
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు కనీవినీ ఎరుగని రీతిలో మేలు జరిగింది. ఎటువంటి వివక్ష లేకుండా అన్ని వర్గాలకు ఇచ్చినట్లే ఈ వర్గానికీ నవరత్నాల ద్వారా సీఎం వైఎస్ జగన్ పెద్దఎత్తున ఆర్థిక ప్రయోజనం కల్పించారు. చంద్రబాబు సర్కారు కేవలం రంజాన్ తోఫా అంటూ వారిని మభ్యపెట్టడానికే ప్రాధాన్యతనిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వారు పేదరికం నుంచి బయటపడేందుకు అండగా నిలిచింది. నిజానికి చంద్రబాబు సర్కారు ఐదేళ్ల పాలనలో వారిపట్ల ఎంతో చిన్నచూపు చూసింది. కేబినెట్లో ఒక్క మైనారిటీకి కూడా చోటు కల్పించలేదు. వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చంద్రబాబు చూశారు. 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు మాత్రమే ఫరూక్ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఇందుకు ఉదాహరణ. అయితే, జగన్ సర్కారు మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి వారికి పెద్దపీట వేశారు.
21నెలల్లో రూ.3,952 కోట్ల సాయం
సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక ఈ 21 నెలల్లో నవరత్నాల ద్వారా 25.53 లక్షల మంది మైనారిటీలకు రూ.3,952 కోట్ల సాయం అందించారు. ఇందులో 19.77 లక్షల మందికి నేరుగా రూ.2,936.17 కోట్ల మేర నగదు బదిలీ జరిగింది. నగదేతర బదిలీ పథకాల ద్వారా 5.76 లక్షల మందికి రూ.1,016.26 కోట్లు అందించారు. టీడీపీ సర్కారులో మైనారిటీలకు బ్యాంకు రుణాలే దిక్కుగా ఉండేవి. అవీ కూడా పెద్దలు సిఫార్సు చేస్తేనే మంజూరయ్యేవి. కానీ, ఇప్పుడు ఎవరి సిఫార్సులు లేకుండా అర్హులందరికీ నవరత్నాలు సకాలంలో అందుతున్నాయి. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హులైన మైనారిటీలందరినీ ఇంటింటి సర్వే ద్వారా వలంటీర్లతో గుర్తించింది. దీంతో మంత్రులు, అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల జోక్యం లేకుండాపోయింది.
Comments
Please login to add a commentAdd a comment