wakf
-
వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వొద్దు
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) చట్టం–2025 అమలును పాక్షికంగా లేదా తాత్కాలికంగా కూడా నిలిపివేయొద్దని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం ద్వారా ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. చట్టం రాజ్యాంగబద్ధతపై వ్యక్తమవుతున్నవి కేవలం ఊహాగానాలేనని స్పష్టంచేసింది. అందుకే అందుకే చట్టం అమలుపై స్టే విధిస్తూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని విన్నవించింది. చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేయాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రెటరీ షెర్షా సి.షేక్ మొహిద్దీన్ శుక్రవారం సుప్రీంకోర్టులో 1,332 పేజీల ప్రాథమిక అఫిడవిట్ కౌంటర్ దాఖలు చేశారు. వివాదాస్పదంగా మారిన ఈ చట్టాన్ని కేంద్రం సమర్థించుకుంది. 2013 తర్వాత దేశంలో అదనంగా 20.92 లక్షల ఎకరాల భూమిని వక్ఫ్ ఆస్తిగా మార్చారని అఫిడవిట్లో వెల్లడించింది. వక్ఫ్ ఆస్తులు ఏకంగా 116 శాతం పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొంది. స్వాతంత్య్రం కంటే ముందు, స్వాతంత్య్రం తర్వాత 18.29 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ ఆస్తిగా ఉండేదని పేర్కొంది. గతంలో అమల్లో ఉన్న వక్ఫ్ చట్టాన్ని దురి్వనియోగం చేశారని, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి వక్ఫ్ ఆస్తులుగా మార్చేశారని ఆక్షేపించింది. ఇలాంటి ఆక్రమణలు అడ్డుకోవడానికే వక్ఫ్(సవరణ) చట్టాన్ని తీసుకొచ్చినట్లు స్పష్టంచేసింది. రాజకీయ పార్టీల సభ్యులతో కూడిన పార్లమెంటరీ ప్యానెల్ ద్వారా లోతైన అధ్యయనం, విశ్లేషణ చేసిన తర్వాతే చట్టంలో సవరణలు తీసుకొచ్చినట్లు వివరించింది. పలు సవరణలు మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కులను హరిస్తాయనే తప్పుడు ప్రాతిపదికపై కొందరు పిటిషన్లు దాఖలు చేశారని కేంద్రం విమర్శించింది. వాటిని కొట్టివేయాలని సుప్రీంకోర్టును కోరింది. సవరణ చట్టంతో వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలు మైనార్టీలుగా మారిపోతారన్న వాదనను కేంద్రం తిరస్కరించింది. చట్టంతో వారికి ఎలాంటి నష్టం జరగదని, వక్ఫ్ బోర్డులో వారు మెజార్టీగా ఉంటారని తెలియజేసింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్(సీడబ్ల్యూసీ)లో మొత్తం 22 మంది సభ్యులుంటారని, ఇందులో నలుగురు ముస్లిమేతరులు ఉంటారని వెల్లడించింది. వక్ఫ్(సవరణ) చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 5న తదుపరి విచారణ జరగనుంది. అప్పటిదాకా వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని, కేంద్ర వక్ఫ్ మండళ్లలో కొత్తగా నియామకాలు చేపట్టబోమని కేంద్రం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాజాగా ప్రాథమిక కౌంటర్ ఆఫిడవిట్ దాఖలు చేసింది. -
కర్నూలులో వద్దని ఏ చట్టంలోనైనా ఉందా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 25న జారీ చేసిన జీవో 16 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకూడదని ఏ చట్టంలో ఎలాంటి నిషేధం లేదని తేల్చిచెప్పింది. ఏ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నది ప్రభుత్వ పరిధిలోని అంశమని, అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏ ఒక్కరి ప్రాథమిక హక్కులకు భంగం కలగడం లేదంది. విశాఖపట్నం, అనంతపురం నుంచి హైకోర్టుకు వస్తున్నారని, అలాంటప్పుడు కర్నూలుకు వెళ్లడానికి ఇబ్బంది ఏమిటని పిటిషనర్ను ప్రశ్నించింది. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు దారి తీసిన కారణంతో చిన్న అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటు కల్పించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యాన్ని వక్ఫ్బోర్డు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. జీవో 16ను సవాలు చేస్తూ విజయవాడకు చెందిన మహ్మద్ ఫరూక్ షుబ్లీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పై సీజే ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్ఎన్వీ ప్రసాద్బాబు వాదనలు వినిపిస్తూ, సీఎం ఆదేశాల మేరకే కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పా టు జీవో వచ్చిందన్నారు. ఇది మైనారిటీల ప్రయోజనాలకు విరుద్ధమని చెప్పారు. దీనిని విజయవాడలో ఏర్పాటు చేస్తూ 2016లోనే జీవో జారీ అయిందన్నా రు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ఇందులో జోక్యం చేసుకునే పరిధి తమకెక్కడిదని ప్రశ్నించింది. కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటు వల్ల పిటిషనర్కొచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించింది. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ, కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటుకు స్పష్టమైన కారణాలున్నాయన్నారు. అత్యధిక ముస్లిం జనాభా కర్నూలులో ఉందన్నారు. ఇందులో ముఖ్యమంత్రి పేరు తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆ వివరాలతో చిన్న అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది. -
అమలాపురంలో మళ్లీ వక్ఫ్ భూముల కలకలం
- మొత్తం 147 ఎకరాల భూములను గుర్తించిన వక్ఫ్ బోర్డు - తమ భూములని నిర్థారణతో కలెక్టర్కు నివేదిక - ఆ భూముల్లో రిజస్ట్రేషన్లు నిలిపివేత - ఏళ్ల తరబడి భూములను అనుభవిస్తున్న ప్రస్తుత యాజమానుల్లో గుబులు అమలాపురం టౌన్: అమలాపురం పట్టణం... పరిసర గ్రామాల్లో వక్ఫ్ భూముల కలకలం మళ్లీ మొదలైంది. గతంలో కేవలం అమలాపురం పట్టణంలోని వడ్డిగూడెం ప్రాంతంలో 25 ఎకరాలు భూములు తమవేనని వక్ఫ్ బోర్డు గుర్తించంటంతో వాటిని రెవెన్యూ అధికారుల సర్వేతో నిర్థారించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వివాదం తలెత్తడంతో అధికారులు ఆ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి రిజస్ట్రేషన్లు నిలిపి వేశారు. తాజాగా వక్ఫ్ అధికారులు పట్టణంలోనే కాదు అమలాపురం రూరల్ మండల పరిధిలో పలు గ్రామాల్లో కూడా 147 ఎకరాల భూములున్నట్లు గుర్తించి ఆ భూములను కూడా బోర్డుకు అప్పగించాల్సిందేనని వక్ఫ్ అధికారులు పట్టుపడుతున్నారు. అంతేకాదు అలా గుర్తించిన భూముల సర్వే నెంబర్లు, విస్తీర్ణాల జాబితాను తయారు చేసి జిల్లా కలెక్టర్కు నివేదిక కూడా సమర్పించారు. జిల్లా వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఆడిటర్ సులేమాన్ బాషా పలుమార్లు ఈ వివాదంపై అమలాపురం ఆర్డీవో జి.గణేష్కుమార్తో చర్చించారు. గతంలోని 25 ఎకరాలతో కలుపుకుని తాజాగా మొత్తం 147 ఎకరాల్లో క్రయ విక్రయాలకు సంబంధించి వక్ఫ్ అభ్యంతరాలతో రిజస్ట్రేషన్లను అధికారులు నిలిపివేశారు. గత మూడు నెలలుగా ఈ భూముల్లో ఎలాంటి రిజస్ట్రేషన్ లావాదేవీలు జరగటంలేదు. దీంతో ఈ 147 ఎకరాల్లో ఎవరైనా తమ స్థలాన్ని అమ్ముకోవాలన్నా... కొనాలన్నా రిజస్ట్రేషన్ నిలిపివేత ఆంక్షలతో 300కు పైగా యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తప్పు ఎవరిది..? శిక్ష ఎవరికి...?: పూర్వీకంలో ప్రస్తుతం వక్ఫ్ భూములని నిర్థారిస్తున్న వాటిలో కొన్ని మసీదులుండి, వాటి నిర్వహణ కోసం భూముల కేటాయింపు ఉన్నట్లు ఆధారాలు ఇప్పుడు వక్ఫ్ బోర్డు శోధనలో వెలుగు చూశాయి. అయితే దాదాపు వందేళ్ల కిందట బహుమతులు, ఆక్రమణలు, ఆలనా పాలనా లేక వదిలేయటంతో క్రమేపీ పరాధీనమయ్యాయని తెలుస్తోంది. తర్వాత ఆ పూర్వీకంలోనే కొందరు పట్టాలు, దస్తావేజులు పొంది అనుభవించసాగారు. కాలక్రమంలో అవి క్రయ విక్రయాలతో చేతులు మారుతూ నేడు పట్టణ, గ్రామాల విస్తరణతో అత్యంత ఖరీదైన భూములుగా మారి ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్లు, ఇంటిపన్నుల చెల్లింపులతో సొంత ఆస్తులై స్థిరపడ్డాయి. అప్పట్లో మసీదు కమిటీల పర్యవేక్షణ సరిగా లేకో... మసీదు భూముల నుంచి రూపాంతరం చెందినప్పుడు అప్పట్లో రెవెన్యూ శాఖ ఆ భూములను సబ్ డివిజన్ చేయకపోవటం వల్లో క్రమేపీ అవి మసీదు భూములుగా చెలామణిని కోల్పోయాయి. మసీదు భూముల పరిరక్షణకు ఉన్న వక్ఫ్ బోర్డు అధికారులు ఆది నుంచీ కాపాడుకోకుండా ఇప్పుడు ఉన్నఫళంగా మావి అంటే ఏళ్ల తరబడి లక్షలు పోసి కొనుగోలు చేసుకున్న తాము ఏమైపోవాలని ప్రస్తుత భూముల యాజమానులు ప్రశ్నిస్తున్నారు. ఆదిలో రెవెన్యూ, మధ్యలో వక్ఫ్ ఆ భూములపై సరైన పర్యవేక్షణ చేసి ఉంటే ఇంతటి వివాదానికి తావు ఉండేది కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. అత్యంత ఖరీదైన భూములే నేడు వక్ఫ్ భూములుగా...: పట్టణంలోపాటు రూరల్ మండలం సమనస, నడిపూడి గ్రామాల్లో కూడా ఖరీదైన వక్ఫ్ భూములని ఇప్పుడు బయట పడ్డాయి. స్థానిక కిమ్స్ వైద్య కళాశాల వెనుక, ఆ కళాశాలలో కొంత భూమి వక్ఫ్ పరిధిలోకి వస్తున్నాయి. నడిపూడి గ్రామంలో అయితే దాదాపు 80 ఎకరాల వరకూ వెలుగు చూశాయి. పట్టణంలో అయితే ఓ ప్రముఖ ఆస్పత్రితోపాటు ఓ ప్రముఖ విద్యా సంస్థకు చెందిన స్థలాలు వక్ఫ్లోకి చూపిస్తున్నాయి. అమలాపురం ముల్లా ముస్తాఫా మసీదుకు చెందిన ముమ్మిడివరం మండలం అయినాపురంలో 21.15 ఎకరాల భూములను ఇటీవలే వక్ఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం పట్టణం, పరిసర గ్రామాల్లో కూడా తమ భూములను స్వాధీనం చేసుకునేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది.