world hockey league
-
మళ్లీ ఓడిన భారత్
భువనేశ్వర్: సొంతగడ్డపై మరోసారి నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తూ వరల్డ్ హాకీ లీగ్ (హెచ్డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నీలో భారత జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. ప్రపంచ మాజీ చాంపియన్ జర్మనీతో సోమవారం జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్లో టీమిండియా 0–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. జర్మనీ తరఫున కెప్టెన్ మార్టిన్ హానెర్ (17వ నిమిషంలో), మాట్స్ గ్రామ్బుష్ (20వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న భారత్... రెండో మ్యాచ్లో 2–3తో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. తాజాగా జర్మనీ చేతిలో పరాజయంతో భారత్ ఒక పాయింట్తో పూల్ ‘బి’లో చివరిదైన నాలుగో స్థానంలో నిలిచింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో పూల్ ‘ఎ’లో అగ్రస్థానంలో నిలిచిన జట్టుతో భారత్ తలపడుతుంది. అర్జెంటీనా–స్పెయిన్; బెల్జియం–నెదర్లాండ్స్ జట్ల మధ్య మంగళవారం లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాక పూల్ ‘ఎ’లో ఎవరు ఏ స్థానంలో నిలుస్తారో ఖరారవుతుంది. -
భారత్కు కఠిన పరీక్ష
సెమీస్లో నేడు బెల్జియంతో అమీతుమీ హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ యాంట్వార్ప్: లీగ్ దశ నుంచి స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో చెలరేగుతున్న భారత్కు.. వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో అసలు పరీక్ష ఎదురుకానుంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో పటిష్టమైన బెల్జియంతో... భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. చివర్లో జస్జీత్ సింగ్ సూపర్ స్ట్రోక్స్తో క్వార్టర్స్లో మలేసియాను చిత్తు చేసిన టీమిండియాకు బెల్జియం స్ట్రయికర్ల నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఓవరాల్గా ఈ మ్యాచ్ను బెల్జియం స్ట్రయికర్లకు భారత డిఫెన్స్కు మధ్య పోరాటంగా చెప్పుకోవచ్చు. అయితే 2011 చాంపియన్స్ చాలెంజ్ ఫైనల్ తర్వాత ఇటీవల బెల్జియంతో తలపడ్డ ప్రతిసారి భారత్ పైచేయి సాధించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. మలేసియాతో మ్యాచ్లో భారత ఫార్వర్ట్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బంతిని ప్రత్యర్థి జట్టు డి-సర్కిల్లోకి తీసుకెళ్లినా లక్ష్యానికి చేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారు. అలాగే పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మల్చడంలో డ్రాగ్ ఫ్లికర్లు నిరాశపరుస్తున్నారు. ముఖ్యంగా స్టార్ ఫ్లికర్ రఘునాథ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. గోల్కీపర్ శ్రీజేష్ మాత్రం ప్రత్యర్థుల దాడులను సమర్థంగా అడ్డుకుంటుండంతో గోల్స్ ఎక్కువగా నమోదు కావడం లేదు. ఈ టోర్నీలో భారత్ ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కోచ్ వాన్ యాస్... బెల్జియంను తక్కువగా అంచనా వేయడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు లీగ్ దశలో మూడు విజయాలు, ఓ డ్రా చేసుకున్న బెల్జియం క్వార్టర్స్లో ఫ్రాన్స్ను చిత్తు చేసింది. ఓ వైపు భరించలేని ఎండ ఉన్నా ఆటగాళ్లు ఏమాత్రం అలసటకు గురికాకుండా మ్యాచ్ ఆడారు. అలాగే బెల్జియం ఆటగాళ్లు ఎప్పుడు ఎలా ఆడతారో ఊహించడం చాలా కష్టం. కాబట్టి ఈ మ్యాచ్లో అలసత్వం చూపితే భారత్కు ఓటమి తప్పదు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని బెల్జియం భావిస్తోంది. -
నెదర్లాండ్స్ గోల్స్ వర్షం
క్వార్టర్స్లో భారత్ మహిళల ఓటమి వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ యాంట్వార్ప్ : ప్రత్యర్థి ఎదురుదాడులను నిలువరించలేకపోయిన భారత మహిళల హాకీ జట్టు... వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో సెమీస్ బెర్త్ను దూరం చేసుకుంది. మంగళవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ప్రపంచ చాంపియన్ నెదర్లాండ్స్ 7-0తో భారత్ను చిత్తు చేసి సెమీస్లోకి అడుగుపెట్టింది. వాన్ యాస్ నోమి (1వ ని.), వెల్టెన్ లిడ్వెజ్ (9, 48వ ని.), మస్నేర్ (16వ ని.), గ్లెనెల్లా జెర్గో (18వ ని.), మసక్కెర్ (26, 53వ ని.)లు డచ్కు గోల్స్ అందించారు. పక్కా ప్రణాళికతో ఆడిన డచ్ క్రీడాకారిణిలు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఫార్వర్స్, డిఫెండర్లు సమయోచితంగా స్పందించడంతో తొలి నిమిషంలోనే గోల్తో షాకిచ్చారు. పెనాల్టీ అవకాశాలను సృష్టించుకుంటూ తొలి క్వార్టర్లో 2-0 ఆధిక్యంలో నిలిచారు. రెండో క్వార్టర్స్లోనూ డచ్ ప్లేయర్లు భారత్కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. స్వల్ప వ్యవధిలో మూడు గోల్స్ చేసి ఆధిక్యాన్ని 5-0కు పెంచారు. చివరి రెండు క్వార్టర్లలోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి మరో రెండు గోల్స్ సాధించారు. -
బెల్జియం చేతిలో భారత్ పరాజయం
యాంట్వర్ప్ (బెల్జియం) : వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ సన్నాహాల్లో భాగంగా భారత జట్టుకు తమ రెండో ప్రాక్టీస్ మ్యాచ్లో ఓటమి ఎదురైంది. బెల్జియంతో జరిగిన ఈ మ్యాచ్లో సర్దార్ సింగ్ సేన 1-2 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. భారత్ తరఫున ఆకాశ్దీప్ సింగ్ 32వ నిమిషంలో ఏకైక గోల్ చేశాడు. 16న తమ చివరి ప్రాక్టీస్ మ్యాచ్లో భారత జట్టు యూఎస్ఏతో తలపడుతుంది. -
ఒలింపిక్ చాంప్ జర్మనీని నిలువరించిన భారత్
న్యూఢిల్లీ: వరల్డ్ హాకీ లీగ్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో పరాజయాలతో కుదేలైనా... ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ జర్మనీపై భారత హాకీ జట్టు స్ఫూర్తిదాయకమైన ఆటతీరును ప్రదర్శించింది. సోమవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో ప్రత్యర్థిని దాదాపు ఓడించినంత పనిచేసింది. అయితే చివరి నిమిషాల్లో ప్రత్యర్థికి గోల్స్ సమర్పించుకునే అలవాటున్న భారత హాకీ జట్టు మరోసారి అదే ఆటతీరును ప్రదర్శించింది. అప్పటిదాకా 3-2తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న సర్దార్ సేన మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా గోల్ సమర్పించుకుంది. దీంతో మ్యాచ్ 3-3తో డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో భారత్ సమష్టిగా కదం తొక్కుతూ 19వ నిమిషంలోనే తొలి గోల్ సాధించింది. సర్కిల్ ఆవల నుంచి రఘునాథ్ చేసిన గోల్తో జట్టుకు 1-0 ఆధిక్యం వచ్చింది. అయితే 24వ నిమిషంలోనే జర్మనీ ఆటగాడు మార్టిన్ హానర్ పెనాల్టీ కార్నర్ ద్వారా చేసిన గోల్తో స్కోరు సమమైంది. మరో ఎనిమిది నిమిషాల్లోనే తమకు లభించిన రెండో పెనాల్టీ కార్నర్ను రూపిందర్ గోల్గా మలచడంతో జట్టు 2-1 ఆధిక్యం సాధించింది. 41వ నిమిషంలో భారత్ సెల్ఫ్ గోల్తో స్కోరు 2-2తో సమమైంది. ఆతిథ్య జట్టు 52వ నిమిషంలో ధరమ్వీర్ సింగ్ ద్వారా మరో గోల్ సాధించింది. 68వ నిమిషంలో స్టాల్కోస్కి గోల్ చేసి భారత అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇక మూడు మ్యాచ్ల్లో కేవలం ఒక్క పాయింట్ సాధించిన భారత్ పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో బుధవారం జరిగే క్వార్టర్స్లోగ్రూప్ ‘బి’లో టాపర్గా నిలిచిన ఆసీస్తో ఆడుతుంది. -
సువర్ణావకాశం
ఒకప్పుడు ప్రపంచ హాకీని శాసించిన భారత్ నేడు తమ ఉనికి కోసం పోరాడుతోంది. మార్కెటింగ్కు మంచి అవకాశాలున్న భారత్లో హాకీకి ఆదరణ తగ్గడం అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్)లో ఆందోళన కలిగించింది. భారత హాకీకి పునర్ వైభవం లభిస్తే అంతర్జాతీయంగానూ ఈ క్రీడ లాభపడుతుందని ఎఫ్ఐహెచ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్కు సాధ్యమైనన్ని టోర్నమెంట్లు కేటాయిస్తోంది. అందులో భాగంగానే ఈనెల 10 నుంచి 18 వరకు జరిగే వరల్డ్ లీగ్ ఫైనల్కు న్యూఢిల్లీ వేదికగా నిలుస్తోంది. ప్రపంచ హాకీలోని అగ్రశ్రేణి జట్లు బరిలో ఉన్న ఈ మెగా ఈవెంట్లో భారత్ కనీసం టాప్-3లో నిలిస్తే జాతీయ క్రీడకు కొత్త ఊపిరి లభించే అవకాశముంటుంది. సాక్షి క్రీడావిభాగం సొంతగడ్డపై ఇటీవల జరిగిన జూనియర్ ప్రపంచ కప్లో భారత్ పదో స్థానంలో నిలిచింది. భారత హాకీ ప్రస్తుత స్థితి ఎలా ఉందో ఈ ఫలితమే సూచిస్తోంది. విదేశీ కోచ్లు మారుతున్నా... భారత జట్టు ప్రదర్శన మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఆసియా స్థాయిలో అడపాదడపా మెరుపులు కనిపిస్తున్నా.. గత మూడు దశాబ్దాల కాలంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో గొప్ప టైటిల్స్ సాధించలేకపోయింది. 1980 మాస్కో ఒలింపిక్స్లో స్వర్ణం... 1982 చాంపియన్స్ ట్రోఫీలో కాంస్యం.. ఆ తర్వాత భారత ఖాతాలో గొప్ప విజయాలు లేవనే చెప్పాలి. ఒలింపిక్స్ హాకీలో ఏ జట్టూ గెలవని విధంగా భారత జట్టు ఎనిమిది స్వర్ణాలు గెలిచింది. కాలక్రమేణా హాకీలో వచ్చిన మార్పులకు అనుగుణంగా సిద్ధం కాకపోవడం... ఇతరత్రా కారణాలు భారత హాకీని వెనక్కి నెట్టేశాయి. యూరోప్ జట్ల ఆధిపత్యం పెరిగిపోయినా... ఆర్థిక వనరులు అధికంగా ఉన్న భారత్లో ఈ ఆట ఉనికి ప్రశ్నార్థకం కావడం అంతర్జాతీయ హాకీ సమాఖ్యను ఆందోళనకు గురిచేసింది. భారత్లో ఈ క్రీడ మళ్లీ పూర్వ వైభవం పొందితే ఆర్థికంగా అంతర్జాతీయ హాకీకి మేలు జరుగుతుందని ఎఫ్ఐహెచ్ భావించింది. అందులో భాగంగా భారత హాకీ పురోభివృద్ధి కోసం మెగా ఈవెంట్స్ నిర్వహణ ఇచ్చింది. 2010లో ప్రపంచ కప్... ప్రస్తుతం వరల్డ్ లీగ్ ఫైనల్స్... ఈ ఏడాది చివర్లో భువనేశ్వర్లో చాంపియన్స్ ట్రోఫీ ఈ ప్రణాళికలో భాగమే. ఫలితాలు వస్తేనే... నాలుగేళ్ల క్రితం న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ కప్... గత నెలలో జరిగిన జూనియర్ ప్రపంచ కప్ తర్వాత భారత్లో జరుగుతోన్న మరో మెగా ఈవెంట్ ఇదే కావడం విశేషం. కానీ ఈ రెండు ఈవెంట్స్లో భారత్ నిరాశపరిచింది. మరో మూడు రోజుల్లో మొదలయ్యే వరల్డ్ లీగ్ ఫైనల్స్లో భారత్ రాణిస్తే భవిష్యత్కు భరోసా కలుగుతుంది. విదేశీ కొత్త కోచ్ టెర్రీ వాల్ష్కు ఇది తొలి పరీక్ష. మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. తొలుత రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. ఆ తర్వాత లీగ్ దశ మ్యాచ్ల ఫలితాలతో సంబంధం లేకుండా అన్ని జట్లు క్వార్టర్ ఫైనల్ ఫైనల్ మ్యాచ్లు ఆడుతాయి. క్వార్టర్ ఫైనల్ విజేతలు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఏమిటీ వరల్డ్ లీగ్... ఒలింపిక్స్, ప్రపంచ కప్ అర్హత టోర్నీలకు ప్రత్యామ్నాయమే వరల్డ్ లీగ్. రెండేళ్లపాటు కొనసాగే ఈ వరల్డ్ లీగ్లో నాలుగు రౌండ్లు ఉంటాయి. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత మొదలైన ఈ వరల్డ్ లీగ్ న్యూఢిల్లీలోని ఫైనల్స్తో ముగుస్తుంది. ఎఫ్ఐహెచ్కు అనుబంధంగా ఉన్న అన్ని జట్లు ఈ లీగ్లో పాల్గొనేందుకు అర్హులు. తొలి రౌండ్లో ప్రపంచ ర్యాంకింగ్స్లో 17 అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న జట్లు బరిలోకి దిగుతాయి. ఈ రౌండ్ ద్వారా 16 జట్లు రెండో రౌండ్కు అర్హత సాధిస్తాయి. ఈ రెండో రౌండ్లో 16 జట్లతో 9 నుంచి 16 ర్యాంక్లోపు ఉన్న ఎనిమిది జట్లు కలుస్తాయి. రెండో రౌండ్లో మొత్తం 24 జట్లు ఉంటాయి. ఈ జట్ల మధ్య మూడు టోర్నీలు జరుగుతాయి. ఇందులో నుంచి టాప్ 8 జట్లు సెమీఫైనల్స్గా పరిగణించే మూడో రౌండ్కు అర్హత పొందుతాయి. సెమీఫైనల్స్లో మొత్తం 16 జట్లు ఉంటాయి. ఈ జట్ల మధ్య రెండు టోర్నీలు జరుగుతాయి. ఈ సెమీఫైనల్స్ నుంచి టాప్-8 దేశాల నాలుగో రౌండ్ అయిన ఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. తొలి దశ వరల్డ్ లీగ్ నుంచి ఆరు జట్లు (బెల్జియం, న్యూజిలాండ్, భారత్, స్పెయిన్, మలేసియా, ఇంగ్లండ్) ఈ ఏడాది జూన్లో నెదర్లాండ్స్లో జరిగే ప్రపంచకప్కు అర్హత సాధించాయి. 2014 చివర్లో మొదలై 2016లో ముగిసే రెండో దశ వరల్డ్ లీగ్ నుంచి ఆరు లేదా ఏడు జట్లు రియో ఒలింపిక్స్కు అర్హత సాధిస్తాయి. భారత జట్టు: సర్దార్ సింగ్ (కెప్టెన్), శ్రీజేష్ (గోల్ కీపర్), పోతునూరి తిరుమలరావు (గోల్ కీపర్), రూపిందర్ పాల్ సింగ్, మన్ప్రీత్ సింగ్, ధరమ్వీర్ సింగ్, మన్దీప్ సింగ్, ఆకాశ్దీప్ సింగ్, గుర్మెయిల్ సింగ్, రఘునాథ్, ఎస్కే ఉతప్ప, నితిన్ తిమ్మయ్య, హర్బీర్ సంధూ, ఎస్వీ సునీల్, ఎంబీ అయ్యప్ప, బీరేంద్ర లాక్రా, చింగ్లెన్సనా, చందందా తిమ్మయ్య.