల ప్రత్యేకాధికారులకు ప్రత్యేక సూచనలు ఇస్తున్నామని వివరించారు. ప్రతి శనివారం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
స్పందన ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయో లేదో తెలుసుకునేందుకు నేరుగా తానే ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్నానని చెప్పారు. ఇసుక కొరతను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇసుక సరఫరాలో ఎటువంటి అవినీతికీ తావులేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలను తనిఖీ చేసి ప్రతి ఏటా ఎలా ఉన్నాయో పరిశీలించనున్నట్టు వెల్లడించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ ఒకట్రెండు రోజుల్లో రానుందని, జిల్లాలో ఈ ఉద్యోగాలకు లక్షా 50వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. వీరికి పరీక్ష నిర్వహణ నిమిత్తం అనువుగా ఉన్న కేంద్రాలను ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment