Satya Stories
-
షూటింగ్లో రచ్చ చేసిన బాయ్ ఫ్రెండ్, సినిమా నుంచి హీరోయిన్ ఔట్!
సినిమా రంగం అంటే విశేషాలకే కాదు వివాదాలకూ చిరునామా. అయితే చాలా వరకూ వివాదాలు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయో అంతే వేగంగా మరుగునపడిపోతుంటాయి. అయితే కలకాలం నిలిచే కొన్ని సినిమాల్లాగా కొన్ని వివాదాలు కూడా ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటాయి. దానికి కారణం ఆయా వివాదాలకి లేదా ఆ సంఘటనలకి ఉన్న శక్తి, లేదా ప్రత్యేకతలే అని చెప్పొచ్చు. అలాంటిదే ఒక సంఘటన దాదాపు రెండు దశాబ్ధాల క్రితం జరిగింది. ఈ వివాదానికి కేంద్ర బిందువులుగా నిలిచిన వారు అందరూ భారతీయ సినీరంగంలో అత్యంత ప్రముఖులు కావడం మాత్రమే కాదు... ఎన్నో రకాల మనస్ఫర్ధలకు కాలాలకు స్నేహల విఛ్చిన్నానికి దారి తీయడం కూడా ఆ ఒకే సంఘటనను చిరస్మరణీయంగా మార్చింది. ఆ సంఘటనకు ఉన్న గాఢత వల్ల దానికి సంబంధించిన నటీనటులు కూడా తరచుగా దాన్ని పలు ఇంటర్వ్యూల్లో గుర్తు చేసుకుంటూ ఉండడం కూడా కనిపిస్తుంటుంది. ఆ సంఘటనకు ప్రస్తుత బాలీవుడ్ అగ్రగామి నటుడు సల్మాన్ఖాన్ ప్రధాన కారణమైతే, ప్రస్తుత అభిషేక్ బచ్చన్ భార్య, బాలీవుడ్ ప్రముఖురాలు ఐశ్వర్యరాయ్ ప్రధాన బాధితురాలుగా చెప్పొచ్చు.వివరాల్లోకి వెళితే...గత 2003లో విడుదలైన చళ్తే చళ్తే సినిమాలో షారుఖ్ ఖాన్( Shah Rukh Khan) సరసన ఐశ్వర్య రాయ్ ( Aishwarya Rai Bachchan) ప్రధాన పాత్రకు ఎంపికయ్యారు. అయితే ఒక పాట (‘ప్రేమ నగరియా‘) చిత్రీకరణ సమయంలో, అప్పటి ఆమె తాజా మాజీ బాయ్ ఫ్రెండ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ షూటింగ్ స్పాట్కు వచ్చాడు. అక్కడ నానా రభసా సృష్టించాడు. నాలుగున్నర గంటల పాటు కలకలం సృష్టించాడు. దాంతో దర్శకుడు అజీజ్ మిర్జా షూటింగ్ను నిలిపివేశారు. ఆ తర్వాత ఐశ్వర్య, సల్మాన్ ఇద్దరూ షారుఖ్కు క్షమాపణలు చెప్పినా, నిర్మాతలు ప్రాజెక్ట్ భద్రత కోసం ఆమెను చిత్రంలో నుంచి తప్పించారు.ఇది తనను ఎంతగానో బాధించిందని ఇప్పటికీ ఐశ్వర్య పలుమార్లు ఇంటర్వ్యూల్లో గుర్తు చేసుకుంటుంటారు. తన తప్పేం లేకపోయినా ఆ సినిమా నుంచి తనను తప్పించడం అనేది ఆమెను ఎంతో కాలం వేదనకు గురి చేసింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ కూడా ఆ నిర్ణయంపై విచారం వ్యక్తం చేశాడు. ‘ఐశ్వర్య నా సన్నిహిత స్నేహితురాలు. ఆమెను నా సినిమా నుంచి తప్పించాల్సి రావడం చాలా బాధాకరం. కానీ ఆ సినిమాకు నేను ఒక్కడినే నిర్మాత కాదు. మా కంపెనీ ప్రతిష్ట పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడడంతో, ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అంటూ షారూఖ్ అన్నాడు.అయితే ఆ తర్వాత కూడా షారుఖ్ ఖాన్తో కలిసి నటించాల్సిన ఐదు సినిమాల నుంచి కూడా ఐశ్వర్య రాయ్ను తప్పించారని, కానీ ఎందుకు అనే వివరణ కూడా ఇవ్వలేదని ఐశ్వర్య సన్నిహితుల దగ్గర వాపోయింది. ఈ అనూహ్య పరిణామం ఆమెను బాధించింది. అప్పటి నుంచీ షారూఖ్ ఐశ్వర్య, సల్మాన్, షారూఖ్ల మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయి. అలాగే అంతకు ముందు రాణి ముఖర్జీ, ఐశ్వర్య రాయ్ ఇద్దరూ మంచి స్నేహితులు అయితే ఐశ్వర్యరాయ్ను తొలగించిన తర్వాత ఆ స్థానంలో చళ్తే చళ్తే సినిమాలో రాణి ముఖర్జీ నటించడం జరిగింది. ఈ పరిణామం తర్వాత, వారిద్దరి మధ్య స్నేహ బంధం కూడా ముక్కలైంది. ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య పూర్తయిన చళ్తే చళ్తే సినిమా మాత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. అయితే, అంతకు ముందు ఎప్పుడూ లేనట్టుగా ఈ సినిమా వెనుక జరిగిన సంఘటన చిరకాల మిత్రులను శతృవులుగా, స్నేహాలను విడగొట్టి బాలీవుడ్ చరిత్రలో తనదైన చరిత్రను స్వంతం చేసుకుంది. -
'థగ్లైఫ్' కమల్ దెబ్బ.. జన నాయకన్ విజయ్కి తగిలింది
ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు.. కమల్కి కన్నడిగులకు మధ్య నెలకొన్న వివాదం కాస్త.. దీనితో ఏ సంబంధం లేని తమిళ సినీ నటుడు విజయ్ మీద పడనుందా? అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. కన్నడ భాష మీద ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం చెలరేగి థగ్లైఫ్ సినిమాని నిషేధించాలనే వరకూ దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఇరు పక్షాలూ తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తుండడంతో థగ్లైఫ్ సినిమా విడుదల అనంతరం పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.ఈ నేపధ్యంలో ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్కు చుట్టుకోనుంది. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టడానికి ముందుగా విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయకన్', ఇప్పుడు 'థగ్ లైఫ్' వివాదంతో ఇది పెనవేసుకుని పెను వివాదంలో చిక్కుకుంది. దీనికి కారణం జననాయకన్ చిత్రాన్ని నిర్మిస్తోంది బెంగళూరు కేంద్రంగా ఉన్న నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ కావడమే.వచ్చే ఏడాది జనవరి 9న తమిళ పొంగల్ సందర్భంగా విడుదల కావల్సిన ఈ సినిమా.. విజయ్ రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల సమరాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందింది. దీనిని సమయోచితంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే వీరి ప్లాన్స్ను థగ్లైఫ్ దుమారం పెద్ద దెబ్బ కొట్టే ప్రమాదం కనిపిస్తోంది. థగ్ లైఫ్ని బ్యాన్ చేయాలనే ప్రచారం ఊపందుకోవడంతో పాటే సామాజిక మాధ్యమాల్లో 'బ్యాన్ జననాయకన్' అనే కొత్త క్యాంపెయిన్ మొదలైంది.థగ్ లైఫ్ సినిమాని కర్ణాటకలో నిషేధిస్తే, కన్నడ సినిమాలు తమిళనాడులో నిషేధించాలి. విజయ్ తన జననాయకన్ సినిమాని ఇక వదులుకోవాలి అంటూ ఎక్స్ వేదికగా రాజేష్ లింగేష్ అనే వ్యక్తి చేసిన ప్రకటనకు అనేక మంది మద్దతు తెలుపుతూ, జననాయకన్ కూడా బ్యాన్ చేయాలి అంటూ పోస్ట్లు చేస్తుండడం ఎక్కువైంది. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషలలో విడుదల కానున్న జననాయకన్ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ పెట్టిన రాజకీయ పార్టీ తమిళక వెట్రి కజగం.. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పరిస్థితుల్లో... ఈ చిత్రం విడుదల, విజయం కూడా ఆ పార్టీకి చాలా కీలకం.దీంతో విజయ్ అభిమానులు ఈ ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సినిమాని విజయ్కు అత్యంత నమ్మకస్తుడైన జగదీష్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతోంది. కేవలం కన్నడ సంస్థ నిర్మిస్తున్నందుకు సినిమా నిషేధించడం న్యాయం కాదు. జననాయకన్ విడుదల కోసం భాషా బేధాలకు అతీతంగా అందరూ ఎదురు చూస్తున్నారు అంటూ వారు అంటున్నారు. మరోవైపు విజయ్ రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఈ ప్రచారాన్ని ఎగదోస్తున్నారంటూ మరికొందరు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా నేడు థగ్లైఫ్.. కర్ణాటకలో ఎదుర్కోబోయే పరిస్థితులు రేపటి జననాయకన్ భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది సుస్పష్టం. -
‘మిస్ వరల్డ్’ స్పాన్సర్లకు సహకరించాల్సిందే: బాలీవుడ్ నటి
మిస్ వరల్డ్ ఇండియా పోటీల్లో పాల్గొన్న వారు స్పాన్సర్ల కార్యక్రమాల్లో బలవంతంగా పాల్గొనాల్సి వచ్చిందని, నిర్దిష్ట దుస్తులు ధరించమని ఒత్తిడి చేయడం జరిగిందని మిస్ ఇంగ్లాండ్ మిల్లా ఆరోపించడం మిస్ వరల్డ్ పోటీల నుంచి నిష్క్రమించడం తెలిసిందే. ఈ నేపధ్యంలో బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ రన్నరప్, ఐక్యరాజ్యసమితి గుడ్విల్ అంబాసిడర్ దుబాయ్ నివాసి సెలీనా జైట్లీ(Celina Jaitly), మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు.‘సౌందర్య వేదికల విలువను తక్కువగా అంచనా వేయడం బాధాకరం అన్నారామె. ‘అంతర్జాతీయ వేదిక అంటే ప్రొఫెషనలిజం, ఆత్మవిశ్వాసంతో ముందుకు రావడం’’ అంటూ పేర్కొన్నారు. తాజాగా గల్ఫ్ న్యూస్కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సెలీనా జైట్లీ మాట్లాడుతూ గతంలో మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం తరపున పోటీపడిన తన అనుభవం గుర్తు చేసుకున్నారు.‘ప్రపంచ మీడియా ముందు మీరు మీ దేశ ప్రతినిధిగా గౌరవంగా ఉండడం ఆవేదన చెందాల్సిన విషయం కాదు, గర్వించదగ్గ విషయం’’ అన్నారు. మిల్లా సిపిఆర్ శిక్షణ వంటి అంశాలను ముందుకు తెచ్చి పోటీకి సంబంధించిన మౌలిక అంశాలపై మార్పులు కోరడం సరికాదని సెలీనా అభిప్రాయపడ్డారు.వచ్చే 2025 చివరి నాటికి సౌందర్య పరిశ్రమ 667 బిలియన్ల డాలర్ల ఆదాయం, ఫ్యాషన్ రంగం 1.7 ట్రిలియన్ల విలువను సాధించబోతున్నాయని, ఈ రంగాలు కేవలం అందం గురించి కాక, కోటి మందికి ఉపాధిని అందిస్తున్నాయన్నారు. అంతేకాక సంప్రదాయ సాంస్కృతిక విలువల వ్యక్తీకరణకు వేదికలుగా కూడా నిలుస్తున్నాయనీ చెప్పారామె. భారతదేశ సౌందర్య రాణుల జాబితాలో ఉండడం గర్వంగా ఉందంటూ చెప్పిన జైట్లీ, సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్, లారా దత్తా, ప్రియాంక చోప్రా లాంటి ప్రముఖుల పేర్లు ప్రస్తావించారు. ‘అందాల వేదికలపై వారి విజయాల వల్లే అంతర్జాతీయ బ్రాండ్లు భారతీయ ఆర్ధికవ్యవస్థలోకి అడుగుపెట్టాయి. ఈ వేదికలను తక్కువ చేసి చూడడం బాధాకరం’’ అన్నారు.మిల్లా చేసిన ఆరోపణల్లో స్పాన్సర్లతో పాల్గొనడం ‘దుర్వినియోగం‘గా వర్ణించడాన్ని సెలీనా ఖండించారు. ‘స్పాన్సర్లతో సహకరించడం సందర్భానుసారంగా దుస్తులు ధరించడం వంటివి ఈ వేదికలో సహజమేనని చెప్పారు. ‘‘ ఇది హెచ్ఆర్ సెమినార్ కాదు, ఇది బ్యూటీ కాంటెస్ట్ అని గుర్తుంచుకోవాలి’’ అన్నారామె మిల్లా చేసిన ప్రసంగాల్లో స్పాన్సర్ల కార్యక్రమాలను వ్యభిచారంతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన జైట్లీ, ‘ఇలాంటి భాష వాడటం వృత్తి పరంగా ఆమోదయోగ్యం కాదు. ఇది సాటి మహిళలను తక్కువ చేయడంతో పాటు కోటి మందికి ఉపాధి ఇచ్చే పరిశ్రమలను అవమానించడం కూడా’’ అంటూ మండిపడ్డారు.‘ఒక సైనికుడి కూతురిగా సుదూర ప్రాంతాల్లో పెరిగాను. బ్యూటీ కాంటెస్ట్ వేదికలు నా జీవితాన్నే మార్చాయి. అందాల కిరీటం వల్లనే నేను ఐక్యరాజ్యసమితి, బాలీవుడ్ వేదికల వరకూ వెళ్లగలిగాను’’ అంటూ కృతజ్ఞతా పూర్వకంగా మాట్లాడారు. వివాదాలు, తప్పుదోవ పట్టించే విమర్శల నడుమ, సెలీనా జైట్లీ చివరగా ఓ విషయం స్పష్టంగా చెప్పారు. ‘‘ బ్యూటీ కాంటెస్ట్లు కేవలం గ్లామర్ కోసమే కాకుండా, కట్టుబాటు, అంకితభావం, దేశ గౌరవం కోసం నిలబడే వేదికలు’’ -
బిగ్ బాస్లోకి యూట్యూబర్లు,ఇన్ఫ్లుయన్సెర్లకు ఇక నో ఎంట్రీ...
ఎక్కడో ఇంగ్లండ్లో పుట్టి ఓ హీరోయిన్ ద్వారా ఇండియాలో అడుగు పెట్టి అన్ని ప్రధాన భాషల్లోనూ వీర విహారం చేస్తోంది ఆ షో. ఇంగ్లండ్ మూలాలు కలిగిన బిగ్బాస్(Bigg Boss 19) గురించి తెలియనివారు ఉండరు. గత కొన్నేళ్లుగా తెలుగు నాట అనేక రకాల వివాదాలకు విమర్శలకు విజయాలకు చిరునామాగా మారింది ఈ బిగ్ బాస్.ఈ షో కొత్త కొత్త సెలబ్రిటీలను తెరమీదకు తెచ్చింది. మరీ ముఖ్యంగా యూ ట్యూబ్, ఇన్స్టా గ్రామ్ వంటి వేదికల ద్వారా పేరొందిన సోషల్ మీడియా సెలబ్రిటీలకు సరికొత్త పాప్యులరారిటీని అందించింది.డ్యాన్స్, పాటల వీడియోలతో తొలినాళ్లలో సోషల్ సెలబ్రిటీగా పేరొందిన దీప్తి సునయన, మై విలేజ్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన గంగవ్వ, టిక్ టాక్ వీడియోలతో జూనియర్ సమంతగా పాప్యులరైన అషూరెడ్డి, యూట్యూబ్, ఇన్స్టా స్టార్ షణ్ముఖ్ జస్వంత్, ఇన్స్టా గ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరొందిన గీతూరాయల్, కామెడీ కంటెంట్తో ఇన్ఫ్లుయెన్సర్గా మారిన బెజవాడ బేబక్క,7 ఆర్ట్స్ యూ ట్యూబ్ చానెల్ ద్వారా ప్రసిద్ధి పొందిన కిర్రాక్ సీత, రేడియో జాకీగా పేరొందిన ఆర్జె కాజల్, ఇంకా అలాంటి అనేక మంది ఇప్పటికే తమ సోషల్ స్టేటస్కు బిగ్ బాస్ ద్వారా మరింత గ్లామర్ను జత చేసుకున్నారు అనేది తెలిసిందే.ఈ నేపధ్యంలో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం అవుతోందనగానే సోషల్ మీడియా సెలబ్రిటీలు అప్రమత్తం అయిపోవడం, హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టడం సర్వ సాధారణంగా మారిపోయింది. అదే విధంగా బిగ్ బాస్ హౌస్లోకి వీరు వెళతారు వారు వెళ్లనున్నారు అంటూ సీజన్ మొదలయ్యే దాకా పుకార్లు షికార్లు చేయడమూ రివాజుగా మారింది.అయితే భవిష్యత్తులో వీరి ఆశలు నీరుగారనున్నాయా? ఇకపై బిగ్ బాస్ హౌస్లోకి సోషల్ మీడియా సెలబ్రిటీలకు నో ఎంట్రీ బోర్డు దర్శనమివ్వనుందా? ఇలాంటి సందేహాలు వచ్చేలా చేస్తున్నాయి కొన్ని తాజా నిర్ణయాలు, తాజా పరిణామాలు. ప్రస్తుతానికి తెలుగు బిగ్ బాస్కు సంబంధించినవి కాకపోయినా... ప్రాంతీయ బిగ్బాస్లు అన్నింటికీ పెద్దన్న లాంటి హిందీ బిగ్ బాస్ కు సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని సమాచారం.హిందీలో బాలీవుడ్ దిగ్గజం సల్మాన్ఖాన్ సమర్పిస్తున్న బిగ్ బాస్ 19 గురించి వినిపిస్తోన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ సీజన్ కోసం మేకర్స్ గణనీయమైన ఫార్మాట్ మార్పును ప్లాన్ చేస్తున్నారు. గత సంవత్సరాలకు భిన్నంగా, రాబోయే రియాలిటీ షోలో యూ ట్యూబర్లు లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇక ఉండరని సమాచారం. బదులుగా, పోటీదారుల్లో పేరొందిన, స్థిరపడిన బాలీవుడ్ టీవీ రంగ ప్రముఖులు మాత్రమే ఉంటారు.టెల్లీ రిపోర్టర్ నివేదిక ప్రకారం, బిగ్ బాస్ 19 నిర్మాతలు సాంప్రదాయ వినోద పరిశ్రమల నుంచి ప్రసిద్ధి చెందిన పేర్లపై మాత్రమే దృష్టి సారించి, షోను దాని మూలాల వైపునకు నడిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ షోకు మరింత సాంప్రదాయ గ్లామర్ అప్పీల్ ఇవ్వడం ద్వారా ప్రారంభకాలం నాటి సెలబ్రిటీ–కేంద్రీకృత ఫార్మాట్కు తిరిగి రావడమే లక్ష్యం గా పెట్టుకున్నారని, అందుకే ప్రధాన స్రవంతి నటుల మీదే దృష్టి సారించి బిగ్ బాస్ అసలు సారాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, విస్త్రుత అభిమానుల స్థాయితో వ్యూహాత్మక గేమ్ప్లేతో కొత్త యువ ప్రేక్షకులపై బలమైన ప్రభావాన్ని చూపగలిగారనేది నిజం. సోషల్ మీడియా సెలబ్రిటీల వల్ల వీక్షకుల సంఖ్య పెరిగారనేది నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే వీరి వల్ల షో తన అసలు స్వరూపాన్ని కోల్పోతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏదేమైనా సల్మాన్ బిగ్బాస్ ఈ కొత్త నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేసిన పక్షంలో అదే బాటను తెలుగు బిగ్ బాస్ కూడా అనుసరించే అవకాశాల్ని కొట్టి పారేయలేం. అదే జరిగితే ఈ సీజన్కు కాకపోయినా వచ్చే సీజన్పై సోషల్ మీడియా సెలబ్రిటీలు ఆశలు వదిలేసుకోవాల్సి రావచ్చు. -
Miss World 2025: ఆరడుగుల బ్యూటీ.. బెడ్రూమ్లో భర్త చేతిలో నరకం
అందాల సుందరి కిరీటం గెలుచుకోవడం గొప్ప గౌరవం. అంతకు మించి గొప్ప అవకాశాలకు మార్గం. అందులోనూ ప్రపంచ సుందరి కిరీటం అంటే... అంతకు మించి.. అయితే మిస్ వరల్డ్ కిరీటం దక్కగానే అన్నీ దక్కేసినట్టే అనేది అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యం అనేది నిజం. అడ్డంకులెన్నో అధిగమించి.. అందాల రాణి అనే అంతర్జాతీయ కిరీటం అందుకున్నా... అత్తింట్లో అష్టకష్టాలు పడే సాదా సీదా అమ్మాయిలు కూడా ఉంటారు. అలాంటి మహిళే యక్తా ముఖి.ఆమె 1999లో మిస్ వరల్డ్గా భారతదేశానికి గౌరవం తీసుకువచ్చిన యుక్త ముఖి(Yukta Mukhi)... 5.11 అంటే షుమారు 6 అడుగుల హైట్తో కిరీటం దక్కించుకుందే కానీ అందలాలు అందుకోవడంలో మాత్రం విజయం సాధించలేకపోయింది. ఆ ఒక్క గెలుపు తప్ప ఆ తర్వాత ఏ రకమైన సంతృప్తినిచ్చే గమ్యాన్నీ ఆమె చేరుకోలేకపోయింది.మిస్ వరల్డ్గా టైటిల్ సాధించిన తర్వాత, ఎన్నో ఆశలతో, తన ముందున్న ఐశ్వర్య రాయ్ వంటివారి విజయాల స్ఫూర్తితో యుక్త ముఖీ వెండితెరపై అడుగుపెట్టింది. తొలిగా 2001లో పూవెల్లమ్ ఉన్ వాసమ్ అనే తమిళ చిత్రంలో ‘యుక్తాముఖి’ అనే పాటలో కనిపించే అతిధి పాత్రతో ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది. అనంతరం 2002లో అఫ్తాబ్ శివ్దాసాని పక్కన ’ప్యాసా’ చిత్రంతో హీరోయిన్గా తెరంగేట్రం చేసినా.. ఆ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత మార్కెట్ అనే సినిమా షూటింగ్లో ఉండగా, గాయం వల్ల ఆ సినిమా నుంచి వైదొలగింది. అనంతరం కబ్ క్యోం కహా, హమ్ తీనోం..సినిమాలకు సంతకం చేసినా, అవి క్లాప్ కొట్టకుండానే అటకెక్కాయి. ఆ తర్వాత మరో రెండు ప్రాజెక్టులు కూడా అలాగే జరిగాయి. తర్వాత ’కట్పుత్లీ’, ’లవ్ ఇన్ జపాన్’, ’మెమ్సాహబ్’ వంటి చిత్రాల్లో నటించినా, అవి కూడా విజయవంతం కాలేదు. దాదాపు 9 ఏళ్ల తర్వాత 2019లో ’గుడ్ న్యూస్’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో మాత్రమే ఆమె కనిపించింది. విచిత్రంగా వ్యక్తిగత జీవితం కూడా ఆమెకి విషాదాన్నే మిగిల్చింది. న్యూయార్క్కు చెందిన వ్యాపారవేత్త ప్రిన్స్ తులిని 2008లో యుక్త ముఖీ, వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు అయితే, కొన్నేళ్ల పాటు భర్త చేతిలో అసహజ లైంగిక వాంఛలతో, చిత్రహింసలకు గురైన యుక్తా ముఖి 2013లో భర్త , అత్తింటి వారిపై సదరు సెక్షన్ల ప్రకారం క్రిమినల్ కేసు పెట్టింది. చివరికి 2014లో ఈ దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. సినీ రంగం నుంచి దూరమైన తర్వాత, ప్రస్తుతం 48 ఏళ్ల వయసులో యుక్త ముఖీ సామాజిక సేవలో నిమగ్నమైంది. ఎయిడ్స్ బాధితులు, థలసీమియా, బ్రెస్ట్ క్యాన్సర్ బాధితుల కోసం పనిచేస్తోంది. అలాగే అవయవదానాన్ని ప్రోత్సహిస్తూ, మరోవైపు బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. మురికివాడల్లోని బాలికలకు ఆరోగ్యం, శారీరక అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటోంది. -
కెమెరా ముందు అలా చేయమన్నారు..నటి షాకింగ్ కామెంట్స్
సినిమా సన్నివేశాల్లో సహజత్వం కోసం దర్శకులు పడే తాపత్రయంలో అద్భుతమైన కళాదృష్టి ఉంటే ఉండొచ్చు గాక..ఒక్కోసారి అది నటీనటులకు ప్రాణ సంకటంగా మారొచ్చు. ఎంత సహజత్వం కోసం తాపత్రయపడే ప్రేక్షకులైనా కొన్ని నిజజీవితంలో చేసే పనులు తెరమీద నేరుగా చూపిస్తే జుగుప్సాకరంగా ఫీల్ అవకుండా ఉండలేరు. అలాంటి వాటిలో వాష్ రూమ్ సన్నివేశాలు ముందు వరుసలో ఉంటాయి. అయితే అచ్చంగా అలాంటి ఒక సన్నివేశాన్ని చిత్రీకరించిన దర్శకుడు సహజత్వం కోసం సదరు నటిని చేయమన్న పని ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.హిందీలో షైతాన్ గా రీమేక్ చేయబడిన గుజరాతీ హర్రర్ చిత్రం వాష్(Vash) లో నటించిన నటి జాంకి బోడివాలా(Janki Bodiwala) ఆ సినిమా లో సనిన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా తాను ఎదుర్కున్న అనుభవాలను నుంచి ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. ఇటీవల ఫిల్మ్ఫేర్తో జరిగిన రౌండ్టేబుల్ చర్చలో, ఆమె మాట్లాడుతూ వాష్ చిత్రంలోని ఒక కీలక సన్నివేశంలో తాను మూత్ర విసర్జన చేసే సీన్ ఉందన్నారు. అయితే ఆ సీన్ను రీమేక్ చేస్తున్న సమయంలో సహజత్వం కోసం దర్శకుడు కృష్ణదేవ్ యాగ్నిక్ నిజంగా మీరు మూత్ర విసర్జన చేయగలరా అని తనను అడిగినట్లు ఆమె వెల్లడించింది. సినిమాలో ఆ మూత్ర విసర్జన సన్నివేశం చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుందనీ కాబట్టి, ఆ సీన్లో నిజంగా ఆ పని చేయగలరా? అని దర్శకుడు అడిగినట్టు ఆమె తెలిపింది. అయితే ఆ మాటకి ముందు షాక్ తిన్నా... ఆ తర్వాత తాను చాలా ఉద్విగ్నంగా ఫీల్ అయ్యానని ఆమె చెప్పింది. ఓహ్! నటుడిగా, నాకు తెరపై చేసే అవకాశం లభిస్తోంది. ఎవరూ చేయనిది.’’అంటూ సంతోషపడ్డానని వివరించింది.అయితే, వారు సన్నివేశాన్ని చిత్రీకరించడానికి సిద్ధమైన తర్వాత తనకి దర్శకుడు కోరుకున్న విధంగా చేయడం అసాధ్యం అనిపించిందని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సన్నివేశం తనను నటిగా ఉత్సాహపరిచింది కాబట్టి తాను చేయడానికి అంగీకరించానని వెల్లడించింది. ‘‘కానీ తరువాత, అది జరగలేదు మరియు దీనికి చాలా రీటేక్లు తీసుకున్నాం. ఇది సెట్లో ఆచరణాత్మకంగా సాధ్యం కాదని నాకు అర్ధమైంది. కాబట్టి మేము దానిని చేయడానికి వేరే మార్గాన్ని కనుగొన్నాం’’ అంటూ ఆమె తెలిపింది. నిజ జీవితంలో తాను చేయలేని పనులు చేయగలిగినందుకు సంతోషంగా ఉన్నానని ఆ సన్నివేశం చేసినందుకు తను ఎలాంటి బాధ లేదని స్పష్టం చేసింది.కనోడియా, నీలమ్ పాంచల్ హితేన్ కుమార్ నటించిన వాష్ చిత్రాన్ని హిందీలో అజయ్ దేవ్గన్, జ్యోతిక ఆర్ మాధవన్లతో షైతాన్గా రీమేక్ చేశారు. ఒక రహస్యమైన అపరిచితుడు ఒక యువతిపై నియంత్రణ సాధించడం ద్వారా వారి ఇంట్లోని కుటుంబంపై ఎలా ప్రవర్తించాడు? అనే హారర్ కథ ఇది. రెండు భాషా చిత్రాలలోనూ నటించిన జానకి అపరిచితుడి ఉచ్చులో పడే కుమార్తెగా ఆకట్టుకుంటుంది. -
దీపిక తొలగింపు.. పరేష్ రావల్ కంపు... ఈ బాలీవుడ్కేమైంది?
బాలీవుడ్ అంటే దేశంలోని అన్ని వుడ్లకూ గాడ్ లాంటిది అనలేకపోయినా కనీసం పెద్దన్న లాంటిది అనొచ్చేమో... దేశవ్యాప్తంగా నటీనటులందరిపైనా, అన్ని భాషా చిత్ర పరిశ్రమలపైనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బాలీవుడ్ ప్రభావం ఉంటుంది. అలాంటి బాలీవుడ్కి అకస్మాత్తుగా ఏమైంది? గత కొంత కాలంగా హిందీ చిత్ర పరిశ్రమ విజయాలు తక్కువ వివాదాలెక్కువ అన్నట్టుగా తయారైంది. ఒకప్పుడు నటీనటుల వివాహేతర సంబంధాలు, తెరవెనుక అలవాట్లు...వంటివి మాత్రమే ఎక్కువగా చర్చనీయాంశమయ్యేవి. అవన్నీ వ్యక్తిగతం అంటూ బాలీవుడ్ పెద్దలు సమర్ధించుకునేవారు. కానీ ఇప్పుడు వస్తున్న వివాదాలు వ్యక్తిగతమైనవి కావు...వ్యవస్థాగతమైనవే. అవి కూడా చిన్నా చితకా స్టార్స్కు సంబంధించినవి కావు.. బాలీవుడ్ని ఓ రకంగా ఏలుతున్న నటీనటులకు సంబంధించినవి కావడం గమనార్హం. బాలీవుడ్లో వినోదాత్మక చిత్రాభిమానులను అలరిస్తుందనే భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్ర ‘హేరా ఫేరి 3‘(Hera Pheri 3) . ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర కధానాయకుడు అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. అలాంటి సినిమా నుంచి అనూహ్యంగా మరో ప్రముఖ నటుడు పరేష్ రావల్ (శంకర్ దాదా ఎంబిబిఎస్ ఫేం) తప్పుకోవడం బాలీవుడ్ పరిశ్రమను, ప్రేక్షకుల్ని తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. పరేష్ రావల్(Paresh Rawal) ఆకస్మిక నిర్ణయం తర్వాత, సహనటుడు అక్షయ్ కుమార్ తో పాటు ఆ సినిమా నిర్మాతలు పరేష్ రావల్పై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. దాంతో పరేష్ రావల్ తన సంతకం చేసి ముందస్తుగా స్వీకరించిన రూ.11 లక్షలను 15% వడ్డీతో తిరిగి చెల్లించాల్సి వచ్చింది. అతని మొత్తం పారితోషికం రూ.15 కోట్లు అని సమాచారం.మరోవైపు బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone ), ప్రభాస్తో కలిసి నటించాల్సిన ‘స్పిరిట్‘(Spirit) చిత్రం నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నారు. అత్యధిక రెమ్యునరేషన్ డిమాండ్ కి తలొగ్గినా కూడా దీపిక ఒకదాని తర్వాత ఒకటిగా రకరకాల డిమాండ్లు పెడుతుండడంతో విసుగు చెందిన స్పిరిట్ దర్శకుడు సందీప్రెడ్డి వంగా ఆమెను తన ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. అయితే ఈ నిర్ణయం తర్వాత కూడా వీరిద్దరి మధ్యా మాటల తూటాలు పేలుతున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో డర్టీ పీఆర్ గేమ్స్ అంటూ దీపికాపై పరోక్ష విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా తనకు అనుకూలమైన వాతావరణం ఉన్నచోట మాత్రమే తాను పనిచేయాలనుకుంటున్నట్లు దీపిక వ్యాఖ్యానించారు. మొత్తం మీద బాలీవుడ్లో వరుసగా చోటు చేసుకున్న ఈ రెండు సంఘటనలూ...బాలీవుడ్ ప్రతిష్టను మసకబార్చేలా ఉన్నాయని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే సినిమాల నుంచి నటీనటులు మధ్యలో తప్పుకోవడం ఇదే మొదటి సారి కాదని గతంలోనూ పలు మార్లు ఇలాంటివి జరిగాయని పలువురు గుర్తు చేస్తున్నారు.గత 2013లో’రేస్ 2’ చిత్రం షూటింగ్ ప్రారంభమైన తర్వాత, దీపికా పదుకునే అకస్మాత్తుగా ప్రాజెక్ట్ను వదిలివేశారు. దీంతో నిర్మాత రమేష్ తౌరానీ దీపిక అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ వివాదం బాలీవుడ్లో పెద్ద చర్చకు దారి తీసింది. అలాగే గత 2018లో సల్మాన్ ఖాన్ తో కలిసి ’భారత్’ చిత్రంలో నటించాల్సి ఉన్న ప్రియాంక చోప్రా షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ప్రాజెక్ట్ను వదిలివేశారు. దీంతో సల్మాన్ ఖాన్, ఆమెపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత, కత్రినా కైఫ్ ఈ పాత్రను స్వీకరించారు. అలాగే ఇంకా ముందుకు వెళితే..2000లో కహో నా ప్యార్ హై సినిమా నుంచి కరీనాకపూర్ , 2003లో చల్తే చల్తే చిత్రం నుంచి సల్మాన్ఖాన్ గందరగోళం కారణంగా ఐశ్వర్యరాయ్ లు తప్పుకున్నారు. గత 2015లో ఊపిరి సినిమాలో నటించాల్సి ఉన్న శృతిహాసన్ మధ్యలో వదిలేయడంతో చిత్ర నిర్మాతలు ఆమెపై కోర్టుకెక్కారు. అయితే ఈ ఘటనలన్నీ కూడా సంవత్సరాల వ్యవధిలో జరుగగా... ఇప్పుడు వరుసగా బాలీవుడ్లో జరుగుతుండడమే చర్చనీయాంశంగా మారింది. -
20 నిమిషాల పాత్రకి 20 కోట్లట..పదేళ్లలోనూ ఫ్లాపులే ఎక్కువ!
సినిమా రంగం ఎవరిని ఎప్పుడు నెత్తికి ఎక్కించుకుంటుందో ఎవరిని నేలకేసి కొడుతుందో అంచనా వేయడం అంత సులభం కాదు. అందుకు నిదర్శనంగా మన తెలుగు హీరోను చెప్పొచ్చు. వయసులో ఉన్నప్పుడు ఉరకలేసే ఉత్సాహంతో ఫైట్లూ, డ్యాన్సులూ వేసినా సమకాలికులైన హీరోలపై సాధించలేకపోయిన పైచేయిని..సక్సెస్నూ వృద్ధాప్యంలో సాధిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు బాలకృష్ణ. ఇటవలి కాలంలో సీనియర్ నటుల్లో బాలకృష్ణ అందుకుంటున్న విజయాలు మరెవ్వరికీ సాధ్యం కావడం లేదనేది వాస్తవం. నిజానికి యుక్తవయసులో ఉండగా కూడా బాలయ్య ఇంత సందడి చేయలేదని చెప్పొచ్చు. వయసులో ఉండగా చేయలేకపోయిన యాడ్స్లో కూడా ఆయన ఇప్పుడు సత్తా చాటుతుండడం దీనికో నిదర్శనం. ఈ నేపధ్యంలో తాజాగా సినీరంగంలో హల్చల్ చేస్తున్న ఒక వార్త మరోసారి బాలకృష్ణ సరికొత్త స్టామినాను చాటి చెబుతోంది. అదేమిటంటే జైలర్ 2 సినిమాలో అతిధి పాత్రలో బాలకృష్ణ కనిపించబోతున్నాడని, అందుకు గాను అత్యధిక పారితోషికం అందుకుంటున్నారని.. కేవలం 20 నిమిషాల నిడివి ఉండే పాత్ర కోసం బాలకృష్ణ ఏకంగా రూ.20కోట్లకు పైనే రెమ్యునరేషన్ ఇవ్వడానికి జైలర్2 నిర్మాతలు ఓకే అన్నారని తెలుస్తోంది. ఈ సమాచారం ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఒకప్పుడు అంటే దాదాపుగా ఒక పదేళ్ల క్రితం డిక్టేటర్ వంటి సినిమాల్లో నటించే సమయంలో బాలకృష్ణ మొత్తం సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ కూడా దాదాపుగా అంతే ఉంటుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఒక సినిమా మొత్తం కనిపించే హీరోగా పదేళ్ల క్రితం తీసుకున్న పారితోషికాన్ని ఇప్పుడు కేవలం 20 నిమిషాల పాత్ర కోసం తీసుకుంటూ బాలకృస్ణ కొత్త రికార్డ్ సాధించారని చెప్పొచ్చు. మొదటి నుంచీ నిర్మాతలకు అందుబాటులో ఉండే హీరోగా బాలకృష్ణకు పేరుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా పారితోషికం రూపంలో నిర్మాతల నెత్తిన భారం మోపే వాడు కాదని అందుకే ఎన్ని ఫ్లాపులొచ్చినా బాలకృష్ణ చేతిలో సినిమాలు లేని పరిస్థితి ఎప్పుడూ లేదని అంటుంటారు. అంతెందుకు ఆయన రెమ్యునరేషన్ అమాంతం పెరిగిన ఈ పదేళ్లలో చూసుకున్నా... బాలకృష్ణ కెరీర్లో విజయాలకన్నా అపజయాలే ఎక్కువ.గత 2014లో లెజెండ్ తర్వాత లయన్, డిక్టేటర్, గౌతమ్ పుత్ర శాతకర్ణి, పైసా వసూల్, జై సింహా, కధానాయకుడు పార్ట్ 1, కధానాయకుడు పార్ట్ 2, రూలర్... వరకూ వరుస ప్లాఫులే. ఆ తర్వాత ‘అఖండ’తో మాత్రమే విజయాలు ప్రారంభమయ్యాయి. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, ఢాకూ మహరాజ్..లు హిట్స్గా నిలిచాయి.అంటే పదేళ్లలో 9 ఫ్లాపులు, 4 మాత్రమే విజయాలు. హిట్టయిన నాలుగింటిలోనూ బాలకృష్ణ డ్యాన్సులు ఫైట్లు చేసే కుర్ర హీరోలా కాకుండా డైలాగులు పేల్చడం, విలన్లను నరకడం వరకే పరిమితమైన వయసుకు తగ్గ పాత్రలు పోషించడం కూడా ఈ సినిమాల సక్సెస్కు కారణంగా చెప్పొచ్చు. ఏదేమైనా వచ్చే జూన్ 10వ తేదీతో 65ఏళ్లు నిండుతున్న బాలయ్య... రేపోమాపో యువహీరోగా తెరకెక్కనున్న తన కొడుకుతో పోటీపడే స్థాయిలో నిలవడం విశేషమే అని చెప్పాలి. -
వోడ్కా తాగండి అంటున్న ప్రభాస్ ‘సీత’.. ఇదేమైనా బాగుందా?
ఒకప్పుడు పౌరాణిక పాత్రలు ధరించిన తారలు...ఆ సందర్భంలో ఎంతో నిష్టగా ఉండేవారని విన్నాం. ఉపవాసాలు చేస్తూ, కటిక నేల మీద నిద్రపోతూ.. దేవుని పాత్రల్ని పండించిన నటీ నటులను కన్నాం. అది నటనే అయినప్పటికీ ప్రజల భావోద్వేగాలతో అనుసంధానమై ఉన్న దేవుళ్లలా కనిపించాలంటే నిజంగా అంతటి దైవభక్తి ఉంటే తప్ప ఆ పాత్రల్ని పండించడం సాధ్యం కాదని అప్పటి వారి భావన. కేవలం పాత్రల్ని పండించడం మాత్రమే కాదు ఆ తర్వాత కూడా తమ నడవడిక, ప్రవర్తన కొంతయినా పద్ధతిగా ఉండేలా జాగ్రత్త పడేవారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు అంతటి చిత్తశుద్ధిని ఈనాటి తారల్లో చూడలేం. అది అలా ఉంచితే.. మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలని పెద్దలు చెప్పారు. అలాగే సెలబ్రిటీలన్న తర్వాత కాసింత సామాజిక బాధ్యత కూడా ఉండాలని కూడా చెప్పారు..చెబుతున్నారు. కానీ తారల చెవికి అవి ఎక్కడం లేదు. సినిమాల ద్వారా సంపాదించుంటున్నది చాలదన్నట్టు ప్రకటనల్లోనూ వారే కనిపిస్తున్నారు. పోనీ అక్కడైనా కాస్త బాధ్యతగా ఉంటున్నారా? సిగిరెట్స్ నుంచి మద్యం దాకా ప్రజల ఆరోగ్యాల్ని హరించే ఉత్పత్తుల ప్రచారానికి కూడా సై అంటున్నారు. అది సరికాదని ఎందరు నెత్తి నోరూ బాదుకుంటున్నా కాసుల కక్కుర్తిలో కొట్టుకుపోతున్న సెలబ్రిటీల చెవిన పడడం లేదు. ఇటీవల టాలీవుడ్ అగ్రనటుడు బాలకృష్ణ ఓ మద్యం బ్రాండ్ ప్రచారంలో కనిపించడం విమర్శలకు గురైన విషయం తెలిసిందే. అదే క్రమంలో ఇప్పుడు మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కాకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. అంటే ఇక ఆమె యువత వోడ్కా తాగడాన్ని శక్తి వంచన లేకుండా ప్రోత్సహించనుందన్న మాట. ‘కృతిని మా జట్టులోకి తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది‘ అని బ్రాండ్ ప్రతినిధులు అంటున్నారు. తాము లక్ష్యంగా చేసుకున్న కొత్త తరం యువ వినియోగదారుల్లా ఆమె తెలివైనది, స్టైలిష్ గా, నిర్భయంగా ఉంటుందని ఇది తమ మ్యాజిక్ మూమెంట్స్కు కొత్త అధ్యాయం’’ అంటున్నారు. మరోవైపు ‘మ్యాజిక్ మూమెంట్స్ అంటే అనుభూతిని సొంతం చేసుకోవడం మ్యాజిక్ కుటుంబంలో చేరడం చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది మా భాగస్వామ్యం సరదాగా శక్తితో నిండి ఉంటుంది’’ అంటూ కృతి సనన్ కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది. సినీతారలు మద్యం ప్రచారంలో పాల్గొనడం పై విమర్శలు వస్తున్నా కృతి సనన్ సినిమా లాంటి యువ తారలు పట్టించుకోకపోవడం విచారకరం. మరోవైపు పొడుగు కాళ్ల సుందరి కృతిసనన్ మన తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ సరసన ఆదిపురుష్లో సీతగా కూడా చేసింది. జయాపజయాల సంగతి ఎలా ఉన్నా... ఆదిపురుష్ చిత్రంలో సీతగా పౌరాణిక పాత్ర చేసిన తర్వాత ఆమె వోడ్కా ప్రచారంలో పాల్గొనడం ఎంత వరకూ సబబు? అనే ప్రశ్న వస్తోంది. మరి ఆమె ప్రచారాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో. View this post on Instagram A post shared by License India (@license.india) -
తెరపై ఒక్కసారి కనిపించకున్నా...లేడీ సూపర్ స్టారే...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సీతార ఘట్టమనేని(Sitara Ghattamaneni) పేరు ఇప్పుడు ప్రకటనల ప్రపంచంలో మార్మోగుతోంది. అయితే ఓ అగ్రనటుడి కుమార్తెగానో లేక బాల నటిగానో కాదు కానీ, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన యాడ్ ఫేస్గా ఆమె సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసడర్గా, యాడ్ మోడల్గా ఆమె చూపిస్తున్న టాలెంట్కు సినీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఆమె వయస్సు కేవలం 11 ఏళ్లు మాత్రమే అయినా, చూపే ప్రొఫెషనలిజం, కెమెరా ముందు చూపుతున్న కాన్ఫిడెన్స్ చూసి యాడ్ రూపకర్తలు ఆమెవైపు అమితంగా ఆకర్షితులవుతున్నారు.సీతార కెమెరా ముందు మొదటిసారి కనిపించింది ఓ ఫ్యామిలీ యాడ్లో. అందులో తన తల్లి నమ్రత శిరోద్కర్, తండ్రి మహేష్ బాబుతో కలిసి ఓ జ్యూవెలరీ బ్రాండ్ ప్రచారంలో కనిపించింది. ఆ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, బ్రాండ్కు పెద్దగా ప్రాచుర్యం వచ్చింది.అప్పటి నుంచి సీతారకు యాడ్స్ ఆఫర్లు వెల్లువెత్తడం ప్రారంభమైంది. అనుకోకుండా చేసిన యాడ్తో వచ్చిన పాప్యులారిటీతో ఇతర బ్రాండ్లు కూడా ఆమెను సంప్రదించాయి. ఆ తర్వాత ఆమె ‘బేబీ స్కిన్ కేర్‘, ‘ఎడ్యుకేషన్ ప్యాకేజింగ్‘, ‘ఫ్యాషన్‘ వంటి విభాగాల్లో చేసిన యాడ్స్ లక్షల సంఖ్యలో వ్యూస్ ఆదరణ సాధించాయి. పిఎంజె జ్యూయల్స్, ఒట్లో క్లోతింగ్, టాటా సంపన్న్ జూనియర్ ఫుడ్స్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, మామిఎర్త్, జీ తెలుగు ఫ్యామిలీ ప్రోమో, ట్రెండ్స్... ఇలా అనేక టాప్ బ్రాండ్స్లో ఆమె కనిపిస్తోంది. వీటిలో తన డాడీ మహేష్తో కలిసి చేసిన ట్రెండ్స్ సంస్థ యాడ్ నిజంగా ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి.యాడ్, ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, సీతార ఒక్కో యాడ్ కు రూ. 15 – 25 లక్షల వరకు పారితోషికం( Remuneration) అందుకుంటోంది. వార్షికంగా ఆమె చేసే ప్రచారాల ద్వారా రూ. 2.5 కోట్ల పైగా ఆదాయం వస్తోందని యాడ్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ ఆదాయం ప్రత్యేకంగా ఆమె పేరిట ఓ ట్రస్ట్ ఖాతాలో వేస్తున్నామని, ఈ మొత్తం భవిష్యత్తులో ఆమె విద్య, క్రియేటివ్ అభిరుచుల విస్త్రుతికి ఉపయోగించనున్నట్లు సమాచారం.కెమెరా ఫ్రెండ్లీ ఫేస్ కావడంతో పాటు అమాయకత్వంతో కూడిన గ్లామర్ సితారకు ప్లస్ అవుతోంది. అలాగే తండ్రి, తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన అభినయ ప్రతిభ కూడా ఆమెకు మరో బలం. ముఖ్యంగా తల్లి నమ్రత శిరోద్కర్ గతంలో మిస్ ఇండియా గా ఉన్నందున, ఫ్యాషన్, కెమెరా నైపుణ్యాల్లో తల్లి గైడెన్స్ ఆమెకు బాగా ఉపయోగపడుతోంది.ఇంతింతై..సితార స్టారై...ఇప్పటికే సితార పేరుతో ఇంటర్నెట్లో ప్రత్యేక ఫ్యాన్ పేజీలు ఉన్నాయి. ఆమె ఏ వీడియో వదిలినా మిలియన్ల వ్యూస్ వస్తాయి. ప్రస్తుతం తను పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది, అయితే యాడ్ ఫిల్మ్స్ను పేషన్గా తీసుకుంటోందో లేక రేపటి బిగ్ స్క్రీన్ ఎంట్రీకి రిహార్సల్గా తీసుకుంటుందో గానీ... తెరపై నైపుణ్యం పెరిగే కొద్దీ, ఆమె పెద్ద తెరపై నటిగా అడుగు పెట్టే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమెను ‘చైల్డ్ లీడ్ రోల్‘లో తీసుకోవాలని కొందరు డైరెక్టర్లు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.చిన్న వయసులో పెద్ద నెపథ్యంతో తెరపైకి వచ్చినా, ఆమె చూపిస్తున్న ప్రతిభ మాత్రం పూర్తిగా ఒరిజినల్. ఇదే విధంగా తండ్రి స్టార్ పవర్, తల్లి గైడెన్స్, తన స్వంత ప్రతిభ మేళవిస్తూ సితార కొనసాగితే ఆమె చరిత్ర సృష్టించకుండా అసాధ్యం అనే చెప్పాలి. ఇప్పుడు యాడ్ ప్రపంచంలో చైల్డ్ ఐకాన్ గా ఆమె సృష్టిస్తున్న సందడి చూస్తుంటే, అప్పుడే ఏమైంది? ‘‘ఇంకా చాలా ఉంది చూడడానికి!’’ అనిపించడం మాత్రం ఖాయం. -
MIss World 2025: సిన్మా ఆఫర్లను ఛీ కొట్టిన మిస్ వరల్డ్
పైకి ఎన్ని మాటలు చెప్పినా అందాల రాణులుగా రాణించాలనుకునే వారి అంతిమ లక్ష్యం సినిమాల్లో రాణించడమే అవుతుందనేది నిజం. అందుకు నిదర్శనాలెన్నో మనకు తెలుసు. అయితే అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్నప్పటికీ, తద్వారా వచ్చే అనేక రకాల ఆఫర్లను వాటి ద్వారా వచ్చే డబ్బు పేరు ప్రఖ్యాతుల్ని మాత్రం వద్దనుకున్న ఏకైక బ్యూటీ క్వీన్ రీటా ఫారియా(Reita Faria). మన భారతదేశపు తొలి మిస్ వరల్డ్. అప్పట్లోనే స్విమ్ సూట్ ధరించడమే కాకుండా బెస్ట్ ఇన్ స్విమ్ సూట్ అనే టైటిల్ని కూడా దక్కించుకున్న రీటా..అందాల ప్రదర్శన అంటే సినిమా అవకాశాల కోసమేననే అపోహలను 6 దశాబ్ధాల క్రితమే పటాపంచలు చేశారు. అందాల పోటీలను అత్యంత ప్రొఫెషనల్గా తీసుకున్న ఏకైక రోల్మోడల్గా నిలిచారు. ఆమె కధలోకి వెళితే... రీటా ఫారియా పావెల్ 1943 ఆగస్టు 23న ముంబైలోని మాతుంగా ప్రాంతంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు గోవా కాథలిక్కులు, తండ్రి జాన్ టివిమ్ అనే గ్రామానికి, తల్లి ఆంటోయినెట్ గోవాలోని శాంటా క్రజ్కు చెందినవారు,పెద్ద కుమార్తె ఫిలోమెనా తర్వాత ఫరియా వీరికి రెండవ కుమార్తె. ఆమెది మధ్యతరగతి కుటుంబం, తండ్రి మినరల్ వాటర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు తల్లి బ్యూటీ సెలూన్ నడిపేవారు. యుక్తవయసులోనే 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు వల్ల ఫరియా ఒక సగటు భారతీయ అమ్మాయిలా కాక అసాధారణంగా అనిపించేవారు. దాంతో ఆమె ’మమ్మీ లాంగ్ లెగ్స్ ’ అంటూ సహ విద్యార్థుల ఎగతాళికి గురయ్యారు. అయితే ఫారియా తన పొడవైన స్లిమ్ ఫిజిక్ని క్రీడలలో సత్తా చాటడం కోసం ఉపయోగించుకుని ’త్రోబాల్, నెట్బాల్ బ్యాడ్మింటన్ ఇలా పలు క్రీడల్లో రాణించారు. హాకీలో హ్యాట్రిక్ సాధించి తొలిసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత ఆమె మిస్ బాంబే పోటీలో పాల్గొని గెలుచుకున్నారు. అదే ఊపులో ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా పోటీని గెలుచుకుని తద్వారా మిస్ వరల్డ్ 1966 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి అర్హత సాధించారు. మిస్ వరల్డ్ పోటీల్లో, ’బెస్ట్ ఇన్ స్విమ్సూట్’ వ’బెస్ట్ ఇన్ ఈవినింగ్వేర్’ అనే ఉప–టైటిళ్లను గెలుచుకుని, ఫైనల్స్లో ఇతర దేశాల నుంచి∙పోటీ పడుతున్న 51 మంది ప్రతినిధులను ఓడించి మిస్ వరల్డ్ కిరీటాన్ని కూడా స్వంతం చేసుకున్నారు.తొలి ఇండియన్ మిస్ వరల్డ్గా నిలిచిన ఆమెను అనేక రకాల ఆఫర్లు చుట్టుముట్టాయి. ముఖ్యంగా సినిమాల్లో నటింపజేయడానికి లాభదాయకమైన ఆఫర్లు విసిరారు. ఆకర్షణీయమైన ఆదాయం అంతకు మించి మరింత గొప్ప కెరీర్ కనిపిస్తున్నప్పటికీ, మోడలింగ్, నటన కాంట్రాక్టులను ఆమె నిస్సంకోచంగా తిరస్కరించారు. బదులుగా వైద్య విద్యపై దృష్టి పెట్టి గ్రాంట్ మెడికల్ కాలేజ్లో చేరి ఎం.బి.బి.ఎస్. డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత లండన్ లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో చదువుకున్నారు. అదే సమయంలో గురుతుల్యులైన డేవిడ్ పావెల్ను 1971లో వివాహం చేసుకుని 1973లో ఐర్లాండ్లోని డబ్లిన్ కు మకాం మార్చారు, అక్కడ వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఫారియా తన భర్త, ఎండోక్రినాలజిస్ట్ డేవిడ్ పావెల్తో కలిసి ఐర్లాండ్లోని డబ్లిన్ లో నివసిస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. ఆ తర్వాత కూడా మన దేశంతో సహా పలు చోట్ల అందాల పోటీల్లో జడ్జిగా అతిధిగా పాల్లొన్న రీటా ఫరియా... ఎందరో అందగత్తెలకు మార్కులు వేశారు. అయితే అందాల పోటీలో గెలుపు అంటే అందలాలు ఎక్కడానికి పిలుపు కాదని నిరూపించిన రీటా మార్క్ మాత్రం చెరిగిపోనిదే... ఎప్పటికీ... -
మిస్ వరల్డ్ కధలు: సిఎంతో సారీ చెప్పించుకున్న హైదరాబాద్ బ్యూటీ...
ఐశ్వర్యారాయ్ తర్వాత ప్రపంచ సుందరి కిరీటాన్ని 3వసారి దేశానికి అందించిన ఘనత డయానా హేడెన్(Diana Hayden) దక్కించుకుంది. 1997 మిస్ వరల్డ్ పోటీ విజేత మెయిన్ టైటిల్తో పాటు మూడు సబ్–టైటిళ్లను కూడా గెలుచుకుని అలా గెలిచిన ఏకైక మిస్ వరల్డ్గా నిలిచింది. జన్మతః హైదరాబాద్ నగరంలోని ఆంగ్లో–ఇండియన్ కుటుంబంలో జన్మించిన డయానా హేడెన్... సికింద్రాబాద్లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో తన పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసింది ఆమె పాఠశాల విద్యార్ధినిగా ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు దాంతో ఆమె 13 సంవత్సరాల వయస్సులోనే తన భృతి కోసం పనిచేయడం ప్రారంభించాల్సి వచ్చింది.మిస్ వరల్డ్గా గెలిచిన ఏడాది తర్వాత, హేడెన్ లండన్ కు వెళ్లి రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ లో నటనను అభ్యసించింది. అక్కడ ఆమె షేక్స్పియర్ రచనలపై దృష్టి సారించి ఉత్తమ నటి నామినేషన్ పొందింది. ఆమె దక్షిణాఫ్రికాలో షేక్స్పియర్ ఒథెల్లో చలనచిత్రంతో 2001 లో, తెరపైకి అడుగుపెట్టింది. ఇండియన్ టీవీ షో బిగ్ బాస్ రెండవ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పొంది 13 వ వారంలో ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయింది. మిస్ వరల్డ్ గెలిచినప్పటికీ సినిమా టీవీ రంగాల్లో ఆమె పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. తెహ్ జీబ్, అబ్ బస్, లోన్ ఎ లవింగ్ డాల్...తదితర చిత్రాల్లో నటించినా ఆమె కేవలం ఒక సాదా సీదా నటిగానే మిగిలిపోయింది.ఐశ్వర్యారాయ్, సుష్మితాసేన్ల తరహాలో కాకుండా బ్రౌన్ స్కిన్తో కొంత విలక్షణమైన అందంతో టైటిల్ గెల్చుకున్న డయానా హేడెన్ తన రూపం పట్ల కొందరు చేసిన పరుషమైన కామెంట్స్కు గురి కావాల్సి వచ్చింది. అలాంటివాటిలో ముఖ్యంగా ఆనాటి త్రిపుర సిఎం విప్లవ్కుమార్ దేవ్ ఆమె రూపాన్ని హేళన చేయడం ప్రస్తావనార్హం. అసలు మిస్ వరల్డ్ టైటిల్ గెలిచే సత్తా ఉన్న అందం ఆమెకు లేనేలేదని, ఐశ్వర్య గెలిచిందంటే ఓ అర్ధం ఉందని అంటూ ఆయన ఆమె రూపాన్ని ఎద్దేవా చేయడం సంచలనం సృష్టించింది. మనకు లక్ష్మి, సరస్వతి వంటి అందమైన దేవతలు ఉన్నారని డయానా లు కాదని అంటూ ఆయన తీవ్రమైన వ్యంగ్యోక్తులతో ఆమెను కించపరిచారు. ఈ మాటలు తీవ్ర వివాదంగా మారడంతో ఆయన డయానాను క్షమాపణలు కోరారు. -
విశాల్ పెళ్లి ఇంత ఆలస్యం కావడానికి కారణం ఎవరు..?
ప్రస్తుతం తమిళ నటుడు విశాల్ వయసు 50కి చేరువవుతోంది. నిజానికి అన్ని విధాలుగా బాగున్న ఓ వ్యక్తి అంత కాలం పాటు వివాహం కోసం ఆగడం అసాధారణమేననాలి. అందునా విశాల్... ఏ వయసుకా ముచ్చటను అచ్చంగా ఫాలో అయే అచ్చ తెలుగు సంప్రదాయ కుటుంబానికి చెందిన వాడు అనేది కూడా తెలిసిందే. పోనీ సినీనటుడిగా పరిగణనలోకి తీసుకున్నా, 40ఏళ్లకు కాస్త అటూ ఇటూగా పెళ్లి చేసుకోవడం రివాజు. మరోవైపు విశాల్, ధన్షికల మధ్య ప్రేమ ప్రయాణం కూడా ఈ నాటిది కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో... విశాల్ తన పెళ్లిని ఎందుకు ఇన్నేళ్ల పాటు వాయిదా వేశాడు?అయితే విశాల్ పెళ్లి ఆలస్యం కావడానికి ఆయన తీసుకున్న నిర్ణయమే కారణం. అది వ్యక్తిగత సమస్యల వల్ల కాదు, ఎవరిపైనా ప్రేమ లేకపోవడం వల్ల కూడా కాదు. అది ఒక భవన నిర్మాణంతో ముడిపడింది. ఆయన చేసుకున్న ప్రతిజ్ఞ తో ముడిపడింది. నడిగర్ సంఘం (దక్షిణ భారత కళాకారుల సంఘం)కు తమ భవన నిర్మాణం ఓ కల. ఎందరో కళాకారులకు, సాంకేతిక నిపుణులకు నిలయమైన తమిళనాట అందరికీ ఉపయుక్తమైన ఒక భవనం లేకపోవడం అనే లోటు తీరేందుకు ఓ విశాలమైన వసతి కావాలని ఎందరో కోరుకున్నారు. చాలా సార్లు ఆ భవన నిర్మాణం ప్రతిపాదనలు వచ్చినా రకరకాల కారణాల వల్ల పట్టాలెక్కలేదు.ఈ నేపధ్యంలోనే కొత్త నడిగర్ సంఘంకు ప్రధాన కార్యదర్శిగా విశాల్ ఎంపికయ్యాడు. అంతేకాదు భవనం పూర్తయ్యే వరకు తాను విశ్రమించబోనని ఆయన హామీ ఇచ్చాడు.నడిగర్ సంఘం భవన నిర్మాణ ప్రాజెక్టు తమిళ చిత్ర పరిశ్రమలో సినీ కార్యక్రమాలు కళాకారుల సమావేశాలకు ప్రత్యేక స్థలo లేకపోవడంతో ఈ భవనం నిర్మాణం చాలా ముఖ్యమైనదిగా మారింది. ఎట్టకేలకు కళాకారులకు ఉపయుక్తంగా ఉండే ఆధునిక సౌకర్యాలతో కూడిన ఒక అత్యుత్తమ భవన నిర్మాణానికి 2017లో శ్రీకారం చుట్టుకుంది. పరిశ్రమ దిగ్గజాలు రజనీకాంత్ కమల్ హాసన్ దీనికి పునాదిరాళ్లు వేశారు. విజయ్ కమల్ హాసన్ లు తమ వ్యక్తిగత నిధుల నుంచి రూ.1 కోటి చొప్పున విరాళంగా ఇచ్చారు, అలాగే మరో హీరో, నటుడు కార్తీ నిర్మాణాన్ని పర్యవేక్షించడంలో చురుకుగా పాల్గొన్నాడు, ఇలా ఎందరో ప్రముఖుల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ... ఈ భవనం పదేపదే నిర్మాణ జాప్యాలను ఎదుర్కొంది. వ్యక్తిగతంగా భావోద్వేగాలను సైతం హీరో విశాల్ ఈ ప్రాజెక్ట్లో పెట్టుబడిగా పెట్టాడని చెప్పొచ్చు. ఈ భవనం సాకారమయే వరకు తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టాలని కూడా అతను నిర్ణయించుకున్నాడు. అప్పుడే ఆయన తమందరి కల నెరవేరేదాకా పెళ్లి చేసుకోనని శపధం చేశాడు. ఏమైతేనేం.. చెన్నై నడిబొడ్డున టి. నగర్, హబీబుల్లా రోడ్లో ఈ భవనాన్ని చలనచిత్ర పరిశ్రమ వివిధ రకాల అవసరాలను తీర్చగల బహుళార్ధక సాధక సినీ కేంద్రంగా భవనం రూపుదిద్దుకుంది. ఇందులో అవార్డు ఫంక్షన్ల కోసం 1000 సీట్ల ఆడిటోరియం, 800 సీట్ల వివాహ మందిరం, 300 సీట్ల చిన్న చిన్న సమావేశ మందిరాలు డిజైన్ చేశారు. భవనం దాదాపుగా సిద్ధమై ప్రతిజ్ఞ నెరవేరడంతో, విశాల్ పెళ్లికి సిద్ధమ్యాడు. నటి సాయి ధన్షికతో తన వివాహాన్ని ప్రకటించాడు, ఇది అన్ని రకాల ఊహాగానాలకు ముగింపు పలికింది. అయితే ఈ ప్రకటన వారి సన్నిహితులెవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే.. వారిద్దరూ 15 సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసనీ, బలమైన స్నేహ బంధాన్ని ప్రేమ గా మార్చుకున్నారని కూడా తెలుసు. ముఖ్యంగా తన జీవితంలోని కష్ట సమయాల్లో విశాల్ చూపిన అచంచలమైన మద్దతు తోడ్పాటును ధన్షిక చాలా కాలంగా ఆరాధించింది. పెళ్లి ప్రకటన సందర్భంగా విశాల్ తమ ఇద్దరి ప్రయాణం గురించి మాట్లాడాడు. తాను చేసిన ప్రతిజ్ఞను ప్రస్తావిస్తూ వివాహం గురించిప ఆలోచనను నడిగర్ సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలనే ఆలోచన ఆపిందని ఆయన అంగీకరించాడు తనను నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తిగా ధన్షికను అభివర్ణించాడు ఇంత కాలం వేచి ఉన్నందుకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు. -
దశాబ్ధాల బంధానికి బిగ్బి కటీఫ్..కౌన్ బనేగా కెబీసీ పతి?
కౌన్ బనేగా కరోర్ పతి(Kaun Banega Crorepati ) అంటే అమితాబ్, అమితాబ్ అంటే కెబిసి అన్నంతగా పెనవేసుకుపోయిన బంధం తెగిపోనుందా? దేశంలో మరెన్నో టీవీ షోలకు ఊపిరిపోసిన ఆ టెలివిజన్ షో సమర్పకుడికి స్థాన చలనం తప్పదా? భారతీయ టెలివిజన్ రంగంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్న వార్త ఇది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఐకానిక్ క్విజ్ షోకు సారధ్యం వహించిన లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇక ఆ బాధ్యతకు గుడ్ బై చెప్పనున్నారు. రెండున్నర దశాబ్ధాల క్రితం అంటే 2000లో ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క మూడవ సీజన్ మినహా అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఫేస్ ఆఫ్ కెబిసీగా ఉన్నారు. ఒక్క 3వ సీజన్ను మాత్రం షారుఖ్ ఖాన్ హోస్ట్ చేశారు. ఆ ఒక్క సీజన్ తప్ప మరెప్పుడూ ఆ షోకి దూరం కాని, ఈ 81 ఏళ్ల బాలీవుడ్ స్టార్...వ్యక్తిగత కారణాల వల్ల షో నుంచి నిష్క్రమిస్తున్నారని ఇటీవలి నివేదికలు ధృవీకరిస్తున్నాయి. ఇది అభిమానులను ఆశ్చర్యపరిచేది మాత్రమే కాదు ఎన్నో జ్ఞాపకాలను మేల్కొలిపే వార్త కూడా. ఈ విజయవంతమైన షోని అందిస్తున్న సోనీ టీవీ ఇంకా ఈ మార్పును ధృవీకరించనప్పటికీ త్వరలో ప్రారంభం కానున్న సీజన్ 17 కోసం బిగ్ బి స్థానంలో కొత్త హోస్ట్ రావచ్చనే సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. దీంతో తదుపరి షో ప్రెజెంటర్ ఎవరు అనేదానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ షో పట్ల ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ.. అత్యంత ప్రభావం చూపిన బిగ్ బీ ఛెయిర్లో కూర్చోవడానికి బాలీవుడ్ ప్రముఖులు ఎవరూ అంతగా ముందుకు రావడం లేదని సమాచారం. ఈ నేపధ్యంలో బాలీవుడ్ హంగామా నుంచి అందుతున్న ఒక నివేదిక ప్రకారం, బాలీవుడ్ ’భైజాన్’ – సల్మాన్ ఖాన్(Salman Khan) తో షోరన్నర్లు ముందస్తు చర్చలు జరుపుతున్నారంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, బిగ్ బాస్ షో ద్వారా చిన్న తెరపై బిగ్ బీ తర్వాత ఆ స్థాయిలో పేరుగాంచిన సల్లూ భాయ్ భారతదేశపు అత్యంత విజయవంతమైన పురాతన షో... కేబీసీకి కొత్త హోస్ట్గా రానున్నాడు. ఈ వార్తల నేపధ్యంలో ‘‘ సల్మాన్ ఖాన్ కు ఉన్న విస్త్రుత ప్రజాదరణ, ఆయనను బిగ్ బికి సరైన వారసుడిగా మార్చగలదని టీవీ పరిశ్రమలోని వ్యక్తులు భావిస్తున్నారు., ‘సల్మాన్ చిన్న తెరకు ఇప్పటికే చిరపరిచితమైన స్టార్. పైగా ఆయన మారుమూల కేంద్రాలలోని ప్రేక్షకులతో సైతం బలమైన అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. ప్రతిదీ సరిగ్గా జరిగితే, అతను ఈ షోను తుఫానుగా తీసుకెళ్లగలడు‘ అని ఒక బాలీవుడ్ మీడియా పేర్కొంది.సల్మాన్ ఖాన్ నిజంగా అమితాబ్ బచ్చన్ స్థానంలోకి వస్తే, అభిమానులు ఆయనను నిశితంగా గమనిస్తారు. బిగ్ బి అత్యున్నత స్థాయి ప్రజెంటేషన్తో పోలికలు తప్పవు. అయితే సల్మాన్ ఖాన్ కు వీక్షకుల్లో ఉన్న ఆకర్షణ మాస్ అప్పీల్ కొత్త తరం ప్రేక్షకులను ఆకర్షించవచ్చు. ఏదేమైనా కేబీసీ సీజన్ 17 వచ్చే ఆగస్టులో ప్రారంభమయే అవకాశం ఉంది, ఈ నేపధ్యంలో ప్రస్తుతానికి, అధికారిక ప్రకటన కోసం అందరి దృష్టి సోనీ టీవీపైనే ఉంది. -
మన దేశానికి వచ్చేస్తున్న యూనివర్సల్ స్టూడియోస్, ఆ ప్రాంతం ఇక సరికొత్త సినిమా క్యాపిటల్, ఎక్కడంటే?
