
డయల్ 100 లేదా 1930 సైబర్ మోసమని గుర్తిస్తే వెంటనే డయల్ 100 లేదా సైబర్ క్రైం టోల్ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు..
రోజుకో కొత్త మోసానికి పాల్పడుతున్న నేరగాళ్లు
అవగాహనా లేమి, అత్యాశతో మోసపోతున్న వైనం
ఎస్ఎంఎస్లు, వెబ్ లింక్లు, ఫోన్కాల్స్తో జాగ్రత్త
అనాలోచితంగా స్పందించొద్దు అంటున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. కంటికి కనిపించకుండా వివరాలు చెప్పించుకొని మరీ బ్యాంకు ఖాతాలు ఊడ్చేస్తున్నారు. అవగాహనా లేమి, అత్యాశలే సైబర్ మోసాలకు ప్రధాన కారణాలు. మన చుట్టూ సైబర్ నేరాలకు సంబంధించిన వార్తలు నిత్యం చక్కర్లు కొడుతున్నా వాటిపై చాలా మంది ధ్యాస పెట్టడం లేదు.
మాకు అంతా తెలుసులే అనే అతిధోరణితో మోసపోతున్నారు. సైబర్ మోసాలపై నమోదవుతున్న కేసులను గమనిస్తే ప్రధానంగా పది రకాల మోసాలే ఎక్కువగా జరుగుతున్నట్లు సైబర్ భద్రతాధికారులు చెబుతున్నారు. ఈ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
1. పెట్టుబడుల పేరిట స్టాక్ మార్కెట్
మోసాలు విపరీతంగా పెరిగాయి. తక్కు వ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయన్న ఆశ తో ఎంతో మంది అమాయకులు సులువుగా సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. సోషల్ మీడియా ప్రకటనలతో స్టాక్ మార్కెట్లో 30–40% లాభాలంటూ సైబర్ నేరగాళ్లు ఊదరగొడుతున్నారు.
ఈ ప్రకటనలకు స్పందించే వారికి వాట్సాప్లో లింక్లు పంపుతూ వారు రూపొందించిన మోసపూరిత వెబ్సైట్ లలో పెట్టుబడి పెట్టిస్తున్నారు. లాభాలు వస్తున్నట్లు చూపుతూ మరింత పెట్టుబడి పెట్టేలా చేస్తున్నారు. నగదు ఉపసంహరణకు ప్రయతి్నంచినప్పు డు డబ్బులు రాక లబోదిబోమంటున్నారు. అందు వల్ల ఇలాంటి ప్రకటనలు సైబర్ మోసమని గ్రహించాలి.
2. లైక్లు.. షేర్ల పేరిట..
సోషల్ మీడియా పోస్టులను లైక్, షేర్ చేయడం వంటి సులువైన టాస్క్లతో డబ్బులు సంపాదించండంటూ ప్రకటనలిస్తూ సైబర్ ఉచ్చులోకి లాగుతున్నారు. తొలుత చిన్నచిన్న మొత్తాలు రాబడి రూపంలో చూపుతారు. అవతలి వ్యక్తి నమ్మకం పెరిగాక అసలు మోసానికి తెరతీస్తున్నారు. ఫొటోలు, వీడియోలకు లైక్, షేర్ చేస్తే అవతలి వ్యక్తులు డబ్బులు ఎందుకు ఇస్తారు? ఈ చిన్న లాజిక్ మరవొద్దు.
3. క్రెడిట్కార్డు మోసాలు
స్కామర్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ల మాదిరిగా ఫోన్ చేసి క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ సీవీవీ, క్రెడిట్ కార్డు నంబర్లు, పుట్టిన తేదీ, బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత డబ్బులు కొల్లగొడతారని గుర్తుపెట్టుకోండి.
4. తప్పుగా డబ్బులు పడ్డాయంటూ..
బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయినట్లు మెసేజ్లు పంపుతారు. ఆ తర్వాత సైబర్ మోస గా ళ్లు ఫోన్ చేసి మీ బ్యాంకు ఖాతా లో పొరపాటున జమ అయిన మొత్తాన్ని తిరిగి పంపాలంటూ డబ్బులు కాజేస్తారు. ఇలాంటి సమ యాల్లో బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోకుండా స్పందించవద్దు.
5. కేవైసీ అప్డేట్ పేరిట..
మీ బ్యాంకు ఖాతా వివరాలు, పేరు చెబుతూ ఫోన్ చేస్తారు. కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవాలని సూచిస్తారు. లేదంటే ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా కొన్ని లింక్లు పంపి అందులో మీ బ్యాంకు ఖాతా కేవైసీ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తారు. వారు అడిగిన వివరాలు ఇస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయినట్టేనని గుర్తుపెట్టుకోండి.
6. కస్టమ్స్ అధికారులమంటూ..
మీ బంధువులు, స్నేహితులు విదేశాల నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపారని.. అది మీకు చేరాలంటే కస్టమ్స్ సుంకం చెల్లించాలని.. తాము కస్టమ్స్ అధికారులమంటూ ఎస్ఎంఎస్లు లేదా ఫోన్లు చేస్తారు. బహుమతిపై ఆశతో ఎంతో మంది సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు డబ్బు పంపి మోసపోతున్నారు.
మీ పేరిట వచ్చిన పార్సిల్లో నిషేధిత వస్తువులు ఉన్నాయని.. మీపై కేసులు పెడతామని బెదిరిస్తూ ఫోన్ చేస్తారు. ఇతరులకు ఈ విషయం చెబితే మీకే చిక్కులంటూ భయాందోళనలకు గురిచేసి అందినకాడికి ఆన్లైన్లో డబ్బులు వేయించుకుంటున్నారు. అనుమానాస్పద ఫోన్కాల్స్ విషయంలో తస్మాత్ జాగ్రత్త.
7. ఐటీ చెల్లింపులు, రిటర్న్ల పేరు చెప్పి..
ఆదాయపు పన్ను చెల్లింపుల పేరిట సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. ఐటీ శాఖ నకిలీ లోగోతో సందేశాలు పంపుతారు. పన్ను చెల్లింపుదారులకు తాము ఐటీ అధికారులమని చెప్పి.. రీఫండ్ను వేగవంతం చేయడానికి బ్యాంకు వివరాలు ఇవ్వాలంటూ ఫోన్ చేస్తారు. ఇలాంటి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు మోసపూరితమైనవిగా గుర్తించాలి.
8. ట్రాయ్ పేరిట..
టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారుల పేరిట ఇటీవల ఫోన్ చేస్తారు. మీ ఫోన్ నంబర్పై చట్టవిరుద్ధ కార్యకలాపాలు నమోదయ్యాయని.. ఉగ్రవాదులు, ఇతర నేరగాళ్ల ఫోన్ లిస్టులో మీ నంబర్ ఉందని బెదిరిస్తారు. మీ నంబర్ను ఆ లిస్టులోంచి తీసేయాలంటే డబ్బులు ఇవ్వాలంటూ పట్టుబడతారు. తీవ్రంగా ఒత్తిడి తెచ్చి అందినకాడికి డబ్బులు దండుకుంటారు. ట్రాయ్ అధికారులు ఈ తరహా ఫోన్కాల్స్ చేయరని గుర్తుంచుకోవాలి.
9. డిజిటల్ అరెస్టులు..
ఈ మధ్యకాలంలో అత్యధికంగా నమోదవుతున్న సైబర్ మోసాల్లో డిజిటల్ అరెస్టులు ప్రధానమైనవి. సీబీఐ, పోలీసు అధికారులమని వాట్సాప్లో ఆడియో, వీడియో కాల్స్ చేస్తారు. వాట్సాప్ డీపీలో పోలీస్ యూనిఫాంతో ఉన్న ఫొటోలు, వీడియో కాల్ మాట్లాడేటప్పుడు పోలీస్ యూనిఫాంలో ఉంటూ మీ కుమారుడు అత్యాచారం, హత్య కేసులో చిక్కినందున మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేశామని బెదిరిస్తారు. ఈ విషయాలు ఎవరితో పంచుకోవద్దని, బయటికి వెళ్లవద్దని హెచ్చరిస్తారు. కేసు లేకుండా చేయాలంటే తాము చెప్పిన నంబర్కు డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తారు.
10. ఏఐతో వలవేసి..
సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సైతం మోసాలకు వాడుతున్నారు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో పంచుకొనే ఫొటోలు, వీడియోలను ఆధారంగా చేసుకొని.. ఏఐ సాయంతో వారి గొంతును అనుకరిస్తూ ఆడియోలు తయారు చేస్తారు.
వాటిని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపి అత్యవసరమనో లేదా ఆసుపత్రిలో ఉన్నామనో చెబుతూ వెంటనే డబ్బులు పంపాలని అభ్యర్థిస్తారు. డబ్బులు ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యుల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు బయటపెడతామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.