Advertisement
Sitaramapuram
-
నరసాపురం లేసులు.. ఒలింపిక్స్ వరకూ అల్లుకున్నాయి..
పారిస్ అంటే ఫ్యాషన్కు పుట్టినిల్లు. కానీ, మన తెలుగు మహిళలు ఆ ఫ్యాషన్ కేంద్రానికే ఫ్యాబ్రిక్స్ ఎగుమతి చేస్తున్నారు. పారిస్లో జరగనున్న ఒలింపిక్స్లో క్రీడాకారులు ఉపయోగించే లేస్ వస్త్రాలు, దిండ్లు, తువాళ్లు మన నరసాపురం నుంచి తయారయ్యి విమానం ఎక్కాయి. ఇదీ మన ఘనత.సూది మొనకు దారం తగిలించి చకచకా వారి మునివేళ్లు కదిలించారంటే చాలు వన్నెచిన్నెల లేసులు క్షణాల్లో కళ్లముందు ఆవిష్కృతమవుతాయి. ఔరా అనిపించేలా హ్యాండ్ మేడ్ ఉత్పత్తులు సిద్ధమవుతాయి. అబ్బురపరిచే అల్లికలతో గోదావరి జిల్లాలకు ఖండాంతర గుర్తింపు తెచ్చిన అతివల హస్త నైపుణ్యం ఇప్పుడు పారిస్లో జరగనున్న ఒలింపిక్స్ వరకూ చేరింది. ఆ ఘనతను సాధించింది జిల్లా, నరసాపురం రూరల్కి చెందిన మారుమూల గ్రామం సీతారామపురం.లేసుల పరిశ్రమబ్రిటిష్ కాలంలో నరసాపురం జలరవాణాకు‡కేంద్రంగా ఉండేది. అప్పట్లో ఇక్కడకు వచ్చిన క్రిస్టియన్ మిషనరీ సంస్థలు పేద మహిళలకు ఉపాధిగా లేసు అల్లికలు నేర్పించారు. కాలక్రమంలో ఈ పని పెద్ద పరిశ్రమగా విస్తరించింది. పేద, ధనిక తేడా లేకుండా తీరిక వేళల్లో కాలక్షేపంగా అల్లికలు సాగిస్తుంటారు. నరసాపురం కేంద్రంగా కోనసీమ, రాజ మహేంద్రవరం, భీమవరం ్రపాంతాల్లో వేలాది కుటుంబాలు ఈ హస్తకళ ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి. ఈ పనిలో ఉన్న మహిళలకు తోడ్పాటును అందించేందుకు 2005లో నాటి సి.ఎం. వైఎస్ రాజశేఖరరెడ్డి సీతారాంపురం వద్ద లేస్పార్క్ను ్రపారంభించారు. టవల్స్, టేబుల్ క్లాత్స్, లంచ్ మ్యాట్స్, క్రోషే బ్యాగ్స్, డెకో కుషన్స్, బీచ్ కలెక్షన్స్ తదితర మన హ్యాండ్ మేడ్ లేసు ఉత్పత్తులకు విదేశాల్లో మంచి ఆదరణ ఉంది. నరసాపురం పరిసరాల్లో లేసు ఉత్పత్తులను ఎగుమతి చేసే కంపెనీలు వంద వరకు ఉన్నాయి. మారుతున్న ఫ్యాషన్, అభిరుచులు, ఆర్డర్లకు అనుగుణంగా తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటూ ట్రెండింగ్లో ఉంటూ చైనా, వియత్నాం దేశాలకు గట్టిపోటీనిస్తున్నారు గోదావరి జిల్లాల మహిళలు.. ఎంతో గర్వంగా ఉంది పారిస్ ఒలింపిక్స్కు మన లేసు, క్లాత్తో తయారుచేసిన ఉత్పత్తులు అందించే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. ఈ లేస్ ఇండస్ట్రీని ప్రభుత్వాలు గుర్తించి వ్యవస్థీకృతం చేస్తే విదేశాల్లో మనదేశ మహిళల నైపుణ్యానికి గుర్తింపు వస్తుంది. ఒలింపిక్స్కు పని చేసే అవకాశాన్ని మహిళలు ఎంత సంతోషంగా స్వీకరించారంటే ప్రతి ఒక్కరూ తామే గోల్డ్మెడల్ సాధించినంత ఆనందంగా ఉన్నారు.