Vizianagaram tdp leaders
-
కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అసంతృప్తి!
-
కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అసంతృప్తి!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ విస్తరణపై సీనియర్ నేత అశోక్ గజపతి రాజను సంప్రదించకపోవడంతో పాటు, విజయనగరం జిల్లా మంత్రి పదవి విషయంలోనూ సూత్రప్రాయంగా కూడా ఆయన అభిప్రాయం తీసుకోనట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు వైఖరిపై అశోక్ గజపతిరాజు వర్గీయులు రగిలిపోతున్నారు. బొబ్బిలి రాజులకు మంత్రి పదవిని అశోక్ గజపతి రాజు వ్యతిరేకిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నారు. కాగా మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారవ్వడంతో విజయనగరం జిల్లా నేతల్లో టెన్షన్ మొదలైంది. ప్రధానంగా నాడు బయటపడినవారంతా ఇప్పుడు భయపడుతున్నారు. తాము కాదన్నవారికి మంత్రిపదవి దక్కుతుందన్న సంకేతాలు రావడమే దానికి కారణం. బయటపడినవారిలో ఒక్కరికైనా స్థానం కల్పించకుంటే ఇక పార్టీలో అంతర్గత పోరు ఖాయమన్న భావన కనిపిస్తోంది. వ్యతిరేకించినవారిని అణగదొక్కే ప్రయత్నాలు మొదలవుతాయన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా టీడీపీ నేతలు నిన్న ముఖ్యమంత్రిని కలిశారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇవ్వొద్దని ఎమ్మెల్యేలు కొండపల్లి అప్పలనాయుడు, కోళ్ల లలితకుమారి, మీసాల గీత, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, గుమ్మడి సంధ్యారాణి బాహాటంగానే చెప్పారు. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వొద్దని వారు ఈ సందర్భంగా సీఎంను కోరారు. పార్టీ కోసం కష్టపడినవారికే మంత్రి పదవులు ఇవ్వాలని, తమలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని తెలిపారు. ఓసీకిస్తే బీసీలంతా దూరమవుతారని పరోక్షంగా హెచ్చరించారు. కాగా సుజయ్కు మంత్రి పదవి ఇస్తున్నామన్న సంకేతాలు వెలువడుతున్నాయి. -
విభేదాలు వీడకపోతే పదవులు పీకేస్తా: బాబు
విజయవాడ : విభేదాలు వీడకపోతే పదవులు నుంచి తొలగిస్తానని టీడీపీ విజయనగరం జిల్లా నేతలకు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో నిన్న విజయనగరం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు... ఎవరు ఏం చేస్తున్నారో తనకు తెలుసునని, అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని చంద్రబాబు అన్నారు. నాయకులు గొడవలు పడుతూ పార్టీని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుల గొడవలు, వ్యవహారాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను చూపించి వాటికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించినట్లు తెలిసింది. సాలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండగా ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ను ప్రశ్నించారు. జిల్లా నేతలంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. పనితీరు నివేదిక తన వద్ద ఉందని, వచ్చే ఎన్నికల్లో పనిచేయనివారికి సీట్లు ఉండవని అన్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, నారాయణస్వామి నాయుడు, మీసాల గీత, చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.