
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం పాటుపడుతోంది జగన్ ప్రభుత్వమేనని చెప్పారు మంత్రి కన్నబాబు.
AP Minister Kannababu introduced Agriculture Budget 2022: ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కురసాల కన్నబాబు శాసనసభలో ప్రవేశపెట్టారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోందన్న మంత్రి కన్నబాబు.. రాయితీలతో పాటు నాణ్యత అందించే విషయంలో ఎక్కడా తగ్గకుండా ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు.
వ్యవసాయం కోసం వార్షిక బడ్జెట్లో రూ. 11,387.69 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. మార్కెటింగ్ యార్డుల్లో నాడు-నేడు, మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి 614.23 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే సహకార శాఖకు రూ. 248.45 కోట్లు, ఆహార శుద్ధి విభాగానికి 146.41 కోట్లు, ఉద్యానశాఖకు 554 కోట్లు, పట్టు పరిశ్రమకు 98.99 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 421.15 కోట్లు, వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 59.91 కోట్లు, వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి 122.50 కోట్లు కేటాయించినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు.
పశు సంవర్ధక శాఖకు 1027.82 కోట్లు, మత్స్య శాఖ అభివృద్ధి కోసం రూ. 337.23 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 5000 కోట్లు. వైఎస్సార్ జలకళకు 50 కోట్ల కేటాయింపులతో పాటు నీటి పారుదల రంగానికి 11450.94 కోట్ల ప్రతిపాదన ఉంచింది ఏపీ ప్రభుత్వం.