talaq system
-
తలాక్ అంటే..? ఈ వివరాలు తెలుసా?
దివ్య ఖుర్ఆన్ ఇలా చెబుతోంది...తమ భార్యలను ముట్టుకోము అని ఒట్టు పెట్టుకునే వారికి నాలుగు నెలల గడువు ఉంటుంది. 2:226వివరణ: పండితుల ప్రకారం షరిఅత్ పరిభాషలో దీనిని ‘ఈలా’ అని అంటారు. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ సుహృద్భావ పూర్వకంగా ఉండవు. అపశ్రుతులు ఏర్పడుతూనే ఉంటాయి. కానీ ఉభయలు చట్టబద్ధంగానైతే దాంపత్య బంధంలోనే ఉంటూ క్రియాత్మకంగా ఇద్దరు భార్యాభర్తలు కానట్టుగానే వేరుగా మసులుకునేటటువంటి విధానాన్ని దైవ శాసనం (షరిఅత్) ఇష్టపడదు. ఇలాంటి అపసవ్యత కొరకు అల్లాహ్ నాలుగు నెలలు గడువు నిర్ణయించాడు. ఈ మధ్యకాలంలో వారు తమ సంబంధాలను సరి చేసుకోవాలి లేదా దాంపత్య బంధాన్నైనా తెంచి వేయాలి. అప్పుడైనా ఆ ఇరువురు పరస్పరం స్వేచ్ఛ ఉంది తమకు కుదురుగా ఉన్న వారితో పెళ్లి చేసుకోగలరు. తన భార్యతో దాంపత్య సంబంధం కలిగి ఉండనని భర్త ఒట్టు పెట్టుకున్న సందర్భానికే ఈ ఆదేశం వర్తిస్తుంది. పోతే ఒట్టు పెట్టుకోకుండా భార్యతో సంబంధాలను తెంచుకునే సందర్భంలోనయితే– అలా ఎంత కాలం సాగినా ఈ ఆదేశం దానికి అతకదని ఈ (ఆయత్) వాక్యం ఉద్దేశం.మరొక విషయం ఏమిటంటే ప్రమాణం చేసినా, చేయకపోయినా రెండు సందర్భాల్లోనూ బంధాన్ని విరమించుకుంటే దానికి గడువు కాలం ఈ నాలుగు మాసాలే. ఈ ఆదేశం కేవలం ఏవైనా మనస్పర్ధల వల్ల ఏర్పడే సంబంధాల ప్రతిష్టంబనకు వర్తిస్తుంది. కానీ మరేదైనా కారణంగా భర్త భార్యతో శారీరక సంబంధాన్ని విరమించుకుంటే సాధారణ సంబంధాలు సుహృద్భావ పూర్వకంగా కొనసాగే పక్షంలో ఈ ఆదేశం వర్తించదు. అయితే కొందరు ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం భార్యాభర్తల మధ్య శారీరక సంబంధాన్ని తెంచివేసే ఏ ప్రమాణమైన సరే అది ఇలా పరిగణించబడుతుంది. ఇది నాలుగు నెలలకు పైగా నిలవరాదు. ఇష్టంలేని పక్షంలోనైనా ఇష్టపూర్వకంగానైనా సరే.ఒకవేళ వారు వెనక్కి మరలినట్లయితే అల్లాహ్ క్షమించేవాడు, దయ చూపేవాడు: 2:227కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం ఈ గడువు లోపల తమ ప్రమాణాన్ని భగ్ననపరిచి తిరిగి దాంపత్య సంబంధాలను పునరుద్ధరించుకుంటే వారికి ప్రమాణ భంగం చేసినందుకు ప్రాయశ్చిత్తం లేదు. అల్లాహ్ అట్టే క్షమించి వేస్తాడు.మరికొంతమంది పండితుల అభిప్రాయంలో ప్రమాణభంగానికి ప్రాయశ్చిత్తం చెల్లించవలసి ఉంటుంది. వారనేది ఏమిటంటే దేవుడు ‘గఫూరుర్రహీం’ (మన్నించేవాడు కరుణించేవాడు) అన్న విషయానికి భావం ప్రాయశ్చిత్తం మాఫీ జరిగిందని కాదు మీ ప్రాయశ్చితాన్ని స్వీకరిస్తాడని, సంబంధ విరామ కాలంలో ఇరువురు పరస్పరం చేసుకున్న అన్యాయాన్ని మన్నించి వేయడం జరుగుతుందని మాత్రమే.– మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
తొలి ‘తలాక్’ కేసు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముస్లిం మహిళలకు వివాహ భద్రతను కల్పించే చట్టం అమల్లోకి వచ్చిన తరువాత తెలంగాణలో తొలి కేసు కరీంనగర్ మహిళా పోలీస్స్టేషన్లో నమోదైంది. ఈ ఏడా ది జూలై 31న చట్టం అమలులోకి రాగా.. సరిగ్గా 15 రోజులకు తన భర్త అదనపు కట్నం తేలేదనే సాకుతో ట్రిపుల్ తలాక్ చెప్పినట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు ఆగస్టు 14న ఇన్స్పెక్టర్ పి.దామోదర్రెడ్డి కేసు నమోదు చేశారు. పెళ్లయిన మూడేళ్లకే... కరీంనగర్ జిల్లా ఆదర్శనగర్కు చెందిన ముస్లిం మహిళకు 2016లో జగిత్యాలకు చెందిన మీర్ ఖాజా అఫ్సరుద్దీన్తో వివాహమైంది. దుబాయిలో డ్రైవర్గా పనిచేస్తున్న అఫ్సరుద్దీన్కు వివాహం జరిపించారు. మూడు నెలల తర్వాత భార్యను దుబాయికి తీసుకెళ్లాడు. అక్కడ భర్తకు చేదోడుగా ఈ మహిళ కూడా ఉద్యోగం చేసింది. వీరికి 8 నెలల వయసున్న బాబు ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్లో భార్యతో కలసి అఫ్సరుద్దీన్ జగిత్యాల వచ్చాడు. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం అఫ్సరుద్దీన్, అతని కుటుంబసభ్యులు వేధించడం ప్రారంభించారు. రూ.10 లక్షలు కట్నంగా తేవాలని, లేదంటే ‘తలాక్’చెబుతామని బెదిరించారు. కట్నం తేవడానికి మహిళ ఒప్పుకోకపోవడంతో ‘ముమ్మారు తలాక్’ చెప్పి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ధైర్యంగా ముందుకొచ్చిన ముస్లిం మహిళ మూడేళ్లు కాపురం చేసి అదనపు కట్నం తేలేదనే కారణంగా ట్రిపుల్ తలాక్ చెప్పి బయటకు పంపడంతో సదరు మహిళ ఆగస్టు 14న కరీంనగర్ మహిళా పోలీస్స్టేషన్లో అఫ్సరుద్దీన్, ఇతర కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 498(ఎ), సెక్షన్–4 ఆఫ్ డీపీ యాక్ట్, సెక్షన్ 4 ఆఫ్ ముస్లిం మహిళ వివాహ భద్ర త హక్కు చట్టం కింద కేసులు నమోదు చేశారు. అఫ్సరుద్దీన్ను ఆగస్టు 27న రిమాండ్ చేసి, కుటుంబసభ్యులకు అరెస్టు నోటీస్ జారీ చేశారు. కాగా కరీంనగర్లో నమోదైన ఈ తలాక్ కేసులో చార్జిషీటు దాఖలు చేసేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్కు ప్రతిపాదన పంపినట్లు ఇన్స్పెక్టర్ ‘సాక్షి’కి తెలిపారు. కమిషనర్ అనుమతి రాగానే చార్జిïÙటు దాఖలు చేస్తామని చెప్పారు. మూడేళ్ల వరకు జైలు, జరిమానా ముస్లిం వర్గానికి చెందిన భర్త తన భార్యకు నోటి మాటగా గానీ, రాత ద్వారా గానీ, ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా లేదా ఇంకేరకంగానైనా ‘తలాక్’ను వాడడం అక్రమం అని ముస్లిం మహిళ వివాహ భద్రత చట్టం–2019 (యాక్ట్ నంబర్ 20 ఆఫ్ 2019) చాప్టర్–2లో పొందుపరచబడింది. ఎవరైనా ముస్లిం భర్త ‘తలాక్’పదాన్ని అతని భార్యపై ప్రయోగిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. తలాక్ చెప్పడంతో చట్టాన్ని ఆశ్రయించా నా వివాహం సమయంలో సంప్రదాయ పద్ధతిలో లాంఛనాలు అందించాం. మా తల్లిదండ్రులు వరకట్నంతోపాటు బంగారం, ఫర్నిచర్ ఇచ్చారు. మరో పది లక్షల రూపాయలు తీసుకురావాలని నా భర్త మీర్ఖాజా అఫ్సరుద్దీన్తోపాటు అతని కుటుంబ సభ్యులు వేధించారు. అడిగిన కట్నం తేనందుకు ముమ్మారు తలాక్ చెప్పడంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాను. చట్ట ప్రకారం నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. – బాధిత మహిళ తెలంగాణలో తొలి కేసు ముస్లిం మహిళ ఫిర్యాదు మేరకు మూడుసార్లు తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణించి ‘ముస్లిం మహిళ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్) యాక్టు – 2019’ప్రకారం కేసు నమోదు చేశాం. ట్రిపుల్ తలాక్ యాక్టు అమలులోకి వచి్చన తర్వాత నమోదైన మొదటి కేసు ఇది. ముస్లిం వర్గానికి చెందిన బాధిత మహిళలు తమకు అండగా తీసుకొచ్చిన చట్టాలను వినియోగించుకుంటే న్యాయం చేసేందుకు మా వంతు కృషి చేస్తాం. – పి. దామోదర్ రెడ్డి, మహిళా పోలీస్స్టేషన్, కరీంనగర్ -
తలాక్పై దుష్ప్రచారం వివక్షే..!
సందర్భం తలాక్ ముసుగులో ముస్లిం మహిళల స్థితిగతులను సంస్కరించదలుస్తున్న ఎవరైనా సరే దేశంలోని భర్తలు వదిలేసిన 23 లక్షల మంది మహిళల బాధలను పట్టించుకుంటే మంచిది. వీరిలో 19 లక్షలమంది హిందూ సోదరీమణులే అనేది మర్చిపోవద్దు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ కలసి ప్రజల మనస్సులను ఏమార్చడంలో ఆరితేరిపోతున్నారు ‘గత 65 ఏళ్లుగా ముస్లిం సమాజంలో సంస్కరణల లేమి వల్ల ముస్లిం మహిళలు సామాజికంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు’ అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటూ 2016 అక్టోబర్ 7న సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ అక్టోబర్ 24న బుందేల్ఖండ్లో పరివర్తన్ మహార్యాలీలో ప్రసంగిస్తూ ‘ఎవరైనా ఫోన్ ద్వారా తలాక్, తలాక్, తలాక్ అని చెప్పగానే వారి జీవితం ధ్వంసం కావడానికి నా ముస్లిం సోదరిలు చేసిన నేరం ఏమిటి?’ అని ప్రశ్నించారు. ఇతర మతాలకు చెందిన సోదరీమణులతో పోలిస్తే ముస్లిం మహిళల స్థితి దుర్భరంగా ఉందని కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్, ప్రధాని ప్రసంగం ప్రకటిస్తున్నాయి. కానీ జనాభా లెక్కలకు చెందిన మత సామాజిక బృంద వివాహ స్థితి, సెక్స్–2011 సి–3 పట్టిక మరొక విధంగా సూచి స్తోంది. హిందూ (86.2 శాతం), క్రిస్టియన్ (83 శాతం), ఇతర మతాల (85.8 శాతం) మహిళలతో పోల్చి చూస్తే వివాహ జీవితంలో కొనసాగుతున్న ముస్లిం మహిళల శాతం అత్యధికంగా 87.8 శాతం ఉంటోందని ఈ పట్టిక తెలిపింది. విడిపోయిన, భర్తలు వదిలేసిన మహిళల శాతం ముస్లింలలో కనిష్టంగా అంటే 0.49 శాతంగా ఉండగా హిందువులలో 0.69 శాతం, క్రైస్తవులలో 1.19 శాతం, ఇతర మతపరమైన మైనారిటీలలో 0.68 శాతంగా ఉంటూండటం గమనార్హం. వాస్తవాలు ఇలా ఉండగా మూడుసార్లు తలాక్ అనే అంశాన్ని ప్రభుత్వం, మీడియా సంచలనాత్మక ధోరణితో చూస్తూ ముస్లిం సమాజంలో తలాక్ విస్తృతస్థాయిలో ఉందని ప్రచారం చేస్తున్నట్లుంది. దేశంలో 34 కోట్ల మంది వివాహిత మహిళల్లో 9.1 లక్షల మంది మహిళలు విడాకులు తీసుకున్నారని, వారిలో ముస్లిం మహిళల సంఖ్య 2.1 లక్షలేనని సెన్సెస్ డేటా సూచిస్తోంది. విడాకులు తీసుకున్న మహిళల సంఖ్య హిందువులలో 0.22 శాతం, క్రైస్తవులలో 0.47 శాతం, ఇతర మతపరమైన మైనారిటీలలో 0.33 శాతంగా ఉండగా ముస్లిం మహిళల సంఖ్య కాస్త ఎక్కువగా 0.49 శాతం మేరకు ఉందని తెలుస్తోంది. ఇస్లాంలో రెండు రకాల విడాకులు ఉన్నాయి. భార్య విడాకులకు చొరవ చేస్తే ‘ఖులా’ అని భర్త విడాకులు ప్రతిపాదిస్తే ‘తలాక్’ అని అంటారు. ముస్లిం మహిళ తనకు తానుగా వివాహం రద్దు చేసుకునే హక్కును ఖులా కల్పిస్తోంది. సర్వే ప్రకారం ముస్లిం మహిళల విడాకుల్లో 59 శాతం ఖులా ద్వారా జరుగుతుండగా, 41 శాతం తలాక్ ద్వారా జరుగుతున్నాయని తెలుస్తోంది. మూడుసార్లు తలాక్ అనేది భర్త వైపు నుంచి జరిగే తలాక్కి చెందిన ఒక రూపం. హైదరాబాద్లో ‘ఖులా’ లేక ‘తలాక్’ అమలుపై అధికారం ఉన్న అయిదుగురు క్వాజీలను సర్వే నిర్వహించిన రచయితలు సంప్రదించారు. వారు చెప్పినదాని ప్రకారం 7 నుంచి 25 ఏళ్ల వారి అనుభవంలో 460 విడాకుల ఘటనలు జరగగా, 275 విడాకులు ఖులా రూపంలో, 162 విడాకులు తలాక్ రూపంలోనూ జరిగాయని, 23 విడాకులు మాత్రమే మూడుసార్లు తలాక్ రూపంలో చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. అంటే మూడుసార్లు తలాక్కి చెందిన ఘటనలు అరుదుగా జరిగాయన్నమాట. పైగా, అరుదుగానైనా సరే.. దురదృష్టవశాత్తూ చోటు చేసుకున్న అలాంటి విడాకుల సందర్భంలో కూడా ముస్లిం సమాజం చాలావరకు బాధితురాలి వైపునే నిలిచినట్లు దాఖలాలున్నాయి. సుప్రీంకోర్టు, ముస్లిం మహిళా చట్టం, గృహహింస చట్టం వంటి వాటి ద్వారా ముస్లిం మహిళలు న్యాయం పొందుతున్నారు కూడా. కాబట్టి నరేంద్రమోదీ, భారత ప్రభుత్వం అత్యంత స్వల్ప స్థాయిలో ఉన్న ఈ మూడుసార్లు తలాక్ బాధితుల సమస్యపట్ల ప్రదర్శిస్తున్న తీవ్ర ఆతృతను నిలిపివేసి, 4 కోట్ల 30 లక్షలమంది వితంతువులు, 23 లక్షలమంది విడాకులు తీసుకున్న మహిళల సమస్యలను చిత్తశుద్ధితో పట్టించుకుంటే మంచిది. అత్యున్నత స్థాయిలోని ప్రధానమంత్రి భార్య లేదా దారిద్య్రంలో చిక్కుకున్న కడు నిరుపేద భార్య.. ఎవరైనా సరే.. భర్త నుంచి వేరైపోయిన ప్రతి మహిళ పరిస్థితీ దుర్భరంగానే ఉంటుంది. తమ భర్తతోటే జీవించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ వారినుంచి ఒక్క పిలుపు వస్తే చాలని ఎదురు చూస్తుంటారు. గత 43 ఏళ్లుగా నరేంద్రమోదీతో కలసి జీవించనప్పటికీ, ఆయన శ్రీమతి యశోదాబెన్ మోదీ 2014 నవంబర్ 24న మీడియాతో మాట్లాడుతూ ‘ఆయన ఒక్కసారి పిలిస్తే చాలు తన వద్దకు వెళతాను’ అన్నారు. కానీ ఆమె భర్త ఎన్నడూ స్పందించలేదు. ప్రధానమంత్రి భార్య అయినా సరే.. భర్త వదిలివేస్తే ఆమెకు పాస్పోర్టు కూడా దొరకదు. 2015లో యశోదాబెన్ పాస్పోర్టు కోసం దరఖాస్తు చేస్తే దాన్ని తిరస్కరించారు. ఇలాంటి మహిళల బాధాకరమైన జీవితాలు చూసిన తర్వాత ఏ సోదరుడైనా తన సోదరి యశోదాబెన్లా జీవిం చాలని కోరుకుంటాడా? మూడుసార్లు తలాక్ ముసుగులో ముస్లిం మహిళల స్థితిగతులను సంస్కరించాలని ప్రయత్నిస్తున్న ఎవరైనా సరే దేశంలోని భర్తలు వదిలేసిన 23 లక్షల మంది మహిళల బాధలను కాస్త లోతుగా తెలుసుకుంటే మంచిది. వీరిలో 19 లక్షలమంది హిందూ సోదరీమణులే అనేది కూడా మర్చిపోవద్దు. కాబట్టి పడికట్టు మాటలకు దూరంగా, వాస్తవాలపై దృష్టి సారించి ప్రధాని మోదీ చేతల్లో చర్యలు చూపించాలి. అలాగే మైనారిటీలను ప్రత్యేకించి ముస్లింలను లక్ష్యంగా చేసుకోవటం మానుకోవాలి. (వ్యాసకర్త సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్ మొబైల్ : 98852 08187)