‘దయతో నా జీవితానికి ముగింపు ఇవ్వండి’
చెన్నై: తన కారుణ్య మరణానికి(మెర్సీ కిల్లింగ్) అనుమతించాలంటూ రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన రాబర్ట్ పియోస్ దరఖాస్తు చేసుకున్నాడు. తన విజ్ఞప్తిని మన్నించి తనకు విముక్తినివ్వాలంటూ జైలు భద్రతాధికారికి లేఖ రాశాడు. రాజీవ్ గాంధీ హత్య కేసులో రాబర్ట్ కూడా ఒకరు. ఇప్పటికే అతడికి జీవిత కారాగార శిక్ష పడగా 26 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఇటీవలె రాష్ట్ర ప్రభుత్వం రాబర్ట్తో సహా ఈ కేసులోని మొత్తం ఏడుగురు నిందితులను సత్ప్రవర్తన కింద విడుదల చేయాలని నిర్ణయించగా దానిని సుప్రీంకోర్టు అడ్డుకుంది. దాంతో వారి విడుదల ఆగిపోయింది.
ఈ నేపథ్యంలో ఇక తనకు కారుణ్యమరణానికి అనుమతించాలంటూ అతడు పిటిషన్ పెట్టుకున్నాడు. రాబర్ట్ శ్రీలంకకు చెందిన తమిళియుడు. 1980లో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (ఐపీకేఎఫ్) బలగాలు చేసిన వేధింపుల్లో తన కుమారుడు చనిపోయాడనే ఆగ్రహంతో రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు చేసిన కుట్రలో అతడు కూడా పాలుపంచుకున్నాడని తేల్చి అరెస్టు చేయగా అతడికి జీవిత ఖైదు పడింది. 1991 మే నెలలో రాజీవ్ హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే, తన కారుణ్యమరణం కోసం చేసుకున్న దరఖాస్తుపై జైలు అధికారి స్పందిస్తూ ‘అతడు రాసిన లేఖ ద్వారా మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేం, దీనిని రాష్ట్ర డీజీపీ ద్వారా హోంశాఖకు పంపిస్తాం. ఈ కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున కేంద్రమే ఈ విషయం తేలుస్తుంది’ అని చెప్పారు.