మళ్లీ మొదటికి..!
♦ వందశాతం ఈకేవైసీ కోసం మళ్లీ పల్స్ సర్వే
♦ వేలిముద్రలు సరిపోకుంటే ఐరిస్ సేకరణ
♦ సరిపడ ఐరిస్ పరికరాలు లేక ఇబ్బందులు
♦ తీవ్ర ఒత్తిడిలో ఎన్యుమరేటర్లు
అనంతపురం అర్బన్ : జిల్లాలో ప్రజాసాధికార సర్వే ప్రహసనంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన సర్వే అసమగ్రంగా సాగింది. ప్రతి కుటుంబ సభ్యుని నుంచి ఈకేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) తీసుకోవాలని ఆదేశాలు రావడంతో ఎన్యుమరేటర్లు మరోసారి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాల్సిన పరిస్థితి నెలకొంది. వేలిముద్రలు సరిపోకపోతే ఐరిస్ (కంటి పాప) తీసుకోవాలనని ఆదేశాలు అందాయి. అయితే సరిపడ ఐరిస్ పరికరాలను ప్రభుత్వం సరఫరా చేయలేదు. ఈకేవైసీలో ఇదో పెద్ద సమస్యగా మారింది. సర్వే ముగించేందుకు గడవు ముంచుకు వస్తుండటంతో ఎన్యుమరేటర్లు తీవ్ర ఒత్తిడి గురవుతున్నారు.
33.65 లక్షల మంది వివరాల నమోదు
జిల్లాలోని అనంతపురం, కదిరి, ధర్మవరం, కళ్యాణదుర్గం, పెనుకొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలో 43.26 లక్షల జనాభా ఉన్నారు. ఇప్పటి వరకు 33.65 మంది వివరాలు సేకరించారు. ఇంత వరకు జరిగిన సర్వే ప్రకారం రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఇక సర్వే క్రమంలో 16.68 లక్షల తప్పులు దొర్లాయి. వీటిని పర్యవేక్షకులు సరిచేయాల్సి ఉంది.
అక్టోబర్ 15 డెడ్లైన్
సర్వే చేసే క్రమంలో ప్రతి ఇంటిలోని కుటుంబసభ్యుల వేలిముద్రలు (ఈకేవైసీ) తీసుకుంటారు. చాలా చోట్ల కుటుంబసభ్యలందరూ అందుబాటులోకి రాలేదు. దీంతో కుటుంబ యజమాని వేలిముద్రలు తీసుకుని, లేని సభ్యుల ఆధార్ నంబర్ని అనుసంధానం చేసుకున్నారు. అలా కాదు ప్రతి సభ్యుని వేలిముద్రలు తప్పకుండా తీసుకోవాల్సిందేనని అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో ఎన్యుమరేటర్లు మరోమారు ప్రతి ఇంటికీ వెళ్లి గతంలో వేలిముద్రలు తీసుకోని వారి నుంచి ఇప్పుడు తీసుకోవాల్సి వస్తోంది. సర్వేని అక్టోబరు 15 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఎన్యూమరేటర్లపై ఒత్తిడి పెరుగుతోంది.
ఐరిస్ పరికరాలు లేకపోవడంతో...
వేలిముద్రలు సరిపోలని వారి నుంచి ఐరిస్ (కంటిపాప) తీసుకోవాల్సి ఉంది. అయితే ఎన్యుమరేటర్లకు సరిపడ ఐరిస్ పరికరాలను ప్రభుత్వం సరఫరా చేయలేదు. ఇదే విషయంపై సెప్టెంబర్ 26న జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయభాస్కర్రెడ్డి, పెద్దన్నలు కలిసి పరిస్థితి వివరించడంతో పాటు వినతిపత్రం అందజేశారు. వంద శాతం ఈవైకేసీ చేయాలంటే తప్పని సరిగా ఐరిస్ పరికరాలు ఉండాలని తేల్చి చెప్పారు. అయితే జేసీ మాత్రం ఏదో ఒక విధంగా చేయండి.. లేకపోతే వేతనాలను నిలిపివేస్తాన్నారని తెలిపారు.