మత్తు చల్లి మాయ
♦ శ్రీరామపురంలో రూ.21 వేల దోపిడీ
♦ స్వాముల వేషదారణలో తతంగం
వెంకటాచలం: ‘మీ ఇంట్లో పరిస్థితులు సరిగా లేవు. మీరు ఏం చేసినా కలిసి రావడంలేదు. గాలి(దెయ్యం) కారణంగా మీరు కష్టాలు అనుభవిస్తున్నారు. ఒక్క పూజ ద్వారా మీ ఇంట్లో పరిస్థితిని మార్చేస్తాం.’ అని అమాయకులను నమ్మించారు. స్వాముల ముసుగులో వచ్చిన ఇద్దరు పగటి వేషగాళ్లు అమాయకులపై మత్తు చల్లి రూ.21 వేలతో ఉడాయించారు. ఈ సంఘటన శ్రీరామపురంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలు.. శ్రీరామపురం హరిజనవాడకు చెందిన చెనగల రమణయ్య ఇంటికి ఇద్దరు స్వాములు వచ్చారు. రమణయ్య, అతని భార్య చెంగమ్మ అమాయకత్వాన్ని చూసి మీ ఇంటి పరిస్థితులు బాగాలేవని మాటల్లోకి దింపారు. మీ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని బాబా పూజతో వదిలించేస్తామని నమ్మబలికారు.
ఇంట్లో అరగంట పూజ చేస్తే దెయ్యం వదులుతుందని, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మీకు తోచినంత బాబాకు ఇవ్వాలని చెప్పారు. రమణయ్య, చెంగమ్మ, చిన్న కుమారుడు మాధవ్ మాత్రమే ఇంట్లో ఉండాలని మిగిలిన వారిని బయటకు పంపేశారు. పసుపులో మత్తుమంది కలిపి ఆ పసుపులో అంక్షింతలు కాలిపారు. డబ్బులు దాచుకునేచోట అక్షింతలు చల్లాలని మాధవ్కు చెప్పడంతో మాధవ్ టేబుల్ డెస్కు తాళాలు తీసి అందులో ఉన్న రూ.21 వేల నగదుపై చల్లాడు. ఇంతలో మాదవ్ మత్తులోకి జారుకోవడంతో రూ.21వేలతో మోసగాళ్లు అక్కడ నుంచి పరారయ్యారు. దేవుని గదిలో ఉన్న రమణయ్య దంపతులు పూజ చేస్తామన్న వ్యక్తులు ఎలా వెళ్లారని వెతుకుతుండగా అప్పటికే గ్రామం దాటి వెళ్లి పోయారు. చిన్న కుమారుడు మాధవ్ పెళ్లి కోసం తెచ్చిన నగదు ఎత్తుకెళ్లడంతో రమణయ్య కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.