– కలువకొలను రామ్చంద్రుడు, జేజే ఎక్స్పోర్ట్స్ అధినేతపదేళ్లుగా లేసు అల్లికలుమా చిన్నతనంలో మా అమ్మ, పిన్నమ్మలు అంతా కూడా లేసు అల్లికలు అల్లేవారు. నాకు అçప్పటి నుంచి అల్లికలపై అవగాహన ఉంది. గత 10 ఏళ్లుగా లేసు అల్లికలు చేస్తున్నాను. పిల్లలిద్దరినీ కూడా ఉన్నత చదువులు చదివించుకోగలుగుతున్నాం. ఇంట్లో పనులు అయ్యాక ఖాళీ సమయంలో లేసు అల్లికల ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. – పులపర్తి లక్ష్మికుమారి, మొగల్తూరుపారిస్ వేదిక మీద మన లేసుఈ నెల 26 నుంచి పారిస్ వేదికగా ్రపారంభం కానున్న ఒలింపిక్స్ క్రీడా సంగ్రామంలో నరసాపురం ఉత్పత్తులు కొలువుదీరే అవకాశం దక్కింది. సీతారాంపురంలోని జేజే ఎక్స్పోర్ట్స్ సంస్థ కేంద్రం పరిధిలోని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండీక్రాప్ట్స్ (ఈపీసీహెచ్) ద్వారా ఈ అర్డర్ సాధించినట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు. దాదాపు వంద రకాల డిజైన్లు పంపిస్తే వాటిలో ఆరు డిజైన్లను నిర్వాహకులు ఎంపిక చేశారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చే సందర్శకులకు గుర్తుండిపోయే విధంగా ఒలింపిక్స్ థీమ్, లోగోలతో లేస్, ఫ్యాబ్రిక్లను ఉపయోగించి టవల్స్, డెకో కుషన్స్, బీచ్ కలెక్షన్స్, క్రోషే మ్యాట్స్ తదితర హ్యాండ్ మేడ్ ఉత్పత్తులను డిజైన్ చేసి సిద్ధం చేసి పారిస్కి పంపారు. త్వరలో మన లేసు ఉత్పత్తులు ఒలింపిక్స్ క్రీడాకారులతో పాటు సందర్శకుల చేతుల్లోకి చేరనున్నాయి. తమ ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు దక్కడం పట్ల ఈ ్రపాంత మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు– విజయ్కుమార్ పెనుపోతుల, సాక్షి, భీమవరం.ఫొటోలు : సవరం కృష్ణానందం -
కౌలురైతును కాటేసిన కరెంట్
సీతారామపురం : ఆయనకు సెంటు పొలం లేదు. ఆస్తిపాస్తులు లేని నిరుపేద కుటుంబం. ఈ నేపథ్యంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సేద్యం చేస్తూ, వచ్చే అరకొర ఫలసాయంతో బతుకుబండి లాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనను కరెంట్ కాటేసింది. కానరాని లోకాలకు తీసుకెళ్లిపోయింది. విద్యుదాఘాతానికి గురై పొలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సీతారామపురంలోని పడమటివీధికి చెందిన ఆకుల రామయ్య(49)కు భార్య నాగేశ్వరమ్మ, పదహారేళ్ల కుమారుడు ఉన్నారు. వీరికి సెంటు పొలం కూడా లేకపోవడంతో రామయ్య నాలుగేళ్లుగా 4 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్నాడు. రూ.17 వేల చొప్పున కౌలు చెల్లిస్తున్నాడు. ప్రస్తుతం ఆ భూమిలో కొంత మేర సజ్జ, వరి పంట సాగు చేస్తుండగా, మిగిలిన భూమిని సాగుకు సిద్ధం చేస్తున్నాడు. ఈ క్రమంలో పొలంలోని విద్యుత్ మోటారు మరమ్మతులకు గురైంది. దానికి మరమ్మతులు చేయించేందుకు మంగళవారం మెకానిక్ను పొలంలోకి తీసుకెళ్లాడు. మరమ్మతుల నేపథ్యంలో పొలం పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఆపారు. పని పూర్తయిన తర్వాత రామయ్య ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. అయితే ఆన్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు వైర్లు త గలడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో సీతారాంపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఖాకీల పడగ నీడలో..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పోలీసుల దాష్టీకంతో ఆ ఎనిమిది పల్లెలు క్షణ క్షణం భయంతో వణికిపోతున్నాయి. మగవాళ్లందరూ ఊళ్లలోంచి పారిపోవటంతో వృద్ధులు, మహిళలు, పిల్లలు బితుకుబితుకుమంటూ క్షణమొక యుగంలా బతుకుతున్నారు. కాకరాపల్లిలో ఈస్టుకోస్ట్ థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వత్తాసు పలుకుతున్న కాంగ్రెస్ సర్కార్ ఆదేశాల మేరకు పోలీసులు గత నెల 31న అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఖాకీల పడగ నీడలో..ఇళ్లలోకి చొరబడి పలువురిని అరెస్ట్ చేసినప్పటి నుంచి హనుమంతనాయుడు పేట, ఆకాశలక్కవరం. బాలానాయుడు పేట, పోతినాయుడు పేట, యామలపేట, నవాబుపేట, సీతారామపురం(టెంకపేట), శీరపుపేట గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. పస్తుతం థర్మల్ విద్యుత్ ప్లాంట్కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరాహార దీక్షలు మాత్రమే జరుగుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులేవీ లేవు. అయినా ఎందుకు అరెస్ట్లు చేస్తున్నారో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా, హనుమంతునాయుడు పేటకు చెందిన శీరపు నరసింహమూర్తి, దల్ల చిన్న ఎర్రయ్య, కొయ్య ప్రసాదరెడ్డి, ఆకాశలక్కవరం గ్రామానికి చెందిన కప్ప గవర్రాజు, లింగూడు నాగేశ్వరావు, బాలానాయుడు పేటకు చెందిన బుడ్డెపు తేజారావు, నీలాపు అప్పలస్వామిలను 31 అర్ధరాత్రి అరెస్ట్ చేసి మరుసటి రోజు కోర్టులో హాజరు పరిచారు. వీరికి గురువారం బెయిల్ రాగా జైలు నుంచి బయటకు రాగానే పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో థర్మల్ గ్రామాల్లో భయోత్పాత్పం సృష్టించటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టమవుతున్నది. పోలీసోళ్లు భయపెడుతున్నరు... పోలీసులు అరెస్ట్లు చేసిన గ్రామాలతోపాటు మరో ఐదు గ్రామాల్లో ‘సాక్షి ప్రతినిధి’ గురువారం పర్యటించారు. ఏ గ్రామంలోనూ యువకులు కనిపించలేదు. మహిళలు, వృద్ధులు దీనస్థితిలో ఇళ్ల ముందు, గోడల చాటున కూర్చొని కనిపించారు. ఎవరిని కదిలించినా ఒకటే మాట. ‘పోలీసోళ్లు ఇష్టమొచ్చినట్లు భయపెడుతున్నరు. బయటకు పోవాలంటేనే భయంగా ఉంది. మొగోళ్లు ఊళ్లు వదిలి వె ళ్లిపోయారు. పోలీసోళ్లు వెళితేనే తిరిగొస్తారు. గొడ్డూ గోదా ఎలాగున్నాయో చూడండి. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు’ అని పలువురు మహిళలు వాపోయారు. అడుగడుగునా పోలీసులు... సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం రైల్వేగేట్ వద్ద నుంచి జగన్నాథపురం గ్రామం వరకు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో రోడ్డు వెంట పోలీసులు పహారా కాస్తూ కనిపించారు. ప్రతి ఊరి పొలిమేర వద్ద గస్తీ తిరుగుతున్నారు. ఎవరు వెళ్లినా.. ఎందుకొచ్చారంటూ కొరకొరగా చూస్తున్నారు. హనుమంతనాయుడుపేటలోకి వెళ్లేందుకు సాక్షి బృందం పొలిమేర వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాల ఎదురుగా వాహనాన్ని ఆపింది. అయితే పోలీసులు ఇక్కడ ఆపేందుకు వీలులేదంటూ ఊరిబయటకు పంపేశారు. అక్కడ ఎవరూ నిలబడేందుకు వారు అంగీకరించలేదు. పాఠశాల గదులన్నీ పోలీసుల బ్యాగులతో నిండిపోయాయి. దీంతో టీచర్లు, పిల్లలు ఒకే హాలులో కిక్కిరిసి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా కూర్చున్నారు. తమ వాహనాలను రోడ్లపైనే నిలబెట్టారు. అక్కడి పరిస్థితులు చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. ప్లాంట్ వాహనాలకు ప్రత్యేక బందోబస్తు తో లోపలికి తీసుకెళుతున్నారు. ప్రభుత్వ అధికారులు ప్లాంట్లోకి వెళ్లి అక్కడివారికి భరోసా ఇచ్చి రావటం కనిపించారు. లోపలికి వెళ్లేందుకు సాక్షి బృందాన్ని అనుమతించలేదు. సాక్షి ప్రతినిధి సంస్థ సీఈవోకు ఫోన్ చేస్తే ఒకసారి రింగయింది. రెండోసారి చేస్తే స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ప్లాంట్ గేట్ ముందు పోలీసులు ప్రత్యేక టెంట్ వేసుకుని కాపలా కాస్తున్నారు. నిజానికి ప్లాంట్ వద్దకు రెండేళ్లుగా ఉద్యమకారులు, బాధితులు వెళ్లనేలేదు. పైగా సంస్థ వారు తమకు కేటాయించిన స్థలంలో నిలువెత్తు గోడలు నిర్మించారు. ఆ గోడల చుట్టూ పోలీసులు ఇనుప ముళ్ల కంచెలు వేశారు. ఏ విధమైన ఆందోళనలు లేనప్పటికీ ఈ స్థాయిలో పోలీసులను ఎందుకు మోహరించారన్నది తెలియటం లేదు. చిన్న సంఘటనకు అరెస్ట్లు.. భారీ సంఖ్యలో పోలీసులా!? వాస్తవానికి ఇటీవల కొంతమంది ఆందోళనకారులు, భారీ వాహనాలు గ్రామాల్లోని రోడ్లపై నుంచి ప్లాంట్ ఆవరణలోకి పోకుండా అడ్డుకున్నారు. రహదార్లు పూర్తిగా కుంగిపోతుండటంతో ఈ చర్య చేపట్టారు. దీంతో సంస్థ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే తక్షణం వందల సంఖ్యలో పోలీసులు దిగిపోయారు. బెయిల్పై విడుదలైన నిందితులు జైలు గోడలు దాటగానే మళ్లీ అరెస్ట్డిసెంబర్ 31న పోలీసులు అరెస్ట్ చేసిన ఏడుగురు కోర్టులో గురువారం బెయిల్ తీసుకున్నారు. బెయిల్ కాగితాలను నరసన్నపేటలోని సబ్జైలుకు తీసుకువెళ్లిన కానిస్టేబుల్ వాటిని జైలర్కు ఇవ్వగానే నిందితులను విడుదల చేశారు. కానీ వారు జైలు గోడ దాటగానే అక్కడే మధ్యాహ్నం నుంచి కాపుకాచి ఉన్న ఎస్ఐతోపాటు మరికొందరు పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఈ సంఘటన రుజువు చేస్తున్నది. మా మొగోళ్లెప్పుడొత్తారో.. ‘పోలీసోళ్లు పోవడం లేదు.. మా మొగోళ్లు ఊళ్లోకి రావడం లేదు.. ఈళ్లెప్పుడు పోతారో.. ఆళ్లెప్పుడు వత్తారో.. ఏం చేత్తాం... ఎవరికి చెప్పుకుంటాం.. ఎవరికీ ఈ కష్టం రాకూడదయ్యా’..అని హనుమంతునాయుడు పేటకు చెందిన పలువురు మహిళలు వాపోయారు.