కరోనా తీవ్రం.. సర్కారు చోద్యం | Covid cases are increasing day by day in the state | Sakshi
Sakshi News home page

కరోనా తీవ్రం.. సర్కారు చోద్యం

Jun 2 2025 2:49 AM | Updated on Jun 2 2025 11:06 AM

Covid cases are increasing day by day in the state

కనీస పట్టింపులేని టీడీపీ కూటమి ప్రభుత్వం

రాష్ట్రంలో రోజురోజుకీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఆర్టిపీసీఆర్‌ కిట్‌ల కొరత 

పరీక్షలకు ఎక్కడికెళ్లాలో తెలీక బాధితుల అవస్థలు 

ప్రభుత్వం పరీక్షలు చేయకపోవడంతో ప్రైవేట్‌ ల్యాబ్‌లే దిక్కు  

విశాఖలో ప్రైవేట్‌ ల్యాబ్‌ పరీక్షలో కోవిడ్‌ నిర్ధారణ అయిన బాధితుడి మృతి 

హైరిస్క్‌ వర్గాల వారిపై తీవ్ర నిర్లక్ష్యం 

వైద్యశాఖ సన్నద్ధత, వనరులపై ఒక్క సమీక్షా చేయని సీఎం చంద్రబాబు 

అత్యధిక స్థాయిలో కోవిడ్‌ పరీక్షల నిర్వహణలో గత ప్రభుత్వం దేశానికే ఆదర్శం 

కానీ, ఇప్పుడు ప్రజారోగ్యం పట్టని పాలకులు  

పైగా.. మహానాడు కోసం హడావుడిగా కోవిడ్‌ నిబంధనావళి ఉపసంహరణ 

సాక్షి, అమరావతి :  కోవిడ్‌ మహమ్మారి రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంతో పాటు, రాష్ట్రంలోనూ పెరుగుతున్న కేసులే ఇందుకు ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వ కోవిడ్‌ డ్యాష్‌ బోర్డు ప్రకారం గతనెల 26న రాష్ట్రంలో కేవలం నాలుగు యాక్టివ్‌ కేసులు ఉండేవి. కానీ, ఇప్పుడు విశాఖపట్నం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ ఆదివారం నాటికి ఆ సంఖ్య 23కు చేరింది. తాజా గణాంకాల ప్రకారం.. పాజిటివ్‌ కేసుల్లో ఏపీ దేశంలో 12వ స్థానంలో ఉంది. 

అయితే, రాష్ట్రంలోనూ వైరస్‌ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతుంటే టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు ఉంటోంది. పైగా.. నివారణ చర్యలను పూర్తిగా గాలికొదిలేసింది. దేశవ్యాప్తంగా కోవిడ్‌ మరణాలూ నమోదవుతున్నా సర్కారులో ఎక్కడా చలనంలేదు. రాష్ట్రంలోనూ కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన వ్యక్తి విశాఖలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ నేపథ్యంలో.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, ఇతర హైరిస్క్‌ వర్గాలపై వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటోందని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నా బాబు సర్కారు ఏమీ పట్టనట్లు ఉంటోంది. వైరస్‌ను నిర్ధారించే ఆర్టిపీసీఆర్‌ కిట్లూ ఎక్కడా అందుబాటులో లేవు.  

ర్యాపిడ్‌ టెస్టులకు దిక్కులేదు.. 
ప్రాథమిక దశలోనే వైరస్‌ నిర్ధారణ అన్నది అత్యంత కీలకమైంది. ఇందులో భాగంగా.. విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల స్థాయిలోనే వైరస్‌ లక్షణాలున్న హైరిస్క్‌ వర్గాల వారికి ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేయాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఇవి  నిర్వహించడంలేదు. సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో ఉండే విజయవాడలో దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలున్న హైరిస్క్‌ వ్యక్తులు యూపీహెచ్‌సీలను సంప్రదిస్తునా. ఒక్కరికి కూడా కోవిడ్‌ పరీక్షలు చేయడంలేదు. 

బాధితులే కరోనా టెస్ట్‌ చేయమని అడిగితే టెస్టింగ్‌ కిట్లు లేవని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. తప్పనిసరి అయితేశ్యాంపిల్స్‌ తీసి సిద్ధార్థ వైద్య కళాశాలలోని ల్యాబ్‌కు పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో సైతం ఇదే దుస్థితి. మరోవైపు.. శ్యాంపిల్స్‌ తీసి ల్యాబ్‌కు పంపితే ఫలితాలు రావడానికి కనీసం 48 గంటలు పడుతోంది.  

అంచనా వేసే ఆలోచనేది.. 
పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అక్కడి ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పరీక్షల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రాయలసీమ జిల్లాల ప్రజలు ఆ రెండు రాష్ట్రాలకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. విశాఖ, విజయవాడ విమానాల్లో వివిధ రాష్ట్రాల ప్రయాణికులు ఇక్కడకు వస్తుంటారు. 

ఈ క్రమంలో వైరస్‌ వ్యాప్తిని అంచ­నా వేయడం కోసమైనా.. హైరిస్క్‌ వర్గాల వారికి ప్రభుత్వం ర్యాండమ్‌గా పరీక్షలు చేయాల్సి ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ఆలోచనా చేయడంలేదు. అలాగే, వైరస్‌ వ్యాప్తి మొదలైన నేపథ్యంలో.. రాష్ట్రంలో వైద్యశాఖ సన్నద్ధత, వనరులపై సీఎం చంద్రబాబు ఒక్క సమీక్ష కూడా చేయలేదు. యో­గా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంలోనే వైద్యశాఖ నిమగ్నమైంది. 

నాటి ముందుచూపు ఇప్పుడు ఏదీ? 
నిజానికి.. 2020 నుంచి దేశంలో కరోనా వ్యాప్తి మొదలైంది. నాటినుంచి వివిధ రూపాల్లో వ్యాప్తి కొనసాగుతునే ఉంది. అయితే, 2019 వరకు చంద్రబాబు పాలనలో ధ్వంసమైన ఆరోగ్య రంగాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఓ పక్క గాడిలో పెడుతూనే మరోపక్క కోవిడ్‌ వైరస్‌ నియంత్రణకు వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంది. అత్యధిక స్థాయిలో కోవిడ్‌ పరీక్షల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. 

కోవిడ్‌ కేసులు వస్తే విలేజ్‌ క్లినిక్స్, సచివాలయాల ద్వారా గ్రామస్థాయిలోనే వైద్యసేవలు అందించేలా వైద్యరంగాన్ని బలోపేతం చేశారు. ఎప్పుడు వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైనా వెంటనే ఫీవర్‌ సర్వే చేపట్టి అనుమానితులను గుర్తించి లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి, ఐసోలేషన్‌ చేయడం ద్వారా ప్రాథమిక దశలోనే వైరస్‌ వ్యాప్తిని అరికట్టారు. బాధితులు తీవ్ర అనారోగ్యం పాలుకాకుండా కాపాడారు. 

365 రోజులూ సచివాలయాల్లో హోం ఐసోలేషన్‌ కిట్లు, ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు అందుబాటులో ఉంచి వైరస్‌ వ్యాప్తి మొదలైతే వెంటనే చర్యలు తీసుకునేలా ముందుచూపుతో వ్యవహరించారు. కానీ, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజారోగ్యం పట్టడంలేదు. ఇందుకు నిదర్శనమే కోవిడ్‌ నివారణకు ఉద్దేశించిన నిబంధనలు ఉపసంహరించడమని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిబంధనావళి మహానాడుకు ఇబ్బందిగా మారుతుందని రోజుల వ్యవధిలోనే దానిని ఉపసంహరించడం ప్రజారోగ్యంపట్ల సర్కారు చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనం. 

పరీక్షల కోసం ఎక్కడికెళ్లాలో తెలీని దుస్థితి.. 
దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనుమానిత లక్షణాలున్న వృద్ధులు, వివిధ వ్యాధుల బాధితులు వైద్య పరీక్షల కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రామాల్లోని విలేజ్‌ క్లినిక్‌లు, పీహెచ్‌సీల్లో సైతం వైరస్‌ ప్రాథమిక నిర్థారణ ర్యాపిడ్‌ కిట్లు అందుబాటులో ఉండేవి. 

కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక కిట్ల పంపిణీ చేపట్టనే లేదు. మెజారిటీ శాతం క్లినిక్‌లు, పీహెచ్‌సీల్లో కిట్లు లేవు.  ముప్పు ఎక్కువగా (హైరిస్క్) ఉండే వర్గాల వారిలో కోవిడ్‌ లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేయకుండా మాత్రలు ఇచ్చి ఇళ్లకు పంపుతున్నారు.  వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అనుమానిత లక్షణాలున్న వారు ప్రైవేట్‌ ల్యాబ్‌లకు పరుగులు పెడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement