Rukmini Rao
-
అమ్మాయిలను కాపాడుకుందాం...
గ్రామీణ మహిళలను నిత్యం కలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ పరిష్కారాలను సూచిస్తూ మహిళా రైతుల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు డాక్టర్ రుక్మిణీ రావు. ఏళ్ల తరబడి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆమె. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్గానూ, వందకు పైగా మహిళా రైతు సంఘాలతో కూడిన జాతీయవేదిక మకాం సహ వ్యవస్థాపకులుగానూ ఉన్నారు. నారీ శక్తి పురస్కార గ్రహీత, హైదరాబాద్ వాసి, సామాజిక కార్యకర్త రుక్మిణీరావుతో మాట్లాడినప్పుడు స్త్రీ సంక్షేమానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆమె ఇలా మనముందుంచారు. ‘‘ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ఆపకూడదు, ఆగకూడదు. ఈ రోజుల్లో మన అమ్మాయిలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మేం తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో 50 గ్రామాల్లోని 8 నుంచి 17 ఏళ్ల వయసు లోపు అమ్మాయిల సంక్షేమానికి గ్రామ్య రిసోర్స్ సెంటర్లో భాగంగా వర్క్ చేస్తున్నాం. మహిళల సంక్షేమానికి కృషి చేద్దామని చేసిన ప్రయత్నంలో ఎన్నో సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల 15–16 ఏళ్ల లోపు అమ్మాయిలు తెలిసిన, తెలియని అబ్బాయిల మాటలు నమ్మి ఇల్లు వదిలి వెళ్లిన ఘటనలను ఎక్కువ చూస్తున్నాం. దీంతో స్కూల్ నుంచి డ్రాపౌట్ అయిన వాళ్లకు, ఇల్లు వదిలి బయటకు వెళ్లిన వాళ్లను తిరిగి వచ్చేలా, కౌన్సెలింగ్స్ చేస్తున్నాం. ఇద్దరు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులు అమ్మడం గురించి తెలిసి మా స్నేహితురాలు జమునతో కలిసి నేనూ అక్కడకు వెళ్లాను. ఆ అమ్మకం కార్యక్రమాన్ని అడ్డుకుని, వారికి సహాయం చేయాలనుకున్నప్పుడు ‘గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్స్’’ని ప్రారంభించాం. ఈ సంస్థకు 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఆరు మండలాల్లో దాదాపు 800 మంది మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరచుకోవడానికి, ఆడపిల్లల పట్ల వారి వైఖరిని పునరాలోచించడానికి వర్క్ చేస్తున్నాం. ఏళ్లుగా ఆడ శిశుహత్యలతో పాటు అంతర్జాతీయ దత్తత ద్వారా కూడా ఆడపిల్లల అక్రమ రవాణాకు విస్తృతమైన నెట్వర్క్ ఉందని కనుక్కొన్నాం. ప్రచార పద్ధతిలో పని చేస్తూ, అనేక అక్రమ దత్తత కేంద్రాలను మూసివేయించాం. వివక్ష లేని చోట పెంపకం నా చిన్నతనంలో మా అమ్మమ్మ, అమ్మ, అత్తల మధ్య పెరిగాను. ఆ విధంగా ఇంటిని నడిపే సమర్థ మహిళల గురించి నాకు తెలుసు. మా ఇంట్లో అబ్బాయిలు, అమ్మాయిలు అనే వివక్ష ఉండేది కాదు. నేను బాగా చదువుకోవాలన్నది అమ్మ ఆలోచన. ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీ నుండి సైకాలజీలో మాస్టర్స్ పూర్తి చేశాను. చదువు చెప్పాలనే ఆలోచనతో హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో టీచింగ్ చేశాను. ఆ తర్వాత ఢిల్లీలో సైకాలజీలో పీహెచ్డీ చేశాను. 1970 – 1980ల మధ్య వరకు ఢిల్లీలోని నేషనల్ లేబర్ ఇన్స్ స్టిట్యూట్, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్స్ లో కెరియర్ స్టార్ట్ చేశాను. అప్పుడే జీవితం ఒక మలుపు తీసుకుందనిపిస్తుంది. వరకట్న మరణాలు తీవ్ర సమస్యగా ఉన్న రోజులవి. ఇది సమాజానికే అనారోగ్యం అనిపించేది. మా స్నేహితులతో కలిసి ఎడతెగని చర్చలు జరిపేవాళ్లం. వరకట్న వ్యతిరేక ప్రదర్శనలలో విస్తృతంగా పాల్గొన్నాం. అప్పుడు 1981లో మహిళల కోసం ‘సహేలీ రిసోర్స్’ సెంటర్ను ఏర్పాటు చేశాం. అక్కణ్ణుంచి ఈ మార్గంలో ఏళ్లుగా ప్రయాణిస్తున్నాను. నాతో పాటు ఎన్నో అడుగులు తోడయ్యాయి. సేవా కార్యక్రమాలు చేసేవారితో నేనూ కలుస్తున్నాను. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా... పదేళ్లక్రితం ఒక విషయం మమ్మల్ని కదిలించింది. కౌమార దశలో గ్రామాల్లో ఉన్న అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇచ్చారు. దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ మీద ఎవరూ దృష్టి పెట్టలేదు. అక్కడ ఆ అమ్మాయిలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో మేం స్వయంగా చూశాం. దీంతో ఇది సరైన పద్ధతి కాదని మా ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి సుప్రీం కోర్టులో కేసు వేశాం. విదేశాలలో ఒక వ్యాక్సిన్ గురించి నిర్ణయం తీసుకుంటే వాళ్లు సెంటర్ను ఏర్పాటు చేస్తారు. అలాంటిది మన దగ్గర లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ ఖరీదు తగ్గిందన్నారు. వ్యాక్సిన్ వేయాలంటున్నారు. డాక్టర్లు చెప్పిన ఆలోచన కూడా బాగుంది. అయితే, ఆ తర్వాత వచ్చే సమస్యలపైన కూడా దృష్టి పెట్టమని, మెడికల్ సిస్టమ్ను కరెక్ట్ చేయమని ప్రభుత్వాలను కోరుతున్నాం. అప్పుడే, ఈ డ్రైవ్ను ముందుకు తీసుకెళితే బాగుంటుంది’’ అని తన అభిప్రాయలను వెలిబుచ్చారు రుక్మిణీరావు. గ్రామీణ మహిళలతో కలిసి... 1989లో ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్కు వచ్చేశాను. పుట్టిపెరిగిన ప్రాంతం, పరిచయమున్న సాంçస్కృతిక నేపధ్యంలో సమర్థంగా పని చేయగలనని భావించాను. న్యాయం కోసం కోర్టులకు వచ్చే మధ్యతరగతి మహిళలకు సహాయం చేయడం ప్రారంభించాం. వారి స్థితి చూశాక ఇంకా ఎంతో చేయాల్సింది ఉందనిపించింది. అక్కణ్ణుంచి గ్రామీణ మహిళల సంక్షేమానికి శ్రద్ధ వహించాల్సిన అవసరం గుర్తించి అటువైపుగా అడుగులు వేశాం. 30 ఏళ్లుగా మహిళా రైతుల హక్కులను ప్రోత్సహించడానికి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీతో కలిసి పనిచేస్తున్నాను. సంస్థలో మహిళా నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం, వర్క్షాప్ల నిర్వహణ ముఖ్యంగా తీసుకున్నాను. సొసైటీలో డైరెక్టర్, బోర్డ్ మెంబర్గా ఉన్నాను. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా రైతులతో ‘మకాం’ అనే వేదిక ద్వారా విస్తృత కార్యక్రమాలు చేస్తున్నాం. రైతు అనగానే ట్రాక్టర్పైన మగవాళ్లు ఉండటమే కనిపిస్తుంది. కానీ, ఇప్పుడు ఆడవాళ్లు కూడా ట్రాక్టర్లు నడపడం, వ్యవసాయం, ఆహార ఉత్పత్తుల తయారీలో అగ్రభాగాన ఉండేలా కృషి చేస్తున్నాం. ఒంటరి మహిళల కోసం సమాఖ్యను ఏర్పాటు చేశాం. ఇందులో సంఘాలున్నాయి. తెలంగాణలోని 10 జిల్లాల నుంచి కో ఆర్డినేషన్ చేస్తున్నాం. లెప్రసీ వ్యాధి అనేది దాదాపుగా కనుమరుగైందని అంతా అనుకుంటున్నారు. కానీ, లెప్రసీతో బాధపడుతున్న వారిని మేం గుర్తించాం. ఈ వ్యాధి ముదరకుండా ముందస్తు నివారణకు సాయం అందిస్తున్నాం. – నిర్మలా రెడ్డి ఫొటో: అనిల్ కుమార్ మోర్ల -
మహిళల ఘన విజయం: విత్తనం పరిరక్షణకు‘చిరు’యత్నం
‘ఇంటర్నేషనల్ సీడ్ డే’... ఇలాంటి ఓ రోజు ఉందా! ఉంది... అయితే ప్రచారమే పెద్దగా ఉండదు. ఇది గ్లామర్ మార్కెట్ వస్తువు కాకపోవడమే కారణం. ఈ రోజును రైతు మహిళలు నిర్వహించారు. ‘చిరు’సాగు చేసి కళ్లాల్లో రాశులు పోసిన చేతులవి. విత్తనాన్ని కాపాడాలనే ముందుచూపున్న చేతలవి. రాగి ముద్ద స్టార్ హోటల్ మెనూలో కనిపిస్తోంది. స్మార్ట్గా ఆర్డర్ చేస్తే అందమైన ప్యాక్తో ఇంటిముందు వాలుతోంది. అలాగే సజ్జ ఇడ్లీ, ఊదల దోసె, కొర్రల కర్డ్ మీల్, జొన్న రొట్టె, మిల్లెట్ చపాతీ, మిల్లెట్ పొంగలి... ఇలా బ్రేక్ ఫాస్ట్ సెంటర్లు కొత్త రూపుదిద్దుకున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామాల్లో నీటి వసతి లేని నేలను నమ్ముకుని బతికే వాళ్ల ఆకలి తీర్చిన చిరుధాన్యాలు ఇప్పుడు బెంజ్కారులో బ్రేక్ఫాస్ట్కి వెళ్లే సంపన్నుల టేబుల్ మీదకు చేరాయి. ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలు నేడు సిరిధాన్యాలుగా మన దైనందిన జీవితంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. వీటి వెనుక నిరుపేద మహిళల శ్రమ ఉంది. పాతికేళ్లుగా ఈ నిరుపేద మహిళలు చిరుధాన్యాలతోనే జీవించారు, చిరుధాన్యాల పరిరక్షణ కోసమే జీవించారు. సేంద్రియ సేద్యంతో చిరుధాన్యాల జీవాన్ని నిలిపారు. అంతర్జాతీయ విత్తన దినోత్సవం (ఏప్రిల్ 26) సందర్భంగా బుధవారం వీరంతా మెదక్ జిల్లా, జహీరాబాద్ మండలం, పస్తాపూర్లో తమ దగ్గరున్న పంటల విత్తనాలను సగర్వంగా ప్రదర్శించారు. హైబ్రీడ్ వంగడాల మాయలో పడకుండా మన విత్తనాలను మనం కాపాడుకోవాలని ఒట్టు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ బోర్డు సభ్యులు రుక్మిణీరావు సాక్షితో పంచుకున్న వివరాలివి. ఈ నేల... ఈ విత్తనం... మన సొంతం ‘‘చిరుధాన్యాల పట్ల అవగాహన కోసం ఈ ఏడాదిని ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’ నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది సీడ్ డే రోజున మేము చిరుధాన్యాల విత్తనాల పరిరక్షణ, ప్రదర్శన నిర్వహించాం. పస్తాపూర్ కేంద్రంగా జరిగిన ఈ కార్యక్రమంలో 26 పరిసర గ్రామాల నుంచి వందకు పైగా మహిళలు వారు పండించి, పరిరక్షించిన విత్తనాలను తీసుకువచ్చారు. చిరుధాన్యాలతోపాటు పప్పుధాన్యాలు, నూనె గింజల విత్తనాలు మొత్తం యాభైకి పైగా పంటల విత్తనాలకు ఈ ప్రదర్శన వేదికైంది. ఇవన్నీ సేంద్రియ సేద్యంలో పండించినవే. ఆహారం –ఆకలి! ఆహారం మన ఆకలి తీర్చాలి, దేహానికి శక్తినివ్వాలి. ‘వరి అన్నం తిని పొలానికి వెళ్తే పని మొదలు పెట్టిన గంట సేపటికే మళ్లీ ఆకలవుతుంది. రొట్టె తిని వెళ్తే ఎక్కువ సేపు పని చేసుకోగలుగుతున్నాం. అందుకే మేము కొర్రలు, జొన్నలు తింటున్నాం’ అని ఈ మహిళలు చెప్పిన మాటలను తోసిపుచ్చలేదు సైంటిస్టులు. వారి అనుభవం నుంచి పరిశోధన మొదలు పెట్టారు. అందుకే మిల్లెట్స్లో దాగి ఉన్న శక్తిని ప్రపంచ వేదికల మీద ప్రదర్శించగలిగారు. అలాగే ఈ మహిళలు విదేశాల్లో రైతు సదస్సులకు హాజరై తమ అనుభవాలను వారితో పంచుకున్నారు. భూగోళం ఎదుర్కొంటున్న మరో విపత్తు క్లైమేట్ చేంజ్. ఈ పంటలైతే వాతావరణ ఒడిదొడుకులను ఎదుర్కుని పంటనిస్తాయి. పదిహేను రోజులు నీరు అందకపోయినప్పటికీ జీవాన్ని నిలుపుకుని ఉంటాయి. చిరుధాన్యాలకు గాను మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి మీద హక్కులను కార్పొరేట్ సంస్థలు తన్నుకుపోకుండా చూసుకోవాలి. అవసరమైతే ఉద్యమించాలి. ఇదే మనం డీడీఎస్ స్థాపకులు మిల్లెట్ మ్యాన్ పీవీ సతీశ్గారికి ఇచ్చే నివాళి’’ అన్నారు రుక్మిణీరావు. చిరుధాన్యాలను పండించడంలో ముందడుగు వేసేశాం. ఇక మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఈ విత్తనాల మీద పూర్తి హక్కులు ఈ పేద రైతు మహిళలవే. – రుక్మిణీరావు, బోర్డు సభ్యులు, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ – వాకా మంజులారెడ్డి -
మరి అది ఆడపిల్లా? ఎలుకపిల్లా??
పచారీ షాపుకు వెళ్లి.. రూపాయి మందు అడిగితే ఏమిస్తాడు? ఈ ఊళ్లో అయితే ఎలుకమందు ఇస్తాడు. కడుపులో ఉన్నా.. కడుపులోంచి పడినా.. ఆడపిల్లలను ఈ మందుతోనే పొట్టన పెట్టుకుంటారు. మనింట్లో పుట్టిన ఆడపిల్ల ‘క్యార్’మంటే.. ఇల్లంతా పరుగెత్తుకుని వస్తుంది. ఆ ఇంట్లో.. ఆ రాత్రి... ఆ బిడ్డ.. ‘క్యార్’మంటే.. తల్లే చెవులు మూసుకుంది! ఆడపిల్లను కనిన తల్లి చెవుల్లో సీసం పోసుకోవాల్సిందే. బిడ్డకు రూపాయి సీసా మందు పోయాల్సిందే. మరి అది ఆడపిల్లా? ఎలుకపిల్లా?? ‘‘అవును.. అది రూపాయి మందే! నా బిడ్డ సచ్చిపోనీకె రూపాయి మందు పాలల్ల గలిపిన’’ తన బిడ్డను తానే చంపుకున్నానని ఆ తల్లితో ఒప్పించడానికి పోలీసులు పెద్దగా కష్టపడాల్సిన పనిరాలేదు. నల్గొండ జిల్లా పియ్యేపల్లి మండలం వద్దిపట్లకు చెందిన సబిత (పేరు మార్చాం) తన మూడో సంతానంగా పుట్టిన ఆడపిల్లకు రూపాయి మందు పాలల్లో కలిపి బాటిల్తో పట్టింది. ఎలుకల మందుకి ఈ ప్రాంతంలో రూపాయి మందు అని పేరు. తండాలో ఆడపిల్లల ప్రాణాలను తీసేందుకు అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ రూపాయి మందునే ఆశ్రయిస్తుంటారంతా. ‘‘ఈ ఆడపిల్లతోని ఇంట్లకు బోతె నా మొగుడు నన్నేలుకోనన్నడు గద! గందుకే చంపిన.’’ఎందుకు చంపావన్న పోలీసుల ప్రశ్నకు సబిత జవాబిది. మళ్ళీ ఆమే పోలీసులను ఎదురు ప్రశ్నించింది‘‘నా మొగుడు మారుబెళ్ళి చేసుకుంటనన్నడు మగపోరడి కోసం. ఏం జెయ్యమంటరు?’’ నీ భర్తకు తెలుసా పోలీసుల అర్థం లేని ప్రశ్నకు అతను జాతరకెళ్ళాడని సమాధానమిచ్చింది సబిత. జాతరకెళ్ళాడని చెప్పింది కానీ ఆ రోజు జరిగిందంతా గుర్తొచ్చి తెరలు తెరలుగా దుఃఖం పొంగుకొస్తోంది సబితకి. ఏడ్చి ఏడ్చి పసిపాపాయి పాలబుగ్గలమీద పడిన కన్నీటి చారికల ముద్రలను చేతితో నిమిరి చివరిసారిగా చెక్కిళ్ళను ముద్దాడింది సబిత. వెనుతిరిగి దేవుడి దగ్గర పెట్టిన రూపాయిబిళ్ళను చేతిలోకి తీసుకుంది. నాలాంటి పాపాత్మురాలిని ఎందుకు పుట్టించావు తండ్రీ అని దేవుడి పటం ముందు బోరుమంది. చిరిగిన పైటచెంగుతో కన్నీళ్ళు తుడిచేసి గబ గబా బయటకు పరిగెత్తింది. ఇంకొక్క నిముషం ఆలస్యమైనా తన భర్త వచ్చేస్తాడు. రాత్రి కొట్టిన దెబ్బలకు పదిరోజుల బాలింత ఒళ్ళంతా పుండులా మారింది. నాలుగు నెలల క్రితమే ఆడపిల్ల అని తెలిశాక స్కానింగ్ సెంటర్లోనే భర్త డాక్టర్తో గొడవపడిన విషయం గుర్తొచ్చింది సబితకి. అబార్షన్ చేయించుకోవాల్సిందేనని ఇంటికొచ్చాక చితకబాదాడు బాలాజీ. అయినా ఆమెకెందుకో ఆ పనిచేయబుద్ధి కాలేదు. బిడ్డ కడుపులో ఉండగా ఏ నెలలో ఏ అవయవాలు ఏర్పడతాయో సబిత తల్లి పాడిన పాట గుర్తొచ్చి ఆరోజు అబార్షన్కి ససేమిరా అంది. ఐదోనెలలో అబార్షన్ అంటే బిడ్డకీ, తల్లికీ కూడా ప్రమాదమని చెప్పారు డాక్టర్. ఆ డాక్టర్ కాకపోతే ఎంతో మంది డాక్టర్లున్నారన్నాడు అబార్షన్ చేయడానికి. గర్భంపోయేందుకు నాటు మందుకూడా తెచ్చి మింగిచ్చాడు. చావుతప్పి కన్నులొట్టబోయి బతికింది సబిత. ఆ రోజు నుంచి రోజూ భర్త తాగొచ్చి కొడుతున్న దెబ్బలకు కూడా తట్టుకుంది కానీ ఈ రోజు రూపాయి మందు పాలల్లో కలిపి రక్తపుగుడ్డుని చంపేయమన్నప్పుడు మాత్రం తట్టుకోలేకపోయింది. ముందు పుట్టిన ఇద్దరు బిడ్డలనూ తనకు తెలియకుండానే దూరం చేశాడు భర్త. ఈ బిడ్డనైనా దక్కనిస్తాడనుకుంటే తన చేతితోనే తన బిడ్డను చంపేయాలని హుకుం జారీచేశాడు. లేదంటే ఇంట్లోనుంచి తరిమేస్తానన్నాడు. తన పెళ్ళికి చేసిన అప్పుని తీర్చలేక దొర దగ్గర అమ్మానాన్నా జీతానికున్నారు. జీవితమంతా చాకిరి చేసినా వారు ఆ ఇంట్లోనుంచి బయటకు రాలేరు. చెల్లెళ్ళిద్దరికీ తన లాగే పన్నెండేళ్ళకే పెళ్ళిళ్ళు చేసేశారు. వాళ్ళ కాపురాలు కూడా దినదిన గండంగా ఉన్నాయి. ఈ పేరుతో తనని వదలించుకొని రెండో పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు భర్త. ఈ యింట్లోంచి బయటకెళితే భర్త లేని ఆడపిల్ల బతుకెంత హీనమో సబితకు తెలుసు. ఆ మరుసటి రోజు నుంచి మగాళ్లందరికీ ఆమె చులకనే. అప్పుడు తానేతప్పూ చేయకపోయినా అన్ని నిందలూ భరించాల్సిందే. బిడ్డను ఎలాగోలా బతికించుకుందామన్నా ఊరు ఊరుకోదు. ఒంటరి స్త్రీకి ఎంత విలువో, ఆమె బిడ్డనీ అంతే హీనంగా చూస్తుందీ సమాజం. తనకాళ్ళపై తాను బతికేందుకు చదువూ సంధ్యాలేదు. ఈ పిల్ల పెద్దదై అన్ని కష్టాలూ పడి మళ్ళీ తనలా ఏదోరోజు ఎవరో ఒకరికి పెళ్ళాం అయ్యి వాడిచేతిలో చావుదెబ్బలు తినేబదులు ఈ రూపాయిమందిచ్చి గుండెను చిక్కబట్టుకుంటే చాలనుకుని తండా చివరి చిల్లరకొట్టుకెళ్ళి రూపాయి మందిమ్మంది సబిత. బడ్డీకొట్టతను ఒకసారి జాలిగా చూసి గాల్లో వేళ్ళాడుతున్న రూపాయి మందు ప్యాకెట్టుని ఆమె చేతిలో పెట్టాడు. బిడ్డపాలల్లో కొద్దిగా కలిపి మిగిలింది నీళ్ళల్లో కలుపుకుని తను తాగేసింది. ఆమె అంచనాలు తారుమారయ్యి తను బతికింది కానీ, పొత్తిళ్ళలోని పసిగుడ్డుకెంత కావాలి విషపుచుక్క చాలదూ ఈ వికృత సమాజంలోంచి శాశ్వతంగా దూరంగా సాగిపోవడానికి. ఆడపిల్లను కన్న తర్వాత ఆమెను ఇంటికి రానివ్వడొక తండ్రి. గుక్కపెట్టి ఏడ్చినా, పాలబుగ్గల పసికందుకు పాలివ్వనివ్వడు మరో తండ్రి. ఏడ్చి ఏడ్చి గొంతెండి చచ్చిపోయిందా సరేసరి, లేదంటే ఏ వెయ్యిరూపాయలకో అమ్మేసుకుంటాడు మరో తండ్రి. కొద్దోగొప్పో కన్నబిడ్డ మీద మమకారం ఉన్నవాళ్ళకు ఉండనే ఉన్నది ఊయల. వద్దనుకున్న బిడ్డను చంపకండంటూ తమిళనాడు తరహాలో ఊయలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం దేవరకొండలో. అయితే సబిత భర్త బాలాజీ ఇవేవీ కాకుండా రూపాయిమందుని కలపమన్నాడు బిడ్డకి పట్టే పాలల్లో. సరిగ్గా ఆ తల్లి అదే చేసింది. బిడ్డని చంపేసి గప్చుప్గా పూడ్చిపెట్టేసారు మెట్టినింటివారు. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల పోరాటంతో ఇప్పుడు తెలంగాణలో అతి తక్కువ బాలికల నిష్పత్తి ఉన్న ప్రాంతాల్లో ప్రతి బిడ్డ మరణాన్నీ తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దీంతో సబిత బిడ్డ ఎలా చనిపోయిందన్న ప్రశ్న వచ్చింది. పదిహేను రోజుల తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ బృందం వెళ్ళి బిడ్డ భౌతిక కాయాన్ని వెలికితీసి పోస్ట్మార్టం చేస్తే రూపాయి మందు దారుణం బయటకు వచ్చింది. ఈ ప్రశ్నలన్నింటికీ మనచుట్టూ జరుగుతున్న పరిణామాలే సమాధానం చెబుతాయి. యిప్పుడొస్తోన్న సినిమాలను గురించి ఒక్కసారి ఆలోచించండి. ఏం భాష వాడుతున్నారు? ఏం నేర్పిస్తున్నారు? ఒసేయ్, ఒరేయ్ అనా, పోస్టర్స్ ఎంత అశ్లీలంగా ఉంటున్నాయి? అన్నింటిలో కాంప్రమైజ్ కావడమేనా మనం చేస్తున్నది? అలా కాంప్రమైజ్ కాలేక, మనకి నచ్చినా న చ్చకపోయినా చూసీ చూడనట్టు, తెలియనట్టు నటించడం నాకు చేతకాక నేను సెన్సార్ బోర్డునుంచి పదేళ్ళక్రితమే రిజైన్ చేసి బయటకు వచ్చాను. దైనందిన జీవితంలో స్త్రీలను గౌరవించకపోగా, హింసను ప్రేరేపించే సినిమాలను వ్యతిరేకించే చైతన్యం కావాలి. ఎంతో పెద్ద చదువుచదివిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా అత్తమామలనుంచి, భర్తల నుంచి అనేకరకాల హింసను ఎదుర్కొంటోంది. నాకు తెలిసిన కేసులే బోల్డున్నాయి. నిర్భయ అత్యాచారాలను ఆపగలిగిందా? అలాగే పీసీపీఎన్డీటీ యాక్ట్ కూడా. చట్టం మంచిదే కానీ ఎవరు కంప్లైంట్ చేస్తారు. ఈరోజు ఏ ఆడపిల్ల పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి తనకు అన్యాయం జరిగిందని చెప్పుకోగలుగుతోంది? అందుకే ముందు సమాజంలో ఆడపిల్లల పట్ల పాతుకుపోయిన అభిప్రాయాలు మారాలి. ఆడపిల్లలను హాయిగా ఈ లోకంలోనికి ఆహ్వానించే పరిస్థితులు సమాజంలో ఉండాలి. అప్పుడే ఆడపిల్లలను కడుపులోనే చంపుకోరు. వైద్యపరంగా డాక్టర్లపైనే తప్పులు నెట్టకుండా అబార్షన్ చేయించుకోవడానికి వచ్చేవారి ఆలోచనల్లో సైతం మార్పులు తేవాలి. ప్రిమిటివ్ క్యాపిటల్ ఇక్కడ ఆడపిల్లలు ప్రిమెటివ్ క్యాపిటల్. దేవరకొండ మండలం, మెగావత్ తండాలో ఇంట్లో తొలిచూలు ఆడబిడ్డను అమ్మి మూడు మేకలను కొనుక్కున్నాడొక తండ్రి. అదేమండలం కట్టకొమ్మ తండాలో ఆడపిల్లను అమ్మేసి ఆటో కొనుక్కున్నాడో తండ్రి. మన దేశంలో వెయ్యి రూపాయలకీ, వంద రూపాయలకీ కూడా ఆడపిల్లలను అమ్ముకుంటున్నారు. వీటికి సాక్ష్యాధారాలూ ఏవీ ఉండవు. కానీ ఒకే ఊర్లో పదుల సంఖ్యలో అమ్మాయిలు మరణిస్తుంటారు. అయితే డబ్బొక్కటే ప్రధానం కాదు. సబిత కేసే అందుకు సాక్ష్యం. వాళ్ళు పేదవాళ్ళు కాదు. వాళ్ళకి నాలుగెకరాల పొలం వుంది. ట్రాక్టర్ వుంది. అయినా ఆడబిడ్డని చంపారంటే అందుకు సన్ప్రిఫరెన్స్ కారణం.వారసుడు, కొడుకు పున్నామ నరకాన్నుండి తప్పిస్తాడనీ, కొరివిపెట్టేవాడుండడనీ ఏవో సాకులు చెపుతారు. కానీ దానివెనుక దాగున్నది మాత్రం ఆడపిల్లల పట్ల వివక్షే. ఆడపిల్లల భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా తెచ్చిన పీసీపీఎన్డీటీ యాక్ట్ వుంది. అది అమలు పర్చేందుకు అంచెలంచెల అధికార వ్యవస్థ వుంది. అయితే చిత్తశుద్ధి మాత్రం లేదు. – రుక్మిణీరావు, గ్రామ్య స్వచ్ఛంద సంస్థ -
‘ది వీక్’ ఉమన్ ఆఫ్ ది ఇయర్గా రుక్మిణీరావు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త వి.రుక్మిణీరావును ‘ది వీక్’ మేగజైన్ ఉమన్ ఆఫ్ ది ఇయర్-2014గా ఎంపిక చేసింది. ఆమె గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన మహిళల సంక్షేమం కోసం కృషిచేశారు. సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ (సీడబ్ల్యూఎస్), డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్), గ్రామ్యా తదితర స్వచ్ఛంద సంస్థల్లో భాగస్వామిగా పనిచేస్తున్నారు. ‘తెలంగాణలో ఈ రోజు వందలాది మంది గిరిజన ఆడపిల్లలు బతికే ఉన్నారంటే దానికి కారణం రుక్మిణీరావు’ అని ‘ది వీక్’ మేగజైన్ వ్యాఖ్యానించింది.