
సింహగిరికి పోటెత్తిన భక్తజనం
సింహాచలం: గంధం అమావాస్య పురస్కరించుకుని సింహగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఇలవేల్పుగా పూజించే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు, గ్రామీణ ప్రాంత భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. శనివారం రాత్రికే సింహాచలం చేరుకున్న వీరంతా ఆదివారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. స్వామి ప్రతిరూపాలుగా వెంట తీసుకొచ్చిన కోలలను పుష్కరిణి గట్టుపై ఉంచి పూజలు నిర్వహించారు. వంటలు వండి, కోలలకు ఆరగింపు చేశారు. అమృత కలశాలను, పళ్లను సమర్పించారు. కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. కోలలతో నృత్యాలు చేస్తూ స్వామిని కీర్తించారు. స్నానమాచరించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో వరాహ పుష్కరిణి ప్రాంగణం అంతా కిటకిలాడింది. పుష్కరిణి నుంచి అడవివరం మార్కెట్ కూడలి వరకు ఉన్న మార్గం భక్తజన సంద్రంగా మారింది. సింహగిరిపై దర్శనక్యూలు, కేశఖండనశాల, ప్రసాద విక్రయశాల, గంగధార మార్గం భక్తులతో కిటకిటలాడాయి. సింహగిరికి చేరుకున్న భక్తులు సింహగిరిపై కూడా కోలలకు పూజలు నిర్వహించారు. గరిడి నృత్యాలు చేశారు. దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. పుష్కరిణి వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గోపాలపట్నం పోలీసులు, దేవస్థానం గార్డులు బందోబస్తు నిర్వహించారు.
గంధం అమవాస్య భక్తులతో కిక్కిరిసిన వరాహ పుష్కరిణి