specified bank notes
-
రద్దయిన నోట్ల వివరాలను తెలపండి: ఆర్బీఐ
ముంబై : రద్దయిన నోట్ల డిపాజిట్లకు సంబంధించి మొత్తం వివరాలు తమకు అందించాల్సిందిగా బ్యాంకులను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశించింది. రద్దయిన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే గడువు నేటితో ముగియనుండటంతో ఆర్బీఐ ఈ ఆదేశాలు జారీచేసింది. గడువు ముగియనున్న డిసెంబర్ 30వ తేదీతో సహా బ్యాంకు ఖాతాల్లో జమ అయిన పాత నోట్ల వివరాలన్నింటిన్నీ తమకు ఈ-మెయిల్ చేయాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయా బ్యాంకులు తమ బ్రాంచ్ కార్యాలయాల నుంచి రద్దయిన నోట్ల వివరాలను సేకరించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అదేవిధంగా జిల్లా సహకార సెంట్రల్ బ్యాంకులు(డీసీసీబీ) మినహా మిగతా బ్యాంకు శాఖలన్నీ రద్దయిన నోట్లను 2016 డిసెంబర్ 31 వరకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆఫీసులల్లో లేదా కరెన్సీ చెస్ట్స్(నోట్లను నిల్వ ఉంచే హౌజ్లు)లో జమచేసుకోవాలని ఆర్బీఐ ఆ ప్రకటనలో తెలిపింది. 2016 డిసెంబర్ 31 నుంచి బ్యాంకు నగదు నిల్వల్లో రద్దయిన నోట్లు భాగం కాకూడదని ఆదేశించింది. 2016 నవంబర్ 10 నుంచి 14 వరకు డీసీసీబీలలో డిపాజిట్ అయిన రద్దయిన నోట్లకు తదుపరి ఆదేశాలు జారీచేస్తామని పేర్కొంది. బ్రాంచ్ల నుంచి సేకరించిన రద్దయిన నోట్లను నిల్వ చేసుకోవడానికీ బ్యాంకులు తగిన కరెన్సీ చెస్ట్స్(నోట్లను నిల్వ ఉంచే హౌజ్లు) లను ఏర్పాటుచేసుకోవాలని సూచించింది. కాగా రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం రూ.14లక్షల కోట్ల పాత నోట్లు డిపాజిట్లు నమోదయ్యాయి. మొత్తం రద్దయిన నోట్లలో ఇది 90 శాతం. నవంబర్ 8 మొత్తం 86 శాతం చలామణిలో ఉన్న రూ.15.4 లక్షల కోట్ల విలువైన రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. ఈ నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు డిసెంబర్ 30 వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే. -
‘ఆర్బీఐ షాకింగ్ నిర్ణయం..ఇక డిపాజిట్లకు చుక్కలే’
-
‘ఆర్బీఐ షాకింగ్ నిర్ణయం..ఇక డిపాజిట్లకు చుక్కలే’
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్బీఐ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పాత నోట్లు డిపాజిట్ చేయడంపై కొత్త నిబంధన తీసుకొచ్చింది. రూ.ఐదువేల కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలంటూ నిబంధన పెట్టింది. దీని ప్రకారం ఓ వ్యక్తి ఒక్కసారి మాత్రమే రూ.5వేల కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, గతంలో ఈ పాత నోట్లను ఎందుకు జమ చేయలేదని, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని వారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పి, అది వారిని సంతృప్తి పరిస్తేనే డిపాజిట్ తీసుకుంటారు. పెద్ద మొత్తంలో ఒకేసారి డిపాజిట్ చేసే అవకాశం ఇచ్చినప్పటికీ కేవైసీ పత్రాలు ఉంటేనే తీసుకోవాలని, లేదంటే కేవలం 50 వేలు మాత్రమే డిపాజిట్ చేసుకోవాలని కూడా ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. అలాంటి పరిస్థితి ఏర్పడిన ఖాతాలను అధికారులు ఒకసారి పునఃపరిశీలించాలని కూడా చెప్పింది. థర్డ్ పార్టీ ఖాతాలో డబ్బు వేయాలని భావించినప్పుడు వారి నుంచి అనుమతి తీసుకున్నట్లుగా ఆధారం చూపించే జమ చేయాల్సి ఉంటుందని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది.