ఎవరి కోసం ఈ తంత్రం?
సాక్షి, అమరావతి / అమరావతి బ్యూరో : విజయవాడ కనకదుర్గ ఆలయంలో నియమ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి పూట తాంత్రిక పూజలు జరిగి 12 రోజులైంది. హైందవ సాంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిన ఈ అపచారంపై ఇప్పటికీ గోప్యత కొనసాగుతోంది. తాంత్రిక పూజలు ఎందుకు జరిగాయి? ఎవరి కోసం జరిగాయన్న అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ విచారణను సాగదీసేందుకు యత్నిస్తున్నారు.
అన్నీ జవాబులేని ప్రశ్నలే..
- పవిత్రమైన కనకదుర్గ గర్భగుడి చుట్టూ ప్రత్యేక భద్రతా వలయం ఉంటుంది. 24 గంటలూ సుశిక్షితులైన పోలీసు సిబ్బంది కాపలాగా ఉంటారు. అయినా ఏం జరిగిందో ,ఎవరు చేశారో తెలుసుకోవడానికి ఇన్ని రోజులు పడుతుందా?
- ఆలయమంతటా 24 గంటలూ సీసీ కెమెరాల నిఘా ఉంది. గర్భగుడి చుట్టూ కూడా సీసీ కెమెరాలున్నాయి. ఆ ఫుటేజిలను పరిశీలిస్తే దోషులెవరో తేలిపోతుంది కదా. అందులో ముఖ్యమైన క్లిప్పింగులు ఎందుకు బైటపెట్టడం లేదు. హా అర్ధరాత్రి పూట గర్భగుడిని తెరవాలంటే కొన్ని సాంప్రదా యాలు పాటించాలి. నియమనిబంధనలను అనుసరించాలి అవేవీ ఎందుకు పాటించలేదు.
- అర్ధరాత్రి తాంత్రిక పూజలు జరిగాయని అంగీకరిస్తూ ఈవోను బదిలీ చేశారు. కేవలం బదిలీతోనే ఎందుకు సరిపెడుతున్నారు? ఈ వ్యవహారంలో కేసు ఎందుకు నమోదు చేసి విచారణ ఎందుకు ప్రారంభించలేదు?
- ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నవారి కోసమే ఈ తాంత్రిక పూజలు జరిగినట్లు అనేక ఆరోపణలున్నాయి. దానికి బలం చేకూర్చే విధంగానే ఈ పరిణామాలన్నీ ఉండడం నిజం కాదా? హా మహిషాసురమర్థిని అలంకరణలో ఉన్న అమ్మవారిని అర్చకులు ఫొటో కూడా తీసి ఈవోకు పంపించారు. కానీ ఆమె ఆ ఫొటోను ఎవరికి పంపించారు?
- ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి లోకేష్ కోసమే తాము దుర్గగుడిలో తాంత్రికపూజలు చేశామని సన్నిహితుల వద్ద చెప్పాడంటున్న అర్చకుడు సృజన్ ఇంతకీ ఎక్కడ ఉన్నారు? ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా ఎందుకు పోయారు?
చంద్రబాబు కోసం గతేడాది ప్రత్యేక పూజలు
చంద్రబాబు క్షేమాన్ని కోరుతూ సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అర్చకు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీకి అనుకూలంగా ఉండే కొందరు అర్చక ప్రతిని ధుల పిలుపు మేరకు ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో రాష్ట్రంలోని దాదాపు అన్ని ఆల యాల్లో బాబు కుటుంబం ప్రయోజ నాలను ఉద్దేశించి పూజలు జరిగాయి. ఈ ఏడాది కూడా అలా ప్రత్యే క పూజలు జరిపాలని కార్యాచరణ రూపొందించారన్న ప్రచారం సాగుతోంది.
తాంత్రిక పూజలపై అనేక ఆధారాలు..
తాంత్రిక పూజల అంశాన్ని ప్రభుత్వం మొద ట్లో తీవ్రంగా బుకాయించింది. తాంత్రిక పూజ లు జరిగాయన్న ఆలయ పాలకమండలి సభ్యులపై సీఎం తీవ్రంగా మండిపడ్డారు. పాలకమండలిని రద్దు చేస్తానని హెచ్చరించా రు. తాంత్రిక పూజలు జరిగాయని తేలడంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. స్మార్థ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అమ్మవారి కవచం తొలగించి మరీ పూజలు చేశారని నిర్ధారణైంది. దీంతో ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు.
కమిషనర్కే ఈవో బాధ్యతలు
విజయవాడ దుర్గగుడి ఈవో సూర్యకుమారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ)లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధనే దుర్గ గుడి ఈవోగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతల్లో నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
‘పెద్దల’ ఆదేశాలతోనేనా..?
విచారణ పేరుతో దుర్గగుడి తాం త్రిక పూజల అంశాన్ని కొంతకాలం సాగదీసి.. ఆ పూజలు ఎవరి కోసం జరిగాయన్న అంశాన్ని మరుగు పరచాలన్నదే ప్రభుత్వ ‘పెద్దల’ ఉద్దేశమని వినిపిస్తోంది. ఈవో సూర్యకుమారిని దుర్గ గు డి బాధ్యతల నుంచి తప్పిస్తే ఇక ఆ విషయం మరుగున పడిపోతుందని సర్కారు పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయ మూసివే యాల్సిన సమయం తర్వాత కూడా తెరిచి ఉంచితే ఆలయ భద్రతలో విధుల్లో ఉన్న ఎస్టీ ఎఫ్ సిబ్బంది నిబంధనల ప్రకారం వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయాలి. అలాంటిది డిసెంబర్ 26న అర్ధరాత్రి బయట వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించినా ఎస్టీఎఫ్ పోలీసులతో సహా అధికారులు, అర్చకులు మౌనం వహిస్తున్నారు.
కేసు ఎందుకు నమోదు చేయలేదంటే..!?
తాంత్రిక పూజల ఉదంతంలో ఇంతవరకు పోలీసు కేసు నమోదు చేయనే లేదు. దీన్ని శాఖాపరమైన వైఫల్యంగానే చూపిస్తూ కప్పిపుచ్చాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. ‘ప్రాథమిక విచారణ చేయాలని మాత్రమే మాకు చెప్పారు. అంతటితో తమ పని పూర్తయ్యింది’అని ఓ అధికారి ‘సాక్షి’కి చెప్పడం గమనార్హం. అంటే తాంత్రిక పూజలు చేయడంపై కేసు నమోదు చేసి దోషులను శిక్షించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. అలా చేస్తే విషయం న్యాయస్థానం పరిధికి వెళ్తుంది. దాంతో అసలు తాంత్రిక పూజలు ఎవరి కోసం చేశారన్నది వెల్లడించాలి. అందుకే కేసు నమోదు చేయించడం ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదన్నది స్పష్టమవుతోంది.