హాలీవుడ్ సినిమాలతో బాగా అనుబంధం ఉన్నవారికి యూనివర్సల్ స్టూడియోస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ఎన్నో హాలీవుడ్ సినిమాలు రూపుదిద్దుకున్నది యూనివర్సల్ స్టూడియోలోనే. ప్రపంచ సినీరంగానికి యూనివర్సల్ స్టూడియో అనేది ఒక డ్రీమ్ మేకింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయంగా పేరు తెచ్చుకోవాలనుకున్న ప్రతీ టెక్నీషియన్ కల యూనివర్సల్ స్టూడియో. ఈ నేపధ్యంలో భారతీయ సినిమా రంగానికి సినీ అభిమానులకు చెప్పుకోదగ్గ శుభవార్త ఏమిటంటే, మన దగ్గర త్వరలో యూనివర్సల్ స్టూడియోస్ థీమ్ పార్క్ ఏర్పాటు కానుంది. అవును...నిజం...భారతదేశం త్వరలో యూనివర్సల్ స్టూడియోస్ థీమ్ పార్క్ను స్వాగతించబోతోంది. ఈ ప్రపంచ వినోద దిగ్గజం త్వరలో ప్రపంచ స్థాయి థీమ్పార్క్తో సహా భారతదేశంలోకి అడుగుపెట్టనుంది. త్వరలోనే సినీ రూపకర్తల కల సాకారం కానుంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో యూనివర్సల్ స్టూడియోస్ పార్క్ ఉన్న కొన్ని దేశాలలో ఒకటిగా అవతరించనుంది. ప్రస్తుతం ఈ థీమ్ పార్క్ యునైటెడ్ స్టేట్స్, జపాన్, సింగపూర్, చైనా దేశాల్లో మాత్రమే ఉంది.అందుతున్న సమాచారం ప్రకారం, భారతదేశంలో యూనివర్సల్ స్టూడియోస్ థీమ్ పార్క్ త్వరలో హర్యానాలోని ద్వారక ఎక్స్ప్రెస్వే సమీపంలో ఢిల్లీ నుంచి కొంచెం దూరంలో నెలకొల్పనున్నారు. ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం, ఈ పార్క్ గురుగ్రామ్ రూపురేఖల్ని మార్చేయనున్న ప్రాజెక్ట్ కానుంది. హర్యానా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (హెచ్ఎస్ ఐఐడిసి) ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది. వాస్తవానికి, ఇప్పటికే సైట్ చుట్టూ మౌలిక సదుపాయాల ప్రణాళికల అమలు కూడా ప్రారంభించింది. ఇది రాబోయే 3 మిలియన్ చదరపు అడుగుల మాల్ లోపల అభివృద్ధి చేయబడిన ఇండోర్ థీమ్ పార్క్ అవుతుంది. మీడియా నివేదికల ప్రకారం, వినోద ఉద్యానవనాన్ని నిర్మించడానికి భారతి ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ఇక్కడ 300,000 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంటుందని తెలుస్తోంది. భారతదేశంలో ప్రారంభమవుతున్న ఈ అత్యంత భారీ పార్క్లో ఒసాకా హాలీవుడ్లో ఉన్నట్లుగా థీమ్ , రైడ్లు, షోలు కుటుంబ సమేతంగా సందర్శించదగ్గ ఆకర్షణలు ఉంటాయి. మన దేశానికి యూనివర్సల్ స్టూడియోస్ రాక ఉపాధి రంగానికి కూడా ఊతమిచ్చే శుభవార్త అనే చెప్పాలి. ఈ పార్క్ అనేక రకాల ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. దీని చుట్టుపక్కల ప్రాంతంలో హోటళ్ళు, రవాణా సేవలు షాపింగ్ కేంద్రాలు తదితర వాణిజ్య కార్యకలాపాలు ముమ్మరం అవుతాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం సరికొత్త సినిమా క్యాపిటల్గా అవతరించినా ఆశ్చర్యం లేదు. గురుగ్రామ్లోని ఈ స్థలం అటు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ మెట్రో మార్గాలు ఇటు మరి కొన్ని ప్రధాన రహదారులకు సులభమైన కనెక్టివిటీని అందిస్తుంది. నిజానికి యూనివర్సల్ స్టూడియోస్ భారతదేశంలో తన తొలి అడుగు వేసేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఇదీ ఒక కారణమే. -
భర్తతో ఆ హీరోయిన్ రొమాన్స్ చూసి ఏడ్చేసింది.. హీరో నిర్ణయంతో షాక్!
హీరో హీరోయిన్లు ఆన్స్క్రీన్ రొమాన్స్ బాగా పండిస్తే సినిమా విజయానికి అది దోహదం చేయవచ్చు. కానీ... అదే హీరో/ హీరోయిన్లకు అప్పటికే పెళ్లయి ఉంటే..ఆ పెళ్లికి అది పెనుముప్పుగా మారవచ్చు. ఇప్పుడు పెళ్లయిన నటీనటులు సినిమాల్లో రొమాన్స్ పండించడం వాటిని చూస్తూ కూడా సదరు నటీనటుల భార్య/భర్త ప్రొఫెషనల్గా మాత్రమే తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయి ఉండవచ్చు కానీ ఒకప్పుడు అది అంత సులభమైన విషయం కాదు. అదే పరిస్థితిని ఎదుర్కుంది అలనాటి ఒక సినిమా జంట.దాదాపు ఏభైఏళ్ల క్రితం అంటే, 1970ల చివరలో, బాలీవుడ్లో అత్యంత చర్చనీయాంశమైన ఆన్స్క్రీన్ జోడీగా పేరొందారు అమితాబ్ బచ్చన్ అలనాటి దక్షిణాది బ్యూటీ క్వీన్ రేఖ. వీరి గురించి గుసగుసలు కూడా పరస్పరం గుసగుసలాడాయి అన్నంతగా వార్తలు వ్యాపించాయి. వారిద్దరి మధ్యా పండిన అద్భుతమైన కెమిస్ట్రీ వెండితెరను వెలిగించింది ఆ గాఢమైన అనుబంధం వెనుక నటన మాత్రమే కాదు అంతకు మించి అని అభిమానులను కూడా నమ్మించింది. కానీ పుకార్లు తమ చుట్టూ తిరుగుతుండగా, అప్పుడూ ఎప్పుడూ అమితాబ్ మౌనంగానే ఉన్నారు. మరోవైపు, సీనియర్ నటి రేఖ మాత్రం తరచు వాస్తవాలు మాట్లాడుతూ వస్తున్నారు. తమ కథలోని అత్యంత నాటకీయ భావోద్వేగ క్షణాలలో ఒకటి 1978 బ్లాక్బస్టర్ ’ముకద్దర్ కా సికందర్’ విడుదల సమయంలో జరిగిందని రేఖ ఇటీవల చెప్పారు. .ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రేఖ మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించింది. ’ముకద్దర్ కా సికందర్’ విడుదలకు ముందుగా ఆ సినిమా ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించారని, ఆ సమయంలో ఆ స్క్రీనింగ్ చూడడం కోసం అమితాబ్ బచ్చన్ కుటుంబం వచ్చిందని ఆమె గుర్తు చేసుకుంది. వారిని తాను ప్రొజెక్షన్ రూమ్లో నుంచి గమనిస్తూ ఉండిపోయానని తెలిపింది. ‘‘’ముకద్దర్ కా సికందర్’ ట్రయల్ షో చూడటానికి వచ్చిన బచ్చన్ కుటుంబాన్ని ప్రొజెక్షన్ రూమ్లో నుంచి చూస్తూ ఉన్నా. జయ ముందు వరుసలో కూర్చుంది. అతను (అమితాబ్) అతని తల్లిదండ్రులు ఆమె వెనుక వరుసలో ఉన్నారు. వారు ఆమెను నేను చూడగలిగినంత స్పష్టంగా చూడలేకపోయారు. ఆ సమయంలో నేను గమనించాను. అమితాబ్ నాకు (రేఖ) మధ్య మా ప్రేమ సన్నివేశాలు వస్తున్న సమయంలో, ఆమె ముఖం కన్నీటితో తడిసిపోవడం నేను చూడగలిగాను. ఒక వారం తర్వాత, పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ నాకు చెప్పారు. అతను నాతో కలిసి పనిచేయబోనని తన నిర్మాతలకు స్పష్టం చేశాడని. ఈ నిర్ణయం చాలామందిని షాక్కి గురి చేసింది. ఎందుకంటే అమితాబ్ రేఖ కలిసి పరిశ్రమకు అనేక విజయాలను అందించారు వారి జంటను ప్రేక్షకులు అమితంగా ఇష్టపడ్డారు.ఏదైతేనేం.. ’ముకద్దర్ కా సికందర్’ తర్వాత, 1981లో వచ్చిన ఏకైక ’సిల్సిలా’ సినిమా వరకు వారు మళ్ళీ కలిసి కనిపించలేదు, ఈ సినిమా వారి వ్యక్తిగత జీవితాల చుట్టూ తిరుగుతున్న పుకార్లకు అద్దం పట్టింది. తన పట్ల అమితాబ్ కుటుంబం ఎప్పుడు ఎలా స్పందించినా, ఎల్లప్పుడూ జయ గురించి మాత్రం రేఖ గౌరవంగానే మాట్లాడింది, తామిద్దరి మధ్య శత్రుత్వం లేదా ద్వేషం అంటూ వచ్చిన వార్తలను కథలను తోసిపుచ్చింది. గత 1990లలో ఒక ఇంటర్వ్యూలో, రేఖ జయ గురించి తన భావాలను చాలా స్పష్టంగా చెప్పింది. ‘దీదీభాయ్ (జయ) చాలా పరిణతి చెందినది, చాలా కలుపుగోలు మనిషి. నేను ఇంతగా కలిసిపోయే మరో మహిళని చూడలేదు. ఆమె గౌరవించదగ్గ వ్యక్తి. ఆమెకు చాలా బలం ఉంది. నేను ఆమెని ఆరాధిస్తాను.‘ అంటూ చెప్పడం దీనికి నిదర్శనం. విశేషం ఏమిటంటే... 1981లో ‘సిల్సిల’ తర్వాత, అమితాబ్ రేఖ మళ్లీ కలిసి నటించలేదు. -
రామ్చరణ్ టూ ప్రభాస్..టుస్సాడ్స్లో స్టార్స్...ఎవరు గ్రేట్?
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మైనపు విగ్రహాల ప్రదర్శన కేంద్రం. ఇది లండన్, సింగపూర్, దుబాయ్, ఢిల్లీ వంటి భారీ నగరాల్లో ఉంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ నటులు, సంగీతకారులు తదితర అంతర్జాతీయ ప్రముఖుల మైనపు విగ్రహాలను ప్రదర్శిస్తారు. ఆయా సెలబ్రిటీలకు ఆయా సందర్భాల్లో ఉన్న పాప్యులారిటీని దృష్టిలో ఉంచుకుని వీటిని నెలకొల్పుతారు కాబట్టి ఈ విగ్రహాలు అత్యంత ప్రాచుర్యం సెలబ్రిటీలకు స్టేటస్ సింబల్స్గా మారాయి. ఇటీవల మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం భారతీయ సినీ ప్రముఖుల గౌరవార్థం మైనపు విగ్రహాలను ప్రదర్శించడంలో భాగంగా టాలీవుడ్ ప్రముఖులకు ప్రాధాన్యం ఇవ్వడం టాలీవుడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందిందో సూచిస్తుంది. ఇందులో పదుల సంఖ్యలోనే ఇండియన్ స్టార్స్ చోటు చేసుకున్నప్పటికీ.. విశేషం ఏమిటంటే... మన టాలీవుడ్ స్టార్స్ నలుగురి విగ్రహాలు ఒక్కోటి ఒక్కో రకమైన ప్రత్యేకతతతో చరిత్ర సృష్టించాయి.లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ లో కొలువుదీరిన తాజా మైనపు విగ్రహం టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ది. ఇటీవల లండన్ లో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో రామ్ చరణ్ అతని పెంపుడు కుక్క రైమ్ సహా మైనపు బొమ్మలుగా మారి కొలువుదీరడం విశేషం. క్వీన్ ఎలిజబెత్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో తన పెట్తో సహా కొలువుదీరిన రెండవ సెలబ్రిటీగా, సినీరంగం నుంచి మొదటి వాడిగా రామ్ చరణ్ రికార్డ్ సాధించాడు.గత మార్చి 2024లో, ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం దుబాయ్లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలా వైకుంఠపురములో చిత్రం లో కనిపించినట్టుగా ఎరుపు జాకెట్ ధరించి, మేడమ్ టుస్సాడ్స్ లో ఈ విగ్రహం కొలువుదీరింది. పుష్ప ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన బన్నీ ని కింగ్ ఆఫ్ డ్యాన్స్ అంటూ టుస్సాడ్స్ పేర్కొనడం విశేషం.గత 2019 మార్చి లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేడమ్ టుస్సాడ్స్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. మహేష్ బాబుకు ఉన్న భారీ అభిమానుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కారణంగా, ఈ విగ్రహాన్ని సింగపూర్ నుంచి హైదరాబాద్కు విమానంలో తీసుకువచ్చారు. అలా తొలిసారిగా, ఒక భారతీయ నటుడి విగ్రహాన్ని స్వదేశానికి తీసుకువచ్చిన ఘనతను మహేష్ దక్కించుకున్నాడు. ఇక ఇలాంటి అంతర్జాతీయ పాప్యులారిటీకి కొబ్బరికాయ కొట్టిన హీరో ప్రభాస్... మేడమ్ టుస్సాడ్స్లో చోటు సంపాదించిన మొట్టమొదటి దక్షిణ భారత నటుడుగా కూడా ఘనత దక్కించుకున్నాడు. గత 2017మార్చి లో బ్యాంకాక్లోని మేడమ్ టుస్సాడ్స్లో కొలువుదీరిన బాహుబలి తన నటన ద్వారా, బ్లాక్బస్టర్ విజయాల ద్వారా జపాన్, చైనా, మలేషియా, సింగపూర్ అమెరికా వంటి దేశాలలోనూ ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు. -
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
సినిమా రంగంలో నటీ నటుల మధ్య అనుబంధాలు ఎంత సహజమో...బ్రేకప్స్ కూడా అంతే సాధారణం. అలాగే అలాంటి అనుబంధాలను గురించిన పుకార్లు షికార్లు చేయడం అంతకు మించి సర్వసాధారణం. అందుకు తమిళ స్టార్ హీరో, యాక్షన్ సినిమాలకు పేరొందిన విశాల్ కూడా అతీతుడేమీ కాదు. అయితే చాలా సార్లు అలాంటి రూమర్లు నిజమవుతుంటాయి కూడా. తాజాగా సాయి ధన్షికను పెళ్లి చేసుకోనున్నట్టు విశాల్ ప్రకటించడం తెలిసిందే. వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తున్న వార్తలు నిజమేనని వీరిద్దరూ తమ పెళ్లి ప్రకటనతో ధృవీకరించినట్టయింది.(చదవండి: ఆ నటుడి వల్ల కన్నీటి పర్యంతం.. అండగా విశాల్, అదే సాయి ధన్సిక ప్రేమకు కారణం)పెళ్లితో ఒక ఇంటి వాడు కాబోతున్న సందర్భంగా ఇక విశాల్ మీద ఇలాంటి అఫైర్ల వార్తలు పెద్దగా రాకపోవచ్చునని అనుకోవచ్చు. ఈ సందర్భంగా గతంలో హీరో విశాల్ కు మరికొందరు సహ నటీమణులతో అఫైర్స్ ఉన్నట్టు వచ్చిన వార్తలు ఒకసారి ప్రస్తావించుకుంటే.... అలాంటి వార్తల్లో తమిళ, తెలుగు అని లేకుండా దక్షిణాది సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్గా మారిన వరలక్ష్మి శరత్ కుమార్ తో విశాల్ డేటింగ్ వార్త కూడా ఒకటి. వీరిద్దరి మధ్య సంబంధం గురించి కొంత కాలం పాటు పుకార్లు షికారు చేశాయి. అయితే వీటిని కొన్నాళ్లు కొనసాగనిచ్చాక... తాము ఇద్దరూ ప్రేమికులం కామని వీరిద్దరూ స్పష్టంగా ఖండించారు తాము సన్నిహిత స్నేహితులమని స్పష్టం చేశారు. అప్పటికీ అవి ఆగకపోవడంతో... విశాల్ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని అతను పెళ్లి చేసుకుంటానంటే.. తగిన వధువును తానే కనుగొని సూచిస్తానని అతనిపెళ్లి విషయంలో తాను సంతోషంగా సహకరిస్తానని అంటూ వరలక్ష్మి బహిరంగంగా పేర్కొంది. విశాల్ కూడా ఈ పుకార్లను ఖండించాడు. తాము చిన్ననాటి స్నేహితులమని తన పెళ్లి విషయంపై నిర్ణయం జరిగినప్పుడు తనే తన వివాహాన్ని ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశాడు. ఆ తర్వాత వరలక్ష్మి శరత్కుమార్ వ్యాపారవేత్త నికోలాయ్ సచ్దేవ్ను వివాహం చేసుకుంది. అదే విధంగా విశాల్ పేరుతో ముడిపడిన మరో నటి అభినయ.. అభినయ నటుడు విశాల్ మధ్య ప్రేమ సంబంధం గురించి పుకార్లు కొనసాగుతున్నంత కాలం అభినయ వాటిని నిరంతరం ఖండిస్తూ వచ్చింది, విశాల్ కేవలం తనకు ఒక నమ్మకమైన స్నేహితుడు మాత్రమే అని ఆమె పేర్కొంది. నటుడు విశాల్తో ప్రేమ సంబంధం గురించి పుకార్లను తోసిపుచ్చే క్రమంలో తన చిన్ననాటి స్నేహితుడితో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా ఆమె వెల్లడించింది. చివరకు అభినయ గత ఏప్రిల్ 16న హైదరాబాద్లో అందరి ఆశీస్సులతో అతన్ని వివాహం చేసుకుంది. 2018లో విడుదలైన తమిళ చిత్రం ఇరుంబు తిరల్ లో కలిసి నటించిన అభిరామి తో కూడా విశాల్కు సంబంధం ఉన్నట్టు కొన్ని పుకార్లు వచ్చినప్పటికీ... అవి ఎక్కువ కాలం కొనసాగకపోవడంతో ఖండించాల్సిన అవసరం కూడా వీరికి రాలేదు. హీరో విశాల్తో సంబంధాలు అంటకట్టబడిన వారందరూ ఇప్పటికే పెళ్లి చేసుకుని హాయిగా సంసారాలు చేసుకుంటూ ఉండగా, ఎట్టకేలకు తన చివరి అఫైర్..వార్తల్ని మాత్రం నిజం చేస్తూ విశాల్ త్వరలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు. -
ఆ నటుడి వల్ల కన్నీటిపర్యంతమైన సాయిధన్సిక,అండగా నిలిచిన విశాల్
తమిళ యాక్షన్ స్టార్ విశాల్( Vishal,), యువ నటి సాయి ధన్షిక(Sai Dhanshika)లు తమ పెళ్లి ప్రకటన విడుదల చేశారు. కాబట్టి ఇక వారి గురించి రూమర్స్ మాట్లాడుకోవడానికి ఏమీ లేవు. కానీ..పుష్కరకాలం దాటిన ఈ జంట స్నేహం, ప్రేమగా విడదీయరాని బంధంగా మార్చిన సందర్భాలేమిటి? అంటే ఓ సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. దీని గురించి వివరాలు తెలియాలంటే.. దాదాపు ఎనిమిదేళ్లు వెనక్కి వెళ్లాలి.నటుడు–దర్శకుడు టి రాజేందర్ (టిఆర్ అని కూడా పిలుస్తారు) తమిళనాట సీనియర్ సినీ ప్రముఖుడిగా ప్రసిద్ధి చెందారు. ప్రేమసాగరం వంటి చిత్రాల ద్వారా మనకూ గుర్తోస్తారు. వయసు, అనుభవం ఎంత ఉంటే ఏం లాభం? పరిణితి లేనప్పుడు అన్నట్టుగా ఆయన గతంలో నటి సాయి దన్షిక విషయంలో ప్రవర్తించిన తీరు పూర్తిగా ఆక్షేపణకు గురైంది.తమిళనటులు కృష్ణ, విధర్త్ ప్రధాన పాత్రల్లో నటించిన సాయి ధన్షిక కీలక పాత్ర పోషించిన విజితిరు తమిళ చిత్రం 2017లో థియేటర్లలో వచ్చింది. ఈ చిత్రంలో టి రాజేందర్ అతిధి పాత్రలో నటించారు. విడుదలకు ముందు చిత్ర యూనిట్ ప్రెస్మీట్ ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో మాట్లాడిన సాయి ధన్సిక తన ప్రసంగంలో వేదికపై ఉన్న ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పింది. అయితే నటి సాయి ధన్షిక తన పేరు మర్చిపోవడం టి.రాజేందర్ను తీవ్ర ఆగ్రహావేశాలకు అసహనానికి గురి చేసింది. దాంతో ఆమెను అదే వేదికపైనే చెడామెడా తిట్టిపోశాడు. ఆమె అప్పట్లో రజనీకాంత్ సినిమాలో (కబాలి) నటిస్తోంది కాబట్టి పొగరు పట్టిందంటూ తీవ్రంగా దుర్భాషలాడాడు. అయితే ధన్షిక తాను టి రాజేందర్ను గౌరవిస్తానని పొరపాటున పేరు మర్చిపోయానని అందుకు క్షమించాలని కోరడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయితే, టిఆర్ మాత్రం ఆగలేదు. తన తిట్ల పరంపరను కొనసాగించాడు పైగా సారీ అంటూ ధన్సిక చెప్పడాన్ని కూడా హేళన చేస్తూ ఆమె శారీ కట్టుకోలేదు కానీ సారీ చెబుతోంది అంటూ వివక్షాపూరిత వ్యాఖ్యలు చేశాడు. విషాదం ఏమిటంటే ఈ మాటలకు ఆమె సహనటులు సహా వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టడం..అవమానాన్ని తట్టుకోవడానికి ప్రయత్నించిన సాయి ధన్సిక, దీంతో తీవ్రంగా చలించిపోయింది. కన్నీటి పర్యంతమైపోతూ దానిని దాచడానికి విఫలయత్నం చేసింది. ఈ ప్రెస్ మీట్ ట్విట్టర్లో వైరల్ అయింది.ఈ కార్యక్రమంలో టి రాజేందర్ విచక్షణా రహిత ప్రవర్తన విషయంలో ధన్షికకు తన సహనటుల నుంచి ఎటువంటి మద్దతు లభించకపోవడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. వేదికపై టిఆర్ ప్రవర్తనను ఖండించకుండా ఆస్వాదించిన మిగిలిన నటులు దర్శకుడు వెంకట్ ప్రభులపై కూడా నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు.ఇది తెలుసుకున్న తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టిఎఫ్పిసి) అధ్యక్షుడు విశాల్ టి రాజేందర్ ప్రవర్తనను స్పష్టంగా ఖండించాడు ‘ధన్షిక క్షమాపణలు చెప్పినా, మిస్టర్ టిఆర్ ఆమెను లక్ష్యంగా చేసుకోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను‘ అని విశాల్ అన్నాడు. అప్పటికే క్లోజ్ ఫ్రెండ్స్గా కొనసాగుతున్న సాయి ధన్షిక, విశాల్లను ఆ సంఘటన మరింత దగ్గర చేసిందని, వారి బంధం మరింత బలపడిందని అంటారు. -
బాలయ్యా, నీ హీరోయిన్ మద్యం ప్రచారంపై ఏమందో విన్నావా?
ఆయన ఓ ప్రముఖ సినీనటుడు,అంతేకాదు ఓ సీనియర్ రాజకీయ నాయకుడు.. అంతవరకు అయినా పర్లేదేమో కానీ నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ పురస్కార గ్రహీత కూడా. అలాంటి నేపథ్యం వున్న బాలకృష్ణ(Nandamuri Balakrishna ) మాన్షన్ హౌస్ మద్యం ద్వారా పేరొందిన బ్రాండ్ కు సంబంధించిన ప్రకటనలో నటించడం వివాదాస్పదంగా మారింది. ఇటీవలే భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న బాలకృష్ణ, అలాంటి గౌరవనీయమైన పురస్కారం పొందిన తర్వాత మద్యం ప్రకటనలో పాల్గొనడం అనుచితమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు బాలకృష్ణను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. “పద్మ భూషణ్ పొందిన వ్యక్తి ఇలాంటి వాణిజ్య ప్రకటనలు చేయడం ఎలా అనుమతిస్తారు? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారుఇదిలా ఉండగా, బాలకృష్ణ నుంచి దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఈ వివాదం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక ప్రజా ప్రతినిధిగా ఇలాంటి ప్రకటనల్లో నటించడం బాధ్యత లేనితనమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాలకృష్ణ మద్యం యాడ్ వివాదం సామాజిక మాధ్యమాల్లో చర్చలకు గతం లో ని కొన్ని విషయాల ప్రస్తావనకు దారి తీసిందిబాలకృష్ణ ఆ మద్యం బ్రాండ్ పై తన అభిమానాన్ని పదే పదే చాటు కోవడం పై అనేక రకాల విమర్శలు వచ్చాయి, అవేవీ పట్టించుకోకుండా ఇప్పుడు ఏకంగా ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేయడo బాలకృష్ణ బరితెగింపు కి నిదర్శనం గా అనిపిస్తోంది. గతంలో ఈ తరహా మద్యం బ్రాండ్ల ప్రచారంలో సెలబ్రిటీలు పాల్గొనడం పై ఉవ్వెత్తున విమర్శలు రావడం దాంతో అనేకమంది స్టార్స్ ఇక తాము అలాంటి ప్రకటనల్లో కనిపించం అని నిర్ణయం తీసుకోవడాన్నీ పలువురు గుర్తు చేసుకుంటున్నారు.ఓ కూల్ డ్రింక్ బ్రాండ్ ప్రచారం చేసినందుకే చిరంజీవి పై విమర్శలు రావడం దాంతో అయన వెనక్కి తగ్గడం కూడా గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఒకనాటి బాలకృష్ణ హీరోయిన్, బంగారు బుల్లోడు సినిమా లో అయన సరసన నటించిన రవీనాటండన్(Raveena Tandon) తారల మద్యం ప్రచారం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం గమనార్హం. సెలబ్రిటీలుగా తమపై ఎక్కువ సామాజిక బాధ్యత ఉంటుందనీ, ఆల్కహాల్ ఉత్పత్తులకు తాము ప్రచారం చేయడం అంటే యువత ను తప్పుదారి పట్టించడమే అవుతుంది అని ఆమె వ్యాఖ్యనించారు.. మరి బాలయ్య కి ఇలాంటి మంచి మాటలు చెవికెక్కుతాయా... లేక మంచి చెడూ జాంతానై.. మా బ్లడ్డు బ్రీడు సపరేట్ హై.. అంటూ ఇలాగే కంటిన్యూ అయిపోతారా.. దీనికి ఆన్సర్ కోసం జనం మాత్రమే కాదు ఆయన్ను వరించిన పద్మ భూషణ్ కూడా ఆశగా ఎదురు చూస్తోంది. -
నో డుమ్మా.. రోజంతా పనే : బెంగుళూరు పనిమనుషుల రూటే వేరు!
నగరాల్లో ప్రస్తుతం భార్యా భర్తా ఇద్దరూ ఉద్యోగులైన మధ్యతరగతి కుటుంబాలను, వేధించే ప్రధానమైన సమస్య ల్లో ముందు వరుసలో ఉంటుంది హౌస్ మెయిడ్/పనిమనిషి అని చెప్పొచ్చు. ఒక్కరోజు పనిమనిషి రాదు అని తెలిస్తే గృహిణుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తాయి. ఇలాంటి పరిస్థితులు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే...బెంగళూరు వాసులు పనిమనిషికి ఓ చక్కని ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటున్నారు. అది ఏమిటో ఊహించగలరా? ప్రముఖ మీడియా సంస్థ బెంగుళూర్లోని కొన్ని కుటుంబాలను కలిసి సేకరించిన సమాచారం ప్రకారం... ఆ నగరంలో పనిమనిషి స్థానం వేగంగా భర్తీ అవుతోంది. ఇల్లు శుభ్రం చేయడం దగ్గర నుంచి వంట చేయడం దాకా.. దాదాపుగా అన్ని పనుల్లోనూ పనిమనిషి అవసరాన్ని ఈ కుటుంబాలకు దూరం చేస్తున్నాయి ఇంటి పనులలో సహాయపడే రోబోట్లు. వీటిని వినియోగిస్తున్న కొన్ని కుటుంబాల గురించి చెప్పుకుందాం...బెంగుళూర్లోని హెబ్బాళ్ నివాసి అయిన 35 ఏళ్ల మనీషా రాయ్ ఏడు నెలల క్రితం తన వంటవాడి స్థానంలో వంటగది రోబోట్ను పెట్టుకుంది. ఇది తమకు సంబంధించినంత వరకూ సానుకూల మార్పు అని ఆమె చెప్పింది. ఆమె భర్త నవీన్ వారి చిన్న కుమార్తె నక్షత్రతో సహా ఆమె కుటుంబం ఇప్పుడు రోబోట్–వండిన పోహా, పావ్ భాజీ రాజ్మా రైస్ వంటి వెరైటీ వంటలను ఇష్టపడుతున్నారు. శుభ్రంగా తింటున్నారు. దశలవారీ సూచనల ద్వారా మార్గనిర్దేశం చేసే మొబైల్ యాప్ని ఉపయోగించి మనీషా ఆ రోబోట్ను నియంత్రిస్తున్నారు. అయితే ఆమె కేవలం కలపవలసిన పదార్థాలను మాత్రమే చెబుతుంది. జోడిస్తుంది రోబోట్ యంత్రం ఆమె పర్యవేక్షణ లేకుండానే మిగతావన్నీ – కోయడం, వేయించడం, ఆవిరి చేయడం కూడా సర్వం తానై చేసేస్తుంది. అంతేకాదు సదరు రోబోట్ ఆమె ఇతర పనులను చేసుకోవడాన్ని రకరకాలుగా సులభతరం చేస్తుంది. వ్యయం పరంగా చూసినా, వంటవాడిని ఉంచడం కంటే ఇది మరింత సరసమైనదిగా మనీషా చెబుతున్నారు. తాను కొన్న రోబోట్ ధర 40,000 ఉన్నప్పటికీ, ఆదా అయే మొత్తంతో పోలిస్తే చాలా తక్కువేనన్నారామె.అదేవిధంగా, నగరంలో ఆర్కిటెక్ట్ అయిన మీరా వాసుదేవ్ 18 నెలలుగా పనిమనిషి లేకుండానే పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఆమె రోజువారీగా ఇల్లు శుభ్రపరచడానికి రోబోటిక్ వాక్యూమ్, మాపింగ్ పరికరాలను ఉపయోగిస్తుంది. పైగా ఈ యంత్రాలు మందపాటి కార్పెట్లు వంటివి శుభ్రపరిచే పనులకు బాగా ఉపకరిస్తాయని ఆమె అంటున్నారు. కోరమంగళ నుంచి బెంగుళూర్కు ఇటీవలే వచ్చిన రేణుకా గురునాథన్ వంటి ఇతర నివాసితులు డిష్వాషర్లు రోబోటిక్ స్వీపర్లను వినియోగిస్తున్నారు ఈ స్మార్ట్ పరికరాలు ఇంటిలో బాధ్యతలను ఇంటి యజమానులు నిర్వహించే పాత్రలను కూడా మారుస్తున్నాయి. ఆధునిక సాంకేతికత పట్ల ఆసక్తి చూపే మగవాళ్లు వీటిని ఉపయోగించేందుకు ఉత్సాహం చూపుతూ ఇంటి పనుల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. తన భర్త ఇప్పుడు రోబోతో వంట చేయించడాన్ని కూడా ఆనందిస్తున్నాడని మనీషా చెప్పడం గమనార్హం.తుషారా నయన్ వంటి గృహిణులు కూడా మారారు. పనిమనిషిని భర్తీ చేయడం గురించి ఆమె కుటుంబం మొదట్లో అంగీకరించలేదు. కానీ వారు ఇప్పుడు రోబోట్ భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సాంకేతికతలు రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తున్నప్పటికీ, అవి మానవ సేవల్ని పూర్తిగా భర్తీ చేయలేవని కొందరు నమ్ముతారు. మరోవైపు సామాజిక కార్యకర్త గీతా మీనన్ మాట్లాడుతూ, గృహ కార్మికుల హక్కులను రక్షించడంపై స్టార్టప్లు దృష్టి పెట్టాలనీ, వారికి ప్రత్యామ్నాయాలను తయారు చేయడం కాదు. కార్మికులకు మద్దతు ఇచ్చే సాధనాలను వేతన కాలిక్యులేటర్లు లేదా డిజిటల్ పేస్లిప్లు వంటివి టెక్ తరం అన్వేషించాలని సూచిస్తున్నారు -
స్టార్ హీరోతో వాన పాట చేశాక, గదిలోకెళ్లి భోరుమన్న నటి...
ఇప్పుడంటే పెద్ద విషయం కాదు కానీ.. అంత ఆసక్తి కూడా లేదు కానీ ఒకప్పుడు సినిమాల్లో రెయిన్ సాంగ్స్ అంటే ఫుల్ క్రేజ్. అప్పట్లో ఓ దశాబ్ధం పాటు వానపాటలు లేకుండా మాస్ హీరోల సినిమాలు రాలేదంటే అతిశయోక్తి కాదేమో... ఎన్టీయార్ తరం నుంచి చిరంజీవి తరం దాకా కొన్నేళ్ల పాటు ఈ వానపాటల్తో ప్రేక్షకుల్ని తడిపి ముద్దచేసేశారు. కేవలం టాలీవుడ్లో మాత్రమే కాదు అటు బాలీవుడ్లోనూ వీటి సందడి ఎక్కువే కనపడేది.ఇప్పుడు లిప్లాక్, మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాల్లో చేయడం గురించి ఎలాగైతే హీరోయిన్లు కొందరు తమ ఇబ్బందులు బయటపెడుతున్నారో...అప్పుడు వానపాటల గురించి అలాగే చెప్పుకునేవారు. తడిసి ముద్దయిన చీరలో హీరోయిన్ హీరోతో డ్యాన్సు చేస్తుంటే ప్రేక్షకులు కళ్లప్పగించేసేవారు కానీ అలా తెరకు ఒళ్లప్పగించేసినందుకు అందరూ కాకపోయినా కొందరు హీరోయిన్లు మాత్రం తెగ బాధపడేవారు. అప్పట్లో బాలీవుడ్ సినిమా వానపాటల్లో సూపర్ హిట్ సాంగ్లో నటించిన ఓ హీరోయిన్ అదే విధంగా విపరీతంగా బాధపడింది. ఇటీవలే వెలుగులోకి వచ్చిందీ విషయం.కళ్లు తిప్పుకోనివ్వనంత అందం ఉన్నా, గ్లామర్తో కాకుండా బాలీవుడ్లో తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసుకున్న అతి కొద్ది మంది తారల్లో ఒకరు స్మితా పాటిల్(Smita Patil), గ్లామర్కు కాకుండా, గంభీరతకు గుర్తుపెట్టుకునే పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో ఆమె తిరుగులేని స్థానం సంపాదించారు. స్వతంత్ర భావజాలంతో ఉండే స్మితాపాటిల్ కు సామాజిక విలువలపై ఉన్న నమ్మకం ఆమె నటనలో పాత్రల ఎంపికలో స్పష్టంగా కనిపించేది.సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టి, నిజాయితీతో నిండిన పాత్రలు పోషించిన స్మితా పాటిల్కు, మొదటి నుంచీ వాణిజ్య చిత్రాల మీద ఆసక్తి పెద్దగా లేదు. అందుకేనేమో ఆమె మొదటి మాస్టర్హిట్ కమర్షియల్ సినిమా ‘‘నమక్ హలాల్’’(Namak Halaal) విజయం గురించి ఆమె ఎప్పుడూ సంతృప్తి చెందలేదు. మరీ ముఖ్యంగా ఆ సినిమా అద్భుత విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ‘ఆజ్ రఫత్ జాయేతో...‘ పాట ఆమెకు ఏ మాత్రం నచ్చలేదు. కుండపోత వర్షంలో తెల్ల చీరలో తడిసి ముద్దవుతూ అందాలన్నీ బహిర్గత పరుస్తూ.. నాటి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan)తో చేసిన ఆ పాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిందేమో కానీ..స్మితా పాటిల్ను మాత్రం ఉస్సురుమనిపించింది. తను ఎప్పుడూ ఊహించని రీతిలో కనిపించాల్సి రావడం ఆమె మనస్సుకు తీవ్రమైన బాధ కలిగించింది. ఆ రోజు వాన పాట షూటింగ్ పూర్తయిన తరువాత ఆమె తిన్నగా తన గదిలోకి వెళ్లిపోయిందని, భోరుమంటూ ఏడ్చిందని సాక్షాత్తూ ఆ పాటలో ఆమె సహనటుడు, బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ ఇటీవలే వెల్లడించారు. మరి అలాంటి పాటకు ఆమె ఎందుకు అంగీకరించింది? ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఉంది.ఇది అంతా జరిగినదానికి మూలం సిల్సిలా అనే సినిమా. ఆ సినిమాలో మొదట స్మితా పాటిల్ పర్వీన్ బాబీ ఉండాల్సింది. కానీ వారికి బదులుగా చివరికి జయ బచ్చన్ రేఖ ఎంపికయ్యారు. ఈ విషయం దర్శకుడు యశ్ చోప్రా నుంచి కాకుండా, శశికపూర్ ద్వారా తెలియడం స్మితా పాటిల్ మనోభావాలను తీవ్రంగా గాయపరచిందని సమాచారం. ఆ గాయం పచ్చిగా ఉండగానే నమక్ హలాల్ సినిమాలో అవకాశం వచ్చిందట. ఆవేదనలోనో, ఒక నిర్వేదంలోనో నమక్ హలాల్కి ఓకే చెప్పేసిందట. అయితే ఈ సినిమా ఘనవిజయం సాధించినా, తనకు మరిన్ని సినిమా అవకాశాలు అందించానా... సినిమా రంగంలో తన విలువలకు భిన్నంగా చేశాననే భావన ఆమెను వెంటాడింది.విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ పొందినా.. తనను ఆ పాటలో హీరోయిన్గా ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవడం ఆమెకు ఎప్పటికీ ముళ్లులా గుచ్చుకుంటూనే ఉంది. ఆ తర్వాత స్మితా పాటిల్ ఎన్నో మంచి చిత్రాల్లో నటించారు. అయితే చాలా చిన్న వయసులోనే ఆమె ఈ లోకం నుంచి నిష్క్రమించడంతో బాలీవుడ్ ఉన్నంత కాలం గుర్తుంచుకోదగ్గ గొప్ప నటిని కోల్పోయింది. సదరు నమక్ హలాల్ సినిమాను భలేరాముడు పేరుతో మోహన్బాబు హీరోగా తెలుగులోనూ తీశారు. ఆ సినిమాలోనూ వానపాట ఉంది అంతే స్థాయిలో ఇంకా చెప్పాలంటే మరింత ఘాటుగా తెలుగు పాటను చిత్రీకరించారు. ఆ వానపాటలో ఒకనాటి హీరోయిన్ మాధవి మోహన్బాబుకు జోడీగా నర్తించింది. -
40ప్లస్ క్లబ్లో అనసూయ.. ఇదే గ్లామర్తో ఇంకెన్నాళ్లు?
దాదాపు ఓ పన్నెండేళ్ల క్రితం టీవీ చానెల్లో న్యూస్ ప్రెజెంటర్గా తన ప్రస్తానం ప్రారంభమైనప్పుడు తానే కాదు ఎవరూ ఊహించి ఉండరు.. ఇంతగా, ఇన్ని విధాలుగా అనసూయ(Anasuya Bharadwaj) తెలుగు వారికి దగ్గరవుతుందని. కేవలం పుష్కర కాలంలో పుష్కలమైన అవకాశాలు అందుకుంటూ అంతకంతకూ ఎదుగుతూ వచ్చిన అనసూయ...స్టార్ యాంకర్ నుంచి సిల్వర్ స్క్రీన్ స్టార్ దాకా దూసుకుపోయింది. తెలుగులో చిన్నితెర మీద యాంకర్, ప్రోగ్రామ్ హోస్ట్గా చేసిన ఎవరూ సాధించలేకపోయిన క్రేజ్ను ఆమె స్వంతం చేసుకుంది. ఓ వైపు యాంకర్గా పలు టీవీ షోస్లో కనిపిస్తూనే, మరోవైపు వెండితెర మీద కూడా తనదైన ముద్ర వేస్తోంది. క్షణం, రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాల్లోని ఆమె పాత్రలు సినీరంగంలో ఆమె అవకాశాలను విస్త్రుతం చేశాయి. ప్రస్తుతం అనసూయ చిన్నితెర మీద కావచ్చు, వెండితెర మీద కావచ్చు, పబ్లిక్ ఈవెంట్స్ లో కావచ్చు... ఫుల్ క్రే జ్ ఉన్న సెలబ్రిటీ అనడంలో అతిశయోక్తి లేదు అయితే ప్రస్తుతం సెలబ్రిటీల ఇమేజ్, పాప్యులారిటీని సరైన రీతిలో అంచనా వేయడం సాధ్యం కావడం లేదు. గతంలో ఒక నటి/నటుడు, యాంకర్ ఎవరైనా సరే తమ ప్రతిభ ద్వారా మాత్రమే అత్యున్నత స్థానాన్ని సాధించారని చెప్పేందుకు అవకాశం ఉండేది. అయితే ఈ సోషల్ మీడియా యుగంలో ఇన్స్టాలు, రీల్స్...వగైరాలు వెల్లువెత్తుతూ సినీ విమర్శకుల్ని సైతం సెలబ్రిటీల స్థాయిపై విశ్లేషణలకు వీలు లేకుండా చేస్తూన్నాయి. మరోవైపు అనసూయ సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ. ఆమెను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉంచిన వాటిలో ఆమె గ్లామర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోందనేది నిర్వివాదం. ఆ విషయం ఆమె కూడా గుర్తించింది కాబట్టే సినిమాల్లో కాకున్నా, సోషల్ మీడియాలో గ్లామరస్ పోస్టులు, వీడియోల ద్వారా మెరిపిస్తూ ఉంటుంది. తన దుస్తులు, వస్త్రధారణ విషయంలో వచ్చే విమర్శలకు ఘాటుగా బదులిస్తూ ప్రతి విమర్శలు చేస్తూ వివాదాలతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. వీటన్నింటి నడుమ... ఆమె దురదృష్టమో అదృష్టమో కానీ.. ఎన్ని వైవిధ్యభరిత చిత్రాల్లో నటించినా, అనసూయ అనగానే ఓ అందమైన అమ్మాయి అనే భావనే సినీ అభిమానుల్లో స్థిరపడిపోయింది.ఏదేమైనా దాదాపు పాతికేళ్లు పైబడిన వయసులో ‘షో’ బిజినెస్లోకి ఆరంగేట్రం చేసిన అనసూయ నిన్నటి(మే 15)తో ఫార్టీ ప్లస్ వయస్కుల క్లబ్లోకి చేరుతోంది. ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా ఈ గ్లామర్ ఇకపై ఎంతకాలం నిలుస్తుందో తెలీదు. కాబట్టి ఇకపై నటనలో కూడా తనేంటో నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటిదాకా ఎంచుకున్నట్టే వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ.. గ్లామర్ డోస్ను తగ్గిస్తూ... అందమైన మహిళ అనే అభిప్రాయాన్ని మరిపిస్తూ.. అభినయ ప్రావీణ్యమున్న నటిగా కూడా ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేయగలిగితే మరికొన్ని దశాబ్ధాల పాటు ఆమెకు తిరుగు ఉండకపోవచ్చు. -
మామిడి తొక్కే కదా అని పారేయొద్దు.. లాభాలెన్నో తెలుసా?
ఇది మామిడి సీజన్ – ఎండల వేడితో పాటూ దక్కే తీపి రుచులు మామిడి పండ్లు. ఈ సీజన్లో మామిడి పండ్లు తింటాం కానీ.. తొక్క మాత్రం తీసి విసిరేస్తాం. కానీ మీకు తెలుసా? మామిడి తొక్క కూడా ఓ పోషకవంతమైన ఆహారం కావచ్చు. అవును – మామిడి తొక్క తినదగినదే, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యానికి మంచిది కూడా అంటున్నారు పోషకాహార నిపుణులు..తొక్క తినడం సురక్షితమేనా?సాంకేతికంగా చూస్తే, అవును. మామిడి తొక్క విషమేమీ కాదు. ఇది ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మాంగిఫెరిన్, క్వెర్సిటిన్, కెరోటినాయిడ్లు వంటి బయోయాక్టివ్ పదార్థాలతో నిండివుంది. అయితే మామిడి తొక్క మందంగా, కొద్దిగా చేదుగా, కొన్నిసార్లు కొబ్బరి తరహాల ఉంటుంది. అందువల్ల చాలా మందికి నచ్చదు.అంతేకాదు కొంత మందికి మామిడి తొక్కలోని కొన్ని పదార్థాలు అలెర్జీ కలిగించొచ్చు మామిడిని తీసేటప్పుడు మురికితో పాటు చర్మంపై మంట వచ్చినట్లయితే, తొక్క తినకుండా ఉండటమే మంచిది.తొక్కలో పోషకాలు...ఇందులోని ఫైబర్: జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు మాంగిఫెరిన్ వంటి పదార్థాలు శరీరంలో అలర్జీలు, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యానికి మేలు చేసే కెరోటినాయిడ్లు, విటమిన్ ఇ చర్మాన్ని కాంతి వంతం చేస్తుంది. అలాగే కొన్ని పరిశోధనలు మామిడి తొక్క బ్లడ్ షుగర్ను నియంత్రించడంలో సహాయపడవచ్చని చెబుతున్నాయి. రుచికరంగా తినే విధాలు:మామిడి తొక్క చట్నీ:2 మామిడిల తొక్క (శుభ్రంగా కడగాలి)ఒక పచ్చిమిరపకాయ ఒక టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరిఅల్లం చిన్న ముక్క, తగినంత ఉప్పు,కొద్దిగా నిమ్మరసం తీసుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో కొద్దిగా మిక్స్ చేయండి. కావాలంటే మస్టర్డ్ గింజలు, కరివేపాకు టాంపర్ చేయొచ్చు.ఎండబెట్టి పొడి తయారు చేయడం:మామిడి తొక్కని ఎండలో లేదా ఓవెన్ లో బాగా ఎండబెట్టి పొడి చేసి, స్మూతీల్లో లేదా మసాలా మిశ్రమాలలో కలుపుకోవచ్చు. ఒక చిన్న ముక్క మామిడి తొక్క పండిన మామిడి, అరటిపండు, యోగర్ట్తో కలిపి మేళవిస్తే.. తీపి, చేదు మధ్య బ్యాలెన్స్ అవుతుంది. తొక్కని తరిగి, నీళ్ళలో నానబెట్టి, కొన్ని రోజులు ఫెర్మెంటేషన్కు ఉంచండి. స్వచ్చమైన వెనిగర్ లాగా తయారవుతుంది. సలాడ్ డ్రెస్సింగ్కు బాగా సరిపోతుంది.శుభ్రంగా కడిగిన మామిడి తొక్కని వేడి నీటిలో లేదా గ్రీన్ టీ లో వేసి మరిగించండి. హల్కా రుచి, యాంటీ ఆక్సిడెంట్ల తేలికపాటి పౌష్టికత మీకు లభిస్తుంది.జాగ్రత్తలు...పండే మామిడి తొక్కపై పురుగుమందుల శేషాలు ఉండొచ్చు. తొక్క తినాలంటే ఆర్గానిక్ మామిడిని మాత్రమే ఎంచుకోవాలి. అలా దొరకని పక్షంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి అవేంటంటే..నీళ్ళలో 1 టీస్పూన్ ఉప్పు, టీస్పూన్ పసుపు కలిపి 10–15 నిమిషాలు నానబెట్టి, తరువాత శుభ్రంగా కడగడం ద్వారా కాయపై అలుముకున్న పెస్టిసైడ్స్ ఏవైనా ఉంటే తొలగించవచ్చు. అలాగే ఒక బౌల్ నీటిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి 15 నిమిషాలు నానబెట్టి, తరువాత మంచి నీటితో కడగడం 1:3 నిష్పత్తిలో వెనిగర్ : నీటిలో కలిపి 15–20 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడగాలి. అలాగే తినాలనుకుంటే మామిడి తొక్కని మృదువైన బ్రష్ లేదా గుడ్డతో సున్నితంగా తోమి శుభ్రం చేయాలి.(చదవండి: Miss World 2025: మెక్సికన్ 'మే'నూ..! అందుబాటులో అంతర్జాతీయ వంటకాలు..) -
పెళ్లి వేడుక ఆనందంగా వధూవరులు తప్ప..అందరూ
ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అయిన కోర్ట్ సినిమాలో చివరి దాకా ఒక సస్పెన్స్ ఉంటుంది. హీరో హీరోయిన్లు ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని కొన్ని నిమిషాల సేపు గడిపి వస్తారు. అయితే అక్కడ ఏం చేశారు అనే సస్పెన్స్. దీన్ని చివరిదాకా కొనసాగిస్తారు. చివర్లో తెలుస్తుంది. వారిద్దరూ ఫేక్ పెళ్లి చేసుకున్నారని... ఇప్పుడు దాదాపుగా అలాంటి ఫేక్ పెళ్లిళ్లే మెట్రో నగరాలకు వచ్చేస్తున్నాయి. అయితే అవి ఇద్దరు టీనేజర్లు చేసుకునే అమాయకపు పెళ్లిళ్లు కాదండోయ్... బాగా డబ్బున్న సంపన్నులు చేసుకునే పార్టీ పెళ్లిళ్లు. అవేమిటి అంటారా?అయితే ఆ పార్టీ సారీ స్టోరీలోకి వెళ్లాల్సిందే... ఢిల్లీ పార్టీ సీన్లో ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ వచ్చేసింది. దాని పేరే నకిలీ పెళ్లి వేడుకలు, ఈ వేడుకల్లో నిజమైన వధూవరులు ఉండాల్సిన అవసరం లేదు. కానీ అంతకు మించిన హంగు, ఉత్సాహం మాత్రం ఉండాలి. అతిథులు సంప్రదాయ దుస్తులు ధరించి, పెళ్లి వేదికలా అలంకరించబడిన స్థలానికి వెళ్తారు. అక్కడ డీజే మ్యూజిక్, ఢోల్స్, పెళ్లి పాటలతో రాత్రంతా నృత్య విహారం సాగుతుంది. ఢిల్లీకి చెందిన సోషల్ మీడియా ప్రొఫెషనల్ అవంతిక జైన్ ఇన్స్ట్రాగామ్లో ‘‘ఫేక్ సంగీత్’ ప్రకటనను చూసి తన మిత్రులతో వెంటనే షేర్ చేసింది. ‘‘కాలేజీలో చదువుతున్నప్పుడు ఇలాంటి పెళ్లి థీమ్ పార్టీ చేయాలని కలలు కంటూ ఉండేవాళ్లం. ఇప్పుడు అది నిజం అయ్యే ఛాన్స్ లాగా అనిపించింది,’’ అని ఆమె ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్కరికి సుమారు రూ.550 చొప్పున ఎంట్రీ ఫీజు చెల్లించి ఈ ఈవెంట్కు జైన్ ఆమె మిత్రులతో కలిసి వెళ్లారు. , సుమారు వందమంది యువతతో పాటు, ఢిల్లీ మెహ్రౌలీ లేన్ లోని పాప్యులర్ క్లబ్ అయిన జైలో రూఫ్టాప్ రెస్టారెంట్లో జరిగిన ఈ నకిలీ సంగీత్కు హాజరయ్యారు. ఈ ఈవెంట్కు ‘‘దేశీ’’ డ్రస్ కోడ్ తప్పనిసరి. తన శరీరానికి బ్లాక్ బ్లౌజ్, ప్లమ్ కలర్ లెహంగా ధరించి అవంతిక హాజరయ్యారు. కానీ అక్కడ అంతా పెళ్లికి తగ్గ దుస్తులు ధరించి కనిపించారు. నిజమైన పెళ్లి వేడుకలే గుర్తుకొచ్చేలా కుర్తా–షెర్వానీలు, చున్నీలు, మెరిసే ఆభరణాలు ధరించారు. వేదికలో పసుపు–గులాబి రంగు డెకరేషన్లు, మారిగోల్డ్ పూల అలంకరణలు, ఫోటో బూత్లు, మెహందీ ఆర్టిస్ట్లతో పక్కా పెళ్లి మూడ్ క్రియేట్ చేశారు. పెళ్లి పాటలతో నృత్యం ఓ హైలైట్. ‘‘పంజాబీ, హిందీ బీట్స్పై మనసు పెట్టి డ్యాన్స్ చేశాం. మధ్యలో ఢోల్వాలాలు వచ్చి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు,’’ అని అవంతిక చెప్పారు. ఈ ఈవెంట్కి కేవలం యువతే కాదు, మధ్య వయస్కులు, పెద్దలు కూడా హాజరయ్యారు. అంతా కలిసిమెలిసి ఎంజాయ్ చేశారు. ‘‘ఈవెంట్ అయిపోయినా ఎవరికీ వెళ్లాలనిపించలేదు,’’ అని అవంతిక గుర్తు చేసుకున్నారు. చదవండి: తీవ్ర నష్టాల్లో లగ్జరీ ఫ్యాషన్ హౌస్, 1700 మందికి ఉద్వాసనభారతీయ సమాజంలో పెళ్లిళ్లు అనేవి ఒక పెద్ద వేడుక. అలాంటి వేడుకల మూడ్ను ఎప్పుడైనా సరే అంటే ముహూర్తాలు లేని టైమ్లో కూడా ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది ఆహ్వానించదగ్గ ట్రెండ్ అని చెప్పాలి. నిజమైన పెళ్లి ఆహ్వానాన్ని అందుకోవాలని ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే పెళ్లిళ్లకు వెళ్లవచ్చు. ఢిల్లీకి చెందిన‘‘జుమ్మీకీ రాత్’’ అనే ఈవెంట్ కంపెనీ ఇప్పటివరకు ఇలాంటి రెండు నకిలీ పెళ్లి ఈవెంట్లు నిర్వహించింది. అంతేకాదు గత 2024 అక్టోబరులో షంగ్రీలా గ్రూప్ ‘బంధన్’ పేరుతో వెడ్డింగ్ సర్వీసును లాంచ్ చేసినప్పుడు కూడా మాక్ వెడ్డింగ్ పార్టీ నిర్వహించారు. డిజైనర్ తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన పెళ్లి వస్త్రధారణలో మోడల్ జంట, లైవ్ సుఫీ మ్యూజిక్, గజ్రా స్టాళ్లు, భోజన విందుతో ఈ ఈవెంట్ను రక్తి కట్టించారు. చదవండి: Cannes: అరంగేట్రంలోనే ఎదురు దెబ్బ, లగేజీ మొత్తం గాయబ్!సాధారణంగా వెడ్డింగ్ కొరియోగ్రఫీ సంస్థలు కూడా వీడియో కంటెంట్ కోసం నకిలీ పెళ్లిళ్లు ప్లాన్ చేస్తుంటాయి. ఎందుకంటే... స్టూడియో కంటే, పెళ్లి వేదికలపై తీసిన వీడియోలకే సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు కూడా అక్కడే ఈ తరహా మాక్ వెడ్డింగ్లు జరుపుకుంటూ కల్చరల్ కనెక్షన్ను కొనసాగిస్తారు. ఇప్పుడు ఇవి పార్టీ మార్గాలుగా కూడా మారిన నేపధ్యంలో ఈ ఫేక్ వెడ్డింగ్ పార్టీ కల్చర్ మన దాకా వచ్చేస్తుందేమో...చూడాలి. -
బాలీవుడ్లో ప్రభాస్ని కొట్టేదెవరు?
ఇప్పుడు బాలీవుడ్కి టాలీవుడ్ సత్తా తెలిసివచ్చింది. ఒకనాటి హీరోల్లా ఏదో వచ్చాం అంటే వచ్చాం చేశాం అంటే చేశాం అన్నట్టు ఒకటీ అరా చేసి పోయే రకం కాదని, ఒకసారి కాలు పెడితే కార్చిచ్చులా వ్యాపించే నేటి తరం తెలుగు హీరోలను ఆపడం తమ తరం కాదని హిందీ బెల్ట్కి ఇప్పుడు బాగా అర్ధమవుతోంది. నిజానికి బాలీవుడ్ కి ఒకప్పుడు తెలుగు సినిమా అంటే శతకోటి ఇండస్ట్రీల్లో అదొకటి. తెలుగు ఫిలిం మేకర్స్ ను చాలా తక్కువ చేసి చూసేవారు. దీన్ని మార్చాలని తామూ తక్కువేం కాదని నాటి సీనియర్ హీరోలు చాలా ప్రయత్నించారు. ఒకానొక దశలో అమితాబ్ను కూడా దాటేసి చిరంజీవి దేశంలోనే హైపెయిడ్ ఆర్టిస్ట్గా నిలిచి తన సత్తా చాటారు. అయినా ఇవేవీ బాలీవుడ్ బుర్రకెక్కలేదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్లు డైరెక్ట్ హిందీ చిత్రాల్లో నటించి అప్పుడప్పుడు అక్కడ మెరుపులు మెరిపించినా పెద్దగా ఒరిగింది అంటూ ఏమీ లేదు. (చదవండి: సమంత డేటింగ్ రూమర్స్.. డైరెక్టర్ రాజ్ సతీమణి పోస్ట్ వైరల్!)అదంతా ఒకెత్తయితే ‘బాహుబలి’ఒక్కటీ ఒకెత్తయింది. బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని వుడ్లూ తనవైపు తలెత్తి చూసే రేంజ్ కు మన తెలుగు సినిమా ఎదిగింది. ఓ వైపు బాలీవుడ్లో ప్రభాస్(Prabhas) ప్రభంజనం కొనసాగుతుండగానే దూసుకొచ్చిన ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఎన్టీఆర్(Jr NTR), రామ్ చరణ్(Ram Charan)లు, ‘పుష్ప’, ‘పుష్ప 2’ల తో అల్లు అర్జున్(Allu Arjun) కూడా నార్త్ లో బాలీవుడ్ హీరోలకు థీటుగా కలెక్షన్లు, ఫాలోయింగ్ను అందుకుంటూ ఇండియన్ సినిమాపై బాలీవుడ్ ఆధిపత్యాన్ని కుప్పకూల్చారు. ఈ నేపధ్యంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి ఎదిగిన మన హీరోల్లో అక్కడ అగ్రపీఠం కోసం ఇంటర్నల్ వార్ మొదలైంది. ప్రస్తుతం వీరిలో ఎవరికి వారే సాటి అన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ... అందరిలో ప్రభాస్ కాస్త ముందున్నాడని చెప్పక తప్పదు. ముఖ్యంగా హైట్, వెయిట్ సహా కటౌట్లో బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని ప్రభాస్ను నార్త్ జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బాహుబలి తర్వాత విడుదలైన ప్రభాస్ సినిమాలు కూడా బాలీవుడ్లో మంచి ఓపెనింగ్స్ సాధించడానికి అదే కారణం. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ టాలీవుడ్లో ఫ్లాప్ కాగా, అక్కడ సూపర్ హిట్ గా ‘ఆదిపురుష్’ కి కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ‘సలార్’ ‘కల్కి’ లు బాక్సాఫీస్ను షేక్ చేసేశాయి. మరోవైపు ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత దేశవ్యాప్తంగా విడుదలై ఎన్టీఆర్ , రాంచరణ్..ల సినిమాలకు నార్త్లో అంతగా కలెక్షన్స్ రాలేదు. హైప్ కూడా క్రియేట్ కాలేదు. ఇక అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా కనపడింది కానీ.. అది తర్వాతి సినిమా వరకు ఎంత వరకూ కొనసాగుతుందనేది అప్పుడే ఏమీ చెప్పలేము. పుష్ప రాజ్ పాత్ర ఉత్తరాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న స్థాయిలో అల్లు అర్జున్ ఆకట్టుకున్నాడా? అంటే అవునని అప్పుడే చెప్పడం సరికాదు. ఈ నేపధ్యంలోనే ప్రభాస్ని ఢీ కొట్టడానికి మిగిలిన హీరోలు నార్త్ ఆడియన్స్ కి బాగా రీచ్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇక్కడి సినిమాల ద్వారా అక్కడకు వెళ్లడం కాకుండా..నేరుగా బాలీవుడ్ సినిమాలు చేయడం మీద దృష్టి పెట్టారు. ‘వార్ 2’ లో హృతిక్ రోషన్తో పాటు ఎన్టీఆర్ చేస్తున్న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు అల్లు అర్జున్ కూడా ఆమిర్ ఖాన్ తీస్తున్న‘ ‘మహాభారతం’లో అర్జునుడి పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. అలాగే రాంచరణ్ కూడా సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక సినిమా చేయడానికి రెడీ అంటున్నాడు. మరి ఈ మల్టీస్టారర్ సినిమాల ద్వారా ప్రభాస్ను ఎంత వరకూ దాటగలరో...బాలీవుడ్లో సౌతిండియా సూపర్స్టార్ ఎవరు కానున్నారో.. -
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీదారుల సందర్శన నేడిలా!
మిస్ వరల్డ్ పోటీదారుల సందర్శనతో ఈ చారిత్రక కట్టడాలకు ప్రపంచ స్థాయిలో ప్రాచుర్యం లభించనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఈ సందర్శనను తెలంగాణ పర్యాటక ప్రాచుర్యంలో భాగంగా నిర్వహిస్తోంది. తెలంగాణ సంప్రదాయ శిల్పకళ, చరిత్ర, చారిత్రక వైభవం నేటి యువతకు అంతర్జాతీయ వేదికలకు పరిచయం కావడం ఆహ్వానించదగ్గ పరిణామం.రామప్ప దేవాలయం, వేయి స్థంభాల గుడిమిస్ వరల్డ్ పోటీదారులు బుధవారం తెలంగాణలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడాలు – రామప్ప దేవాలయం, వేయి స్థంభాల గుడిని సందర్శించనున్నారు. ఈ సందర్శనతో తెలంగాణ సంస్కృతి, శిల్పకళకు ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు లభించే అవకాశం ఏర్పడింది.రామప్ప దేవాలయం.. శిల్పకళకు నిలయం..వరంగల్ జిల్లా ములుగు సమీపంలోని పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప దేవాలయం 13వ శతాబ్దానికి చెందిన గొప్ప కట్టడం. కాకతీయ రాజవంశానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించిన ఈ దేవాలయం, మృదువైన రాతితో రూపొందించిన శిల్పాలతో విశేషంగా ప్రసిద్ధి చెందింది. గత 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన ఈ ఆలయం, చిరకాలం నిలిచే తేలికపాటి ఇటుకలతో నిర్మితమై, శిల్పకళ, శాస్త్రీయ నిర్మాణ కౌశలానికి ప్రతిరూపంగా నిలుస్తోంది.వేయి స్థంభాల గుడి – శిలాశిల్పాల సమ్మేళనంహనుమకొండలోని వేయి స్థంభాల గుడి అనేది 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన మరొక అద్భుత శిల్పకళా చరిత్ర. ఈ ఆలయం శైవ సంప్రదాయానికి చెందినది. వేలాది రాతి స్తంభాలతో కట్టబడి, ప్రతీ స్తంభం ప్రత్యేక శిల్పంతో కళాత్మకంగా రూపొందింది. ముఖ్యంగా అక్కడి ఉత్కృష్టమైన నృత్యశిల్పాలు, సంగీతాన్ని ప్రతిబింబించే శిలాచిత్రాలు సందర్శకులను ఆకట్టుకుంటుంటాయి.వరంగల్ కోటలోసందడి పేరిణి నృత్యాన్ని ఆస్వాదించనున్న అందాల రాణులుతెలంగాణ సంస్కృతి, చరిత్రకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే మరో ఘట్టానికి బుధవారం తెర లేవనుంది వరంగల్. బుధవారం మిస్ వరల్డ్ పోటీదారులు చారిత్రక వరంగల్ కోటను సందర్శించి, అక్కడి ప్రాచీన కళారూపమైన పేరిణి శివతాండవ నృత్యంను తిలకిస్తారు. ఈ సందర్శనలో పోటీదారులు కాకతీయుల ఘన వారసత్వానికి, తెలంగాణ సంప్రదాయాలను తెలుసుకోనున్నారు.వరంగల్ కోట – కాకతీయ వైభవానికి ప్రతీకవరంగల్ కోట.. ఎకోశిలా తోరణంలతో ప్రసిద్ధిగాంచిన ఈ కోట, 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారు. రుద్రమదేవి, వంటి శక్తిమంతుల పాలనకు సాక్షిగా నిలిచిన ఈ కోట శిల్పకళ, ప్రాకారాల నిర్మాణ శైలి, ద్వారతోరణాల తో విశిష్టత అందుకుంది. కోట ప్రాంగణంలోని రాతి శిల్పాలు కాకతీయుల నిర్మాణ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి.పేరిణి నాట్యం – శక్తి, శివభక్తి సమ్మేళనంపేరిణి శివతాండవం అనేది పురాతన పురుషుల నృత్యరూపం. ఇది యుద్ధానికి ముందు వీరులు శక్తిని ప్రేరేపించుకునేందుకు చేసే తాండవ నృత్యంగా పేరు గాంచింది. శివుని ఆరాధనగా చేసే ఈ నృత్యం, ఉగ్రత, శక్తి, శ్రద్ధల సమన్వయంతో భక్తుల మనస్సులను హత్తుకుంటుంది.పేరిణి నృత్యాన్ని అంతరించి పోతున్న కళారూపంగా భావించి, ప్రముఖ నృత్య విద్యావేత్త పద్మశ్రీ డాక్టర్ నాట్యాచార్య నటరాజ రామకృష్ణ తిరిగి ప్రాచుర్యంలోకి తెచ్చారు. ప్రస్తుతం ఇది తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా పరిగణించబడుతోంది.ప్రపంచ వేదికపై తెలంగాణ కళల వెలుగుఈ సందర్శనలో మిస్ వరల్డ్ పోటీదారులు కోటలోని తూర్పు గోపురాన్ని, రాతిశిలల కట్టడాలను, తూర్పు ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన పేరిణి నృత్య ప్రదర్శనను తిలకించనున్నారు మిస్ వరల్డ్ కార్యక్రమం ద్వారా తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, సంప్రదాయ నృత్యాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇది తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక రంగానికి ఊతమిచ్చే గొప్ప అవకాశం. -
జా.ఎన్టీయార్, హృతిక్ల వార్2 వసూళ్లు.. రూ.100కోట్లు..
బాలీవుడ్ సూపర్స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ యంగ్ టైగర్, స్టార్ హీరో ఎన్టీఆర్(Jr NTR) జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2‘(War 2) విడుదల కాకముందే సంచలనాలు నమోదు చేయడం మొదలైంది. హృతిక్, ఎన్టీయార్ ల అనూహ్య కాంబినేషన్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైన నాటి నుంచే సంచలనంగా మారింది. ఈ చిత్రం ద్వారా హృతిక్ రోషన్ మళ్లీ తన స్పై క్యారెక్టర్ ’కబీర్’గానే స్క్రీన్ మీదకి రానుండగా, మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనున్నాడని తెలియడం మరింత ఆసక్తిని పెంచింది. ఉత్తరాది, దక్షిణాదికి చెందిన ఇద్దరు అగ్రహీరోలు పరస్పరం తెరపై తలపడడం గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కియారా అడ్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగానూ బాలీవుడ్, టాలీవుడ్ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ‘వార్ 2‘ పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి దక్షిణాది వ్యాప్తంగా ఈ సినిమా హైప్కి ప్రధాన కారణం జూ.ఎన్టీఆర్ కి ఇటీవలి కాలంలో అమాంతం పెరిగిన క్రేజ్ అనేది నిస్సందేహం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్టీఆర్ హవా ఇటీవల రెట్టింపైంది. ఆర్ఆర్ఆర్, దేవర...ఇలా వరుసగా బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండడమే సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు ఎగబడడానికి కారణంగా చెప్పొచ్చు. ఈ నేపధ్యంలో విడుదలకి ముందే ప్రాంతీయ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడైపోవడం ఓ రికార్డ్గా చెప్పాలి. తద్వారా ఈ సినిమా భారత మూవీ మార్కెట్లో ఓ కొత్త ట్రెండ్కి కొబ్బరికాయ కొట్టినట్టయింది. భాషా అంతరాలను దాటి స్టార్ హిరోల క్రేజ్, మల్టీ లాంగ్వేజ్ సినిమాలకి పెరిగిన ఆదరణ కారణంగా ఇటువంటి డీల్స్ ముందుగానే ఖరారవడం ఇక షురూ కావచ్చు. ఈ సినిమా ప్రాంతీయ హక్కుల కోసం ఎదురైన గట్టి పోటీని తట్టుకుని చివరికి ప్రముఖ నిర్మాతలు నాగా వంశీ, సునీల్ నారంగ్ ఈ లాభదాయకమైన డీల్ను చేజిక్కించుకున్నారు. విడుదలకి మూడేళ్లు ముందే ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులు రూ. 85–100 కోట్ల మధ్య ధరల్లో అమ్ముడైపోయాయని వార్తలు వస్తున్నాయి. వీటన్నింటి నేపధ్యంలో ఆగస్టు 14, 2025న విడుదల కానున్న ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
హీరో ఆఫర్లు వద్దని.. స్టార్గా మారిన శోభన్ బాబు మనవడు ...
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నట భూషణుడు శోభన్ బాబు(Sobhan Babu).. ఎన్టీయార్, కృష్ణ లాంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక ప్రేక్షకవర్గాన్ని సృష్టించుకున్నారు. ముఖ్యంగా మహిళాదరణలో ఆయనకు సాటిలేదు. తన సమకాలీకులైన మిగిలిన హీరోల్లా కాకుండా సినీరంగానికి దూరమైన తర్వాత ఆయన కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు పబ్లిక్ లైఫ్ నుంచే అదృశ్యం అయిపోయారు. అంతేకాదు ఆయన వారసులను కూడా ఎవరినీ సినీ రంగంలోకి పరిచయం చేయలేదు. దాంతో ఆయన దివంగతులయాక ఆయన వారసులకు సంబంధించిన విశేషాలు కూడా ఎక్కడా పెద్దగా వెలుగు చూడలేదు. ఈ నేపధ్యంలో తాజాగా శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారంటూ వచ్చిన వార్తలు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి రేకెత్తించాయి. అలనాటి అందాల నటుడి రూపాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన మనవడు... పలు సినిమా ఆఫర్లు వచ్చినా తిరస్కరించిన సురక్షిత్...సార్ధక నామధేయుడిగా మారి ఎంచుకున్న రంగంలో స్టార్ అనిపించుకుంటున్నారు.(చదవండి: రీరిలీజ్లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?)తమిళనాడులో స్థిరపడ్డ ఆయన సినిమా రంగంలో కాకుండా వైద్య రంగంలో తాతకు తగ్గ మనవడుగా రాణిస్తుండడం అందర్నీ ఆకర్షిస్తోంది. దాదాపు 4.5 కిలోల గర్భాశయాన్ని అత్యాధునిక సాంకేతికత ద్వారా తొలగించి డాక్టర్ సురక్షిత్ బత్తిన వైద్యరంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. తమిళనాడుకు చెందిన 44 ఏళ్ల మహిళకు గర్భాశయంలో భారీ కణితి ఏర్పడింది. ఇతర ఆస్పత్రులు ఓపెన్ సర్జరీ తప్ప మార్గం లేదని సూచించగా, డాక్టర్ సురక్షిత్ 3డీ ల్యాపరోస్కోపిక్ సాంకేతికతను ఉపయోగించి 8 గంటల పాటు శ్రమించి ఆ గర్భాశయాన్ని విజయవంతంగా తొలగించారు. అంతేకాదు 2019లో డాక్టర్ సురక్షిత్ గురువైన డాక్టర్ సిన్హా 4.1 కిలోల గర్భాశయాన్ని ల్యాపరోస్కోపీ ద్వారా తొలగించి సాధించిన గిన్నిస్ రికార్డును బద్దులు కొట్టి గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నారు.సేవాస్టార్..డాక్టర్ సురక్షిత్ చెన్నైలోని అన్నా నగర్లో 2016లో ఇండిగో ఉమెన్స్ సెంటర్ను స్థాపించారు. తన కెరీర్లో ఇప్పటివరకు 10,000కు పైగా శస్త్రచికిత్సలు నిర్వహించి, 40కి పైగా అవార్డులు అందుకున్నారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు శోభన్ బాబు పేరుతో వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. టెడెక్స్ స్పీకర్, ఫిట్నెస్ ఫ్రీక్ డిజిటల్ విద్యావేత్త అయిన డాక్టర్ సురక్షిత్ బత్తినకు సెలబ్రిటీల స్థాయిలో 1.65లక్షలకు పైగా ఇన్స్ట్రాగామ్ ఫాలోయర్స్ ఉండడం విశేషం. ఆయన శాస్త్రీయ విధానాలను సలహాలను వ్యాప్తి చేస్తున్నారు. ‘భారతదేశ సంతానోత్పత్తి రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్న ఐవీఎఫ్ లాంటి కార్పొరేట్ సంస్కృతికి వ్యతిరేకం అయినప్పటికీ... వంధ్యత్వానికి మూల కారణాలకు చికిత్స చేయడం సహజ గర్భధారణను ప్రోత్సహించడం కోసం ప్రత్యేంగా కృషి చేస్తున్నాను‘ అని డాక్టర్ బత్తిన చెబుతున్నారు. -
పాన్ ఇండియా హీరో..పబ్లిక్ లైఫ్లో జీరో...
ఎర్రచందనం స్మగ్లింగ్.. నీకేం తెలుసు? అని పుష్ప సినిమా చూసిన ప్రేక్షకుడ్ని అడిగితే?.. కల్కి సినిమా స్టోరీ లైన్ ఏమిటంటే ఆ సినిమా చూసిన వారిలో ఎంతమంది ప్రేక్షకులు ఠక్కున చెప్పగలరు? ఆర్ఆర్ఆర్ సినిమా సన్నివేశాలకు మన ఇంటి చుట్టుపక్కల పరిస్థితులకు ఏమన్నా సంబంధం ఉందా? దేవర మూవీలో హీరోని చూస్తూ అతనితో మనకు తెలిసిన వారిని ఎవరినైనా పోల్చుకోగలమా? హిట్ 3లో చూపించిన డార్క్ వెబ్ గురించి తెలియడం అటుంటి అసలు ఆ పదం మనలో ఎందరు విని ఉంటాం?ఛత్..ఇవన్నీ ఎందుకు బాస్... ఆ సినిమాలన్నీ జనం జేబులు కొల్లగొట్టి మనకు కలెక్షన్ల మూటలు కొట్టుకొచ్చాయి కదా. అది చాలు అంటోంది టాలీవుడ్. పాన్ ఇండియా పేరుతో ప్రజలకు పరిచయం లేని సంబంధం లేని అక్కర్లేని, రంగుల హంగుల విచిత్రాల్ని కళ్ల ముందుకు తెస్తోంది. అయితేనేం అవి హిట్ అవడం లేదా అంటే అవుతున్నాయి. బ్రహ్మాండంగా కలెక్షన్లు తెస్తున్నాయి. కానీ అదొక్కటే చాలా? ఏమీ అర్ధం కాకపోయినా జురాసిక్ పార్క్, అవతార్..వగైరా చిత్రాలు మన దగ్గర కూడా భారీ కలెక్షన్లు కురిపించాయి. అంతమాత్రాన అలాంటివే మనమూ తీయాలని అనుకుంటామా? విదేశీ చిత్రాలకు ఇక్కడ మనుషులతో, ఇక్కడి మనస్తత్వాలతో, ఇక్కడి పరిస్థితులతో పనిలేదు.. అవసరం లేదు. కానీ ఇక్కడి సినిమాలు ఇక్కడి మనుషులతో పెనవేసుకున్నాయి. ఇక్కడి ప్రజల కష్టంతో తయారవుతున్నాయి. వారి కష్టంతోనే దర్జాగా బ్రతుకుతున్నాయి. కాబట్టి జనం చూస్తున్నారు మేం తీస్తున్నాం అనేది ప్రాంతీయ సినిమాల వరకూ సరైన విధానం కాదు.(చదవండి: భారత్పై ప్రశంసలు.. హీరోయిన్కి బెదిరింపులు!)పెద్ద ఎన్టీయార్ తరం చూస్తే నాటి హీరోలు ఎన్ని రకాల సినిమాలు చూపించారు? దైవ భక్తి నుంచి దేశభక్తి దాకా బోధించేవి...అవినీతి అరికట్టమని అన్యాయాన్ని ఎదరించమని రక్త సంబంధాలకు విలువీయమని...రాజకీయాలను బాగు చేయమని...సందేశాలిచ్చేవి ఇలా సామాజిక అంశాలతో ముడిపడిన సినిమాలు ఎన్నో వచ్చాయి... మంచి చెడు రెండింటినీ జనానికి విడమరిచాయి. తమ చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి సినిమాలు సృష్టించాడు కాబట్టే ఎన్టీయార్ అనే వ్యక్తిని జనం తమ అన్నగా గుండెల్లో పెట్టుకుని ఆరాధించారు. పార్టీ పెట్టిన ఆర్నెళ్లలోనే సిఎంని చేసి నెత్తిన పెట్టుకున్నారు.(చదవండి: ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!)ఆ తర్వాత డ్యాన్సులు, ఫైట్లకు పెద్ద పీట వేసిన చిరంజీవి తరం కూడా జనరంజక సినిమాలనే అది కూడా జనజీవన స్రవంతికి దూరం కాకుండానే అందించింది. తొలిదశలో చేసిన అభిలాష, స్వయంకృషి, ఛాలెంజ్ల నుంచి రాజకీయాలకు ముందు చేసిన ఠాగూర్,స్టాలిన్... దాకా మన సమాజంతో ముడిపడిన కధాంశాలతో చేశాడు కాబట్టే చిరంజీవి ఒక పార్టీ పెట్టి 19 సీట్లు, 70లక్షల ఓట్లు దక్కించుకోగలిగాడు. అయితే ఇక్కడ సినిమా నటులు అందరూ రాజకీయాల్లోకి రావాలని ఈ విషయాలు చెప్పడం లేదు. వారి వృత్తికి, ఎంచుకున్న రంగానికి, చేసే పనికి ప్రజలతో మమేకమైతే అది ఎంతగా ప్రజల్లో వారిపై ఆదరణ పెంచుతుందో సోదాహరణగా చెప్పడమే ఉద్ధేశ్యం. ప్రజల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపే శక్తి సినిమాలకి ఉంది అనడం నిస్సందేహం. అలాంటి సినిమాలను ప్రజల దైనందిన జీవితాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా తెరకెక్కించడం అంటే వారి జేబులు కొల్లగొట్టడం తో తప్ప వారి కష్టనష్టాలతో తమకేమీ సంబంధం లేదని నిస్సిగ్గుగా తేల్చి చెప్పడమే.(చదవండి : ఇది మా దేశం.. మా బాధ్యత.. ఎవరూ ప్రశ్నించకండి: రష్మిక)అంటే జనం కోసం సినిమా తీసి మమ్మల్ని డబ్బులు పోగొట్టుకోమంటావా? అని నిర్మాతలు, ఫ్లాప్ సినిమాలతో ఫ్యాన్స్ని దూరం చేసుకోమంటావా? అని ప్రశ్నించే హీరోలు ఉంటారు. అయితే సందేశాత్మక చిత్రాలకు కలెక్షన్లు రావనేది అర్ధసత్యం మాత్రమే. వాటిలోనూ హిట్స్, ఫ్లాప్స్ అవుతుంటాయి. గేమ్ ఛేంజర్ లాగా అవాస్తవిక చిత్రణతో తీస్తే ఫ్లాప్లు అదే ‘కోర్ట్’ లాగా వాస్తవ పరిస్థితులకు అద్దం పడితే కలెక్షన్లు వస్తాయని తెలుస్తూనే ఉంది. అలాగని భారీ చిత్రాలు కాల్పనిక కధాంశాలు వద్దనడం లేదు అవి కూడా తీయవచ్చు, సదరు గ్రాఫిక్ ఆధారిత చిత్రాలతో అంతర్జాతీయంగా మన సినిమాల పేరు ప్రతిష్టలు పెంచవచ్చు. కానీ అవి మాత్రమే తీయాలని అనుకోకూడదు. ప్రజలతో సంబంధం ఉన్నవి కూడా తీయాలి. వారి కష్టనష్టాలకు ఊరటనిచ్చేవి, వారి రేపటికి బాటలు పరిచేవి, వారి బాగుకి దిక్సూచిగా నిలిచేవి కూడా చేయాలి. కనీసం రెండేళ్లకు ఒకటైనా లో బడ్జెట్లో అయినా సామాజిక అంశాలతో సినిమా చేస్తామని పెద్ద హీరోలు తమకు తాము మాట ఇచ్చుకోవాలి. తమకెన్నో ఇచ్చిన సమాజం రుణం తీర్చుకోవాలి. అలా కాదు..అవన్నీ చిన్న హీరోలకు వదిలేస్తాం...మేం మాత్రం ఇలాగే వీడియో గేమ్స్ తరహా చిత్రాలు చేసుకుంటూ ప్రజల కళ్లు విప్పార్చుకునేలా చేస్తూ డబ్బు చేసుకుంటాం...అంటే..ఖచ్చితంగా అది అన్యాయమే, సామాజిక బాధ్యత లేకపోవడమే.. అప్పుడు పెద్ద హీరోల దగ్గర డబ్బులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు..కానీ ప్రజల గుండెల్లో స్థానం ఉండదు. అలా లేనప్పుడు పేరుకి పెద్ద హీరో అయినా చివరకు జీరోగానే మిగులుతాడు. -
రజనీ,నాగార్జున... ఎన్టీయార్ , హృతిక్ ‘వార్’ తప్పదా?
భారీ తారాగణం, సాంకేతిక నిపుణులు, భారీబడ్జెట్తో రూపొందే సినిమాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. అలాంటి సినిమాలు రెండు ఒకే సమయంలో విడుదలయే పరిస్థితి ఏర్పడితే అది మరింత ఉత్కంఠ కలిగించేదే. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకూ, దక్షిణాది సినిమాలకు నడుమ ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే సౌత్ సినిమాలు పాన్ ఇండియా మూవీస్గా జాతీయస్థాయిలో సత్తా చాటడం మొదలుపెట్టాయో... అప్పటి నుంచి వీటి మధ్య పోటీ కూడా సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాతో మరో దక్షిణాది సినిమా విడుదల తేదీల మధ్య అలాంటి ఉత్కంఠే నెలకొంది.తమిళ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్తో కూలీ(Coolie) పేరుతో ఓ మాస్ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు వచ్చింది ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్రలు కూడా నటిస్తూండడంతో, ఇది మల్టీ స్టారర్ హోదా తెచ్చుకుంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఆగస్ట్ 14న విడుదల చేస్తారని అంచనాలు ఉన్నాయి. నిజానికి కూలీ సినిమా సమ్మర్లో రిలీజ్ అనుకున్నారు కానీ అది తర్వాత ఆగస్ట్కు మారింది. లోకేష్ గత సినిమాల కంటే ఈ సినిమాకు ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడని అందుకే ఈ ఆలస్యం అంటున్నారు.మరోవైపు బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ అగ్రనటుడు జూ.ఎన్టీఆర్ల సెన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం వార్ 2(War 2) కూడా అదే సమయంలో రిలీజ్ అవనుంది. దీనితో కూలీ అనుకున్న టైమ్ కి వస్తాడా రాడా అనే సందేహాలు రజనీకాంత్ అభిమానుల్లో మొదలయ్యాయి. అన్ని హంగులతో వార్ 2 భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మక సంస్థ యష్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ జోడీ కట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయ్. మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీ ఆగస్టు 14గా ఇప్పటికే ప్రకటించేశారు. అనుకోని అవాంతరం ఏర్పడితే తప్ప అది మారే అవకాశం కనిపించడం లేదు, సో అదేన రోజు కూలీ వస్తే నేరుగా క్లాష్ తప్పదు. రెండు సినిమాల జోనర్ వేరువేరు..అయినప్పటికీ... ఒకవేళ కూలీ నిజంగానే ఆగస్ట్ 14న వస్తే, బాక్సాఫీస్ వద్ద సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ యుద్ధం జరుగుతుందని అనొచ్చు. ఒకవైపు రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర వంటి సీనియర్ హీరోలు మరోవైపు ఎన్టీఆర్, హృతిక్ల వంటి ఆ తర్వాతి తరం హీరోల మధ్య ఈ పోటీ ఫ్యాన్స్ కు సినీ పండితులకు ఖచ్చితంగా సెంట్రాఫ్ టాపిక్స్ అవుతుంది అంతేకాదు, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యి కలెక్షన్ల వేట మొదలుపెడితే అది కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశాలూ లేకపోలేదు. -
టీ రూ.10.. సమోసా, కాఫీ రూ.20: ఎయిర్పోర్ట్లో తక్కువ ధరల్లో..
టీ రూ.10, కాఫీ రూ.20 అనే ధరలు వింటుంటే ఆ ఏముంది? రోడ్డు పక్కన టీ బండిలో రేట్లు అవే కదా అందులో వింతేముంది?.. అనిపించవచ్చు కానీ... ఆ రేట్లు ఎయిర్పోర్ట్లోని కేఫ్లో అంటే..మాత్రం విస్తుపోవాల్సిందే. అవును మరి.. రాబోయే కొన్నేళ్లలో విమానాలు ఎక్కని వారు అంటూ ఉండరేమో కానీ.. విమానాశ్రయాల్లో టీ కూడా తాగని వారు మాత్రం బోలెడంత మంది ఉంటారేమో అనే అంచనాలు ఉండేవి. ఎందుకంటే..రాను రాను విమానయానం అందుబాటులోకి వస్తోంది. కానీ ఎయిర్పోర్ట్స్లో కనీసం టీ కూడా అందుబాటు ధరలో ఉండడం లేదు కాబట్టి.అడపాదడపా ఎయిర్లైన్స్ వాళ్లు అందించే ఆఫర్లు ఒక్కోసారి రైలు ఛార్జీల కన్నా కూడా తక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల సామాన్యులకు కూడా విమాన ప్రయాణం సాధ్యమవుతోంది. కానీ విమానాశ్రయాల్లో కాసింత సేద తీరాలని టీ, కాఫీ లాంటివి తాగాలనుకున్నా, సమోసా, బిస్కెట్స్ వంటి చిరు తిండి తినాలన్నా అదేదో పెద్ద కలలాగా మారింది. ఎందుకంటే ఆ ధరల పట్టీ ఇంకా సామాన్యులకు అందనంత దూరంలోనే ఉంది. మన శంషాబాద్ విమానాశ్రయాల వంటి చోట అయితే కేఫ్స్లో ధరలు చూస్తే విమానం ఎక్కకుండానే కళ్లు తిరుగుతాయ్.రకరకాల అవకాశాలవల్ల.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనో విమాన ప్రయాణం చేయాల్సిన అవసరం ఇప్పుడు మధ్యతరగతి వారికి కూడా తప్పడం లేదు. అయినప్పటికీ విమాన ప్రయాణీకులు అంటేనే సంపన్నులు అనే రీతిలో ఈ ధరలు ఉండడం సామాన్యులకు మింగుడు పడని పరిస్థితి.ఈ నేపథ్యంలో పూణే అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం సరికొత్తగా ‘ఉడాన్ యాత్రి కేఫే’ అనే సేవను ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ఇప్పటికి ఎదురు చూసిన రోజులు ముగిశాయి టీ రూ.10, కాఫీ రూ.20 కి పూణే విమానాశ్రయంలో అందుబాటులోకి రాబోతున్నాయి,‘ అని ఆయన ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: దుబాయ్లో భారతీయ బిలియనీర్కు ఐదేళ్లు జైలు శిక్షప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్’ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ కేఫేని ఏర్పాటు చేశారు.. ఈ కేఫే లక్షల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే పూణే విమానాశ్రయంలో, ఈ విధంగా తక్కువ ధరలకు అధిక నాణ్యత గల ఆహార పదార్థాలు అందుబాటులోకి రావడం ఒక సమయోచిత మార్పుగా భావిస్తున్నారు ప్రయాణికులు. సమోసా తదితర తినుబండారాలు సైతం రూ.20 ధరల్లో అందిస్తున్న ఈ కేఫ్స్ కోల్కతా, చెన్నై, ముంబయిలలో కూడా సేవలు అందిస్తున్నాయి. విమానాశ్రయాలు సంపన్నులుకు తప్ప సామన్యులకు కావనే అభిప్రాయాలను మార్చేలా, అత్యధిక జనాభాకు ఉపయోగపడేలా ఇలాంటి మార్పులు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో రావాలని సామాన్య ప్రయాణికులు కోరుకుంటున్నారు. -
వరల్డ్ బెస్ట్ ఇండియన్ మద్యం బ్రాండ్.. ఫుల్లు రూ. 2వేలే!
భారతీయులు స్వభావ సిద్ధంగా బలమైన, గాఢమైన రుచులను రంగులను ఇష్టపడతారు అందుకేనేమో మన దేశంలో మద్యం వినియోగంలో విస్కీ, బ్రాండీ, రమ్, బీర్ లకే ఎక్కువ డిమాండ్. అయితే విస్కీ, బ్రాందీ, రమ్లకు బ్రిటిష్ పాలన నాటి నుంచే ఆదరణ బాగా ఉంది. ముఖ్యంగా విస్కీ,ఎప్పటి నుంచో మద్యం ప్రియులకు ప్రధాన ఎంపికగా నిలిచింది. రమ్ బ్రాందీ విస్కీలు అందరికీ అందుబాటు ధరలలో సులభంగా లభించే మద్యం రకాలుగా మారాయి.వోడ్కా కూడా ఇటీవలి కాలంలో పుంజుకుంటుండగా. వీటన్నింటి తర్వాత స్థానం వైన్కు దక్కింది. అయితే మన దేశంలోని మద్యపాన ప్రియుల్లో అనేకమంది దాదాపుగా మర్చిపోయిన ఒక మద్యం వెరైటీ ఒకటి ఉంది అది జిన్. లైట్ కలర్లో, సున్నితమైన రుచులతో ఉండటంతో, భారతీయ అభి‘రుచుల’ను అది అంతగా సంతృప్తి పరచలేకపోయింది. అంతేకాకుండా జిన్ గురించి ప్రచారం కూడా తక్కువే. అందుకే చాలా మందిలో జిన్ ను ఎలా తాగాలో, ఏ కాక్టెయిల్స్లో ఉపయోగించాలో అవగాహన లేకపోయింది. దాంతో పెద్దగా ఎవరూ పట్టించుకోని రకంగా జిన్ మిగిలిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న గ్లోబల్ కాక్టెయిల్ కల్చర్ జిన్ వినియోగానికి ఊపునిస్తోంది. తరచుగా కాక్టెయిల్స్లో కలుపుకుని జిన్ను సేవించడం ఓ ప్రత్యేకమైన వెస్ట్రన్ డ్రింకింగ్ కల్చర్. ఇలాంటి శైలి ఇప్పుడ మను నగరాల్లో మాత్రమే క్రమంగా అభివృద్ధి చెందుతోంది. గ్రేటర్ దాన్, హాపుసా వంటి భారతీయ క్రాఫ్ట్ జిన్ల ఆవిర్భావంతో, నగరాల్లో యువత, ప్రయోగాలకు వెరవని ఆల్కహాల్ ప్రియుల వల్ల జిన్ కు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపధ్యంలోనే మన దేశానికి చెందిన ఒక జిన్ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ వన్గా నిలిచింది. సాధారణంగా మన దేశీయ మద్యం రకాలు ప్రపంచ పోటీలో నిలవడం అరుదు. అలాంటిది ఏకంగా విజేతగా గెలుపొందడం చెప్పుకోదగిన విషయమే. భారతదేశంలో తయారైన జిన్ బ్రాండ్ ’జిన్ జిజి’ ఇటీవల లండన్లో నిర్వహించిన పోటీల్లో ’స్పిరిట్ ఆఫ్ ది ఇయర్ 2025’ అనే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ పురస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ మద్యం ఉత్పత్తులకు ఇస్తారు. జిన్ జిజి గోవాలో తయారవుతుంది. ఇది హిమాలయ జునిపర్, తులసి, దార్జిలింగ్ టీ, క్యామొమైల్ వంటి భారతీయ సుగంధ ద్రవ్యాలతో కలిపి తయారు చేస్తారు. ఈ ప్రత్యేకమైన సుగంధాలు దీనికి ప్రత్యేకతను అందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారతీయ మద్యం బ్రాండ్లకు గుర్తింపు తీసుకువచ్చిన జిన్ జిజి... ధర రూ.2వేల దగ్గర్లోనే ఉండడం కూడా మరో విశేషం. సాధారణంగా ఇలా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన మద్యం బ్రాండ్స్ ధర కనీసం రూ.5వేల పైమాటే ఉంటుంది. అయితే జిన్ చోటా మోటా వైన్ షాప్స్లో దొరకకపోవచ్చు. డ్రింక్స్.ఇన్ వంటి వెబ్సైట్లలో ఇది అందుబాటులో ఉంది కాబట్టి ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. అలాగే ప్రీమియం మద్యం దుకాణాల్లో కూడా లభించవచ్చు. -
కనుమరుగవుతున్న మామిడి వెరైటీలు ఇవే..!
ప్రపంచంలో మామిడిపండ్లకు చిరునామాగా సగర్వంగా నిలిచిన భారతదేశం, అనేకరకాల ప్రాదేశిక మామిడి పండ్లను కలిగి ఉంది. వీటిలో ప్రతీ మామిడి రకం తనదైన ప్రత్యేకమైన రుచి, సువాసన, సాంస్కృతిక నేపథ్యంతో ప్రసిద్ధి చెందింది. కానీ మార్కెట్ ఆధారిత వ్యవస్థ వల్ల వాణిజ్యపరంగా మొలకెత్తిన హైబ్రిడ్ రకాల ప్రభావంతో, ఈ విలువైన దేశీ మామిడి రకాలు క్రమంగా అదృశ్యం అవుతున్నాయి. ఇప్పటికే అన్ని చోట్లా లభించడం తగ్గిపోయిన ఈ మామిడి రకాలను ఈ వేసవి టూర్ల సందర్భంగా ఎక్కడైనా దొరికితే ఆస్వాదించడం మరచిపోవద్దు. 1. కరుప్పట్టి కాయ – తమిళనాడుతమిళనాడు దక్షిణ ప్రాంతాల్లో పుట్టిన ఈ కరుప్పట్టి కాయ ప్రత్యేకత ఏమిటంటే, ఇది చక్కెర పాకం (పామ్ జాగరీ)ను తలపించే రుచిని కలిగి ఉంటుంది. ఈ మామిడి పచ్చిగా తినడానికి కూడా బాగుంటుంది. అలాగే పచ్చళ్ల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఆకుపచ్చ రంగు ఫైబర్తో నిండిన గుజ్జుతో ఇది ప్రత్యేకంగా గుర్తింపు పొందింది.2. కన్నిమాంగా – కేరళకేరళలో కన్నిమాంగా అనే చిన్న మామిడికాయలు పచ్చడికి ప్రసిద్ధి. ‘కన్నిమాంగా‘ అంటే ‘కన్య మామిడి‘, అంటే పూర్తి పక్వతకు ముందు కోయబడే కాయలు. ఈ రకాన్ని పచ్చడి రూపంలో వాడితే, కేరళ వంటకాల మసాలా రుచులకు ఇది సరిపోతుంది. అధిక దిగుబడి కలిగిన వాణిజ్య రకాల సాగు పెరిగిన నేపథ్యంలో, ఈ మామిడి మొక్కలు చాలా వరకు కనుమరుగవుతున్నాయి. అయితే స్థానిక రైతులు గిరిజన సంఘాలు దీన్ని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.3. కల్భావి మావు – కర్ణాటకకర్ణాటక తీరప్రాంతాలలో పుట్టిన కల్భావి మావు మామిడి, గులాబీ వాసన తీపి రుచితో కొత్తగా ఉంటుందనే పేరు సంపాదించింది. ఇది గోల్డెన్ యెల్లో రంగులో మధ్య పరిమాణంలో ఉంటుంది. అదనపు తీపి కలిగి ఉండడంతో నేరుగా తినడానికి మాత్రమే కాకుండా స్వీట్స్ తయారీలో కూడా వాడేవారు. ఇటీవలి వరకూ మార్కెట్లలో విరివిగా లభించిన ఈ రకం, క్రమంగా తగ్గిపోతోంది. 4. బటాషా – పశ్చిమ బెంగాల్బెంగాల్కు చెందిన బటాషా మామిడి, బాగా తీయగా ఉంటుంది. ఇది చిన్న పరిమాణంలో ఉండి, రసం నిండిన గుజ్జుతో ఉంటుంది అయితే దీని మృదువైన తొక్క ఎక్కువ దూరాలకు తరలించలేనంత సున్నితంగా ఉండటంతో, ఈ మామిడి వాణిజ్యం పెద్దగా పుంజుకోలేదు. దాంతో దీని సాగు కూడా తగ్గిపోతోంది. ప్రస్తుతం ఇది కేవలం కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తోంది.5. అమ్మ చెట్టు – ఆంధ్రప్రదేశ్ఈ మామిడి రకాన్ని అందించే చెట్టుకు తెలుగులో ‘‘అమ్మ చెట్టు’’ అనే పేరు, మామిడికి కూడా అదే పేరు. పెద్దదైన పరిమాణం, ఫైబర్తో నిండిన గుజ్జుతో ఉన్న ఈ మామిడి చెట్లు గ్రామీణ జీవన విధానంలో భాగంగా ఉండేవి. అయితే, ఈ చెట్ల నిర్వహణ కష్టం కావడంతో, ఈ రకం సాగు తగ్గిపోయింది. ఇక ఇది కేవలం కథల్లో, జ్ఞాపకాలలో మాత్రమే మిగిలిపోనుంది. అధిక దిగుబడి, హైబ్రిడ్ రకాలపై దృష్టి పెరగడంతో దేశీ రకాల మామిడి ప్రాధాన్యత తగ్గిపోయింది. అలాగే టెంక లేని పండ్లను ఇష్టపడే ఆధునిక వినియోగదారుల అభిరుచి వల్ల, స్వాభావికంగా పెరిగే దేశీ రకాల విస్త్రుతికి అడ్డంకి ఏర్పడింది. మరోవైపు నగరీకరణ విస్తరణ వల్ల తోటలపై భౌగోళిక ఒత్తిడి పెరిగింది. యువతలో దేశీరకాల గురించి అవగాహన లేకపోవడం కూడా సాగును దెబ్బతీసింది.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... కారణాలేవైనా మనదైన మామిడి వెరైటీలను మనం కోల్పోతుండడం దురదృష్టకర పరిణామమేనని చెప్పాలి.(చదవండి: కల్తీ పుచ్చకాయను పసిగట్టొచ్చు ఇలా..!) -
మంచి పుచ్చకాయను గుర్తించండి ఇలా!
వేసవిలో లభించే పుచ్చకాయలు అందరికీ ఇష్టం, అంతకంటే చల్లని నేస్తాల వంటివి అనొచ్చు. వాటి సహజమైన తీపి, అధిక నీటి శాతం వాటి రిఫ్రెషింగ్ రుచితో పాటు కలర్ఫుల్ రూపం కూడా సమ్మర్లో వాటిని తిరుగులేనివి పండుగా నిలబెట్టాయి. ఈ పుచ్చకాయల వల్ల ఆరోగ్య ప్రయోజనాలూ అనేకం...పుచ్చకాయ కేవలం అలసిపోయినప్పుడు రిఫ్రెష్ చేసే పండు మాత్రమే కాదు, అవసరమైన పోషకాలతో కూడా నిండి ఉంటుంది. దాదాపు 9092% నీటితో కూడిన పుచ్చకాయ, వేసవి వేడి సమయంలో హైడ్రేషన్ కోసం ఒక అద్భుతమైన ఎంపిక. ఒక 100 గ్రాముల పుచ్చకాయ ద్వారా దాదాపు 16 కేలరీలు లభిస్తాయి తక్కువ కేలరీల పండుగా, బరువును నియంత్రించుకునే వారికి పుచ్చకాయ అనుకూలంగా ఉంటుంది. దీనిలో సి, ఎ, బి6 విటమిన్లు అలాగే పొటాషియం మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటం వలన ఈ పండు అధిక రక్తపోటు ఉన్నవారికి మరింత ప్రయోజనకరం. దీని విటమిన్ సి కంటెంట్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్గా కూడా పనిచేసి వివిధ వ్యాధులకు దారితీసే ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తుంది. పుచ్చకాయ జీర్ణక్రియకు సహాయపడుతుంది, దానిలోని ఇనుము శాతం కారణంగా రక్తహీనత ఉన్నవారికి మంచిది. పండులోని ఎరుపు భాగాన్ని తరచుగా అత్యంత రుచికరంగా పరిగణిస్తారు, అయితే చర్మం దగ్గర ఉన్న లేత ఆకుపచ్చ రంగులో ఉండే భాగం సైతం ఎక్కువ పోషక ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యపరంగా పుచ్చకాయ వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ, దానిని కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. వేసవి నెలల్లో, రోడ్డు పక్కన ఎర్రగా, కోసిన పుచ్చకాయ రూపం ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే, మార్కెట్లో చాలా కల్తీ పుచ్చకాయలు ఉన్నాయి, మరి తాజా, ఆరోగ్యకరమైన పుచ్చకాయను కొనుగోలు చేస్తున్నారని తెలుసుకోవడం ఎలా? నాణ్యత లేని పండ్ల ద్వారా మోసపోకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండడం ఎలా? ఇప్పుడు చూద్దాం..కల్తీ పుచ్చకాయ అంటే హానికరమైన రసాయనాలు, రంగులు లేదా ఆర్టిషియల్ రిపైనింగ్ ఏజెంట్లను ఉపయోగించి దాని రూపాన్ని లేదా బరువును పెంచడానికి తారుమారు చేసిన పండు. సాధారణ కల్తీ పద్ధతుల్లో దాని గుజ్జును ఎర్రగా కనిపించేలా చేయడానికి ఆర్టిషియల్ కలర్ను ఇంజెక్ట్ చేయడం, బరువు పెంచడానికి నీటిని జోడించడం లేదా తాజాదనాన్ని కాపాడటానికి రసాయనాలను ఉపయోగించడం వంటివి చేస్తున్నారు. ఈ పద్ధతులు మన ఆరోగ్యానికి హానికరం, కాబట్టి విశ్వసనీయ విక్రేతల నుంచి మాత్రమే పుచ్చకాయలను కొనుగోలు చేయడం సహజ పక్వత సంకేతాలను తనిఖీ చేయడం ముఖ్యంమంచి పుచ్చకాయను ఎలా గుర్తించాలి? పుచ్చకాయను కొనుగోలు చేసేటప్పుడు, రంగు ముఖ్యం. నిస్తేజమైన చర్మం ఉన్న దాని కంటే శక్తివంతమైన, తగిన రంగు కలిగిన పుచ్చకాయ మంచి ఎంపిక. పక్వానికి ముఖ్య సూచిక దానిని తట్టినప్పుడు వచ్చే శబ్దం బోలుగా ఉండే, తేలికపాటి శబ్దం పండు నీటితో నిండి ఉందని మంచిదని సూచిస్తుంది. అదనంగా, ఏవైనా మచ్చలు లేదా గాయాలు ఉన్నాయా అని పుచ్చకాయను తనిఖీ చేయాలి, ఎందుకంటే ఇవి నష్టం లేదా చెడిపోవడాన్ని సూచిస్తాయి. పుచ్చకాయ అడుగున పసుపు మచ్చల కోసం ఉండాలి. అలా మచ్చలు ఉంటే ఈ పుచ్చకాయను సరైన సమయంలో సహజంగా పండించారని అర్ధం. అయితే, లేత లేదా తెల్లటి మచ్చలు ఉంటే పండు పూర్తిగా పక్వానికి రాకముందే కోసినట్లు అర్ధం View this post on Instagram A post shared by Adithya Nataraj 🇮🇳 (@learnwithadithya) (చదవండి: World Asthma Day: శ్వాసకు ఊపిరి పోద్దాం..! ఆస్తమాను అదుపులో ఉంచుదాం..!) -
భారతీయ తొలి ఐటమ్ గాళ్ ఓ పాకిస్తానీ..
భారతీయ సినిమా చరిత్రలో ఐటమ్ సాంగ్స్ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఇటీవలి కాలంలో అయితే బాలీవుడ్ చిత్రాలు ఐటమ్ సాంగ్ లేకుండా పూర్తి కాదన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. మలైకా అరోరా ‘హోత్ రసిలే’, కరీనా కపూర్ ‘ఫేవికోల్ సే’, సమంతా ‘ఊ అంటావా’, నోరా ఫతేహి ‘దిల్బర్ దిల్బర్’ వంటి పాటలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. తాజాగా తమన్నా భాటియా ఆజ్కీ రాత్ ద్వారా ఐటమ్ క్వీన్గా మారిపోయిన సంగతీ తెలిసిందే. ఇంతగా భారతీయ సినిమా చరిత్రలో మమేకం అయిపోయిన ఈ ఐటమ్ నంబర్ల చరిత్ర ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా?సినిమా పరిజ్ఞానం బాగా ఉన్నవారు కూడా ఈ ఐటమ్ నంబర్ల ట్రెండ్ను హెలెన్, బిందు లేదా జీనత్ అమెన్ మొదలుపెట్టారని అనుకుంటారు. కానీ నిజానికి వీళ్లందరి కన్నా ముందుగానే శృంగార నర్తకిగా తెరపై చిందేసిన ఇండియా ఫస్ట్ ఐటమ్ గర్ల్ ఎవరో తెలుసా? ఆ గౌరవం ‘మేడమ్ అజురీ‘(Madame Azurie)కి దక్కింది.అన్నా మేరీ గ్వీజెలర్...ఉరఫ్ మేడమ్ అజురీ... బాలీవుడ్లో తొలి ఐటమ్ డాన్సర్ ఎలా అయింది? అనే ప్రశ్నలు కలిగితే... ఒకసారి చరిత్ర తవ్వి తీయాలి. దాదాపు వందేళ్ల క్రితం... అంటే 1930లలో హీరోయిన్లకు భిన్నంగా ప్రత్యేక డాన్సర్ పాత్రలను సినీ పరిశ్రమలో ప్రవేశపెట్టిన పేరే మేడమ్ అజురీ అని చెప్పాలి. బెంగళూరులో జన్మించిన ఆమె తల్లి హిందూ బ్రాహ్మణ నర్స్ కాగా, తండ్రి జర్మన్ జ్యూయిష్ డాక్టర్. తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత ఆమె తండ్రితో నివసించింది. ఆ సమయంలో ఆమె తండ్రి ఆమెను బాలే నృత్యం నేర్చుకోవడానికి ప్రోత్సహించారు, కానీ భారతీయ నృత్యాలను అభ్యసించేందుకు మాత్రం అంగీకరించలేదు. అజురీ యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఆమె కుటుంబం బొంబాయికి తరలివెళ్లింది. ఆమె తండ్రి త్రీ ఆర్ట్స్ సర్కిల్లో సభ్యుడయ్యాడు, ఆ సమయంలో అజురీకి త్రీ ఆర్ట్స్ సర్కిల్ నిర్వాహకురాలు బేగం అతియా ఫైజీ–రహమిన్తో సంభాషించడానికి వీలు కలిగింది.అలా అజురీ అతియా సహకారంతో మరికొన్ని మనవైన కళలు నృత్యాలనుు అభ్యసించగలిగింది. అలా అజురీ పలు నృత్య శైలులను నేర్చుకుని నదిరా సినిమా తో హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘పర్దేసీ సయ్యాన్’, ‘క్వత్ల్–ఎ–ఆమ్’, ‘ది బాంబే టాకీస్’, ‘నయా సంసార్’ వంటి చిత్రాలతో సహా 700కి పైగా సినిమాల్లో నటించి, తన డాన్సులతో ఎంతో పాప్యులర్ అయ్యింది.తమ ప్యాలెస్లో నృత్యం చేయాలంటూ మేడమ్ అజురీకి బ్రిటన్ లోని బకింగ్ హ్యామ్ ప్యాలెస్ నుంచి ఆహ్వానం అందింది అంటేనే ఆమె పాప్యులారిటీ ఏ స్థాయిలో వెలిగేదో తెలుస్తుంది. దేశ విభజన అనంతరం అజూరీ ఓ ముస్లింను నిఖా చేసుకుని పాకిస్తాన్ లోని రావల్పిండీలో స్థిరపడి, పాకిస్తాన్లో కూడా కొన్ని స్థానిక చిత్రాల్లో నటించిన తర్వాత ఎందుకనో గానీ నటనకు గుడ్బై చెప్పేసింది. ఆ తర్వాత అక్కడ ఒక క్లాసికల్ డాన్స్ అకాడమీని ప్రారంభించి, ఏళ్ల తరబడి నృత్యాన్ని బోధించింది. అలా భారతీయ చిత్రాల్లో ఐటమ్ డ్యాన్సులకు ఊపిరిపోసిన అజురీ ఆగస్టు 1998లో మరణించింది. -
బాలీవుడ్ స్టార్లు... ఇష్టమైన టూర్లు... ఎందుకు ఇష్టమంటే..!
బాలీవుడ్ సెలబ్రిటీల జీవితాలు మనలో చాలా మందికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మనకు స్ఫూర్తినిచ్చేది ఆకర్షణీయమైన జీవనశైలి మాత్రమే కాదు, వారి ప్రయాణ గమ్యస్థానాల ఎంపిక కూడా. మరీ ముఖ్యంగా అందరం సమ్మర్ సీజన్ సందర్భంగా ఇలా టూర్ల వేటలో పడినప్పుడు...స్టార్లు ఎంచుకునే ప్రాంతాల వివరాలు తెలుసుకోవడం అంటే మన అభిరుచులను కలుసుకోవడం కూడా. కలలు కనే బీచ్ అయినా లేదా సందడిగా ఉండే నగరమైనా, బిజీ షెడ్యూల్ నుండి తప్పించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి తగిన ప్రదేశాలను కనుగొనే నైపుణ్యాన్ని లేదా వారి ఉత్తమమైన కలిగి ఉంటారు.– నేహా ధూపియా, జైపూర్ పాత–ప్రపంచ ఆకర్షణ ఆధునిక సౌకర్యాల కలయికను ఇష్టడుతుంది. కరీనా కపూర్ ఖాన్ తరచుగా నూతన సంవత్సర కాలంలో కుటుంబ సెలవుల కోసం స్విట్జర్లాండ్ను, ముఖ్యంగా గ్సా్టడ్ను సందర్శిస్తుంది.–షాహిద్ కపూర్ మీరా రాజ్పుత్ కపూర్: గ్రీస్, స్పెయిన్ స్విట్జర్లాండ్ వంటి యూరోపియన్ గమ్యస్థానాలను తమ పిల్లలతో సేదతీరుతుంటారు.–కర్ణాటకలోని కూర్గ్ను తనకు అత్యంత ఇష్టమైన ప్రదేశంగా బోమన్ ఇరానీ చెబుతారు.–సోను సూద్: షాపింగ్ కుటుంబ సందర్శనల కోసం వాషింగ్టన్, డి.సి.ని ఇష్టపడతాడు. –పారిస్కు తరచుగా వచ్చే సందర్శకురాలు ఫరా ఖాన్ కళ, చరిత్ర ఫ్యాషన్ మిశ్రమాన్ని :ఇష్టపడుతుంది.– తన కుటుంబంతో కలిసి దుబాయ్లో న్యూ ఇయర్కి నయనతార స్వాగతం పలికింది. –శ్రీలంకలో ప్రశాంతమైన బీచ్ స్నాప్షాట్లను దియా మీర్జా ఆస్వాదిస్తుంది. –బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా సందర్శించే గమ్యస్థానాలలో లండన్ ఒకటిగా నిలిచింది. సోనమ్ కపూర్, రియా కపూర్, సారా టెండూల్కర్ పరిణీతి చోప్రా వంటి తారలకు ఈ నగరం ఒక రొటీన్ ఎంపిక. ఐకానిక్ హైడ్ పార్క్ మీదుగా షికారు చేయడం నుంచి నగరంలోని ట్రెండీ రెస్టారెంట్లు ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ను అన్వేషించడం వరకు లండన్ సరదాలను సాహసాలను వారు తరచుగా అభిమానులతో పంచుకుంటారు.–పారిస్ అనేది బాలీవుడ్ సెలబ్రిటీలు వదల్లేని మరొక హాట్స్పాట్. ఈ ’సిటీ ఆఫ్ లైట్స్’ దిల్జిత్ దోసాంజ్, మలైకా అరోరా వంటి తారలను తరచు రారమ్మంటుంది. ఫ్రెంచ్ వంటకాలను ఆస్వాదించడం నుంచి రిటైల్ థెరపీలో పాల్గొనడం వరకు భిన్న రకాలుగా స్టార్లు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు.–బాలీవుడ్ సెలబ్రిటీల ఎంపికలో మాల్దీవులు సైతం అగ్రస్థానంలో నిలుస్తుంటాయి. ప్రశాంతమైన బీచ్లు, అందమైన వాతావరణం అద్భుతమైన సూర్యాస్తమయాలతో, తమ బిజీ జీవితాల నుంచి తప్పించుకోవాలనుకునే తారలకు ఇది తరచుగా విహారయాత్రగా మారుతుంది. రకుల్ ప్రీత్ సింగ్, నేహా ధూపియా పరిణీతి చోప్రా ఇలా ఈ ద్వీప స్వర్గంలో కనిపించిన ప్రముఖులు ఎందరో.–న్యూయార్క్ నగరం కూడా సెలబ్రిటీలకు తప్పక సందర్శించాల్సిన ప్రదేశంగా మారింది. మీరా కపూర్, కరిష్మా కపూర్, ప్రియాంక చోప్రా అమీర్ ఖాన్ సోషల్ మీడియా పోస్ట్ల ద్వారా న్యూయార్క్పై తమ ఇష్టాన్ని ప్రదర్శించారు, . సెంట్రల్ పార్క్ , టైమ్స్ స్క్వేర్ వంటి ఐకానిక్ ల్యాండ్మార్క్ల స్నాప్షాట్లను పంచుకున్నారు.–స్వదేశానికి దగ్గరగా ఉండాలి అలాగే రిలాక్స్డ్గా ఉండాలి అనుకునే స్టార్స్ను గోవా ఆకర్షించడం కొనసాగుతూనే ఉంది. భూమి పెడ్నేకర్, సారా అలీ ఖాన్ శిల్పా శెట్టి అక్కడి ప్రశాంతమైన బీచ్లను ఆస్వాదిస్తుంటారు. . గోవా లో ఉన్నప్పుడు వారు షేర్ చేసుకునే ఫోటోలు ఆ ప్రదేశం పట్ల వారి అభిమానాన్ని మనకు చూపిస్తాయి.–స్టార్ క్రికెటర్ను పెళ్లాడిన బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ... ఇష్టమైన గమ్యస్థానాలలో కరేబియన్ దీవులను పేర్కొంటారు. ఈ దీవులపై వారు పంచుకునే సోషల్ మీడియా పోస్ట్లు వారి ఇష్టాన్ని మనకు పట్టిస్తాయి. =తన బైక్పై రోడ్ ట్రిప్లకు వెళ్లడాన్ని ఇష్టపడే అమిత్ సాద్ ఇటీవల ముంబై నుంచి లేహ్–లడఖ్కు 5,288 కి.మీ. ప్రయాణించి నెలరోజుల పర్యటన చేపట్టారు. ‘‘రోడ్డులోని ప్రతి మలుపు వ్యక్తిగత పరివర్తనకు అవకాశం. తెలియని వాటిని తెలుసుకోవడం’’ అంటారాయన.–హిమాలయ శ్రేణి పట్ల సారా అలీఖాన్ ప్రేమ అంతులేనిది. కొన్ని నెలల క్రితం, ఆమె కాశ్మీర్కు కూడా ఆధ్యాత్మిక ప్రయాణం చేసింది. ఓ ఇంటర్వ్యూలో, సారా‘‘నాకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లకు వెళ్లి అక్కడ ట్రెక్కింగ్ చేయడం చాలా ఇష్టం. అలాఏ కాశ్మీర్ అంటే కూడా చాలా ఇష్టమని షేర్ చేసింది. మసాయి మారాలో అలియా భట్కు ప్రపోజ్ చేశాడు. రణ్బీర్ కపూర్ అప్పటి నుంచి ఈ జంటకు కెన్యా నేషనల్ రిజర్వ్ ఇష్టమైన గమ్యస్థానాలలో ఒకటిగా మారింది. -
హైదరాబాద్లో మిస్వరల్డ్ పోటీలు.. బ్యూటీక్వీన్స్పై టాలీవుడ్ ప్రముఖుల కన్ను
మూడవసారి మన భారతదేశం అతిపెద్ద అందాల పోటీకి ఆతిధ్యం ఇవ్వనుంది. అది కూడా తెలుగు రాష్ట్రాలకు తలమానికమైన హైదరాబాద్ నగరంలో ఈ ప్రపంచ స్థాయి బ్యూటీ కాంటెస్ట్ జరుగనుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమంపైనే విశ్వవ్యాప్త గ్లామర్ రంగం దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ గ్లోబల్ ఈవెంట్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రూపురేఖలే మార్చే స్థాయిలో ఏర్పాట్లు షురూ చేసింది. మరో 3 రోజుల్లో ప్రపంచవ్యాప్త అందాలన్నీ రాశులు పోసినట్లుగా హైదరాబాద్ నగరంలో కొలువుదీరనున్నాయి. ఒకటీ రెండు రోజులు కాదు ఏకంగా నెల రోజుల పాటు నగరంలోనే తిష్టవేయనున్నాయి. దాదాపుగా 120 దేశాలకు చెందిన అందగత్తెలు ఈ పోటీలో తమ దేశాల తరపున బ్యూటీ ఫైట్కి సై అంటున్నారు. ఈ నేపధ్యంలో హాలీవుడ్, బాలీవుడ్ సహా అన్ని వుడ్లూ తమ కెమెరాకు తగ్గ ఫుడ్ కోసం వేటను షురూ చేసేశాయి. బాలీవుడ్కు చెందిన పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ పోటీల్లో పాల్గొంటున్న సుందరీ మణుల గ్లామర్, ఇతరత్రా టాలెంట్స్ను సమీక్షించి వారిపై నివేదికలు అందించేందుకు తగినంత మందీ మార్బలాన్ని పురమాయించినట్టు సమాచారం. తద్వారా వారిలో తమ భవిష్యత్తు తారలను ఎంచుకునే అవకాశాలను అన్వేషిస్తున్నారట. అదే విధంగా అంతర్జాతీయ చిత్రాలను అందించడంలో బాలీవుడ్ సినిమాలతో పోటీపడుతున్న టాలీవుడ్ సైతం ఇదే బాట పట్టినట్టు తెలుస్తోంది. తెలుగునాట రూ.వందల కోట్లతో సినిమాలు తీయడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. కొత్త కొత్త మార్కెట్లను పసిగట్టడం వాటిలోకి దూసుకువెళ్లడం కూడా కనిపిస్తోంది. ఏతావాతా తెలుగు సినిమాలు ఇప్పుడు దక్షిణాదిని దాటేసి ఉత్తరాదిని చుట్టేసి, అమెరికా. చైనాలను కూడా కలిపేసుకుని... జపాన్, జర్మీనీ, బంగ్లాదేశ్ అంటూ హద్దులన్నీ చెరిపేసి.. కాదేదేశమూ కలెక్షన్లకు అనర్హం అన్నట్టుగా దూసుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకే ఈ మిస్ వరల్డ్ పోటీలు టాలీవుడ్కి కూడా ముఖ్యమైన టాపిక్గా మారాయి. టైటిల్ విన్నర్ని అలా ఉంచితే... వీరిలో విభిన్న రకాల టైటిల్స్ను గెలుచుకునే అందగత్తెలు కూడా ఉంటారు. అలాగే అత్యంత అందమైన అమ్మాయి మాత్రమే మిస్ వరల్డ్ కావాలి అని రూలేం లేదు. టైటిల్ గెలుపులో అందంతో పాటు మరెన్నో అంశాలు ప్రాధాన్యత దక్కించుకుంటాయి. కాబట్టి టైటిల్ వేటలో వెనుకబడినా అందంలో అద్భుతం అనిపించే వారూ మరికొందరు కనిపిస్తారు. అలాంటి గ్లామరస్ బ్యూటీస్తో ఒప్పందాలు కుదుర్చుకుంటే తమ ఇంటర్నేషనల్ మూవీస్కి ప్లస్ అవుతారని కొందరు టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారట. మరోవైపు ఇప్పటికే టాలీవుడ్ టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది దాంతో... పలువురు విదేశీ గ్లామర్ క్వీన్స్ సైతం సినిమా ఆకాంక్షల్ని వెంటబెట్టుకుని మన దేశానికి రావడంలో వింతేమీ ఉండదు. కాబట్టి... వారూ తమ టీమ్తో కలిసి తమ వంతు ప్రయత్నాలు చేయరని చెప్పలేం. మొత్తం మీద... తొలిసారి తెలుగు నాట జరుగుతున్న ఈ మిస్ వరల్డ్ పోటీలో టైటిల్ విజేతలు మాత్రమే కాదు వెండి తెరపై టైటిల్స్లో చోటు చేసుకునే విన్నర్స్ కూడా తేలనున్నారు. ఎవరో తెలియాలంటే.. మరో నెల రోజులు ఆగాల్సిందే. -
రూ.4.5 కోట్లు, రూ.75లక్షలు.. బాలీవుడ్ తారల వస్త్రధారణ ఖరీదు
బాలీవుడ్ సినిమాలు అంటేనే రిచ్నెస్కి కేరాఫ్ అన్నట్టుగా ఉంటాయి. ప్రేక్షకుల్ని మెప్పించడానికి ఎన్ని వ్యయ ప్రయాసలకైనా సరే రెడీ అన్నట్టుగా ఉండే బాలీవుడ్ నిర్మాతలు, కేవలం హీరో, హీరోయిన్ల దుస్తుల కోసం రూ.లక్షల నుంచి రూ.కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. గత కొంత కాలంగా పలు బాలీవుడ్ చిత్రాల్లో తారలు ధరించిన అత్యంత ఖరీదైన దుస్తుల వివరాలివే...–షారూఖ్ ఖాన్ నటించిన వన్ సినిమాలో ఆయన ధరించిన రోబో పాత్రకు తగినట్టుగా రోబోటిక్ వస్త్రధారణలో కనిపిస్తారు. సినిమాలో ఈ గెటప్ చాలా కీలకం కావడంతో దీని కోసం రూ.4.5 కోట్లను నిర్మాతలు ఖర్చు పెట్టారట. ఇప్పటి దాకా అత్యధిక వ్యయం చేసిన కాస్ట్యూమ్ ఇదేనని చెప్పొచ్చు. ఈ కాస్ట్యూమ్ డిజైనింగ్లో టాప్ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో పాటు విదేశీ డిజైనర్లు రాబర్ట్ లీవర్ వంటివాళ్లు కూడా పాలు పంచుకున్నారు.–రాధా నాచేగీ అనే పాట కోసం నటి సోనాక్షి సిన్హా అత్యంత ఖరీదైన దుస్తులు ధరించిన ఘనత దక్కించుకుంది. తేవార్ సినిమాలోని ఓ పాట కోసం రూపొందించిన డ్రెస్ విలువ ఏకంగా రూ.75లక్షలని సమాచారం.–సింగ్ ఈజ్ బ్లింగ్లో హీరో అక్షయ్ కుమార్ ధరించిన టర్బాన్ పూర్తిగా స్వఛ్చమైన ప్లెయిన్ గోల్డ్తో తయారు చేశారు. దీని ఖరీదు రూ.65లక్షలు పైనే ఉంటుందట. టర్బాన్ ధరించడాన్ని బాలీవుడ్లో ట్రెండ్గా మార్చింది ఈ సినిమా.–బాజీరావ్ మస్తానీ సినిమాలో చారిత్రక వస్త్ర వైభవాన్ని తెరపై ఆవిష్కరించడానికి డిజైనర్ అంజుమోన్ స్వయంగా చేతితో డిజైన్ చేయగా, దీపిక పదుకునే ధరించిన దుస్తులకు రూ.50లక్షలకు పైనే ఖర్చు అయినట్టు తెలుస్తోంది. ఈ డ్రెస్ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం అచ్చంగా బంగారంతో చేయడం విశేషం.–కంబక్త్ ఇష్క్ సినిమాలో కరీనా కపూర్ ధరించిన సెక్విన్ మినీ డ్రెస్ ను పారిస్ నుంచి తెప్పించారట. అందుకోసం రూ.8లక్షలు ఖర్చు పెట్టారు. టైటిల్ సాంగ్లో ఈ డ్రెస్ ధరించి మెరిసిన కరీనా..కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ను సృష్టించింది.–జోథా అక్బర్లో మొఘల్ దర్పాన్ని ఒలికించేలా హృతిక్ రోషన్ దుస్తుల్ని డిజైన్ చేయడం కోసం దాదాపుగా 18నెలల పాటు డిజైనర్ నీతాలుల్లా శ్రమించారు. అందులో ఒక కాస్ట్యూమ్ కోసం అత్యధికంగా రూ.12లక్షలు ఖర్చు పెట్టారు. ఇదే సినిమాలో ఐశ్వర్యారాయ్ అందంతో పాటు ఆమె వస్త్ర సోయగం కూడా ఇమిడిపోయేలా రూపొందిన ఐశ్వర్య దుస్తుల కోసం రూ.2లక్షలపైనే ఖర్చు చేశారు.–మార్ డాలా అనే పాట దేవదాస్ సినిమాలో సూపర్హిట్. ఆ పాట లో జీవించిన బాలీవుడ్ స్టార్ మాధురీదీక్షిత్ ధరించిన రెడ్ కలర్ దుస్తులు కూడా అంతే హిట్. వీటి ఖరీదు రూ.15లక్షల పైమాటే.–పద్మావతి సినిమా కోసం దీపిక పదుకునే ధరించిన లెహంగా ఏకంగా 30 కిలోల బరువు ఉంటుందట. పూర్తిగా కళాకృతులను ఇముడ్చుకున్న ఈ డ్రెస్... తయారీలో 200 మంది కళాకారులు పాలుపంచుకున్నారట. కిలోల కొద్దీ బంగారాన్ని వినియోగించిన ఈ దుస్తుల కోసం రూ.30లక్షలు ఖర్చు పెట్టారట.–క్రిష్ 3 సినిమా లో కంగనా రనౌత్ ధరించిన దుస్తుల ఖరీదు రూ. కోటి రూపాయలట.. పారిస్ నుంచి ఒక్కోటి రూ.10లక్షల ఖరీదు లాటెక్స్ సూట్స్ ను తెప్పించారు. అలాంటివి 10 సూట్స్ ఈ సినిమాలో ఆమె ధరించింది.–చారిత్రక యుద్ధాల నేపధ్యంలో తీసిన వీర్ సినిమాలో సల్మాన్ ఖాన్ వారియర్గా చూపించే డ్రెస్ ఖరీదు రూ.20లక్షలు. ఈ సినిమాలో యుద్ధవీరునిగా కనిపించే సమయంలో సల్మాన్ ధరించిన దుస్తుల్ని రాజస్థాన్కు చెందిన లెదర్ వర్క్ నిపుణులు తయారు చేశారు. ఒక్కోటి రూ.20లక్షల విలువైన అలాంటి 6 వారియర్ కాస్ట్యూమ్స్ను ఈ సినిమాలో సల్మాన్ ధరించాడు. -
హైదరాబాద్ పబ్లో టాప్ హీరోయిన్... ఊపేస్తోందిగా..
గత ఏడాది లండన్లోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో అతిధులకు అనుకోని షాక్.. అప్పటి దాకా సంగీతం అందిస్తున్న లోకల్ బ్యాండ్ బృందం మధ్యలోకి అనూహ్యంగా దూసుకొచ్చిందో అందమైన యువతి. హఠాత్తుగా మైక్ తీసుకుని పాడడం ప్రారంభించింది. కాసేపట్లోనే అతిధుల హర్షధ్వానాలతో ప్రాంగణం మారుమోగిపోయింది. అప్పట్లో అది అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. ఆమె సాదా సీదా యువతి కాదు మరి...భారత చలనచిత్ర రంగంలో టాప్ హీరోయిన్స్లో ఒకరైన శృతి హాసన్.ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ నటి సరికా ఠాకూర్ కుమార్తె శృతి హాసన్, తెలుగు, తమిళం హిందీ చిత్రాల ద్వారా భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ఆమె రెండు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ఏడు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది. ఇటీవల రజనీకాంత్ నటించి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన రాబోయే చిత్రం కూలీ షూటింగ్ను శ్రుతి హాసన్ పూర్తి చేసింది. ఆమె అంతర్జాతీయ చిత్రం ‘ది ఐ’ ఫిల్మ్ ఫెస్టివల్స్లో సంచలనం సృష్టిస్తోంది.ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఇటీవల భారతదేశంలో వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు నోచుకుంది కూడా. సానుకూల సమీక్షలను అందుకుంటోంది.ఇలా నటనా పరంగా అనేక రకాల సంచనాలను సృష్టిస్తోన్న శృతి...తన పేరును సార్ధకం చేసుకోవాలని అనుకుంటోంది. ఆమె పాటల ప్రపంచంలోనూ తన సత్తా చాటుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చిన్నతనంలోనే సంగీత శిక్షణ పొంది పాడటం ప్రారంభించింది తరువాత తన సొంత బ్యాండ్ను సైతం ఏర్పాటు చేసుకుంది. నటీమణులలో పాడే వారే తక్కువ అంటే స్వంత బ్యాండ్ కూడా ఉన్న ఏకైక హీరోయిన్ ఆమె మాత్రమే ఆమె పలు చిత్రాలకు సైతం పాడింది. ఈ సంవత్సరంలో రాబోయే కూలీ చిత్రంలో ఆమె పాత్రతో పాటు, మిస్కిన్ దర్శకత్వం వహించి సంగీతం అందించిన విజయ్ సేతుపతి రాబోయే చిత్రం ‘ట్రెయిన్‘ కు కూడా ఆమె తన గాత్రాన్ని అందించింది. ‘ఇట్స్ ఎ బ్రేక్ అప్ డా‘ పాట కోసం రెహమాన్ తో కలిసి పనిచేసింది. నటన గానం కాకుండా, శ్రుతి ఒక పాటల రచయిత కూడా. ఆమె ‘ఎడ్జ్,‘ ‘మాన్స్టర్ మెషిన్,‘ ‘ఇనిమెల్‘ వంటి ప్రసిద్ధ సింగిల్స్తో ఇండీ సంగీత రంగంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది.శ్రుతి తన స్పష్టమైన వ్యక్తిత్వం ప్రత్యేకమైన ఫ్యాషన్సెక్షన్కు ప్రసిద్ధి చెందింది.గాయని శ్రుతి హాసన్ మార్చి 28న హైదరాబాద్లోని ప్రముఖ పబ్ కమ్ క్లబ్గా పేరున్న ఓడియం బై ప్రిజంలో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వవలసి ఉంది. వయసు 21 ఏళ్లు అంతకంటే ఎక్కువ ఉన్నవారికి మాత్రమే ప్రవేశం అనే నిబంధనతో ఈ కన్సర్ట్ రాత్రి 8:00 గంటలకు ప్రారంభమై 4 గంటల 30 నిమిషాల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. టిక్కెట్లు ధరలు 1,000 నుంచి ఆపైన...బుక్మై షో ద్వారా విక్రయించారు కూడా అయితే ఏమైంతో ఏమో కానీ... ఆ షో వాయిదా పడింది. ఆ తర్వాత ఏప్రిల్ 28న శృతి హాసన్ ప్రదర్శన ఉంటుందని తిరిగి అనౌన్స్ చేశారు. అది కూడా వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి మే 3న శృతి రానున్నట్టు చెప్పారు. హైదరాబాద్కు రానున్న శ్రుతి, తన అభిమానులను ఆకట్టుకోవడానికి రాక్, సోల్ భారతీయ ప్రభావాల మిశ్రమాన్ని తీసుకువస్తోంది.ఈ నేపధ్యంలోనే శ్రుతి హాసన్ తాజాగా తన రాబోయే ప్రత్యక్ష ప్రదర్శన సన్నాహాల రిహార్సల్ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఆమె బ్యాండ్ సహచరులతో కలిసి ప్రాక్టీస్ సెషన్ లో మునిగిపోతున్న ఈ వీడియో, తెరవెనుక సంగీతం పట్ల ఉన్న ఆమె మక్కువను చూడటానికి అభిమానులకు వీలు కల్పిస్తుంది. తన ఇన్ స్ట్రాగామ్ పోస్ట్లో, శ్రుతి తన తోటి సంగీతకారులకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారిని ’నేరంలో సోదరులు’ అని పేర్కొంది. ఆమె ఇలా రాసింది, ‘మనం ఆ షో చేసి ఉంటే బాగుండేది కానీ చేయలేక పోయాం (మా తప్పు కాదు) కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడటానికి మేం ఇంకా వేచి ఉండలేం. త్వరలో మీ అందమైన ముఖాలన్నీ చూడాలనుకుంటున్నాను. నా అద్భుతమైన సంగీతకారులకు, నేరంలో ఉన్న నా సోదరులకు ఈ సంగీతం ప్రతిధ్వనించే ధైర్యం ఉన్న కొద్దిమంది ఆత్మలకు ధన్యవాదాలు. త్వరలో హైదరాబాద్లో కలుద్దాం, మీకు నా హృదయంలో చోటు ఉందని మీకు తెలుసు‘ అంటూ ఆమె అభిమానులను తన పోస్ట్ ద్వారా ఊరడించింది.ఎప్పుడూ సంగీతం పట్ల మక్కువ కలిగి ఉండే శ్రుతి హాసన్ ఈ సంవత్సరం తన సినిమా కమిట్మెంట్లను నిర్వహిస్తూనే మరిన్ని స్వతంత్ర పాటలను విడుదల చేయనుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రత్యక్ష ప్రదర్శనలకు ఆమె సిద్ధమవుతున్నందున, ఆమె సంగీత ప్రయాణం ఎలా సాగుతుందో చూడటానికి ఆమె అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతానికి, హైదరాబాద్లో ఆమె తొలి షో ఆమె శృతి మ్యూజికల్ జర్నీకి మలుపు కానుంది. -
OTT: రాధికా ఆప్టే బోల్డ్ మూవీ ‘ది వెడ్డింగ్ గెస్ట్’ రివ్యూ
రాధికా ఆప్టే.. అందం, నటనతో ఆకట్టుకునే నటి. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో తన ప్రతిభను చాటుతూ, 'ది వెడ్డింగ్ గెస్ట్' సినిమాతో హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 2019లో విడుదలైంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. ఫ్రెండ్ కోసం పెళ్లికూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చే హీరోలు తెలుగు తెర మీద చాలా మందినే చూశాం. ఈ సినిమాలో హీరో మాత్రం పెళ్లికూతురిని కిడ్నాప్ చేసేది ఫ్రెండ్ కోసం కాదు డబ్బు కోసం. జై (దేవ్ పటేల్) అనే లండన్ వాసి పాకిస్తాన్ లోని లాహోర్ సమీపంలో ఉన్న యోంగానాబాద్ అనే గ్రామానికి చేరుకుంటాడు. అంతకు ముందే తనను ఎవరూ గుర్తించకుండా, సిమ్ కార్డులు, కార్లు మార్చుకుంటూ అక్కడ దాకా వస్తాడు. ఆ తర్వాత రెండు గన్స్ ను కొనుగోలు చేస్తాడు. ఆ గ్రామానికి వచ్చాక పెళ్లికి రెడీ అవుతున్న సమీరా (రాధికా ఆప్టే) అనే యువతిని కిడ్నాప్ చేస్తాడు. ఆ క్రమంలో అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డ్ని హత్య చేయాల్సి వస్తుంది. ఆమెను దేశం దాటించి తీసుకువెళ్లడానికి ముందు...ఆమె ప్రేమికుడు దీపేశ్ (జిమ్ సర్భ్) తనతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఈ పనిచేయించాడనే విషయం జై బయటపెడతాడు.ఆ తర్వాత ఇద్దరూ కలిసి మారుపేర్లతో , దొంగ పాస్పోర్ట్లతో ఇండియాకు వస్తారు. అయితే సెక్యూరిటీ గార్డ్ హత్య కారణంగా ఈ కిడ్నాప్ రెండు దేశాల మీడియాలో వైరల్ అవుతుంది, దాంతో సమీరా ప్రేమికుడు దీపేశ్ భయపడతాడు, సమీరాను తిరిగి పాకిస్తాన్ కు పంపేయమని దేవ్ని కోరతాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు సన్నిహితంగా గడిపిన జై, సమీరా మధ్య అనుబంధం పెరుగుతుంది. ముఖ్యంగా సమీరా అతనిపై మోజుపడుతుంది. వారిద్దరూ శారీరకంగా ఒకటవుతారు. అదే సమయంలో దీపేశ్ దగ్గర ఖరీదైన వజ్రాలు ఉన్నాయని తెలుసుకున్న జై, వాటిని పొందేందుకు ప్రయత్నిస్తాడు. రకరకాల మలుపుల మధ్య సాగే ఈ లవ్–క్రైమ్–రొమాంటిక్ కథ చివరికి ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది.జై పాత్రలో మిస్టీరియస్ ప్రొఫెషనల్ కిల్లర్గా జై పూర్తి గా మెప్పిస్తాడు. బోల్డ్ సీన్లకు పెట్టింది పేరైన రాధికా ఆప్టే(తెలుగులో లెజెండ్లో బాలకృష్ణ సరసన హీరోయిన్) ఈ సినిమా హాలీవుడ్ రూపకర్తల సమర్పణలో రావడంతో...పూర్తి స్థాయి హాలీవుడ్ హీరోయిన్లా రెచ్చిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్లలో ఆమె దాదాపు పూర్తి న్యూడ్గా కనిపించడం విశేషం.హాలీవుడ్ చిత్రం చేసినప్పటికీ మన ఇండియన్ హీరోయిన్లు మరెవ్వరూ ఈ స్థాయిలో బోల్డ్ సీన్స్ చేసి ఉండరు... సమీరా పాత్ర భావోద్వేగాలను కూడా బాగా ప్రదర్శించింది. ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ మరో ఆకర్షణ. పాకిస్తాన్, ఇండియా మధ్య ప్రయాణం, మారుమూల ప్రాంతాల చిత్రీకరణ బాగా చూపించారు. సంగీత పరంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ మూమెంట్లను ఎలివేట్ చేస్తుంది. అక్కడక్కడా సాగదీసినట్టు అనిపించినా.. ఆ ఫీలింగ్ ముదరకముందే ఆసక్తికరమైన మలుపులు పేర్చుకుంటూ రావడం వల్ల ఎక్కడా బోర్ కొట్టదు. ఐఎమ్డిబి 6.0 రేటింగ్ ఇచ్చిన ఈ సినిమా ఓ కాలక్షేపం యాక్షన్, థ్రిల్లర్, లవ్, రొమాంటిక్ సీన్లను ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది. చూడాలనుకున్నవారు నెట్ఫ్లిక్స్లో చూడవచ్చు. -
అభినయమే ఆభరణం.. నటీనటులకు నగలతో అనుబంధం
పెళ్లి అయినా పేరంటమైనా అయినా నగలు అలంకరించుకోవాల్సిందే అంటారు ఆభరణాల ప్రియులు.. అభినయమైనా, ఆభరణమైనా నటులు ఉండాల్సిందే అంటున్నారు ప్రచార వ్యూహాల రూపకర్తలు. తారలు ఆభరణాల లేబుల్ల మధ్య అనుబంధం నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పాలి. కళ్యాణం అనగానే పెళ్లి మాత్రమే కాదు కళ్యాణ్ జ్యుయలర్స్ ప్రకటన కూడా గుర్తొస్తుందంటే కారణం... నాగార్జున అని చెప్పొచ్చు, అమితాబ్ బచ్చన్ అని కూడా చెప్పొచ్చు. దేశంలోని బంగారు ఆభరణాల వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాలు దాదాపు 37% వాటాను కలిగి ఉన్న నేపధ్యంలో ఈ బ్రాండ్ తమిళనాడులో ప్రభు గణేషన్, తెలుగు రాష్ట్రాల కోసం అక్కినేని నాగార్జున, కన్నడిగుల్ని మెప్పించడానికి...శివరాజ్కుమార్, మంజు వారియర్... ఇలా నలుగురు ప్రధాన తారలతో ఒప్పందం కుదుర్చుకుంది .నమూనాలు, శైలులు, సున్నితత్వాలు ప్రాధాన్యతలు మన దేశంలో ఉన్న భాషలు మాండలికాలు విభిన్నంగా ఉంటాయి. అందుకే మా బ్రాండ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతీయ బ్రాండ్ అంబాసిడర్ని ఎంపిక చేసిందని కళ్యాణ్ జ్యువెలర్స్ మార్కెటింగ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ అంటున్నారు. భారతీయ బంగారు ఆభరణాల మార్కెట్లో పశ్చిమ భారత రాష్ట్రాలు 32% వాటా కలిగి ఉన్నందున ఇదే బ్రాండ్ బాలీవుడ్ నుంచి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కత్రినా కైఫ్లను ఎంపిక చేసింది. గతంలో ఈ బ్రాండ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ సోనమ్ కపూర్ వంటి వారితో కూడా జట్టు కట్టింది.బంగారం వెలిగిపోతోంది.. ఆభరణాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాగే తారలతో ఆభరణాల బ్రాండ్స్ అనుబంధం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. టాలీవుడ్ హీరో యంగ్టైగర్ ఎన్టీయార్ మలబార్ గోల్డ్లో మెరిశారు. ఇక రామ్ చరణ్ భీమా జ్యుయలర్స్కు బ్రాండ్ అంబాసిడర్గా కనిపిస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు కుమార్తె సితార సైతం ప్రముఖ ఆభరణ బ్రాండ్ పిఎంజె జ్యుయల్స్కు అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. గతంలో గానీ ప్రస్తుతం గానీ... చూసుకుంటే బ్రాండ్ అంబాసిడర్స్గా కావచ్చు కలెక్షన్లను ఆవిష్కరించిన సెలబ్రిటీలుగా కావచ్చు... ర్యాంప్ మీద ఆభరణాలను ప్రదర్శించి కావచ్చు..విభిన్న రకాలుగా అనేక మంది నటీనటులు నగధగలకు తమ స్టార్ డమ్ మెరుపులను జత చేశారు.ఒక్కసారి పరిశీలిస్తే...నటి తమన్నా భాటియా వైట్ అండ్ గోల్డ్ బ్రాండ్ను స్వయంగా లాంచ్ చేసింది. అంతేకాదు ఆమె హెడ్ డిజైనర్గానూ పనిచేస్తోంది. గతంలో ఓ ఆభరణాలను తాకట్టుపెట్టుకునే మరో బ్రాండ్కు ఆమె ప్రచారం చేసింది. బాలీవుడ్ నటి దిశా పటానీ రిలయన్స్ జ్యువెల్స్ రూపొందించిన మధ్యప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబింబించే ’వింధ్య కలెక్షన్’ను ఆవిష్కరించారు. త్రిభువన్ దాస్ భీమ్జీ జువేరీ తమ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ను నియమించుకుంది. భీమా జ్యువెలర్స్కు మొదటి బ్రాండ్ అంబాసిడర్గా టాలీవుడ్, బాలీవుడ్ నటి పూజా హెగ్డే పనిచేస్తే, బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది. అంతగా పాప్యులర్ కాని ఓ మోస్తరు నటీమణులను సైతం బ్రాండ్స్ ఎంపిక చేసుకోవడం విశేషం. వెడ్డింగ్ పులావ్, గులాబీ లెన్స్ వంటి సినిమాల్లో పలు వెబ్సిరీస్లలో నటించిన అనుష్కా రంజన్ వరుణ డి జానీ అనే ఆభరణ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా మెరిసింది. ఖన్నా జ్యువెలర్స్ నగల ప్రచారంలో నటి చిత్రాంగద సింగ్ పనిచేసింది.కలెక్షన్స్ విడుదల్లోనూ...బ్రాండ్ అంబాసిడర్గా చేయడంతో పాటు కేవలం ఒక కలెక్షన్స్ను మాత్రమే ప్రదర్శించడం, విడుదల చేయడం వంటివి కూడా తారలు చేస్తున్నారు.తాప్సీ పన్ను రిలయన్స్ జ్యువెల్స్ ’తంజావూర్ కలెక్షన్’ను లాక్మీ ఫ్యాషన్ వీక్లో ప్రదర్శించారు. జాన్వీ కపూర్ సైతం అంతకు ముందే ఈ తంజావూర్ కలెక్షన్ను పరిచయం చేశారు. బెంగాలీ నటి రితాభారి చక్రబర్తి గత ఏడాది కల్యాణ్ జ్యువెలర్స్ అక్షయ తృతీయ ప్రత్యేక కలెక్షన్స్ను ప్రారంభించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి పిసి జ్యువెలర్స్ బంగారు ఆభరణాలు సతీసమేతంగా ప్రదర్శించాడు. బంగారు ఆభరణాలను మాత్రమే కాదు బంగారంతో అనుబంధం ఉన్న ప్రతీ దాంట్లో తారలు తళుక్కుమంటున్నారు. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫారమ్ అయిన ప్లస్ గోల్డ్ కు సోనాక్షి సిన్హా ప్లస్ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసింది. అలాగే బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకునే ముత్తూట్ ఫైనాన్స్కు టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ జట్టు కట్టారు.ప్రతి పండుగ సీజన్లో మాదిరిగానే అక్షయ తృతీయ రోజున ప్రింట్ మీడియా సిటీ హోర్డింగ్లలో గోల్డ్ ఫీవర్ కనిపిస్తుంది. విలాసవంతమైన, మెరిసే ఆభరణాలను ధరించిన బాలీవుడ్, దక్షిణ భారత సినిమాలకు చెందిన తారల ప్రకటనలతో నిండిపోతాయిు. అయితే ఒక సెలబ్రిటీ పని బ్రాండ్ తాజా కలెక్షన్స్ను ప్రదర్శించేందుకు పోజులివ్వడమే కాదు – ఇది సీజన్ ట్రెండ్లు సమయాలు సందర్భాలను దృష్టిలో ఉంచుకుని వీరు తప్పనిసరిగా సోషల్ మీడియాలో బ్రాండ్ గురించి మాట్లాడాలి బ్రాండ్ ఆభరణాలను ధరించి ఈవెంట్స్లో కనిపించాలి. ఒప్పందాల గోప్యత కారణంగా సెలబ్రిటీ ఎండార్స్మెంట్ల కోసం కేటాయించిన ఖర్చుల గురించి చాలా బ్రాండ్లు పెదవి విప్పడం లేదు. అయితే ప్రతి ప్రచారానికి సెలబ్రిటీని బట్టి కనీసం రూ. 20 లక్షల నుంచి రూ. 1 కోటి అంతకంటే ఎక్కువ ముట్టచెబుతారని పరిశ్రమలోని సీనియర్లు చెబుతున్నారు. -
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్తో తెరమరుగు..
కెరీర్ను అందుకునే క్రమంలో బహుశా అతను సాధించినన్న రికార్డ్స్ మరే హీరో సాధించి ఉండడు. అత్యంత పిన్న వయసులో నటుడు, అత్యంత పిన్న వయసు హీరో, అత్యంత పిన్న వయసు స్టార్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తొలి సినిమా హీరో... హిందీ, తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ..అన్ని భాషల్లోనూ స్వల్ప వ్యవధిలోనే 280 చిత్రాలు చేసిన హీరో...పాతికేళ్ల వయసులోనే ఇన్ని సాధించాడంటే ఇప్పుడెలా ఉండాలి? ఏభై ఏళ్ల వయసులో ఎంత గొప్ప స్థాయిలో ఉండాలి? ఎంత ఉన్నత స్థాయిలో ఉండాలి? కానీ అడ్రెస్ కూడా లేకుండా పోవడం ఏమిటి?అది 90వ దశకం.. భారతీయ సినీ పరిశ్రమకు ఒక మార్పు కాలం. ప్రధాన సినిమాలల్లో స్థిరపడిన తారల వయసు ముదిరిపోతుండగా, వారి స్థానాన్ని భర్తీ చేయడానికి యువ నటీనటులను పెద్ద సంఖ్యలో పరిచయం చేసిన కాలం. అలా తెరపైకి వచ్చిన యువతలో, అప్పుడే 15ఏళ్ల వయసులో హీరోగా అడుగుపెట్టిన ఒక యువ నటుడు ప్రత్యేకంగా నిలిచాడు అతడే హరీష్ కుమార్ (Harish Kumar), తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన హరీష్. బాలనటుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి ప్రధానంగా తెలుగు సినిమాల్లో నటించిన హరీష్, కొన్ని హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించాడు. ఆ తర్వాత 1988లో, కేవలం 13ఏళ్ల వయసులోనే హీరో పాత్రలు పోషించడం మొదలుపెట్టాడు. దివంగత నిర్మాత రామానాయుడు 1990లో తీసిన ‘ప్రేమ ఖైదీ‘ తెలుగు సినిమాతో అప్పటి యూత్ని ఒక ఊపు ఊపాడు. తరువాతి ఏడాది, ఈ సినిమా హిందీ రీమేక్ లో కూడా నటించాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ తొలి సినిమా విజయం సాధించింది. హరీష్–కరిష్మా కపూర్ (అప్పుడు ఇద్దరికీ 16ఏళ్లు) జోడీ ప్రేక్షకులకు ఎంతో నచ్చింది.తర్వాతి కాలంలో, ‘తిరంగా‘, ‘కాలేజ్ బుల్లోడు‘ వంటి విజయవంతమైన చిత్రాల్లో హరీష్ నటించాడు. ఆ సమయానికి, హరీష్ను హిందీ తెలుగు సినిమాల్లో ఉన్న అత్యుత్తమ యువ నటుల్లో ఒకరిగా గుర్తించారు. కొందరు ఆయనను షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ తదనంతర స్టార్గా కూడా భావించారు. కానీ తర్వాత తర్వాత హరీష్కు పూర్తిస్థాయి హీరోగా అవకాశాలు రాకున్నా మంచి పాత్రలే వచ్చాయి. టాప్ స్టార్స్ అయిన రజనీకాంత్, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నానా పాటేకర్, గోవిందా ల చిత్రాల్లో హరీష్ రెండవ హీరో, చిన్న పాత్రలకే పరిమితం అయ్యాడు.‘ద జెంటిల్మన్‘, ‘కూలీ నం.1‘, ‘హీరో నం.1‘ వంటి హిట్ చిత్రాల్లో నటించాక, 2001 ప్రాంతంలో అకస్మాత్తుగా తెరమరుగైన హరీష్... తిరిగి పదేళ్ల తర్వాత తెరపై కనిపించాడు. ఓ పుష్కర కాలం క్రితం ‘నాటీ ః 40‘, ‘చార్ దిన్ కి చాంద్ని‘ వంటి ఫ్లాప్ చిత్రాలతో తిరిగి సినిమాల్లో ప్రయత్నించాడు.ఆ తర్వాత ఏడేళ్ల క్రితం‘ఆ గయా హీరో‘ అనే చిత్రంలో గోవిందాతో కలిసి చివరిసారి తెరపై కనిపించాడు. ఏమైందో తెలీదు గానీ హరీష్ సినిమా జర్నీ ఎంత ఉధృతంగా మొదలైందో అంతే అకస్మాత్తుగా ముగిసింది.అందగాడని, ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు అని, డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేస్తాడని మంచి పేరు తెచ్చుకున్న హరీష్..సినిమా కెరీర్ను వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులే నాశనం చేశాయని అంటారు. ఆయన ప్రేమ, పెళ్లి కూడా ఆయన సమస్యలకు కారణం అని కూడా కొందరు చెబుతారు.అయితే కొంత కాలం క్రితం ఆయన ఓ ఇంటర్వ్యూలో తన సినీ రంగం విడిచిపెట్టడానికి గల అసలు కారణం గురించి మాట్లాడాడు. చిన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదంలో గాయపడిన తాను సంవత్సరాల తరబడి చికిత్స చేయించుకోకపోవడం వల్ల, సీరియస్ బ్యాక్ ప్రాబ్లెమ్కి గురయ్యాడని చెప్పారు. ‘ లంబార్ వెరిబ్రా ఎల్3 ఎల్5 ప్రాంతాల్లో స్లిప్డ్ డిస్క్ ఏర్పడింది. దీనివల్ల నడక కూడా కష్టమైంది. ఆ సమయంలో నేను చాలా నిర్లక్ష్యంగా ఉండి, గాయాన్ని గుర్తించలేకపోయాను. ఆపరేషన్ కూడా చేయించుకోవాలనుకోలేదు,‘ అని హరీష్ చెప్పాడు.చివరికి చికిత్స తీసుకున్న తరువాత, నెలల తరబడి మంచం మీద ఉండాల్సి వచ్చిందని, ఆ లోపు పరిశ్రమ తనను దాటి వెళ్లిపోయిందని హరీష్ తెలిపారు. ‘డాక్టర్ మొదట రెండేళ్ల పాటు పని చేయకూడదని చెప్పాడు. ఆ తర్వాత అలా అలా తెలియకుండానే పరిశ్రమ నుంచి మాయం అయ్యాను,‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హరీష్ ప్రశాంత జీవితం గడుపుతున్నాడు. ‘నేను ఇంకా భారత్లోనే ఉన్నాను – చెన్నై, హైదరాబాద్, ముంబైలలో ఎక్కువగా ఉంటాను. సినిమా రంగం విడిచిన విషయం చాలా వ్యక్తిగతమైనది. దీనిపై ఎక్కువగా మాట్లాడాలని ఇష్టం లేదు,‘ అని హరీష్ స్పష్టం చేశాడు. -
బన్నీ,చెర్రీ ఫైట్..ఫ్యాన్స్ ‘కోలా’హలం తప్పదా?
ఇది వేసవి సూర్యుడు ప్రచండ భానుడై ప్రతాపం చూపే సమయం. దాంతో జనమంతా చల్లని పానీయాలకు జై కొట్టే సమయం. సాధారణంగానే కూల్ డ్రింక్స్ అమ్మకాలు పీక్స్లో ఉండే ఈ టైమ్లో అత్యధిక వ్యాపారాన్ని దక్కించుకోవాలని కోలా బ్రాండ్స్ తహతహలాడుతాయి. రకరకాల ప్రకటనల ద్వారా దాహార్తి నిండిన గొంతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. దాంతో ఈ సీజన్ ఆసాంతం ప్రకటనల ‘కోలా’హలంతో నిండిపోతుంది.వేసవి వచ్చినప్పుడల్లా కూల్ డ్రింక్స్ బ్రాండ్స్ మధ్య ఆధిపత్య పోరు ఆటోమేటిక్గా వేడెక్కడం కోలా కంపెనీల్లో రివాజు. అది ఈ సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈ సారి ఆధిపత్య పోరు బ్రాండ్స్తో ఆగేటట్టుగా లేదు. ఇప్పటికే ఇద్దరు టాలీవుడ్ అగ్రనటుల మధ్య సాగుతున్న ఆధిపత్యపోరు దీనికి జతయ్యేట్టుగా ఉంది. దానికి కారణం పుష్ప, పెద్దిలే...అదేనండీ.. అల్లు అర్జున్, రామ్చరణ్లే.పుష్ప తో ఆల్ ఇండియా స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ (Allu Arjun) ఇమేజ్ని క్యాష్ చేసుకోవాలని ఎన్నో కంపెనీలు ఉవ్విళ్లూరాయి. అదే క్రమంలో ప్రముఖ కూల్ డ్రింక్ బ్రాండ్ థమ్స్ అప్ తన దక్షిణాది బ్రాండ్ అంబాసిడర్గా అల్లు అర్జున్ ని ఎంచుకుంది. పుష్పరాజ్తో... చాలా ఉత్తేజకరమైన ఎనర్జిటిక్ వీడియోలను తయారు చేసి విడుదల చేసింది. అవి బాగా జనంలోకి దూసుకెళ్లాయి కూడా. అయితే ఇప్పుడు థమ్స్ అప్కి ప్రత్యర్ధిగా ఉన్న క్యాంపా కోలా...బన్నీకి ధీటైన మరో నటుడి గురించి సాగించిన అన్వేషణ మరో టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ దగ్గర ఆగింది. తాజా ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఈ కోలా బ్రాండ్ ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది.ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్ అనిపించుకున్న రామ్చరణ్ (Ram Charan) ను క్యాంపాకోలా తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడం కూల్గా మాట్లాడుకోవాల్సిన కూల్ టాపిక్ను వేడి వేడిచర్చలకు కేంద్ర బిందువైన హాట్ టాపిక్గా మార్చింది.ప్రస్తుతం మెగా , అల్లు కుటుంబాల బంధం మధ్య బన్నీ, చెర్రీలనే అడ్డుగీతలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. రామ్ చరణ్, అల్లు అర్జున్ పరస్పరం ఎడముఖం పెడముఖంగా ఉన్నారు అనడం చాలా చిన్నమాట. బయటకు చెప్పకున్నా, సోషల్ మీడియాలో అన్ఫాలోల దగ్గర నుంచి ఫాలోయర్స్, ఫ్యాన్స్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం వరకూ బన్నీ, చెర్రీల వార్... గట్టిగా నడుస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో రెండు బలమైన కూల్ డ్రింక్ బ్రాండ్స్ కాంపా కోలా, థమ్స్ అప్ లకు వారు అంబాసిడర్లుగా ఎంపిక కావడంతో ఈ వైరం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపధ్యంలో ఈ రెండు బ్రాండ్స్ భవిష్యత్తులో రూపొందించే ప్రకటనలు ఫ్యాన్స్ మధ్య ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తాయో.. ఎంత హీట్ తెస్తాయో.....చూడాలి.మరోవైపు క్యాంపా కోలా ప్రకటనలు రామ్ చరణ్ స్టార్ స్టేటస్పై ఎక్కువగా ఆధారపడి రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా మగధీర, ఆర్ఆర్ఆర్ లలోని ప్రసిద్ధ సినిమా సన్నివేశాలను ఇవి వాడుకుంటున్నాయి. -
ఐటమ్ సాంగ్స్లో స్టార్ హీరోయిన్లు.. అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికంటే..?
పాటలు నృత్యాలు. అలాగే డ్యాన్స్ నంబర్లు 30వ దశకంలో టాకీల రోజుల నుంచే భారతీయ చలనచిత్రంలో భాగమయ్యాయి . వ్యాంప్ కేరెక్టర్లకు పరిమిమైన వారు మాత్రమే కాకుండా ఏకంగా హీరోయిన్లు ఈ తరహా నృత్యాలు చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి వీటిని కాస్త హుందాగా ఐటెమ్/స్పెషల్ సాంగ్స్ లేదా ప్రత్యేక నృత్యాలుగా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ ఐటెం సాంగ్(Item Song)లు సినిమాల విజయాలకు చాలా కీలకమైనవిగా మారాయి. దాంతో పాటే ఈ తరహా నృత్యాల కోసం డ్యాన్సర్లు, హీరోయిన్లు వసూలు చేసే రెమ్యూనరేషన్ కూడా ఆకాశాన్ని అంటింది.బాలీవుడ్కి చెందిన నోరా ఫతేహి వంటి ప్రముఖ డ్యాన్సర్లు ఒక్కో పాటకు 2 కోట్ల రూపాయల చొప్పున, సన్నీ లియోన్ కూడా అంతే మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్లో కెవ్వు కేక అంటూ కేక పెట్టించిన మలైకా అరోరా పాటకు రూ. 50 లక్షల నుంచి 1కోటి వరకు వసూలు చేస్తూ ఇప్పుడు కాస్త వెనకడుగులో ఉంది.ప్రముఖ నటీమణులు ఈ డ్యాన్స్ నంబర్లకు వసూలు చేస్తున్న మొత్తాలు వారి డ్యాన్స్ సామర్థ్యాల కంటే చాలా ఎక్కువ అనేది వాస్తవం. అయితే డ్యాన్స్ ప్రతిభ కన్నా తమ స్టార్ పవర్ను వీరు ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. కరీనా కపూర్ ఐటెం సాంగ్ చేసేటప్పుడు రూ. 1.5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసేదట. , కత్రినా కైఫ్ ఒక్కో పాటకు 2 కోట్ల రూపాయలకు పైగా అందుకుందట. ఈ తరహా పాటలకు పేరొంది అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రతి పాటకు రూ. 3 కోట్లు తీసుకుంటుంది. దబిడి దిబిడి భామ ఊర్వశి రౌతాలా కూడా అంతే మొత్తం అడిగేది..ఇప్పుడు మరింత ఎక్కువ డిమాండ్ చేస్తోంది. సినీ పండితుల సమాచారం ప్రకారం, తమన్నా భాటియా, జాన్వీ కపూర్, పూజా హెగ్డే, తాప్సీ పన్ను వంటి వారు ఇప్పుడు ఐటమ్ నెంబర్స్లో డిమాండ్లో ఉన్నారు.ఈ కోవలో నిన్నా మొన్నటి దాకా అత్యధిక పారితోషికం అందుకున్న రికార్డ్ నటి సమంత పేరిట ఉంది. ఆమె పుష్ప ది రైజ్లో ఊ అంటావా పాట కోసం అత్యధిక మొత్తం వసూలు చేసినట్లు సమాచారం. ఒక సినిమాలో ఒక్క ఐటమ్ సాంగ్ చేయడం ద్వారా ఆ సినిమా మొత్తం కనిపించిన హీరోయిన్ కన్నా ఎక్కువ మొత్తం అందుకుందీమె. పుష్పలో హీరోయిన్గా నటించిన రష్మిక మందన్న మొత్తం సినిమాకి కేవలం రూ. 2 కోట్లు మాత్రమే తీసుకుంటే. అయితే ఊ అంటావా పాట కోసం సమంత రూ. 5 కోట్ల పారితోషికాన్ని రాబట్టిందట.ఇటీవలి కాలంలో తమన్నా ఐటమ్ ట్రెండ్స్లోకి అనూహ్యంగా దూసుకొచ్చింది. తెలుగులో స్వింగ్ జర స్వింగ్ జర అంటూ జూనియర్ ఎన్టీయార్ పక్కన మెలికలు తిరిగిన ఈ మిల్కీ బ్యూటీ అలా మొదట్లో రూ.కోటిలోపే తీసుకుంటూ అప్పుడప్పుడు ఐటమ్గాళ్ గా కనిపించినా...ఇప్పుడు స్పెషల్ సాంగ్ అంటే తానే గుర్తొచ్చేంతగా ఎదిగిపోయింది. దీనికి వరుసగా ఆమె ఐటమ్ సాంగ్స్ హిట్ కావడమే కారణం. రూ.3కోట్లు తీసుకుని జైలర్ లో ‘నువ్వు కావాలయ్యా..దా’ పాటలో ఊపేసిన తమన్నా సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ వీడియోలకు బోలెడంత ఫీడ్ అందించింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమా స్త్రీ 2 ఆమెని మరింత అందనంత ఎత్తుకి తీసుకెళ్లింది. ఆ సినిమాలోని ఆజ్కి రాత్... పాట ఉత్తరాది ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోవడంతో తాజాగా రైడ్ 2లో చేసిన ఐటమ్ సాంగ్ కోసం రూ.5కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ చేసే హీరోయిన్లలో తమన్నా భాటియా అత్యధిక మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్గా నిలిచింది. -
నాన్సెన్స్ అంటున్నా... కుర్రహీరోయిన్లతో ఆగని సీనియర్ హీరోల రొమాన్స్..!
‘‘అవును రష్మికతో చేస్తున్నా..తర్వాత ఆమె కుమార్తెతో కూడా నటిస్తా..మీకేంటి ప్రాబ్లమ్?’’ అంటూ తీవ్ర స్వరంతో అడిగిన సల్మాన్ఖాన్ ప్రశ్నలో విసుగును గమనించారా? మన దేశంలో అనేక భాషలకు చెందిన వయసు పైబడిన హీరోలు అందరిలో పైకి కనపడని చిరాకులకు అది ప్రతిరూపంగా చెప్పొచ్చు. కొంత కాలంగా సీనియర్ హీరోలు తమకు జోడీ కడుతున్న హీరోయిన్ల విషయంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్కు గురవుతున్నారు.వృధ్ధాప్యానికి చేరువలో ఉన్న నటులు తమకన్నా చాలా తక్కువ వయస్సు గల మహిళా కథానాయకులతో జతకట్టడం అనేది ఇటీవల తరచూ వివాదాలు విమర్శలకు కారణమవుతోంది. కొందరు దీనిని దీనిని వృత్తి పరమైన అంశంగా సమర్థిస్తున్నారు. మరికొందరు, ఇది హానికరమైన మూస పద్ధతులను కొనసాగిస్తుందని వయసు పెరిగిన నటీమణులకు అవకాశాలను పరిమితం చేస్తుందని వాదిస్తున్నారు.తమ కన్నా బాగా తక్కువ వయసు ఉన్న వారితో రొమాంటిక్ పాత్రలలో పెద్ద వయసున్న మగవాళ్లు నటించడం అనేది ఈనాటిది కాదు ఇది ఎప్పటి నుంచో సర్వసాధారణంగా మారింది.. అయితే చర్చా వేదికలు పెరగడం, భావ వ్యక్తీకరణ మార్గాలు విస్త్రుతం కావడంతో ఇప్పుడు ఈ తరహా రొమాన్స్ను నాన్సెన్స్గా తిట్టిపోయడం కూడా పెరుగుతోంది.ఒకప్పుడు సీనియర్ హీరోలుగా ఉన్న ఎన్టీయార్, ఏయన్నార్లు తమ కన్నా చాలా చిన్న వయసు అమ్మాయిల పక్కన నటించినా...ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనపడవు. అదేపని ఇప్పుడు సీనియర్ హీరోలైన బాలకృష్ణ, నాగార్జునలు చేస్తే మాత్రం విమర్శకులు నోళ్లకు పదను పెడుతున్నారు. అందుకే బాలకృష్ణ గత కొంత కాలంగా హీరోయిన్లతో రొమాన్స్ చేసే పాత్రలకు బదులు తన వయసుకు తగ్గ పాత్రలతో సరిపెట్టుకుంటున్నాడు. వయసు కనపడనీయని నాగార్జున మన్మధుడు 2లో రకుల్కి ముద్దొచ్చాడేమో కానీ... మరోవైపు విమర్శకుల నోటికి బాగా పనిచెప్పాడు. అలాగే హీరో రవితేజ కూడా గత కొంత కాలంగా ఇదే విషయంలో విమర్శలు ఎదుర్కుంటున్నాడు.హీరోలు తమకన్నా కనీసం 20 ఏళ్ల వయసు తక్కువ ఉన్న యువతులతో నటించడం బాలీవుడ్లో సర్వసాధారణం. ఎప్పుడో 1980లలోనే దయావన్ లో వినోద్ ఖన్నా తనకన్నా 21 ఏళ్ల చిన్నదైన మాధురి దీక్షిత్తో ఆన్స్క్రీన్ రొమాన్స్ చేశాడు. నిశ్శబ్ద్లో, సీనియర్ అమితాబ్ బచ్చన్ తన కంటే 46 ఏళ్లు చిన్న వయస్సులో ఉన్న జియాఖాన్ తో కలిసి నటించాడు. ఇక దీపికా పదుకొణె ఓం శాంతి ఓం చిత్రంలో తనకన్నా 20 ఏళ్ల సీనియర్ షారూఖ్ ఖాన్ పక్కన తెరంగేట్రం చేసింది. కాగా, రబ్ నే బనా ది జోడిలో అరంగేట్రం చేసిన అనుష్క శర్మ షారూఖ్ కంటే 23 ఏళ్లు చిన్నది. గజినిలో అమీర్ ఖాన్, సహ నటి కంటే 20 సంవత్సరాలు పెద్దవాడు. 44 ఏళ్ల అజయ్ దేవగన్ 23 ఏళ్ల తమన్నాతో కలిసి హిమ్మత్వాలా చేశాడు.ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నో సినిమాలు కనిపిస్తాయి. అయితే ఈ ట్రెండ్ తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతోన్నట్టు కనిపిస్తోంది. సల్మాన్ఖాన్ ఏక్ థా టైగర్లో తనకన్నా 19 ఏళ్లు చిన్నదైన కత్రినా కైఫ్తో నటించాడు. దబాంగ్లో 20 ఏళ్ల చిన్నదైన సోనాక్షి సిన్హా తో నటించాడు. ఇప్పుడు ఏకంగా తనకన్నా 32ఏళ్ల చిన్నదైన రష్మిక మందన్నతో జోడీ కట్టాడు. మరోవైపు మన మెగాస్టార్ చిరంజీవి కూడా తన సమకాలీకుడైన కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్తో స్టెప్స్ వేయడం చూశాం.ఈ పరిస్థితి మారాలని, హీరోలు వయసుకు తగినట్టుగా తమ జోడీలను ఎంచుకోవాలనే డిమాండ్ ఎప్పుడూ లేనంత స్థాయిలో వినిపిస్తోంది. పాత చింతకాయ పచ్చడి లాంటి రొడ్డకొట్టుడు ధోరణికి చెక్ పెట్టాలని, వయసు పెరుగుతున్న నటీమణులకు అవకాశాలను పరిమితం చేయడం సరైంది కాదని అంటున్నారు. ఇప్పటికీ మాధురీ దీక్షిత్ నటిస్తున్నా ఆమె సల్మాన్ సరసన హీరోయిన్గా నటించే అవకాశాల్లేవు అలాగే సుహాసిని, రాధిక తదితరులు ఉన్నా వారు చిరంజీవి, బాలకృష్ణల పక్కన హీరోయిన్స్గా ఎంపిక కాలేదు.. ఈ పరిస్థితి హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ డాళ్ అనే పాత కాలపు ధోరణికి బలం చేకూరుస్తోందనే వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. ఏదేమైనా ఎప్పుడూ లేనంత బలంగా వినిపిస్తున్న విమర్శలు... సీనియర్ హీరోల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో...చూడాలి. -
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
బాలీవుడ్ సినిమా ప్రేక్షకలోకానికి ఆషికి అనే సినిమా ఓ గొప్ప ప్రేమ కావ్యం. ఆ సినిమా విజయం ఎంత గొప్పది అంటే.. ఆ సినిమా పేరు గుర్తుకురాగానే ఆ సినిమాలో జీవించిన నటీనటులు కళ్ల ముందు సిసలైన ప్రేమ చిహ్నాల్లా మెరుస్తారు. ఆ సినిమా, ఆడియో ఆల్బమ్ వయసు పాతికేళ్లు కానీ... ఇప్పటికీ ఆ పాటల్ని వినకుండా ఉండలేని ప్రేక్షక–ప్రేమాభిమానులు ఎందరో..నటీ నటులు అనుఅగర్వాల్, రాహుల్ రాయ్లతో సహా ఆ చిత్రంలో పాలు పంచుకున్న ఎందరికో ఆషికి తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చింది.అంత చరిత్ర ఉన్న ఆషికికి ఇప్పటికే ఒక సీక్వెల్ వచ్చి విజయవంతం అయింది. ఇప్పుడు మరోసారి ఆ సినిమాకి సీక్వెల్ తయారవుతోంది. ఈ ఆషికి 3(Aashiqui 3 Movie )లో బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి ఎదిగిన శ్రీలీల(sreeleela) నటిస్తోంది. ఈ నేపధ్యంలోనే తొలి ఆషికి సినిమా కధానాయిక నటి అను అగర్వాల్(Anu Agarwal), తన ఆలోచనలను పంచుకున్నారు. తనకు ఆషికి లో పాత్ర ఎంతగా మనసుకు హత్తుకు పోయిందో వెల్లడించారు. ఆషికి అనేది కేవలం తెరపై నటించిన మరో పాత్ర మాత్రమే కాదని– అది తన హృదయ స్పందన అని ఆమె పేర్కొన్నారు.తాను ఆషికీలో తొలిసారి భాగంగా మారినప్పుడు ఆ సమయంలో అది అంత గొప్ప చిత్రం కాదనీ. అప్పటికి దర్శకుడు మహేష్ భట్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్గా పేరు తెచ్చుకోలేదనీ, తన మొదటి మెయిన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్లోకి అడుగుపెట్టిన ఒక ఆర్ట్ హౌస్ డైరెక్టర్. మాత్రమే నని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆషికి నేను పనిచేసిన ఓ చిత్రం మాత్రమే కాదు, ఇది నన్ను నేను రూపొందించడంలో నన్ను నేను నిర్మించుకోవడంలో సహాయపడింది. అది నా వ్యక్తిగత జీవితంపై ఎంతో ప్రభావం చూపింది.‘ అంటూ ఉద్విగ్నంగా చెప్పారు.అటువంటి ఐకానిక్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎంపికైనందుకు కృతజ్ఞత కలిగి ఉండాలని ఆషికి 3 నటీనటులకు ఆమె సూచించారు. ‘ఇది అహంకారంతో చెబుతున్నది కాదు, ఆషికీ సిరీస్లో చేరిన ఎవరైనా ఓ ఘనమైన వారసత్వంలో భాగమవుతున్నారు. ఆ వారసత్వంలోకి అడుగుపెట్టిన మరు క్షణమే, సగం విజయం సాధిస్తారు. ప్రేక్షకులు మిమ్మల్ని ఆషికి వారసులుగా చూసేందుకు వస్తారు. అందుకే నటీనటులు తమకు లభించిన అవకాశం పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఆ వారసత్వాన్ని గొప్ప గౌరవంగా భావించాలి.‘ అంటూ ఆమె ఉద్భోధించారు. ప్రేమ అనేది విశ్వవ్యాప్తం కాలాతీతం అని అను అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రేమ చిత్రణ సమకాలీన సున్నితత్వాలకు అనుగుణంగా ఉండవచ్చు, అయితే ప్రేమను నిర్వచించే ప్రాథమిక భావోద్వేగాలు అనుభవాలు ఎల్లప్పుడూ అలాగే ఉంటాయని తాను నమ్ముతానంది.ఆషికి తర్వాత పొడగరి సుందరి, డస్కీ బ్యూటీగా 1990 ప్రాంతంలో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న అనుఅగర్వాల్ 1999 ప్రాంతంలో అనూహ్యంగా ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై వెండితెరకు దూరమయ్యారు. కొన్నేళ్లపాటు చికిత్స తర్వాత ప్రస్తుతం కోలుకున్నప్పటికీ..సినిమాల్లో ఇంకా అవకాశాలు రావడం లేదు. ఆమె తమిళ దర్శకుడు మణిరత్నం దొంగ దొంగ చిత్రంలో కొంచెం నీరు కొంచెం నిప్పు పాట ద్వారా దక్షిణాది ప్రేక్షకులకూ చిరపరిచితమయ్యారు. -
బాలకృష్ణ, నాగార్జున, బన్నీ..అందరికీ అదే పిచ్చి!
సినిమా తారలంటే చాలా మందికి డెమీ గాడ్స్ లెక్క. మరీ ముఖ్యంగా హీరోలనైతే ఆరాధ్యదైవాలగానే కొలుస్తారు. వారి కోసం తన్నడానికి , తన్నించుకోవడానికి, వాళ్ల సినిమాలకు ప్రచారం చేయడానికి మాత్రమే కాదు వాళ్ల కోసం ప్రాణాలిచ్చేయడానికి కూడా సై అంటారు. అంతటి ఆదరణ అభిమానాలు పొందినప్పుడు సహజంగానే పేరు ప్రఖ్యాతులతో పాటు దండిగా డబ్బు, సంపద వస్తుంది. దాంతో సెంటిమెంట్స్ కూడా బాగా ఎక్కువే ఉంటాయి.జ్యోతిష్యాన్ని, వాస్తును, ముహుర్తాలను విపరీతంగా నమ్మే హీరోలు మనకు ఎందరో ఉన్నారు. వీరిలో పలువురు సంఖ్యాశాస్త్రాన్ని కూడా బాగా విశ్వసిస్తారు. ఆ విశ్వాసంతోనే తమ వాహనాల నెంబర్ల విషయంలో రూ.లక్షలు ఖర్చు పెడుతున్నారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవలే తన వాహనం కోసం అత్యంత డిమాండ్ ఉన్న ‘0001’ రిజిస్ట్రేషన్ నంబర్ను రూ.7.75 లక్షలకు దక్కించుకుని బాలకృష్ణ వార్తల్లో నిలిచారు. అదే విధంగా గ్లోబల్ స్టార్ హీరో జూ.ఎన్.టి.ఆర్ సైతం ఫ్యాన్సీ నెంబర్ల వేటలో ముందున్నారు. ఆయన తన లంబోర్గిని ఉరూస్ వాహనం కు టిఎస్09ఎఫ్ఎస్ 9999 నెంబర్ ను రూ.17లక్షలు ఖర్చు పెట్టారు. ఎన్టీయార్ దాదాపుగా తన అన్ని కార్లకూ 9999 నెంబర్నే ఎంచుకుంటారు. సూపర్ స్టార్ మహేష్బాబు తన వాహనాలైన రేంజ్ రోవర్, మెర్సిడెస్ జిఎల్ ఎస్ ల కోసం Výటిఎస్09 ఇకె 600, టిఎస్09జిఒ600 లను కొనుగోలు చేశారు. నాగార్జున బిఎండబ్ల్యూ 7 సిరీస్ కోసం ఎపి 09బిడబ్ల్యు 9000ను వేలంలో దక్కించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రేంజ్రోవర్, వోల్వో ఎక్స్సి 90ల కోసం టిఎస్07 జిఇ9999 నెంబర్ లపై రూ.10లక్షలు పైనే ఖర్చు చేశారు. సీనియర్ హీరో రవితేజ కూడా తన ఎలక్ట్రిక్ వాహనం బివైడి అట్టో 3 నెంబరు టిఎస్09జిబి 2628 కోసం రూ.17,628 వెచ్చించారు.అమితాబ్ ఆద్యుడు అనుకోవాలేమో...స్టార్డమ్ కి దేశంలోనే అందరికీ బిగ్ బి అని పేర్కొనదగ్గ బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ కు కూడా నెంబర్ సెంటిమెంట్ ఎక్కువే. ఆయన తన వాహనాలన్నింటికీ 11 నెంబర్ వచ్చేలా చూస్తారు. ఆయన పుట్టిన రోజు కూడా అదే కావడం విశేషం. అలాగే తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ కి ఇష్టమైన నెంబర్ 2222, ధనుష్ 106 నెంబర్ని ఇష్టపడతారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ 2727 నెంబర్ని ఎంచుకుంటారు. షారూఖ్ ఖాన్ 555, సంజయ్ దత్ 4545 తమ వాహనాలకి తరచూ కోరే నెంబర్స్. ఈ తరహా సెంటిమెంట్స్ హీరోయిన్స్కు పెద్దగా లేకపోవడం ఆసక్తికరం. హీరోలు నెంబర్ల వేటలో రూ.లక్షలు వెచ్చిస్తున్నప్పటికీ.. వారితో ధీటుగా ఫాలోయింగ్ అందుకుంటున్న హీరోయిన్లు మాత్రం ఈ నెంబర్ల పిచ్చికి దూరంగా ఉండడం విశేషం. -
ఆలయాల్లో పూజలు అందుకుంటున్న సినీతారలు వీరే...
దేశవ్యాప్తంగా తన అందం, నృత్యాల ద్వారా పేరు తెచ్చుకున్న ఊర్వశి రౌతాలా తన పేరును జనం మర్చిపోకుండా చేయడాన్ని కూడా తన దినచర్యలో భాగం చేసుకుంది. ‘ఢిల్లీ యూనివర్శిటీలోని విద్యార్థులు తన ఫోటోలపై దండలు వేసి ‘‘దమ్దమమై’’ అని పిలుస్తారని ఆమె చెప్పింది. అంతేనా...నా పేరు మీద ఒక ఆలయం ఉంది భక్తులు నా ఆలయంలో పూజలు చేస్తున్నారు’’అంటూ ప్రకటించడంతో ఆమె తనను తాను వార్తల్లో వ్యక్తిగా మరోసారి దిగ్విజయంగా నిలబెట్టుకున్నారు. భక్తులు నిజంగా ఆమె ఆశీర్వాదాలు కోరుకుంటున్నారా? అని అడిగినప్పుడు, ఊర్వశి, ‘అబ్ మందిర్ హై తో వో హాయ్ తో కరేంగే (ఇది దేవాలయం, వారు మాత్రమే చేస్తారు)‘ అని చెప్పింది. అంతేకాదు దక్షిణాదిలో కూడా నా పేరిట ఓ ఆలయం రావాలి, చిరంజీవితో, బాలకృష్ణతో కూడా పనిచేశా.విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వారితో కలిసి పనిచేశాను కాబట్టి దక్షిణాదిలో కూడా, నా ఆలయం త్వరలో వస్తుంది, అంటూ ఊహాలోకాల్లో తేలిపోయింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని ప్రస్తావించిన ఊర్వశి ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయం సమీపంలో తన పేరు మీద ఒక ఆలయాన్ని నిర్మించారని, బద్రీనాథ్ని సందర్శిస్తే, దాని పక్కనే ’ఊర్వశి ఆలయం’ ఉంది అని చెప్పడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీంతో అక్కడి ఆలయ అర్చకులు ఆమెపై మండిపడుతున్నారు. ఆమెపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. ఈ నేపధ్యంలోనే మరోసారి దేశవ్యాప్తంగా తారల ఆలయాలు చర్చనీయాంశంగా మారాయి. హిందూ మతంలో అసంఖ్యాకమైన దేవతలను పూజిస్తారు. అలాగే తమకు నచ్చిన మనిషిని కూడా దేవుడు/దేవతగా పూజిస్తారు. అంతేకాదు తమ ప్రేమ అభిమానాన్ని చూపించడానికి వారికి గుడులు కూడా నిర్మిస్తారు. ఆ క్రమంలో దేశం నలుమూలల ఆలయాలున్న వేలకొద్దీ దేవతలే కాకుండా, సినీ తారలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు మొదలైన ప్రముఖుల కోసం కూడా ఆలయాలను వారి అభిమానులు నిర్మించి నిర్వహిస్తున్నారు. అలాంటి ఆలయాలలో కొన్నింటి గురించి...అమితాబ్ ఆలయం– ‘షాహెన్షా ఆఫ్ బాలీవుడ్‘ అని పిలుచుకునే అమితాబ్కు, కోల్కతాలో ఒక ఆలయం నిర్మించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన ప్రభావవంతమైన సేవలను కీర్తిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.–తమిళ లెజెండరీ సూపర్స్టార్ రజనీకాంత్కు తమిళనాడులోనే కాకుండా భారతదేశం అంతటా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. కర్నాటకలోని కోలార్ లో రజనీకాంత్ ఆలయం ఉంది.–ఖుష్బూ సుందర్ తమిళనాడులో అభిమానులు తన పేరు మీద దేవాలయాన్ని నిర్మించిన మొదటి భారతీయ నటిగా గుర్తింపు పొందింది, అయితే. వివాహానికి ముందు సాన్నిహిత్యంపై ఆమె వివాదాస్పద ప్రకటన తర్వాత ఈ ఆలయం తొలగించారు.–దివంగత నటి శ్రీదేవి, తరచుగా భారతీయ సినిమా మొదటి మహిళా సూపర్స్టార్, ఆమె జ్ఞాపకార్థం ముంబైలో ఒక ఆలయం ఉంది.–ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఒక దేవాలయం ఉంది.–భారతదేశం వెలుపల, ప్రత్యేకించి సోవియట్ యూనియన్ ఇతర తూర్పు యూరోపియన్ రాష్ట్రాల్లో భారతీయ సినిమాని తీసుకెళ్లిన దివంగత నటశిఖరం రాజ్ కపూర్కి జైపూర్లో దేవాలయం ఉంది.–అందం, తెలివితేటలతో పాటు నటనా ప్రతిభకు ప్రసిద్ధి చెందిన ఐశ్వర్య రాయ్ కు కూడా ఆలయం ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో దీనిని నిర్మించారు.–‘కింగ్ ఖాన్‘ లేదా ‘ది లాస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా‘ అని పేర్కొనే ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్‘ షారుఖ్ ఖాన్ కు కోల్కతాలో ఆలయం ఉంది.–కోవిడ్ సమయంలో అత్యంత ఉదారంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాడు నటుడు సోనూసూద్. దాంతో ఆయన పేరిట తెలంగాణలోని సిద్ధిపేటలో ఒక ఆలయాన్ని నిర్మించారు. ప్రదర్శించిన నటనకు కాకుండా చూపించిన మంచితనానికి బదులుగా ఆలయం కట్టించుకున్న ఏకైక నటుడు సోనూసూద్ మాత్రమే. అలాగే సినిమాల్లో ప్రతినాయక పాత్రధారుల్లో కూడా మరెవరికీ ఆ ఘనత దక్కలేదు.–తాజా అందాల బ్యూటీ నిధి అగర్వాల్ రెండేళ్ల క్రితమే తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే స్వల్పకాలంలోనే అపారమైన క్రేజ్ అందుకుంది. చెన్నైలోని ఆమె అభిమానులు ఆమెకు ఆలయాన్ని నిర్మించి, ఫిబ్రవరి 14న, ప్రత్యేక పూజలు చేశారు.– ఆమె 36వ పుట్టినరోజున, నటి సమంతా రుత్ ప్రభు కు ఆంధ్రప్రదేశ్లో ఆలయం నిర్మించారు. సందీప్ అనే ఆమె అభిమాని ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలోని తన ఇంట్లోనే ఆమెకు గుడి కట్టించాడు.– ఒకప్పటి అగ్రనటి నమిత పాపులారిటీ ఎంతలా ఉండేదంటే...ఆమె అభిమానులు తమిళనాడు అంతటా ఆమె గౌరవార్థం ఒకటి కాదు ఏకంగా మూడు ఆలయాలను నిర్మించారు.– ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయం సమీపంలో తన పేరు మీద ఒక ఆలయాన్ని నిర్మించారని ఇటీవల ఊర్వశి రౌతాలా వెల్లడించింది.అంతేకాదు దక్షిణాదిలో కూడా నా పేరిట ఓ ఆలయం రావాలి, చిరంజీవితో, బాలకృష్ణతో కూడా పనిచేశా.విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వారితో కలిసి పనిచేశాను కాబట్టి దక్షిణాదిలో కూడా, నా ఆలయం త్వరలో వస్తుంది, అంటూ ఊహాలోకాల్లో తేలిపోయింది.వద్దన్నవారూ ఉన్నారు...గత పదేళ్లుగా, హన్సిక మోత్వానికి సినీ పరిశ్రమతో అనుబంధం ఉంది. పడికథవన్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత హన్సికను నటి ఖుష్బు సుందర్తో పోల్చడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఆమె మద్దతుదారులు మదురైలో ఆలయాన్ని నిర్మించాలని భావించారు. ఖుష్భూ, నమిత తర్వాత గుడిలో దేవతగా మారే అవకాశం ఈ ఆలోచనను హన్సిక తిరస్కరించినందున కోల్పోయింది. అలాగే లేడీ సూపర్స్టార్ నయనతార గౌరవార్థం ఆమెకు గుడి కట్టడానికి అనుమతి కోసం నటిని అభిమానులు సంప్రదించినప్పుడు. ఆమె ఆఫర్ను ఉదారంగా తిరస్కరించింది. ఆమె గత సంవత్సరం తమిళ చిత్రం మూకుతి అమ్మన్లో దేవతగా నటించడం విశేషం.సచిన్ టెండూల్కర్ టెంపుల్, పూణేభారతదేశంలో క్రికెట్ ఒక మతం, మరియు సచిన్ టెండూల్కర్ దాని అత్యంత గౌరవనీయమైన దేవుళ్ళలో ఒకరు. ఇది భారతదేశంలోని భావోద్వేగ క్రికెట్ అభిమానులచే మరొక నినాదంగా కొట్టివేయబడి ఉండవచ్చు, అయితే పూణేలోని ఒక దేవాలయం ఈ క్రికెట్ లెజెండ్కు అంకితం చేయబడింది, ఇక్కడ అభిమానులు ‘మాస్టర్ బ్లాస్టర్‘కి నివాళులర్పించడానికి గుమిగూడారు, భారత క్రికెట్ అభిమానులు తమ క్రికెట్ విగ్రహాన్ని తమ దష్టిలో ఎంత ఉన్నతంగా ఉంచుకుంటారో చెప్పడానికి ఇది నిదర్శనం.ఎం.ఎస్. ధోని టెంపుల్, రాంచీభారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన మరియు ఆకర్షణీయమైన క్రికెటర్లలో ఒకడు మాత్రమే కాదు, ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు దేశం యొక్క చక్కని కెప్టెన్ కూడా. అందువల్ల, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ కలిగి ఉండటంలో ఆశ్చర్యం లేదు. అతను జార్ఖండ్ నుండి మొదటి మరియు అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో ఒకడు, మరియు అతని అభిమానులు M. . అతని స్వస్థలమైన రాంచీలో ధోనీ ఆలయం. అతని నాయకత్వం మరియు క్రికెట్ విజయాల పట్ల అతని అభిమానులు కలిగి ఉన్న ఆరాధనకు ఈ ఆలయం ఒక అభివ్యక్తి. -
హృతిక్తో ఎన్టీయార్, హృతిక్ మాజీ భార్యతో రామ్చరణ్...
ఇటీవలి కాలంలో బాలీవుడ్, టాలీవుడ్ల మధ్య సంబంధాలు ఇంతింతై వటుడింతై అన్నట్టు అల్లుకుపోతున్నాయి.గతంలో ఎన్నడూ లేనంతగా బాలీవుడ్ తెలుగు సినిమా పరిశ్రమపై ప్రేమను కురిపిస్తోంది. రెండు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు నిర్మాణం నుంచి నటన దాకా భాగం పంచుకుంటున్నారు. అదే క్రమంలో తాజాగా హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీయార్లు కలిసి వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ రకంగా ఆర్ఆర్ఆర్ చిత్రమే దీనికి కారణంగా చెప్పొచ్చు. తన నటన ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగానూ పేరు సాధించిన జూనియర్ ఎన్టీయార్..క్రేజ్ను వాడుకోవడానికే వార్ 2 చిత్ర నిర్మాతలు హృతిక్తో ఎన్టీయార్ ని కలిపి అరుదైన కాంబోని ప్లాన్ చేశారనుకోవచ్చు. ఈ నేపధ్యంలో బాలీవుడ్లో ఎన్టీయార్ హవా మొదలయే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్లో నటించిన రామ్ చరణ్ గతంలోనే స్ట్రెయిట్ హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్లో తన ముద్ర వేద్దామని ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నం బెడిసికొట్టి.. ఇక ఆపై ఎప్పుడూ బాలీవుడ్లో కాలు మోపలేదు. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్చరణ్ కు కూడా జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో.. బాలీవుడ్కు ఆప్తుడిగా మారాడు.ఈ నేపధ్యంలో హృతిక్ రోషన్ మాజీ భార్య ఇంటీరియర్ డిజైనర్ అయిన సుస్సానే ఖాన్ ఫిబ్రవరిలో హైదరాబాద్లో చార్కోల్ పేరిట ఓ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. తాజాగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఆ స్టోర్ని సతీ సమేతంగా సందర్శించారు. దీంతో సుస్సానే ఖాన్ సంతోషాన్ని పట్టలేకపోయారు. రామ్చరణ్, ఉపాసన తమ స్టోర్కి వచ్చి మాకు అత్యంత అపురూపమైన ప్రత్యేకమైన అనుభూతిని అందించినందుకు ధన్యవాదాలు అంటూ ఆమె పోస్ట్ చేశారు. ఆమె సోదరుడు జాయెద్ ఖాన్ కూడా తమ సోదరి స్టోర్ను గ్లోబల్ సూపర్ స్టార్ అంతేకాక అద్భుతమైన వ్యక్తి అయిన రామ్చరణ్ సందర్శించడం ఎంతో సంతోషం కలిగిస్తోందంటూ తన స్పందన వ్యక్తం చేశాడు.హృతిక్ రోషన్తో పెళ్లి బంధం విఛ్చిన్నమైనప్పటికీ సుస్సానే ఖాన్ వ్యక్తిగతంగా ఎంచుకున్న కెరీర్లో రాణిస్తోంది. అంతేకాకుండా ఆమె తన మాజీ భర్తతో ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఆమె హైదరాబాద్లో ఏర్పాటు చేసిన స్టోర్ను హృతిక్ సైతం సందర్శించడం ఆమె బిజినెస్కు మద్ధతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. వార్2లో హృతిక్ సహనటుడైన ఎన్టీయార్ ఇప్పటికీ తమ సిటీలోనే ఉన్న సుస్సానే స్టోర్ను సందర్శించనప్పటికీ, రామ్ చరణ్ మాత్రం ఈ విషయంలో ముందుండడం ఆసక్తి కలిగిస్తోంది. View this post on Instagram A post shared by Sussanne Khan (@suzkr) -
బిచ్చగాళ్లకు ఫోన్ నంబర్ ఇచ్చి ఏటీఎం లా మారిన హీరో!
ప్రస్తుత స్టార్ హీరోల్లో ఎందరో అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చినవారే అయి ఉంటారు. కానీ అప్పటి తమ పరిస్థితులు ఇప్పటికీ గుర్తుంచుకుని అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆపన్నులను ఆదుకునే మనసున్నవాళ్లు మాత్రం కొందరే ఉంటారు. అలాంటివారిలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్(Jackie Shroff) ముందున్నాడు. తన మానవతా సేవలతో నిరుపేదల మనసులను గెలుచుకుంటున్నాడు. ఇటీవల, జాకీ ష్రాఫ్ తన చిన్ననాటి కష్టాలను గుర్తు చేసుకుంటూ, ముంబైలోని చవల్లో 33 సంవత్సరాలు గడిపిన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ఏడు భవనాలకు మూడే బాత్రూమ్స్ ఉన్న ఓ కాంప్లెక్స్లోని ఒకటే గదిలో తమ కుటుంబం మొత్తం నివసించిన రోజుల్ని తలచుకుంటూ...రాత్రుళ్లు ఎలకలు తమ వేళ్లనే ఆహారంగా మార్చుకునేవన్నారు. అలాంటి దుర్భర పరిస్థితుల్లో చదువుకోవాలనే కోరిక ఉన్నా పరిస్థితులు అనుకూలించక తన చదువు కొనసాగించలేకపోయానని చెప్పారు. అర్ధాకలితో గడిపిన రోజులు మర్చిపోలేనంటున్న ఆయన అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా వారికి నేనున్నా అంటున్నారు. ఏదో ఇంటర్వ్యూ కోసం మాత్రమే ఆయన మాట్లాడడం లేదు. ఇప్పటికే ముంబైలోని దాదాపు 100 కుటుంబాల బాగోగులు చూస్తున్నారు. అది కూడా కొన్నేళ్లుగా. అంతేకాకుండా, వీధుల్లో ఉన్న ప్రతి బిచ్చగాడికి ఆయన తన ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచారు, తద్వారా వారు అవసరమైనప్పుడు ఎంత అర్ధరాత్రయినా, అపరాత్రయినా సాయం పొందగలుగుతారు.తిండికి లేని స్థితి నుంచి వందలాది మందికి తిండి పెట్టగలిగే పరిస్థితి వరకూ సాగిన ప్రయాణంలో పల్లీలు అమ్ముకోవడంతో మొదలై ఎన్నో చిరుద్యోగాలు, చిరు వ్యాపారాలు... అయిపోయాయి. చివరకు ఒక బస్టాండ్లో నిలబడి ఉండగా తనని గమనించిన సుభాష్ ఘయ్ కి జాకీలో తన కొత్త చిత్రంలో కధానాయకుడు కనిపించడంతో ఆయన జీవితం మారిపోయింది. హీరో పేరుతో రూపొందిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దానిని తెలుగులో నాగార్జున ఆరంగేట్రంగా కూడా రీమేక్ చేసి విక్రమ్ తీశారు.అలా బస్టాండ్ బతుకు నుంచి బాలీవుడ్ హీరోగా మారిన జాకీ ష్రాఫ్ అక్కడ నుంచి అంచలంచెలుగా టాప్ స్టార్గా ఎదిగాడు. అయితే ఎప్పుడూ తన గతాన్ని మర్చిపోలేదు. ఇపుడేదో స్థితి మంతుడయ్యాడు కాబట్టి చేయడం కాకుండా...తాను ఆర్ధికంగా లేని పరిస్థితుల నుంచే ఆయన సేవను ఒక దినచర్యగా మార్చుకున్నాడు. ప్రతీ యాచకునికీ , ఫుట్పాత్పై నివసించే ప్రతీ చిన్నారికీ తన కాంటాక్ట్నెంబర్ అందేలా ఏర్పాటు చేశాడు. తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, సామూహిక భోజనాలు, పేద పిల్లలకు పుస్తకాలు, దుప్పట్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటాడు. తనకు ఇష్టమైన వ్యక్తుల పుట్టినరోజుల సందర్భాలలో కూడా ఆయన ఇదే విధమైన సేవా కార్యక్రమాలను చేస్తాడు. వయసు పై బడిన జాకీష్రాఫ్ ఇప్పడు తెరపై హీరో కాకపోవచ్చు కానీ వందలాది మంది మనసుల్లో ఆయన ఎప్పటికీ హీరోనే... -
పెళ్లిని నమ్మనన్న త్రిష.. రెండు పెళ్లిళ్లు అందుకే నన్న కమల్
నిస్సందేహంగా మన దేశం గర్వించదగ్గ నటుల్లో కమల్ హాసన్(Kamal Haasan) ఒకరు. నటనాపరంగా ఆయన పోషించని పాత్రల గురించి వెదుక్కోవాల్సిందే. నిజజీవితంలోనూ ఆయన భిన్న పాత్రలు పోషించారు. ముఖ్యంగా నటీమణులతో ఆయన సంబంధాలు, ఆయన పెళ్లిళ్లు, విడాకులు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. ఎందుకంటే అత్యాధునిక తరం అని చెప్పుకునే ఈ తరం నటులు ఫాలో అవుతన్న లివ్ ఇన్ రిలేషన్ షిప్స్, పెళ్లి కాకుండా పిల్లలు వగైరాలన్నీ దాదాపు 2, 3 దశాబ్ధాల క్రితమే కమల్ చేసేశాడు..ఒక్కసారి కమల్ అనుబంధాలను పరిశీలిస్తే... 1975లో వచ్చిన మేల్నాట్టు మరుమగల్ చిత్రంలో కమల్ తనతో కలిసి నటించిన తర్వాత 1978లో డ్యాన్సర్ వాణీ గణపతిని వివాహం చేసుకున్నారు. ఒక దశాబ్దం తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత, కమల్ హాసన్ సహ నటి సారికతో సహజీవనం చేశాడు. ఆ అనుబంధం వల్ల వారికి 1986లో తమ మొదటి సంతానం శ్రుతి హాసన్ (ప్రస్తుతం టాప్ హీరోయిన్) జన్మించింది. ఆ తర్వాత వారు 1988లో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత 1991లో వారికి రెండవ కుమార్తె అక్షర హాసన్ పుట్టింది. ఈ అనుబంధం మరో పదేళ్లు పైనే కొనసాగి 2002లో, వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు, అది 2004లో మంజూరు అయ్యాయి. ఆ తర్వాత 2005 నుంచి 2016 వరకు నటి గౌతమితో కమల్ సహజీవనం చేశాడు. అందుకే తమ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తాను వివాహానికి సరిపోతానని తాను భావించడం లేదని ఇంటర్వ్యూలలో తరచుగా కమల్ చెబుతుంటాడు. ప్రస్తుతం 7 పదుల వయస్సులో కూడా కమల్ పెళ్లిళ్లు ప్రస్తావనకు నోచుకుంటున్నాయంటే... అందుకు ఆయన గత చరిత్రలో ఉన్న మలుపులే కారణం.ఈ నేపధ్యంలో సీనియర్ స్టార్ కమల్ హాసన్, నటి త్రిష కృష్ణన్(Trisha), సిలంబరసన్ టిఆర్, శింబులు నటించిన, మణిరత్నం చిత్రం థగ్ లైఫ్ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో నటీనటులంతా బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ సందర్భంగా మరోసారి కమల్ పెళ్లిళ్ల ప్రస్తావన వచ్చింది.ప్రమోషన్ కార్యక్రమం సందర్భంగా ఓ యాంకర్ పెళ్లి గురించి నటీనటులను వారి అభిప్రాయాలను అడిగారు. దీనికి 3 పదుల వయసు దాటినా, ఇంకా పెళ్లి మాట ఎత్తకుండా సినిమాల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న త్రిష....బదులిస్తూ..‘‘ పెళ్లిపై తనకు నమ్మకం లేదు’’ అంటూ స్పష్టం చేసింది. ‘‘తనకు పెళ్లి జరిగే పరిస్థితి ఉండి అది జరిగినా ఓకే’’ అని అలా కాకుండా పెళ్లి జరగకపోయినా సరే తనకు ఓకే అని త్రిష సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత పెళ్లి విషయమై కమల్ను ప్రశ్నించగా.. దశాబ్దం క్రితం ఎంపీ జాన్ బ్రిటాస్కు తనకు జరిగిన ఓ సంభాషణను ఆయన వివరించాడు.‘‘ఇది 10–15 ఏళ్ల క్రితం జరిగింది. ఎంపీ బ్రిటాస్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయన కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ ముందు నన్ను ‘‘ నువ్వు మంచి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడివి, మరి రెండు పెళ్లిళ్లు ఎలా చేసుకున్నావు? అని ప్రశ్నించాడు. దానికి మంచి కుటుంబం నుంచి రావడానికి పెళ్లికి సంబంధం ఏంటి? అని నేను ఎదురు ప్రశ్నించా. అది కాదు నువ్వు రాముడిని పూజిస్తావు అంటే ఆయన్ను అనుసరించాలి కదా అని అడిగాడు. దానికి నేనేం చెప్పానంటే..నేను ఏ దేవుడ్నీ పూజించను. అంతేకాదు నేను రాముడి జీవనశైలిని అనుసరించను. బహుశా నేను అతని తండ్రి (దశరథ) మార్గాన్ని (ముగ్గురు భార్యలు కలిగి ఉన్న) మార్గాన్ని అనుసరిస్తాను’’ అంటూ కమల్ హాసన్ బదులిచ్చాడు. విక్రమ్ సినిమా సూపర్ హిట్తో మరోసారి ఊపందుకుంది కమల్ హాసన్ కెరీర్... తదుపరి చిత్రం, థగ్ లైఫ్, జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది. -
అమ్మాయిలూ మీ కోసం కష్టపడండి: అనసూయ
చిన్నితెర మీద యాంకర్గా అనసూయ(Anasuya Bharadwaj ) ప్రయాణం ఓ స్పెషల్. అటు చిన్నితెర మీదా ఇటు వెండితెర మీద కూడా గుర్తుంచుకోదగిన పాత్రలు పోషించే అవకాశం ఆమెకు మాత్రమే దక్కిందని చెప్పవచ్చు. కేవలం యాంకర్, యాక్ట్రెస్గా మాత్రమే కాకుండా సోషల్ మీడియా సెలబ్రిటీగా కూడా అనసూయ ముందంజలో ఉంది. యాక్టింగ్, యాంకరింగ్ టాలెంట్తో పాటు తనదైన శైలిలో గ్లామర్ కూడా పండించడంతో ఆమె తరచుగా వార్తల్లో వ్యక్తి అవుతుంటారనేది వాస్తవం. ప్రస్తుతం మిడిల్ ఏజ్లో ఉన్న ఈ బ్యూటీ మధ్యలో కాస్త ఓవర్ వెయిట్ అనిపించినా.. ఇప్పుడు మళ్లీ మంచి శరీరాకృతి సాధించి అభిమానులను ఆకర్షిస్తోంది. అంతేకాదు వారితో ఆమె తరచుగా తన ఫిట్నెస్ జర్నీ విశేషాలు కూడా పంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఆమె అమ్మాయిలకు అందించిన ఓ సందేశం ఆసక్తికరంగా ఉంది.మహిళలు, ఉద్యోగినులు అయినా గృహిణులు అయినా, తమ కోసం తాము టైమ్ కేటాయించుకోలేక ఒత్తిడికి గురవుతారు; వారి షెడ్యూల్ ఉదయం నుంచి రాత్రి వరకు ఫుల్ అయిపోయి ఉంటుంది. పిల్లలని స్కూల్కి రెడీ చేయడంతో మొదలుపెడితే.. భర్తలు అత్తమామలకు టిఫిన్లు ప్యాక్ చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, ఆపై నేరుగా వంట లేదా ఇతర పనుల్లోకి తలమునకలవడం... తో రోజు గడచిపోతుంటుంది. ఇటువంటి దినచర్య మధ్య, తరచుగా చాలా మంది మహిళలకు ఫిట్నెస్ అనేది ఓ టైమ్ వేస్ట్ పనిలా అనిపిస్తుంది.ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ యాంకర్ అనసూయ భరద్వాజ్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంది. ఆమె మహిళలకు కొన్ని ఆచరణీయ సలహాలను కూడా అందించింది, తనకు కూడా ఒకప్పుడు జిమ్కి వెళ్లడానికి ఆసక్తి ఉండేది కాదని ఇప్పుడు జిమ్ వర్కువట్స్ ప్రారంభించిన తర్వాత తన ఆలోచన పూర్తిగా మారిపోయిందని చెప్పిందామె. ఇన్ స్ట్రాగామ్లో తన జిమ్ వర్కౌట్ల వీడియోను పోస్ట్ చేస్తూ, అనసూయ ఇలా వివరించింది‘‘వంశపారంపర్యంగా నేను ఫిట్గా పుట్టాను. అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ వంటి ఆటలు ఆడతాను ఇక జిమ్కి ఎందుకు వెళ్లాలి?’ అని నేను అనుకున్నాను. ఓ ఇంటర్వ్యూలో అదే విషయం చెప్పాను కూడా. కానీ క్రమం తప్పకుండా రెండేళ్ల స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామం చేశాక.. దాని ప్రాముఖ్యతను నేను ఇప్పుడు గ్రహించాను.. అంతేకాదు 30 ఏళ్ళ వయసు నుంచి 40కి చేరువవుతున్నప్పుడు నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం మొదలయ్యాక.. అప్పుడు అనిపించింది ఈ వ్యాయామాలను ముందుగానే ప్రారంభించి ఉండాల్సింది అని. కాబట్టి ‘అమ్మాయిలూ మీరు ఎంత త్వరగా జిమ్కి వెళ్లడం ప్రారంభిస్తే అంత మంచిది. ఇది మీ కోసం, మీ కుటుంబం కోసం కాదు. నాకు తెలుసు మీరు మూడు పూటలా వంట చేయాలి. మీ భర్త పిల్లల అత్తమామల బాగోగులు చూసుకోవాలి. కానీ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ కుటుంబాన్ని కూడా కొంత భారం పంచుకోమని చెప్పండి. ఓ గంట మీకోసం మీరు కేటాయించుకోండి. అప్పుడు మార్పు చూసి మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకుంటారు. జిమ్కి వెళ్లడం ఒక అవసరం, విలాసం కాదు’’ అంటూ ఇన్స్టా ద్వారా అనసూయ అందించిన సందేశం ఎంతైనా అనుసరణీయం. ఇంటి పనిభారం మోసే మహిళలు, అమ్మాయిలను తమ కోసం కూడా సమయాన్ని వెచ్చించమని ప్రోత్సహిస్తోంచే ఈ సలహాను అమ్మాయిలు పాటిస్తారనే ఆశిద్దాం. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
మరో శ్రీదేవి కావాలంటే తమన్నా ఇంకో జన్మ ఎత్తాలి: ఖుషి కపూర్
దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి ఒక ఊపు ఊపిన కధానాయికల్లో నెం.1 స్థానంలో ఉంటారు శ్రీదేవి (Sridevi). భారతీయ సినిమాకు ‘మొదటి మహిళా సూపర్ స్టార్‘గా శ్రీదేవి మూస పద్ధతులను బద్దలు కొట్టారు. కామెడీ నుంచి ట్రాజెడీ వరకు వైవిధ్యమైన శైలిలో విస్తృతమైన పాత్రలను పోషించారు. దాదాపు 50 సంవత్సరాలకు పైగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం కన్నడ భాషా చిత్రాలతో ఆమె కెరీర్ నలుదిశలా విస్తరించింది.సౌత్.. నార్త్.. అన్నింటా తనదే హవాదక్షిణాదిలో అన్ని భాషా చిత్రాల్లో విజయాలు ఒకెత్తయితే బాలీవుడ్లో మరో ఎత్తు. ‘మిస్టర్ ఇండియా,‘ ‘సద్మా,‘ ‘హిమ్మత్వాలా,‘ ‘ఖుదా గవా,‘ ‘‘లాడ్లా,‘ ‘జుదాయి,‘ ‘ఇంగ్లీష్ వింగ్లీష్‘ వంటి సూపర్ హిట్స్తో ఆమె బాలీవుడ్ ప్రేక్షకుల కలలరాణిగా కళకళలాడారు. ఆమె చివరి చిత్రం క్రైమ్ థ్రిల్లర్ ‘మామ్' 2017లో విడుదలైంది. ఇది అందరికీ తెలిసిన శ్రీదేవి.. అయితే తెలియని శ్రీదేవి గురించి ఎలా తెలుస్తుంది?శ్రీదేవి బయోపిక్లో నటించాలనుంది: తమన్నాఇప్పుడు బయోపిక్ల శకం నడుస్తోంది. సిల్క్ స్మిత నుంచి శ్రీదేవి దాకా తారల జీవితాలను తెరకెక్కించాలని సినిమా పరిశ్రమ ఉవ్విళ్లూరుతోంది. గత కొంత కాలంగా శ్రీదేవి జీవిత కథను సినిమాగా రూపొందించాలన్న చర్చలు నడుస్తున్నాయి. అదే సమయంలో ఆ పాత్రను ఎవరు పోషిస్తే బాగుంటుంది? అనే చర్చ కూడా వస్తోంది. ఈ నేపధ్యంలో దివంగత తార శ్రీదేవి ‘‘సూపర్ ఐకానిక్’’ కాబట్టి తెరపై ఆమె పాత్రను పోషించాలనుకుంటున్నట్లు నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘శ్రీదేవి, మేడమ్. సూపర్ ఐకానిక్ ఆమె నాకు ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచీ ఆమె సినిమాలు చూస్తూ పెరిగాను.. నేను ఎప్పుడూ మెచ్చుకునే వ్యక్తి ఆమె‘ అని తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరుమరి నిజంగా తమన్నాకు శ్రీదేవి పాత్ర పోషించి మెప్పించే స్థాయి ఉందా? ఈ ప్రశ్నకు సినీ పండితుల నుంచి ఇంకా సరైన సమాధానం రాలేదు కానీ.. శ్రీదేవి చిన్న కుమార్తె నుంచి పదునైన సమాధానమే వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఖుషి కపూర్ (Kushi Kapoor)... తన తల్లిలా మరెవరూ కాలేరని, ఆమె స్థానాన్ని మరొకరు ఎప్పటికీ భర్తీ చేయలేరని కుండ బద్ధలు కొట్టారు. ఆమెలా చిన్నప్పటి నుంచి నటనపై అంతటి అంకితభావం. అద్వితీయమైన ప్రతిభను ఎవరూ ప్రతిబింబించలేరని ఆమె స్పష్టం చేశారు.తను ప్రత్యేకమైన సృష్టిఇతరులకే కాదు తమకి కూడా అమ్మ స్థానం అసాధ్యమని ఆమె పరోక్షంగా తేల్చేశారు. తనపై ఆమె సోదరి జాన్వీపై శ్రీదేవి చూపిన ప్రభావం సాధారణమైనది కాదన్నారు. అయినప్పటికీ ‘రాబోయే 100 ఏళ్లలో కూడా నేను మా అమ్మలా కాలేను. ఆమె వేరే... ప్రత్యేకమైన సృష్టి‘ అంటూ తన తల్లిలా కావాలంటే మరో జన్మ ఎత్తాల్సిందే అంటూ ఓ ఇంటర్వ్యూ లో పరోక్షంగా స్పష్టం చేశారు.చదవండి: నెలసరి నొప్పులు.. అబ్బాయిలు అస్సలు భరించలేరు: జాన్వీ కపూర్ -
పిట్ట కొంచెం...కలెక్షన్స్ ఘనం.. ఎత్తు 4అడుగులు కలెక్షన్లు రూ.1900కోట్లు
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ పరిశ్రమలో కలెక్షన్ కింగ్స్లో ఒకడు, అతని అనేక చిత్రాలు రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి నిర్మాతలకు కాసుల పంట పండించాయి . అదే విధంగా గత కొన్నేళ్లుగా టాలీవుడ్ హీరో ప్రభాస్ కూడా బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తున్నాడు. అయితే వీళ్లెవరూ సాధించని విధంగా ఒక నటుడు నటించిన సినిమాల కలెక్షన్స్ ప్రకారం చూస్తే.. గత మూడు సినిమాల ద్వారా రూ.1900 కోట్లు రాబట్టాడు. అజానుబాహుడైన హీరోలకు భిన్నంగా ఈ నటుడి ఎత్తు కేవలం ఎత్తు 4 అడుగుల 8 అంగుళాలు మాత్రమే..వయస్సు 27 సంవత్సరాలు అయినప్పటికీ, ఈ దక్షిణ భారత నటుడి గత 3 చిత్రాలు అద్భుతాలు చేశాయి. ఆ నటుడి పేరు జాఫర్ సాదిక్(Jaffer Sadiq).జాఫర్ సాదిక్ 1995 జూలై 4న తమిళనాడులోని ఈరోడ్లో జన్మించారు. గత 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడంతో ఇప్పుడు సౌత్ ఇండియాలో పాపులర్ స్టార్ అయిపోయాడు. తన కెరీర్ను 2020 సంవత్సరంలో ‘పావ కాదగల్’ అనే టీవీ సీరియల్తో జాఫర్ సాదిక్ ప్రారంభించాడు. ఈ సీరియల్ తో జాఫర్ స్టార్ అయిపోయాడు. తన మొదటి సీరియల్ తోనే వీక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న తర్వాత, జాఫర్కు 2022లో ‘విక్రమ్’ చిత్రంలో అవకాశం వచ్చింది. కమల్ హాసన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘విక్రమ్’ చిత్రంలో సాదిక్ పాత్ర చాలా బలంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఈ తమిళ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర వీరవిహారం చేసి దాదాపు రూ.500 కోట్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. విక్రమ్ సినిమా తర్వాత, సాదిక్ వెందు తనింధతు కాదు అనే చిత్రంలో నటించారు.దీనితో పాటు, సాదిక్ సైతాన్ అనే వెబ్ సిరీస్లో కూడా బలమైన పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. దీని తర్వాత, విడుదలైన ‘జైలర్’ చిత్రంలో రజనీకాంత్తో జాఫర్ సాదిక్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు... ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద చాలా ప్రకంపనలు సృష్టించి రూ. 650 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. రజనీకాంత్తో స్క్రీన్ను పంచుకున్న తర్వాత, షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రంలో సాదిక్ కూడా తనదైన శైలిలో మెప్పించాడు. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర భీభత్సం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తంగా చూస్తే జాఫర్ సాదిక్ గత మూడు సినిమాలు 1900 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. జాఫర్ సాదిక్ ఎత్తు తక్కువే కావచ్చు, కానీ చాలా తక్కువ టైమ్లో, తక్కువ సినిమాలతోనే నటన పరంగా మాత్రం చాలా ఎత్తుకు ఎదిగాడు. ఇంకా బోలెడంత కెరీర్ ఉన్న జాఫర్...నటనా పరంగా మరిన్ని శిఖరాలు అందుకోవడం తధ్యంగా కనిపిస్తోంది. -
ఖరీదైన సినిమా.. సూపర్ స్టార్-ఐకాన్ స్టార్ వార్!
ఈ ఏడాది అత్యంత ఖరీదైన చిత్రాల రూపకల్పనలో భారతీయ చిత్ర పరిశ్రమ కొత్త శిఖరాలను అధిరోహించనుంది. ఈ నేపధ్యంలోనే ఆల్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ దర్శకుడు అట్లీ కలయికలో తమ కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఇద్దరు టాలీవుడ్ అగ్రగామి నటుల మధ్య సరికొత్త వార్ మొదలైందనొచ్చు. దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమా నాదే అనే కిరీటాన్ని అందుకోవడానికి ఈ ఇద్దరు స్టార్స్ పోటీపడుతున్నారు. వీరిద్దరూ మాత్రమే కాదు నేను కూడా ఉన్నానంటూ బాలీవుడ్ టాప్ స్టార్ కూడా అదే వరుసలో నిలవడంతో.. పోటీ రసకందాయకంగా మారింది.రూ.2 వేల కోట్ల కలెక్షన్స్ నిన్న.. రూ1,000 కోట్ల పెట్టుబడి నేడు.. అన్నట్టుగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి అత్యంత భారీ చిత్రం రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మహేష్బాబుతో ఆయన తీస్తున్న చిత్రం ఎస్ఎస్ఎస్బి29 బడ్జెట్ రూ.1000 కోట్ల వరకూ ఉండొచ్చునంటున్నారు. మరోవైపు బాలీవుడ్ అగ్ర కధానాయకుల్లో ఒకరైన రణబీర్ కపూర్తో రామాయణం తెరకెక్కుతోంది. ఈ చిత్రం బడ్జెట్ కూడా రూ.900 కోట్లకు దగ్గరగా ఉండొచ్చునని చెబతున్నారు. ఈ రెండు సినిమాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనతో ఉన్నప్పటికీ... భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తమ తమ చిత్రాలతో భారీ బ్లాక్బస్టర్లు సాధించిన అల్లు అర్జున్, అట్లీలు సన్ పిక్చర్స్ బ్యానర్ భారీ బడ్జెట్తో ఓ సినిమా రూపొందిస్తున్నట్టు వచ్చిన ప్రకటన పలు ఆశ్చర్యకరమైన అంకెల్ని సినీ అభిమానుల కళ్ల ముందుకు తెచ్చింది. ప్రస్తుతం ఏఏ22xఏ6 అని పేర్కొంటున్న ఈ చిత్రం అత్యంత ఖరీదైన భారతీయ చలనచిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ సినిమా బడ్జెట్ రూ. 800 కోట్లు కాగా ఇందులో నిర్మాణ వ్యయంగా రూ. 200 కోట్లు, విఎఫ్ఎక్స్ (స్పెషల్ ఎఫెక్ట్స్) కోసం రూ.250 కోట్లు, అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రూ. 175 కోట్లు, దర్శకుడు అట్లీ రెమ్యునరేషన్ రూ. 100 కోట్లుగా లెక్కిస్తున్నారు.ఇదే కాకుండా అల్లు అర్జున్కూ సినిమా లాభంలో 15 శాతం ఉంటుందని, అలాగే అట్లీకి కూడా బ్యాకెండ్ డీల్ ఉంటుందని సమాచారం. అవతార్, ఐరన్ మ్యాన్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన నిపుణులు ఇందులో భాగం పంచుకుంటున్న నేపధ్యంలో ఈ సినిమా ఇండియన్ స్క్రీన్పై విజువల్ ట్రీట్గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రం అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో ఒక ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లవచ్చునని.. అట్లీ తరచుగా ఆలోచించినట్టే ఆలోచిస్తే అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం కూడా ఉండొచ్చు అంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభం కానుంది.ప్రస్తుత బడ్జెట్ల ప్రకారం రాజమౌళి, మహేష్ బాబుల సినిమాయే అత్యంత ఖరీదైన చిత్రం కావడం ఖాయంగా తెలుస్తున్నప్పటికీ..మరెన్నో నెలల పాటు.షూటింగ్ సాగే క్రమంలో బడ్జెట్లో కూడికలు, తీసివేతలు.. మార్పు చేర్పులు అంతిమంగా ఈ విషయాన్ని ఖరారు చేస్తాయని అనుకోవచ్చు. -
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
బాలీవుడ్ నటి, పాప్ గాయని, బిజినెస్ ఉమెన్... మరెన్నో రంగాల్లో ప్రసిద్ధి చెందిన 'కునిక సదానంద్ లాల్' తన వైవిధ్యమైన పాత్రలతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ముంబైలో చలనచిత్రరంగానికి మారడానికి ముందుగానే కునిక నటనా జీవితం ఢిల్లీలో ప్రారంభమైంది, ఆమె తొలుత అనేక టీవీ సిరీస్లలో కనిపించింది. ప్రముఖ హాస్యనటుడు అస్రానీ భార్య మంజు అస్రానీ టీవీ సిరీస్లో ఓ అద్భుతమైన పాత్రతో బ్రేక్ అందుకుని సినిమా తారగా మారారు. దాదాపుగా 125 సినిమాల్లో నటించారు. గుమ్రాహ్, బేటా వంటి సినిమాల్లో విలన్గానూ మెప్పించారు. ఆమె సినిమా విజయాలకు మించి, ప్రైవేటు ఆల్బమ్స్ ద్వారా గాయనిగా పేరొందారు. విజయవంతమైన పలు సంస్థల వ్యవస్థాపకురాలు, సామాజిక కార్యకర్త కూడా. ముంబైలోని గోరేగావ్ శివారులో, వైట్ ఇటాలియన్ కేఫ్, జింగ్కేఫ్ మెజెస్టికా ది రాయల్ బాంక్వెట్ హాల్, అలాగే ఎక్స్హేల్ స్పా వంటివి నిర్వహిస్తున్నారు. తాజాగా సిద్ధార్థ్ కన్నన్ షోలో కనిపించినప్పటి నుంచి కునికా సదానంద్ వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆ షో లొ ఆమె చాలా ఓపెన్ అయ్యారు గాయకుడు కుమార్ సానుతో తన ప్రేమ వ్యవహారం గురించి అంతేకాదు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పలువురు హీరోయిన్లతో నడిపిన వ్యవహారాల గురించి కూడా మాట్లాడడం విశేషం. ఆమె మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ గురించి కూడా ప్రస్తావించారు అంతేకాదు గతంలో హీరోయిన్లను లొంగదీసుకోవాలని లైట్మెన్లతో సహా ఎలా ట్రై చేసేవారో కూడా వెల్లడించారు. దాంతో ఆ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అక్షయ్ కుమార్ ఎఫైర్స్పై కామెంట్లుఅక్షయ్ కుమార్కి హీరోయిన్లతో ఉన్న ఎఫైర్స్ గురించి ఆమె మాట్లాడుతూ ‘అతను చాలా అందంగా ఉంటాడు అంతేకాదు అతను నా కంటే ఒక సంవత్సరం చిన్నవాడు అయినా కూడా అతను ఇంకా ఫిట్గానే ఉన్నాడు‘ మగవాళ్లలో మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ స్థాయిలు చురుకుగా ఉన్నప్పుడు, మంచి ఫిట్నెస్ పొందుతారని అది సాధారణమేనని చెప్పారు. అంటే మగతనం ఎక్కువైతే ఫిట్నెస్ దాంతో ఆడవాళ్ళ కు ఆకర్షణ కలగడం.. వల్ల ఇలాంటి ఎఫైర్స్ పుట్టుకొస్తాయన్నట్టుగా అభిప్రాయపడ్డారు. అదే ఇంటర్వ్యూలో తన నటనా జీవితంలో ప్రారంభంలో బాలీవుడ్ టాప్ సింగర్ కుమార్ సానుని కలుసుకున్నానని తొలిచూపులోనే నచ్చడంతో అదొక తక్షణ ఆకర్షణగా భావించానని వెల్లడించారు. తాను ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా ఊటీలో ఉన్నప్పుడు అదే సమయంలో కుమార్ సాను కూడా తన సోదరి, మేనల్లుడితో విహారయాత్రలో ఉన్నాడని అలా తమ మధ్య బలమైన అనుబంధం ఏర్పడిందన్నారు.పరిశ్రమలో తన ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్న ఆమె... గతంలో గౌరవప్రదమైన కుటుంబాలకు చెందిన మహిళలు అరుదుగా మాత్రమే సినిమాల్లో కెరీర్ను ఎంచుకునేవారని అన్నారు. దానికి తగ్గట్టే అప్పటి పరిస్థితులు ఉండేవని చెప్పారు. లైటింగ్ టెక్నీషియన్లు కూడా నటీమణుల పట్ల తరచుగా అనుచితమైన ఆలోచనలతో ఉంటారని, ఆమె వెల్లడించడం విశేషం ‘వారు తమ చేతులపై పెర్ఫ్యూమ్తో వస్తారు, వాటిని హీరోయిన్ వైపు చాచేవారని అంతేకాక హీరోయిన్ల చెవుల్లో అసభ్యకరమైన విధంగా గుసగుసలాడేవారు‘ అని ఆమె అన్నారు. ఈ నేపధ్యంలో అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరమన్నారు. తానెలా ఇలాంటి పరిస్థితుల నుంచి తనను తాను కాపాడుకున్నానో కూడా వివరించారు.‘షూటింగ్ సమయం అయిపోయాక ఆకలితో ఉన్న సింహాలు బయటికి వచ్చి, బయట తిరుగుతున్నట్లుగా ఉండేది. కొంతమంది చాలా మర్యాదగా సాయంత్రం కలుద్దామా? అని ఫోన్లు చేస్తే, మరికొందరు మాత్రం మరింత దూకుడుగా ప్రవర్తించేవారు అంటూ వెల్లడించారు. అలాంటి సందర్భాల్లో తన హెయిర్డ్రెస్సర్ తరచుగా తన గదిలో రక్షణగా ఉండేవాడని చెప్పారామె తాను అందుబాటులో లేనని లేదా డిన్నర్కి బయటకు వెళ్లారని చెబుతూ, ఆమె హెయిర్డ్రెసర్ వారిని తెలివిగా తప్పించేవాడని గుర్తు చేసుకున్నారు. -
ముంబై పై హైదరాబాద్ పై చేయి... ఇండియన్ సినిమా అడ్రెస్ మారనుందా?
భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో ఇక్కడివాడే, అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు ఇక్కడివాడే, అత్యధిక చిత్రాలు రూపొందేది ఇక్కడే...ఇలాంటి అనేకానేక విశేషాలతో ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ టాలీవుడ్కి రాజధానిగా ఉన్న హైదరాబాద్... ఇప్పుడు శరవేగంగా భారతీయ సినిమాకు రాజధానిగా మారిపోతోంది. నిజానికి ముంబై చాలా కాలంగా భారతదేశ చలనచిత్ర రాజధాని అనేది తెలిసిందే, దేశంలో ఏ భాషా చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులైనా, దర్శకులైనా, సాంకేతిక నిపుణులైనా తమ కెరీర్లో కనీసం ఒక్కసారైనా హిందీ సినిమా చేయాలని కలలు కంటారు. అలా చేయడం అంటే తమకు ప్రమోషన్ వచ్చినట్టుగా భావిస్తారు. ఒకప్పుడు దక్షిణాది సూపర్స్టార్లు అనేక మంది హిందీ సినిమాల ద్వారా బాలీవుడ్పై తమదైన ముద్ర వేయాలని విఫలయత్నం చేసినవారే.ఆ ఆధిపత్యం ఇక గతం...?అయితే ఇండియన్ మూవీపై ముంబై ముద్ర ఇక గతంగా మారనుందా? ఇప్పటిదాకా ముంబై కేంద్రంగా సాగుతున్న భారతీయ సినిమా పరిశ్రమ క్రమంగా హైదరాబాద్ తన స్థానాన్ని ఆక్రమించడంతో తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.గతంలో, బాలీవుడ్ అవకాశాల కోసం చాలా మంది తెలుగు తమిళ నటీనటులు ముంబైకి తరచుగా వచ్చేవారు. అంతేకాదు బాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు అంటే దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ ఉండేది. అక్కడి చిన్నా చితకా నటీనటులు కూడా హైదరాబాద్ వచ్చి తెలుగు సినిమాల్లో నటించాలంటే డబుల్, త్రిబుల్ ఫీజులు డిమాండ్ చేసేవారు. అయినా వాళ్లనే తెచ్చుకుని నిర్మాతలు గొప్పలు చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ రివర్స్ అయింది.ఛలో హైదరాబాద్...అంటున్న దర్శక నిర్మాతలుతెలుగులో రూపొందిన పాన్–ఇండియా చిత్రాల వెల్లువ పరిశ్రమను పునర్నిర్మించింది, హిందీ సినిమాను చాలా పెద్ద మార్కెట్లో ఓ చిన్న భాగం గా మార్చేసింది. రాజమౌళి బాహుబలి సిరీస్ నుంచి, మనవాళ్లు పాన్–ఇండియా చిత్రాల వైపు మళ్లడం మరింత పెరిగింది. అకస్మాత్తుగా ఊపందుకున్న ఈ ట్రెండ్తో ఉక్కిరి బిక్కిరవుతున్న ముంబై చిత్రనిర్మాత దర్శకులు ఆ స్థాయి చిత్రాల కోసం దక్షిణ భారత పరిశ్రమపై, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న వారిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ముంబై నుంచి దర్శక నిర్మాతలు ఇక్కడి నటీనటుల కాల్షీట్స్ కోసం ప్రయత్నించే క్రమంలో హైదరాబాద్ వస్తున్నారు.ముంబైకి చెందిన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు కూడా తెలుగు సినిమా నిర్మాతలతో ప్రాజెక్ట్ల గురించి చర్చించేందుకు హైదరాబాద్కు ఛలో అంటున్నారు.నటీనటులు సైతం అదే బాట...ముంబైకి చెందిన చాలా మంది నటులు నటీమణులు క్రమం తప్పకుండా హైదరాబాద్కు వస్తున్నారు, నిర్మాతలు దర్శకులతో నిత్యం టచ్లో ఉంటున్నారు. తెలుగు దర్శకుడు సందీప్ వంగా యానిమల్ సినిమా ద్వారా బాబీ డియోల్కి అందించిన బాక్సాఫీస్ హిట్ లాగే పాన్–ఇండియా చలనచిత్రాలు తమ కెరీర్ పునరుజ్జీవనాన్ని అందిస్తాయని ఆశిస్తూ బాలీవుడ్లోని అగ్రశ్రేణి నటీనటులు కూడా హైదరాబాద్కు చెందిన చిత్ర నిర్మాత దర్శకులతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారు.తిరిగొస్తున్న వలస ప్రముఖులుదూరపు కొండల నునుపును చూసి ముచ్చటపడిన పలువురు దర్శకులు, నటీనటులు తూచ్ అనుకుంటున్నారు. గతంలో దర్శకుడు పూరీ జగన్నాధ్, ముంబైలో స్థిరపడాలని భావించాడు. అయితే తిరిగి హైదరాబాద్కు మారాలని నిర్ణయించుకున్నాడు. అలాగే ఇక్కడ అవకాశాలు బాగున్నా సరే బాలీవుడ్ ఛాన్సుల కోసం పెట్టె బేడా సర్ధుకున్న పలువురు తారలు సైతం తిరిగి హైదరాబాద్ వైపు చూస్తున్నారు. నిజానికి ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ, మళయాళ చిత్రాలు సైతం భారతీయ సినిమా రంగంలో సత్తా చాటుతున్నాయి. ఇలా మొత్తంగా దక్షిణాది చిత్రాలు భారీ విజయాలు నమోదు చేస్తున్న నేపధ్యంలో ఏర్పడిన పరిస్థితి హైదరాబాద్కు లాభించిందని చెప్పాలి. మిగిలిన ఏ దక్షిణాది భాషా చిత్ర పరిశ్రమకూ హైదరాబాద్ లాంటి వైవిధ్యభరిత అవకాశాలు అందించే అత్యాధునిక నగరం లేకపోవడం కూడా మరో కారణం. ఇటీవల బాలీవుడ్ తారలు, ప్రముఖులు హైదరాబాద్లో రెస్టారెంట్లు, జిమ్స్, బొటిక్స్ తదితర వ్యాపారాలు ప్రారంభిస్తూ హైదరాబాద్కు తరచుగా రాకపోకలు సాగించేందుకు మరికొన్ని కారణాలు సృష్టించుకుంటున్నారు. ఇలాంటి వ్యాపారాల్లో టాలీవుడ్ ప్రముఖులు సైతం పార్ట్నర్స్గా మారుతున్నారు. -
నా సినిమాలో ఆ సీన్ను అమ్మాయిలు షేర్ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్ క్షమాపణ
సాధారణంగా తాము తీసిన చిత్రాల్లోని తప్పొప్పుల గురించి నిజాయితీగా సమీక్షించుకునే దర్శకులను మనం చూడలేం. ఇక సినిమా రూపొందించే సమయంలో తమపై ఉన్న సామాజిక బాధ్యతను కూడా గుర్తించుకోవడం అంటే అలాంటి దర్శకుల్ని భూతద్ధం పెట్టి వెదకాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ డైరెక్టర్ తాను తీసిన సినిమాలోని సన్నివేశాల గురించి తానే చెప్పి...అవి అలా తీసి ఉండకూడదని, సమాజంపై వ్యతిరేక ప్రభావం చూపే అలాంటి సీన్స్ తీసి, రాసినందుకు పశ్చాత్తాప పడుతున్నానని చెప్పడం ఓ విశేషం. అంతేకాదు...ఈ చిత్రం అతనికి గణనీయమైన ప్రశంసలు విజయాన్ని అందుకున్నది కావడం మరింత విశేషం. దర్శకుడు అరుణ్ కుమార్ ఇటీవల తెరకెక్కించిన 'వీర ధీర శూరన్' ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ దర్శకుడు అంతకు ముందు దర్శకత్వం వహించిన సేతుపతి (2016) గురించి ప్రస్తావించాడు. విజయ్ సేతుపతి రమ్య నంబీస్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ తమిళ యాక్షన్ డ్రామా హిట్ అయినందుకు ఆయన గర్వపడలేదు. పైగా ఆ సినిమాలో ఆక్షేపణీయ అంశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. అయితే అవి ఆ సమయంలో గుర్తించేందుకు తనకు అవసరమైన అనుభవం లేదని అన్నాడు. తాను తీసిన ఆ సన్నివేశాన్ని యువతులు సోషల్ మీడియాలో పంచుకోవడం గమనించాక మాత్రమే ఒక సినిమా ప్రభావం ఎంత ఉంటుంది? అనేది తనకు స్పష్టమైందని కూడా అతను చెప్పాడు.సేతుపతిలో ఉన్న ఆ సన్నివేశం ఏమిటంటే...‘నన్ను కొట్టినా.. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి ప్రేమగా నన్ను అక్కున చేర్చుకుంటాడు. అందుకే అతనంటే ఇష్టం’ అని రమ్య నంబీస్సన్ అంటుంది. అంటే మగవాళ్లు ఆడవాళ్లపై శారీరక హింసను ప్రేరేపించేదిగా ఆ సంభాషణ ఉండడం గమనార్హం. ఆ సన్నివేశం తీయడంతో పాటు ఆ సినిమాకు రచయిత కూడా అయిన అరుణ్కుమార్ ఇప్పుడు దాని గురించి బాధపడ్డారు. ‘‘అది తప్పు. అప్పట్లో నేను ఏం చేశానో..నాకు అనుభవం లేదు’’ అంటూ ఆయన వెల్లడించాడు. కోట్ల మంది సినిమా చూస్తారని, అది అలా అలా విస్త్రుతం అవుతూనే ఉంటుందని కాబట్టి, మన సినిమాల్లో మనం ఒక చిన్న తప్పు చేస్తే, అది ఎప్పటికీ చేసినట్లే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. అమ్మాయిలు ఆ సన్నివేశాన్ని వారి వాట్సాప్ స్టేటస్గా పోస్ట్ చేయడం చూసి తాను బాధపడడం మాత్రమే కాదు నిజంగా భయపడుతున్నా కూడా అంటూ తానీ సన్నివేశం తీసినందుకు ఇప్పుడు క్షమాపణలు అన్నాడాయన. .అదే విధంగా. ‘‘సేతుపతిలో, ఓ పిల్లవాడు తుపాకీని పట్టుకోవడం రమ్య పాత్ర అకస్మాత్తుగా దాన్ని లాక్కునే మరో సన్నివేశం ఉంది. పిల్లవాడికి ఆయుధం ఇవ్వకూడదని తెలిసినా అలా చేయడం తప్పే’’అన్నారాయన. విజయ్ సేతుపతి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన పన్నైయరుమ్ పద్మినియుమ్ (2014)తో చిత్ర రంగ ప్రవేశం చేసిన తర్వాత, అరుణ్ కుమార్ మరో నాలుగు చిత్రాలకు నాయకత్వం వహించాడు, వీటిలో ఎక్కువ విమర్శకుల ప్రశంసలు అందుకున్నవే. ఏదేమైనా విజయవంతమైన తన చిత్రంలోని లోపాల్ని తానే చెబుతూ వాటిని పునరావృతం కానివ్వనని అంటున్న తమిళ దర్శకుడు అరుణ్ కుమార్ వైఖరి నిజంగా మెచ్చదగింది. ఒక హిట్ చిత్రాల దర్శకుడు సినిమా విజయవంతం అయిందని సరిపెట్టుకోకుండా తన సినిమా గురించి తాను నిజాయితీగా సమీక్షించుకోవడం సామాజిక బాధ్యత పట్ల తన వంతు పాత్ర పోషిస్తూ క్షమాపణలు అడగడం.. హింస, సెక్స్, వయోలెన్స్చుట్టూనే పరిభ్రమిస్తూన్న సినిమాల్ని చూసి విరక్తికి గురవుతున్నవారికి ఊరట అనే చెప్పాలి... చుట్టూ కమ్ముకున్న చీకటిలో కానవస్తున్న వెలుగురేఖ లాంటిదే అని చెప్పాలి. -
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
సినిమా రెమ్యునరేషన్ల విషయానికి వస్తే ఎప్పుడూ నటీనటులదే చర్చకు వస్తుంది కానీ దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల గురించి రాదు. కానీ ఇదంతా గతం... ఇప్పుడు రెమ్యునరేషన్స్ విషయంలో సినిమా దర్శకులు హీరోలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. కొందరు దర్శకులైతే టాప్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు దర్శకుల పారితోషికాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.నెం.1 ప్లేస్లో జక్కన్నప్రస్తుతం ఎన్నో రకాలుగా ఉత్తరాది సినీపరిశ్రమను వెనక్కి నెట్టేసిన దక్షిణాది.. డైరెక్టర్ల రెమ్యునరేషన్ల విషయంలోనూ తానే టాప్ అని నిరూపించుకుంటోంది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడిగా టాలీవుడ్ మెగా డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) నెం1 స్థానంలో ఉన్నాడు. బాహుబలి 1, 2లతో పాటు RRRల ద్వారా వందలు, వేల కోట్ల కలెక్షన్లతో చరిత్రను తిరగరాసిన ఈ డైరెక్టర్... దాదాపుగా రూ.200 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది. దశాబ్ధానికిపైగా హిట్స్ ఇస్తున్న రాజమౌళి సంగతి అలా ఉంచితే... మిగిలిన టాప్ 5లో కొందరు ఒకటి, రెండు సినిమాలతోనే అగ్రస్థానానికి ఎగబాకడం గమనార్హం.రెండో ప్లేస్ కూడా మనదే..అలా చూస్తే 2వ స్థానంలో కూడా తెలుగుదర్శకుడైన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఉండడం విశేషం. తెలుగు అర్జున్రెడ్డి తర్వాత ఒక్కసారిగా బాలీవుడ్కి ఎదిగిపోయిన సందీప్... అర్జున్ రెడ్డి హిందీ రీమేక్, ఆ తర్వాత యానిమల్ సినిమాలతో రూ.100 నుంచి రూ.150 కోట్లు డిమాండ్ చేసే స్థాయికి వెళ్లాడు. ఏకంగా నెం. 2 స్థానంలోకి ఎగిరి కూర్చున్నాడు. కేవలం మూడే సినిమాలతో ఆయన ఈ ఘనత సాధించడం చెప్పుకోదగ్గది. అదే రకంగా దేశం అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ ది సైతం అనూహ్యమైన విజయయాత్రే. 100% సక్సెస్ రేటుఈ తమిళ దర్శకుడు అట్లీ కుమార్ (Atlee Kumar) కేవలం ఆరు చిత్రాలతో 100 శాతం సక్సెస్ రేటుతో 3వ స్థానం దక్కించుకున్నాడు. తమిళ చిత్రాలైన మెర్సల్, బిగిల్లతో పాటు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ వంటి బ్లాక్ బస్టర్లతో అట్లీ భారతీయ సినిమాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గత 2023లో విడుదలైన జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి ప్రపంచ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొంత విరామం అనంతరం ప్రస్తుతం తాత్కాలిక టైటిల్ ఎఎ22ఎక్స్ఎ6 పేరుతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ అట్లీని అమాంతం 3వస్థానంలోకి చేర్చింది. 233% రెమ్యునరేషన్ పెంచిన డైరెక్టర్జవాన్ కోసం రూ. 30 కోట్లను మాత్రమే అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఒకేసారి రూ. 100 కోట్లకు అంటే.. దాదాపుగా 233% తన పారితోషికం పెంచేశాడు. ఈ డీల్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే డైరెక్టర్గా అట్లీని మూడవ స్థానంలో నిలిపింది. ఆ తర్వాత రూ.80 కోట్లతో 4వ స్థానంలో బాలీవుడ్ దర్శకుడు రాజ్కుమార్ హిరానీ, రూ.75 కోట్లతో 5వస్థానంలో సుకుమార్, రూ. 55–65 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీలు ఉన్నారు.చదవండి: ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్ -
యాడ్స్లో అగ్రహీరోల హవా..రోజుకి అన్ని కోట్లా?
హైదరాబాద్ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్లో ఆ నలుగురూ కనపడుతుంటారు. అరవై లో ఇరవైలాగా యాడ్స్లోనూ కుర్రహీరోలకు పోటీగా అదరగొడుతుంటారు. తెలుగు సీనియర్ హీరోలు వయసు పెరుగుతున్నా తగ్గేదేలే అన్నట్టుగా ప్రకటనల ప్రపంచంలో దూసుకుపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) తన కెరీర్లో ఫిలిప్స్ ఇతర బ్రాండ్లకు ఎండార్స్మెంట్లతో సహా అనేక ప్రకటనలలో పాలుపంచుకున్నారు ఆయన చాలా కాలం క్రితమే ప్రముఖ బ్రాండ్స్కు పనిచేశారు. ఆయన చేసిన థమ్సప్ యాడ్ సంచలం సృష్టించడంతో పాటు వివాదాలకు కూడా కేంద్రబిందువైంది. ఆ యాడ్లో ఆయన ప్రస్తుత యువ కధానాయకుడు శర్వానంద్తో కలిసి కనిపించడం విశేషం. సమకాలీకులతో పోలిస్తే ఒకప్పుడు యాడ్ వరల్డ్లోనూ ముందున్న చిరంజీవి ప్రస్తుతం ఈ విషయంలో కొంత వెనుబడ్డారు. ఆయన కంట్రీ డిలైట్ ప్రకటనల్లో కనిపిస్తున్నారు.కింగ్ నాగార్జున(Nagarjuna Akkineni) ఒకప్పుడు ప్రకటనల విషయంలో చాలా దూసుకుపోయారని చెప్పాలి. సమకాలీకుల కంటే బాగా ముందుండేవారు. ఐదు పదుల వయస్సు దాటిన హీరోల్లో మిగిలిన వారితో పోలిస్తే ఆయన ఎక్కువగా ప్రకటనల్లో ఆయన కనిపించారు. నాగార్జున అక్కినేని డాబర్ మెస్వాక్ టూత్పేస్ట్కు బ్రాండ్ అంబాసిడర్గా చేశారు, అలాగే కేరళకు చెందిన కళ్యాణ్ జ్యువెలర్స్కు బ్రాండ్ అంబాసిడర్. ఈ బ్రాండ్కి సంబంధించిన నాగ్ పోస్టర్లు ప్రకటనలు కళ్యాణ్ జ్యువెలర్స్కు మంచి గుర్తింపునిచ్చాయి. ఘడి డిటర్జెంట్తో సహా ఇతర ఉత్పత్తుల ప్రకటనలలో కూడా కనిపించిన నాగార్జున అమితాబ్ బచ్చన్ తో కలిసి యాడ్స్ కోసం స్క్రీన్ స్పేస్ను పంచుకోవడం విశేషం.విక్టరీ వెంకటేష్(Venkatesh) దగ్గుబాటి మణప్పురం జనరల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ లిమిటెడ్ , రామ్రాజ్ కాటన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు అదే విధంగా బైక్ వొ మార్కెటింగ్ బ్రాండ్ ప్రమోషన్ కార్యకలాపాలలో కూడా పాల్గొన్నారు. మూవీ ఈవెంట్స్ ప్రమోషన్స్ కంపెనీ అయిన శ్రేయాస్ మీడియా విక్టరీ వెంకటేష్ మెడ్ప్లస్ ప్రకటనతోనే ప్రకటనల రంగంలోకి అడుగు పెట్టింది. బైక్ వోలో వ్యూహాత్మక పెట్టుబడిదారు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న వెంకటేష్.. మార్కెటింగ్, ఔట్రీచ్ బ్రాండ్ ప్రమోషన్ కార్యకలాపాలకు సహకరిస్తున్నారు. ఈ భాగస్వామ్యం 2025 నాటికి భారతదేశం అంతటా 20,000 ఇవి ఛార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేయాలనే లక్ష్యంతో ఛార్జింగ్ నెట్వర్క్ను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది.తాజాగా అగ్రగామి రియల్ ఎస్టేట్ బ్రాండ్ కాసా గ్రాండ్ వెంకటేష్ను తమ బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. తాజాగా బాక్సాఫీస్ హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం తో...వెంకటేష్ ను మరింత మంది యాడ్ మేకర్స్ సంప్రదిస్తున్నట్టు సమాచారం.సమకాలీకులతో పోలిస్తే ఒకప్పుడు ప్రకటనల ప్రపంచంలో పూర్తిగా వెనుకపడిన మాస్ హీరో బాలకృష్ణ అరవై ఐదేళ్ల వయసులో బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కు టాప్ అడ్రెస్గా మారారు. తొలిసారి సౌత్ ఇండియా ఆధారిత కన్స్ట్రక్షన్ అండ్ ప్లాటింగ్ సర్వీసెస్ కంపెనీ సాయి ప్రియా గ్రూప్తో ప్రకటనల ప్రపంచంలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ప్రస్తుతం మాల్స్ దగ్గర నుంచి నగల బ్రాండ్ల దాకా ప్రమోట్ చేస్తున్నారు. రెండు రోజుల వర్క్కి గాను ఆయన రూ. 3 కోట్ల నుంచి ఆపైన దక్కించుకుంటారని యాడ్ నిపుణులు చెబుతున్నారు. అంతకుముందు, ఆయన ఓ రిటైల్ బ్రాండ్ ప్రచారంలో నటి ప్రగ్యా జైస్వాల్తో కలిసి కనిపించాడు. ‘అఖండ‘, ‘భగవంత్ కేసరి’ ‘వీరసింహారెడ్డి‘ వంటి హ్యాట్రిక్ హిట్లతో, నటుడిగా అతని స్థాయి పెరిగింది. ‘వరుసగా మూడు బ్లాక్బస్టర్లు కొట్టడంతో టాలీవుడ్లో తన సమకాలికుల కంటే యాడ్ వరల్డ్లో ముందున్నాడు -
విజయాల శ్రీ‘లీల’వెనుక రహస్యాలివే...
యువ నటి శ్రీలీల(sreeleela) నిస్సందేహంగా భారతీయ సినీరంగంలో తదుపరి పెద్ద స్టార్ కానుంది అంటున్నాయి సినీజోస్యాలు. తన అందం, ఆకర్షణ, ఎలక్ట్రిఫైయింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అసాధారణమైన ఇతర నైపుణ్యాలతో, ఆమె దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా మారింది. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ సరసన బాలీవుడ్లో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది. పుష్ప2లోని కిస్సిక్ పాటతో ఆమె ఉత్తరాది ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపారు. నిజానికి పుష్ప తొలి భాగంలో సమంత ఐటమ్ సాంగ్ హిట్ అయినా కూడా సమంతకు రానంత పాప్యురారిటీ శ్రీలీలకు వచ్చింది. ఆ పాట ఆమె హిందీ చిత్రసీమలోకి రెడ్కార్పెట్ వేసింది. దాంతో సౌత్లోనూ ఆమె క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది, ఇక ఆమె బాలీవుడ్లో మెరిసిపోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే...శ్రీలీల తాజా హిందీ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇటీవల, ఈ చిత్రం సెట్ నుంచి అనేక వీడియోలు ఫొటోలు ఆనలైన్ లో ప్రత్యక్షమయ్యాయి. మరుసటి తక్షణమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎరుపు రంగులో వదులుగా ఉండే దుస్తులు ధరించిన శ్రీలీల లుక్ ని, ఆమె రూపాన్ని మెచ్చుకుంటూ ఆమె పాత్ర గురించి ఊహాగానాలు చేస్తూ, అభిమానులు వీటిని షేర్ చేస్తున్నారు. ఓ రకంగా ఈ చిత్రానికి దక్షిణాదిలో విపరీతమైన టాక్ రావడానికి కారణం శ్రీలీలే అని చెప్పాలి. అందం, ప్రతిభ ఆత్మవిశ్వాసాల కలయికగా శ్రీలీల బాలీవుడ్లో రంగప్రవేశం చేస్తోంది. ఖచ్చితంగా కొన్నేళ్ల పాటు భారతీయ సినీరంగాన్ని ఊపే సత్తా ఆమెకు ఉందని బాలీవుడ్ మీడియా ఊహాగానాలు చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీలీలను ఈ స్థాయిలో నిలబెట్టిన కొన్ని ముఖ్యమైను అంశాలను పరిశీలించాలి..కన్నడ చిత్రం కిస్ (2019)తో శ్రీలీల మరపురాని అరంగేట్రం చేసింది, ఆమె సహజమైన సౌందర్యం, ప్రకాశవంతమైన స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్ర విజయం ఆమెకు కొత్త అవార్డులను సంపాదించిపెట్టింది, ఇది భారతీయ చలనచిత్రంలో ఆమె మంచి జర్నీకి నాంది పలికింది.రెండో విషయంగా చెప్పాల్సి వస్తే ఆమె నృత్య,నటనా ప్రతిభ గురించే చెప్పాలి. ధమాకా (2022)లో, జింతాక్ పాటలో చురుకైన రిథమ్, గ్రేస్ ఎక్స్ప్రెషన్స్ లతో శ్రీలీల తెలుగు సినిమాకి డాన్స్ డార్లింగ్గా మారింది.పెళ్లి సందడి (2021)లో సాంప్రదాయంగా కనపడి, భగవంత్ కేసరి (2023)లో యాక్షన్ సీన్స్ వరకు శ్రీలీల తనలోని షేడ్స్ స్కిల్స్ బాగా పండించింది. స్కంద (2023), ఆదికేశవ (2023), గుంటూరు కారం (2024) చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న పాత్రలతో తన స్కిల్స్కు సానబట్టింది.భాషపై పట్టు కూడా శ్రీలలకు అచ్చొచ్చిన మరో అంశం. కన్నడ, తెలుగు, తమిళం ఇంగ్లీషు భాషలపై ఆమెకున్న పట్టు ఆమెని విభిన్న భాషా చిత్రాల్లో, భిన్న పరిశ్రమల్లో బలంగా నిలబెట్టింది. వివిధ భాషా నేపథ్యాలకు చెందిన అభిమానులతో ఆమె సులభంగా మమేకం కాగలుగుతోంది. అంతర్జాతీయ ట్రెండ్స్ను ఒడిసిపట్టగల శ్రీలీల ఫ్యాషన్ ఐకాన్గా కూడా ఆకట్టుకోగలుగుతోంది. ఆమె వార్డ్రోబ్ ఫ్యాషన్ ప్రియుల ఫేవరెట్ గా పేరొందింది.అధిక ఫ్యాషన్తో యువత కు మరింత దగ్గర కాగలుగుతోంది. ఆమె ఫ్యాషన్ లుక్స్ ఆమెను మ్యాగజైన్లపై, వెబ్సైట్స్లో తళుక్కుమనేలా చేస్తున్నాయి. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (2023) వంటి చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు, శ్రీలీల తన వైద్య విద్య పరిజ్ఞానం గురించి ఆమె స్వచ్ఛంద సేవల గురించి బాగా వెలుగులోకి వచ్చింది. ఆమె సహకారం అందిస్తున్న గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాలు మహిళల విద్యకు మద్దతు అందించడం వంటివి ఆమెను నటిగా మాత్రమే కాక అంతకు మించి భారతీయ సినిమా రంగంలో ఒక ప్రత్యేకమైన రోల్ మోడల్గా అవతరించేందుకు అవకాశం అందిస్తున్నాయి. -
26 ఏళ్ల నాటి అత్యంత ఖరీదైన సినిమా...ఇంకా విడుదల కాలేదు..!
ప్రస్తుతం అంతా భారీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. వందల కోట్ల బడ్జెట్తో సినిమాలు తెరకెక్కించకపోతే వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల బుర్రలోకెక్కించలేం అన్నట్టుగా ఉంది పరిస్థితి. కధ, కధనాలను బట్టి బడ్జెట్ అనడం కన్నా బడ్జెట్ను బట్టి కధ అన్నట్టు మారిపోయింది. ఐదూ, పది కోట్లతో తీసే సినిమాల గురించి మాట్లాడుకోవడం కూడా దండగ అన్నట్టుగా నోరెత్తితే భారీ సినిమాలే చర్చకు నోచుకుంటున్నాయి. అయితే భారీ చిత్రాలు అనేవి ఇప్పుడే కాదు ఒకప్పుడూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మన సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాలు దశాబ్ధాల క్రితమే తలపెట్టారు. అలాంటి ఒక సినిమా, ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే చరిత్రలోనే నెం1 భారీ చిత్రం అని పేర్కొనదగ్గ సినిమా... పాతికేళ్ల క్రితమే ప్రారంభమైంది. అయితే ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమా పేరు మరుదనాయగం (Marudhanayagam).‘మరుదనాయగం‘ అనేది 18వ శతాబ్దపు యోధుడు మహ్మద్ యూసుఫ్ ఖాన్ గురించిన చారిత్రక నాటకం స్ఫూర్తితో తలపెట్టారు. హిందీ, తమిళం, తెలుగు ఆంగ్లంతో సహా పలు భాషలలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్(Kamal Haasan) ను ఎంతో ప్రతిష్టాత్మకమైన, చారిత్రాత్మక కాలపు చిత్రం మరుధనాయగం సినిమా 1997లో, తన స్వీయ దర్శకత్వంలో ప్రారంభించారు. బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ అతిధిగా ఇది భారీ స్థాయిలో షూటింగ్ ప్రారంభమైంది. దీనికి సుజాత స్క్రిప్ట్ రాశారు. నాజర్, సత్యరాజ్, విష్ణువర్ధన్ తదితర నటులు కూడా ఈ సినిమాకు ఎంపికయ్యారు.(చదవండి: ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల)ప్రత్యేక పాత్రల కోసం అమితాబ్, రజనీకాంత్లను కూడా సంప్రదించినప్పటికీ వాళ్లు తిరస్కరించారు. అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు కీలకపాత్రలో హాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ కేట్ విన్స్లెట్ ని కూడా అనుకున్నారు. సినిమా టెస్ట్ షూట్ కోసం, కమల్ హాసన్ మాజీ భార్య, నటి సారిక బ్రిటీష్ ఫ్రెంచ్ సైన్యం అధికారులతో పాటు హిందూ ముస్లిం యోధులను ప్రతిబింబించేలా 7,400 వరకు దుస్తులు ఉపకరణాలను తయారు చేయించారు. రాజస్థాన్లోని జైపూర్లో రూ.1 కోటి ఖర్చుతో టెస్ట్ షూట్ చేశారు. అప్పట్లోనే ఈ సినిమాకు రూ.80 నుంచి 90 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు..అంటే ప్రస్తుతం లెక్కల ప్రకారం చూస్తే...ఇది రూ..650 కోట్ల వరకూ ఉండొచ్చు.(చదవండి: ఎన్టీఆర్ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్’ అంటే షాకయ్యా: రాజీవ్)అట్టహాసంగా అతిరధుల సమక్షంలో ప్రారంభమైన ఈ సినిమా,30 నిమిషాల రన్ టైమ్ పూర్తయిన తర్వాత 1998 చివరలో షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రాన్ని సహ–నిర్మాతగా నిర్మించాలని అనుకున్న ఒక బ్రిటిష్ కంపెనీ, అర్ధంతరంగా వెనక్కి తగ్గడంతో, మరుధనాయగం పనులు అకస్మాత్తుగా ఆగిపోయాయి. బ్రిటీష్ నిర్మాణ సంస్థ ఉపసంహరణ కారణంగా ఏర్పడిన ఆర్థిక పరిమితులు అడ్డంకిగా మారాయి. ఈ సినిమా పూర్తి కాలేదు... ఇప్పటికీ విడుదల కాలేదు, ప్రాజెక్ట్ ఎక్కడిది అక్కడే ఉండిపోయింది. ఆ బ్రిటిష్ కంపెనీ ఉపసంహరించుకోకుంటే ఈ సినిమా ఖచ్చితంగా పూర్తయి విడుదలై ఉండేది ఎన్నో సంచలనాలు నమోదు చేసేది.ఆ బ్రిటిష్ కంపెనీ సినిమా నిర్మాణం నుంచి ఉపసంహరించుకోవడానికి కారణం భారతదేశంలో జరిగిన పోఖ్రాన్ అణు బాంబు పరీక్ష . అంటే కమల్ సినిమా ఆగిపోవడానికి మన భారతరత్న నాటి అణు పరీక్షల సారధి అబ్ధుల్ కలాం పరోక్షంగా కారణం అయ్యారన్నమాట. అయితే అది తన కలల ప్రాజెక్ట్ అని కమల్ హాసన్ చెబుతుంటారు. కానీ ఇప్పుడు గానీ ఆ సినిమా స్క్రిప్ట్ను పునరుద్ధరించాలంటే గణనీయమైన మార్పులతో పాటు, దీనికి ఓ యువ కథానాయకుడు అవసరమని కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎప్పటికైనా తెరకెక్కుతుందో లేదో.... -
మొదటి పెళ్లి దుస్తుల్ని వేలంలో అమ్మేశా, రెండో పెళ్లి దుస్తులు..వెల్లడించిన నటి
నటి దియా మీర్జా మన హైదరాబాదీ అమ్మాయే. మిస్ ఏసియా పసిఫిక్ ఇంటర్నేషనల్గా అందాల సుందరిగా కిరీటాన్ని దక్కించుకున్న తర్వాత వరుసగా విభిన్న భాషల్లో సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం బాలీవుడ్లో నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తెలుగులో ఆమె చివరగా నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ చిత్రంలో చేసింది. సినిమాలతో పాటు పలు రకాల వ్యాపారాలు కూడా చేస్తూ స్థిరపడిన దియా మీర్జా... వ్యక్తిగత జీవితంలో ప్రేమ పెళ్లి మాత్రం విఫలమైంది. ఆమె గత 2014లో తన వ్యాపార భాగస్వామి సాహిల్ సంఘాని పెళ్లాడింది. అయితే ఐదేళ్లలోనే ఆ పెళ్లి పెటాకులైందని ఆమే స్వయంగా ప్రకటించింది. అనంతరం రెండేళ్లు గ్యాప్ ఇచ్చి అప్పటికే వివాహితుడు, ఒక బిడ్డకు తండ్రి అయిన వైభవ్ రేఖిని పెళ్లి చేసుకుని దియా మీర్జా రేఖిగా మారింది. అయితే విడాకుల తర్వాత కూడా ఎప్పుడూ తన మొదటి పెళ్లి గురించి దియామీర్జా మాట్లాడింది లేదు. ఇటీవల మాత్రం ఒక ఇంటర్వ్యూలో, దియా మీర్జా తన పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, ఆ తరహా ఆలోచనల వెనుక ఉన్న పలు అంశాల్ని గురించి మాట్లాడుతూ తన రెండవ పెళ్లిని పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ తరహాలో చేసుకున్నట్టు వివరించింది.తమ ఇంటి తోటలోనే అత్యంత నిరాడబంరంగా సహజమైన పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది. చేతితో తయారు చేసిన వ్యక్తిగతీకరించిన బహుమతులు స్థానిక సహజమైన అలంకరణ ఉత్పత్తులనే వివాహం కోసం వాడినట్టు తెలిపారు. ఆహార వ్యర్థాలను తగ్గించడానికి అతిథులకు శాకాహార మాంసాహార వంటకాల ఖచ్చితమైన సంఖ్యను నిర్ధారిస్తూ, భోజనాలను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేశామన్నారు. కేవలం ఓ మహిళా పూజారితో దంపతులు సాదాసీదాగా వేడుక పూర్తి చేశామన్నారు. వధువుగా ధరించడానికి బాలీవుడ్ వధువులకు సాధారణమైన లెహెంగాకు బదులుగా ఎరుపు రంగు బనారసీ చీరను దియా ఎంపిక చేసుకోవడం విశేషం.ఇదే సందర్భంగా ఆమె తన మొదటి పెళ్లి గురించి కూడా గుర్తు చేసుకుంది. ఆ పెళ్లి ఒక ఫార్మ్ హౌజ్లో జరిగింది. ఆడంబరంగా జరిగిన ఆ పెళ్లిలో ఆమె ఖరీదైన దుస్తులను ఎంచుకుంది. ఆ పెళ్లిలో ఆమె బాలీవుడ్ వధువుల తరహాలోనే లెహంగానూ ధరించింది. అయితే వివాహాల తర్వాత బ్రైడల్ లెహంగాలు తరచు నిరుపయోగంగా ఉంటాయని తెలిపింది. వాటిని పారవేయలేక, ఇటు ధరించనూ లేక వార్డ్రోబ్స్లో ఉంచుతారంది. ఒక పర్యావరణ అనుకూల మనస్తత్వంతో తాను దాన్ని ఇష్టపడలేదని చెప్పింది. దాంతో ఆమె తన మొదటి పెళ్లిలో తాను ధరించిన తన వివాహ లెహంగాను వేలం వేయాలని అనుకుంది. అనుకున్నట్టుగానే దాన్ని మంచి ధరకు వేలం వేశానని వెల్లడించింది. నిరుపయోగంగా పడి ఉండకూడదనే తాను తన రెండవ పెళ్లికి సాధారణ చీరను ఎంచుకున్నానని తన భర్త వైభవ్ రేఖీ సైతం అదే పనిచేశారని తెలిపింది. పెళ్లి తర్వాత అలమారాలో ఉపయోగించకుండా కూర్చోకుండా జీవితాంతం ధరించగలిగే దుస్తులను ఆయన కూడా ఎంచుకున్నట్లు కూడా ఆమె పేర్కొంది. ఆమె పెళ్లి రోజున, దియా మీర్జా సాంప్రదాయ ఎరుపు రంగుకు దూరంగా డిజైనర్ రీతూ కుమార్ తయారు చేసిన ఆకుపచ్చ జర్దోసీ ఘరారాను ఎంచుకుంది. -
రోజుకి రూ.లక్ష..అయినా ఊటీలో సినిమా షూటింగ్స్ బంద్...ఎందుకంటే?
దక్షిణాది ఉత్తరాది తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషా చిత్రాల షూటింగ్ లకు స్వర్గధామం లాంటిది తమిళనాడులోని ఉదకమండలం...అదే ఊటీ(Ooty) . మన రోజా, గీతాంజలి తదితర దక్షిణాది చిత్రాలతో పాటు నాటి ‘ఖయామత్ సే ఖయామత్ తక్ నుంచి నిన్నా మొన్నటి బర్ఫీ దాకా ఊటీ అంటే సినిమా షూటింగ్లకు అచ్చొచ్చిన బ్యూటీగా నిలిచింది. ‘అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ,‘ ‘అందాజ్ అప్నా అప్నా,‘ ‘బర్ఫీ,‘ ‘దిల్ సే,‘ ‘జో జీతా వోహీ సికందర్,‘ ‘రాజా హిందుస్తానీ,‘ వంటి బాలీవుడ్ సినిమాలు ఊటీ అందాలకు అద్దం పట్టాయి.ఏళ్లు గడుస్తున్నా, అనేక రకాల షూటింగ్ స్పాట్స్ అందుబాటులోకి వస్తున్నా ఊటీకి మాత్రం షూటింగ్స్ తాకిడి తగ్గడం లేదు. ఇటీవల ‘రివర్డేల్‘ అనే కాల్పనిక పట్టణానికి నేపథ్యంగా నెట్ఫ్లిక్స్ చిత్రం ‘ది ఆర్చీస్‘ కూడా ఊటీలో చిత్రీకరించారు. అలాగే ది లారెన్స్ స్కూల్, లవ్డేల్తో సహా ‘రాజ్‘ చిత్రం కూడా ఊటీలో తీసినవే. ఏటా వందలాదిగా షూటింగ్స్ కు ఊటీ కేంద్రంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఊటీలోని బొటానికల్ గార్డెన్స్, రోజ్ గార్డెన్, టాయ్ ట్రైన్ తదితర ప్రాంతాలతో పాటు పెద్ద సంఖ్యలో ఉన్న తేయాకు తోటలు కూడా సినిమా కెమెరాలకు పని చెబుతూనే ఉంటాయి.ఈ నేపధ్యంలో ప్రస్తుతం పర్యాటకుల తాకిడితో ఊటి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ముఖ్యంగా గత ఏడాది కనీ విని ఎరుగని స్థాయిలో భారీ సంఖ్యలో పర్యాటకులు ఊటీకి వెల్లువెత్తారు. ఊటీకి వెళ్లేదారిలో భారీగా ట్రాఫిక్ జామ్స్ సైతం ఏర్పడ్డాయి. ఇక గత వేసవిలో ఊటీలో కాలుష్యం ఎన్నడూ లేనంత స్థాయిలో నమోదైంది. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. ఇ పాస్ వంటి నిబంధనలతో పర్యాటకుల రాకను నియంత్రించింది. రాకపోకలను కట్టుదిట్టం చేసింది. అయితే గత ఏడాది అనుభవాలతో ఈ సారి ప్రభుత్వం మరింత ముందుగా మేల్కొంది. ముందస్తుగానే అంటే ఏప్రిల్ నెల రాకుండానే ఇ పాస్ నిబంధన విధించడంతో పాటు ఊటీలోకి 6వేల వాహనాలకు మాత్రమే ఎంట్రీ వంటి పలు ఆదేశాలు జారీ చేసింది. అదే క్రమంలో సినిమా షూటింగ్స్ పైనా నిషేధం విధించింది. ఈ ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు ప్రభుత్వ బొటానికల్ గార్డెన్, గవర్నమెంట్ రోజ్ గార్డెన్ సహా ఎనిమిది పార్కులలో సినిమా షూటింగ్లను అక్కడి ఉద్యానవన శాఖ తాత్కాలికంగా నిషేధించింది. వందల, వేల సంఖ్యలో పర్యాటకులు తమ సెలవులను ఆస్వాదించేందుకు ఈ పార్కులను సందర్శిస్తుండటంతో వారికి ఇబ్బందులు ఎదురవకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యానవన శాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, ‘‘మేము చెన్నైలోని మా ఉద్యానవన శాఖ డైరెక్టర్ నుంచి సరైన అనుమతి పొందిన తర్వాత మాత్రమే చిత్ర యూనిట్లను అనుమతిస్తున్నాం. సినిమా నిర్మాతలు ఒక రోజు షూటింగ్ కోసం కనీసం 25,000 నుంచి గరిష్టంగా 1 లక్ష వరకు చెల్లించాలి. అయితే, వేసవి సెలవుల కారణంగా ఈ ప్రదేశాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఊటీలోని పలు పార్కులలో అన్ని సినిమా షూటింగ్లను తాత్కాలికంగా నిషేధించాం’’ అని చెప్పారు. -
రహస్య సంభాషణల కోసం కొరియన్ భాష.. మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
దక్షిణాది నటుడిగా తన ప్రయాణం ప్రారంభించిన ఆర్ మాధవన్ (R Madhavan ) ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రముఖ నటుడిగా మారారు. కేవలం అభినయానికే ప్రాధాన్యతను ఇస్తూ టాప్ నటులుగా మారిన అతి తక్కువ మందిలో ఆయన ముందు వరుసలో ఉంటారు. గత ధోరణికి భిన్నంగా ఆయన ఇటీవల కాస్త ఎక్కువగానే ఇస్తున్న ఇంటర్వ్యూల్లో అనేక సమకాలీన, సామాజిక అంశాలను ప్రస్తావిస్తున్నారు. తాజాగా చాలా మంది తల్లిదండ్రులకు సమకాలీన పాప్ సంస్కృతి పరిశీలకులకు సుపరిచితం అయిన ఓ అంశాన్ని ప్రస్తావించాడు, ప్రస్తుతం భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కె.పాప్ పట్ల ఆయన తొలిసారిగా స్పందించాడు.ప్రస్తుత ఓటీటీ యుగం పుణ్యమా అని అనేక దేశాలకు చెందిన సంస్కృతీ సంప్రదాయాలు మన యువతకు చేరువయ్యాయి. అందులో అత్యంత వేగంగా పిల్లల్ని ఆకట్టుకుంటోంది కొరియన్ పాప్ (K Pop) సంగీతం, కొరియన్ సినిమా, సిరీస్లు. ఈ కొరియన్ సంస్కృతి పట్ల భారతీయ పిల్లలు పెంపొందించుకున్న గాఢమైన ఆకర్షణపై మాధవన్ ఆశ్చర్యంతో పాటు తన ఆందోళనను సైతం వ్యక్తం చేశారు, ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆయన ఊపందుకుంటున్న ధోరణిపై తన ఆలోచనలను ఆందోళననను పంచుకున్నాడు.‘దక్షిణాదిలో–ఇంకా చెప్పాలంటే భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో–కె–పాప్ సరికొత్త సంస్కృతిగా అవతరిస్తోంది‘ అని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. యువత లో కె–పాప్ సంస్కృతి ఊహలకు అందనంత లోతుగా అల్లుకుపోతోందని వారి కథా కథనాలలో భారతీయ సినిమా తో పోలిస్తే అంత వైవిధ్యం ఏం ఉందో? అదెందుకు వారిని అంతగా ఆకట్టుకుంటుందో తెలియడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అయితే వీటన్నింటి కన్నా తల్లిదండ్రులకు మరింత ఆందోళనను కలిగించే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అదేమిటంటే... అనేకమంది భారతీయ యువత కొరియన్ భాషను నేర్చుకుంటున్నారు అనేది. నిజానికి అన్యభాషా చిత్రాలను ఆదరించడం, వారి సంగీతాన్ని ఎంజాయ్ చేయడం ఎప్పుడూ ఉండేదే. అయితే ఏకంగా కొరియన్ భాషను నేర్చుకుని మరీ ఆ సంగీతం, వినోదాన్ని ఆస్వాదించాలనే వారి బలమైన ఆసక్తి పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఆయన మరో రహస్యాన్ని కూడా బహిర్గత పరిచాడు. కొరియన్ భాషను నేర్చుకుంటున్న పిల్లలు వారి తల్లిదండ్రులకు అర్థం కాని రహస్య సంభాషణల కోసం కోడ్ లాంగ్వేజ్ గా కూడా ఉపయోగిస్తున్నారనే చేదైన వాస్తవాన్ని ఆయన తెలియజేశాడు. సాంకేతిక విప్లవం కారణంగా ఇప్పటికే టీనేజర్లు రకరకాల మాయాజాలాల్లో ఇరుక్కుపోతున్న పరిస్థితుల్లో కొరియన్ భాషలో వారు సాధించే పట్టు ద్వారా పొందే ప్రయోజనం కేవలం సినిమా, పాప్ సంగీత వినోదానికే పరిమితం కాగా...దాని వల్ల తల్లిదండ్రులకు కలిగే నష్టం అంతకు మించి ఉండబోతోందని ఒక టీనేజర్ తండ్రి కూడా అయిన మాధవన్ చెబుతున్న విషయం ప్రతీ ఒక్క పేరెంట్ గుర్తు పెట్టుకోవాల్సిందే అనడంలో సందేహం లేదు. -
అమ్మో అన్ని యాడ్స్ శోభితకు ఎలా వచ్చాయి? సీక్రెట్ ఇదే..
అక్కినేని వారి ఇంటికి కోడలు అనే కేరాఫ్ శోభితా ధూళిపాలా (Sobhita Dhulipala)ను ఇటీవలే వరించి ఉండొచ్చు గానీ... ఆమె పేరుకు ముందు అత్యంత ప్రాచుర్యం కలిగిన జాతీయ అంతర్జాతీయ బ్రాండ్స్ చేరడం మాత్రం చాలా రోజుల నుంచే ఉంది. అందాల సుందరి కిరీటం దక్కించుకోవడం దగ్గర నుంచి మొదలుపెడితే... ఒకటొకటిగా ఈ తెలుగమ్మాయి దక్కించుకున్న విజయాలు అంత చిన్నవేమీ కావు. బాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమాల నుంచి మంకీ మ్యాన్ వంటి గ్లోబల్ ప్రాజెక్ట్లకు కూడా విస్తరించింది ఓ వైపు సినిమాలు, వెబ్సిరీస్లలో రాణిస్తూనే మరోవైపు కమర్షియల్ బ్రాండ్స్ రూపొందించే ప్రకటనల యాడ్ వరల్డ్ కి కూడా హాట్ ఫేవరెట్గా మారింది శోభిత. ఆమె భీమా జ్యువెల్స్కు బ్రాండ్ అంబాసిడర్, అలాగే జాక్వార్ ఇండియా హర్ స్టోరీ ప్రచారాలలో కూడా తళుక్కుమన్నారు.యాడ్ గల్లీ డాట్ కామ్ ప్రకారం...ఆమె ఇండో–ఫ్యూజన్ ఫ్యాషన్ డిజైనర్ లేబుల్ అయిన క్యుబిక్ ప్రచారాలలో కూడా కనిపించింది. అంతేకాక ఆమె దాసోస్ క్యాబినెట్ల ప్రచారాలలో కూడా పాల్గొన్నారు. ఐశ్వర్య, సుష్మితాసేన్, ప్రియాంకచోప్రాలను మినహాయిస్తే.. అందాల సుందరి కిరీటం దక్కించుకున్నవారిలో శోభిత స్థాయి విజయాలు మరెవరూ సాధించలేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ప్రకటనల్లో , యాడ్ వరల్డ్ అయితే ఆమెకి తిరుగేలేదు. నటిగా సరే, ప్రకనటల్లోనూ యాడ్ క్వీన్గా ఆమె రాణించడానికి ఏయే అంశాలు దోహదం చేశాయి? దీని గురించి మోడలింగ్, యాడ్ రూపకల్పన నిపుణులు ఏమంటున్నారంటే... అందం...విలక్షణం... ఆమె అందం కళాత్మక సున్నితత్వంల విలక్షణ సమ్మేళనం, అందుకే శోభితా ధూళిపాళ క్లాస్, మాస్లకు ఇష్టమైన సెలబ్రిటీగా ఉద్భవించింది, ఒక ప్రత్యేకమైన అద్భుతమైన అందం ఆమె స్వంతం.డస్కీ కలర్ క్లాసిక్ ఛార్మ్ సాంప్రదాయ మోడల్స్, సెలబ్రిటీల నుంచి శోభితను ప్రత్యేకంగా నిలబెడుతోంది. లగ్జరీ బ్రాండ్లు ఆమె విలక్షణమైన రూపాన్ని ఇష్టపడతాయి, ఆమె హై–ఎండ్ ఫ్యాషన్, అందం ఆభరణాల బ్రాండ్లకు అనువైన ఎంపికగా మారింది. భారతీయతను ప్రతిబింబిస్తూనే.. ఆమె గ్లోబల్ అప్పీల్ ఆమెను వేర్వేరు ప్రాంతాలలోని వైవిధ్యభరిత అభిరుచులు కలిగిన విభిన్న రకాల వినియోగదారులతో కనెక్ట్ కావాలనుకునే బ్రాండ్లకు అనువైన, విలువైన అంబాసిడర్గా మార్చింది. ఫ్యాషన్...ఓ స్టోరీ టెల్లింగ్... వ్యక్తిగతంగా ఆమె పాతకాలపు చీరలు, టైలర్డ్ సూట్లు లేదా మినిమలిస్టిక్ సిల్హౌట్లు లాంటి కాండిడ్ ఫ్యాషన్ సె¯Œ ్సకు ప్రసిద్ధి చెందింది.ఆమె ఫ్యాషన్ను కేవలం ధరించదు దాని ద్వారా ఓ చక్కని కథ చెబుతుంది ఆమె రెడ్ కార్పెట్ ఎడిటోరియల్ లుక్స్ జాగ్రత్తగా క్యూరేట్ చేయబడినట్లు అనిపిస్తుంది, తద్వారా హస్తకళను ప్రదర్శించే హెరిటేజ్ బ్రాండ్లకు ఆమె సరైన ప్రతినిధిగా మారింది. ఆమెకు ఇంటెలక్చ్యువల్ లుక్స్ ఓ వరం. ఆమె తరచుగా సాహిత్యం, కళ చరిత్ర గురించి అనర్గళంగా మాట్లాడుతుంది, ఇవి ఆమెను కేవలం ఒక గ్లామర్ క్వీన్గా మాత్రమే కాకుండా ఆలోచనా పటిమ కలిగిన శక్తివంతమైన మహిళగా చూపిస్తోంది. ఈ మేధోపరమైన ఆకర్షణ ఆమెను సంస్కారవంతమైన, వివేకం గల వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే బ్రాండ్లు ఎంచుకోవడానికి కారణమవుతోంది. శోభితా ధూళిపాలా ఆధునిక అందపు స్టైలిష్ లుక్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుతుందని నిరూపితం కావడమే ఆమె మరిన్ని బ్రాండ్స్తో పనిచేసేందుకు ఉపకరిస్తోంది. -
హిట్ 8 లో 8 మంది హీరోలా? ఎవరెవరు?
ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సీక్వెల్స్ సందడి చేస్తున్నాయి. ఒక సినిమా హిట్ అయితే అదే లైన్తో వరుసగా 2, 3 తీయడం అనేది ఒక సంప్రదాయంగా మారిపోతోంది. అయితే ఇప్పటి దాకా సీక్వెల్స్ అంటే 2 లేదా 3కే పరిమితం కాగా...ఓ సినిమా మాత్రం పెద్ద ఎత్తున సీక్వెల్స్తో కొత్త ట్రెండ్ని సెట్ చేయనుంది. ఆ సినిమా పేరు హిట్.నేచురల్ స్టార్ నాని నిర్మాణ బాధ్యతలు పంచుకుని శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ‘హిట్’ ఫస్ట్, సెకండ్ కేస్లు రెండూ కమర్షియల్ గా విజయాలు దక్కించుకున్నాయి. ఈ నేపధ్యంలో త్వరలోనే హిట్ 3 (HIT 3) కూడా రానున్న సంగతి మనకి తెలుసు. ’హిట్’ లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’ లో అడివి శేష్, ‘హిట్ 3’ లో నాని హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే.అయితే ‘హిట్’ సిరీస్ లో భాగంగా మొత్తం 8 సినిమాలు వస్తాయని గతంలోనే సినిమా టీమ్ వెల్లడించింది కాబట్టి ‘హిట్ 4’ ‘హిట్ 5’ ‘హిట్ 6’ ‘హిట్ 7’ ‘హిట్ 8’ కూడా తెరకెక్కనున్నట్టు స్పష్టం అవుతోంది. అయితే హిట్ 8 కోసం ఓ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయాలని టీమ్ యోచిస్తోందని సమాచారం. హిట్ 1 నుంచి ‘హిట్ 7 వరకు నటించిన హీరోలందరూ కలిసి హిట్ 8లో తెర పంచుకోనున్నారని తెలుస్తోంది. వీరంతా కలిసి ఓ పెద్ద కేసుని సాల్వ్ చేస్తారని అంటున్నారు.నిజానికి హిట్ ‘హిట్ 2’లో నాని కనిపించినట్టే హిట్ 3లో హీరో అడివి శేష్, విశ్వక్సేన్ కూడా కనిపించాల్సి ఉంది. అయితే అడవి శేష్ మాత్రం స్పెషల్ రోల్ చేస్తున్నాడు కానీ, విశ్వక్సేన్ మాత్రం లేకపోవడానికి కారణం...నాని వెనుక చేతులు కట్టుకుని నిలబడటానికి విశ్వక్ సేన్ సుముఖుత వ్యక్తం చేయలేదని వినికిడి. దీంతో అతని రిఫరెన్స్ ను మాత్రమే తీసుకుంటారట. అయితే హిట్ 2లో చేసినట్టే... క్లైమాక్స్ లో ‘హిట్ 4’ లో నటించే హీరో ఎవరు అనేది రివీల్ చేస్తారంటూ కూడా మరో ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు బాలకృష్ణ ‘హిట్ 4’లో హీరో గా చేయనున్నారంటూ కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. కారణమేమో గానీ అది వాస్తవరూపం దాల్చలేదు. ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకులకు చిరపరిచితమైన తమిళ హీరో కార్తీ ‘హిట్ 4’ లో హీరోగా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని రివీల్ చేసే విధంగా ‘హిట్ 3’ లో కార్తీ కామియో ఉంటుందని సమాచారం. అయితే ఈ విశేషాలను టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ప్రకటిస్తుందా? లేక సర్ప్రైజ్ కోసం సీక్రెసీ మెయిన్టైన్ చేస్తుందా? చూడాలి. -
నాన్న బాధ పడ్డారన్న నటి
సాధారణంగా అందంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందేంత అభినయం కూడా ఉండడం అతి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే సాధించగలిగిన విజయం. అలాంటి విజయవంతమైన కధానాయికల్లో అమలాపాల్ ఒకరు. తమిళం, మలయాళం తెలుగు సినిమాలలో నటిస్తూ బహుభాషా నటిగా తన అందానికి, అభినయానికి సమాన ప్రశంసల్ని పొందిన ఈ నటి నిర్మాత కూడా. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుతో సహా ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీతగా అమల పాల్(Amala Paul) పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే ఏమీ తెలీకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నాటి అమలాపాల్కి ప్రస్తుతం ఉన్న వ్యక్తికి చాలా తేడా ఉందని ఆమె అంటోంది.అమలా పాల్,నటిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె తాను విజయాలు మాత్రమే కాదు మరెన్నో సవాళ్లతో నిండిన ప్రయాణాన్ని సాగించానని వెల్లడించింది. . వ్యక్తిగత వృత్తి పరమైన ఎదుగుదలతో పాటు జీవితంలోని హెచ్చు తగ్గులు తన మార్గానికి ఒక రూపాన్ని ఇచ్చాయి అంటోంది. మళ్లీ ప్రేమ, మళ్లీ పెళ్లి, తల్లి కావడం...ఇలాంటి వ్యక్తిగత అనుభవాలను తన అభిమానులతో పంచుకుంటూ.. ఈ 15 సంవత్సరాలలో, ఆమె తన అనుభవాల ద్వారా ఎదురుదెబ్బల నుంచి చాలా నేర్చుకున్నానంది. అమలాపాల్ 2010లో నటించిన తమిళ చిత్రం ‘‘ సింధు సమవేలి’’ ఆమె కెరీర్ ను వ్యక్తిగత జీవితాన్ని సైతం ప్రభావితం చేసింది. ఆమె సింధు సమవేలి(Sindhu Samaveli)లో ఓ బోల్డ్ పాత్రను పోషించింది ఎందరినో ఇబ్బంది పెట్టిన శృంగార సన్నివేశాల్లో నటించింది. ఆ సాహసం ఆమె వ్యక్తిగత జీవితం ప్రారంభ కెరీర్ రెండింటినీ ఎదురుదెబ్బలు ఎదుర్కునేలా చేసింది.తండ్రి వయసు ఉండే తన మామగారితో అక్రమ సంబంధానికి ఒడిగట్టే కోడలు సుందరి పాత్రలో ఆమె నటించిన ఆ చిత్రం విడుదలైన తర్వాత తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ వివాదం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,.ఆ సినిమా విషయంలో వెల్లువెత్తిన ప్రతికూలత తనను బాగా భయపెట్టిందని, ముఖ్యంగా ఆ సినిమా చూసి తన తండ్రి తీవ్రంగా కలత చెందారని ఆమె వెల్లడించింది. తన పాత్ర చూపించే సామాజిక ప్రభావాన్ని తాను అంచనా వేయలేకపోయానని అంగీకరించింది. ‘మనం అలాంటి పాత్ర చేయకూడదని, అది చెడ్డదని లేదా అది మన సమాజం అంగీకరించే విషయం కాదని ఆ చిత్రం విడుదల తర్వాత మాత్రనే నేను అర్ధం చేసుకోగలిగాను’’ అంటూ ఆమె గుర్తు చేసుకుంది. అయితే అప్పుడు తాను కేవలం 17 లేదా 18 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉన్న నటిని.. కావడంతో దర్శకుడి సూచనలను గుడ్డిగా అనుసరించడం మాత్రమే చేయగలిగానంది. ఈ వివాదం ఆమెను మానసికంగా ప్రభావితం చేయడమే కాకుండా కెరీర్ పరంగానూ వ్యతిరేక పరిణామాలకు దారి తీసింది. సింధు సమవేలి తరువాత, ఆమె తన తదుపరి చిత్రం మైనా ప్రారంభ ప్రమోషన్లలలో సైతం దేనికీ ఆమెను పిలవలేదు, ఆ తర్వాత ఆమెకు తరువాత కమల్ హాసన్ రజనీకాంత్ వంటి దిగ్గజ నటుల నుంచి సైతం కాల్స్ వచ్చాయి, అయితే విపరీతమైన వ్యతిరేకత పట్ల భయం కారణంగా, ఆమె చెన్నైకి వెళ్లలేకపోయింది.అమలాపాల్ సక్సెస్ తర్వాత ఆ వివాదాస్పద చిత్రం మరోసారి రీ–రిలీజ్ అయింది. అప్పుడు కూడా ప్రమోషనల్ మెటీరియల్ తప్పుదారి పట్టిస్తోందంటూ వివాదాన్ని రేకెత్తించింది. వీటన్నింటి నేపధ్యం ‘‘ సినిమా కేవలం వ్యాపారాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని నేను గ్రహించాను, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక నటి ఎదురు దెబ్బలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి‘ అని ఆమె స్పష్టం చేసింది. -
దివ్యభారతి ఆత్మ వెంటాడిందా? ఏడ్చేసిన నాగార్జున హీరోయిన్!
తక్కువ కాలమే నటించినా, యావద్భారత సినీ ప్రేక్షకులు మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఏ మాత్రం మరచిపోలేని కధాయికల్లో నెం1 గా నిలుస్తుంది దివ్యభారతి. చిరంజీవితో రౌడీఅల్లుడు, వెంకటేష్తో బొబ్బిలిరాజా, మోహన్బాబుతో అసెంబ్లీ రౌడీ వంటి చిత్రాలలో నటించిన దివ్యభారతి అందాన్ని చూసేందుకు తెరకు కళ్లప్పగించిన ప్రేక్షకులెందరో. అటువంటి అందాల నటి, ఎంతో భవిష్యత్తు ఉన్న యువనటి అకస్మాత్తుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఆ తర్వాత అప్పటి ఆమె సహనటీనటులు ఆమె గురించి అడపాదడపా తలచుకుంటూ ఆవేదన చెందడం చూస్తున్నాం. అదే క్రమంలో తాజాగా అప్పటి దివ్యభారతి సహ నటి, అత్యంత ఆత్మీయ నేస్తం అయిన ఆయేషా ఝుల్కా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దివ్యభారతి గురించి కొన్ని విశేషాలు పంచుకుంది.దివ్యతో తనకున్న బంధం గురించి అయేషా మాట్లాడుతూ, ‘మేము రంగ్ షూటింగ్లో ఉండగా.. ఈ సంఘటన మొత్తం జరిగింది. నేను ఆ చిత్రానికి డబ్బింగ్ చెప్పేటప్పుడు–ఆమె అందులో నా చెల్లెలిగా నటించింది–మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం. ఇతర సెట్లలో చేస్తున్నప్పుడు కూడా ఆమె వచ్చి నాతోనే కబుర్లు చెబుతూ ఉండేది’’ అంటూ తమ అనుబంధం గురించి వివరించింది.ఆయేషా జుల్కా దివ్య భారతి 1993లో రొమాంటిక్ చిత్రం రంగ్లో కలిసి నటించారు. ఈ చిత్రంలో కమల్ సదానా, జీతేంద్ర, అమృతా సింగ్, ఖాదర్ ఖాన్ బిందు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అయేషా, దివ్య సిస్టర్స్గా నటించారు. అయితే సినిమా విడుదలకు ముందే దివ్య కన్నుమూసింది.సినిమా స్క్రీనింగ్ సమయంలో దివ్య తో అనుబంధాన్ని తలచుకుంటూ... ఆ దురదృష్ఖకర సంఘటన తర్వాత తాను చాలా రాత్రులు నిద్రపోలేకపోయానని ఆయేషా గుర్తు చేసుకుంది. ‘‘ మా మధ్య ఫ్రెండ్స్ని మించిన బంధం ఉంది, ఆ సంఘటన తర్వాత నేను ఆ చిత్రానికి డబ్బింగ్ చెప్పేటప్పుడు, చేయలేకపోయాను, డబ్బింగ్ చెప్పడానికి బదులు నేను భోరున ఏడ్చాను దాంతో డబ్బింగ్ వాయిదా వేయవలసి వచ్చింది. కాబట్టి అదంతా జరిగింది, ఆపై మేము ఫిల్మ్ సిటీలో ఆ సినిమా ప్రివ్యూ వేసినప్పుడు... దివ్య తెరపై కనిపించిన క్షణంలో, స్క్రీన్ ఒక్కసారిగా పడిపోయినట్టయింది.. దివ్య నా చెంతనే ఉన్నట్టు ఓ ఫీలింగ్...బాధ అనుభవించాను దాంతో ఆ రాత్రి నేను చాలా సేపు నిద్రపోలేకపోయాను’’ అంటూ దివ్యభారతి మరణం తర్వాత కూడా తనతోనే ఉందని ఆమె చెప్పింది. గత 1991లో వచ్చిన కుర్బాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన అయేషా బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది, ఆమెను లైమ్లైట్లోకి తీసుకెళ్లింది... అక్షయ్ కుమార్ సరసన ఖిలాడీలో ఆమె నటన ఆమె కెరీర్ను మలుపు తిప్పింది, ఆ తర్వాత అమీర్ ఖాన్ సరసన జో జీతా వోహీ సికందర్, మిథున్ చక్రవర్తి సరసన దలాల్ లతో పాటు మరిన్ని విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. మూడు దశాబ్దాల పాటు సాగిన ఆమె కెరీర్లో, 60 చిత్రాలకు పైగా పనిచేసింది. తెలుగులో అక్కినేని నాగార్జున సరసన నేటి సిద్ధార్ధ సినిమాలో ఆమె నటించి తన గ్లామర్తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకర్షించింది. ఈ సినిమాలో నాగ్తో ఆమె లిప్లాక్ కూడా చేయడం విశేషం. -
ఛలో గల్ఫ్ అన్న బన్నీ, చరణ్.. టాలీవుడ్ సీక్రెట్ అదేనా?
గత కొంతకాలంగా దక్షిణాది సినిమాలకు అత్యంత విశ్వసనీయ నేస్తంగా వర్ధిల్లుతున్నాయి గల్ఫ్ దేశాలు.. ముఖ్యంగా దుబాయ్. మన అవార్డు ఫంక్షన్ల నుంచీ, సంగీత కార్యక్రమాలు, ఇతరత్రా ఈవెంట్స్ దాకా దుబాయ్తో భాయ్ భాయ్ అంటుంటారు దక్షిణాది చిత్ర ప్రముఖులు.. అందులోనూ మన తెలుగు సినీ ప్రముఖులు మరింత ముందుంటార ని చెప్పాలి. ఈ నేపధ్యంలో ఇటీవల ఏ వేడుకా లేకపోయినా, ఏ ముఖ్యమైన కార్యక్రమం లేకపోయినా కూడా టాలీవుడ్ స్టార్లు తరచుగా దుబాయ్కి రాకపోకలు సాగిస్తుండడం కనిపిస్తోంది. దీనిపై రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి.(చదవండి: వాటాలు పంచుకుందాం..టాలీవుడ్ దర్శకులు ఓకే అంటారా?)చీమ చిటుక్కు మంటే చాలు చిటికెలో దాన్ని బయటకు తెచ్చేసి చీల్చి చెండాడేసే ఈ సోషల్ మీడియా యుగంలో... రహస్యాల్ని కాపాడుకోవడానికి తెరమీద వీరోచితంగా పోరాటాలు చేసే హీరోలు...తెరవెనుక మాత్రం ఛలో దుబాయ్ అంటున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది.వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా, తెలుగు టాప్ స్టార్లు, డైరెక్టర్లు ఇప్పుడు అరబ్ దేశాలను తాము ఇష్టపడే సమావేశ గమ్యస్థానాలుగా మార్చుకుంటున్నారని అర్ధమవుతోంది. దీనికి కొన్ని నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఇటీవల, టాలీవుడ టాప్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు సుకుమార్ లు అబుదాబిలో చక్కర్లు కొడుతూ కనిపించారు, వారి తదుపరి చిత్రం గురించి చర్చించడానికే వీరిద్దరూ ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నారని సమాచారం. రంగస్థలం తో భారీ విజయాన్ని నమోదు చేసిన వీరి కాంబినేషన్, ఆధునిక టచ్తో కూడిన యాక్షన్–ప్యాక్డ్ చిత్రం కోసం మళ్లీ చేతులు కలిపింది. (చదవండి: సల్మాన్ కొత్త సినిమాకు ఘోరమైన పరిస్థితి!)మరోవైపు టాప్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా దుబాయ్లో ప్రఖ్యాత తమిళ దర్శకుడు అట్లీతో చర్చలు జరిపినట్టు సమాచారం. ఇప్పటికే బన్నీ తదుపరి చిత్రంపై రకరకాల అంచనాలు , పుకార్లు షికారు చేస్తుండగా, వాటికి ఊతమివ్వడం ఇష్టం లేకే బన్నీ, అట్లీలు కూడా గల్ఫ్ బాట పట్టి ఉంటారని అంటున్నారు.‘ఈ తారలు మీడియా హడావిడి, తొంగి చూడడాలు లేకుండా వారితో సహకరించడానికి ఆసక్తి ఉన్న పరిశ్రమ పెద్దల జోక్యం లేకుండా చర్చలు జరపడానికి తగిన గోప్యతను కోరుకుంటారు‘ అని ఒక నిర్మాత తెలిపారు. అకాల లీక్లు తరచుగా వాస్తవాలను ఇష్టారాజ్యంగా వక్రీకరిస్తాయని ఆ నిర్మాత వివరిస్తున్నారు. ‘ప్రత్యర్థి నిర్మాతలు కొన్నిసార్లు మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం, సగం వండిన సమాచారాన్ని అందజేస్తారు, ఇది అనవసరమైన ఊహాగానాలకు దారి తీస్తుంది. ఒక ప్రాజెక్ట్ పాన్–ఇండియా చిత్రం అని చెప్పవచ్చు, మరొక దాంట్లో అల్లు అర్జున్ తో స్క్రీన్ ను పంచుకోనున్నారంటూ ఎవరెవరో తారలను సూచిస్తుంది, ఇది చిత్రాన్ని రూపొందించే రూపకర్తల వాస్తవ ప్రణాళికల చుట్టూ గందరగోళాన్ని సృష్టిస్తుంది.‘హైదరాబాద్, ముంబై చెన్నై లు ఫొటో/ వీడియోగ్రాఫర్లతో నిండిపోవడంతో, తెలుగు తారలు అధికారిక ప్రకటనలు చేయడానికి ముందుగా, ప్రాజెక్ట్లను ఖరారు చేయడానికి తెలివిగా తగిన ప్రదేశాలను అన్వేషిస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో, ఒక్క ఎయిర్పోర్ట్ను చూసినా లేదా లీక్ అయిన ఇమేజ్ అయినా కూడా విపరీతమైన పుకార్లు నిరాధారమైన ఊహాగానాలకు దారి తీస్తుంది. ‘తరచుగా, ఈ నివేదికలలో ఎటువంటి నిజం ఉండదు,‘ అని ఆ నిర్మాత విశ్లేషించారు. -
వాటాలు పంచుకుందాం..టాలీవుడ్ దర్శకులు ఓకే అంటారా?
ఒకప్పుడు రెమ్యునరేషన్ల విషయానికి వస్తే.. కేవలం హీరోలకు ఇచ్చే భారీ పారితోషికాలే చర్చకు వచ్చేవి. ఇప్పటికీ రెమ్యునరేషన్స్ తీసుకునే విషయంలో హీరోలదే పై చేయి ఉన్నప్పటికీ... హీరోయిన్లు, దర్శకులు కూడా వారితో పోటీ పడే స్థాయికి చేరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఒకవేళ సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాత, పంపిణీదారులు మాత్రమే నష్టపోతుండగా, భారీ పారితోషికాలు అందుకుంటున్న హీరోలు, దర్శకులు మాత్రం సేఫ్గానే ఉంటున్నారు. ఈ నేపధ్యంలో హీరోలు, దర్శకులు కూడా రెమ్యునరేషన్( Remuneration) కు బదులు లాభాల్లో వాటాలు పొందాలనే చర్చ మొదలైంది.తాజాగా గేమ్ ఛేంజర్ ద్వారా భారీ నష్టాల్ని చవిచూసి, సంక్రాంతికి వస్తున్నాం ద్వారా కొంత ఉపశమనం పొందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో ఈ ఆసక్తికర చర్చకు తెర లేపారు. మలయాళ చిత్రం ఎల్2: ఎంపురాన్ (L2: Empuraan)ను తెలుగు రాష్ట్రాలకు తీసుకువస్తున్న దిల్ రాజు(Dil Raju) ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ... మోహన్లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ ల సెన్సేషనల్ చిత్రం ఎల్2: ఎంపురాన్ కోసం తమ రెమ్యునరేషన్ను మాఫీ చేశారని, బదులుగా లాభాన్ని పంచుకునే మోడల్ను ఎంచుకున్నారని ఆయన వెల్లడించారు.అలాంటి మోడల్ టాలీవుడ్లో కూడా పనిచేయగలదా అని అడిగిన ప్రశ్నకు, దిల్ రాజు స్పందిస్తూ, ‘‘రాజమౌళి తన చిత్రాలకు ముందస్తుగా పారితోషికం వసూలు చేయరనీ, తన సినిమాలకు లాభాలను పంచుకునే పద్ధతిని అనుసరిస్తాడనీ వెల్లడించారు. అదే విధంగా కెజిఎఫ్, సలార్ల చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇప్పుడు అదే పంధాలో పని చేస్తున్నాడు. ఈ మోడల్ త్వరలో తెలుగు సినిమాలో మరింత పుంజుకుంటుందని, సాధారణమైన విషయంగా మారుతుంది’’ అంటూ ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. తాను మొదట గేమ్ ఛేంజర్ సినిమా సందర్భంగా దీన్ని అమలు చేయాలనే ప్రయత్నం చేశానని, అయితే, సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో, శంకర్, రామ్ చరణ్ లు తమ రెమ్యునరేషన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారనీ వివరించారు.అయితే, ఈ విధానం టాలీవుడ్లో ఓ సంప్రదాయంగా మారడంపై పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘మన పెద్ద స్టార్లు, దర్శకులు భారీ చెల్లింపులు అడ్వాన్స్లకు అలవాటు పడ్డారు, లాభాల భాగస్వామ్య వ్యవస్థను అమలు చేయడం సినిమా లావాదేవీలను కష్టతరం చేస్తుంది. సూపర్స్టార్లు సినిమాకు75–125 కోట్లు వసూలు చేయడం దర్శకులు రూ.25–50 కోట్లు వసూలు చేయడం వల్ల లాభాలను పంచుకోవడం పనికిరావచ్చు, అయితే నష్టాలు వచ్చినట్లయితే డబ్బును పూర్తిగా వదులుకోవాలనే ఆలోచనను అంగీకరించడం అసంభవం’ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాజమౌళి నమూనా ఆయన వరకూ విజయవంతం అయినప్పటికీ, టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకులు, హీరోలు స్థిరమైన చెల్లింపులను కాదనుకుని విజయంలో భాగస్వామ్య వాటాలకు మారడాన్ని స్వీకరిస్తారా? అనేది సందేహాస్పదమే. -
ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా ఆషిక్ అబు దర్శకత్వం వహించిన మళయాళ చిత్రం రైఫిల్ క్లబ్ (Rifle Club) ఊహించని విజయం సాధించింది. ఈ చిత్రంలో సుసాన్ గా నటి సురభి లక్ష్మి (Surabhi Lakshmi ) ప్రధాన పాత్రలో కనిపించింది . ఆమె నటించలేదు... జీవించింది అన్నంత బాగా చేసింది అంటూ విమర్శకుల ప్రశంసలు పొందింది. సీరియస్ సన్నివేశాలతో పాటు సినిమాలో అత్యంత కీలకమైన ముద్దు సన్నివేశంలో కూడా ఆమె థియేటర్లలో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకోవడం విశేషం. అందువల్లే ఆ లిప్లాక్ సీన్ ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా కూడా మారింది.ఈ నేపధ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, నటి సురభి లక్ష్మి ఇటీవల రైఫిల్ క్లబ్లో ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించిన అనుభవాలను గురించి మాట్లాడింది. అది లిప్ లాక్ అని తనకు షూట్ రోజున మాత్రమే తెలిసిందని వెల్లడించింది. ఈ సీన్ ని మొదట సాదాసీదా ముద్దుగా భావించానని, అయితే అది పూర్తి స్థాయి లిప్ లాక్ అని తర్వాత తెలిసిందని వివరించింది. ప్రస్తుతం బాగా పాప్యులరైన ఈ లిప్–లాక్ సన్నివేశం రైఫిల్ క్లబ్ సినిమా క్లైమాక్స్ లో ఉంటుంది. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ నటి లిప్ లాక్ సీన్ ఉందని తెలిసిన తర్వాత షాక్ తినడం లాంటివేవీ చేయకుండా ఒక నిజమైన నటిలా దానిని పండించడం కోసం చేసిన ముందస్తు ప్రయత్నాలు గురించి చెప్పి కూడా అందరి ప్రశంసలు పొందింది. ‘రైఫిల్ క్లబ్లో నాకు ముద్దు సన్నివేశం ఉంటుందని శ్యామ్ చెప్పాడు. మొదట్లో, ఇది సాధారణ ముద్దుగా ఉంటుందని అనుకున్నాను. కానీ అది లిప్ లాక్ అని షాట్ తీయడానికి ముందు మాత్రమే నాకు తెలిసింది.‘ ఆశ్చర్యం కలిగినా ఆ సన్నివేశం గురించి తాను టెన్షన్ పడలేదని స్పష్టం చేసింది. బదులుగా, దానిని పండించాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేసింది. ఆ సమయంలో సినిమాలో తన భర్తగా నటించిన సజీవ్ కుమార్ను ఎలా ఫీల్ అయ్యాడో తెసుకోవాలని ప్రయత్నించానని చెప్పింది. ‘నా భర్తగా నటించిన సంజీవ్ చెట్టన్ ని టెన్షన్ గా ఉన్నావా? అని అడిగాను. అయితే అతను కూడా నాలాగే ఏ టెన్షన్ పడడంలేదని చెప్పాడు’’ అంటూ గుర్తు చేసుకుంది. సన్నివేశం బాగా రావాలని అనుకున్నానని అందుకే ‘అతను సిగరెట్ తాగే అలవాటున్నవాడు కాబట్టి, షాట్కు ముందు అతనిని పళ్ళు తోముకుని తిరిగి రావాలని కోరానని వెల్లడించింది. అంతేకాదు సెట్లోని ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్లను పిలిచి యాలకులు కొని తీసుకురావాలని కోరింది. షాట్ కు ముందు వాటిని నోట్లో వేసుకుని కాసేపు నమిలింది. మా సెట్లో ఉన్న దర్శనకు లిప్లాకింగ్లో అనుభవం ఉంది. అయితే తన అనుభవం నుంచి ప్రశ్నలు అడగాలని అనిపిస్తుదేమో అని నేను ఆమె వైపు చూడలేదు, ’’అని సురభి చెప్పింది. సాధారణంగా శృంగార సన్నివేశాలు తక్కువ మంది షూటింగ్ సిబ్బందితో చిత్రీకరించడ జరుగుతుంటుంది, దీనికి కారణం హీరోయిన్ ఇబ్బంది పడకూడదనే. అయితే సురభి మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించింది. అదేదో ప్రత్యేకమైన అంటరాని సన్నివేశంగా మారకూడదని ఆలోచించినట్టుంది. ఆమె ఆ సమయంలో సెట్లో ప్రతి ఒక్కరూ ఉండేలా చూసుకుంది, తద్వారా ఆ సున్నితమైన సందర్భానికి వినోదం స్నేహం సరదాల్ని జోడించింది. తన ట్రేడ్మార్క్ హాస్యం తో, సురభి లక్ష్మి ఒక ఉద్విగ్న క్షణాన్ని సెట్లో తేలికైన మరపురాని అనుభవంగా మార్చింది. తద్వారా సహ నటీనటుల నుంచి ప్రశంసలు అందుకుంది. సినిమాల్లో ఒకప్పుడు అటువంటి సన్నివేశాలు బాగా తక్కువగా ఉండేలా చేసేవారు.. లేదా భారీగా సెన్సార్ కత్తెరకు గురయ్యాయి. అయితే సమకాలీన ఫిల్మ్ మేకర్లు ఇప్పుడు వాటిని పరిపక్వత తో చిత్రీకరిస్తూ అసభ్యత అనిపించకుండా మెప్పిస్తున్నారు. .ఈ పరిస్థితుల్లో, నటీనటులు కూడా ఆయా సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు తమ అనుభవాలు వ్యక్తపరచడం గురించి ఒకప్పుడు సంకోచించేవారు, ఇప్పుడు మాత్రం బహిరంగంగా ప్రస్తావిస్తున్నారు. కామెడీ, యాక్షన్ సన్నివేశాల సమయంలో తమ అనుభవాలను పంచుకున్నట్టే రొమాంటిక్ సీన్స్ గురించి కూడా మాట్లాడడంతో తప్పులేదు ఎందుకంటే అదంతా నటనేలో భాగమే కాబట్టి. -
మూడు నెలల్లో 9 కిలోలు తగ్గిన జ్యోతిక: ఈ సక్సెస్ సీక్రెట్ ఆమే!
బోలెడన్ని వ్యాయామాలు అంతులేని ఆహారపు మెళకువలు అందుబాటులో ఉన్నప్పటికీ, బరువు నిర్వహణ తనకు ’ఎప్పుడూ కష్టంగానే అనిపించేది అని నటి జ్యోతిక అన్నారు. రకరకాల వ్యాయామాలు, అంతులేని ఆహారాల మార్పులు, అపరిమిత ఉపవాసం ఇవేవీ నా అదనపు కిలోల బరువును తగ్గించడంలో సహాయపడలేదు. అని కూడా స్పష్టం చేశారు...అలాంటి జ్యోతిక ఇప్పుడు బరువు తగ్గారు. అదెలా సాధ్యమైంది? దీనికి ఓ ఏడాది క్రితం బీజం పడింది అని ఆమె గుర్తు చేసుకుంటున్నారు. ఆ బీజం పేరు విద్యాబాలన్. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఒక దశలో విపరీతంగా బరువు పెరిగారు. కానీ అకస్మాత్తుగా స్వల్ప వ్యవధిలోనే ఆమె గణనీయంగా బరువును తగ్గించుకోగలిగారు. దీనిపై ఎన్ని రకాల సందేహాలు, అంచనాలు, విశ్లేషణలు వచ్చినప్పటికీ... ఆమె మాత్రం స్పందించలేదు. అయితే గత అక్టోబర్ 2024లో విద్యాబాలన్ తన విపరీతమైన బరువు తగ్గడంపై మౌనం వీడింది జిమ్కి వెళ్లకుండానే చెమట్లు కక్కకుండానే తాను అదనపు కిలోల బరువు తగ్గడానికి కారణాలను, తన కొత్త ఆహారపు అలవాట్లను వెల్లడించింది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ‘‘ డైట్ బట్ ’నో ఎక్సర్ సైజ్’ రొటీన్ ద్వారా విపరీతంగా బరువు తగ్గినట్టు వెల్లడించింది. దీనిని జ్యోతిక కూడా అనుసరించారు. ఆమెలాగానే నటి జ్యోతిక, తన బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించి ఆమె శిక్షకులనే ఎంచుకున్నారు. అచ్చం విద్య మాదిరిగానే తన డైట్ ఫిట్నెస్ మంత్రాన్ని మార్చడం ద్వారా ’ 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గినట్లు’ వెల్లడించింది. తన ట్రైనర్ చెన్నైకి చెందిన న్యూట్రీషియన్ గ్రూప్ అమురా హెల్త్ టీమ్తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. దానితో పాటు , ‘అమురా, కేవలం 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గినందుకు నా అంతరంగాన్ని తిరిగి కనుగొనడంలో నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు, అమురా! మీరందరూ ఓ మాయాజాలం అంటూ పొగిడింది. తన ఇంటర్వ్యూల ద్వారా నన్ను అమరా మాయా బృందానికి పరిచయం చేసినందుకు విద్యాబాలన్ కు కృతజ్ఞతలు’’ తెలిపింది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika)‘‘‘నేను నా ప్రేగు, జీర్ణక్రియ, వేడిని కలిగించే ఆహారాలు ఆహార సమతుల్యత గురించి తెలుసుకున్నాను. మరీ ముఖ్యంగా, సానుకూల భావాన్ని కలిగించేటప్పుడు నా సంతోషం, మానసిక స్థితిపై ఆహారం ప్రభావాన్ని అర్థం చేసుకున్నాను. ఫలితంగా, ఈ రోజు ఒక వ్యక్తిగా నేను చాలా శక్తివంతంగా అదే సమయంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నాను’’ అంటూ బరువు తగ్గడం కన్నా మన శరీరంపై మనకు అవగాహన ఏర్పడడం ముఖ్యమని ఆమె వివరించింది. అయితే బరువు తగ్గడంతో పాటే మహిళల ఆరోగ్యానికి వెయిట్ ట్రైనింగ్ ఎంత ముఖ్యమో కూడా జ్యోతిక తెలియజేసింది. ‘ఆరోగ్యకరమైన జీవితం సమతుల్యతతో కూడి ఉంటుంది; బరువు తగ్గడం లో ఆహారపు అలవాట్లు ముఖ్యమైనవి, అలాగని శక్తి అక్కర్లేదని కాదు.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలువెయిట్ ట్రైనింగ్ అనేది మహిళల భవిష్యత్తుకు కీలకం, బరువు తగ్గడంతో పాటు శక్తి కోల్పోకుండా ఉండడం కూడా ముఖ్యమైన విషయం. ఇది నేర్పినందుకు వయస్సు కేవలం ఒక సంఖ్య అని నిరూపించినందుకు శిక్షకుడు మహేష్కు ధ్యాంక్స్ చెప్పాలి. ‘నా శరీరం దాని పనితీరును అర్థం చేసుకోవడం దానితో వ్యాయామాలను కలపడం నా అనుభవంపై గరిష్ట ప్రభావాన్ని చూపింది అంటూ ఇదే సందర్భంగా పోషకాహార నిపుణులు ఫిట్నెస్ నిపుణుల బృందానికి తనను పరిచయం చేసినందుకు విద్యకు ధన్యవాదాలు తెలిపింది.చదవండి: ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్ -
మహేశ్ వల్లే సినిమాలకు దూరమైన నమ్రత.. రిలేషన్లో ఉన్నప్పుడు..
అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ హీరోలు హీరోయిన్లను పెళ్లాడడం జరుగుతూనే ఉంది. అయితే గతంలో పెళ్లి తర్వాత హీరోయిన్లు తప్పనిసరిగా తమ నటన కెరీర్ను త్యాగం చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. పెళ్లి తర్వాత కూడా టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే మహేశ్బాబు (Mahesh Babu)ను పాతికేళ్ల క్రితం వివాహం చేసుకున్న అప్పటి స్టార్ హీరోయిన్ నమ్రత (Namrata Shirodkar) మాత్రం నటనను వదిలేసుకున్నారు. మరి ఇప్పటి పరిస్థితిని చూసి ఆమె ఎలా ఫీల్ అవుతున్నారు? అందాల కిరీటం అందుకున్న నమ్రతఎందుకంటే అప్పట్లో అందాల కిరీటం అందుకోవడం అంటే సాధారణ విషయం కాదు. దేశంలోని అతిపెద్ద బ్యూటీ కాంటెస్ట్... మిస్ ఇండియా టైటిల్ గెలిస్తే ఎకాఎకిన సినిమాల్లోకి వచ్చేసినట్టే. ప్రస్తుతం మహేశ్బాబు (Mahesh Babu) సతీమణిగా గ్లామర్ రంగానికి దూరంగా ఉన్న నమ్రత శిరోద్కర్ తొలిసారిగా 1993లో ఫెమినా మిస్ ఇండియాగా కిరీటాన్ని పొందిన ఘనత దక్కించుకుంది. దాంతో అప్పటి బాలీవుడ్ టాప్ హీరో సంజయ్ దత్, మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సరసన నటించేందుకు వరుస అవకాశాలు వచ్చాయి. అప్పుడు హీరోయిన్గా.. ఇప్పుడు ఇల్లాలిగా..మెగాస్టార్ చిరంజీవితో కూడా నమ్రత నటించింది. తన సినీరంగ ప్రవేశం జరిగి మూడు దశాబ్ధాల తర్వాత... ప్రస్తుతం ఆమె టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు భార్యగా చక్కని సంతృప్తికరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతోంది. ఇప్పుడు తెర వెనుక పూర్తి జీవితాన్ని అనుభవిస్తోంది మాజీ నటి నమ్రతా శిరోద్కర్. ఆమె 1998లో హిందీ 'ఎల్ఎమ్ జబ్ ప్యార్ కిసీసే హోతా హై'తో సినిమాల్లోకి అరంగేట్రం చేసింది. నమ్రత కెరీర్.. హిందీ, కన్నడ, తెలుగు, మరాఠీ, మలయాళంతో సహా పలు భాషల్లో విస్తరించింది. ఆమె హీరో హిందుస్తానీ, పుకార్, అస్తిత్వ, దిల్ విల్ ప్యార్ వ్యార్, తెహసీబ్, ఇన్సాఫ్: ది జస్టిస్ వంటి అనేక రకాల టాప్ మూవీస్లో నటించింది. వంశీ సినిమాతో మొదలు..ఎజుపున్న తారకన్ చిత్రం ద్వారా ఆమె మలయాళ ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. అదే క్రమంలో 2000లో మహేశ్బాబు ప్రధాన పాత్రలో నటించిన వంశీతో టాలీవుడ్లో అరంగేట్రం చేసింది. వంశీ సినిమా ద్వారానే వారిద్దరూ సన్నిహితంగా మారారు. ఆ సినిమా షూటింగ్ కోసం 52 రోజుల పాటు న్యూజిలాండ్లో గడిపారు. అక్కడ ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. వారి స్నేహం చివరికి ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి ముందే కండీషన్అయితే ఆ సమయంలో మహేశ్ కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా నమ్రత మహేశ్ కంటే వయసులో నాలుగేళ్లు పెద్దది కావడం, హిందీ చిత్రసీమకు చెందిన సినీనటిని కోడలిగా తెచ్చుకోవడానికి ఇష్టపడకపోవడం చిక్కులు తెచ్చిపెట్టింది. చివరికి, వారు అన్ని అడ్డంకులను అధిగమించి 2005లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక మహేశ్బాబు నటనకు స్వస్తి చెప్పాలని కోరడంతో పెళ్లికి ముందే నమ్రత తన కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత నమ్రత పలు ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు ఆ విషయం వెల్లడైంది.రిలేషన్లో ఉన్నప్పుడే..తామిద్దరూ రిలేషన్షిప్ ఉన్నప్పుడే మహేశ్ తనకు ఈ విషయాన్ని చెప్పాడని నమ్రత అంటోంది. నటించడం నచ్చక లేదా నటిగా కొనసాగడం నచ్చకే మహేష్ అలా అన్నాడా? అంటే ‘అదేమీ కాదు. ‘మహేశ్కు ఇంటిని దిద్దుకునే భార్య కావాలి. నేను వేరే ఏదైనా ఉద్యోగంలో ఉండి ఉంటే కూడా అతను నన్ను ఆ జాబ్ వదిలేయమని అడిగేవాడు’’ అనేది నమ్రత సమాధానం. ఒకవేళ తాను సినిమాల్లో కొనసాగి ఉంటే మరింత అగ్రస్థానంలో ఉండేదేమో కదా! అని ఎవరైనా అంటే.. ‘‘నాకెప్పుడూ కూడా టాప్ హీరోయిన్ని కావాలనే కోరిక లేదు, కాబట్టి నేను నటించడం మానేయాల్సి వచ్చినప్పుడు, ఏ మాత్రం నిరాశ చెందలేదు.‘ అని నమ్రత స్పష్టం చేసింది. అర్థం చేసుకున్న మహేశ్‘నేను ముంబైలో నివసించిన పరిస్థితులకు మహేశ్తో కలిసి హైదరాబాద్లో పెద్ద బంగ్లాకు మారడం నాకు చాలా కష్టమైన మార్పు. ఇది అర్థం చేసుకున్నాడు మహేశ్. దాంతో మా పెళ్లి తర్వాత, కొంతకాలం మేం ముంబైలో ఉండిపోయాం’’ అంటూ చెప్పుకొచ్చారు నమ్రత. అయితే నమ్రత, మహేశ్ విడిపోయారని, నమ్రత తమ కొడుకుతో కలిసి ముంబైకి వెళ్లారని అప్పట్లో కొన్ని పుకార్లు షికారు చేశాయి. ‘నేను నా తల్లిదండ్రులను కోల్పోయాను అలాగే కొన్ని విభేదాల వల్ల కొంతకాలం విడిగా ఉన్నాము.మహేశ్ విజయం వెనక నమ్రతకానీ ఆ సమయంలో, మేము మా అనుబంధంలోని బలం స్పష్టతను కనుగొన్నాం’’ అంటూ చెప్పారామె. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఓ మహిళ ఉందంటారు.. ’మహేశ్బాబు తన విజయానికి కీలకం అని నమ్రతను తరచుగా అంటుంటాడు. తన భర్త నిర్మాణ సంస్థ అయిన జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూనే నమ్రత తన కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. సక్సెస్ఫుల్ భార్యగా, తల్లిగా ఇంటిని తీర్చిదిద్దుతోంది.-సత్యబాబుచదవండి: బంగారం అక్రమ రవాణా చేసిన హీరోయిన్.. తండ్రి డీజీపీ.. మరి భర్త?! -
సిటీలో గాలి పీల్చడం అంటే సిగిరెట్ తాగడమే:ఏకీభవించిన హీరోయిన్
సగటు మనిషితో పోలిస్తే సెలబ్రిటీలకు మరింత సామాజిక బాధ్యత ఉంటుంది. లక్షలాది మందిని ప్రభావితం చేయగలిగిన సినిమా నటీనటులు ఆ సామాజిక బాధ్యతను గుర్తించి మసలుకోవడాన్ని దురదృష్టవశాత్తూ మనం అరుదుగానే చూస్తుంటాం. తరచుగా సోషల్ మీడియాను తమ సినిమాల ప్రచారానికో, మరోరకమైన సంపాదనకో వాడుకునే సెలబ్రిటీలు సామాజిక సమస్యలపై స్పందించడం తక్కువే. కాలుష్యం వంటి సమస్యలపై తాము స్పందిస్తే ప్రభుత్వాలకు తమ మీద కోపం వస్తుందనే భయపడేవారే ఎక్కువ. ఇలాంటి వారి మధ్య అరుదుగా కొందరు మాత్రం తమదైన శైలిని నిలబెట్టుకుంటారు.ప్రముఖ హిందీ నటుడు స్టాండ్–అప్ కమెడియన్గానూ పేరొందిన వీర్ దాస్(Vir Das ) ఇటీవల ముంబై నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై తరచుగా పోస్ట్ల ద్వారా తన ఆందోళన తెలియజేస్తున్నాడు. ఆ పోస్ట్స్ పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఆయన తాజాగా సోషల్ మీడియా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ముంబై నగరంలో శ్వాస పీల్చడం అంటే సిగరెట్ తాగడంతో సమానం అని అన్నారు.‘నేను సరదా కోసం లేదా సోషలైజింగ్లో భాగంగా సంవత్సరానికి కేవలం పదిహేను రోజులు మాత్రమే సిగరెట్ తాగుతాను. కానీ మిగిలిన రోజులు కూడా పొగ తాగుతున్నట్టే ఉంది ఎందుకంటే నేను శ్వాస పీల్చుకునేది ముంబైలో కదా. అదే రుచి. ఈ రోజు ముంబై ఒక మార్ల్బోరో లైట్‘ అని వీర్ ఇన్స్ట్రాగామ్లో రాశాడు. తాను పీల్చుకునే శ్వాస తాను తాగే సిగిరెట్ బ్రాండ్ మార్ల్బరో లైట్ ఒకేలా ఉన్నాయనే అర్ధం వచ్చేలా ఆయన ఈ పోస్ట్ చేశాడు.అయితే ముంబై మహానగరంలో కనుమరుగవుతున్న గాలి నాణ్యతపై వీర్ దాస్ ఆందోళన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో, అతను ఇన్స్ట్రాగామ్లో కూడా విపులంగా పోస్ట్ పెట్టాడు, ‘ఇప్పుడు ఉదయం7:30 గంటలు... ఈ సమయంలో గాలి నాణ్యత ఎక్యుఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 170. ఇది పిల్లలు పాఠశాలకు పెద్దవాళ్లు వాకింగ్లకు వెళుతున్న సమయం. ప్రభుత్వం ఏదైనా కఠినంగా చేయకపోతే, వారసత్వంగా కాలుష్యం మాత్రమే మన జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఇప్పుడే పుట్టిన తరంతో పాటు వృద్ధాప్యంలో ఉన్న వారిపై కూడా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుందని మనం గ్రహించాలి. దీన్ని అడ్డుకోవడానికి ‘కొన్ని కఠినమైన విధాన నిర్ణయాలు జరగాలి. అలాంటి నిర్ణయాలు బహుశా స్వల్పకాలంపాటు మనల్ని తీవ్ర అసంతృప్తికి గురిచేయవచ్చు. కొత్త విమానాశ్రయాలు కొత్త వంతెనలు వచ్చేటప్పుడు కూడా మనం నసపెడతాం, కానీ చివరికి అది విలువైనదే అవుతుంది. గాలి మీ ఆదాయ స్థితిని పట్టించుకోదు, గాలి మతపరమైనది కాదు, గాలి దేశభక్తి కాదు, గాలి ఓటు వేయదు, కానీ సరిదిద్దాల్సింది ఏదైనా ఉందీ అంటే అది గాలి మాత్రమే’’ అంటూ ఆయన రాశారు. ఈ పోస్ట్ సాధారణ నెటిజన్స్తో పాటు పలువురు సహచర నటీనటులను కూడా ఆకర్షించింది. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా(Sonakshi Sinha ) తదితరులు తన ఇన్స్ట్రాగామ్ పోస్ట్ను తన సోషల్ మీడియా ఖాతాలో రీపోస్ట్ చేస్తూ వీర్తో ఏకీభవించారు. -
నా కూతుర్ని షూటింగ్కు పంపిస్తా.. ఏదైనా జరిగితే మాత్రం?: మహేష్ హీరోయిన్ తల్లి
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఎదిగిన భారతీయ నటి ప్రియాంక చోప్రా. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ కాంబోలో వస్తున్న చిత్రంలోనూ ప్రియాంక నటిస్తున్నారు. నిజానికి మన దేశం నుంచి అందాల సుందరి కిరీటం అందుకున్నవారిలో ప్రియాంక చోప్రా స్థాయిలో తారా పధానికి చేరుకున్నవారు లేరనే చెప్పాలి. ఇంతింతై ఎదిగిన ఆమె విజయాల వెనుక ఆమె కష్టం ఎంత ఉందో...ఆమె తల్లి మధు చోప్రా కష్టం కూడా అంతే ఉందని అంటుంటారు బాలీవుడ్ జనాలు.సినిమా రంగంలో ప్రియాంక అడుగుపెట్టిన దగ్గర్నుంచీ ఆమెని అనుక్షణం కంటికి రెప్పలా కాచుకున్నారు ఆమె తల్లి మధుచోప్రా. అందంతో పాటు ప్రతిభ కూడా ఉన్న తన కూతురు టాప్ హీరోయిన్ కావాలనే లక్ష్యంతో కష్టపడ్డారు. మధ్యలో కొందరి వల్ల ప్రియాంక చోప్రా వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులకు లోనైనప్పుడు కూడా కూతురికి అండా దండా తానై ప్రియాంక కృంగిపోకుండా వెన్నంటి ఉన్నారు. సినీ హీరోయిన్లను వారి తల్లులు నీడలా అనుసరించడం కొత్త విషయం కాకపోయినా... ప్రియాంక తల్లి మధుచోప్రా.. అంతకు మించి అన్నట్టుగా వ్యవహరించారు. తన కష్టం ఫలించి అంతర్జాతీయ స్థాయిలో తన కూతురు పేరు తెచ్చుకోవడంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఓ మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవడంతో మధు చోప్రా ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు.ఈ నేపధ్యంలో ఇటీవల పలు ఇంటర్వ్యూల సందర్భంగా ప్రియాంక సినిమా కెరీర్ గురించి మధుచోప్రా పంచుకున్నారు. అదే సమయంలో దోస్తానీ (ప్రియాంక నటించిన బాలీవుడ్ చిత్రం) దర్శకుడు తరుణ్ మన్షుఖానీ అప్పట్లో ఎలా ప్రవర్శించారో కూడా గుర్తు చేసుకున్నారు. దోస్తానా చిత్రంలో ప్రియాంక తరుణ్తో కలిసి పనిచేసినప్పుడు కొన్ని కారణాల వల్ల వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని మధు చోప్రా చెప్పారు. ఆ పరిస్థితుల్లో ఒక రోజు ప్రియాంక తీవ్రమైన అనారోగ్యంతో బాధపడిందని, జ్వరంతో వణికిపోయిందని గుర్తుచేసుకున్నారు. తాను ఆమెకు మందులు ఇచ్చానని, అయితే మాత్రలు వేసుకున్న తర్వాత సినిమా షూటింగ్కు వెళదామని ప్రియాంక ప్రయత్నించగా తాను వారించానని చెప్పారు. కాస్త సమయం తీసుకో అని చెప్పానని, గంట తర్వాత కూడా జ్వరం తగ్గకపోవడంతో ప్రియాంక సూచనల మేరకు తాను దర్శకుడు తరుణ్కి ఫోన్ చేశానని వెల్లడించారు. తరుణ్కి ఫోన్ చేసి ప్రియాంకకు హై టెంపరేచర్ ఉన్నందున ఆ రోజు షూటింగ్కు రావడం కుదరదని చెప్పగా, ‘‘ మీ అమ్మాయి ఎంత సౌకర్యంగా ఉందో చెప్పండి’’ అని తరుణ్ వ్యంగ్యంగా బదులిచ్చాడని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పుడు తనకు తీవ్రమైన ఆగ్రహం వచ్చిందని దాంతో తాను అతనికి చాలా పరుషంగా మాట్లాడానని వెల్లడించారు. ‘‘ఆమె మీ షూటింగ్ సెట్లో చనిపోవాలని మీరు కోరుకుంటే, సరే... నేను ఆమెను పంపుతాను. కానీ ఆమెకు ఏదైనా జరిగితే, దానికి మీరే బాధ్యులవుతారు’’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించానన్నారు. ఇదంతా గుర్తు చేసుకున్న మధుచోప్రా... అయితే అదంతా గతమని తరుణ్, తాను ఇప్పుడు మంచి స్నేహితులమని, ఇప్పటికీ తాను తరుణ్ని కలిసినప్పుడల్లా అప్పటి నా కోపాన్ని గుర్తు చేస్తూ తనను ఆటపట్టిస్తుంటాడంటూ మధుచోప్రా చెప్పారు. -
ఆమె పదేళ్ల చిన్నారి.. ఎలా పెంచుతున్నానంటే: రష్మిక
రష్మిక మందన్న(Rashmika Mandanna ) ఓ ఏడాది క్రితం అయితే ఏమోగాని...ఇప్పుడు ఆమె ఇంటర్నేషనల్ స్టార్. పుష్ప, పుష్ప 2లతోనే అమాంతం అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆమెను ఆ వెంటనే వచ్చిన చావా ఎక్కడికో తీసుకెళ్లిపోయింది.ప్రస్తుతం తన తాజా చిత్రం ఛావా విజయాన్ని ఎంజాయ్ చేస్తోన్న రష్మిక త్వరలోనే విడుదల కానున్న సికిందర్ లో సల్మాన్ఖాన్ సరసన నటించింది. ఈ సినిమా మీద కూడా బాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపధ్యంలో రష్మిక ఇటీవల మరో బాలీవుడ్ సీనియర్ నటి నేహా ధూపియాతో ‘‘నేహాతో నో ఫిల్టర్’’ షోలో తన కుటుంబం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.అమ్మానాన్న ఇన్వాల్వ్ కారు...భారం నాదే...స్టార్ హీరోయిన్ గా ఎదిగినా ఇప్పటికీ రష్మిక నిరాడంబరంగా కనిపిస్తుంది. వీలైనంత వరకూ డౌన్ టూ ఎర్త్ ఉంటుంది. ఈ పరిణితికి కారణం ఏమిటి? అంటే... ఆమె తన తల్లిదండ్రుల పెంపకమే అని స్పష్టం చేస్తుంది. ‘‘ ఇది నీ జీవితం నీ జీవితంలో జోక్యం చేసుకోమని మమ్మల్ని అడగకు ’’ అని నా తల్లిదండ్రులు భారాన్ని తీసుకొచ్చి నా తలపై ఉంచారు కాబట్టి, ‘ అని ఆమె వివరించింది. తన పేరు ప్రఖ్యాతులు ఎంతగా పెరుగుతున్నప్పటికీ తన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ నిరాడంబరమైన, స్వతంత్ర జీవితాన్ని జీవిస్తున్నారని చెప్పింది.చెల్లి...పదహారేళ్ల వ్యత్యాసం...రష్మిక మందన్నకు ఓ సోదరి ఉంది. ఈ ఇంటర్వూలో తన చెల్లెలు గురించి రష్మిక కొన్ని ఆశ్చర్యకరమైన వివరాలను పంచుకుంది, అందులో ముఖ్యమైనది తనకు తన చెల్లికి మధ్య 16 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉండడం. ‘నాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక చెల్లెలు ఉంది, మా మధ్య దాదాపు 16 సంవత్సరాల గ్యాప్ ఉంది‘ అని రష్మిక ఆ సంభాషణలో వెల్లడించారు. రష్మిక ఎప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది. ఆ స్వేఛ్చకు ఆమె సెలబ్రిటీ హోదా కూడా అడ్డం కాకూడదని ఆశిస్తుంది. ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించడం కోసం, వీలైనంత వరకూ సాదా సీదాగా సాధారణ స్థితిని కొనసాగించడం కోసమే ప్రాధాన్యతనిస్తుంది,తన తల్లిదండ్రుల పెంపకాన్ని రష్మిక అభినందిస్తుంది. తన పెంపకం ఓ వ్యక్తిగా తనని ఎలా తీర్చిదిద్దిందో తన సోదరి కూడా అలాగే ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు వివరించింది. ‘నేను ఎప్పుడూ నా చెల్లి విషయంలో ఆలోచించేది ఒకటే, నాకున్న ఇప్పటి పరిస్థితుల వల్ల ఆమె కోరుకున్నది ఏదైనా ఆమె పొందుతుంది. కానీ అది ముఖ్యం కాదు, ఎందుకంటే నేను పెరిగిన పెంపకం లాంటిదే ఆమెకు మంచిది. దాని కారణంగానే నేను ఈ రోజు ఇలా ఉన్నాను,‘ అని ఆమె చెప్పింది, బాల్యం నుంచే ప్రతీ వ్యక్తీ స్వతంత్రంగా ఎదగాల్సిన అవసరం ఉందనేది ఆమె అభిప్రాయం.‘అయితే, ప్రస్తుతం, ఆమె చిన్న పిల్ల. తర్వాత తర్వాత నేను ఆమెకు ఇవ్వాల్సిన భద్రత చాలా ఉంది, వయసుతో పాటు ఆమెకు నేను అందించగలిగిన సౌకర్యాలు కూడా చాలా ఉన్నాయి’’ అంటూ చెల్లి పట్ల తనకున్న అపారమైన ప్రేమను రష్మిక పంచుకుంది. , భవిష్యత్తులో తన సోదరికి రక్షణ సౌకర్యవంతమైన జీవితాన్ని అందించడంతో పాటు లేత వయస్సులో సరైన పెంపకాన్ని అందించడం చాలా అవసరమని అంటున్న రష్మిక అభిప్రాయాలకు దోహదం చేసింది స్వీయానుభవాలే. -
50 ఏళ్లొచ్చాయి మళ్లీ మొగుడ్ని వెతుకు.. నటిపై కంగన ఘాటు వ్యాఖ్యలు
బాలీవుడ్లో కంగనా రనౌత్ (Kangana Ranaut) బాగా స్పెషల్. నటనా పరంగా ఎంచుకునే పాత్రలు మాత్రమే కాదు నిజజీవితంలోనూ ఫైర్ బ్రాండ్గానే కనిపిస్తుంది. తన వాగ్భాణాలతో ఆనేకసార్లు వార్తల్లో నిలిచిన కంగన ఇప్పుడు దేశంలో, ముఖ్యంగా సినిమా పరిశ్రమలో నడుస్తున్న విడాకుల ట్రెండ్ మీద విరుచుకుపడింది. తరచుగా భారతీయతను ప్రస్తుతిస్తూ మాట్లాడే కంగన... ఈ సందర్భంగా భారతీయ సంప్రదాయ వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని వివరించడం విశేషం. మన దగ్గర భార్యాభర్తల బంధాలు ఎంత బలమైనవో చెప్పేందుకు ఆమె పాశ్చాత్య దేశాలతో పోల్చారు. దీని కోసం తాజాగా పాప్ స్టార్, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ (Jennifer Lopez) విడాకులు తీసుకున్న ఉదంతాన్ని ప్రస్తావించారు.జెన్నిఫర్ లోపెజ్ మరో హాలీవుడ్ (Hollywood) టాప్ స్టార్ బెన్ అఫ్లెక్ను 2022లో వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అధికారికంగా విడాకులు (Divorce) తీసుకున్నారు. తమ రెండేళ్ల వివాహాన్ని ముగించాలని లోపెజ్ పిటిషన్ దాఖలు చేసిన ఆరు నెలల తర్వాత ఫిబ్రవరి 21న విడాకులు అమలులోకి వచ్చాయి. జనవరిలో లాస్ఏంజెలస్ కోర్టు ఆమోదించిన తర్వాత జెన్నిఫర్ లోపెజ్ తన పేరు నుండి ‘అఫ్లెక్‘ని తొలగించింది. నిజానికి లోపెజ్ పిటిషన్ దాఖలు చేయడానికి ఒక సంవత్సరం ముందే వారు విడిపోయారు. అంటే వీరిద్దరూ పట్టుమని రెండేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. అఫ్లెక్కు మాజీ భార్య జెన్నిఫర్ గార్నర్ (Jennifer Garner)తో ముగ్గురు పిల్లలు, లోపెజ్కు మార్క్ ఆంథోనీతో కవల పిల్లలు ఉన్నారు.వీరి ఉదంతాన్ని కంగన తన ఇన్స్ట్రాగామ్ పోస్ట్ లో ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ పాప్ ఐకాన్లలో ఒకరైన జెన్నిఫర్ లోపెజ్– బోలెడంత కీర్తి, పుష్కలంగా సంపద జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నప్పటికీ పెళ్లి బంధాన్ని నిలబెట్టుకోలేకపోతున్న విషయాన్ని కంగన ఎత్తి చూపింది. ఎందరో మగాళ్లతో సంబంధాలు పెట్టుకుని పలు మార్లు పెళ్లిళ్లు చేసుకున్న లోపెజ్ ఇప్పుడు వయసు యాభై దాటాక కూడా సరైన జీవిత భాగస్వామిని వెదుక్కుంటూనే ఉందనే విషయాన్ని కంగన ప్రస్తావించింది. ఈ సందర్భంగా ఆమె సాంప్రదాయ భారతీయ వివాహాలను పాశ్చాత్యులు ఎగతాళి చేయడాన్ని తప్పుపట్టిం. 'వారు భారతీయ వివాహాలను ఎగతాళి చేసినప్పుడల్లా ఇది గుర్తుంచుకోవాలి. అత్యంత తెలివైన/మంచిగా కనిపించే నటుడు/చిత్రనిర్మాత/రచయిత, భూమిపై అత్యంత హాటెస్ట్ మ్యాన్ అని ఎందరో పొగిడే బెన్ అఫ్లెక్... పిల్లలు పుట్టినా, పెళ్లిళ్లు చేసుకున్నా, ఇప్పటికీ పరిపూర్ణ భార్య కోసం ఎదురుచూస్తున్నాడనీ, అలానే జెన్నిఫర్ లోపెజ్ కూడా స్వీయ నిర్మిత ధనవంతురాలు, గొప్ప పాప్ స్టార్లలో ఒకరైనా ఇప్పటికీ ఓ పరిపూర్ణ వ్యక్తి కోసం వెతుకుతున్నారనీ... వీరిద్దరూ ఎవరికి వారే గొప్ప కాబట్టి వారికి ఎవరూ సరిపోరు కాబట్టి కొంతకాలానికే కనపడే లోపాలతో విసిగిపోతున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎన్నో ప్రమాణాలు చేసి, కొన్ని నెలల వ్యవధిలోనే బ్రతుకు జీవుడా అంటూ వ్యతిరేక దిశల్లో పరుగెత్తారు' అంటూ కంగన ఎద్దేవా చేసింది.ఈ సందర్భంగా కంగన తన వ్యక్తిగత అనుభవాల నుంచి తన పరిశీలనలను కూడా పంచుకుంది, పాశ్చాత్య సమాజం తరచుగా ‘పరిపూర్ణ‘ మ్యాచ్ కోసం శాశ్వత అన్వేషణను ఎంచుకుంటుందని వెల్లడించింది. అక్కడ వ్యక్తులు సాహచర్యాన్ని కనుగొనడానికి డేటింగ్ యాప్లపై ఆధారపడతారనీ, అయితే భారతీయ ఆచారాలు దీనికి విరుద్ధమని చెప్పింది. మన దేశంలో అపరిచితులను వివాహం చేసుకున్నా కూడా వృద్ధాప్యంలో ఒకరినొకరు చేతులు పట్టుకుని కలిసి నడిచే లోతైన బంధాన్ని ఏర్పరచుకుంటారని ఆమె పొగడ్తలు గుప్పించింది. చదవండి: నటుడి లవ్ మ్యారేజ్.. పిల్లల కోసం ఆలోచించేలోపు విడాకుల దిశగా..‘‘పాశ్చాత్య దేశాలలో సంబంధాలు తరచుగా తాత్కాలికంగా మారతాయనీ అయితే, భారతదేశంలో బలమైన సంప్రదాయాల పునాదులపై నిర్మించిన వివాహాలు జీవితకాలం కొనసాగుతాయనీ అన్నారామె. 80 ఏళ్ల వయస్సులో కూడా వృద్ధ జంటలు చేతులు జోడించి విహరించడాన్ని చూస్తున్న మనం పాశ్చాత్య ఆదర్శాలను ఆరాధించే బదులు, కాలక్రమేణా కొంత బలహీనపడినా మన స్వంత సాంస్కృతిక విలువలను పునరుద్ధరించుకోవాలనీ పాశ్చాత్య దేశాల నుంచి మార్గదర్శకత్వం పొందడం మానుకోవాలనీ హితవు చెప్పింది. గతంలో కూడా కంగన బాలీవుడ్ సినిమాల్లో వివాహ చిత్రణ గురించి తన ఆందోళనలను వ్యక్తం చేసింది. వివాహ సంబంధాల సారాంశాన్ని బాలీవుడ్ ప్రేమకథలు తప్పుగా సూచిస్తున్నాయని ఆమె విమర్శించింది.చదవండి: కొన్నేళ్లుగా మాటల్లేవ్.. విడాకులకు కారణం ఇదేనా?కంగన చివరి చిత్రం ఎమర్జెన్సీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. అయితే ఈ చిత్రం చలనచిత్ర విమర్శకుల నుంచి ప్రతికూల సమీక్షలను దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆమె తన తదుపరి చిత్రంలో మాధవన్తో కలిసి నటిస్తోంది. -
రీరిలీజ్తో రూ.50కోట్ల కలెక్షన్లు.. తొలి చిత్రంగా రికార్డు!
టాలీవుడ్ స్టార్స్ అభిమానులకు రీ రిలీజ్ల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. గత కొన్నేళ్లుగా మహేష్బాబు, ప్రభాస్,.. తదితరుల సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. అలా రీ రిలీజ్ అయిన సినిమాలకు ధియేటర్లలో కాసుల వర్షం కురుస్తోంది. అంతేకాదు ఆయా సినిమా ధియేటర్ల వద్ద అభిమానుల జాతర కనిపిస్తోంది. తాజాగా రామ్చరణ్ సినిమా ఆరెంజ్ సైతం వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయి భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపధ్యంలో మరికొన్ని సినిమాల రీ రిలీజ్లకు సిద్ధమవుతున్నాయి కూడా. ఈ ట్రెండ్ ఇటు టాలీవుడ్లో మాత్రమే కాదు బాలీవుడ్లోనూ జోరందుకుంది. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలను రీ రిలీజ్ చేయడం ఇక్కడ లాగే అక్కడా కనిపిస్తోంది.ఇటీవలే అలా రీ రిలీజ్ అయిన ఓ సినిమా సినీ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ చరిత్ర సృష్టిస్తోంది. పైగా ఆ సినిమా కధానాయకుడు కూడా ఏ సల్మానో, అమీర్ ఖానో కాకుండా ఒక చిన్న స్థాయి హీరో కావడం విశేషం. ఆ సినిమా హీరో గతంలో పలు తెలుగు సినిమాల ద్వారా మనకూ చిరపరిచితుడే. అతడే హర్షవర్ధన్ రాణే, అతను మావ్రా హోకేన్ నటించిన సనమ్ తేరి కసమ్(Sanam Teri Kasam ) మళ్లీ విడుదలైన చిత్రాల బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం ద్వారా కొత్త చరిత్రను సృష్టించింది. థియేటర్లలో రీరిలీజ్ అయిన తర్వాత ఇండియన్ హిస్టరీలో 50 కోట్ల రూపాయల మార్కును దాటిన మొదటి సినిమాగా ఇప్పుడు రికార్డు సృష్టించింది.(చదవండి: మజాకా మూవీ రివ్యూ)చిత్ర నిర్మాత దీపక్ ముకుత్ ఇన్స్ట్రాగామ్లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు, ‘‘మా చిత్రం రికార్డులను బద్దలు కొడుతోంది, అదంతా మీ ఎడతెగని ప్రేమ వల్లనే’’ అంటూ. ఈ రొమాంటిక్ డ్రామా ఫిబ్రవరి 5, 2016న థియేటర్లలో విడుదలైంది, కానీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఇది వాలెంటైన్స్ వీక్లో మళ్లీ విడుదలై అప్పటి నుంచీ థియేటర్లలో నడుస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు అధికారికంగా హారర్ సినిమా తుంబాద్ కలెక్షన్స్ను అధిగమించింది దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన రీ–రిలీజ్ చిత్రంగా నిలిచింది. తుంబాద్.. రూ.32 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడితే...సనమ్ తేరి కసమ్ రీ–రిలీజ్ కేవలం 16 రోజుల్లోనే 32 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూ రూ.53 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. ఈ సినిమా విజయం వినోద పరిశ్రమ హిట్ ఫార్ములాను మార్చివేసింది, చిన్న బడ్జెట్తో చేసిన సాధారణ ప్రేమకథ సైతం పెద్ద హిట్ అవుతుందని నిరూపించింది. .సనమ్ తేరి కసమ్ చిత్రానికి రాధికా రావు వినయ్ సప్రు దర్శకత్వం వహించారు చిరంతన్ దాస్ అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. ఈ చిత్రంలో హర్షవర్ధన్ రాణే, మావ్రా హోకానే, విజయ్ రాజ్ మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. తకిట తకిట అనే తెలుగు సినిమా ద్వారా సినీరంగానికి పరిచయం కావడం విశేషం. హర్షవర్ధన్ రాణే... ఆ తర్వాత అవును, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, ఫిదా వంటి చిత్రాల్లోనూ నటించారు. ప్రస్తుతం బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. -
చిరంజీవి, రజనీకాంత్.. హాలీవుడ్ సినిమాల్లో?
ఇటీవల మన తెలుగు హీరోలు గ్లోబల్ స్టార్లుగా మారుతున్నారు. ఇప్పటి దాకా చూస్తే హాలీవుడ్( Hollywood) సినిమాల్లో బాలీవుడ్ తారలకు వచ్చిన స్థాయిలో దక్షిణాదికి అవకాశాలు రాలేదు. అయితే ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూ.ఎన్టీయార్...లు ఇప్పుడు హాలీవుడ్లో సైతం చర్చకు వస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే... మరికొన్ని టాలీవుడ్ హీరోల చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో దుమ్ము రేపితే త్వరలోనే హాలీవుడ్ సినిమాలో తెలుగు హీరోని చూడడం ఖాయంగా కనిపిస్తోంది. ఆల్రెడీ మన జూనియర్ ఎన్టీయార్తో సినిమా తీయాలని ఉందని సూపర్ మ్యాన్ సినిమా దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మరోసారి దక్షిణాది హీరోలు హాలీవుడ్ తెరంగేట్రం టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా మారింది. అయితే దక్షిణాది హీరోలు హాలీవుడ్ ని ఆకర్షించడం, అక్కడి సినిమాల్లో నటించే అవకాశం మరీ అంత అందని ద్రాక్ష ఏమీ కాదు. గతంలోనూ పలువురు దక్షిణాది హీరోలు నటించిన దాఖలాలు ఉన్నాయి. గత 2018లో దక్షిణాది స్టార్ ధనుష్ హాలీవుడ్ చిత్రంలో నటించాడు. ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ పేరుతో రూపొందిన ఆ చిత్రంతో పాటు ఆంథోనీ, జోయ్ రుస్సో దర్శకత్వం వహించిన ది గ్రే మ్యాన్ అనే చిత్రంలోనూ నటించాడు. సోనీ ప్రొడక్షన్స్ ఫిల్మ్ స్ట్రీట్ ఫైటర్లో నటిస్తాడని వార్తలు వస్తున్నాయి.ప్రముఖ దక్షిణాది నటుడు పలు తెలుగు చిత్రాల్లో విలన్గా నటించిన నెపోలియన్... గత 2019లో హాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆయన అతీంద్రీయ శక్తుల కధతో రూపొందిన థ్రిల్లర్ మూవీ డెవిల్స్ నైట్లో నటించాడు. అలాగే అమెరికన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ క్రిస్మస్ కూపన్లో కూడా ఆయన చేశారు. అచ్చ తెలుగు అమ్మాయి అవంతిక వందనపు... పలు తెలుగు సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించింది. మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం వంటి సినిమాల్లో కనిపించిన అవంతిక... అమెరికాలో నివసించే హైదరాబాదీ యువతి. ఈమె కూడా మీన్ గాళ్స్ అనే హాలీవుడ్ మూవీలో నటించింది.తమిళ సూపర్ స్టార్ సీనియర్ నటడు రజనీకాంత్(Rajinikanth )... చాలా మందికన్నా ముందే... అప్పట్లో ఒక హాలీవుడ్ చిత్రంలో నటించాడు. అశోక్ అమృత్రాజ్, సునంద మురళీ మనోహర్లు రూపొందించిన బ్లడ్ స్టోన్ అనే సినిమాలో ఆయన ఒక క్యాబ్ డ్రైవర్ పాత్ర పోషించాడు. మన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సైతం హాలీవుడ్ చిత్రంలో నటించిన విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆయన తన సమకాలీకుడైన రజనీకాంత్ కన్నా ఓ పదేళ్లు ఆలస్యంగా అంటే 1999లో హాలీవుడ్ లో రంగప్రవేశం చేశారు. థీఫ్ ఆఫ్ బాగ్థాద్ అనే సినిమాలో ఆయన చేశాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ అర్థంతరంగా ఆగిపోయింది. -
రామ్చరణ్తో పోటీపడేంతవాడివా సిద్ధూ...
సిద్ధు జొన్నలగడ్డ చిన్నస్థాయి నుంచి సినీ పరిశ్రమలో స్టార్ బాయ్గా ఎదగడం సినీ పరిశ్రమలోని ఔత్సాహిక నటీనటులకు పెద్ద ప్రేరణ. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో హోదా సాధించాడు. అయితే ఇదేమీ అలవోకగా సాధించేసింది కాదు. దాదాపుగా దశాబ్ధంన్నర పాటు పడిన కష్టం దీని వెనుక ఉంది. సీనియర్ హీరో రవితేజలాగా అత్యంత చిన్న స్థాయి పాత్రలు వేస్తూ పెద్ద స్టార్గా ఎదిగిన వర్ధమాన హీరోల్లో సిద్ధూ ముందు వరుసలో ఉంటాడు.డీజే టిల్లు 1, 2 భాగాలు సిద్ధూని ఒకేసారి పెద్ద స్టార్గా మార్చేశాయి. అతని తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. సిద్ధు జొన్నలగడ్డ డిజె టిల్లు ద్వారా పూర్తిగా వన్మ్యాన్ షో చేశాడని చెప్పాలి. ఆ సినిమాలో వెరైటీ మాడ్యులేషన్తో యాక్షన్, కామెడీని పండించి సరికొత్త హీరోయిజాన్ని రుచి చూపించిన సిద్ధూ ఆ సినిమాకి కధారచయితగా కూడా వ్యవహరించడం విశేషం. జోష్ సినిమాలో చిన్నపాత్రతో మొదలైన సిద్ధూ జొన్నలగడ్డ కెరీర్ తర్వాత కూడా డాన్ శీను, భీమిలి కబడ్డి జట్టు..లాంటి పలు చిత్రాల్లో అలాంటి పాత్రలతోనే కొనసాగింది. ఆ తర్వాత ఈ యువ హీరో లైఫ్ బిఫోర్ వెడ్డింగ్లో తొలిసారిగా ప్రధాన పాత్రలో అరంగేట్రం చేసిన సిద్ధూ హీరోగా మారి గుంటూరు టాకీస్ వంటి ఎ సర్టిఫైడ్ చిత్రాల ద్వారా హిట్స్ దక్కించుకున్నాడు. అదే విధంగా తను నటించిన చిత్రాల్లో కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా కోవిడ్ సమయంలో ధియేటర్లలో విడుదలకు నోచుకోలేక కేవలం ఓటీటీలో మాత్రమే విడుదలైంది.పెద్దలకు మాత్రమే అన్నట్టుగా రూపొందిన ఈ చిత్రం అప్పట్లో రొమాంటిక్ మూవీగా హిట్ టాక్ తెచ్చుకుంది కూడా. ఆ తర్వాత మారిన పరిణామాల్లో సిధ్దూకి డిజె టిల్లు తెచ్చిపెట్టిన క్రేజ్ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుందనుకున్నారు. యూత్లో సిధ్దూకి ఉన్న ఫాలోయింగ్ని దృష్టిలో ఉంచుకుని వాలెంటైన్స్ డే సందర్భంగా ధియేటర్లలో విడుదల చేసేశారు కూడా. ఇక్కడ గమనించాల్సిన విశేషం ఏమిటంటే అదే రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ చిత్రం రీ రిలీజ్ కూడా ఉండడం.అప్పట్లో ఆరెంజ్ సినిమా కు విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ కమర్షియల్గా ఫ్లాప్ చిత్రంగానే నిలిచింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా రీ రిలీజ్ అదే రోజు సిద్ధూ జొన్నలగడ్డ సినిమా రీ రిలీజ్ ఉండడం సినీ వర్గాల్లో ఆసక్తి నింపాయి. మరో చెప్పుకోదగ్గ విశేషం... నాటి ఆరెంజ్ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సైతం సంతోష్ అనే చిన్న పాత్రలో నటించాడు. ఆ సినిమాలో హీరో రామ్ చరణ్కి పోటీగా హీరోయిన్ ని ప్రేమలో పడేలా చేసే ముగ్గురు అబ్బాయిల్లో ఒకడిగా చేశాడు. ఆసక్తికరంగా... సిద్ధూ ఆరెంజ్ చిత్రాన్ని రూపొందించిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలోనే తదుపరి జాక్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ వారం ఆసక్తికరంగా, సిద్ధు ’ఇట్స్ కాంప్లికేటెడ్’ (కృష్ణ అండ్ అతని లీల) పేరుతో ఆరెంజ్కి పోటీగా విడుదలైంది. ఓ యువ హీరో సినిమా రీ రిలీజ్కు నోచుకోవడం కూడా ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. అయితే ముందూ వెనుకా చూసుకోకుండా సిద్ధూ తన సినిమాని రామ్చరణ్ సినిమా రీ రిలీజ్ రోజునే విడుదల చేయడంతో ఇప్పుడు వీరిద్దరిని పోలుస్తూ కామెంట్ చేయడం మొదలైంది. మరోవైపు రీరిలీజ్లో సిద్ధూ చిత్రం పూర్తిగా చతికిలబడగా రామ్ చరణ్ ఆరెంజ్ అనూహ్యంగా భారీ కలెక్షన్లు సాధించింది.తెలుగు చిత్రసీమలో సిద్ధూ ఎదుగుదల ప్రశంసించదగ్గదే. స్థిరత్వం అంకితభావంతో సినీ పరిశ్రమలో ఒక నటుడి జీవితం ఎలా మారుతుందో చెప్పడానికి సిద్ధూ ఒక ఉదాహరణ. అయితే పెద్దగా అండదండలు లేని హీరోల స్టార్ డమ్ ఎప్పుడూ నిలకడగా ఉండడం తెలుగు చిత్రసీమలో సాధ్యం కాదని సిధ్దూ గుర్తించాలి. అన్ని రకాలుగా తమకన్నా పెద్ద హీరోలతో పోటీ పడే విషయంలో యువ హీరోలు కాస్త వివేకంతో వ్యవహరించాలని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. -
కమాన్.. ఉదిత్ జీ.. ముద్దు పెట్టు... సానియామీర్జా, ఫరాఖాన్ సందడి!
ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్,బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకురాలు కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన వినోదాత్మక వ్లాగ్లకూ పేరొందారు. ఇక మాజీ టెన్నిస్ ప్లేయర్ హైదరాబాదీ సానియా మీర్జా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా సన్నిహితులైన వీరిద్దరూ ఇటీవలే ఫరాఖాన్ ఇంటిలో కలిశారు. ఆమెతో పాటు ఆమె సోదరి అనమ్ మీర్జా కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సానియా మీర్జా ఫరాతో కలిసి కిచెన్లో సందడి చేశారు. ఆమెతో పాటు వంట సెషన్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సానియా క్లాసిక్ హైదరాబాదీ–శైలి చికెన్ 65 వంటకాన్ని తయారు చేశారు, అదనపు సాస్లతో తన స్వంత సృజనాత్మక ట్విస్ట్ను ఫరా దానికి జోడించింది. ఇలా కిచెన్ లో వంటలో దినుసులు కలపడంతో పాటు హాస్యం పంచడంలో కూడా ఇద్దరు స్నేహితులు పోటీ పడడంతో ఈ ఎపిసోడ్ అంతా నవ్వులు, సరదాలతో నిండిపోయింది. సానియా ప్రతిభ టెన్నిస్ కోర్ట్కు మించి విస్తరించిందో లేదో చూడండి అంటూ ఫరా తన యూట్యూబ్ ఛానెల్లో తమ కిచెన్లో షూట్ చేసిన వీడియోను పంచుకుంది.తద్వారా వీక్షకులకు నిజమైన హైదరాబాదీ చికెన్ 65 రెసిపీని నేర్చుకునే అవకాశాన్ని కూడా వీరు అందించారు, ఇది ఏ సందర్భానికైనా సరిపోయే క్రిస్పీ ఫ్లేవర్ఫుల్ డిష్ గా వర్ణించారు. ఇదంతా ఒకెత్తయితే... ఈ సందర్భంగా ఫరా చూపిన హాస్య చతురత వీక్షుకులకు నవ్వుల్ని పంచింది. హాస్య స్వభావానికి పేరొందిన ఫరా... సానియా కుమారుడిని ముద్దు పెట్టమని ఉల్లాసంగా అడిగే విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. తన ఇంట్లో ఫుట్బాల్ ఆడుకుంటున్న ఆ కుర్రాడి నుంచి బంతిని తీసుకున్న ఫరా, ఇజాన్ తన బంతిని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ‘‘నీ నుంచి కొన్ని బ్రౌనీ పాయింట్లు సంపాదించడానికి నేను మీకు బంతిని తిరిగి ఇవ్వవలసి ఉంది‘ అని చెప్పారు. బంతిని ఇవ్వాలంటే ఓ షరతు కూడా విధించారు. అదేమిటంటే... ‘‘మొదట నన్ను నువ్వు ముద్దు పెట్టుకోవాలి, అదెలాగో నీకు తెలుసు. కమాన్... ముద్దివ్వండి ఉదిత్ జీలా ’’ అంటూ ఆ బాలుడ్ని అడగడం నవ్వుల్తో ముంచెత్తింది. ఈ వీడియోను చూసిన నెటిజనులు కూడా ఫరా హాస్య చతురతను కొనియాడుతున్నారు.ఇటీవల ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ ముద్దు ఉదంతం నెట్టింట సంచలనం సృష్టించింది. ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొన్న ఉదిత్ నారాయణ్... తన పాటలతో అభిమానుల్ని ఉర్రూతలూగించారు. అదే జోరులో ఆయన టిప్ టిప్ బర్సా పానీ పాట పాడుతూండగా పలువురు అభిమానులు ఆయన వేదికకు బాగా దగ్గరగా వచ్చేశారు. అలా పాట పాడుతూనే వేదిక మీద నుంచే ఒక అభిమానికి ఉదిత్ దగ్గరగా జరిగినప్పుడు ఆ యువతి ఆయనకు బుగ్గ మీద ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఆయన ఏకంగా ఆమె పెదాల మీదే ముద్దు పెట్టేశారు. దీంతో ఈ ఉదంతం నెట్టింట ఉదిత్పై తీవ్ర విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తడానికి దారి తీసింది. ఈ నేపధ్యంలోనే ఫరా... సానియా మీర్జా కుమారుడితో ‘‘నాకు ముద్దివ్వు ఉదిత్ జీ అవ్వు.. అంటూ అనడం నెటిజన్లను ఆకర్షించింది. -
సినీతారలకు నేర్పేది వీరే..
ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో ఇంటిమేట్ విప్లవం నడుస్తోందని చెప్పొచ్చు. నిన్నా మొన్నటి దాకా శృంగార సన్నివేశాలను చూపించాల్సి వచ్చినప్పడు పూవులూ తుమ్మెదలతోనో, తామరాకులూ నీటిబొట్లతోనో సింబాలిక్గా మాత్రమే చూపిస్తూ దాపరికం ప్రదర్శించిన చిత్రసీమ ఒక్కసారిగా తెర తీసేసింది. హద్దే లేకుండా చెలరేగిపోతోంది. ఇప్పుడు శృంగార సన్నివేశాలు లేని సినిమాలు, వెబ్సిరీస్.. చూడాలంటే భూతద్ధంతో వెదుక్కోవాల్సిందే.అయితే ఆ తరహా శృంగార సన్నివేశాల్లో నటించడం అంత వీజీ కాదు. తెర ముద్దుల్లో పండిపోయిన ఇమ్రాన్ హష్మి లాంటివారు మాత్రమే కాదు హీరోయిన్ను ముట్టుకోవాలంటే ఇబ్బంది పడే కొత్త నటులు ప్రతీక్ గాంధీ లాంటివారూ అన్ని భాషా చిత్ర పరిశ్రమల్లోనూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులే ఇప్పుడు కొత్త ప్రొఫెషనల్స్ సృష్టికి నాంది పలికాయి. నిజానికి హాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉన్న ఇంటిమసీ కో ఆర్డినేటర్లు, ఇంటిమసీ డైరెక్టర్లుగా బాలీవుడ్ తెరవెనుకకు వచ్చారు.‘నేను హాలీవుడ్ ఇంటిమసీ కోఆర్డినేటర్ అమండా బ్లూమెంటల్ దగ్గర శిక్షణ తీసుకున్నా. సిధ్ధాంత్, దీపికాపదుకునే నటించిన గెహ్రైయాన్ చిత్రంలో పుష్కలంగా శృంగార సన్నివేశాలున్నాయి. ఆ సినిమాలో ఇంటిమేట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు నాకు ఆ శిక్షణ సహాయపడింది. అలాగే సాస్, బహు ఔర్ ఫ్లెమింగో, క్లాస్ ఔర్ ఫోర్ షాట్స్ వంటి వెబ్ సిరీస్లలో కూడా వర్క్ చేశా. అనుభవజ్ఞులైన నటులకైతే సన్నివేశంలోని గాఢతను అర్థం చేసుకోవడానికి కేవలం ఒక సంభాషణ సరిపోతుంది. కొత్తవాళ్లకు మాత్రం కొంత టైమ్ పడుతుంది అంటున్నారు మన దేశపు ప్రప్రధమ ఇంటిమసీ కో ఆర్డినేటర్ ఆస్తా ఖన్నా(Astha Khanna)ఇటీవల విడుదలైన షాహిద్ కపూర్–కృతిసనన్ నటించిన తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియాలో పలు ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయి, ఆ చిత్ర దర్శకుడు అమిత్ జోషి మాట్లాడుతూ‘‘చిత్రీకరణకు ముందు నటీనటుల అభ్యంతరాలు తెలియజేయడానికి సన్నివేశాలు ముందుగానే చర్చకు వస్తాయి. దర్శకులుగా మా నటీనటులు సౌకర్యంగా ఉండేలా చూసుకోవడం మా బాధ్యత. నటులు కూడా సన్నివేశాన్ని అందంగా చిత్రీకరించినంత కాలం దర్శకుడిని విశ్వసిస్తారు. రొమాంటిక్ సీన్స్ వల్ల ఎదురయే సవాళ్లను అధిగమించేందుకు ఇంటిమసీ కో ఆర్డినేటర్లు ఉంటారు’’ అని చెప్పారు.(చదవండి: 'పుష్ప2' ఫైనల్ కలెక్షన్స్.. ప్రకటించిన మేకర్స్)ఇంటిమసీ డైరెక్టర్ని కలిగి ఉండటం అంటే యాక్షన్ డైరెక్టర్ లేదా డ్యాన్సర్ కొరియోగ్రాఫర్ని కలిగి ఉన్నట్లే, నటీనటులు ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా సురక్షితంగా ఉండేందుకు వారితో వర్క్షాప్లు నిర్వహిస్తారు కోఆర్డినేటర్లకు దర్శకులు తాము ఏమి చిత్రీకరించాలనుకుంటున్నారో వివరిస్తారు. ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు నటుడు తన చేతులను ఎక్కడ ఉంచాలి వంటివి తెలిపిన తర్వాత సన్నివేశం ఖరారు అవుతుంది. రొమాంటిక్ సన్నివేశాలను , స్క్రిప్ట్ని తెలుసుకోవడం వర్క్షాప్లు నిర్వహించడం: స్క్రిప్ట్కు ఎలాంటి సన్నివేశాలు అవసరమో అర్థం చేసుకోవడం ఇంటిమసీ కోఆర్డినేటర్ ప్రధాన బాధ్యత.(చదవండి: పాఠ్య పుస్తకాల్లో శంభాజీ చరిత్ర ఎందుకు లేదు?: మాజీ క్రికెటర్)‘గెహ్రైయాన్లో శృంగారాన్ని విభిన్నంగా చూపించాలనుకున్నా. హీరో హరోయిన్లతో మాట్లాడా. సిద్ధాంత్ అప్పుడే బాలీవుడ్లోకి ప్రవేశించాడు. దీపిక చాలా కాలంగా ఉంది. ఆ వ్యత్యాసం తెలీకుండా ఆన్–స్క్రీన్ కెమిస్ట్రీ చూపించే విధంగా వారికి సౌకర్యవంతంగా ఉండాలని కోరుకున్నాను’ అని ఇంటిమసీ దర్శకుడు దార్(Dar Gai) చెప్పారు.‘‘ఖామోష్ పానీ బిఎ పాస్ వంటి నా మొదటి కొన్ని చిత్రాల సమయంలో ఇంటిమేట్ సీన్స్ చేసేటప్పుడు కొంత స్ట్రెస్ కు గురైంది నిజం. ఆ సమయంలో హద్దులు దాటకుండా సరైన భావోద్వేగాలను ప్రదర్శించాలి. కో ఆర్డినేటర్ల కారణంగా ఇబ్బంది తొలిగింది. ఆ తర్వాత ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ లో లెస్బియన్ క్యారెక్టర్ కూడా చేయగలిగాను. ఇంటిమేట్ సన్నివేశాల కోసం రిహార్సల్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉద్విగ్న వాతావరణాన్ని తేలికగా ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి’’ అంటూ చెప్పారు బోల్డ్ నటనకు పేరొందిన శిల్పా శుక్లా చెప్పారు. -
బాలయ్య కాంపౌండ్లోకి చిరు?
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సాధారణంగా వివాదాస్పద అంశాల జోలికి పోరు. సందర్భం ఏదైనా సరే ఆయన ప్రసంగాలు ఎప్పుడూ చాలా సెన్సిబుల్గా, ఆలోచింపజేసేవిగా ఉంటాయి. తన వయసుకు తగ్గట్టుగా, సినీ పరిశ్రమలోని యువతరానికి దిశానిర్ధేశ్యం చేసే విధంగా మాట్లాడడానికే ఆయన ఇటీవల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. గత కొంత కాలంగా చిన్నా పెద్దా తేడా లేకుండా ఆయన యువ హీరోల ప్రీ రిలీజ్లు, ఆడియో రిలీజ్లు, జర్నలిస్ట్ల బుక్ రిలీజ్లు... ఇలా వీలైనన్ని కార్యక్రమాలకు హాజరవుతూ వారిని ఆశీర్వదిస్తూ ప్రస్తుతం పరిశ్రమకు పెద్ద దిక్కు లేని లోటు తీరుస్తున్నారు. నిజానికి సుదీర్ఘ సినీ ప్రయాణం చేసిన చిరంజీవి లాంటి సీనియర్ నటులు ఎవరైనా చేయాల్సిన పని అదే. మరీ ముఖ్యంగా ఎవరి అండా లేకుండా ఎన్నో కష్టనష్టాలు, వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ఎన్నెన్నో ఎత్తుపల్లాలు చూసిన చిరంజీవి లాంటి వారి మార్గదర్శకత్వం యువ తరానికి ఎప్పుడూ కావాల్సిందే అనడంలో సందేహం లేదు.నిన్నటి తరం హీరోలు ఆ విధంగా నేటి తరాన్ని గైడ్ చేయడం ఎంతైనా అవసరం. అందుకు తగిన సత్తా, అందుకు తగినంత అనుభవం...వీటన్నింటినీ మించి నొప్పింపక తానొవ్వక అన్నట్టుగా ఉండే స్వభావం వల్ల చిరంజీవి మాత్రమే అందుకు అర్హులు కూడా. ఆయనతో సమకాలీకుడైనప్పటికీ బాలకృష్ణ లో ఆ పాత్ర పోషించగల నేర్పు, ఓర్పు లేవు. ఆయనకు ఉన్న నోటి దురుసుతనం కావచ్చు, ప్రసంగాల్లో అపరిపక్వత కావచ్చు... ఆయన యువతరానికి మార్గదర్శకత్వం వహించడానికి నప్పరు. ఇక వెంకటేష్, నాగార్జునలకు సైతం ఆ శక్తి, ఆసక్తి కూడా లేవు కాబట్టి వారు చేయలేరు...చేయరు. ఈ పరిస్థితుల్లో పరిశ్రమకు పెద్ద సంఖ్యలో వస్తున్న యంగ్ టాలెంట్కు చిరంజీవి మాటలు శిరోధార్యంగా అనిపిస్తాయి.అయితే ఇంతటి బాధ్యతను అప్రయత్నంగానే తలకెత్తుకున్న చిరంజీవి ప్రసంగాలు ప్రవర్తన ఇటీవల దారి తప్పుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. తాజాగా లైలా(Laila Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్లో అసలు ఈయన చిరంజీవేనా లేక బాలయ్యగా మారిపోయారా అన్నట్టుగా ప్రవర్తించారు. సినిమాలో విష్వక్సేన్ పాత్ర గురించి చెబుతూ అమ్మాయి గెటప్లో అందంగా ఉన్నాడు అని చెప్పి సరిపెట్టకుండా పదే పదే భలే ఉన్నాడు బుగ్గ కొరికేయాలని అనిపించింది మగవాళ్ల మనసు దోచుకుంటాడు... అంటూ బబర్థస్త్ కామెడీకి తీసిపోకుండా మాట్లాడడం ఆశ్చర్యకరం. అలాగే ఆ సినిమా హీరోయిన్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా చిరంజీవి స్పందించిన విధానం ఆయన నైజానికి విరుద్ధంగా కనిపించింది. ఆమెతో నాతో చేయి కలిపావుగా ఇక గుర్తుండిపోతావు, థాంక్యూ అంటూ అనడం, ఇక సుమను లండన్కు తీసుకెళతానంటూ సందర్భం లేకుండా మాట్లాడడం... ఆయన స్థాయికి తగ్గట్టుగా అనిపించదు.ఈ ఈవెంట్ ప్రారంభంలో తాను బాలయ్య కాంపౌండ్ హీరో అయిన విష్వక్సేన్ సినిమా వేడుకకు రావడం గురించి వినిపించిన వ్యాఖ్యానాలపై చిరంజీవి మాట్లాడారు. పరిశ్రమ మొత్తం ఒకే కుటుంబం అంటూ చెప్పుకొచ్చారు. ఆ సంగతి ఎలా ఉన్నా... ఈ ఫంక్షన్లో ఆయన తీరు చూస్తే... ఆయన కూడా బాలయ్య కాంపౌండ్లో చేరిపోయారా అన్నట్టుగా ఉందని కొందరు సినీజీవులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి తాను పోషిస్తున్న పెద్దన్న పాత్రకు వన్నె తెచ్చే విధంగా తన ప్రవర్తనను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. -
‘పుష్ప 2’ అల్లుఅర్జున్కి శాపమా?
గంగోత్రి నుంచి స్టైలిస్ట్ స్టార్ దాకా టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) ప్రయాణం దినదిన ప్రవర్ధమానమవుతూ సాగింది. ఆ తర్వాత ఆయన ఐకాన్స్టార్ గా మారే క్రమంలో పుష్పతో జరిగిన ట్రాన్స్ఫార్మేషన్ మాత్రం ఒక విస్ఫోటనం అని చెప్పాలి. అప్పటి దాకా అగ్రగామి టాలీవుడ్ హీరోల్లో టాప్ 5 లో సైతం లేని బన్నీని ఒక్కసారిగా నెంబర్ వన్ పొజిషన్ పోటీకి హై జంప్ చేయించిన చిత్రం అది. ఆ తర్వాత పుష్ప 2 ది రూల్(Pushpa 2: The Rule) అల్లు అర్జున్ క్రేజ్ని పూర్తిగా ఆకాశానికి ఎత్తేసింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏ హీరో కూడా ఇలా అకస్మాత్తుగా నెంబర్ వన్ పొజిషన్లో ఎగిరి కూర్చున్నది లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందనేది సినీ పండితుల అంచనాలకు సైతం అందడం లేదు. రెండో పార్ట్ రిలీజ్కి ముందే బీహార్ రాష్ట్రంలో బన్నీ కార్యక్రమంలో లాఠీచార్జి జరగడమే ఆశ్చర్యం అనుకుంటే పుష్ప 2 విడుదలయ్యాక హిందీ సినిమాల రికార్డులన్నీ చెరిపేయడం మరింత ఆశ్చర్యం....ధియేటర్ల రికార్డుల పరంపర అలా ఉంచితే... ప్రస్తుతం ఈ సినిమా నెట్టింట కూడా సంచలనాలు సృష్టిస్తోంది. అత్యధిక మొత్తం చెల్లించి నెట్ఫ్లిక్స్ స్వంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో అత్యధిక వీక్షకులు చూసిన 2వ ఆంగ్లేతర చిత్రంగా నిలవడం విశేషం. ఏదేమైనా.. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్గా మారిపోయాడనేది నిజం. ఇలా అల్లు అర్జున్ ఇమేజ్ విషయంలో వరుసపెట్టి పుష్ప 2 సృష్టించిన ఆశ్చర్యాల నుంచి ఇప్పుడిప్పుడే మనం తేరుకుంటున్నాం.ఈ నేపధ్యంలో కొత్తగా ఓ ప్రశ్న ఉదయిస్తోంది....నెక్ట్స్ ఏమిటి? అని. నెక్ట్స్ ఏముంది? అల్లు అర్జున్ త్రివిక్రమ్తో చేయనున్న సినిమా త్వరలోనే సెట్స్కి వెళ్లనుంది అంటూ ఎవరైనా ఠక్కున చెప్పేయవచ్చు. పుష్ప కి ముందు అయితే ఇలా అల్లు అర్జున్ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం అంటే మామూలుగా విని ఊరుకునే వార్త మాత్రమే. అయితే ఇప్పుడు అలా కాదు. ఆకాశమంత ఎదిగిన పుష్పరాజ్ ఇమేజ్ ఇప్పుడు అల్లు అర్జున్ ప్రతీ అడుగునూ పట్టి కుదిపేస్తోంది. ఆ ఇమేజే ఇప్పుడు బన్నీకి సవాల్గా మారనుంది.బాహుబలి తర్వాత ప్రభాస్ సహా టాప్ హీరోలు అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కునే ఉంటారు. అయితే వీరందరి కన్నా కాస్త భిన్నమైనదిగానే ఐకాన్ స్టార్ పరిస్థితిని చెప్పుకోవాలి. ఎందుకంటే... పుష్పరాజ్ అనే క్యారెక్టర్ విపరీతంగా ప్రేక్షకుల మదిలోకి చొచ్చుకుపోయింది. దాంతో బన్నీ నెక్ట్స్ మూవీ పైన ప్రేక్షకుల్లో ఆశలు ఏ స్థాయిలో ఉంటాయో, అవి బన్నీ తర్వాతి సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అంచనాలకు అందడం లేదు.ముందుగానే కధ, పాత్రల తీరుతెన్నులపై చర్చలు ముగిసినా, పుష్ప 2 తర్వాత... రానున్న అల్లు అర్జున్ సినిమాల్లోని ఐకాన్ స్టార్ పాత్ర ల్లో ఆయన పెరిగిన ఇమేజ్కు తగ్గట్టుగా కొన్నయినా మార్పు చేర్పులు చేయక తప్పదు. అన్నీ చేసినా... పుష్పరాజ్ స్థాయిలో మరో పాత్రను అల్లు అర్జున్కి తీసుకురాగలరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేకాకుండా ఒక హీరోకి ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత అదే స్థాయిలో అసూయలు, ప్రొఫెషనల్ శతృత్వాలూ తప్పవు. సహజంగానే అవి బన్నీ ఫెయిల్యూర్స్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాయి. వీటన్నింటినీ తట్టుకుని తలకెత్తుకున్న కిరీట భారాన్ని తడబడకుండా మోయడంలో నేర్పరితనాన్ని చూపడంపైనే ఐకాన్ స్టార్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. తడబడితే మాత్రం... అల్లు అర్జున్ అనే హీరోకి పుష్పరాజ్ పాత్ర వరమూ, శాపమూ రెండూ తానే అవడం తధ్యం. -
ఇండియాలో రిచ్ స్టార్ మన టాలీవుడ్ హీరోనే. .ఏ హీరో ఆస్తి ఎంతంటే..?
ఒకప్పుడు నార్త్ ఇండియా స్టార్స్ అన్ని విధాలుగా మన టాలీవుడ్ తారల కన్నా ముందుండేవారు. వ్యక్తిగత సంపదలో సైతం అక్కడి అగ్రగామి నటులదే పైచేయిగా ఉండేది. ఇటీవలి కాలంలో ఉత్తరాది చిత్రాల రికార్డ్స్ను మన టాలీవుడ్ తుడిచిపెడుతున్నట్టే... సంపద విషయంలోనూ వారిని మనవాళ్లు తోసిరాజంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించింది మనీ కంట్రోల్ అనే ఆర్ధిక వ్యవహారాల సంస్థ. ఈ సంస్థ చెబుతున్న ప్రకారం చూస్తే... దక్షిణాదికి చెందిన అత్యంత సంపన్న తార వాస్తవానికి బాలీవుడ్లో చాలా మంది కంటే సంపన్నుడుగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు మన టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యంత సంపన్నుడు అని మనీకంట్రోల్ తేల్చి చెప్పింది. సంస్థ విశ్లేషణ ప్రకారం, నాగార్జున నికర ఆస్తుల విలువ 410 మిలియన్లు (రూ.3572 కోట్లకు పైగా) కలిగి ఉన్నారు, తద్వారా దేశంలోనే అత్యంత రిచ్ స్టార్స్లో ఒకరుగా నిలిచారు. మన నాగ్ కన్నా ముందున్నది కేవలం షారుఖ్ ఖాన్, జుహీ చావ్లాలు మాత్రమే. అమితాబ్ బచ్చన్ (రూ.3200 కోట్లు), హృతిక్ రోషన్ (రూ3100 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.2900 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.2700 కోట్లు) అమీర్ ఖాన్ (రూ1900 కోట్లు) వంటి ఎ–లిస్ట్ బాలీవుడ్ తారల కంటే నాగార్జున ముందున్నారు.నాలుగు దక్షిణాది పరిశ్రమలకు చెందిన నటులలో, నాగార్జున సమకాలీనుడైన చిరంజీవి సైతం నాగ్ తర్వాతి స్థానంలో ఉన్నారు, ఆయన నికర ఆస్తుల విలువ రూ1650 కోట్లు. ఇతర అత్యంత ధనవంతులైన దక్షిణాది తారల్లో రామ్ చరణ్ (రూ1370 కోట్లు), కమల్ హాసన్ (రూ600 కోట్లు), రజనీకాంత్ (రూ500 కోట్లు), జూనియర్ ఎన్టీఆర్ (రూ500 కోట్లు), ప్రభాస్ (రూ250 కోట్లు)...గా ఉన్నారు. నిస్సందేహంగా నాగార్జున తెలుగు సినిమాలలో అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు. కానీ, ఆయన సమకాలికులైన చిరంజీవి కన్నా అలాగే నేటి బిగ్ స్టార్స్ అయిన ప్రభాస్ రామ్ చరణ్ కన్నా కూడా ఎలా సూపర్రిచ్ అయ్యారు? అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు స్మార్ట్ వ్యాపార పెట్టుబడుల ద్వారా నాగ్ టాప్ ప్లేస్ను సాధించారని సదరు మనీ కంట్రోల్ వెల్లడించింది.నాగార్జున కేవలం సినిమాల నుంచే కాకుండా రియల్ ఎస్టేట్, సినిమా స్పోర్ట్స్ ఫ్రాంచైజీలతో సహా ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా తన దైన మార్క్ని చూపారు. టాలీవుడ్లోని అతిపెద్ద నిర్మాణ సంస్థలు స్టూడియోలలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున సొంతం. ఆయన రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ అయిన ఎన్3 రియల్టీ ఎంటర్ప్రైజెస్ను కూడా కలిగి ఉన్నారు. దైనిక్ భాస్కర్ ప్రకారం, నాగార్జునకు చెందిన అన్ని రియల్ ఎస్టేట్ వాల్యూ ప్రకారం దాదాపు రూ.900 కోట్లు. అలాగే నాగార్జునకు మూడు స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి, ప్రైవేట్ జెట్ అర డజనుకు పైగా లగ్జరీ కార్లు నాగ్ స్వంతం. అయితే ఇవన్నీ పలు సంస్థలు లెక్కగట్టిన విలువలే తప్ప వీటికి ఎటువంటి అధికారిక థృవీకరణ లేదనే విషయం ఇక్కడ గమనార్హం. -
ఆ 3 సినిమాలూ పుష్ప-2 కి పోటీ? ఎన్టీఆర్ - బన్నీ ఫైట్
అల్లు అర్జున్ మాస్ తాండవం చేసిన పుష్ప 2: రూల్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది. తెలుగు సినిమా సత్తాను విశ్వవ్యాప్తంగా చాటింది. సుకుమార్ దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ చిత్ర నార్త్ సర్క్యూట్లో కలెక్షన్ల ఎర్త్క్వేక్స్ సృష్టించింది. ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ దగ్గర పోగుపడిన అన్ని రికార్డులను తుడిచిపెట్టింది కొత్త బెంచ్మార్క్ను సెట్ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి రాబోయే సంచలన చిత్రాలకు పుష్ప 2 సెట్ చేసిన బెంచ్ మార్క్ రూ. 857.50 కోట్ల గ్రాస్. దీంతో ఈ అంకెను క్రాస్ చేసే సినిమా ఏది కావొచ్చనే అంశంపై ఆసక్తితో పాటు స్పెక్యులేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి.పుష్ప2 రికార్డ్ బ్రేక్ చేయగలవు అనే అంచనాలున్న సినిమాలుగా ట్రేడ్ విశ్లేషకులు మూడింటిని బలంగా ముందుకు తీసుకొస్తున్నారు. అవేమిటంటే... వార్- 2, కాంతార- 2, హేరా ఫేరి -3 ... ఈ మూడింటిలో ఒకటి లేదా 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ సృష్టించిన విధ్వంసాన్ని తుడిచిపెట్టగలవని అంచనా వేస్తున్నారు.సీక్వెల్తో సీక్వెల్పై యుద్ధం..పుష్ప 2కు ప్రధాన పోటీదారుగా ఉన్న వార్- 2 సినిమా ఉత్తరాది, దక్షిణాది నుంచి ఇద్దరు సూపర్స్టార్స్ నటించిన చిత్రం కావడం విశేషం. నార్త్ నుంచి హృతిక్ రోషన్ సౌత్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్పై యాక్షన్ చిత్రం ఖచ్చితంగా పుష్ప2ని మించే అవకాశాలున్నాయని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. 2025లో అత్యంత హైప్ చేయబడిన చిత్రం. స్పై యాక్షన్ డ్రామా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ స్థాయిలో అంచనాలు పెంచుకుంటోంది. వార్ 2 హిట్ అయితే ప్రపంచ బాక్సాఫీస్ వద్ద తదుపరి రూ.1000 కోట్ల గ్రాసర్గా నిలవడం ఖాయం. అలాగే నార్త్లోనూ రికార్డ్స్ బద్ధలవ్వొచ్చు. అదే జరిగితే టాలీవుడ్ హీరోల్లో బన్నీ మీద ఎన్టీయార్పై చేయి సాధించినట్టు కూడా అవుతుంది.కాంతారా... కలెక్షన్ల జాతరా?అదే సమయంలో కాంతారా ద్వారా అఖిల భారత స్థాయిలో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి కాంతారా సీక్వెల్ కూడా ఈ ఏడాదిలోనే విడుదలవుతోంది. వార్- 2 స్థాయిలో స్టార్స్ లేనప్పటికీ... తొలి భాగం సాధించిన భారీ విజయంతో సీక్వెల్ మీద ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. దీంతో ఆ ఆసక్తికి తగ్గట్టుగా కాంతారా తగిన బజ్ క్రియేట్ చేస్తే... తప్పకుండా పుష్ప రికార్డులపైకి గురి పెట్టొచ్చు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటైన ఈ చిత్రం కూడా హిందీ ప్రేక్షకుల ఆదరణ పొందితే 1000 కోట్ల రూపాయల క్లబ్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.కామెడీతో కొట్టగలరా?బాక్సాఫీస్ పందెం కోళ్లలో పుష్ప-2కి మూడవ అతిపెద్ద పోటీ హేరా ఫేరి 3.. ఈ కల్ట్ కామెడీ మూడవ భాగం చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నది. ప్రియదర్శన్ ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ చిత్రానికి దర్శకత్వం వహించినట్లు ధృవీకరించారు. అయితే ఈ సినిమా ఎంత బాగా తీశారు అనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది. మరోవైపు గత కొంత కాలంగా మంచి క్వాలిటీ కామెడీ ఎంటర్టైనర్ల కోసం ప్రేక్షకులు తహతహలాడుతున్నారు. ప్రియదర్శన్ హేరా ఫేరి బృందం దానిని అందించడంలో విజయవంతమైతే, ఈ చిత్రం ఇప్పటికే ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయవచ్చు.అంత ఈజీ కాదు...అయితే ఏది ఏమైనప్పటికీ, పుష్ప 2 హిందీ బాక్సాఫీస్ రికార్డులను సవాలు చేయడం మాత్రం రాబోయే ఏ చిత్రానికి అంత సులభం కాదనేది నిజం ఎందుకంటే థియేటర్లలో అల్లు అర్జున్ సినిమా దాదాపు రెండు నెలలు నడిచింది, పెద్ద సినిమా ఏదీ దీనికి రోడ్బ్లాక్గా మారలేదు. పైన పేర్కొన్న సినిమాలు మార్కెటింగ్ ప్రమోషనల్ కార్యకలాపాలతో హైప్ను కొనసాగించగలిగితే, కంటెంట్తో ప్రేక్షకులను అలరించడంతో పాటు కనీసం 6 వారాల పాటు క్లీన్ ఫ్రీ థియేట్రికల్ ర¯Œ ను పొందగలిగితే, అవి పుష్ప 2 చారిత్రక రికార్డుకు ముప్పు తప్పదు. పై మూడింటితో పాటు ఇంకా పేరు పెట్టని అట్లీ–సల్మాన్ ఖాన్ చిత్రం రణబీర్ కపూర్ నటించిన రామాయణం, యానిమల్ పార్క్ బాక్సాఫీస్ రికార్డ్స్పై కన్నేశాయి. ఇవి కూడా పుష్ప 2 యొక్క హిందీ కలెక్షన్లను బద్దలు కొట్టగల శక్తి ఉన్నవేనని చెబుతున్నా -
లిప్ లాక్ ఆ హీరోయిన్ నేర్పిందన్న హీరో
ఒకప్పుడు అత్యంత అరుదుగా మాత్రమే కనిపించే పెదాలతో పెదాలను కలిపే లిప్లాక్ సన్నివేశాలు ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. వయసులకు అతీతంగా నటీనటులు ముద్దాడేసుకుంటున్నారు. బాలీవుడ్ చిత్రాల్లో నటనకు సై అనడం అంటే లిప్లాక్కు కూడా సై అన్నట్టే అన్నంతగా పరిస్థితి మారిపోయింది. ఈ నేపధ్యంలో ఓ కిస్సింగ్ సీన్లో నటించలేక తాను ఇబ్బంది పడ్డానని హీరో ప్రతీక్ గాంధీ(Pratik Gandhi ) చెప్పడం విశేషం.బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా దో ఔర్ దో ప్యార్లో ప్రతీక్ గాంధీ బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ విద్యాబాలన్(Vidya Balan) తో కలిసి లిప్లాక్ సన్నివేశం ఉంది. ప్రతీక్ గాంధీ కన్నా నటనతో పాటు వయసులోనూ పెద్దదైన విద్యాబాలన్... లిప్లాక్స్లోనూ సీనియరే. ఇప్పటికే చాలా సినిమాల్లో తెరపై సహనటులకు ముద్దులు గుప్పించి పండించిన విషయం తెలిసిందే.స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీలో తన అద్భుతమైన నటనకు పేరుగాంచిన ప్రతీక్ గాంధీ ఇటీవల లెహ్రెన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సినిమాలోని తన లిప్లాక్ సన్నివేశం గురించి ఓపెనయ్యాడు. విద్య తన మొట్టమొదటి ఆన్–స్క్రీన్ ముద్దును తెరపై పండించేందుకు ఎలా కారణమైందో అతను వెల్లడించాడు. శక్తివంతమైన నటనతో పాప్యులారిటీ సంపాదించుకున్న ప్రతీక్ తాను ఇంతకు ముందు ఎప్పుడూ ముద్దు సన్నివేశంలో నటించలేదని అందువల్లే తొలిముద్దు సమయంలో ఇబ్బంది పడ్డానని అంగీకరించాడు, తనకు ఎంతో అసౌకర్యాన్ని కలిగించిన ఆ పరిస్థితిని సులభంగా విశ్వాసంతో హ్యాండిల్ చేసేందుకు విద్యాబాలన్ తనకి బాగా హెల్ప్ చేసిందని చెప్పాడు.‘వృత్తిరీత్యా నటుడిగా ఉన్నప్పటికీ, ఆన్ స్క్రీన్ సాన్నిహిత్యం గురించి తనకు వ్యక్తిగతంగా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు ఒక విషయం చూపించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కేవలం కళ్లతో కూడా చూపించవచ్చు’’ అంటూ స్పష్టం చేశాడు. ఏదేమైనా ఈ సీన్ చాలా బాగా వచ్చిందని అన్నాడు. అయితే ఈ సినిమాలోని ఆ సన్నివేశం ఏమి కోరుకుంటున్నదో ఆమె (విద్య)కు తెలుసు. అలాగే దానిని ఎలా కోరుకుంటున్నదో కూడా ఆమెకు స్పష్టత ఉంది అందుకే ఆమె చేసిన విధానం అంత ఖచ్చితంగా ఉంది. సీనియర్ నటిగా దానిని పండించగలిగారు అంటూ చెప్పారు ప్రతీక్, ‘ఆ సన్నివేశం చిత్రీకరించే సమయంలో ఆమె చాలా ఉల్లాసంగా ఉంది; అది నా పరిస్థితిని పూర్తిగా తేలికగా మార్చేసింది హమ్నే హస్టే–హస్టే వో సీన్ కర్ దియా (మేం నవ్వుతూనే ఆ సీన్ చేసాము)‘ అంటూ చెప్పాడు. ఆమె సపోర్టివ్ నేచర్ను ప్రతీక్ ఎంతగానో కొనియాడాడు, ఆమెను వండర్ ఫుల్ కో స్టార్ అని పేర్కొన్నాడు.లిప్లాక్స్తో పాటు ఆసక్తికరమైన కథాంశం ఉన్నప్పటికీ, దో ఔర్ దో ప్యార్ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైంది అయినప్పటికీ, విద్య ప్రతీక్ ఇద్దరూ తమ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. చాలా మంది వారి ఆన్–స్క్రీన్ కెమిస్ట్రీని వారి పాత్రలకు వారు ప్రాణం పోసిన తీరును ప్రశంసించారు. దో ఔర్ దో ప్యార్ ఫెయిల్యూర్ అయినా, విద్యాబాలన్ భూల్ భులయ్యా 3తో తిరిగి పుంజుకుంది, ఇది భారీ విజయాన్ని సాధించింది. -
సల్మాన్ ‘వివాహ్’కి పనికిరాడన్న దర్శకనిర్మాత
ఇంతింతై అన్నట్టుగా ఎదిగిన సల్మాన్(Salman Khan) తొలి సినిమా ఏది? అని అడిగితే వెంటనే ఠక్కున మైనే ప్యార్ కియా అని చెప్పేస్తారు. కానీ చాలా మందికి తెలీని విషయం బీవీ హోతో ఐసీ (భార్య అంటే ఇలా ఉండాలి) అనే సినిమా సల్మాన్ తొలిసినిమా. 1988లో విడుదలైన ఈ సినిమాలో సల్మాన్ సహాయనటుడి పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత చేసిన మైనే ప్యార్ కియా సూపర్ డూపర్ హిట్ అవడంతో తొలి సినిమా తెరమరుగైపోయింది.. సల్లూభాయ్కి లవర్ బాయ్ ఇమేజ్ కూడా వచ్చేసింది.భార్య అంటే ఇలా ఉండాలి అనే అర్ధం వచ్చేలా టైటిల్తో తొలిసినిమా ఎలాగైతే సల్మాన్ కెరీర్లో అస్పష్టం ఉండిపోయిందో...సల్మాన్ వివాహం కూడా అలాగే ఉండిపోయింది. అదలా ఉంచితే... బాలీవుడ్లో అత్యంత ఎలిజబుల్ బ్యాచిలర్ అయిన సల్మాన్ఖాన్కి దేశవ్యాప్తంగా అసంఖ్యాక అభిమానుల్ని అందించిన తొలి సినిమా మైనే ప్యార్ కియా కాగా దానికి దర్శకుడు సూరజ్ బర్జాత్యా(Sooraj Barjatya). హమ్ ఆప్ కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై వంటి సూపర్ డూపర్ హిట్స్ తో టాప్ డైరెక్టర్గా మారారు. పై చిత్రాలతో పాటు ప్రేమ్ రతన్ ధన్పాయో కూడా సల్మాన్ఖాన్తోనే రూపొందించారీ కుటుంబ చిత్రాలకు పేరొందిన ఈ దర్శకుడు. సల్మాన్తో అత్యధిక హిట్స్ తీశాడు. అలాగే ఆయన త్వరలో తన అభిమాన హీరో సల్మాన్ ఖాన్తో మరో చిత్రంలో మళ్లీ చేయబోతున్నాడు, అయితే కెరీర్ ప్రారంభం నుంచీ వరుసగా సల్మాన్తో చిత్రాలు తీస్తూ వచ్చిన ఆయన ప్రేమ్ రతన్ ధన్పాయోకి ముందు వివాహ్(Vivah) పేరిట ఒక సినిమాని రూపొందించినప్పుడు ఆ సినిమాలో షాహిద్ కపూర్ని హీరోగా ఎంచుకున్నారు.సల్మాన్ ఖాన్ తో త్వరలో మరో చిత్రంలో మళ్లీ జతకట్టబోతున్న సూరజ్ బర్జాత్యా... వివాహ్ సినిమా కు హీరో ఎంపిక విషయంలో సల్మాన్ని దూరంగా పెట్టడానికి కారణం ఏమిటి? అనే విషయంపై బాలీవుడ్లో అప్పట్లో చర్చోపచర్చలు జరిగాయి. ఈ నేపధ్యంలో సూరజ్ బర్జాత్యా ఇటీవల ఆ విషయం గురించి మాట్లాడాడు.‘‘ అప్పట్లో మీరట్కు చెందిన ఒక టైలర్, కాలిన గాయాలతో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్త గురించి చెప్పి, మా నాన్న నాకు ఆ వార్తాపత్రిక కటింగ్ను చూపించారు. ప్రేమ మానవత్వం ఆధారంగా సినిమాను రూపొందించాలని అనుకున్నాం. ఆ సినిమా కథ కొత్తగా కనపడే ఒక అమాయకుడికి నప్పుతుంది. కాబట్టి సల్మాన్ ఖాన్ ఆ సినిమాకి నప్పే సరైన హీరో కాదు. అందుకే షాహిద్ ను ఎంచుకున్నా’’ అంటూ చెప్పారు సూరజ్ బర్జాత్యా. మొత్తానికి ఇంత కాలమైనా ప్రేమలు, అనుబంధాలకు దగ్గరగా అదే సమయంలో వివాహానికి దూరంగా ఉంంటూ వివాహ వ్యవస్థలో ఒదగలేకపోతున్న సల్మాన్... వివాహ్ అనే సినిమా లో పాత్రలో సైతం నప్పకపోవడం... విచిత్రం. -
Maha Kumbh Mela 2025 : ఏకంగా ఇంటినే వెంట తెచ్చుకున్న దంపతులు!
‘‘ఆలోచనల్లో పదును ఉండాలేగాని ఆవాసాలకు కొదవేముంది?’’ అన్నట్టుగా ఉంది ఆ దంపతలు తీరు. కాదేదీ నివాసానికి అనర్హం అంటూ వారు సృష్టించిన సరికొత్త కదిలే ఇల్లు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆధ్యాత్మిక యాత్రకు సృజనాత్మకత రంగరించిన వారి ప్రయాణం చూపరుల ప్రశంసలకు నోచుకుంటోంది.ప్రయాగ్రాజ్లోని మహా కుంభ్ ప్రస్తుతం ఓ జంటకు నివాసంగా మారింది. అక్కడి రద్దీని దృష్టిలో ఉంచుకుని నివాసాలకు ఇబ్బందిని ముందే గ్రహించిన కర్ణాటకకు చెందిన దంపతులలు ఓ వినూత్న తరహా ఇంటికి రూపకల్పన చేశారు. ఇప్పుడు ఆ నివాసం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు డబుల్ డెక్కర్ కారును ప్రదర్శించేలా ఉన్న వీరి ఇంటి వీడియో పారిశ్రామిక ప్రముఖులను కూడా ఆకర్షిస్తోంది. అదే విధంగా ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా దృష్టిని సైతం ఆకట్టుకుంది. విశిష్టమైన మార్పులు ఆవిష్కరణలతో వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన మహీంద్రా ఈ క్రియేషన్ వెనుక ఉన్న చాతుర్యం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తం చేసింది, ‘అవును, నేను అలాంటి మార్పులు ఆవిష్కరణలకు నేను ఆకర్షితుడిని అవుతాను అనేది ఖచ్చితంగా నిజం. అయితే అది మహీంద్రా వాహనంపై ఆధారపడినప్పుడు, నేను మరింత ఆకర్షితుడని అవుతా‘ అని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఈ వీడియోను ఉద్దేశించి హిందీలో ఒక పోస్ట్లో తెలిపారు.ఇన్నోవాయే ఇల్లుగా మారింది...ఈ కారు పేరు టయోటా ఇన్నోవా కాగా అదే వీరి మొబైల్ హోమ్గా రూపాంతరం చెందింది.ఈ రకమైన మార్పు చేర్పులు, సవరణలకు దాదాపు రూ. 2 లక్షలు పైగానే ఖర్చయిందని ఆ ‘ఇంటికా’కారు యజమాను వెల్లడించారు. రూఫ్టాప్ టెంట్కు రూ. 1 లక్ష .. పూర్తిస్థాయి వంటగదికి రూ.1లక్ష పర్యావరణ హితమైన రీతిలో వారి విద్యుత్ అవసరాలను తీర్చడానికివాహనం సోలార్ ప్యానెల్ను కూడా వీరు ఏర్పాటు చేసుకున్నారు.ఈ జంట తమ అనుకూలీకరించిన సెటప్ను పూర్తిగా ఉపయోగించుకుని, వీలైనంత ఎక్కువ కాలం కుంభమేళాలో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంటిని మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమీ రాకపోవడం వల్లనో ఏమో... కుంభ్ మేళా అనంతరం కూడా తమ ఇంటికారులో షికారు కంటిన్యూ చేయాలని వీరు భావిస్తున్నట్టు కనిపిస్తోంది.రోడ్ ట్రిప్కు సై...ఈవెంట్లో ఆథ్యాత్మిక సౌరభాలను ఆస్వాదించిన తర్వాత, ఈ వాహనం మీద వారు ఆరు నెలల పాటు సుదీర్థమైన రోడ్ ట్రిప్ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, అందులో భాగంగా వీరు విదేశాల్లోకి అంటే... నేపాల్లోకి కూడా ప్రవేశించవచ్చు. ఈ వాహనానికి అభిమాని అయిన భర్త తాను రాబోయే రోడ్ ట్రిప్ కోసం మరింత ఆసక్తిగా ఉన్నట్టుగా తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భార్య తమ వంట అవసరాల కోసంఇ–కామర్స్ ప్లాట్ఫారమ్ ద్వారా సౌకర్యవంతంగా తాజా కూరగాయలను ఆర్డర్ చేస్తూన్నానని తెలిపారు.ఈ భార్యాభర్తల ఐడియాను చూపిస్తున్న వీడియో ఆన్లైన్లో అనేకమంది ప్రశంసలకు నోచుకుంది. ఈ జంట సృజనాత్మకత, సమయానుకూలతను నెటిజన్లు కొనియాడుతున్నారు. మరీ ముఖ్యంగా ‘జుగాద్‘ (వినూత్న పరిష్కారాలు)లో ఇటీవల భారతీయులు బాగా రాణిస్తున్నారనే విషయాన్ని పలువురు హైలైట్ చేస్తూ వారి వనరులను ప్రశంసిస్తూ చేసే కామెంట్స్ వెల్లువెత్తాయి. మరికొందరు ‘పర్ఫెక్ట్ క్యాంపింగ్ వ్యాన్‘ అనే భావనను మెచ్చుకున్నారు వినూత్న తరహాలో వాన్ లైఫ్ డ్రీమ్ను జీవించినందుకు జంటను అభినందించారు. ఓ అవసరం నుంచి పుట్టిన సృజనాత్మకత వాహనాలను చక్రాలపై అసాధారణ నివాసాలుగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలకు నోచుకుంది.Haan, yah bilkul sach hai ki main aise sanshodhanon aur aavishkaaron se mohit hoon. lekin mujhe yah sveekaar karana hoga ki jab ve mahindra vaahan par aadhaarit hote hain to main aur bhee adhik mohit ho jaata hoon!! 🙂 pic.twitter.com/rftq2jf2UN— anand mahindra (@anandmahindra) January 23, 2025 -
సైఫ్ అలీఖాన్కు తెలీకుండా భార్యనే నిద్రమాత్రలిచ్చింది: చిత్రనిర్మాత
బాలీవుడ్ నటీనటుల వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ టాక్ ఆఫ్ ది కంట్రీగా మారుతూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ మీద జరిగిన హత్యాయత్నం తదనంతర పరిణామాలు సైఫ్ వ్యక్తిగత జీవితాన్ని మరోసారి వార్తల్లోకి ఎక్కించాయి. ప్రస్తుతం నటుడు సైఫ్ అలీఖాన్ భార్య కరీనాకపూర్ అయినప్పటికీ ఆయనకు ఇది తొలి వివాహం కాదు. ఆయన తొలుత సహ నటి అమృతా సింగ్ను వివాహం చేసుకుని 13 సంవత్సరాల పాటు దాంపత్య జీవితం గడిపారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా ఈ జంట చివరకు 2004లో విడాకులు తీసుకున్నారు.ఇదిలా ఉంటే గతంలో అమృతా సింగ్ తన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చిందనే విషయం చాలా కాలం క్రితమే వెల్లడైనప్పటికీ మరోసారి ఇప్పుడు ఆ విషయం హల్చల్ చేస్తోంది. చిత్రనిర్మాత, సూరజ్ బర్జాత్యా ఒకసారి ఒక చిత్రం షూటింగ్లో ఉన్నప్పుడు సైఫ్ అలీఖాన్ గురించి పలు విషయాలను వెల్లడించారు. అందులో భాగంగానే సైఫ్ అలీఖాన్కి అమృతా సింగ్ నిద్రమాత్రలు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన బయటపెట్టారు.దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఈ సంఘటన హమ్ సాథ్ సాథ్ హై చిత్రం షూటింగ్ సమయంలో జరిగింది ఈ చిత్రంలో సైఫ్తో పాటు కరిష్మా కపూర్, సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రే, మోహ్నీష్ బహ్ల్, టబు కీలక పాత్రల్లో నటించారు. హమ్ సాత్ సాథ్ హై సెట్స్లో మేకర్స్ ఆశించినట్టుగా ఖచ్చితమైన షాట్ను ఖచ్చితంగా చేయడానికి వీలుగా సైఫ్ అలీ ఖాన్ సరైన పరిస్థితిలో లేడు. అతనికి కారణాలేమో తెలీదు కానీ అంతకు ముందు రాత్రి నిద్ర సరిగా లేకపోవడంతో చాలా రీటేక్లు ఇవ్వాల్సి వచ్చింది.‘‘హమ్ సాథ్ సాథ్ హై’ షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ వ్యక్తిగత జీవితం చాలా హెచ్చు తగ్గులు ఎదుర్కొంది. అందుకే ఎప్పుడూ టెన్షన్లో ఉండేవాడు. ఈ చిత్రంలోని ‘సునో జీ దుల్హన్’ పాట షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ పలు మార్లు రీటేక్లు తీసుకుంటున్నాడు. ఆ పాత్రను ఎలా పండించాలా అని ఆలోచిస్తూ అతను రాత్రంతా నిద్రపోలేదు. నేను అతని మొదటి భార్యతో మాట్లాడినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది’’ అంటూ సూరజ్ బర్జాత్యా గుర్తు చేసుకున్నారు.అప్పుడు ఆయన సైఫ్ అలీఖాన్ భార్య అమృతాసింగ్కు ఓ సలహా ఇచ్చాడు. ’’అతను రాత్రంతా నిద్రపోవడం లేదని తెలిసి నేను అమృతకు ఓ సలహా ఇచ్చాను. అదేంటంటే... సైఫ్కు తెలియకుండా నిద్రమాత్రలు ఇవ్వాలని. నా సలహా ను అనుసరించి అమృత అతనికి తెలియకుండా నిద్రమాత్రలు ఇచ్చింది’’ అంటూ ఆయన చెప్పారు. దాంతో అతని సన్నివేశాలు చాలా వరకూ ఆ మరుసటి రోజు ఏర్పాటు చేశారట. కేవలం ఒక్క టేక్లో పాట చాలా బాగా కంప్లీట్ చేశాడు. దాంతో షూటింగ్లో అందరూ షాక్ అయ్యారు’’ అన్నారాయన.హమ్ సాథ్ సాథ్ హై చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది భారతీయ చలనచిత్రంలో ఐకానిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సైఫ్ అలీ ఖాన్ 2004లో అమృతాసింగ్తో విడాకులు తీసుకున్న తర్వాత, అతను 2012లో బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ను వివాహం చేసుకున్నాడు. -
తండ్రితో వివాదాస్పద ఫోటోషూట్.. హీరోయిన్ ఏమందో తెలుసా?
పిచ్చి ముదిరితే రోకలి తలకి చుట్టుకుంటారు.. నాగరికత ముదిరితే నాన్నని ముద్దెట్టుకుంటారు అన్నట్టుగా ఉంది ఆ హీరోయిన్ శైలి అంటూ పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ తండ్రి కూతురి నుదుటి మీద ముద్దు పెట్టుకోవడానికి ఓ విలువ ఉంది. మరింత ముందుకెళ్లి బుగ్గ మీద కిస్ చేసినా.. ఆ ముద్దులోనూ ఆప్యాయతనే చూడొచ్చు. కానీ తండ్రీ కూతుర్లు ఏకంగా లిప్లాక్ చేసుకుంటే... అందులో ఏం చూడాలి?అప్పట్లో టాప్ లేపిన బ్యూటీఈ విషయాన్ని బాలీవుడ్ నిన్నటి తరం స్టార్ హీరోయిన్ పూజా భట్ (Pooja Bhatt)ని అడగాలి. దాదాపుగా 3 దశాబ్ధాల క్రితం పూజాభట్ ఓ టాప్ బాలీవుడ్ నటి. దిల్ హై మాంగ్తా నహీ, సడక్... తదితర సినిమాలతో కుర్రకారు కలల బ్యూటీగా వెలిగిపోయింది. ఆ తర్వాత తర్వాత వయసు పెరిగినా రకరకాల పాత్రలతో ఇంకా బాలీవుడ్లో తనదైన సత్తా చాటుతూనే ఉంది. మన టాలీవుడ్ హీరో నాగార్జున సరసన ఈమె జఖ్మ్ అనే బాలీవుడ్ మూవీలో కూడా నటించింది. అయితే 3 దశాబ్దాలకు పూర్వం టీనేజ్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగిన పూజా భట్ అప్పట్లో మోడ్రన్ అమ్మాయిలకు కదిలే సింబల్లా ఉండేది. తండ్రితో ఫోటోషూట్ఆధునిక హీరోయిన్గా అందాల ఆరోబోత మాత్రమే కాదు తెరపై లిప్లాక్స్లోనూ ముందుండేది. దాంతో ఆమెకు మీడియాలో బాగానే ప్రచారం లభించేది. అదే సమయంలో ఈమె తన తండ్రి విఖ్యాత బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ (Mahesh Bhatt) తో కలిసి చేసిన ఓ ఫొటో షూట్ అత్యంత వివాదాస్పదంగా మారింది. ఫొటో షూట్ చేసి ఊరుకుంటే ఫర్వాలేదు, ఓ మ్యాగ్జైన్ కవర్ పేజీపై ఆ ఫొటో పబ్లిష్ అయింది. తండ్రి మహేష్ భట్, కుమార్తె పూజాభట్ కలిసి పెదాల్ని ముద్దాడుతూ దిగిన ఆ ఫొటో 1990ల నాటి మ్యాగజైన్ కవర్ పేజ్పై ప్రచురించడంతో అనేక మంది భగ్గుమన్నారు. తండ్రీ కూతుర్లను తిట్టిపోశారు.(చదవండి: సరిదిద్దుకోలేని తప్పు చేశా.. మోసం చేశా.. ఇన్నాళ్లకు తెలుసుకున్నా: ఆర్జీవీ)అందులో అసభ్యత లేదుఆమధ్య ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ పూజాభట్ మరోసారి ఆ వివాదాన్ని గుర్తు చేసుకున్నారు. నాటి 1990 మ్యాగజైన్ కవర్ చుట్టూ అల్లుకున్న వివాదం, గురించి చర్చించింది, మరోసారి తనను తాను సమర్ధించుకున్న పూజాభట్ అందులో ఏ మాత్రం అసభ్యత లేదంటున్నారు. అలాంటి దృశ్యాల్ని కూడా నీచంగా చూసేవాళ్లపై ఎదురుదాడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె నీతులు వల్లించేవారు, సంప్రదాయవాదులు... ఆ ఫొటో మీద మండిపడడాన్ని తప్పుబట్టారు. విడ్డూరంగా ఉందితండ్రీకూతుళ్ల అనుబంధం, గురించి అలా మాట్లాడేవాళ్లు ఇలాంటి సందర్భాల్లో కుటుంబ విలువల గురించి చర్చించడం విడ్డూరంగా ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. (‘అగర్ లోగ్ బాప్ ఔర్ బేటీ కే రిష్టే కో అలగ్ నజారీయే సే దేఖ్ సక్తే హై తో వో కుచ్ భీ కర్ సక్తే హైం) తండ్రీ కుమార్తెల అనుబంధాన్ని తప్పుడు దృష్టితో చూసేవాళ్లు ఏదైనా చేయగలరు. అలాంటివాళ్లు కుటుంబ విలువల గురించి మాట్లాడడ అద్భుతమైన జోక్‘ అని ఆమె పేర్కొంది. తప్పు కాదా?అయితే అలా చూసే పరిస్థితికి కారణం ఎవరు? అనేది పూజాభట్ ఆత్మపరిశీలన చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఆమె చేసింది తప్పుకానట్లయితే మళ్లీ ఇప్పటి దాకా అలాంటి పని మరెవ్వరూ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అనుబంధాల్ని అందంగా ఆవిష్కరించే శక్తి ఉన్న నటీనటుటు...ఆసభ్యంగా మార్చడం సరికాదని స్పష్టం చేస్తున్నారు.చదవండి: సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో మరో రికార్డు.. 'డాకు..' కలెక్షన్స్ ఎంతంటే? -
తను..టైగర్ అన్న హాలీవుడ్ డైరెక్టర్... ఎన్టీయార్తో సినిమా?
జానియర్ ఎన్టీయార్(JR NTR) టాలీవుడ్లో టాప్ హీరో. త్వరలోనే హాలీవుడ్ సినిమాల్లో(Hollywood Movie) అడుగుపెట్టనున్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం అప్పుడే అవునని చెప్పలేకపోయినా... ఆ అవకాశాలు కనిపిస్తున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓ ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడి మాటలే అందుకు నిదర్శనం. ఇలాంటి చర్చకు కారణం ఆర్ఆర్ఆర్ సినిమా అని చెప్పక తప్పదు. హాలీవుడ్ చిత్ర ప్రముఖులపై ’ఆర్ఆర్ఆర్’ ఎంత ప్రభావం చూపిందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాలో ఎన్టీయార్లోని మహోన్నత నటరూపాన్ని ఆవిష్కరించాడు. నిజానికి ఎన్టీయార్తో ఎలాంటి సినిమా అయినా చేయవచ్చునని తెలిసిన దర్శకుడు రాజమౌళి. ’సింహాద్రి’ ’యమ దొంగ’ వంటి చిత్రాలు పెద్ద హిట్ కొట్టడానికి ఆర్ఆర్ఆర్ ప్రపంవచ్యాప్తంగా ఆదరణకు నోచుకోవడానికి అదే కారణం. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ జూనియర్, రాజమౌళిలకు హ్యాట్రిక్ హిట్తో పాటు ఇంటర్నేషనల్ పాప్యులారిటీని కూడా అందించింది. టాలీవుడ్ టూ బాలీవుడ్ టూ హాలీవుడ్...ఆర్ఆర్ఆర్ తో తెచ్చుకున్న క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్ను బాలీవుడ్ కూడా కోరుకునేలా చేసింది. ప్రస్తుతం జా.ఎన్టీయార్ ’వార్ 2’ సినిమా ద్వారా బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్తో కలిసి జూనియర్ నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టే సినిమాగా సినీ పండితులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్తో తన తదుపరి యాక్షన్ అడ్వెంచర్కు కూడా యంగ్ టైగర్ సిద్ధమవుతున్నాడు. ఈ నేపధ్యంలోనే హాలీవుడ్ చిత్రంలో ఎన్టీయార్ అనే వార్త రావడంతో అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు.నేను రెడీ అంటున్న సూపర్ మ్యాన్ డైరెక్టర్...ప్రముఖ హాలీవుడ్ చిత్రనిర్మాత జేమ్స్ గన్ (James Gunn) ’సూపర్మ్యాన్,’ ’సూసైడ్ స్క్వాడ్,’ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వంటి గొప్ప అంతర్జాతీయ చిత్రాలకు దర్శకత్వం వహించారు. సూపర్మ్యాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత పాప్యులర్ అనేది అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాకి దర్శకత్వం వహించిన ఆయన ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ చిత్రం గురించి ప్రస్తావించారు మరీ ముఖ్యంగా తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన నటన గురించి గొప్పగా మాట్లాడారు. ఆర్ఆర్ఆర్లోని కొన్ని సన్నివేశాలను ప్రస్తావించి మరీ ఆయన జూనియర్పై పొగడ్తల వర్షం కురిపించడం విశేషం. ముఖ్యంగా ‘బోనులలో నుంచి పులులతో పాటు బయటకు దూకిన ఆ నటుడు (ఎన్టీయార్)తో నేను పని చేయాలనుకుంటున్నాను. అతను అద్భుతమైన నటుడు. నేను అతనితో ఏదో ఒక రోజు పని చేయాలనుకుంటున్నాను‘ అని ఆయన చెప్పారు.ఎన్టీఆర్ ఎంతగానో ఆకట్టుకున్నాడని జేమ్స్ అన్నారు. ఇప్పటి దాకా టాప్ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓ తెలుగు హీరోని ఉద్దేశించి మాట్లాడడం ఇదే ప్రధమం కావడం గమనార్హం. -
ఆడిషన్ ఇవ్వను.. అవకాశాలు అడుక్కోనంటున్న హీరోయిన్
టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు... ప్రతీ హీరోయిన్కు తనదంటూ ఒక టైమ్ వస్తుంది. ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిసినవారికి తిరుగుండదు. అలా తెలియని వాళ్లు మాత్రం... ఫీల్డ్లో ఉన్నప్పటికీ... చేరుకోవాల్సిన స్థాయిల్ని చేరుకోలేక దొరికిన స్థాయితో సంతృప్తి చెందుతుంటారు. అలాంటి రెండో కోవలోకి వస్తుంది బాలీవుడ్ నిన్నటి తరం నటి శిల్పా శెట్టి కుంద్రా (Shilpa Shetty). తెలుగులో తళుక్కుమన్న హీరోయిన్బాజీగర్ లాంటి బాక్సాఫీస్ హిట్స్ ఇచ్చినా శిల్పాశెట్టికి బాలీవుడ్లో స్టార్డమ్ దక్కలేదు. ఉత్తరాది హీరోయిన్లలో తక్కువ మందికే సాధ్యమైన విధంగా టాలీవుడ్ సహా దక్షిణాదిలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు చేసినా ఇక్కడా పెద్దగా పేరు రాలేదు. వెంకటేష్తో సాహసవీరుడు సాగరకన్య, నాగార్జునతో అజాద్, వీడెవడండీ బాబు వంటి పలు తెలుగు సినిమాల్లో కూడా శిల్పాశెట్టి తళుక్కుమంది. ఇప్పటికీ ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్న ఈ యోగా క్వీన్... సినిమాల కంటే యోగా వీడియో ద్వారానే ప్రత్యేకమైన గుర్తింపు సాధించిందని చెప్పొచ్చు. బిగ్బాస్ గెలిచిన ఫస్ట్ బ్యూటీఅలాగే సినిమాలకు మరోవైపు... ప్రస్తుతం భారతదేశంలో అనేక భాషల్లో చిన్నితెరపై స్థిరపడిపోయిన బిగ్ బాస్కు పెద్దన్న లాంటి అంతర్జాతీయ బిగ్ బ్రదర్ సీజన్ను తొలిసారి గెలుచుకున్న ఏకైక భారతీయ నటి శిల్పాశెట్టి మాత్రమే కావడం గమనార్హం. తాజాగా లండన్ వెళ్లి రిలాక్స్ అయి తిరిగి వచ్చింది. భారతదేశంలో తన కుటుంబంతో కలిసి లోహ్రీ, మకర సంక్రాంతిని జరుపుకుంది. ప్రస్తుతం కన్నడ భాషలో కెడి ది డెవిల్ చిత్రంతో అరంగేట్రం చేస్తోందీ 49 ఏళ్ల నటి.ఆడిషన్స్ ఇవ్వనుబిజీ బిజీగా గడిపే రోజుల్లో చాలా అవసరమైన విరామంగా తన రిలాక్స్డ్ ట్రిప్ని అభివర్ణించింది. బాలీవుడ్ సరే... బిగ్ బ్రదర్ ద్వారా అంతర్జాతీయంగా పేరు వచ్చినప్పటికీ తనకెందుకు హాలీవుడ్ అవకాశాలు రావడం లేదు? ఈ సందర్భంగా ఇదే ప్రశ్నను ఒక ఇంటర్వ్యూలో ఆమె ముందుంచితే... తాను అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చే పరిస్థితిలో లేనని తేల్చి చెప్పింది. తాను కష్టపడి పనిచేసినందుకు తనకు దక్కినదానితో సంతృప్తిగా ఉన్నానని చెప్పింది. ఓపిక లేదుహాలీవుడ్ కోసమో మరో చోటో ఆఫర్ల కోసం ఆడిషన్ కు వెళ్లాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. తన మూడు దశాబ్దాల పాటు సాగిన కెరీర్లో బాజీగర్ (1993) వంటి కమర్షియల్ హిట్లు లైఫ్ ఇన్... ఎ మెట్రో (2007) అప్నే (2007) వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో కనిపించానని... ఇలా 30 ఏళ్ల పని తర్వాత, కొత్తగా ప్రారంభించే ఓపిక తనకు లేదని పేర్కొంది. నా టాలెంట్ గురించి తెలుసుకోవాలంటే తన గత చిత్రాలను చూడమని మాత్రమే తాను చెప్పగలనని అంటోంది. కుటుంబానికే ప్రథమ స్థానంతాను సరిగ్గా సరిపోతుంటే, ఆడిషన్ చేయవలసిన అవసరం లేదంది. ఏదేమైనా... తన జీవితంలో ఇక తన కుటుంబానికి మొదటి స్థానం అని శిల్పా నొక్కి చెప్పింది. పని కోసమో మరింత పేరు ప్రతిష్టల కోసమో ఆరాటపడుతూ ఎక్కువ కాలం తన పిల్లలకు దూరంగా ఉండడం తన వల్ల కాదని తేల్చి చెప్పింది. తన ప్రాధాన్యతల గురించి శిల్పాశెట్టి చాలా స్పష్టంగా ఉందనేది నిస్సందేహం..చదవండి: ఏ అమ్మాయి ఆ పని చేయదంటూ ఏడ్చేసిన తబిత.. ఓదార్చిన సుకుమార్ -
బాలీవుడ్లో ఎన్టీఆర్.. నాటు నాటు పాట రిపీట్?
ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాట ఎంత హిట్టో తెలియంది కాదు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఒకెత్తయితే ఆ ఒక్క పాట ఒకెత్తు అన్నట్టుగా భాషలకు, ప్రాంతాలకు అతీతంగా ఆ పాట దునియాని ఊపేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆ పాట ఓ రేంజ్లో పాప్యులరైంది. అదే ఊపులో ఇండియాకి ఆస్కార్ని కూడా తెచ్చేసింది. మరోసారి ఈ తరహా పాట రిపీట్ కానుందా? అందులో మన యంగ్ టైగర్ తన కాలు కదపనున్నారా? ప్రస్తుతం బాలీవుడ్లో రూపొందుతున్న భారీ చిత్రం వార్ 2 చిత్ర విశేషాలను గమనిస్తున్నవారు దీనిని దాదాపుగా ధృవీకరిస్తున్నారు. తొలిసారిగా ఎన్టీయార్ వార్ -2లో నటిస్తుండటంతో ఈ పాన్ ఇండియా సినిమాపై తెలుగు, హిందీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మన ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.హృతిక్, ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్స్ కలిసి స్క్రీన్ పై కనిపించే ప్రతీ సన్నివేశం స్పెషల్గా ఉండాలని కాబట్టి తప్పకుండా తగినన్ని యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు అందరూ భావిస్తున్నారు. మరోవైపు నాటునాటు పాట తరహాలో ఈ సినిమాలో కూడా అలాంటి పాట ఒకటి ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోందట. బాలీవుడ్లో హృతిక్ నృత్యాలకు కూడా మంచి పేరుంది. మరోవైపు ఎన్టీయార్ డ్యాన్సుల గురించి చెప్పనక్కర్లేదు. ఈ నేపధ్యంలో వీరి కాంబోలో సాంగ్ అనే ఆలోచన నిజమైతే... ఇక ప్రేక్షకులకు కన్నుల పండుగే అని చెప్పాలి. ఇటీవల హృతిక్ మాట్లాడుతూ, ఎన్టీఆర్తో డ్యాన్స్ చేయడం పెద్ద సవాలుగా ఉంటుందని అన్నారు. . ఆయనతో పాటుగా స్టెప్స్ వేయాలంటే మరింతగా ప్రిపరేషన్ అవసరం అని అభిప్రాయపడ్డాడు. .ఈ సినిమాలో పాట నాటు నాటు పాట కంటే హై లెవెల్లో ఉండేలా తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.మరోవైపు తొలిసారిగా ఒక అగ్రగామి తెలుగు హీరో...విలన్ తరహా పాత్రను బాలీవుడ్లో పోషిస్తుండడంతో వార్ 2 సినిమా చర్చనీయాంశంగా మారింది: ఇందులో ఎన్టీఆర్ పాత్ర పూర్తి నెగటివ్ షేడ్స్తో ఉంటుందని టాక్. అటు డ్యాన్స్, ఇటు యాక్షన్లో హృతిక్తో పోటీ పడాల్సిన ఈ పాత్రకు ఎన్టీఆర్ పూర్తి న్యాయం చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వార్ 2 విడుదలకు సంబంధించి ఇంకా స్పష్టత రానప్పటికీ... ఆగస్టు 15కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది సంచలనాత్మక సినిమాల్లో వార్ -2 ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తొలి బాలీవుడ్, టాలీవుడ్ పూర్తి స్థాయి మల్టీ స్టారర్గా రూపొందుతున్న ఈ చిత్రం విడుదలయ్యాక బాలీవుడ్, టాలీవుడ్ ల మధ్య సంబంధాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మల్టీ జానర్ సినిమా చేయబోతుండగా, మరోవైపు దేవర 2 కూడా లైన్లో ఉంది. -
‘‘మోస్ట్ అవైటెడ్ మూవీ’’లో ప్రభాస్ సినిమాలకి టాప్ ప్లేస్
ఒక ఏడాదిలో విడుదలైన సినిమాల నుంచి ప్రేక్షకాదరణను అనుసరించి టాప్ హిట్స్, టాప్ ఫ్లాప్స్ అంటూ జాబితాలు ప్రకటించడం మామూలే. అయితే ఇప్పుడిప్పుడే కొత్త ఏడాదిలో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాలను కూడా గుర్తించి జాబితాలు ప్రకటించడం ట్రెండీగా మారింది. సినిమాలకు సంబంధించి రేటింగ్ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్లైన్ వేదికగా పేరున్న ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండిబి). ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఐఎండీబీ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా 2025లో మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను తాజాగా ప్రకటించింది. సినిమాలు, టీవీ షోలు ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎండిబి పేజ్కి ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకులున్నారు. తమ వీక్షకుల ద్వారా ఈ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం అత్యధిక సంఖ్యాకులైన ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వాటిలో నెం.1గా నిలిచింది సికందర్.ఐఎండిబి విడుదల చేసిన 2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ను పరిశీలిస్తే...1. సికందర్, 2. టాక్సిక్,3. కూలీ,4. హౌస్ ఫుల్ 5. బాఘీ, 6.రాజా సాబ్, 7. వార్ 2 8. ఎల్2: ఎంపురాన్ 9. దేవా 10. చావా 11. కన్నప్ప 12. రెట్రో 13. థగ్ లైఫ్ 14. జాట్ 15. స్కై ఫోర్స్ 16. సితారే జమీన్ పర్ 17. థామా 18. కాంతారా ఏ లెజెండ్: చాప్టర్ 1 , 19. ఆల్ఫా 20. తండెల్ఈ జాబితాలోని 20 టైటిల్స్ లో 11 హిందీ సినిమాలు, మూడు తమిళ, తెలుగు, రెండు కన్నడ, ఒకటి మలయాళ సినిమా కావడం గమనార్హం. హౌస్ ఫుల్ 5 (నెం.4), కన్నప్ప (నెం.11), స్కై ఫోర్స్ (నెం.15) వంటి మూడు చిత్రాల్లో అక్షయ్ కుమార్ నటించగా, రష్మిక మందన్న3 సినిమాలు సికందర్ (నెం.1), చావా (నెం.10), థమా (నెం.17)లలో, మోహన్ లాల్, ప్రభాస్, పూజా హెగ్డే, కియారా అద్వానీ లు రెండేసి చిత్రాల్లో నటిస్తున్నారు.నెంబర్ వన్ కావడం సంతోషంగా ఉంది...మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్లో నెం.1 గా నిలిచినందుకు సికందర్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘2025 ఐఎండిబి మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ లో సికందర్ అగ్రస్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అతని ఎనర్జీ, అంకితభావం సికందర్ సినిమాను మాటల్లో వర్ణించలేని విధంగా తీర్చిదిద్దాయి. అందుకు సహకరించిన నిర్మాత సాజిద్ నదియాడ్ వాలాకు ధన్యవాదాలు. సికిందర్ లో ప్రతి సన్నివేశం చెరగని ముద్ర వేసేలా తీర్చిదిద్దాం. ప్రేక్షకులతో ఎప్పటికీ నిలిచిపోయేలా ప్రతి క్షణాన్ని డిజైన్ చేయడం కోసం నేను మనస్పూర్తిగా పనిచేశాను’’ అంటూ చెప్పారు. -
కిక్ బాక్సింగ్తో రష్మిక...ఫ్లెక్సిబులిటీ కోసం జాన్వీ...!
బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సినీ తారలంతా ఇప్పుడు వర్కవుట్స్ మీద దృష్టి పెడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఫిట్గా కనిపిస్తున్నారు. తారలే స్వయంగా ఇంటర్వ్యూల్లో వెల్లడించిన ప్రకారం... కొందరు తారల గ్లామర్–ఫిట్నెస్ రొటీన్ ఇదీ...ఫ్లెక్సిబులిటీ కోసం ఈ బ్యూటీ... చుట్టమల్లే చుట్టేత్తాంది తుంటరి చూపు అంటూ టాలీవుడ్ దేవరను ప్రేక్షకుల్ని ఒకేసారి కవ్వించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ తెరపై గ్లామర్ డోస్ని విజృంభించి పంచే హీరోయిన్స్లో టాప్లో ఉంటుంది. తన తల్లి శ్రీదేవిలా కాకుండా పూర్తిగా అందాల ఆరబోతనే నమ్ముకున్న ఈ క్యూటీ...దీని కోసం ఫిజిక్ ను తీరైన రీతిలో ఉంచుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించింది. తన శరీరపు ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవడానికి స్ట్రెచింగ్, ట్రెడ్మిల్ లపై దృష్టి పెడుతుంది. తన ఫిట్నెస్ రొటీన్లో బెంచ్ ప్రెస్లు, డెడ్లిఫ్ట్లు, స్క్వాట్లు, షోల్డర్ ప్రెస్లు పుల్–అప్ల ద్వారా బాడీ షేప్ని తీర్చిదిద్దుకుంటుంది. టిని ఆమె రోజువారీ వ్యాయామాలు ఆమె టోన్డ్ ఫిజిక్ను నిర్వహించడానికి మాత్రమే కాదు ఆమె కండరాలలో బలాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడతాయి.‘కిక్’ ఇచ్చేంత అందం...వత్తుండాయి పీలింగ్సూ, వచ్చి వచ్చి చంపేత్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సూ... అంటూ పుష్పరాజ్ మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం తనను చూసి పిచ్చెత్తిపోవాలంటే ఏం చేయాలో రష్మికకు తెలుసు. అందుకే వారానికి 4–5 సార్లు జిమ్కి వెళుతుందామె. ఆమె ఫిట్నెస్ రొటీన్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్, కార్డియోతో పాటు ముఖ్యంగా నడుం దగ్గర ఫ్యాట్ని పెంచనీయని, అదే సమయంలో క్లిష్టమైన డ్యాన్స్ మూమెంట్స్కి ఉపకరించే కోర్ వర్కౌట్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఫిట్గా ఉండటానికి ఇంట్లో పవర్ యోగా, స్విమ్మింగ్ చేస్తుంది. ఇటీవలే రష్మిక తన ఫిట్నెస్ మెనూలో అధిక–తీవ్రత గల కిక్బాక్సింగ్ సెషన్లను కూడా చేర్చుకుంది, ఇది తన ఒత్తిడిని తగ్గించడానికి, కేలరీలను బర్న్ చేయడానికి ఆమె జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.దీపికా...అందం వెనుక...జవాన్ సినిమాలో దీపికా పదుకొణెను చూసినవాళ్లు తెరపై నుంచి కళ్లు తిప్పుకోవడం కష్టం. పెళ్లయిన తర్వాత ఈ ఇంతి ఇంతింతై అన్నట్టుగా మరింతగా గ్లామర్ హీట్ను పుట్టిస్తోంది. ఇంతగా తన అందాన్ని తెరపై పండించడానికి తీరైన ఆకృతి చాలా అవసరమని తెలిసిన దీపిక.. దీని కోసం బ్లెండింగ్ యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కార్డియోను సాధన చేస్తుంది. అవే కాదు... స్విమ్మింగ్, పిలాటిస్, వెయిట్ ట్రైనింగ్ కూడా చేస్తుంది, ఆమె శారీరక థృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిస్తూ తన వర్కవుట్ రొటీన్ను డిజైన్ చేసుకుంటుంది.కార్డియో...ఆలియా...ఆర్ఆర్ఆర్ సినిమాలో మెరిసిన బ్యూటీ క్వీన్ అలియా భట్ తాజాగా జిగ్రా మూవీతో ప్రేక్షకుల్ని మెప్పించింది. అటు గ్లామర్, ఇటు యాక్షన్ రెండింటినీ పండించే ఈ థర్టీ ప్లస్ హీరోయిన్.. ఫిట్గా ఉండటానికి కార్డియో అవసరమని అర్థం చేసుకుంది. అది ట్రెడ్మిల్పై నడుస్తున్నా లేదా స్పిన్నింగ్ చేసినా, ఆమె స్టామినాను పెంచుకోవడంపైనే దృష్టి పెడుతుంది వర్కవుట్స్లో ఆటల్ని కూడా మిళితం చేసే అలియా తాజాగా పికిల్ బాల్ ఫ్యాన్ క్లబ్లోని సెలబ్రిటీస్ లిస్ట్లో తానూ చేరింది.కత్తిలా..కత్రినా..తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన కనిపించిన మల్లీశ్వరి కత్రినా కైఫ్...నాజూకు తానికి మరోపేరులా కనిపిస్తుంది. మైనేమ్ ఈజ్ షీలా, చికినీ చమేలీ వంటి పాటల్లో కళ్లు తిరిగే స్టెప్స్తో అదరగొట్టిన కత్రినా.. తన వ్యాయామాల్లో డ్యాన్స్, పిలాటì స్, యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ల సమ్మేళనాన్ని పొందుపరిచింది. అందమైన ఆ‘కృతి’...ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన సీత...కృతి సనన్ అంతకు ముందు దోచెయ్ సినిమా ద్వారానూ తెలుగు తెరకు చిరపరిచితమే. అద్భుతమైన షేప్కి కేరాఫ్ అడ్రస్లా కనిపించే ఈ పొడగరి... తన శరీరాన్ని సన్నగా బలంగా ఉంచుకోవడానికి పిలాటిస్, కోర్ వర్కౌట్లతో శ్రమిస్తుంటుంది. వ్యాయామాల ద్వారా తన పోస్చర్ను మెరుగుపరచడానికి కూడా ఈమె తగు ప్రాధాన్యత ఇస్తుంది. -
రొడ్డకొట్టుడు సినిమాలవి:పుష్ప2, టాలీవుడ్పై హృతిక్ తండ్రి విసుర్లు!
పుష్ప2 అనూహ్య విజయం తర్వత బాలీవుడ్ ప్రముఖులు టాలీవుడ్, దక్షిణాది సినిమాలపై ఒక్కసారిగా ఒకరొకరుగా అక్కసు వెళ్లగక్కుతున్నారు. దీనికి కారణం... గత కొంత కాలంగా అనూహ్య స్థాయిలో టాలీవుడ్, దక్షిణాది చిత్రపరిశ్రమ ఊపిరి సలపనివ్వని రీతిలో భారతీయ బాక్సాఫీస్ ను బద్ధలు కొట్టడం అత్యధిక శాతం మంది బాలీవుడ్ ప్రముఖులకు మింగుడు పడని విషయంగా మారడం..కొన్నేళ్లకు ముందు.. ఉత్తరాది చిత్ర పరిశ్రమ... సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని కనీస స్థాయిలో కూడా గుర్తింపు లేదు.... సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి సైతం ఉత్తరాదిలో మనకు విలువ లేదని బహిరంగంగా వాపోయిన పరిస్థితి. ఈ నేపధ్యంలో కాస్త ఆలస్యంగానైనా బాహుబలితో మొదలైన ఊచకోత...సాహో, ఆర్ఆర్ఆర్, పుష్ప, కల్కి(Kalki 2898AD) ... ఇలా వరుస పెట్టి తెలుగు సినిమాలు అస్త్రశస్త్రాలతో కొనసాగిస్తూ వచ్చాయి. అయినా సరే, జవాన్, దంగల్ వంటి కొన్ని సినిమాలను చూపిస్తూ బాలీవుడ్ జబ్బలు చరుచుకుంది. కానీ పుష్ప2(Pushpa 2) తో ఆ మిణుకు మిణుకు మంటున్న వెలుగు కూడా ఆరిపోయింది. కలెక్షన్ల సునామీ సృష్టించిన సుకుమార్ అండ్ టీం... బాలీవుడ్ లోని అన్ని రికార్డుల్నీ ఉతికి ఆరేశారు. అత్యధిక కలెక్షన్లు సాదించిన హిందీ చిత్రం అనే రికార్డ్తో పాటు రేపో మాపో బాలీవుడ్కి తనకంటూ మిగిలిన ఏకైక దంగల్ రికార్డ్ను కూడా మట్టికరిపించే దిశగా దూసుకుపోతున్నారు.దీంతోప్రస్తుతం టాలీవుడ్ విజయాల ముట్టడిలో బాలీవుడ్ ఉక్కిరి బిక్కిరవుతోంది. మిగిలిన తెలుగు సినిమాల విజయాల సంగతెలా ఉన్నా... పుష్ప 2 విజయం హిందీ చిత్రపరిశ్రమను ఉలిక్కిపడేలా చేసి బాలీవుడ్ హీరోల అస్తిత్వాన్నే ప్రశ్నించేలా కుదుపు కుదిపింది అనేది నిజం. ‘‘మా హీరోలకు సిక్స్ప్యాక్స్ చూపించడం తప్ప నటించడం చేతకాదు. పుష్ప 2 లాంటి సినిమాలు తీయడం మా వల్ల కాదు’’ అంటూ బాలీవుడ్ నటి కంగన రనౌత్ వ్యాఖ్యానించడం, అల్లు అర్జున్ తనకు అభిమాన నటుడు అంటూ సాక్షాత్తూ అమితాబ్ బచ్చన్ కితాబివ్వడం... వంటివి బాలీవుడ్కి జీర్ణించుకోలేని విషయాలుగా మారాయి. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు నాగవంశీ ..ప్రస్తుతం బాలీవుడ్ నిద్రలేని రాత్రులు గడుపుతోందంటూ మూలిగే నక్కమీద తాటిపండు అది కూడా బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సమక్షంలోనే వేసేశారు.ఈ నేపధ్యంలో ఒకరొకరుగా బాలీవుడ్ చిత్ర ప్రముఖులు టాలీవుడ్పై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే సీనియర్ నటుడు, నిర్మాత, ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తండ్రి... రాకేష్ రోషన్(Rakesh Roshan) పుష్ప2 సహా దక్షిణ భారత చిత్రాల విజయం గురించి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ, ‘‘దక్షిణాది సినిమాలు చాలా గ్రౌన్దేడ్ (మూలాలకు కట్టుబడిన సాదాసీదా)గా ఉన్నాయి, అవి పాతదైన పంధాలో వెళుతూ.. పాట యాక్షన్డైలాగ్భావోద్వేగాలు... ఇలా ఏళ్లనాటి ఫార్ములా సంబంధితంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి. అవి పురోగమించడం లేదు. ఏ పాత మార్గాన్ని విచ్ఛిన్నం చేయనందున వారు విజయవంతమవుతున్నారు’’ అంటూ తీసిపారేశారు. సింపుల్గా చెప్పాలంటే దక్షిణాది వాళ్లు రొడ్డకొట్టుడు కధలతోనే విజయాలు సాధిస్తున్నామని, బాలీవుడ్ మాత్రం కొత్త పంధాలో వెళుతున్నామనేది ఆయన హేళన. దీనికి ఉదాహరణ గా ... తాను కహో నా...ప్యార్ హై సినిమా చేసిన తర్వాత రొమాంటిక్ సినిమాలు తీయాలని అనుకోలేదనీ.ఆ తర్వాత తాను కోయి... మిల్ గయా చేశాననీ ఆయన గుర్తు చేశారు. ఇలా తాము సవాళ్లకు ఎదురొడ్డి సినిమాలు కొత్త పంధాలో వెళుతున్నామన్నారు.అయితే టాలీవుడ్ తదితర సౌత్ ఇండియా వాళ్లు ఇలాంటి సవాళ్లు తీసుకోరని వారు సేఫ్ గేమ్ ఆడతారని అంటున్న ఆయన... బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప2, కల్కి, సాహో... వంటి ఒకదానికొకటి సంబందం లేని వైవిధ్యభరిత కధా నేపధ్యం ఉన్న సినిమాలతో టాలీవుడ్ సాగిస్తున్న జైత్రయాత్రను చూడట్టేదనుకోవాలా? ఇది గమనిస్తున్న వాళ్లు హృతిక్ రోషన్ తండ్రి మాట్లాడుతున్న మాటల్లోని డొల్లతనాన్ని ఇట్టే పసిగట్టేయగలరు అనే ఇంగితం కూడా రాకేష్కు లేకపోవడం దురదృష్టకరం. -
3 కోట్ల బడ్జెట్.. 136 కోట్ల కలెక్షన్స్.. ‘పుష్ప2’ని మించిన హిట్!
రపరపరపరప అన్నట్టుగా వరుసపెట్టి విలన్లను మాత్రమే కాదు అంతకు ముందు సినిమాలు నెలకొల్పిన ప్రతీ రికార్డ్నూ నరుక్కుంటూ పోయాడు పుష్ప2. అంతకు ముందు వరకూ ఠీవీగా నిలుచున్న అనేక మంది నెంబర్ వన్ హీరోలు సైతం తమ స్థాయి గురించి తాము సందేహించుకునేలా చేశాడు అల్లు అర్జున్. అయితే అసలైన హిట్ ఇది కాదని, కనీ వినీ ఎరుగని కలెక్షన్లు సాధించినప్పటికీ పుష్ప2 అత్యద్భుతమైన హిట్ గా చెప్పలేమని ట్రేడ్ పండితులు కొందరు తీర్మానిస్తున్నారు.అంతేకాదు ఆ మాట కొస్తే గత ఏడాది సినిమాల్లో కలెక్షన్ల పరంగా రికార్డ్స్ బద్ధలు కొట్టిన పలు సినిమాలు కూడా హిట్స్ కిందకు రావని అంటున్నారు. ఒకే ఒక సినిమా మాత్రం టాప్ హిట్గా స్పష్టం చేస్తున్నారు. దీనికి గాను వారు అందిస్తున్న విశ్లేషణ ఏమిటంటే...గత ఏడాది భారతీయ సినిమాకు చెప్పుకోదగ్గ అద్భుతమైన సంవత్సరంగా మార్చడంలో పలు టాప్ మూవీస్ కీలకపాత్ర పోషించాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించిన రెండు సినిమాలు పుష్ప 2: ది రూల్, కల్కి 2898... రెండూ గత ఏడాదిలోనే విడుదలయ్యాయి. అదే విధంగా శ్రద్ధా కపూర్ రాజ్కుమార్ రావుల హర్రర్ కామెడీ స్ట్రీ 2 కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 850 కోట్లకు పైగా వసూలు చేయడం ద్వారా గత ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా అవతరించింది.అయితే, ఒక దక్షిణ భారతీయ చిత్రం వాటన్నింటినీ అధిగమించి, భారతదేశపు అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది. విశేషం ఏమిటంటే ప్రధాన తారలు ఎవరూ కనిపించని ఈ చిత్రం కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఆ మలయాళ చిత్రం పేరు ప్రేమలు. ఇటీవలి కాలంలో భారతదేశపు అత్యంత లాభదాయకమైన చిత్రంగా ప్రేమలు నిలిచింది. ఈ విషయానన్ని ప్రముఖ ఆంగ్లపత్రిక హిందుస్థాన్ టైమ్స్ వెల్లడించింది. గిరీష్ దర్శకత్వం వహించిన ప్రేమలు చిత్రం సచిన్ అనే యువకుడి చుట్టూ తిరిగే రొమాంటిక్ డ్రామా. హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం, ఈ చిత్రం దాని నిర్మాణ బడ్జెట్లో 45 రెట్లు ఎక్కువ లాభాలను ఆర్జించింది. రూ. 3 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ప్రేమలు ప్రపంచవ్యాప్తంగా రూ. 136 కోట్లు వసూలు చేసింది, తద్వారా గత ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రంగా నిలవడం మాత్రమే కాదు. అత్యంత లాభదాయకమైన భారతీయ చిత్రంగా కూడా నిలిచింది.మరోవైపు పుష్ప 2: ది రూల్, కల్కి 2898.. స్త్రీ 2 వంటివన్నీ భారీ బడ్జెట్ చిత్రాలనేవి తెలిసిందే. దీని వలన తయారీదారులు తమ ఉత్పత్తి ఖర్చులను త్వరగా రికవరీ చేసుకోవచ్చు. అగ్రతారలైన ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ తదితరులు నటించిన కల్కి 2898.. బడ్జెట్ రూ. 600 కోట్ల పై మాటే. ఫలితంగా ప్రేమలుతో పోలిస్తే తక్కువ లాభాల శాతం వచ్చింది. అదేవిధంగా, అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ బాక్స్ ఆఫీస్ హిట్ అయినప్పటికీ దాని నిర్మాణ బడ్జెట్ రూ. 350 కోట్లపై మాటే దాంతో భారీ పెట్టుబడి దీని లాభాల మార్జిన్ను తగ్గించింది. అత్యంత లాభదాయకమైన చిత్రాల్లో రెండో స్థానం సాధించిన స్ట్రీ 2 దాని బడ్జెట్కు పది రెట్లు సంపాదించింది. ఈ సినిమా రూ. 90 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొంది 850 కోట్లకు పైగా కలెక్షన్లు దక్కించుకుంది. -
పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్
దక్షిణాదిలో చాలా మందికి ఇష్టమైన నటి నిత్యా మీనన్(Nitya Menen ) తెలుగు సినిమాల్లో కూడా హిట్స్ ద్వారా చాలా మందికి సుపరిచితమే. ఆమెకు దక్షిణాది వ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం తన రాబోయే తమిళ చిత్రం కాదలిక్క నేరమిల్లై ప్రమోషన్ కార్యక్రమంలో నిత్యామీనన్ బిజీ బిజీగా ఉంది. అయితే ఈ సందర్భంగా ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చిత్రపరిశ్రమ తీరుతెన్నుల గురించి తూర్పార బట్టడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా నటీమణుల ఆరోగ్యం విషయంలో చిత్ర పరిశ్రమ కనీసపు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంది అని ఆమె వ్యాఖ్యానించడం విశేషం. అయితే తన స్నేహితుడు, దర్శకుడు–నటుడు మిస్కిన్ ఒక్కడు మాత్రం ఇందుకు మినహాయింపు అంటూ నిత్య చెప్పుకొచ్చారు.నిక్కచ్చిగా మాట్లాడడానికి ప్రసిద్ది చెందిన నిత్య... సినిమా షూటింగ్లో తాను ఎదుర్కున్న అనుభవాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. చిత్రనిర్మాతలు తమ బృందం అనారోగ్యం విషయంలో. అలాగే నటీమణులు పీరియడ్స్ నొప్పితో ఉన్నామని చెప్పినా పట్టించుకోరని పని మాత్రమే పట్టించుకుంటారని ఆమె వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ ‘‘సినిమా పరిశ్రమలో చాలా చోట్ల అమానవీయత ఉంటుంది. ఎంత జబ్బుపడినా, ఎంత కష్టమైనా ఏదో ఒకటి చేసి షూటింగ్కి రావాలని సినిమా నిర్మాత దర్శకులు ఆశిస్తారు. అంతే. మనం దానికి అలవాటు పడ్డాం. ఏది ఎలా జరిగినా మనం కష్టపడాలి తప్పదు ’’ అంటూ చెప్పారు.అయితే ఆమె 2020లో చేసిన చిత్రం సైకో కోసం చిత్రీకరణలో ఉన్నప్పుడు ఆమెకు ఓ వైవిధ్యభరిత అనుభవం ఎదురైంది. మొదటి రోజు షూట్లోనే తనకు పీరియడ్స్ వచ్చిందని, చాలా నొప్పిగా అనిపించిందని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సమయంలో దర్శకుడు మిస్కిన్ ఎంతగా తనని అర్థం చేసుకున్నాడో అని ఆశ్చర్యపోయానని కూడా నిత్య తెలిపింది. నాకు పీరియడ్స్ ఉందని మొదటిసారిగా ఒక మగ దర్శకుడికి నోరు విప్పి చెప్పాను. అప్పుడు అది నా మొదటి రోజు కాదా? అని అతను అడిగాడు. అప్పుడే నాకు అతనిలోని సానుభూతి అనిపించింది. నేను ఆశించినట్టే, అనుకున్నట్టే.. ‘‘అయితే మీరు విశ్రాంతి తీసుకోవచ్చు’’ అని అతను అన్నాడు. అంతేకాదు ఏమీ చేయవద్దు. ఆ రోజు నిత్య అసౌకర్యానికి గురవుతున్నట్లు తాను అర్ధం చేసుకున్నానని ఆమె చేయకూడని పనిని చేయడం తనకు ఇష్టం లేదని మిస్కిన్ చెప్పాడట, ఆమె ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు మాత్రమే షాట్ చేయడానికి ఇష్టపడతానని అన్నాడట.ఈ సినిమాతో పాటు ధనుష్ దర్శకత్వం వహించిన ఇడ్లీ కడైలో నిత్యనే ప్రధాన పాత్రలో కూడా కనిపించనున్నారు. ఆమె డియర్ ఎక్సెస్ అనే చిత్రం కోసం అలాగే తదుపరి చిత్రంలో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తోంది. -
వింటేజ్ క్రేజ్ : ఆమె ‘పద్మిని’ జాతి స్త్రీ... ఇంట్రస్టింగ్ స్టోరీ!
నీకు ఇష్టమైన కారు ఏదో చెప్పు? అంటే క్రెటా అనో ఆడి అనో మెర్సిడెస్ అనో, బిఎండబ్ల్యూ అనో...ఇంకా మరికొన్ని అత్యాధునిక, ఖరీదైన లగ్జరీ కార్ల పేర్లు చెప్పేవాళ్లనే మనం చూసి ఉంటాం కాబట్టి అదేమీ విశేషం కాదు. కానీ నీ కలల కారు గురించి చెప్పు అంటే ప్రీమియర్ పద్మిని అని ఎవరైనా చెబితే... కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు స్పృహ తప్పినా ఆశ్చర్యం లేదు. అవును మరి ప్రీమియర్ పద్మిని అనే కార్ ఒకటి ఉండేదని, ఉందని కూడా చాలా మందికి తెలియని నవ నాగరిక ప్రపంచంలో... ఆ పురాతన కార్ కోసం అన్వేషించి పట్టుకుని అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని దానికి జవసత్వాలను సమకూర్చి.. తన పుట్టిన రోజున తనకు దక్కిన అపురూప బహుమతిగా మురిసిపోతూ ప్రపంచానికి పరిచయం చేయడం ఏదైతే ఉందో... అందుకే ఆ అమ్మాయి నెటిజన్ల ప్రశంసలకు నోచుకుంటోంది.సొగసైన, హై–టెక్ కార్లు రోడ్లపై ఆధిపత్యం చెలాయించే కార్పొరేట్ ప్రపంచంలో, ఒక బెంగళూరు ఐటీ ఉద్యోగిని క్లాసిక్ కార్ ప్రీమియర్ పద్మినికి సరికొత్త యజమానిగా మారారు. భారతదేశంలో ఒకప్పుడు హుందాతనానికి అధునాతనతకు చిహ్నంగా కొంత కాలం పాటు హల్చల్ చేసిన ఈ కారు, గడిచిన విలాసవంతమైన యుగానికి ప్రాతినిధ్యం వహించింది అని చెప్పొచ్చు. అంతేకాదు రచన మహదిమనే అనే యువతి చిన్ననాటి జ్ఞాపకాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.ఆమె ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తాను కొనుగోలు చేసిన పాతకాలపు కారును, ఇంటికి తెచ్చుకున్న ఆనందాన్ని తన అనుభవాన్ని ఇన్స్ట్రాగామ్లో వీడియోలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Rachana Mahadimane (@rachanamahadimane) ఆమె తన ప్రియమైన ప్రీమియర్ పద్మిని మహదిమనే తన చిన్ననాటి కలను జీవం పోస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. కొన్నేళ్ల తర్వాత తన కలల కారును ఎలా కనిపెట్టిందో ఆమె దీనిలో తెలియజేసింది. నెలల తరబడి ఖచ్చితమైన చేయించిన మరమ్మతులు అందమైన పౌడర్ బ్లూ పెయింట్ జాబ్ తరువాత, పాతకాలపు కారు ఎలా దాని పూర్వ వైభవానికి పూర్వపు అందానికి చేరుకుందో వివరించింది.‘నాకు నేను పించింగ్ వేస్తున్నాను. నా పుట్టినరోజు కోసం నేను ఈ కారు కొన్నాను ఇది నా కలల కారు, నేను చిన్నప్పటి నుండి ఈ కారు గురించి కలలు కన్నాను‘ అని ఎమ్మెల్యే మహదిమనే వీడియోలో తెలిపారు. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఈ కార్తో ముడిపడి ఉండడం తో ఈ కార్ తనకొక భావోద్వేగ అనుబంధం అంటూ ఆ యువతి పొందుతున్న ఉద్వేగాన్ని ఇప్పుడు నెటిజనులు సైతం ఆస్వాదిస్తున్నారు.‘‘గత ‘సంవత్సరాన్ని అత్యద్భుతంగా ముగించడం అంటే ఇదే ఇది ఇంతకంటే మెరుగ్గా ఏదైనా ఉండగలదా? నా డ్రీమ్ కారులో ఓపికగా పనిచేసి, దానిని ఈ అందానికి మార్చినందుకు కార్ రిపేర్ చేసిన బృందానికి ధన్యవాదాలు’’ అంటూ ఆమె ఈ వీడియోలో చెప్పింది.అత్యాధునిక ఖరీదైన కార్లు లేదా మరేదైనా సరే కొనుగోలు చేయడం అంటే మనం సాధించిన, అందుకున్న విజయ ఫలాలను నలుగురికీ ప్రదర్శించడమే కావచ్చు కానీ పాతవి, మరపురాని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, ఆ అనుభూతులను తిరిగి మన దరికి చేర్చుకోవడం మాత్రం ఖచ్చితంగా గొప్ప విజయమే అని చెప్పాలి. అలాంటి విజయాలను అందిస్తుంది కాబట్టే... వింటేజ్ ఇప్పటికీ కొందరికి క్రేజ్. -
రక్తమోడుతున్న ‘వెండితెర’
నాటి క్లైమాక్స్ సీన్: హీరో గన్ను పట్టుకుని సుదూరం నుంచి విలన్ అండ్ కో మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు..పిట్టల్లా వారంతా నేల కొరిగిపోతున్నారు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. మంచి పైన చెడు గెలిచింది అంటూ సంతోషంగా ఇంటికి తిరుగు ముఖం పట్టారు.నేటి క్లైమాక్స్: హీరో విలన్ అండ్ కో మీద ఎగిరి దూకాడు చేతులు కట్టేసి ఉన్నప్పటికీ..అడవి మృగాన్ని తలపిస్తూ వరుసపెట్ట్లి కంఠాల్ని నోటితో కరిచేశాడు.. కండల్ని దంతాలతో లాగేశాడు. రక్తమోడుతున్న నోటిని నాలుకతో తుడుచుకున్నాడు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం కూడా మరచిపోయారు ఎందుకంటే వారు అప్పటికే షాక్లో ఉన్నారు.. చెడు మీద చెడు గెలిచిందో మంచి గెలిచిందో తెలీని అదే షాక్లో ఇంటికి తిరుగుముఖం పట్టారు.కళాత్మకమా? హింసాత్మకమా?ఆటవికన్యాయమే ఆధునిక సినిమా విజయసూత్రంగా మారిందా? వయె‘‘లెన్స్’’ లో నుంచే సినిమా రూపకర్తలు తమ సుసంపన్న భవిష్యత్తును దర్శిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు కాదు అని చెప్పే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇప్పుడు లేదు. మొన్నటి కెజీఎఫ్ నుంచి నేటి మార్కో(Marco Movie) దాకా దక్షిణాదిలో, మొన్నటి కిల్(Kill) నుంచి నిన్నటి యానిమల్ దాకా ఉత్తరాదిలో..భాషా బేధాల్లేకుండా.. గత రెండు మూడేళ్లుగా సినిమా తెర అవిశ్రాంతంగా రక్తమోడుతోంది. నవరసాల్ని పంచే వినోదం నవనాడుల్లో దానవత్వాన్ని పెంచి పోషిస్తోంది. కళ్ల ముందు తెగిపడుతున్న శరీరభాగాలు కనపడితేనే కౌంటర్లలో టిక్కెట్లు తెగుతాయనే ప్రమాదకర విశ్వాసం సినీజీవుల్లో ప్రబలుతోంది.ఈ పరిస్థితికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్–19 మహమ్మారి ఇంట్లో నుంచే సినిమాలను ఎక్కువగా వీక్షించే విధానాన్ని సృష్టించింది. ఇది దేశంలోని ఇతర భాషలతో పాటు కొరియన్ జపనీస్తో సహా ప్రపంచ సినిమాలకు వారిని సన్నిహితం చేసింది. దాంతో క్రూరమైన పంధాకు పేరొందిన పలు సినిమా పరిశ్రమల చిత్రాలు మనకీ చేరువయ్యాయి. చెన్నైకి చెందిన జికె సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ రూబన్ మతివానన్ మాట్లాడుతూ యువతలో యాక్షన్ హింసాత్మక చిత్రాల పట్ల మోజు పెరిగిందని అన్నారు మహమ్మారి తర్వాత, థియేటర్లు యాక్షన్, థ్రిల్లర్ గ్యాంగ్స్టర్, హింసాత్మక చిత్రాలతో నిండిపోతున్నాయి. ‘‘ఈ ధోరణి యూత్ను ఆకర్షిస్తున్నప్పటికీ, సినిమాలకు కుటుంబ ప్రేక్షకులను కూడా రాకుండా చేస్తుంది. సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులనూ కలిగి ఉండాలి’’ అన్నారాయన.కొబ్బరికాయ కొట్టిన కెజీఎఫ్...గతంలోనూ సినిమాల్లో వయెలెన్స్ ఉండేది అయితే ఈ స్థాయిలో కాదు. ఈ ట్రెండ్కి శ్రీకారం చుట్టింది కెజీఎఫ్(KGF Movie) అని చెప్పొచ్చు. అక్కడ నుంచి వరుసగా ఈ తరహా చిత్రాలు తెరప్రవేశం చేస్తూ వచ్చాయి. గత ఏడాది బాలీవుడ్ హిట్స్గా నిలిచిన యానిమల్, కిల్... బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత హింసాత్మక చిత్రాలుగా అవతరించాయి. తండ్రి మీద అవ్యాజ్యమైన ప్రేమ కలిగిన ఓ యువకుడు ఆ సాకుతో సాగించిన దారుణ మారణకాండ యానిమల్ కాగా, ఓ రైల్లో ప్రేమజంట డెకాయిట్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపధ్యంలో ఓ సైనికాధికారి సాగించిన హత్యాకాండ కిల్.. రెండూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని క్రూరత్వంలో ముంచి పంచాయి. ఇక ఇటీవలే విడుదలైన మార్కో భారతీయ చిత్రాల తాజా హింసోన్మాదానికి పరాకాష్ట. అత్యధిక శాతం సన్నివేశాలు చూడలేక ప్రేక్షకులు కళ్ల మీద కర్చీఫ్లు కప్పుకున్న సినిమా ఇదేననే ఘనతను దక్కించుందంటే ఏ స్థాయిలో మార్కో హింసను పండించిందో అర్ధం చేసుకోవచ్చు. విషాదమో విచిత్రమో లేక వినాశనమో తెలీదు గానీ ఈ చిత్రాలన్నీ అత్యంత సమర్ధులైన, సృజనశీలురైన దర్శకుల చేతుల్లో రూపుదిద్దుకున్నవి. దీంతో ఇవి నచ్చి మెచ్చి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. పైన చెప్పుకున్నవే కాకుండా అఖండ, దేవర, పుష్ప2..ఇలా భారీ కలెక్షన్లు సాధించిన, సాధిస్తున్న చిత్రాలన్నీ విపరీతమైన హింసకు పట్టం కట్టినవే కావడం గమనార్హం. ఇది అహింసో పరమో ధర్మః అని నినదించిన మన భారతీయ ధర్మానికి గొడ్డలిపెట్టుగానే చెప్పాలి.మన వ్యక్తిగత వృత్తి పరమైన జీవితాలలో టెన్షన్ల నుంచి తప్పించుకునే మార్గం సినిమా. ప్రస్తుత క్రైమ్ చిత్రాలు మనసును మరోవైపు మళ్లిస్తున్నప్పటికీ... మితిమీరిన హింస ప్రభావానికి గురైనప్పుడు, మనస్సును మరింత గందరగోళానికి గురి చేస్తుందని సైకాలజిస్ట్లు హెచ్చరిస్తున్నారు. ఈ చిత్రాల్లో హీరోలకు చట్టంతో పనిలేదు, కోర్టుల జాడే ఉండట్లేదు, మంచి చెడు మీమాంస అసలే కనపడదు. ఓ వయసు దాటిన వారి సంగతి ఎలా ఉన్నా... ఇప్పుడిప్పుడే ఓ పర్సనాలిటీ(వ్యక్తిత్వం) రూపుదిద్దుకుంటున్న యువ మనస్తత్వాలను ఇవి ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయమే లక్ష్యంగా సినిమా రూపొందించడంలో తప్పులేదు కానీ.. దాని కోసం సామాజిక బాధ్యతను విస్మరించడం తప్పు మాత్రమే కాదు..ముప్పు కూడా. దీనిని మన సినిమా దర్శకులు గుర్తించాలి..అది సమాజానికి...సమాజంలో భాగమైన సినిమా రూపకర్తలకు, వారి పిల్లల భవిష్యత్తుకు కూడా అవసరం. -
నటన వదిలేయాలనుకున్నా..నా భార్య మాటలే నిలబెట్టాయి
తమిళ హీరో శివకార్తికేయన్ రాజ్కుమార్ పెరియసామి ’అమరన్’ తో ఒక్కసారిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియన్ ఆర్మీ రాజ్పుత్ రెజిమెంట్లో కమీషన్డ్ ఆఫీసర్గా ఉన్న మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కధగా తీసిన అమరన్ చిత్రం మంచి రివ్యూలను అందుకొని సూపర్హిట్గా నిలిచింది. దాంతో తమిళనాడులో మరో సూపర్ స్టార్ అవతరించినట్టేనని సినీ విశ్లేషకులు తీర్మానించేశారు. అందుకు తగ్గట్టే ఈ సినిమా తర్వాత శివకార్తికేయన్... అఖమురుగదాస్ వెంకట్ ప్రభు వంటి ప్రఖ్యాత దర్శకుల చిత్రాలకు సంతకం చేశాడు.అలుపెరుగని యాత్ర...ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా ప్రపంచంలోకి ప్రవేశించిన శివకార్తికేయన్ సాధించిన విజయం...సాగించిన ప్రయాణం చాలా మందికి స్ఫూర్తి దాయకం. కాలేజీ రోజుల్లోనే స్టాండప్ కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్, షార్ట్ ఫిల్మ్ నటుడు..కూడా. ఆ తర్వాత తొలుత స్టార్ విజయ్ టీవీ వేదికగా.. 2011లో టీవీ షోలను హోస్ట్ చేయడం ద్వారా శివకార్తికేయన్ తన కెరీర్ను ప్రారంభించాడు నిదానంగా సినిమాల్లోకి వచ్చి మొదట్లో సహాయక పాత్రలను పోషించాడు, సినిమాల్లోకి వచ్చి పుష్కరకాలం పూర్తయిన తర్వాత గానీ అతనికి పెద్ద బ్రేక్ వచ్చిందని చెప్పాలి. ఈ నేపధ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, శివకార్తికేయన్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం నటన నుంచి నిష్క్రమించాలని భావించినట్లు వెల్లడించాడు, అయితే తన భార్య ఆర్తి చెప్పిన స్ఫూర్తి దాయకమైన మాటలే తనని నటన కొనసాగించడానికి ప్రేరేపించాయంటూ చెప్పుకొచ్చాడు.పరిశ్రమ మంచిదే...వ్యక్తులే....సినిమా పరిశ్రమలో కొందరు వ్యక్తులతో తనకు సమస్యలు ఉన్నాయని ఒప్పుకున్నప్పటికీ, పరిశ్రమపై తనకు ఎటువంటి ఫిర్యాదులు లేవని శివకార్తికేయన్ స్పష్టం చేశాడు. ఆర్ధిక ఇబ్బందులతో సహా కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ.. తన నటనా ప్రయాణాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నానన్నాడు. అయితే తన పోరాటాలు తన కుటుంబాన్ని ప్రభావితం చేయకూడదని ఎప్పుడూ కోరుకున్నానని, తన వారు సాధారణ జీవితాలను గడపాలని లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. తన ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులతో భార్య, అత్తమామలు, పిల్లలపై భారం వేయకూడదని భావించానని చెప్పాడు. అయితే భార్య మాటలతో స్ఫూర్తి పొంది... అడ్డంకులను అధిగమించడానికి మార్గాలను అన్వేషించాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఎంబిఎ గ్రాడ్యుయేట్ గా, అతను ఈ సవాళ్లను ఎలా అధిగమించాలో తెలుసుకోగలిగాడు.కుమార్, చియాన్ తర్వాత నువ్వే...అన్న భార్యఇండస్ట్రీలో కొనసాగాలనే తన నిర్ణయంలో తన భార్య ఆర్తి ప్రోత్సాహం కీలక పాత్ర పోషించిందని ఈ అమరన్ హీరో వెల్లడించాడు. ‘ఇక్కడకి వచ్చేటప్పుము ’మీ దగ్గర ఏమీ లేదు, అయినా సరే మీరు ఇంత దూరం వచ్చారు. గత 20 ఏళ్లలో,కుమార్ (అజిత్) సార్ చియాన్ (విక్రమ్) సార్ తర్వాత, బయటి వ్యక్తి ఎవరూ ఈ పరిశ్రమలో పెద్దగా ఎదిగింది లేదు, కాని నువ్వు అది సాధించావ్. ’ఇది అంత తేలికైన పనిగా తీసిపారేయవద్దు.’మీ స్టార్డమ్ ప్రయోజనాలను మేం అనుభవిస్తున్నాం కాబట్టి,కొన్ని ప్రతికూల అంశాలను కూడా ఎదుర్కోగలం’’ అని తన భార్య చెప్పిందని ఆయన గుర్తు చేసుకున్నాడు.సినీ పరిశ్రమలో తన ఎదుగుదల సమయంలో ఎదుర్కొన్న శత్రుత్వం సవాళ్ల గురించి కూడా శివకార్తికేయన్ చర్చించారు. ‘సామాన్యుడు‘ నుంచి విజయవంతమైన నటుడిగా తన ప్రయాణాన్ని కొందరు స్వాగతించగా, మరికొందరు బహిరంగంగా విమర్శించారని, పరిశ్రమలో అతని స్థానాన్ని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేశారని, గత ఐదేళ్లలో గణనీయమైన కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ప్రయాణం కొనసాగించానని ఘర్షణ లేకుండా ముందుకు సాగాలని కోరుకున్నానన్నాడు..అయితే నేటి తన విజయం విమర్శకులకు ఖండన అనుకోనక్కర్లేదని, సహకరించిన కష్టపడి పనిచేసే తన చిత్ర బృందాలకుు, తన పట్ల అంకితభావంతో ఉన్న అభిమానులకు అతని కథ నుండి ప్రేరణ పొందిన వారికి వేడుకగా మాత్రమే అనుకోవాలని వినమ్రంగా చెబుతున్నాడు. -
గేమ్ ఛేంజర్ టిక్కెట్ల విక్రయం...ఏ రాష్ట్రంలో ఎంతంటే...
చిత్రం విడుదలకు కేవలం ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలింది. రిలీజ్కు సంబంధించి కౌంట్డౌన్ ముగియనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత మరో అద్భుతమైన పాత్రలో తమ ఫేవరెట్ స్టార్ని చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఏ పెద్ద స్టార్ సినిమా విడుదల ముందైనా సర్వసాధారణంగా జరిగేవే. అవన్నీ అలా ఉంచితే... ఇటీవల భారీ చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్లు బాగా చర్చకు నోచుకుంటున్నాయి. గత కొంత కాలంగా భారతీయ సినిమాలకు సంబంధించి హిట్స్, ఫ్లాప్స్ అన్నీ వసూళ్లతోనే ముడిపడడంతో ఈ పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్ గురించి కూడా సినిమా వర్గాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఈ సినిమాకి భారీగా హైప్ వచ్చినప్పటికీ అడ్వాన్స్ టిక్కెట్ల విక్రయం ప్రకారం చూస్తే ఆశించిన స్థాయికి చేరుకోలేదనే చెప్పాలి. భారీ సంచలన చిత్రాల దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ ల కలయికే ఓ సెన్సేషన్ కావడంతో ఈ టాలీవుడ్ పొలిటికల్ థ్రిల్లర్ అందరి దృష్టినీ ఆకర్షించింది, అయితే కనపడుతున్న స్పందన మాత్రం అంచనాల కంటే చాలా తక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఈ సినిమా డైరెక్టరే అని పలువురు భావిస్తున్నారు. ఊహించిన దానికన్నా శంకర్ ప్రేక్షకుల్లో తన పట్ల ఆదరణ తగ్గించుకున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. అదే సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోందని అభిప్రాయపడుతున్నాయి. నిజానికి ఒకప్పుడు శంకర్ అంటే పెద్ద బ్రాండ్, కానీ ఇటీవల ఈ డిఫరెంట్ సినిమాల ఫిల్మ్ మేకర్ తన క్రేజ్ను కోల్పోయాడు. అతని సినిమాలు గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్నాయి ఆయన చివరి సినిమా భారతీయుడు 2 ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో మనం చూశాం.కలెక్షన్లలో వ్యత్యాసం..చెబుతోంది అదే...సినిమా విడుదలకు మరో రోజు మిగిలి ఉండగా...గురువారం ఉదయం 10 గంటల నాటికి గేమ్ ఛేంజర్ 1వ రోజు మన దేశంలో దాదాపు 5 లక్షలకు పైగా టిక్కెట్లను విక్రయించిందని సమాచారం. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్ విలువ 14.83 కోట్ల గ్రాస్ (బ్లాక్ చేసిన సీట్లు మినహా)కు చేరింది. ఇప్పటివరకు దాదాపు 8,000 షోలు లిస్ట్ చేశారు. తర్వాత వాటి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.ఆంధ్రలో టాప్..తమిళనాడులో డ్రాప్...రాష్ట్రాల వారీగా చూస్తే టిక్కెట్ల విక్రయంలో ఆంధ్రప్రదేశ్ భారీ తేడాతో ముందంజలో ఉంది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే గేమ్ ఛేంజర్ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 8.72 కోట్ల గ్రాస్ టిక్కెట్లను విక్రయించింది. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ 3.06 కోట్లు, కర్ణాటక 1 కోటి ఉన్నాయి. విశేషం ఏమిటంటే తమిళనాట ఇంకా 1 కోటి మార్కును సైతం ఈ సినిమా టచ్ చేయలేదు, విచిత్రంగా తమిళనాడుకు చెందిన టాప్ డైరెక్టర్ శంకర్ సినిమా అయినప్పటికీ అక్కడ ఈ పరిస్థితి ఉండడం షాకింగ్ అనే చెప్పాలి. శంకర్ పట్ల జనాదరణ ఎంతగా తరిగిపోయిందో చెప్పడానికి ఇదొక నిదర్శనంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.గుంటూరు కారం కన్నా..ఘాటు తక్కువే...రామ్ చరణ్ నటించిన సినిమా బుకింగ్స్ విలువ గురువారం ముగిసే సరికి 20 కోట్ల మార్క్ను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు, కానీ అప్పటికీ ముందస్తు అంచనాలను ఇది అందుకోవడం లేదనే చెప్పాలి. ఇంత భారీ చిత్రంగా పేర్కొనని మహేష్ బాబు గుంటూరు కారం సినిమాను సైతం బీట్ చేయడంలో ఇది ఖచ్చితంగా విఫలమవుతుంది, గత సంక్రాంతి సందర్భంగా విడుదలైన గుంటూరు కారం మొదటి రోజు 24.90 కోట్ల గ్రాస్ టిక్కెట్లను విక్రయించింది. -
హృతిక్, జూ.ఎన్టీయార్ల మధ్య ‘వార్’కి టైమ్ బాగుందట!
ప్రముఖ బాలీవుడ్ అగ్రనటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) తదుపరి చిత్రం వార్ 2(War 2) పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీయర్ సైతం నటిస్తుండడంతో దక్షిణాదిలోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో ప్రముఖ బాలీవుడ్ జ్యోతిష్కుడు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కానుందంటూ జోస్యం చెప్పడం విశేషం.బాలీవుడ్లో ప్రఖ్యాత జ్యోతిష్కుడు విక్రమ్ చంద్రరమణి హృతిక్ జ్యోతిష శాస్త్ర చార్ట్ను విశ్లేషించారు, దీని ప్రకారం 2025 అతని కెరీర్లో కీలకమైన సంవత్సరంగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హృతిక్ తన కెరీర్లో 10వ సూర్య దశను అనుభవిస్తున్నాడనీ ఈ సూర్య దశ జూలై 2025లో ముగిసి చంద్ర దశగా మారుతుందనీ ఆయన వివరిస్తున్నారు. ఆల్–టైమ్ బ్లాక్బస్టర్గా నిలిచిన ‘కహో నా... ప్యార్ హై’ (2000) సమయంలోనూ హృతిక్ విజయంలో వీనస్ కీలక పాత్ర పోషించిందని జ్యోతిష్కుడు విక్రమ్ అంటున్నారు. అదే విధంగా ఈ ఏడాది కూడా హృతిక్కు అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పారు. హృతిక్ వ్యక్తిగత వృత్తి జీవితంలో కీలక పరిణామాలు ఈ ఏడాది ప్రధమార్ధంలో జరిగే అవకాశం ఉందనీ, జనవరి ఫిబ్రవరిలో రియల్ ఎస్టేట్, స్టాక్లు లేదా ప్రైవేట్ ఈక్విటీలో వ్యూహాత్మక పెట్టుబడులు ఆయన పెడతారని కూడా జ్యోతిష్కుడు చెబుతున్నారు. బహుభాషా చిత్రాల ఒప్పందాలతో సహా, వినోద పరిశ్రమలో తన స్థాయిని మరింతగా విస్తరించవచ్చునన్నారు. అలాగే ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో కూడా హృతిక్ కొత్త మార్గాలను, నైపుణ్యాలను సంపాదించడంతో పాటుగా తన సినిమాల పోర్ట్ఫోలియోను వైవిధ్యంగా మారుస్తారని చెప్పారు. హృతిక్ గత చిత్రాలలో ’వార్’ (2019) బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇక ’విక్రమ్ వేద’ (2022), ’ఫైటర్’ (2024) విమర్శకుల ప్రశంసలు పొందడంతో సరిపెట్టుకున్నాయి. మరోవైపు ఈ ఏడాది జనవరి 10న హృతిక్ రోషన్ తన 51వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ తరుణంలో, ఆయనకు ఇది మరో విజయవంతమైన సంవత్సరం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఏడాది ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కానున్న వార్ 2 హిందీ సినిమాల్లో రికార్డ్–బ్రేకింగ్ ఓపెనర్గా అంచనా వేస్తున్న నేపధ్యంలో పండితుడు చెప్పిన ఈ జోస్యం అభిమానులను సంతోషపెట్టేదే అని చెప్పాలి. మరోవైపు జోస్యం ఫలించి ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిస్తే ఈ సినిమాలో తొలిసారి విలన్గా నటిస్తున్న జూ.ఎన్టీయార్(Jr NTR) బాలీవుడ్ కెరీర్ కూడా మలుపు తిరగడం ఖాయంగానే కనిపిస్తోంది. -
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ని వదలని సినిమా కష్టాలు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ల కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్(Game Changer) ని వరుసపెట్టి సినిమా కష్టాలు వెన్నాడుతున్నాయి. కొన్ని చోట్ల బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం లాంటి దేశీయ కష్టాల నుంచి అంతర్జాతీయ కష్టాలు కూడా ఈ సినిమాకి తప్పడం లేదు. ఈ సంవత్సరంలో తొలి భారీ–టికెట్ చిత్రంగా విడుదల అవుతున్న గేమ్ ఛేంజర్ రూ.500 కోట్ల కనీస టార్గెట్తో వస్తోంది. ఈ సినిమా రాబోయే చిత్రాల విడుదలకు టార్గెట్ సెట్ చేస్తుందని భావిస్తున్న నేపధ్యంలో చుట్టుముడుతున్న కష్టాలు కలెక్షన్స్పై సందేహాలు కలిగిస్తున్నాయి. (చదవండి: తెలంగాణలో 'గేమ్ ఛేంజర్' టికెట్ల పెంపుపై విమర్శలు)మన దేశంలో, ఈ చిత్రం దాదాపు రూ. 25 కోట్లతో తొలి రోజు ప్రారంభమవుతుందని ఇది రామ్ చరణ్ సోలో చిత్రానికి అతిపెద్ద ఓపెనింగ్గా నిలుస్తుందని అంచనా. మరోవైపు భారతదేశం వెలుపల తెలుగు చిత్రాలకు అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా మారిన నార్త్ అమెరికా లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లపై ఆశపెట్టుకుంది. (చదవండి: 'ఆ సాంగ్ చేసినందుకు సిగ్గుపడాలి'.. ఊర్వశి రౌతేలాపై విమర్శలు!)అయితే కంటెంట్ కన్వర్షన్లో జాప్యం కారణంగా, నార్త్ అమెరికాకి సమయానికి కంటెంట్ అప్లోడ్ వైఫల్యానికి దారితీసే పరిస్థితి ఏర్పడిందట. హిందీ తమిళ వెర్షన్లు ఆ భాషల్లో షోలను నిర్ధారిస్తూ, సమయానుకూలంగా అప్లోడ్ చేశారు. అయితే, ఆలస్యం కారణంగా యునైటెడ్ స్టేట్స్లోని అతిపెద్ద థియేటర్ చైన్లలో ఒకటైన ఎఎమ్సి సినిమా కోసం బుకింగ్లను నిలిపివేసిందని తెలుస్తోంది. ప్రారంభ ట్రెండ్ల ప్రకారం, ఉత్తర అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్ షోల టిక్కెట్ల విక్రయాలు 8,5లక్షల్ని దాటాయి పదిలక్షల చేరుకోవడానికి దగ్గరలో ఉన్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల కారణంగా, మొత్తం అమ్మకాలు 7.5లోపునకు పడిపోయాయని సమాచారం. అయితే ఇప్పటికీ మించిపోయింది లేదనీ కంటెంట్ సమయానికి సినిమా థియేటర్లకు చేరుకుంటే, సినిమా ఇప్పటికీ 10లక్షల మార్కును దాటగలదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. పులి మీద పుట్రలా మరోవైపు కొనసాగుతున్న దావానలం గేమ్ ఛేంజర్ ఓవర్సీస్ రికార్డ్ కలెక్షన్స్ ఆశల్ని దహించే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే కార్చిచ్చు కారణంగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో ఈ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. రేపు(జనవరి 10) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.