ఏడు బస్తాల్లో 1,012 తాబేళ్లు!
వైట్ఫీల్డ్ (బెంగళూరు): అంతరించిపోయే స్థితిలో ఉన్న అరుదైన తాబేళ్లను స్మగ్లింగ్ చేస్తుండగా బెంగళూరు ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. నగరంలోని అత్తిబెలే టోల్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు కార్లలో ఏడు బస్తాల్లో తరలిస్తున్న 1,012 తాబేళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్లో రూ. 4 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
నగరానికి చెందిన ఓ ఆక్వా దుకాణ యజమాని ఈ తాబేళ్లను హాంకాంగ్కు ఎగుమతి చేసేందుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. వీటిలో 852 నక్షత్ర తాబేళ్లు, 76 కొండ తాబేళ్లు, 46 నోస్ తాబేళ్లు, 11 నోస్ రెడ్ తాబేళ్లు, 27 టెంట్ తాబేళ్లు ఉన్నట్లు గుర్తించారు. వన్యమృగ చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి, విచారిస్తున్నారు. తాబేళ్లను అటవీశాఖ అధికారులకు అప్పగించారు.