
రాజమహేంద్రవరం క్రైం: ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల వల్ల 300 మంది ఖైదీలు కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యం పొందారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు గత నెలలో కరోనా బారినపడ్డారు. ఈ జైలులో 1,700 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 300 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు కరోనా బారిన పడిన ఖైదీలకు ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి మిగిలిన ఖైదీలతో కలవకుండా చర్యలు చేపట్టి వైద్య సేవలు అందించారు.
ప్రత్యేక నిధులు మంజూరు
* ఖైదీలు కరోనా బారినపడిన వెంటనే పూర్తిస్థాయి వైద్యంతో పాటు బలవర్ధక ఆహారం అందించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారు.
* ఎప్పటికప్పుడు ఆక్సిజన్ పరీక్షలు నిర్వహించడంతో పాటు రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న ఖైదీలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రత్యేకంగా వైద్య సేవలందించారు.
* కరోనా బాధితులందరికీ చికిత్స అనంతరం పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందని జైలు అధికారులు, వైద్యులు ధ్రువీకరించారు.