sathupalli open cast mining
-
నవంబరు 9లోగా నివేదిక అందించాలి
సాక్షి, న్యూఢిల్లీ/చెన్నై: తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఓపెన్కాస్ట్ మైన్ కారణంగా ఉత్పన్నమయ్యే కాలుష్య పరిస్థితుల గురించి అధ్యయనం చేసేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను నవంబర్ 9లోగా అందించాలని ఆదేశించించింది. ఈ కమిటీలో కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ పర్యావరణ శాఖ, తెలంగాణ గనుల శాఖ, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్పప్లోసివ్స్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని తెలిపిన ఎన్జీటీ చెన్నై బెంచ్.. కమిటీ సమన్వయ బాధ్యతను కేంద్ర పర్యావరణ శాఖ చెన్నై ప్రాంతీయ అధికారికి అప్పగించింది. కాగా సత్తుపల్లిలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యంపై స్థానిక ఎన్టిఆర్ కాలనీవాసి బానోతు నందు నాయక్ పిటిషన్ దాఖలు చేశాడు. జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది. (చదవండి: ఎన్జీటీ ఆదేశాల అమలు నిలిపివేత ) ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. నందు నాయక్ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ గత ఏడాది జూన్లో విచారణ జరిపించినా కమిటీ సిఫార్సులను అమలు చేయలేదని తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల్లో పేలుళ్ల వల్ల ఎన్టిఆర్ కాలనీ లో 700 ఇళ్లు దెబ్బతిన్నాయని.. వాయు, శబ్దం కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్ లో కొంత భాగం బొగ్గు ఉత్పత్తి ఆపివేసినా.. మైన్ క్లోజింగ్ ప్లాన్ అమలు చేయలేదని వివరించారు. ఇందుకు స్పందించిన బెంచ్.. కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి కాలరీస్ సంస్థ, ఖమ్మం జిల్లా కలెక్టర్ తదితరులకు నోటీసు జారీ చేసింది. -
'ఓపెన్' విస్తరించెన్
సిరులు కురిపించనున్న నల్ల బంగారం విస్తరిస్తున్న సత్తుపల్లి ఓపెన్ కాస్టు ప్రారంభానికి మూడు ‘ఓపెన్’లు సిద్ధం రెండేళ్లలో పూర్తికానున్న రైల్వే లైన్ ఓపెన్ కాస్టు విస్తరిస్తోంది.. ఖమ్మం జిల్లాకు సిరులు కురిపించనుంది.. రాష్ట్రానికే తలమానికంగా నిలవనుంది.. ఇన్నాళ్లు కొత్తగూడెం పరిధిలోనే ఉన్న గనులు జిల్లా విస్తరణలో భాగంగా ‘భద్రాద్రి’ వైపు వెళ్లగా.. సత్తుపల్లిలోని ఏకైక ఓపెన్ కాస్టు గని సిరుల గనిగా తయారవుతోంది.. ఏడాదిలోగా మూడు ఓపెన్ కాస్టులు ప్రారంభానికి సిద్ధం కానుండగా.. ఏడాదికి 15 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ.. రాష్ట్రంలోనే మొదటి స్థానానికి చేరుకోనుంది. రానున్న రెండేళ్లలో రైల్వే లైన్ తోపాటు కార్మికులకు ఉపాధి.. సింగరేణి జీఎం కార్యాలయం కూడా వచ్చే అవకాశం ఉంది.. దీనికోసం ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం. సత్తుపల్లి: సత్తుపల్లిలోని సింగరేణి ఓపెన్ కాస్టు బొగ్గు గనులు రాష్ట్రంలోనే తలమానికంగా నిలవనున్నాయి. జిల్లా పునర్విభజనలో భాగంగా ముఖ్యమైన పరిశ్రమలన్నీ భద్రాద్రి జిల్లా పరిధిలోకి వెళ్లాయి. సత్తుపల్లిలోని ఓపెన్ కాస్టు గనులు ఖమ్మం జిల్లా జేవీఆర్ఓసీ ప్రారంభమైంది. అప్పటి నుంచి బొగ్గు ఉత్పత్తిలో 116 శాతం సాధించి.. మంచి ఫలితాలు ఇచ్చింది. ఏడాదికి 45 లక్షల టన్నుల ఉత్పత్తితో ఓపెన్ కాస్టు నడుస్తోంది. గనిలో ప్రస్తుతం 450 మంది కార్మికులు పని చేస్తున్నారు. అతిపెద్ద గని ఓసీ–2.. జేవీఆర్ ఓసీ–2కు స్టేజీ–1 క్లియరెన్స్ వచ్చింది. 776 హెక్టార్ల అటవీ భూమి స్వాధీనం చేసుకునేందుకు అంగీకారం కుదిరింది. స్టేజీ–2 క్లియరెన్స్ కోసం హెక్టార్కు రూ.8లక్షల చొప్పున సింగరేణి యాజమాన్యం డిపాజిట్ చేసింది. దీనికి మూడు, నాలుగు నెలల్లో క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. 239 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలతో జేవీఆర్ ఓపెన్ కాస్టు–2 ఫిబ్రవరి 2017లో ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 29 ఏళ్ల కాలపరిమితి ఉన్న ఓసీ–2లో ఏడాదికి పది మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కానుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద గనిగా ఓపెన్ కాస్టు అవతరించనుంది. కిష్టారం ఓపెస్ కాస్టు 21.61 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలతో కిష్టారం ఓపెన్ కాస్టును 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే భూముల సర్వే పూర్తయింది. భూ సేకరణకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. భూసేకరణ, అనుమతులను వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా కిష్టారం ఓపెన్ కాస్టుకు ప్రాజెక్టు ఆఫీసర్ను నియమించారు. ఓపెన్ కాస్టు కాలపరిమితి 13 ఏళ్లు. ఏడాదికి రెండు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జేవీఆర్ ఓపెన్ కాస్టు.. 17 ఏళ్ల కాలపరిమితితో జేవీఆర్ ఓపెన్ కాస్ట్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 47 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా.. 2019–20 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉన్న జేవీఆర్ ఓసీ–1 విస్తరణకు అనుబంధంగా ఓసీ–3 అవతరించనుంది. వేంసూరు రోడ్ను తొలగిస్తూ పక్కనున్న తోటల్లోకి ఓసీ–3 వచ్చే అవకాశం ఉంది. ఏడాదికి మూడు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. పెరగనున్న ఉద్యోగుల సంఖ్య వచ్చే మూడేళ్లలో మరో మూడు ఓపెన్ కాస్టు ప్రారంభం కానుండటంతో ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. ప్రస్తుతం 450 మంది కార్మికులు జేవీఆర్ ఓపెన్ కాస్టులో పని చేస్తున్నారు. వీటి విస్తరణతో రెండు మూడు రెట్లు ఉద్యోగులు పెరగటంతోపాటు కార్మికులు, యాజమాన్య అవసరాల కోసం సింగరేణి జీఎం కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు జిల్లాలకే పరిమితమైన బొగ్గు ఉత్పత్తి పునర్విభజనతో ఏడు జిల్లాలకు విస్తరించినట్లయింది. వేగవంతం కానున్న రైల్వే లైన్ పనులు బొగ్గు ఉత్పత్తిలో రాష్ట్రంలోనే మొదటి స్థానానికి చేరుకోనున్న సత్తుపల్లి రైల్వే లైన్ పనులు వేగవంతం కానున్నాయి. దీనికోసం రూ.600కోట్ల నిధులు మంజూరయ్యాయి. కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు రైల్వే లైన్ వేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే సర్వే పూర్తికాగా.. భూ సేకరణ చేయాల్సి ఉంది. ఏడాదికి 15 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కానుండటంతో రోడ్డు రవాణా కష్టంగా మారనుంది. ఇప్పటికే 300 టిప్పర్లతో కొత్తగూడెంకు రవాణా చేస్తున్న లారీలతో రోడ్లు రద్దీగా మారాయి. టిప్పర్లతో బొగ్గు రవాణా చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు.