‘కొత్త’ కార్యాలయాల కోసం కసరత్తు
– సింగరేణి భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే జలగం
– అధికారుల నివాసాలకు సింగరేణి క్వార్టర్లు
కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా ఏర్పాటవుతున్న తరుణంలో జిల్లా కార్యాలయాల కోసం సింగరేణి భవనాలను స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆదివారం పరిశీలించారు. ఆర్డీఓ రవీంద్రనాథ్, డీఎస్పీ సురేందర్రావులతో కలిసి ఇప్పటికే రెవెన్యూ అధికారులు గుర్తించిన భవనాలను, కలెక్టరేట్ కోసం కేటాయించిన సింగరేణి పీఅండ్పీ బిల్డింగ్ను సందర్శించారు. త్రీ ఇంక్లైన్లో సింగరేణి అధికారుల క్వార్టర్లను పరిశీలించి..కలెక్టర్, ఎస్పీ, జేసీలకు కావాల్సిన నివాస భవనాలను కేటాయించేందుకు అనుకూలంగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పీఅండ్పీ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలం కలెక్టరేట్ విస్తరణ కోసం ఉపయోగపడుతుందని, మీటింగ్ హాల్కోసం మార్పులు చేయాలని, వాహనాల పార్కింగ్ కోసం పాత పీఅండ్పీ భవనం అనువుగా ఉంటుందని అధికారులకు సూచించారు. సీటీసీ భవనం వెనుక ఉన్న ఖాళీ స్థలం కార్యాలయాల ఏర్పాటు కోసం పనిచేస్తుందన్నారు. జిల్లా ఏర్పాటుకు సమయం ఆసన్నమైనందున రెవెన్యూ, పోలీస్ అధికారులు త్వరితగతిన ఏర్పాట్లను పూర్తి చేయాలని, ప్రజలకు చేరువలో పరిపాలనా యంత్రాంగం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధర్నాచౌక్కు అనువైన స్థలాన్ని సేకరించాలన్నారు. జిల్లా కార్యాలయాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉండేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో వన్టౌన్ సీఐ శ్రీనివాస్, సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.