Vanami shrimp
-
వనామీ.. ధర పెరగదేమి!
సాక్షి, అమలాపురం: అమెరికా సుంకాల కొరడాను తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నా.. నిలిచిపోయిన ఎగుమతులు మొదలైనా.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని వనామీ రొయ్యల రైతుల వెతలు వీడలేదు. సుంకాల పేరుతో రాత్రికి రాత్రి ప్రతి కౌంట్కు రూ.40 నుంచి రూ.60 వరకు రొయ్యల ధరలు తగ్గించిన ఎగుమతిదారులు.. ఇప్పుడు కేవలం రూ.10 నుంచి రూ.20 వరకు మాత్రమే పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే 23 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోందని అంచనా. ప్రస్తుతం సుమారు 13 వేల ఎకరాల్లో మే 15 లోపు ఇంచుమించు తొలి పంట దిగుబడి రైతులకు అందుతుంది. అమెరికా సుంకాల సంక్షోభం వీడడంతో పాత ధరలు వస్తాయని వనామీ రైతులు ఆశలు పెట్టుకున్నారు. యూరప్ మార్కెట్ నుంచి అధికంగా ఆర్డర్లు రావడంతో ఫిబ్రవరి మొదటి వారంలో వనామీకి రికార్డు స్థాయి ధరలు దక్కాయి. 30 కౌంట్ (కేజీకి 30 రొయ్యలు) ధర కేజీ రూ.470 వరకు, 40 కౌంట్ ధర రూ.415కు పెరిగింది. స్థానికంగా రొయ్యల పట్టుబడి మొదలైనప్పటి నుంచి వ్యాపారులు నెమ్మదిగా ధరలు తగ్గిస్తూ వచ్చారు. అమెరికా సుంకాలు ప్రకటించే సమయానికి 30 కౌంట్ ధర రూ.460 వరకు తగ్గించారు. సుంకాల ప్రకటన తరువాత ఒకేసారి కేజీకి రూ.60 తగ్గించి రూ.400 చేశారు. 40 కౌంట్ ధర రూ.415 నుంచి రూ.390కి తగ్గించగా, సుంకాల ప్రకటన తరువాత రూ.310కి కుదించారు. ఇలా ప్రతి కౌంట్కు ధరను భారీగా తగ్గించేశారు. 50 కౌంట్ ధర రూ.350 నుంచి రూ.320కి, 60 కౌంట్ ధర రూ.320 నుంచి రూ.280కి, 70 కౌంట్ ధర రూ.290 నుంచి రూ.250కి, 80 కౌంట్ ధర రూ.260 నుంచి రూ.230కి, 90 కౌంట్ ధర రూ.240 నుంచి రూ.210కి తగ్గించేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో కేజీ రూ.250 ఉన్న 100 కౌంట్ సుంకాల విధించిన తరువాత రూ.190కి తగ్గించారు.టారిఫ్ వాయిదా పడినా..అమెరికా సుంకాల విధింపును మూడు నెలల పాటు వాయిదా వేసింది. దీంతో వనామీ రొయ్యల ఎగుమతులు మొదలయ్యాయి. పరిస్థితులు సానుకూలంగా మారడంతో పాత ధరలు వస్తాయని రైతులు ఆశించారు. కానీ.. పెంపు మాత్రం స్వల్పంగా ఉంది. 30 కౌంట్కు ఏకంగా రూ.60 వరకు ధర తగ్గించిన ఎగుమతిదారులు.. ఇప్పుడు కేవలం రూ.25 మాత్రమే పెంచారు. 40 కౌంట్కు రూ.60 వరకు తగ్గించి ఇప్పుడు రూ.30 వరకు పెంచారు. 50 కౌంట్కు రూ.50 తగ్గించి ఇప్పుడు కేవలం రూ.20, 60 కౌంట్కు రూ.40 తగ్గించి ఇప్పుడు రూ.20 చొప్పున పెంచి చేతులు దులుపుకున్నారు. -
‘రొయ్యో’ మొర్రో
* వైరస్.. ఫంగస్ దాడులు * ఏటా ఇదే దుస్థితి * దిక్కుతోచని రైతులు * అందుబాటులో లేని ల్యాబ్లు ఆకివీడు : రొయ్య రైతులు కుయ్యోమొర్రోమంటున్నారు. ఒక పక్క వైరస్, మరోపక్క ఫంగస్ వ్యాధులు విజృంభించడంతో కలవరపడుతున్నారు. ఆక్సిజన్తోపాటు, చెరువులోని నీటిలోపాల వల్ల ఈ వ్యాధులు సోకుతున్నాయి. వనామి రొయ్యకు వచ్చే ఈ వ్యాధులను నిర్మూలించడం రైతులు, శాస్త్రవేత్తల తరం కావడంలేదు. వాతావరణంలో వచ్చిన మార్పులతోనే ఇవి సోకుతున్నాయని రైతులు చెబుతున్నారు. ప్రతిఏటా ఇదే దుస్థితి తలెత్తుతోందని, ఒక్కసారిగా విజృంభిస్తున్న వ్యాధులు రూ.వేల కోట్ల రూపాయలను దిగమింగేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. రొయ్య డొప్పపై బూడిద రంగు, ఆకుపచ్చని జిగురు వంటి పొర ఏర్పడడాన్ని పాకుడు వ్యాధి అని పిలుస్తారు. ఇది ప్రస్తుతం అక్కడక్కడ కనిపిస్తోంది. దేహంపై నల్లని తుప్పు రంగు ఏర్పడడాన్ని బ్రౌన్ స్పాట్ వ్యాధి అని, మోప్పలు నలుపు రంగులోకి మారడాన్ని బ్లాక్గిల్ అని, ఎరుపు రంగులోకి మారడాన్ని రెడ్ గిల్ అని, రొయ్య మీసాలు, తోక కుళ్లడాన్ని రాట్ వ్యాధి అని, బాక్టీరియా పట్టడాన్ని విబ్రోయోసిస్ అని పిలుస్తారు. ఇవన్నీ కూడా అక్కడక్కడ చెరువుల్లో కనబడుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటిని నియంత్రణకు ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. అత్యంత ప్రమాదకరమైంది వైరస్ రొయ్యలకు సోకే వ్యాధిలో అత్యంత ప్రమాదకరమైంది వైరస్. ఇది సోకిన రొయ్యలు నిర్విరామంగా గట్టు వెంబడి తిరుగుతాయి. దేహంపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. నీలిరంగులోకి మారిన రొయ్యలకు పూర్తిగా వైరస్ సోకినట్టు నిర్ధారిస్తారు. ఇవి జీర్ణగ్రంధి పాడై గుట్టలుగుట్టలుగా చనిపోతాయి. ఈ వైరస్ సోకిన రొయ్యలను వెంటనే గుర్తించకపోతే రైతుకు పెట్టుబడులు కూడా దక్కవు. చెరువుల్లో ఒక్క రొయ్య కూడా కన్పించదు. ఈ వ్యాధి నివారణ కూడా కష్టమే. ఫంగస్ వ్యాధి(ఈహెచ్పీ) రొయ్య ఫంగస్ వ్యాధికి గురైతే ఎదుగు దల ఉండదు. ఈహెచ్పీ ఫంగస్ జీర్ణ గ్రంధికి వస్తోంది. చెరువుల్లో పెరిగిన రొయ్యలకు ఎంత మేత వేసినా ఎదుగుదల లేకపోవడంతో రైతు ఆర్థికంగా నష్టపోతాడు. ఈ వ్యాధి పిల్ల దశలోనే రొయ్యకు సోకుతోంది. ఆ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. ఈ వ్యాధిని ప్రభుత్వం గత ఏడాది గుర్తించింది. అందుబాటులో లేని ల్యాబ్లు రొయ్యలు వ్యాధులకు గురైతే నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కనీసం ల్యాబ్ సౌకర్యాన్ని కూడా కల్పించడంలేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కోస్తా జిల్లాల్లో వేలాది ఎకరాల్లో రొయ్యల సాగు సాగుతోంది. రైతులే శాస్త్రవేత్తలుగా ఆయా వ్యాధులను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రైవేటు ల్యాబ్లు అక్కడక్కడా ఉన్నా రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. పన్ను వసూళ్లకు యత్నాలు అసలే వ్యాధులు, ప్రతికూలవాతావరణంతో సతమతమవుతున్న రైతులకు సహాయసహకారాలు అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా యత్నాలు సాగించడం లేదు. పెపైచ్చు ఆక్వా రంగంపై పన్ను విధించి కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఆక్వా జోన్లను ఏర్పాటు చేసి చేపలు, రొయ్యల చెరువుల తవ్వకానికి భారీగా అనుమతులు మంజూరు చేసేందుకు యత్నిస్తోంది. తదనంతర చర్యగా రొయ్య, చేపల అమ్మకంపై పన్ను, ఎక్సైజ్ సుంకం, ఇతరత్రా సవా లక్ష పనులు విధించే యోచనలో ఉంది. ఇంతవరకూ ఆహారోత్పత్తుల కేటగిరిలో చేపలు, రొయ్యల సాగు, అమ్మకాలు, ఎగుమతులపై పన్ను లేదు. ఈ నేపథ్యంలో పన్ను విధింపునకు సిద్ధపడుతున్న ప్రభుత్వం ఆక్వా రైతుల బాగోగులనూ పట్టించుకోవాలని రైతులు కోరుతున్నారు. సకాలంలో గుర్తించాలి ప్రస్తుతం 50శాతం చెరువుల్లో ఫంగస్, 30 శాతం చెరువుల్లో వైరస్ వ్యాధులు కనిపిస్తున్నాయి. సీడ్ దశలో ఈ వ్యాధులు సోకితే నష్టం తీవ్రంగా ఉంటుంది. రొయ్యలు ఎదిగిన తర్వాత వస్తే ప్రభావం తక్కువగా ఉంటుంది. సీడ్ దశలో సకాలంలో గుర్తిస్తేనే నివారణ సాధ్యం. - ఎ.రవికుమార్ శాస్త్రవేత్త -
వనామీ రొయ్యకు రెడ్స్పాట్
తెగుళ్లకు తోడు వర్షాలు ఖాళీ అవుతున్న చెరువులు ఆందోళనలో సాగుదారులు నందివాడ (కృష్ణా) వనామీ రొయ్యకు రెడ్స్పాట్ తెగులు రైతులను నిండా ముంచేస్తోంది. టైగర్ రొయ్యకు తెగుళ్లు ఎక్కువగా వస్తున్నాయని మండలంలోని బుడమేరు పరివాహక ప్రాంతాల్లోని చెరువుల్లో వనామీ రొయ్యల సాగును రైతులు చేపట్టారు. అయితే వీటికీ రెడ్ స్పాట్ రావటంతో చాలా చెరువులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు కూడా రొయ్యల సాగు రైతులను నానా ఇబ్బందులు పెడుతోంది. ఇప్పటికే రెడ్స్పాట్ వైరస్ వల్ల రొయ్యలు చనిపోవడంతోపాటు ఎకరాల్లో రొయ్యలను కౌంట్కు రాకుండానే పట్టేస్తున్నారు. దీంతో పెట్టుబడి ఖర్చులు కూడా రావటం లేదు. ఎండలు పుష్కలంగా కాస్తూ, పొడి వాతావరణం ఉంటే కొంత వరకు రొయ్యలు ఆరోగ్యంగా ఉంటూ కాస్తా లాభాలు తీసుకువచ్చే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కనపడటం లేదు. అల్పపీడనం కారణంగా వాతావరణం చల్లబడటంతో వ్యాధి తీవ్రత పెరిగి రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో రైతులకు అపారనష్టం జరుగుతోంది. వేసిన పది రోజులకే వైరస్ మండలంలోని ఎల్.ఎన్ పురం, పోలుకొండ, రుద్రపాక, కుదరవల్లి, పెదలింగాల, చినలింగాల, నందివాడ గ్రామాల్లో రొయ్య పిల్ల వేసిన 10 రోజులకే చెరువులు వైరస్ బారిన పడుతున్నాయి. పూర్తి స్థాయి కౌంట్కు రాకుండానే రొయ్య వైరస్ బారిన పడుతోంది. దీంతో కనీసం పెట్టుబడి ఖర్చులయినా వస్తాయని భావించి ముందుగానే పట్టి అయినకాడికి అమ్ముకుంటున్నారు. పట్టుబడి పడుతున్న చెరువుల్లో 60 నుంచి 70 కౌంట్ కూడా ఉండడం లేదు. దీంతో తీవ్ర నష్టం రైతులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం రొయ్య 40 కౌంట్ ధర రూ.400 వరకూ ఉండడంతో 40 కౌంట్ పట్టిన కొందరు రైతులు ఒక మోస్తరుగా గట్టెక్కుతున్నారు. వనామీ రొయ్య వ్యాధులను తట్టుకుంటుందన్న ఆక్వా టెక్నీషియన్ సూచనలతో దీన్ని సాగు చేసి నష్టాలు చూస్తున్నట్లు ఆక్వా రైతులు వాపోతున్నారు. రెడ్స్పాట్ వైరస్ నుంచి రొయ్యలను కాపాడుకోవటం కోసం ఏరియేటర్స్ వినియోగిస్తున్నారు. ఈ చర్యల వలన వైరస్ నుంచి కొంత వరకూ రొయ్యను కాపాడుకోవటానికి అవకాశం ఉంటుందని టెక్నీషియన్లు చెబుతున్నారు. ఇలా అయితే ఆర్థిక భారం అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం రొయ్యల సాగుకు బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి రెడ్స్పాట్ వైరస్కు మందు లేదు. స్పాట్ రాకుండా ముందు చర్యలు తీసుకోవటం తప్ప వచ్చిన తరువాత మందులు వాడినా ఉపయోగం ఉండదు. స్పాట్ రాకుండా నీటిలో ఆక్సిజన్ శాతం చూసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. చెరువులో ఆక్సిజన్ శాతం పెంచటం కోసం ఏరియేటర్స్ ఏర్పాటు చేయక తప్పదు. రెడ్స్పాట్ వస్తే వెంటనే పట్టుకోవటం మంచిది. ఇలా చేయటం వలన రైతులకు ఎంతో కొంత నష్టం తగ్గుతుంది. నందివాడ మండలంలో ఈ ఏడాది 6 వేల ఎకరాల్లో వనామీ సాగు చేశారు. అయితే ఇప్పటికే చాలా గ్రామాల్లో చెరువులు దెబ్బతిన్నాయి. చాలా మంది రొయ్యల సాగు మానేసి చేపల పిల్లల సాగు చేస్తున్నారు. బాగా నష్టపోయిన వారు చెరువులను లీజులకు ఇచ్చేసి వలస వెళ్లిపోతున్నారు. - పి.రామకృష్ణారాజు, మత్స్యశాఖ ఏడీఏ, కైకలూరు