
మైలవరం ఆలయంలో వివాహం
జి.కొండూరు (మైలవరం): ఆంధ్రా అబ్బాయి, ఫిలిప్పీన్స్ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగింది. ఆదివారం జి.కొండూరు మండలం కుంటముక్కలలో రిసెప్షన్ నిర్వహించారు. గ్రామానికి చెందిన మైలవరపు కైలాసరావు కుమారుడు సతీష్కుమార్ ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసి పీహెచ్డీ నిమిత్తం బెల్జియం వెళ్లారు.
అతడికి ఫిలిప్పీన్స్ నుంచి వచ్చి బెల్జియంలో ఎమ్మెస్సీ చదువుతున్న డోనా క్యూనో పరిచయమైంది. పరిచయం స్నేహంగా.. ప్రేమగా మూడేళ్లు సాగింది. పెద్దల అంగీకారంతో వారిద్దరు మైలవరంలోని కోదండ రామాలయంలో కుటుంబసభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల నడుమ వివాహం చేసుకున్నారు. ఆదివారం కుంటముక్కలలో బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామస్తుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించారు.